1 ENS Live Breaking News

ప్రతివారం విధిగా" ఫ్రైడే - డ్రైడే" పాటించండి

 మహా విశాఖ నగరంలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులు  ప్రబలకుండా, దోమలు వృద్ధి చెందకుండా, ప్రతివారం విధిగా "ఫ్రైడే – డ్రైడే"పాటించేలా విశాఖ నగర వాసులకు వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు అవగాహన కల్పించాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మిశ ఆదేశించారు. శనివారం ఆయన 3వ జోన్, 24వ వార్డు, వినాయక నగర్ పరిసర ప్రాంతాలలో దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను  ఇంటింటా తనిఖీలు నిర్వహిస్తూ పర్యటించారు. ఈ పర్యటనలో కమిషనర్ ప్రతి ఇంటి ముందు నిలువ చేసుకున్న నీటి నిల్వలలో దోమల వృద్ధికి సంబంధించిన లార్వాలను గుర్తించి, వాటిని వెంటనే ఖాళీ చేయించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎన్నో ప్రచార, ప్రసార కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, ప్రజలకు వాటిని తెలియపరచడంలో వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు విఫలమవుతుండడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి నిల్వలలో దోమలు వృద్ధి చేసే లార్వాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ, అందుకు తగిన అవగాహన కార్యక్రమాలు ప్రజలకు అందించడం లేదని వార్డు  శానిటరీ కార్యదర్శి, వాలంటీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వాలంటీర్లు, వార్డు కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి దోమల వృద్ధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై అవగాహన కల్పిస్తున్నదీ, లేనిదీ పలు నివాసిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. వార్డు కార్యదర్శి సక్రమంగా విధులు నిర్వహించడంపై విఫలమైనందుకు గాను ఆ వార్డు కార్యదర్శికి మెమోను జారీ చేయవలసినదిగా జోనల్ కమిషనర్ శివ ప్రసాద్ ను కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు అందించవలసిన మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు ఆరోగ్య రక్షణకు కావలసిన చర్యలు చేపట్టవలసిన బాధ్యత ప్రజారోగ్య వ్యవస్థదేనని అన్నారు. ప్రజారోగ్య వ్యవస్థకు సంబంధించిన విధులు సక్రమంగా నిర్వహించని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని జోనర్ కమిషనర్ ను కమిషనర్ ఆదేశించారు. అనంతరం దోమలు ఎక్కువగా వృద్ధి చెందే వస్తువులను ప్రదర్శించి, నినాదాలతో అవగాహనా ర్యాలీను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూడవ జోనల్ కమిషనర్ శివ ప్రసాద్, సహాయ వైద్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఏసిపి వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-20 06:18:17

సంస్కృతి మూలాలను తెలియజేయండి

భారతీయ సంప్రదాయం, సంస్కృతి మూలాలను పిల్లలకు తెలియజేసి పిల్లల్లో సేవాభా వాన్ని  పెంపొందించే బాధ్యత ప్రతి తల్లితండ్రుల పై ఉందని జిల్లా కలెక్టర్ డా కే. మాధ వీలత పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా కలెక్టర్, పార్లమెంట్ సభ్యులు కుటుంబ సభ్యుల సమేతంగా  ఇస్కాన్ దేవాలయానికి వొచ్చి  పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన బాల బాలికలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరికీ శ్రీ కృష్ణా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఇస్కాన్ సంస్థ వారు మన సంస్కృతి, సంప్రదాయాలను వ్యాప్తి చేయడమే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో, ప్రకృతి విపత్తుల సమయంలో  ఇస్కాన్ సంస్థ వారు భాగస్వామ్యం అవ్వడం నిజంగా అభినందనీయం అన్నారు. మన దేశ సంప్రదాయం, సంస్కృతి తో పాటు సేవా కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే మూడు కార్యక్రమాలు ఎంతో నిబద్దతతో చేపట్టడం జరుగుతుందన్నారు. ఈరోజు ఇంత మంది చిన్నారులు పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయం అన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లవాడిని ఏ స్కూల్ లో చేర్పించాలి? ఎలా చదివించాలి ? అనే కాకుండా సేవ భావం, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకూనేలా అడుగులు వేయడం ముఖ్యం అన్నారు. ఈపోటిల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ కలెక్టర్ అభినందించారు. 

ఇస్కాన్ దేవాలయం లో జరిగిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ మాధవీలత, పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ లు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రీకృష్ణుడు మానవాళి అంతటకు మార్గదర్శకుడు, ఆదర్శ ప్రాయం అన్నారు. కళలకి కాణాచి అయిన రాజమహేంద్రవరం లో ఇస్కాన్ దేవాలయం వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. వివిధ రకాల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేస్తారన్నారు. పిల్లలందరూ కృష్ణా రాధల వేషధారణతో విశేషంగా ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి అభినందనను తెలియచేశారు.

Rajamahendravaram

2022-08-19 11:48:51

కొవ్వూరులో జిల్లాస్థాయి స్పందన

తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజక వర్గ స్థాయి స్పందన కార్యక్రమం ఆగస్ట్ 22 సోమవారం కొవ్వూరు మునిసిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలు పరిష్కారం దిశగా వచ్చే సోమవారం నాడు కొవ్వూరు నియోజక వర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆగస్ట్ 22 వ తేదీ సోమవారం కొవ్వూరు  లో "స్పందన"  ఏర్పాటు చేశామన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు కొవ్వూరు లో జరిగే స్పందన కార్యక్రమంలో  ఉదయం పాల్గొని ఫిర్యాదులు స్వీకరిస్తారని కలెక్టర్ మాధవీలత తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గం చెందిన కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి ప్రజలు ఈ స్పందన కార్యక్రమంకు హాజరు కావాలని  కలెక్టర్ మాధవీలత కోరారు. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు ద్వారా  ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను  ప్రజల నుంచి స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.

రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్ లో స్పందన..
రాజమండ్రిజిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుంచి సంబందించిన శాఖల రెండవ స్థాయి అధికారులు హాజరై యధాతధంగా స్పందన దరఖాస్తులు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ప్రతి వారం తరహాలోనే సోమవారం  హర్లిక్స్ ఫ్యాక్టరీ  సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఆర్టీసి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు ఆమె తెలిపారు.

Rajamahendravaram

2022-08-19 11:38:34

ప్రతీఇంట్లోనూ నిత్యం గోపూజ జరగాలి..

గోకులాష్టమి రోజునే కాకుండా రోజూ ప్రతి ఆలయం, ప్రతిఇంట్లో గోపూజ జరగాలన్నదే టీటీడీ లక్ష్యమని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి చెప్పారు. గోపూజ నిర్వహించే ఆలయాలకు ఆర్థిక వనరులు లేకపోతే వాటికి తోడ్పాటు అందించే  ఆలోచన కూడా చేస్తామని ఆయన చెప్పారు. గోకులాష్టమి సందర్భంగా శుక్రవారం టీటీడీ గోసంరక్షణ శాలలో గోకులాష్టమి -  గోపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ కి  కళాకారులు కోలాటాలు, పిల్లనగ్రోవులు, భజన బృందాలు ఘనంగా స్వాగతం పలికాయి.  గజరాజులకు పండ్లు అందించిన అనంతరం సుబ్బారెడ్డి వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి గో మందిరానికి చేరుకుని, గోవు, దూడకు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించి పూల దండలు వేసి, నూతన వస్త్రాలు సమర్పించారు. దాణా, మేత తినిపించారు.

      అనంతరం విద్యార్థులను ఉద్దేశించి  సుబ్బారెడ్డి మాట్లాడారు. స్వామి వారి ఆశీస్సులతో అందరూ బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 200 ఆలయాలకు గోవులు, దూడలను దానంగా ఇచ్చామన్నారు. ఇంకా ఆలయాలు, మఠాలు ముందుకు వస్తే గోమాత దూడను ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.  గో పూజ విశిష్టతను భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో అలిపిరి వద్ద సప్తగో ప్రదక్షణ  మందిరాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. తిరుమలలో గత ఏడాది  గోకులాష్టమి సందర్భంగా, నవనీత సేవను ప్రారంభించి భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. గో ఆధారిత వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తూ,  రైతులకు ఆవులు, ఎద్దులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.  గో ఆధారిత వ్యవసాయంతో పండిస్తున్న పంటలను రైతుల నుంచి టిటిడినే కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు.

   అనంతరం  సుబ్బారెడ్డి గోసంరక్షణ శాల లో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర దివ్య మహా మంత్ర యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత  శ్రీ వేంకటేశ్వరదివ్య మహామంత్ర లిఖిత జపం పుస్తకాలను స్వామివారికి సమర్పించారు. అంతకుముందు అలిపిరి వద్ద నిర్మించిన సప్త గో ప్రదక్షణ మందిరంలో  వైవి సుబ్బారెడ్డి గోపూజలో పాల్గొన్నారు. ఇక్కడ వేణుగోపాల స్వామివారి పూజలో పాల్గొని గోమాతలకు దాణా, మేత, పండ్లు అందించారు. అనంతరం పండితులు ఆయనకి వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యులు  పోకల అశోక్ కుమార్,  మొరం శెట్టి రాములు, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు  శేఖర్ రెడ్డి,  ఎస్ వి గో సంరక్షణ కమిటీ సభ్యులు  రామ్ సునీల్ రెడ్డి, జెఈవోలు  మతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, డిప్యూటీ ఈవో సెల్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tirumala

2022-08-19 11:20:55

నగర రవాణా వ్యవస్థపై టాడ్ మీటింగ్..

జివిఎంసి పరిధిలో రోడ్లు, కూడళ్లను అభివృద్ధికి సంబంధించి రవాణా ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలపై జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మిశ గురువారం తన ఛాంబర్లో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, బిల్డర్లు, ఇంజనీర్లతో కలసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ, జివిఎంసి పరిధిలో గల రోడ్లు, కూడళ్లను అభివృద్ధి పరచుటకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా ఆధారిత అభివృద్ధి  ( ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్- TOD) కార్యక్రమం సంబంధించి నగరంలో గల బిల్డర్లు, ఎల్టిపీలు, ఆర్కిటెక్ట్లు, నేరేడ్కో క్రెడాయ్ ప్రతినిధులకు అవగాహన కల్పించుటకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ టీఓడీ పాలసీ ఉపయోగాలకు సంబంధించి వాటి
రూపకల్పన, నమూనా పటములు, విధి విధానములను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  చీఫ్ సిటీ ప్లానర్ వివరించిన అంశములకు సంబంధించి, బిల్డర్లు, ఆర్కిటెక్ట్లు నరేడ్ ట్కో , క్రెడాయ్ ప్రతినిధులు అవగాహన పరుచుకొని ఈ నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిపి సురేష్, సిటీ ప్లానర్, ఇంజనీర్లు, ఆర్కిటెట్లు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-18 15:15:15

బర్డ్ ఆసుపత్రిలో ఓపీకి ప్రత్యేక యాప్

బర్డ్ ఆసుపత్రిలో ముంద‌స్తుగా ఓపి బుక్ చేసుకోవడానికి మొబైల్ అప్లికేషన్‌ను త్వ‌రిత‌గ‌తిన రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో  ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి బ‌ర్డ్‌లో గురువారం సాయంత్రం బ‌ర్డ్ ఆస్పత్రి నిర్వహణపై ఈవో సమీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చే రోగులకు ఎంతో నాణ్యమైన వైద్య సేవలు బ‌ర్డ్ ఆసుపత్రిలో అందిస్తున్నట్లు చెప్పారు. అయితే ఓపి ముందస్తుగా బుక్ చేసుకోవడానికి మొబైల్ అప్లికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పద్ధతిలో బర్డ్ ఆసుపత్రిలోని ల్యాబ్‌ల‌ను అభివృద్ధి చేయాలని, ల్యాబ్‌ల‌కు అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలను టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోగులకు అందుతున్న భోజ‌నం నాణ్య‌త మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ‌ర్డ్ ఆసుపత్రిలో సెంట్రల్ యూపిస్‌ ఏర్పాటు చేయాలని, ఆటోమేషన్‌ ఆఫ్ ల్యాబ్ రిపోర్ట్స్ అందించే ప‌నులు పూర్తి చేయాలన్నారు. ల్యాబ్ మెటీరియల్స్, బ్లడ్ బ్యాంక్‌కు సంబంధించిన యంత్ర పరికరాలు తదితరాలను టెండర్ ద్వారా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఫుల్లీ ఆటో మేటెడ్‌ బయో కెమిస్ట్రీ మిషన్ ప్రారంభం
తిరుపతికి చెందిన  సాయి పవిత్ర మెడికల్ సర్వీసెస్ అధినేత‌  కటారు సుబ్రహ్మణ్యం బ‌హూక‌రించిన ఐదు లక్షల విలువ చేసే ఫుల్లీ ఆటో మేటెడ్ బయో కెమిస్ట్రీ మిషన్‌ను ఈవో గురువారం సాయంత్రం ప్రారంభించారు. అంతకుముందు ఈవో ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి విద్యార్థునుల‌ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థునుల‌ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణము త్వరితగతిన పూర్తి చేయాలని, ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయుర్వేద ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న పిల్లలతో ఆయ‌న మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.  జెఈవో  వీరబ్రహ్మం, బ‌ర్డ్‌ ప్రత్యేకాధికారి డాక్ట‌ర్‌ రెడ‌ప్ప‌రెడ్డి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్ట‌ర్‌ మురళీకృష్ణ, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.

Tirupati

2022-08-18 14:43:28

ఏపీలో మహిళలు, బాలికల రక్షణకు పెద్దపీట

రాష్ట్రంలో బాలికలు, మహిళల రక్షణకు  ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మహిళలు సాధికారత లక్ష్యంగా రాజకీయ పదవుల్లోకూడా 50 శాతం పైగా మహిళలకే కేటాయిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఎంతో పారదర్శకంగా ఉందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం స్థానిక టిటిడీ కళ్యాణమండపం రోడ్డులో  జగనన్నఉమెన్ సేఫ్ హెవేన్  షెల్టర్ ను  జిల్లా ఇన్ ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ లతో కలసి హోం మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో జగనన్నఉమెన్ సేఫ్ హేవెన్ ఏర్పాటు స్వాగతీయం అన్నారు. మహిళా సాధికారికత దిశగా ముఖ్యమంత్రి జగనన్న ఎంతో ప్రాధాన్యతను, ప్రోత్సహాన్ని ఇస్తున్నారన్నారు. రూడా చైర్ పర్సన్ మహిళల రక్షణ, భద్రత కోసం షెల్టర్ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన చర్యలు అభినందనీయం అన్నారు. ఆడపిల్లలు చదువు కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారని, ఒక తల్లి మనస్సుతో షర్మిలా రెడ్డి ఆలోచన చేసిన తీరు అభినందనీయం అన్నారు. ఈ ఆవుట్ పోస్ట్ నందు నిరంతరం పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంచడం జరుగుతుందని హామీ ఇచ్చారు. జగనన్న ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలను వారి పేరుతో ఇవ్వడం ద్వారా సామాజిక సాధికారిత కోసం చేస్తున్న కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నేడు ఈకార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.  జగనన్న మహిళలకు రక్షణా భద్రత కల్పిస్తే భరోసానివ్వడం ప్రత్యేకతను సంతరించుకుందన్నారు.  ఈ షెల్టర్ ప్రత్యేకంగా మహిళల కోసం మాత్రమే ఏర్పాటు చేసామని ఇందులో ఏర్పాటు చేసిన ప్రతి సదుపాయం మహిళలు మాత్రమే వినియోగించుకునేలా ఉండాలన్నదే ముఖ్యఉద్దేశ్యం అన్నారు.  ఇక్కడ ఏర్పాటు చేసిన ఏటీయం కేవలం మహిళలు మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని ఇందుకు బ్యాంకు అధికారులు సహకరించాలని కోరారు.  
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, మహిళల రక్షణ స్వర్గ ధామం గా ఈ జగనన్న ఊమెన్ సేఫ్ హెవెన్ షెల్టర్ అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు.  ఈ షెల్టరు ఏర్పాటులో రూడా చైర్ పర్సన్ గా షర్మిలా రెడ్డి తనదైన ముద్ర వెయ్యడం జరిగిందన్నారు. తద్వారా రాష్ట్రంలో ఒక నూతన ఒరవడికి ఇక్కడే నాంది పలకడం చారిత్రాత్మక సంఘటన అన్నారు. మహిళలకి అండగా, సాధికారికత కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఆ దిశలో ఆర్థిక పరిపుష్టిని మహిళలకు కల్పిస్తునే రాజకీయ పదవుల్లో 50 శాతం ఇవ్వటమే నిదర్సనం అన్నారు. మహిళల పేరుతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఇంటి స్థలాలు కూడా వారి పేరునే రిజిస్ట్రేషన్ చెయ్యడం జరిగిందన్నారు. మహిళలకి స్వర్గ ధామం గా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని రాబోయే రోజుల్లో మరింత భద్రత కల్పించే  దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 

రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి  మాట్లాడుతూ మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి జగనన్న మద్దతుతో ఈరోజు జగనన్న ఉమెన్స్ సేఫ్ హెవేన్ ఏర్పాటు కల సాకారం అయిందన్నారు. దీనికి ముఖ్యమంత్రికి ఎంతో రుణపడి ఉంటానన్నారు.  జగనన్న ఉమెన్ సేఫ్ షెల్టర్ ప్రతిపాదన మార్చి 8 మహిళా దినోత్సవం రోజునే  ముఖ్యమంత్రి ద్వారా ఆమోదం పొందడం జరిగిందన్నారు. కలియుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల ద్వారా ఏర్పాటు చేసిన కళాశాల  ఆవరణలోనే ఈ షెల్టర్ నిర్మాణం చేపట్టామన్నారు. వారి స్ఫూర్తి భావి  తరాలకు అందించడంతో పాటు ఈ సమీపంలో ఉన్న పలు కళాశాలల్లో 3 వేలమందికి పైగా విద్యార్థినీలకు ఎంతో ఉపయుక్తంగా ఉండాలనే సంకల్పంతోనే ఇక్కడ ఏర్పాటు చేసామన్నారు. మహిళలు విద్యార్థినీలు ఈ షెల్టర్ ను సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ నుండి ఒక చిన్న బటన్ నొక్కడం ద్వారా ఆటో సేవలు అందుబాటులోనికి వస్తాయన్నారు. ఇదే ఆవరణలో పోలీసు అవుట్ పోస్టు ను ఏర్పాటు చేయడం వలన మహిళలకు ఆకతాయి యువకుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. సీసీటీవీ ఏర్పాటు చేసామని నిరంతరం పోలీసు పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ షెల్టర్ నిర్వహణ విషయంలో ఎటువంటి అనుమానం అక్కరలేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలా ప్రాధాన్యత ఇస్తూ, వారి ఆర్థిక సాధికారత కోసం పనిచెయ్యడం జరుగుతోందని షర్మిలా అన్నారు. ఈ షెల్టర్ లో ఏర్పాటు చేసిన స్టాల్ ఎటీయం ద్వారా వచ్చే ఆదాయ వనరులను షెల్టరు నిర్వాహణకు వినియోగిస్తామన్నారు. 

జగనన్న ఉమెన్స్ సేఫ్ హేవెన్ .. విశ్రాంతి షెల్టర్ ను జిల్లా ఇన్ ఛార్జి మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఇందులో పోలీస్ ఔట్ పోస్ట్ ను హోంమంత్రి తానేటి వనిత, విశ్రాంతి రూంను జక్కంపూడి రాజా,  హెచ్ డి ఎఫ్ సి - ఎ టి ఎం లు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మహిళా సాధికారిత షాపు ను మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆర్వో ప్లాంట్ ను చందన నాగేశ్వర్ లు ప్రారంభించారు. 
 తొలుత కలియుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల చిత్ర పటానికి  మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు,  శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్ బావన రత్నకుమారి, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, స్థానిక నాయకులు మేడపాటి అనిల్, నందేపు శ్రీనివాస్, గిరిజాల వ్యాస్, పిల్లి నిర్మల, సౌందర్య, హాసిని, ఆదిలక్ష్మి, రూడా వీసీ వి.వివేక్, సెక్రటరీ జి. శైలజవల్లి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు టి. చంద్రశేఖర్, ఏఓ జి. శ్రీనివాస కుమార్,  ప్లానింగ్ అధికారి డీజీ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-08-18 14:30:43

త్వరలో అధునాతన ఆపరేషన్ థియేటర్

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌గా అవ‌త‌రించ‌నున్న జిల్లా కేంద్రాసుప‌త్రిలో త్వ‌ర‌లో అధునాత‌న ఆప‌రేష‌న్ థియేట‌ర్ అందుబాటులో రానుంది. మాడ్యుల‌ర్ ఆప‌రేష‌న్ థియేట‌ర్ కాంప్లెక్స్‌ను, సుమారు రూ.2.5కోట్ల‌ సిఎస్ఆర్ నిధుల‌తో ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ వే సంస్థ ముందుకు వ‌చ్చింది. పార్వ‌తీపురానికి చెందిన స్వ‌చ్ఛంద సంస్థ జ‌న క‌ల్యాణ స‌మాఖ్య కృషితో, ఈ సంస్థ జిల్లాలో ఆప‌రేష‌న్ థియేట‌ర్ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చింది. థియేట‌ర్‌లో సి-ఆర్మ్‌, లాప్రోస్కోప్‌, ఎన‌లైజ‌ర్‌, రెండు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిష‌న్లు త‌దిత‌ర అత్యాధునిక ప‌రిక‌రాల‌తోపాటు అడ్వాన్స్‌డ్ లైఫ్ స‌పోర్ట్‌ అంబులెన్సు కూడా స‌మ‌కూర‌నుంది.  కేంద్రాసుప‌త్రిలో ఈ ఆప‌రేష‌న్ థియేట‌ర్ కాంప్లెక్స్ నిర్మాణ ప‌నుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి గురువారం ప‌రిశీలించారు. ఏర్పాటు చేయ‌నున్న ప‌రిక‌రాలు, వాటి ప‌నితీరును అడిగితెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, జిల్లా కేంద్రాసుప‌త్రి సూప‌రింటిండెంట్ డాక్ట‌ర్ కె.సీతారామ‌రాజు, యునైటెడ్ వే, జెకెఎస్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-18 14:03:20

క్యాపిటివ్ సీడ్ పెంపకంతో చక్కటి ఉపాది..

ఇరిగేషన్ చెరువులను  మత్స్య సహకార సంఘాలకు లీజు కి ఇస్తామని,  ఆ చెరువులలో మత్సకారులు  చేప పిల్లల సాగు చేయడం ద్వారా జీవనోపాదిని పొందవచ్చునని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మల కుమారి తెలియజేశారు. యూత్ హాస్టల్ మీటింగ్ హాల్ లో  గురువారం ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్ (APIIATP) క్రింద వ్యవసాయ పరివర్తన సమావేశం మత్స్యకారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఉప సంచాలకులు నిర్మలకుమారి మాట్లాడుతూ,  చెరువులలో ఫింగర్ లింగ్స్ సైజు చేప పిల్లలు వేయడం ద్వారా అధిక మొత్తం లో ఖర్చై మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని.. ఈ ఇబ్బందులను అధికమించడానికి ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు,  వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్ , వరల్డ్ బ్యాంక్ ఆర్ధిక సహకారంతో పెద్ద చెరువులలో క్యాప్టివ్ సీడ్ నర్సరిలను నిర్మించి వాటిలో తక్కువ ఖర్చుతో చిరు చేప పిల్లలను వేసుకొని (స్పాన్) వాటిని ఫింగర్ లింగ్ సైజు చేప పిల్లలు గా వచ్చేవరకూ సాగు చేసుకోవచ్చునని తెలియజేశారు. తక్కువ ఖర్చు తో ఎక్కువ చేప పిల్లలను క్యాప్టివ్ సీడ్ నర్సరీల ద్వారా అభివృద్ధి పొందవచ్చునని సూచించారు. అదేవిధంగా చేపలు, రొయ్యలు మొదలుకొని  అమ్మకాల వరకు తాజా స్థితిలో పరిశుబ్రమైన వాతావరనంలో ఏ విధంగా అమ్మకాల జరపాలి,  ఎలా చేపలను నిల్వ చేసుకోవాలనే  విధానం పై మత్స్యకారులకు శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా ప్రజలందరికి అందుబాటులో తాజా చేపలు , రోయ్య్యలు అందించేందుకు ప్రతి గ్రామ సచివాలయం పరిధి లో ఫిష్ ఆంధ్రా షాప్ లను ఏర్పాటు చేసుకోవాలని మత్స్యకారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు 60 శాతం సబ్సిడీ, ఇతరులకు 40 శాతం సబ్సిడీ ఈ పథకం ద్వారా అందించున్నట్టు డిడి పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వి వినియోగించుకోవాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలా కుమారి  తెలియజేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం ( PMMSY ) గురించి కూడా ఈ సమావేశంలో మత్స్యకారులకు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో IRPWA – ప్రకాష్, ఎఫ్డీఓ యు.చాందిని,  సహాయ తనిఖిదారులు సి.హెచ్. సంతోష్ కుమార్, జి. వెంకటేష్, సి.హెచ్.వి.వి. ప్రసాద్ రావు, గ్రామ మత్స్య సహాయకులు, మత్స్య శాఖ సిబ్బంది, మత్స్యకారులుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-18 13:50:08

ఎంపీఎఫ్సీ గోడౌన్ల భూసేకరణ త్వరగా చేయాలి

పశ్చిమగోదావరి జిల్లాలో ఎం.పి.ఎఫ్.సి ( మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ ) గొడౌన్లు భూసేకరణ మరింత వేగవంతం చేయాలని డైరీ డెవలప్మెంట్   ఎండి  ఏ.బాబు జిల్లా కలెక్టర్ లకు సూచించారు.  గురువారం అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో  ఎం.పి.ఎఫ్.సి, బిఎం సియు (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ),ఏఎంసియు (ఆటో మేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్), లకు భూసేకరణ, వాటి నిర్మాణం పై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ జిల్లాలలో నిర్మాణ దశలో ఉన్న మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు మరింత వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూసమస్యలు ఉన్నచోట వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు.  భూమి కేటాయించిన వాటిలో కొన్ని స్థలాలు గొదాముల నిర్మాణానికి అనుకూలంగా లేవని ఇంజనీరింగ్ అధికారులు నివేదిక అందించారని అట్టి వాటికి కూడా భూములను గుర్తించాలని ఆదేశించారు. ఇప్పటికే భూములు కేటాయించిన వాటికి పనులు త్వరితగతిన చేపట్టాలని, ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

  వీడియో కాన్ఫరెన్స్ లో భీమవరం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 113  బి ఎం సి యు లకు గాను  110 బి ఎం సి యు లకు భూమి కేటాయించడం జరిగిందని ,  వీటి నిర్మాణాలు జరుగుతున్నాయని , జిల్లా లో 395 ఏ ఎం సి యు లకు గాను 255 ఏ ఎం సీ యు లకు భూమి కేటాయించడం జరిగిందని, మిగిలిన వాటికి కూడా త్వరగా భూసేకరణ పూర్తి చేసి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్  లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి కె.క్రిష్ణవేణి , జిల్లా సహకార శాఖ,  మార్కెటింగ్ శాఖ ,   ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-08-18 11:46:51

శత శాతం పనులు గ్రౌండ్ కావాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు నేడు క్రింద మంజూరైన భవన నిర్మాణ పనులు శత శాతం గ్రౌండింగ్ కావాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఆదేశించారు. విద్యాశాఖ మంజూరు చేసిన మన బడి నాడు నేడు పనుల పురోగతిపై స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్  సురేష్ కుమార్, నాడు నేడు మౌలిక సదుపాయాల సలహాదారు మురళీధర్ తో కలసి  గురువారం  జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ప్రభుత్వ  జూనియర్ కళాశాలలు, అంగన్వాడి, పాఠశాల భవనాలు పనులు వేగవంతం చేయాలని సూచించారు. అందుకు అవసరమైన పాలనా అనుమతులు, రివాల్వింగ్ ఫండ్ జమ చేయాలని అన్నారు. లక్ష్యాల పూర్తికి పనుల వేగం పెంచాలన్నారు.  నూతన విద్యా విధానం లో మ్యాపింగ్ పూర్తి అయిన స్కూల్స్ లో ఉపాధ్యాయులు, విద్యార్థులను  చేర్చాలని అన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లో విస్తారంగా వర్షాలు కురవడం, సిమెంట్ , ఇసుక సకాలంలో చేరకపోవడం వలన పనులలో కొంత మేర జాప్యం ఏర్పడిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖ అధికారి పి.బ్రహ్మాజీ రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ ఈ ప్రభాకర రావు, తదితరులు, పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-18 11:29:19

గత స్మృతులకు దర్పణం చాయాచిత్రం

గత స్మృతులకు దర్పణంగా నిలిచేది చాయాచిత్రం మాత్రమేనని  రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా  వాల్తేర్ ఫోటోగ్రఫిక్ సొసైటీ స్థానిక వేమన మందిరంలో గురువారం ఏర్పాటుచేసిన మెగా ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అద్భుత అందాలను కళ్లకు కట్టినట్లు చూపించగల శక్తి సామర్థ్యం ఒక్క  ఫోటోగ్రాఫర్ కి మాత్రమే వుందని  అన్నారు. కాలానుగుణంగా ఫోటోగ్రఫీలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి అని అన్నారు. డిజిటల్  ఫోటోగ్రఫీ వచ్చిన తరువాత  చాయచిత్రాలు మరుగున పడిపోయాయి అని మంత్రి అమర్ నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్టిల్  కెమెరాలతో ఫొటోలు తీసి, వాటిని చాయచిత్రాలుగా మలచి భద్రత పరచుకోవలసి అవసరం ఎంతైనా వుందని ఆయన అన్నారు. అలాగే  ప్రొఫెషనల్  ఫోటోగ్రాఫర్లు తమ నైపుణ్యానికి మరింత పదునుపెట్టి ఫోటోగ్రఫీ ఖ్యాతిని పెంచాలని అమర్ నాథ్  విజ్ఞప్తి చేశారు.  ప్రొఫెషనల్  ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక  గుర్తింపు అవసరమని, వీరికి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందిస్తామని మంత్రి అమర్ నాథ్ హామీ ఇచ్చారు.

పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ఫొటోలు జీవితాలను మార్చేస్థాయని అన్నారు. పూర్వం ఫొటోలు మాత్రమే చూసి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే వారని చెప్పారు. రాజకీయ నాయకులను పదవులలో  కూర్చో పెట్టాలన్నా, దించేయాన్నా ఆ శక్తి ఫొటోగ్రాఫర్లకు, వారు తీసిన ఫొటోలకు వుందని యార్లగడ్డ చమత్కరించారు. లీడర్ పత్రిక అధినేత రమణ మూర్తి మాట్లాడుతూ, పత్రికలో  వార్త  ఎంత ప్రధానమైనదైనా, ఆ వార్తకు సంబంధించిన ఫొటోనే పాఠకులు ముందుగా చూస్తారని, ఆ ఫొటో, ఆ వార్త సారాంశాన్ని  వ్యక్తీకరిస్తుందని  అన్నారు.  నక్సల్స్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య  ను తాను అత్యంత రహస్యంగా ఇంటర్వ్యూ చేశానని, తాను నిజంగా  ఆ ఇంటర్వ్యూ చేశానని తాను తీసిన ఫొటోల ద్వారానే బాహ్య ప్రపంచానికి తెలియచేశానని, అది ఫొటోకు వున్న గొప్పతనం అని రమణమూర్తి చెప్పారు.  ఈ కార్యక్రమానికి సొసైటీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి  అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్  కోదండరామయ్యని,సొసైటీ గౌరవ అధ్యక్షులు ప్రసాదరావును మంత్రి అమర్ నాథ్  ఘనంగా సత్కరించారు. అంతకు ముందు ఫొటో ఎగ్జిబిషన్ లో  పొందుపర చి న సుమారు 800 ఫొటోల ను  మంత్రి అమర్ నాథ్ ,యార్లగడ్డ  తదితరులు సందర్శించి నిర్వాహకుల ను  అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సేత్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-18 10:42:39

విశాఖలో రెండ్రోజులు మెగా ఫోటో ప్రదర్శన

విశాఖలో ఈ నెల 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా 18,19 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు ఆసిల్ ఆశీల్ మెట్ట వద్ద ఉన్న వేమన మందిరంలో మెగా ఫోటో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వాల్తేర్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ కార్యదర్శి ఎం.వి.శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.  మంగళవారం పెద్ద వాల్తేర్ లోని అసంగానంద ఆశ్రమంలో  నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్ర ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించే ఈ ప్రదర్శనలో ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పత్రికా సంపాదకులు వి.వి.రమణ మూర్తి పాల్గొంటారన్నారు. దివంగత సీనియర్ ఫోటో జర్నలిస్ట్ డాక్టర్ పల్లా రాజారావు(వాసు) పేరిట జీవిత సాఫల్య పురస్కారాన్ని విఖ్యాత సీనియర్ ఫోటో జర్నలిస్టు కోదండ రామయ్యకు అందజేస్తామన్నారు. ఈ ప్రదర్శనలో అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ లతోపాటు 30 మంది ఇతర ఫోటోగ్రాఫర్లు తీసిన ఆర్ట్ ఫోటోలు, ఫోటో జర్నలిజంపై 800 ఫోటోలు సందర్శకులకు కనువిందుచేస్తాయి అన్నారు. చివరి రోజు సాయంత్రం జరిగే ముగింపు ఈ కార్యక్రమంలో వారికి ప్రోత్సాహక పత్రాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో  అధ్యక్షుడు పి ఎన్ సేత్, గౌరవ అధ్యక్షులు ఈ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వి వి రామరాజు, సహాయ కార్యదర్శి  ఎం వి నర్సింగరావు, కోశాధికారి జగపతిరాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-16 15:13:26

వైఎస్సార్ బడుగు వికాసంతో ప్రోత్సాహం

వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం కింద మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రోత్సహించేందుకు సంప్రదాయ మద్యం తయారీ గ్రామాల్లో ఎంపికైన అభ్యర్థులకు రుణ సదుపాయాలు కల్పించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి  కలెక్టర్ ఛాంబర్ లో  అక్రమ మద్యం తయారీలో ఉన్న గ్రామస్తులకు  మద్దతు కార్యక్రమం నిర్వహించడం పరిశ్రమల, సిడ్బి, బ్యాంకర్ల, ఎంపిడివో లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, గతంలో అక్రమ మద్యం తయారీ చేసే రంగంలో ఉన్న వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో గౌరవమైన జీవనాన్ని సాగించే ప్రక్రియలో మద్దతుగా నిలవాల్సి ఉందన్నారు. అందులో భాగంగా సిడ్బి (చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా జిల్లా పరిశ్రమలు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆయా మండలాలు పరిధిలోని బ్యాంకులతో మాట్లాడి మెప్పించడం ద్వారా ఆదాయ వనరుగా యూనిట్స్ స్థాపన కార్యరూపం సాధించి ఒక రోల్ మోడల్ గా నిలవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆ దిశలో  రాజానగరం మండలం శ్రీరామ్ పురం లో 7 యూనిట్స్, కొవ్వూరు మండలం మద్దూరి లంకలో 8 యూనిట్స్, చాగల్లు మండలం చిక్కాల , చిక్కాలపాలెం లో 14 యూనిట్స్ గ్రౌండింగ్ చేసే దిశలో తీసుకున్న చొరవను కలెక్టర్ అభినందించారు.  ఇటువంటి కార్యక్రమాలను మరింత మంది మెరుగైన జీవనోపాధి దిశగా అడుగులు వేసేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మరింత మందికి స్ఫూర్తి పొందే విధంగా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇది ఆరంభం మాత్రమే నని ఆమె తెలిపారు.

పి ఎం ఈ జీ పి/వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం కింద ఏ పి ఖాదీ & గ్రామీణ పరిశ్రమల బోర్డ్ ద్వారా 24 యూనిట్స్ , జిల్లా పరిశ్రమల ద్వారా 5 యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎస్ బి ఐ  దివాన్ చెరువు బ్రాంచ్ ద్వారా 7 యూనిట్స్ రూ.22 లక్షలతో,  చిక్కాల బ్రాంచ్ ద్వారా 13 యూనిట్స్ రూ.66 లక్షల తో, నిడదవోలు బ్రాంచ్ ద్వారా ఒక యూనిట్ రూ.25 లక్షలతో, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడపల్లి బ్రాంచ్ ద్వారా 8 యూనిట్స్ రూ.22 లక్షల మూల ధనంతో బ్యాంకర్లు ముందుకు వచ్చారని తెలిపారు. ఇందులో లబ్దిదారుని వాట 5 శాతం, బ్యాంక్ రుణ సౌకర్యం 95 శాతం కల్పించడం జరిగిందని వివరించారు . ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా లబ్దిదారులు 35 శాతం మేర ప్రభుత్వ సబ్సిడీ గా పొందవచ్చు అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి కె. వేంకటేశ్వరరావు, మెప్డా - సిడ్బి ప్రాజెక్ట్ ఆఫీసర్ టి. శ్రీనివాస రావు, ఎల్ డి ఎం కె. దిలీప్ కుమార్, బ్యాంకు మేనేజర్ లు, చాగల్లు, కొవ్వూరు, రాజానగరం ఎం పి డి వో లు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-08-16 14:59:59

అమర్ ఓడినప్పుడే అనకాపల్లి కి స్వాతంత్య్రం

అనకాపల్లి జిల్లాలో 2024 లో జరిగే ఎన్నికల్లో గుడివాడ అమర్నాధ్ ఓడిన నాడే అనకాపల్లి ప్రాంతానికి నిజమైన స్వాతంత్య్రం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పరుచురి భాస్కరరావు అన్నారు. మంగళవారం అనకాపల్లి జనసేన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విశాఖకు చెంది జనసేన నాయకులు బోలిశెట్టి సత్యన్నారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాధ్ అవాకులు చవాకులు పేలడం తగదన్నారు. తమ మూడేళ్ల అధికార సమయంలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో ప్రజలకు తెలుసునన్నారు. అధికారంలోకి వస్తే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని నమ్మబలికిన వ్యక్తి నేడు దానిని అమ్ముకునేందుకు సిద్ధపడటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆరోపించారు. 25 ఎంపీలు ఉండికూడా రాష్ట్ర హక్కుల కోసం పోరాడలేని దౌర్భాగ్య స్ధితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందన్నారు. పేరుకే కొత్త జిల్లాలు ఏర్పడినా ఎక్కడా అధికారికంగా ఎలాంటి వసతులు, జిల్లా స్థాయి కల్పన ఎక్కడచేపట్టలేకపోయారని దుయ్యబట్టారు. అమలు కానీ హామలు ప్రజల నెత్తిన రుద్ది అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశారనే విషయాన్ని ముందు ప్రజలకు తెలియజేయాలన్నారు. జనసేన రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తుందో ఆ విషయం మా పార్టీ అధిష్టానం, తమ అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని..దానికోసం వైఎస్సార్సీపీ నేతలు ఆత్రుత పడాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు.

Anakapalle

2022-08-16 14:50:01