1 ENS Live Breaking News

శిక్షణతో మత్స్యకారుల జీవితాలు మారాలి

ఎం.ఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా పొందే శిక్షణతో మత్స్యకారుల జీవితాలు మారాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మత్స్యకార బృందానికి పిలుపునిచ్చారు. మంగళవారం తమిళనాడులోని పూంపుహార్ ప్రాంతంలో గల ఫిష్ ఫర్ ఆల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నందు శిక్షణ పొందేందుకు 33 మందితో బృందం బయలుదేరింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శిమ్మ నేతాజీతో కలిసి బస్సుకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందనున్న మత్స్యకారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ జాతీయస్థాయిలో మత్య్సకారుల శిక్షణ నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ఇదే ప్రథమం అని, ఇటువంటి అవకాశం శ్రీకాకుళం జిల్లాకు లభించడం గర్వకారణమన్నారు. దీనివలన మిగిలిన అనుబంధ రంగాలైన వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, ఉద్యానవనం వంటి శాఖల శిక్షణకు స్పూర్తికావాలన్నారు. ఎం.ఎస్.స్వామినాధన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇచ్చే వారం రోజుల  శిక్షణతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 

ముఖ్యంగా 20 ఏళ్ల తదుపరి మత్స్యకారుల జీవితాలు ఏవిధంగా ఉండబోతున్నాయో శిక్షణ పొందనున్న మత్స్యకారులు తెలుసుకోబోతున్నారని కలెక్టర్ తెలిపారు. శిక్షణను శిక్షణ మాదిరిగా కాకుండా మీలో ఉండే ప్రతిభను వెలికితీసేలా వ్యవహరించాలన్నారు. జిల్లా తరుపున వెళుతున్న 33 మంది బృందం జిల్లా ప్రతిభను మరింత ఇనుమడింపజేయాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. శిక్షణ పొందిన వారు మిగిలిన వారికి శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉన్నందున క్షుణ్ణంగా తెలుసుకొనిరావాలని, తద్వారా జిల్లా అంతటా వ్యాపించి జిల్లా రోల్ మోడల్  కావాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శిక్షణ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-08-16 14:02:50

ఆశ్రమ పాఠశాల సమస్య పరిష్కరించాలి

ఆశ్రమ పాఠశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐ టి డి ఎ పి ఓ ఆర్. గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని  దిగుమోదపుట్టు ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఆశ్రమ పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ లేదని విద్యార్థులు దృష్టికి తీసుకొచ్చారు. వాటర్ సమస్య ను వెంటనే పరిష్కరించాలని ప్రధానోపాధ్యాయుడు, ఏ టి డబ్ల్యూ ఓ లను ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రాన్ని బోధించారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ అందించాలని పేర్కొన్నారు. పాఠశాలలో డ్రాపవుట్లు  ఎక్కువగా ఉన్నారని తగిన చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షమశాఖ డిడి,atwo ను ఆదేశించారు. అనంతరం తుంపాడ,చింతలవీది గ్రామ సచివాలయం లను తనిఖీ చేశారు. తుంపాడ వి ఆర్ ఓ ఎం. కొండమ్మ సక్రమంగా విధులకు హాజరు కాలేదని పరిశీలించి కావడం లేదనిక్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలనిఎంపీడీఓకు సూచించారు. విలేజ్ సర్వేయర్ డిప్యూటేషన్ రద్దు చేయాలని సబ్ కలెక్టర్ను ఆదేశించారు. తుంపాడ 13వతేది నుండి హాజరు పట్టిక లో సంతకాలు చేయకుండా విధులకుపంచాయతీ కార్యదర్శి ఎన్. మత్త్య రాజు హాజరు కాలేదని తగిన చర్యలు తీసుకోవాలని ఎం.పి.డి. ఓ ని అదేశించారు.

Paderu

2022-08-16 13:58:11

ఆగస్టు 17 నుంచి తాళ్లపాకలో పవిత్రోత్సవాలు

అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే  దోషాల వల్ల  ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 17వ తేదీ సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి పవిత్ర పూజ నిర్వహిస్తారు. ఆగస్టు 18న యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, లఘు పూర్ణాహుతి చేపడతారు. ఆగస్టు 19న పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.  ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Tallapaka

2022-08-16 13:33:13

సరిక్రొత్త భారత దేశాన్ని అవిష్కరిద్దాం

76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలెక్టరేట్ వద్ద సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం మేరకు సరి క్రొత్త భారత దేశాన్ని ఆవిష్కరించడం లో ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలన్నారు.  స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఆజాది క అమృత్ వేడుకలను జిల్లా అంతటా ఘనంగా జరుపుకుని దేశ భక్తిని చాటుకున్నామని గుర్తు చేసారు. అదే స్ఫూర్తి తో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను  ప్రజలకు చేరువుగా ఉంటూ పారదర్శకంగా  అందేలా  చూడాలన్నారు.  అధికారులంతా అంకిత భావం తో , చిత్త శుద్ధి తో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గణపతి రావు, కలెక్టర్ ఏ.ఓ దేవ్ ప్రసాద్, పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-15 11:58:14

సర్వేయర్ల సేవలు ప్రశంసనీయం

గ్రామ సర్వేయర్లు అమూల్యమైన సేవలను అందిస్తున్నారని విజయనగరం ఆర్డీవో ఎంవి సూర్యకళ కొనియాడారు. భూముల రీ సర్వేలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో,  గ్రామ సర్వేయర్లు, వీఆర్వోల సత్కార సభ సోమవారం జరిగింది. రెవెన్యూ డివిజన్ పరిధిలోని సర్వేయర్లు, వీఆర్వోలను ఈ సందర్భంగా సత్కరించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో సూర్యకళ మాట్లాడుతూ, రీ సర్వేలో మన జిల్లా ముందంజ లో వుండటానికి సర్వేయర్లు, వీఆర్వోలే కారణమని అభినందించారు. జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం క్రింద చేపట్టిన భూముల రీ సర్వే కి ప్రభుత్వం  అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రీ సర్వే పూర్తి అయితే, చాలా వరకు భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత సర్వేయర్ల పైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. సర్వేయర్లు, విఆర్వోలు అంకితభావంతో పని చేసి, సర్వేలో మన జిల్లాను అగ్రపథంలో నిలబెట్టాలని ఆర్డీవో కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే, భూ రికార్డుల శాఖ సహాయ సంచాలకులు త్రివిక్రమరావు, ఆర్డీవో కార్యాలయ ఏఓ ప్రభాకరరావు, పది మండలాల తాసిల్డార్లు, మండల, గ్రామ సర్వేయర్లు, విఆర్వోలు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-15 11:50:15

పీఎంఎస్ వై పథకంతో మత్స్యకారులకు ఆర్ధిక తోడ్పాటు

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా సముద్ర మత్స్యకారులు, స్వదేశీ మత్స్యకారులకు ఉపాది, వ్యాపార అవకాశాలు మెరుగుపడి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షులు బర్రి చిన్నప్పన్న తెలిపారు. శనివారం విజయనగరంలోని  ఫిష్ సీడ్ ఫారంలో మత్య్స సంపద, వినియోగం, పథకం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్యకారులు అభివృద్ధి, మత్స్య సంపద పెంపుదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా, వై.ఎస్.ఆర్. పెన్సన్ కానుక, మత్స్య సాగుబడి, కిసాన్ క్రెడిట్ కార్డులు, పవర్ సబ్సిడీ వంటి ఎన్నో పధకాలు అమలు చేస్తోందని అన్నారు. మత్స్యశాఖ ఉప సంచాలకులు            ఎన్.నిర్మలకుమారి మాట్లాడుతూ, స్థానికంగా చేపల వినియోగం పెంచేందుకు మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి SC, ST, మహిళలకు 60శాతం, ఇతరలకు 40శాతం సబ్సిడీపై ఈ యూనిట్లను మంజూరు చేసినట్టు చెప్పారు. ఔత్సాహిక మత్య్సకారులు ఇంకా ముందుకి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా లబ్ది పొంది వినూత్న, సాంకేతిక పద్దతిలో రీ సర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టం(RAS) ద్వారా చేపల పెంపకం చేయుచున్న మహిళా లబ్దిదారు. నాగమణి గారు తన యొక్క అనుభవాలు,  RAS ప్రయోజనాలు విపులంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డవలప్మెంట్ ఆఫీసర్  యు. చాందిని, మత్స్య శాఖ సహాయ తనిఖిదారులు సి.హెచ్. సంతోష్ కుమారి, జి. వెంకటేష్, సి.హెచ్.వి.వి. ప్రసాద్ రావు, గ్రామ మత్స్య సహాయకులు, మత్స్య శాఖ సిబ్బంది, మత్స్యకారులు, పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-13 14:54:46

మదినిండా స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తి..

భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ మెండుగా ఉండాలని.. అదే స్ఫూర్తితో భావి భారత పౌరులకు స్వాతంత్ర ఉద్యమ చరిత్రను చాటి చెప్పాలనే లక్ష్యంతో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ద్వారా మహనీయుల త్యాగాలను గురుతు చేసుకుంటున్నామని  మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలాకుమారి  తెలియజేశారు. శనివారం విజయనగరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 75సంవత్సరాల స్వాతంత్ర్య సంబురాల జాతర ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గురజాడ అప్పారావు విగ్రహం(సత్య కాలేజ్) నుంచి కోట, మూడు లాంతర్లు, గంట స్థంబం, మహా రాజ కళాశాల మీదుగా తిరిగి గురజాడ అప్పారావు విగ్రహం(సత్య కాలేజ్) వరకు కొసాగింది. ఈ ర్యాలీ మొత్తం “భారత్ మాత కి జై”, “వందేమాతరం” అనే నినాదాలతో పట్టణ వీధులు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా మత్స్యశాఖ  ఉపసంచాలకులు ఎన్. నిర్మల కుమారి మాట్లాడుతూ, జిల్లా కలక్టర్ ఆదేశాల మేరకు  ప్రజలలో దేశభక్తిని పెంపొందించి, స్పూర్తిని కలిగించామన్నారు. భారతద్శానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కారణమైన మహానుభావులను తలచుకుంటూ ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు. ఎందరో మహనీయుల త్యాగాల తో సిద్ధించిన స్వాతంత్ర ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. 75సంవత్సరాల జెండా పండుగ కార్యక్రమంలో మత్స్యశాఖ ద్వారా తాము పాల్గొనడం కూడా ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. మది నిండా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో సాగిన మువ్వన్నెల జెండా పండుగ ర్యాలీలో ఎఫ్డీఓ యు. చాందిని, మత్స్య శాఖ సహాయ తనిఖిదారులు సి.హెచ్. సంతోష్ కుమారి, జి. వెంకటేష్, సి.హెచ్.వి.వి. ప్రసాద్ రావు, గ్రామ మత్స్య సహాయకులు, మత్స్య శాఖ సిబ్బంది, మత్స్యకారులు, పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-13 14:23:35

వైద్య‌సేవ‌ల‌ను మరింత మెరుగు ప‌ర‌చాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని వైద్య సేవ‌ల‌ను మ‌రింత మెరుగు ప‌రిచేందుకు కృషి చేయాల‌ని జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కోరారు. దీనికి జిల్లా ప‌రిష‌త్ నుంచి త‌మ‌వంతు స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. మెర‌క‌ముడిదాం మండ‌లం గ‌ర్భాం పిహెచ్‌సికి కంప్యూట‌ర్‌, ప్రింట‌ర్ క‌మ్ స్కాన‌ర్‌, యుపిఎస్‌ల‌ను, జిల్లా ప‌రిష‌త్‌లో శుక్ర‌వారం అంద‌జేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, గ‌ర్భాం పిహెచ్‌సి వైద్యులు, సిబ్బంది వీటిని స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో జెడ్‌పి సిఇఓ డాక్ట‌ర్ ఎం.అశోక్‌కుమార్‌, డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్‌, మెర‌క‌ముడిదాం మండ‌ల నాయ‌కులు తాడ్డి వేణు, కోట్ల వెంక‌ట‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.          

Vizianagaram

2022-08-05 12:02:54

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మకు గంట్ల పూజలు

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం.. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీశ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం(వరలక్ష్మీ వ్రతం) సందర్భంగా విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతంని పురస్కరించుకుని తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది  భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించారు.. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరలక్ష్మీ వ్రతం, శ్రావణ శుక్రవారం సందర్భంగా  శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కనక మహాలక్ష్మి ఆలయంలో పంచామృత అభిషేక సేవలో పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరిని దర్శించుకునీ  ప్రత్యేక పూజలు చేసి.. తరువాత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో శిరీష ఆధ్వర్యంలో భక్తులకు విశేష ఏర్పాట్లు చేశారు.


వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని పాతనగరం లో కొలువై ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని బంగారు చీరతో అందంగా అలంకరించారు.. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.. బంగారు చీరలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పరవశం చెందారు.

Visakhapatnam

2022-08-05 08:09:49

ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం

 నూతన చట్టాలకు అనుగుణంగా తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు ఓటర్ జాబితాలో నమోదైన ఓటరు  కార్డుతో ఆధార్ నంబరు అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లాలో ప్రారంభిస్తున్నామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్  పేర్కొన్నారు. మంగళ వారం కలెక్టరేట్ లోని  సమావేశ మందిరం లో  ఓటర్ ఆధార్ సంధాన ప్రక్రియ పై పాత్రికేయుల  సమావేశంలో జేసీ మాట్లాడారు.  ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్లు 2023 మార్చి 31 నాటికి స్వచ్ఛందంగా తమ ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం నూతనంగా ఫారం-6 బిని ప్రవేశపెట్టామని  తెలిపారు.  ఆధార్ నంబర్ అనుసంధానం స్వచ్చందమేనని   సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించడం ఉండదని  స్పష్టం చేశారు. దోషరహితమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి ప్రతి ఓటరు సహకరించాలని  అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.

ఓటరు నమోదుకు 4 సార్లు అవకాశం :
 2023 ఓటర్ల జాబితా వార్షిక సవరణలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమంలో   ఓటరుగా నమోదు కావడానికి ముందస్తుగా దరఖాస్తు సమర్పించవచ్చని ఆయన సూచించారు.   ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల సంఘం సంవత్సరంలో నాలుగు సార్లు అవకాశం కల్పిస్తుందని జే.సి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 17 సంవత్సరాలు పైబడిన యువత ఓటర్ల జాబితాలో పేర్లను నమోదుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి కావాలనే నిబంధన  కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జనవరి 1వ తేదీ మాత్రమే కాకుండా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీల నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత ముందస్తు దరఖాస్తులను దాఖలు చేయడానికి వీలు కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు. జనవరి 1వ తేదీ మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వలన 18 సంవత్సరాలు నిండినప్పటికి పలు ఎన్నికలలో యువత ఓటు వేసే అవకాశం కోల్పోతున్నారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

ఆగష్టు 1 నుండి కొత్త దరఖాస్తులు:
ఓటరు నమోదు ఫారాలు మరింత సులభంగా రూపొందించి ఆగష్టు 1వ తేదీ నుండి అందుబాటులోకి తీసుకువస్తుందని సంయుక్త  కలెక్టర్ చెప్పారు. ఓటరుగా నమోదుకు ఫారం - 6, పేరు తొలగింపుకు ఫారం - 7, వివరాలను సరిదిద్దడానికి ఫారం -8, ఆధార్ కార్డుతో ఓటరు గుర్తింపు కార్డు అనుసంధానం చేయడానికి ఫారం - 6బి సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు.  ఇప్పటికే పాత నమూనా దరఖాస్తులో దాఖలు చేసిన వారు కొత్తవి సమర్పించవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ లో ప్రారంభం కానున్న సవరణ కార్యకలాపాల్లో ఏకీకృత ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాత స్వీకరించిన క్లెయింలు, అభ్యంతరాల పరిష్కారం ఉంటుందని చెప్పారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ క్రింద ముసాయిదా ఓటర్ల జాబితాలో క్లెయింటు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి ఒక నెల వ్యవధి అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యెక సమ్మరీ రివిజన్ :  
ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 షెడ్యూల్ ప్రకారం దోషరహితమైన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 4 నుండి అక్టోబర్ 24 వ తేదీ వరకు చేపడతామన్నారు. నవంబర్ 9వ తేదీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించి అప్పటి నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 26వ తేదీ వరకు స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలిస్తామన్నారు. తదుపరి 2023 జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని  తెలిపారు.  ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్  రూపొందించిన 6, 6బి, 8  ఫారాలను  విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గణపతి రావు, ఎన్నికల్ల పర్యవేక్షకులు మహేష్ , డి ఐ.పి.ఆర్ .ఓ  రమేష్   తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-02 09:15:31

కనుచూపు మేర మువ్వెన్న‌ల జెండా రెప‌రెప‌లు

ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మంలో భాగంగా జాతీయ ప‌తాక రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య జ‌యంతిని పుర‌స్క‌రించుకొని న‌గ‌రంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన స‌మైక్య‌తా ర్యాలీ స్ఫూర్తిదాయ‌కంగా సాగింది. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్య‌లో పాల్గొని జాతి నేత‌ల‌కు నివాళుల‌ర్పించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ముందుగా స్థానిక గుర‌జాడ స‌ర్కిల్ వ‌ద్ద పింగ‌ళి వెంక‌య్య చిత్ర ప‌టానికి ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీఆర్వో గ‌ణ‌ప‌తిరావు, మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయర్ రేవ‌తీ దేవి, గుర‌జాడ మ‌న‌వ‌రాలు ఇందిర‌, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థినీ, విద్యార్థులు 100 అడుగులు జాతీయ ప‌తాకాన్ని చేత బ‌ట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వ‌హించారు. ర్యాలీ ముగింపులో మ‌హారాజ ప్ర‌భుత్వ సంగీత క‌ళాశాల ప్రాంగ‌ణంలో ఉన్న హ‌రిక‌థ పితామ‌హుడు ఆదిభ‌ట్ల నారాయ‌ణ‌దాసు, వ‌యోలిన్ విధ్వాంసుడు ద్వారం వెంక‌ట‌స్వామినాయుడు విగ్ర‌హాల‌కు ఎమ్మెల్యే, జేసీ, డీఆర్వో పూల‌మాల‌లు వేశారు.

మ‌హ‌నీయుల త్యాగాలు మ‌రువ‌లేనివి..
కార్య‌క్ర‌మం అనంత‌రం స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర కోసం అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించి.. జీవితాల‌ను త్యాగం చేసిన మ‌హ‌నీయుల సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని పేర్కొన్నారు. ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వాల్లో భాగంగా స్వాతంత్య్ర స‌మ‌రయోధుల స్ఫూర్తిని భావిత‌రాల‌కు చాటి చెప్పేలా ప్ర‌తి ఒక్క‌రూ హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం కావాల‌ని ఎమ్మెల్యే ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. జాతీయ ప‌తాకం రూప‌క‌ర్తి పింగ‌ళి వెంక‌య్యకు ఘ‌న‌మైన నివాళి అర్పించి జాతి స‌మైక్య‌త‌ను చాటి చెప్పాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌న్నారు.

పింగ‌ళి చిత్రప‌టానికి పుష్పాంజ‌లి
పింగ‌ళి వెంక‌య్య‌ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని కలెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఆయ‌న‌ చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తిరావు, జిల్లా స్థాయి అధికారులు పుష్పాంజ‌లి ఘటించారు.కార్య‌క్ర‌మాల్లో న‌గ‌ర మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ రేవ‌తీ దేవి, జిల్లా యువ‌జ‌న అధికారి విక్ర‌మాధిత్య‌, డీఎస్‌డీవో అప్ప‌ల‌నాయుడు, డీఆర్డీఏ పీడీ కల్యాణ చ‌క్ర‌వ‌ర్తి, ప‌ర్యాట‌క శాఖ అధికారి ల‌క్ష్మీ నారాయ‌ణ‌, డీఈవో స్వామినాయుడు, మెప్మా పీడీ సుధాక‌ర్‌, వ‌యోజ‌న విద్యా శాఖ డీడీ సుగుణాక‌ర్ రావు, క‌లెక్ట‌రేట్ ఏవో దేవ్ ప్ర‌సాద్‌, వివిధ సెక్ష‌న్ల సూప‌రింటెండెంట్లు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-02 09:10:00

105 అడుగుల జాతీయ జెండా ట్రయల్ రన్

జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావడం తెలుగుజాతికి గర్వకారణం అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనం, గాంధీ మందిరంలో మంగళవారం పింగళి వెంకయ్య 144వ జయంతి వేడుకలు, జాతీయ జెండా రూపకల్పన చేసిన వందేళ్లు పూర్తయిన సందర్భంగా 105 అడుగుల జాతీయ జెండా ట్రయల్ రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలుత పింగళి వెంకయ్య చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ జెండా ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని పెంపొందించేలా.. ఉత్సాహం ఉరకలేసేలా చేస్తోందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వస్తుందనే నమ్మకం అంతకుముందే పింగళి వెంకయ్య గుర్తించి పతాకాన్ని రూపొందించడం గొప్ప విషయమన్నారు. గాంధీ మందిరం సమరయోధుల స్పూర్తివనంలో కమిటీ నిర్వాహకులంతా పదవులు, హోదాలతో ప్రమేయం లేకుండా అందరూ వలంటీర్లుగా పనిచేయడం శుభపరిణామమన్నారు. సిక్కోలు జిల్లాలో గాంధీ మందిరం ఏర్పాటు కావడం ఓ చరిత్ర అయితే ఎందరో సమరయోధుల స్పూర్తివనం మరో చరిత్ర అని ఆయన కొనియాడారు. 

105 అడుగుల జాతీయ జెండాతో సిక్కోలు జిల్లా మరో రికార్డు సృష్టించిందని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు సిక్కోలులో ఘనంగా జరుగుతాయనడానికి ఇక్కడ జరుగుతున్న వేడుకలే ఓ సంకేతమన్నారు. ఈ ట్రయల్ రన్ కార్యక్రమంలో కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మునిసిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, సెట్ శ్రీ సీఈవో ప్రసాదరావు, డీఎడీవో మాధురి, విశ్రాంత డీఈవో బలివాడ మల్లేశ్వరరావు, తహసీల్దార్ వెంకటరావు, గాంధీ మందిరం నిర్వాహకులు ఎం.ప్రసాదరావు, సురంగి మోహనరావు, నటుకుల మోహన్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, డాక్టర్ జామి భీమశంకర్, కొంక్యాన వేణుగోపాల్, డాక్టర్ బాబాన దేవభూషణ్, మహిబుల్లా ఖాన్, ఆచంట రాము, నిక్కు అప్పన్న, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, కొంక్యాన మురళీధర్, ఎం.వి.ఎస్.ఎస్.శాస్త్రి, పందిరి అప్పారావు, భట్లు, నిక్కు హరిసత్యనారాయణ, గుత్తు చిన్నారావు, నక్క శంకరరావు, పెంకి చైతన్య, పొన్నాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 

దాతలను సత్కరించిన కలెక్టర్
మహాత్మా గాంధీ మందిరం, సమరయోధుల స్పూర్తివనంలో 105 అడుగుల జాతీయ జెండా రూపకల్పన కోసం నగరంలోని వివిధ రంగాల ప్రముఖులు పెద్దఎత్తున విరాళాలు అందించారు. ప్రముఖ శిశువైద్య నిపుణులు, ఐతమ్ కళాశాల చైర్మన్ డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు రూ.లక్ష, పీవీఎస్ రామ్మోహన్ ఆసుపత్రుల అధినేత పీవీఎస్ రామ్మోహన్ రూ.2 లక్షలు, వి డెంటల్ అధినేత డాక్టర్ జాన్, మేనేజర్ రామ్మోహన్ రూ.25 వేలు, కేవీఎస్ఎన్ వర్మ రూ.పదివేలు, కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రూ.పదివేలు, పారిశ్రామికవేత్త నడికుదిటి ఈశ్వరరావు (ఎఈఆర్) రూ.50 వేలు విరాళం ఇచ్చారు. వీరిని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. 105 అడుగుల జెండా నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్న ఆచంట రాము, బజాజ్ ఎలక్ట్రికల్స్ సంస్థ సాంకేతిక విభాగ ప్రతినిధులు ధర్మేంద్ర, హుస్సేన్లను కూడా కలెక్టర్ సత్కరించారు.

Srikakulam

2022-08-02 07:16:32

అన్నవరం ఆగమ పాఠశాలపై తీవ్ర అశ్రద్ద

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం ఆగమ విద్యకు మంగళం పాడేలా వుంది. ప్రతీ ఏటా ఆగమపాఠశాల ప్రవేశాల విషయంలో అధికారుల ప్రచార లోపం  విద్యార్ధులకు శాపంగా మారుతోంది. దీనితో ప్రతీ ఏడాదీ విద్యార్ధుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దానికి ఈ ఏడాది వచ్చిన దరఖాస్తులే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలోని అన్నవరం శ్రీ సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాలలో స్మార్త ఆగమ విద్యను అధ్యయనం చేయడానికి కేవలం 23 మంది విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కనీసం వచ్చిన దరఖాస్తు దారులందరికీ అవకాశం కల్పించే విధంగా మీడియా ద్వారా కనీసం ఎప్పుడు తరగతులు ప్రారంభించే విషయం కూడా తెలియజేయకపోవడం అత్యంత దారుణం దీనితో దరఖాస్తు చేసుకున్నావారిలో కేవలం  19 మంది విద్యార్ధులు మాత్రమే హాజరు కావడంతో.. ఆ వచ్చిన విద్యార్ధులకే నేటి నుంచే దేవస్థానం వైదిక కమిటీ  సంక్షేములో విద్యార్థులను పరిశీలన చేశారు. వారికే 5 సంవత్సరముల కోర్సు అధ్యయనం చేయుటకు గాను ఎంపిక చేశారు. వాస్తవానికి అన్నవరం ఆగమ కోర్సుకు మంచి డిమాండ్ వుంది. అయితే దానిని అధికారులు వారి వారి స్వలాభం కోసం దీనిపై ప్రచారం తగ్గించేయడంతో అసలు ఇక్కడ ఆ కోర్సు చెబుతున్నదీ లేనిదీ తెలియకుండా పోతుంది. ఈ దేవస్థానంలో ఆదాయ మార్గాలపై చూపించే చొరవ వేద విద్యార్ధులకు ఆగమ పాఠశాల యొక్క గొప్పతనాన్ని..అందులో విద్యార్ధుల సంఖ్యను పెంచే విషయంలో చూపలేకపోవడం దారుణం. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది విద్యార్ధుల తల్లిదండ్రులు దేవాదాయశాఖ ద్రుష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడం అత్యంత శోచనీయం. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చేఏడాది పది మంది విద్యార్ధులు కూడా వేద విద్యకు దరఖాస్తు చేసుకునే పరిస్థితులు కూడా కనిపించేటట్టుగా లేవు..!

Annavaram

2022-08-01 14:06:42

మానవ మనుగడలో మొక్కలు కీలకం

మానవ మనుగడకు మొక్కలు ఎంతో కీలకమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగర పరిధిలోని 44వ డివిజన్ పరిధిలోని పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో స్థానిక కార్పొరేటర్ శాంతి సుధ ఆధ్వర్యంలో  మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో నగర మేయర్ మహమ్మద్ వసీం,వైసీపీ సీనియర్ నేత అనంత చంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి,కమిషనర్ భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ప్రకృతిని కాపాడటంలో మొక్కలు ఎంతో దోహదపడుతాయన్నారు.సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాడాన్ని ఉద్యమంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.చెట్లు నాటడమే కాకుండా వాటిని రక్షించాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు.ప్లాస్టిక్ నిర్ములన కూడా పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని  పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇషాక్ ,బాబా ఫక్రుద్దీన్,నాయకులు మధు,ఖాజా  పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేష్ ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2022-07-30 07:46:15

ఆగష్టు 13 తేదీన జాతీయ లోక్ అదాలత్

 కేసులు పరిష్కాకారానికి   రాజీ  మార్గమే  ఉత్తమమని  రెండవ అదనపు  జిల్లాజడ్జి  సిహెచ్‌. రాజ గోపాల రావు తెలిపారు. ఆగష్టు 13 తేదీన నిర్వహించనున్న  జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా శనివారం జిల్లా కోర్ట్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆగష్టు 13 తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ కార్యక్రమాన్ని  వినియోగించుకొని  జాతీయ లోక్ అదాలత్ లో వారి యొక్క  కేసులు రాజీ చేసుకోవాలని తెలిపారు.  బ్యాంకులు , ఏలక్ట్రికల్, ఎక్సైజ్ , కుటుంబ సంబందిత కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించు కోవచ్చునన్నారు. చిన్నచిన్న కేసులకు కూడా కోర్టులచుట్టూ తిరిగి డబ్బు, కాలం వృధా చేసుకోవద్దని  సూచించారు.  కేసులు  రాజీ  పర్చుటకు  పోలీసులు, లాయర్లు , పబ్లిక్  ప్రాసిక్యూటర్ ,  అసిస్టెంట్  పబ్లిక్  ప్రాసిక్యూటర్  సహకరించాలన్నారు.  ముఖ్యంగా  చిన్న కారణాలకే  తగువుపడి,  రాజీపడాలనుకునే  భార్య,భర్తలను, కుటుంబాలను  ప్రోత్సహించి  రాజీ చేయాలని తెలిపారు. పోలీసు స్టేషన్  వారీగా  పెండింగ్  కేసులు  వివరాలు సమీక్షించారు.  వాటిలో  సాద్యమైనన్ని కేసులు  లోక్ అదాలత్ లో  పరిష్కరించే విదంగా  చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ఈ సమావేశంలో  సీనియర్ సివిల్ జడ్జి జి. యజ్ఞనారాయణ , అడిషనల్ జుడీషియల్  ఫస్ట్ క్లాస్  మేజిస్ట్రేట్  డి. సౌజన్య , బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్  ఎన్. శ్రీనివాసరావు , పోలీసు అధికారులు , న్యాయవాదులు , కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-07-30 07:35:56