1 ENS Live Breaking News

ఆరిలోవ ప్రాంత అభివృద్ధికి కృషి..జివిఎంసీ మేయర్

ఆరిలోవ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె 2వ జోన్ 11వ వార్డు పరిధిలోని ఆరిలోవ, బాలాజీ నగర్, శ్రీకాంత్ నగర్, పెదగదిలి జంక్షన్ తదితర ప్రాంతాలలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మతో కలిసి పర్యటించి వార్డులోని సమస్యలపై మేయర్ కమిషనర్ తో చర్చించారు. ముఖ్యంగా ఆరిలోవ కళ్యాణమండపం పునర్ధర్మ పనులు వేగవంతం చేయాలని, ఆరిలోవ జంక్షన్ అభివృద్ధి, ఆరిలోవ ప్రధాన రోడ్డుపై ఉన్న దుకాణాలను తొలగించి వాటిని ఒక క్రమ పద్ధతిలో నిర్మించి తిరిగి వారికే ఇవ్వాలని, కేర్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేయడం, బీటీ రోడ్డు నిర్మించవలసి ఉందని మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా కమిషనర్ స్పందిస్తూ పనులు అంచలంచలుగా అభివృద్ధి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పట్టణ ప్రణాళిక అధికారి సునీత, డిడిహెచ్ దామోదరావు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, ఏఎంఓ హెచ్ కిషోర్, ఏఈ అప్పాజీ పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-14 08:14:47

అనకాపల్లి జిల్లాలో160 మందికి ప్రెస్ అక్రిడిటేషన్లు

అనకాపల్లి జిల్లాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విధులు నిర్వహించుచున్న 160  మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ప్రతిపాదనలను ఆమోదించామని జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్  రవి పట్టన్ శెట్టి తెలిపారు. కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంబంధించిన  విషయాలను చర్చించామన్నారు. అక్రిడిటేడ్ జర్నలిస్టులకు వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని  వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్,  జిల్లా కో ఆర్డినేటర్ డా.రాజేష్ ను ఆదేశించారు. ఇప్పటి వరకు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేయని జర్నలిస్టులు ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్.38, తేదీ 30-3-2023 ననుసరించి ధరఖాస్తు చేసుకొని సదరు ధరఖాస్తులను జిల్లా పౌర సంబంధాల కార్యాలయానికి అందజేయాలన్నారు. 
అంతకు ముందు జిల్లాలో నూతనంగా  ఏర్పాటైన కమిటీ సభ్యులు  జిల్లా కలెక్టర్ ను పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు  కె.చంద్రరావు, వి.లోవరాజు, కె.చంద్రశేఖర్, యస్ కె.చాంద్ బాష, టి.రమేష్, కార్మిక శాఖ, ఆర్.టి.సి, రైల్వే, హౌసింగ్ అధికారులు, కన్వీనర్, మెంబరు కె.ఇంద్రవతి తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-06-13 13:21:17

కాకినాడలో ప్రతీ మంగళవారం డయల్ యువర్ ఎస్పీ

ప్రజలకు సత్వరమే న్యాయం అందించాలనే లక్ష్యంతో  కాకినాడ జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్ “ డయల్ యువర్ ఎస్పి” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఆ విషయాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాకి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా ఫోనుచేసి ఎస్పికి  తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కలుగుతుంది.  ప్రతి మంగళవారం ఉదయం 11 నుంచి 12 గం.ల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజలు 0884- 2371744 అనే నెంబరుకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు ఫిర్యాదుపై నేరుగా అధికారులతో అక్కడ నుండే ఫోన్ కాల్ లో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలు, వేధింపులు, బెదిరింపలు తదితర సమస్యలపై బాధితులు డయల్ యువర్ ఎస్పి కార్యక్రమంలో ఫిర్యాదుచేయవచ్చనన్నారు.  ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్ కోరారు. ఈ పాత్రికేయ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పి అడ్మిన్ పి.శ్రీనివాస్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్  సిహెచ్.రామ కోటేశ్వరరావు, ఐ.టి. కోర్ ఇన్స్పెక్టర్  పి.శ్రీనివాసరావు, డిసిఅర్బి ఇన్స్పెక్టర్ పి.ఈశ్వరుడు, ఐ.టి. కోర్ ఎస్.ఐ.  డి.రామక్రిష్ణ  తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2023-06-13 07:40:00

ఏఎస్ఆర్ జిల్లాలో 2565.81 ఎకరాల భూమి పంపిణీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిరుపేదలకు భూముల పంపిణీ సంబంధించిన అసైన్మెంట్ కమిటీసమావేశం మంగళవారం జరిగింది. కమిటీ చైర్మన్, ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన మంగళవారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో జూoమీటింగ్ ద్వారా మంత్రి అమర్నాథ్ అధికారులు, అనధికారులతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో పాడేరు, అరకు,రంపచోడవరం ఎమ్మెల్యేలు కే భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణుడు, ధనలక్ష్మి ఎమ్మెల్సీలు, కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్, చింతూరు సబ్ కలెక్టర్ సూరజ్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్స్వాల్ తదితరులు పాల్గొన్నారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 550 మంది లబ్ధిదారులకు 777.45 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి సమావేశం ఆమోదం తెలిపింది.అలాగే పాడేరు నియోజకవర్గం సంబంధించి 561 మంది లబ్ధిదారులకు 499.53 ఎకరాల భూ పంపిణీకి రంగం సిద్ధం చేసింది. 

రంపచోడవరం నియోజకవర్గంలో 560 మంది లబ్ధిదారులకు 1288.83 ఎకరాల భూమినిపంపిణీ చేయాలని సమావేశం నిర్ణయించింది. మొత్తం మీద ఈ జిల్లాలో 1671 మంది లబ్ధిదారులకు 2565.81 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలుమాట్లాడుతూ తమ తమ నియోజకవర్గాలలో అర్హత కలిగిన వారు ఇంకా మిగిలి ఉన్నారని వారికి కూడా తగిన న్యాయం చేయాలని మంత్రి అమర్నాధుని కోరగా అటువంటి వారిని గుర్తించి రెండవ జాబితాలో చేర్చాలనిఆయన అధికారులను ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ భూములకు సంబంధించిన పత్రాలు లబ్ధిదారులకు అందజేయన్నామని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.

Visakhapatnam

2023-06-13 07:18:37

జిల్లాలో విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేయాలి

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానానికి స్వచ్చందంగా యువత ముందుకురావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థ, లయన్స్ బ్లడ్ సెంటర్, న్యూ శ్రీకాకుళం బ్లడ్ సెంటర్,జెమ్స్ బ్లడ్ సెంటర్, పలాసలోని ప్రాణదాత బ్లడ్ సెంటర్, రాజాం జిఎంఆర్ కేర్ బ్లడ్ సెంటర్ సౌజన్యంతో రక్తదాన కార్యక్రమం ఈ నెల 14,15వ తేదీల్లో నిర్వహించ బడతాయని చెప్పారు. రెవిన్యూ డివిజన్ స్థాయిలో జరిగే ఈ రక్తదాన కార్యక్రమం జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం రోజున శ్రీకాకుళంలో గల ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం వెనుకనున్న యువ శిక్షణ కేంద్రంలో, పలాస సామాజిక ఆరోగ్య కేంద్రం లోనూ, 15న టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాలు నిర్వహించబడ నున్నట్లు కలెక్టర్ వివరించారు. 

కావున ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థలు, వివిధ సంఘాలు, పెద్దసంఖ్యలో యువత పాల్గొని విరివిగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఒకరి రక్తదానం వలన ఇరువురి ప్రాణాలను కాపాడవచ్చని గుర్తుచేశారు. జిల్లాలో రోగులకు సరిపడా రక్తనిల్వలు లేవని, కావున ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకువచ్చి రక్తదానం చేయాలని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా జిల్లాలోని యువత ముందుకురావాలని, ఒకసారి రక్తదానం చేసినప్పటికీ ప్రతి ఆరు మాసాలకు రక్తదానం చేయవచ్చని సూచించారు. ఆరోగ్య వంతులైన యువత ప్రతి ఆరు మాసాలకు ఒకసారి రక్తదానం చేయడం వలన మరింత ఆరోగ్య వంతులుగా, నూతన ఉత్తేజంతో ఉంటారని చెప్పారు.

Srikakulam

2023-06-12 12:51:56

టీడీపీ ట్రాప్ లో బీజేపీ -టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్‌లో పడిందని, చెప్పుడు మాటలు వింటే ఆ పార్టీకే నష్టమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.  సోమవారం  విశాఖ రైల్వే స్టేషన్ దరి జ్ఞానాపురం ఎర్నిమాంబ దేవాలయం పునర్నిర్మాణ, ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తాజాగా ఏపీ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. పసుపు కండువా మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వాళ్ళు చెప్పిన మాటలను అమిత్ షా పలకడం దారుణమన్నారు. చిత్తశుద్ధితో నడుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేశారన్నారు. తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో చెప్పి అప్పుడు బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే బాగుండేదని ఆయన సూచించారు. 2014-19మధ్య టీడీపీ ప్రభుత్వ అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందన్నారు. 2014 ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెబితే వినాలని ఏపి ప్రజలు చూస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కనీసం ఒక్క మాటైన చెప్పకుండా 20 పార్లమెంట్ సీట్లు ఇవ్వండని విశాఖ వాసులను అడగడం ఏంటని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ వెస్ట్ ఇన్ ఛార్జి ఆడారి ఆనందకుమార్, కార్పోరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-12 12:21:19

ప్రజాసమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్టు రాజమహేంద్రవరం మున్సిపల్ కమీషనర్ కె.దినేష్ కుమార్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజలు హాజరైన కమిషనర్ కు పలువురు వినతులు అందచేశారు. మంచినీరు, పారిశుద్యం, ఇంటిపన్ను మార్పు వంటి  తదితర అంశాలపై 16 మంది అర్జీలరు అందచేశారు. ఇంటి పన్ను వెయ్యడం లేదని సింహాచల్ నగర్ కి చెందిన ఏ స్వప్న,  ఏవి అప్పారావు రోడ్ నందు బాబానగర్ 6వ వీధి నివాసులు స్పిరిట్ హౌస్ కిచెన్ గది నుంచి కాలుష్యం,  డి జే శబ్ద కాలుష్యం పై పరిష్కారం కోసం ఐ. కిషోర్ కుమార్ తదితరులు, గాదాలమ్మ నగర్ వాసులు డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం, భారీ వాహనాలు వలన ఇబ్బందుల పై పలువురు అపార్ట్మెంట్ వాసులు అర్జి అందచేశారు. ఈ కార్యక్రమంలో  అదనపు కమీషనర్ పియం సత్యవేణి, సిటీ ప్లానర్ జె. సూరజ్ కుమార్, ఇతర మునిసిపల్ అధికారులు  పాల్గొన్నారు.

Rajamahendravaram

2023-06-12 12:13:22

GVMCలో డయల్ యువర్ మేయర్, జగనన్నకు చెబుదాం

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో ప్రతీ సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటలకు వరకూ, జనగన్నకు చెబుదాం కార్యక్రమం 11 నుంచి ఒంటి గంటవరకూ నిర్వహిస్తారని  మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా నగర ప్రజలు వారి సమస్యలను నేరుగా ఫోను ద్వారా ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చునన్నారు. అదేవిధంగా జనగన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా జివిఎంసీ కమిషనర్ కి ఫోన్ చేసి ఫిర్యాదులు, సమస్యలు తెలియజేయవచ్చునన్నారు. ప్రజల సౌకర్యార్ధం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా నగరంలోని అన్నివార్డుల్లోని సచివాలయాల్లోనూ జగనన్నకు చెబుదాం కార్యక్రమాల నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు. ఫోను కలవలేని వారు సచివాలయాలకు వెళ్లి తమ సమస్యలు అర్జీలు సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు.

Visakhapatnam

2023-06-11 13:45:54

స్వచ్ఛ సర్వేక్షణ్-2023 లో ప్రథమ స్థానమే లక్ష్యం

స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ప్రథమ స్థానమే లక్ష్యంగా నగర ప్రజల సహకారంతో సాధిస్తామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఆర్కే బీచ్ కాళీమాత గుడి నుండి సబ్మేరియన్ వరకు  1కె వాక్ జివిఎంసి కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, డిప్యూటీ మేయర్ జయ్యాని శ్రీధర్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో దేశములోనే విశాఖ నాలుగవ స్థానం సాధించిందని, అలాగే ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చి విశాఖ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం అడిగిన ప్రశ్నలకు ప్రజలు ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే నగర స్వచ్ఛతకు జివిఎంసి యంత్రాంగం ఎంతో కృషి చేస్తుందని అలాగే స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి ర్యాంకకు కృషి చేయాలన్నారు. విశాఖ నగరాన్ని పరిశుభ్రత నగరంగా తీర్చిదిద్దేందుకు “ఇకో-వైజాగ్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ప్రజల అవగాహన కొరకు 1కె వాక్ ప్రారంభించడం జరిగిందన్నారు. 

ముఖ్యంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నగరంలో పూర్తిగా నిషేధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి ప్లాస్టిక్ నిషేధంపై ఆదేశాలిచ్చారని, ప్లాస్టిక్ వలన కలిగే అనర్ధాలు ప్రజలందరికీ వివరించి ప్లాస్టిక్ బదులు ప్రత్యామ్నాయ వస్తువులైన క్లాత్ బ్యాగులను ఉపయోగించే విధంగా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. విశాఖ నగరంలో ఇప్పటికే నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలన అమల్లో ఉందని అయినప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు తక్కువ ధరకే దొరుకుతుందన్న నిషేధత ప్లాస్టిక్ ని వినియోగిస్తున్నారని వారి కొరకు ప్రత్యేక స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశామని ప్లాస్టిక్ కలిగి ఉన్న దుకాణదారుల నుండి భారీ స్థాయిలో అపరాధ రుసుం  వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 

  అనంతరం జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో విశాఖ నగరానికి మొదటి ర్యాంకే లక్ష్యంగా అందరి సహకారంతో సాధిద్దామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో “ఇకో-వైజాగ్” అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యంగా ప్లాస్టిక్ను నిర్మూలించవలసి ఉందని, వ్యాపారస్తులు ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలని, పచ్చదనం పెంపొందించడం, పారిశుద్ధ్యం, భూగర్భ మురుగనీరు, సేంద్రియ ఎరువు, పొల్యూషన్ వీటన్నిటిపై జివిఎంసి దృష్టి సారించి దేశంలోనే విశాఖ నగరాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో బృందం అడిగిన ప్రశ్నలకు ప్రజలు మంచి ఫీడ్ బ్యాక్  ఇవ్వాలన్నారు. విశాఖ నగరానికి ఎంతోమంది దేశ విదేశీయులు పర్యాటకులు, సందర్శకులు వస్తారని వారందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ప్లాస్టిక్ మరియు  పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు స్వచ్ఛభారత్ అంబాసిడర్లు, ఎన్జీవోస్,  స్వచ్ఛంద సంస్థలు, ఆర్డబ్ల్యూఎస్, నగర పౌరులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

 ముఖ్యంగా విశాఖ నగరానికి ఎంతో సువిశాలమైన తీర ప్రాంతం ఉందని ఎంతోమంది పర్యాటకులు వస్తారని అందుకు విశాఖ నగర తీరంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని, సముద్ర జలాలలో ప్లాస్టిక్ కలవకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. 1 కె వాక్ ద్వారా స్వచ్ఛత,  పారిశుధ్యం, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు నగరంలోని ప్రతి జోన్ పరిధిలో ప్రత్యేక  స్క్వాడ్ ఏర్పాటు  చేసామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జయ్యాని శ్రీధర్, జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు, డి సి ఆర్ పణిరామ్, కార్యదర్శి  నల్లనయ్య,  జోనల్ కమిషనర్లు, ఏఎంఓహెచ్, స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, స్వచ్ఛంద సంస్థలు నగర పౌరులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-11 09:56:10

సింహాద్రి అప్పన్నను దర్శించుకన్న తెలంగాణ గవర్నర్

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిని శనివారం తెలంగాణ గవర్నర్  తమిళసై సౌందర్య రాజన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నరసింహారాజు స్వాగతం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా గవర్నర్ కప్పస్తంభం అలింగణం చేసుకున్నారు. అనంతరం స్వామివా రి ఆరాధన సేవలో పాల్గొని అనంతరాలయ దర్శనం చేసుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాలను అందించారు. గవర్నర్ తో పాటు  రాజ్ భవన్ ఎడిసి అక్షసయ్య యాదవ్,  ఆర్డీవో భాస్కర్ రెడ్డి, పెదగంట్యాడ తాసిల్దార్ రమాదేవి, చిన్న వదిలి ఆర్ ఐ మల్లేశ్వరరావు, గోపాలపట్నం సిఐ మరియు ఎస్ఐలు, పర్యవేక్షకులు కనకరాజు, పీఆర్వో నాయుడు, ధర్మకర్త మండలి సభ్యురాలు రాజేశ్వరి లు పాల్గొన్నారు.

Simhachalam

2023-06-10 16:15:11

కేంద్ర మంత్రుల సభకు 950 మందితో భారీ బందోబస్తు

విశాఖలో ఈనెల11న కేంద్ర హోం మంత్రి అమిత్ షా  విశాఖ పర్యటన, బహిరంగ సభ సందర్బంగా నలుగురు డిసిపీలు, రెండు ఏ.పి.ఎస్.పి ప్లటూన్లు,04 స్పెషల్ పార్టీ లతో మొత్తముగా 950 సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ డా.త్రివిక్రమవర్మ తెలియజేశారు. ఈ మేరకు శనివారం సిపి కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి  పర్యటించే ప్రాంతాలైన ఐ.ఎన్.ఎస్ డేగ,ఎయిర్పోర్ట్, వాల్తేరు రైల్వే గ్రౌండ్స్ బస చేయు పోర్టు గెస్ట్ హౌస్, సాగర్ మాల కన్విక్షన్ సెంటర్ తో పాటూ కేంద్ర హోం మంత్రి పర్యటించనున్న ప్రతీ ప్రాంతంలో పటిష్ట బందొబస్తు ఏర్పాటు చేశామన్నారు. రైల్వే ఫుట్ బాల్ గ్రౌండ్స్ లో సాయంకాలము బహిరంగ సభ ఏర్పాటు, సభకు ప్రజలు హాజరు, ప్రముఖుల పర్యటన సందర్బముగా  ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 10వ తేది మద్యాహ్నము 02 గంటలనుండి రాత్రి 09 గంటల వరకు ఈ క్రింది తెలిపిన మార్గముల ద్వారా వాహనములు ప్రయాణించుటకు అనుమతి లేనందున ప్రత్యామ్న్యాయ మర్గాములలో ప్రయాణించి  ట్రాఫిక్ పోలీస్ కి సహకరించ వలసినిదిగా విజ్ఞప్తి చేశారు.

వాహనాల దారి మళ్లింపు ఇలా..
1)బహిరంగ సభకు వచ్చే బస్సులు TC పాలెం/28 బస్ స్టాప్ వద్ద, సదరు బస్సులు ఆశీర్వాద కళ్యాణ మండపము వైపు వున్న రోడ్ మార్జిన్ లో మరియు 
DLB గ్రౌండ్స్ లో, విశాఖ  పోర్ట్ హాస్పిటల్ వద్ద వున్న Inarbit మాల్ గ్రౌండ్స్ లో తమ తమ వాహనములలోని ప్రజలని దించిఅక్కడే పార్కు చేసుకొనవలెను. 2)బహిరంగ సభకు వచ్చే ద్విచక్ర వాహనములు  TC పాలెం/28 బస్ స్టాప్ వద్దా పార్కింగ్ చేసుకోవలెను అదే విధముగా ఆటోలు  కేంద్రీయ విద్యాలయం వరకు గల 80 ఫీట్ రోడ్ మార్జిన్ లో పార్కింగ్ చేసుకోవలెను. 3)కంచరపాలెం మెట్టు నుండి అక్కయ్యపాలెం 80 feet రోడ్ లో వున్న  మహారాణి పార్లర్ వరకు మరియు TC పాలెం నుండి DLO జంక్షన్ వరకు ఎటువంటి వాహనములు కు అనుమతి లేదు కావునా ప్రత్యామ్నాయ మర్గాలలో ప్రయాణించాల్సి వుంటుంది.  పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా.. నగర పర్యటన సజావుగా సాగేలా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-10 15:55:35

నిత్యం సమాజ శ్రేయస్సుకోసం శ్రమించేది పాత్రికేయులే

సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే పాత్రికేయుల పాత్ర సమాజంలో కీలకమైనదని జిల్లా ఇంచార్జి మరియు   రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు . శనివారం ఉదయం జగదాంబ జంక్షన్ దగ్గర డాల్ఫిన్ డయోగ్నస్టిక్ సెంటర్లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య శిభిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున , ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ  ఎన్ని కష్టాలు ఉన్నా జర్నలిస్టులు విలువల కోసం పని చేస్తారని, వారి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ డాల్ఫిన్ డయోగ్నస్టిక్ సెంటర్లో రూ.10,000 పైబడి ఖరీదు చేసే 56 రకాల అన్ని వైద్య పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా వైద్యపరీక్షల అనంతరం అవసరమయ్యే అత్యవసర చికిత్సను కూడా ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలో మరిన్ని నగరాల్లో జర్నలిస్టుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ  ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టు పాత్రను కొనియాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 495 మంది జర్నలిస్టులకు అక్రిడియేషన్ కార్డులను రెండు విడతలగా మంజూరు చేసినట్లు తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అక్రిడిటేషన్  కలిగిన 495  జర్నలిస్టులకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసుకొనుటకు డాల్ఫిన్ డయాగ్నస్టిక్స్ సంస్థ ఆధ్వర్యంలో వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజుకి సుమారు 30 మందికి సేవలు అందించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మంజూరు కాబడిన అక్రిడిటేషన్ కార్డుదారులందరూ ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్  స్కీమ్ కు సంబంధించి ఆరోగ్య భీమా మొత్తాన్ని సిఎస్ఆర్ నిధులనుంచి చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 

  భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్య, విద్య రంగాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు సమాజ చైతన్యం కోసం నిత్యం పనిచేస్తూ అనేక ఒత్తిడులు ఎదుర్కొంటారని అన్నారు.   జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులకు ప్రభుత్వ తరుపున  ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం 2023-24 సంవత్సరానికి నూతనంగా మంజూరు కాబడిన అక్రిడిటేషన్ కార్డులను అక్రిడిటెడ్  జర్నలిస్టులకు మంత్రి అందజేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన 300 మంది "వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్" సంబంధించి బీమా మొత్తం రూ.3,75,000/-   విలువగల చెక్కును జర్నలిస్టులకు అందజేసారు. జర్నలిస్టు హెల్త్  కార్డులను జర్నలిస్టులకు అందజేసారు.  అక్రిడిటేడ్   వర్కింగ్ జర్నలిస్టులకు రూ.10,000 పైబడి ఖరీదు చేసే 56 రకాల  వైద్య పరీక్షలను ఉచితంగా  అందిస్తున్న డాల్ఫిన్ డయాగ్నసిస్ సెంటర్ డా.వి.సురేష్, డా.లక్ష్మీ ప్రసూనలను ఈ సందర్భంగా  రాష్ట్రమంత్రి విడదల రజిని మరియు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం హెల్త్ చెకప్ కి సంబంధించి టెస్టుల వివరాల కరపత్రాన్ని మంత్రి జిల్లా కలెక్టర్ , ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎం.పి ఎంవివి సత్యనారాయణ, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, విఎమ్ఆర్డిఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు,ఆర్డీవో  హుస్సేన్ సాహెబ్, సమాచార శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి మణిరామ్ , కార్పొరేటర్లు , వైద్య సిబ్బంది, ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-06-10 14:35:12

విశాఖలో కేంద్ర మంత్రులతో 11న బహిరంగ సభ

విశాఖలో ఇద్దరు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి లతో భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. 11వ తేదీన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా విశాఖ పర్య టన షెడ్యూల్ ఖారారైంది. దేశ ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటరీ నియోజక వర్గ కేంద్రాల్లో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్న బీజేపీ ఒఢిశా బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదంతో కాస్త తగ్గింది. దీంతో మళ్లీ బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. అయితే గతంలో కన్నా ఈ సారి కాస్త తక్కువ మందితోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విశాఖలో నిర్వహించనున్న మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 11న ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు ర్యాలీగా వెళ్లి ఎయిర్ పోర్టులో సాదర స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రి 7గంటలకు నగరంలోని తాటిచెట్లపాలెం రైల్వే గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో పోర్ట్ సాగరిక కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా సమావేశమవుతారు. పోర్ట్ గెస్ట్ హౌస్ లో ఆరోజు రాత్రి బస చేస్తారు. సోమవారం ఉదయం వివిధ ఆలయాల సందర్శన అనంతరం ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. అమిత్ షా వెంట కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డితో పాటు వివిధ విభాగాల ఇన్ఛార్జిలు మురళీధర్, దేవధర్ సహా పలువురు ఎంపీలు హాజరు కానున్నారు.

Visakhapatnam

2023-06-08 15:13:15

గంగవరం పోర్టు ఉద్యోగులకు విద్యార్హతలను బట్టే జీతాలు

గంగవరం పోర్టులో పని చేస్తున్న కార్మికులందరికీ వారి విద్యార్హతలను బట్టి సమానపనికి సమాన వేతనం చొప్పున ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు,  గంగవరం పోర్టు కార్మికులు,  కార్మిక సంఘాలు, పోర్టు యాజమాన్యంతో జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయి. గంగవరం పోర్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని ముందుగా ఆయన పిలుపునిచ్చారు. కార్మికులు, కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై పోర్టు యాజమాన్య ప్రతినిధుల నుండి వివరణ తీసుకున్నారు. కార్మికుల సమస్యలపై యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన  వివరణ ప్రకారం కార్మికులు అందరూ శాశ్వత ఉద్యోగులేనని, గంగవరం పోర్టు లిమిటెడ్ మరియు గంగవరం పోర్ట్ సర్వీసెస్ ఉద్యోగులకు ఒకే   విధంగా పరిగణిస్తామని తెలిపారు.  కార్మికులకు అందిస్తున్న  ప్రత్యేక అలవెన్స్  రెట్టింపు చేయాలని,  కార్మికుల విద్యార్హతలను పరిగణనలోనికి తీసుకొని  సాంకేతిక విద్యార్హతలు గల కార్మికులకు  స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించి  వారికి అదనంగా 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని  పోర్టు  యాజమాన్యాన్ని కలెక్టర్ ఆదేశించారు. 


 తొలగించిన కార్మికులను వారి నుండి వివరణ  తీసుకొని తిరిగి నియామకం  చేయాలన్నారు. బేసిక్ పే పెంపు అంశం ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని దాని గూర్చి ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.  కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించుటకు  ఈఎస్ఐ ఆసుపత్రుల్లోనే కాకుండా, ఇతర ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించుటకు  చర్యలు తీసుకోవాల్సిందిగా  పోర్టు యాజమాన్యానికి తెలిపారు. పోర్టు యాజమాన్యం సామాజిక బాధ్యతగా  పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచుటకు కృషి చేయాలన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ అనంతరం వచ్చే గ్రాట్యూటి వీలైనంత ఎక్కువ అందించేందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు.  కార్మికుల యూనియన్ బిల్డింగు  పోర్టు ఆవరణ బయట  నిర్మించుకొనుటకు నిధులు అందజేస్తామన్నారు. కార్మికులకు రుణాలు మంజూరు విషయమై  బ్యాంకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. పోర్ట్  యాజమాన్యం కార్మిక సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యలను  వారం రోజుల్లో  నివేదిక  సమర్పించాలన్నారు.

   కార్మికులకు సమస్యలు ఉంటే  నేరుగా కలెక్టరుకు  తెలియజేయవచ్చునని, పోర్టు సాధారణ  కార్యకలాపాలకు  కార్మికులు అంతరాయం కలిగించకూడదని,  యాజమాన్యంతో చర్చించి  మెరుగైన ఫలితాలను పొందాలని సూచించారు.   గాజువాక శాసనసభ్యులు  తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ  గంగవరం పోర్టు లిమిటెడ్  మరియు గంగవరం పోర్టు సర్వీసెస్  ఉద్యోగులను  ఒకే విధంగా పరిగణించాలన్నారు. 
కార్మికుల తరఫున  నొల్లి  తాతారావు, మాత అప్పారావు మాట్లాడుతూ   కనీస వేతనం అమలు, బేసిక్ పే పెంపు, జిపిఎస్, గ్రాట్యూటీ, డస్ట్ అలవెన్స్, కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, కార్మికులకు వైద్య సదుపాయం తదితర 11 అంశాల సమస్యలను తెలుపగా,  కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు నిలుపుదల చేయాలని,  పునరావాస  ప్యాకేజీ లో నియమితులైన  ఉద్యోగులు  శాశ్వతమా,  తాత్కాలికమా  వివరణ కావాలని, గంగవరం పోర్టు లిమిటెడ్ మరియు  గంగవరం పోర్టు సర్వీసెస్  సంస్థల ఉద్యోగులను ఒకే విధంగా పరిగణించాలని  కోరగా   ఆయా అంశాలపై   సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.జె.  రావు , సీనియర్  అడ్వైసర్ సాంబశివరావు , సిఈఓ బి.జి  గాంధీ, మాజి శాసనసభ్యులు పల్లా శ్రీనివాస రావు ,ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్, జనరల్ మేనేజర్ డిఐసి సిహెచ్  గణపతి,  లేబర్ డిప్యూటీ కమిషనర్ సునీత, డిసిపి ఆనంద్ రెడ్డి,  ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘ నాయకులు,  తదితరులు పాల్గొన్నారు .

Visakhapatnam

2023-06-08 13:09:24

వైభవంగా శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి చక్రస్నానం

 అప్పలాయగుంట  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకి  ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8.45 నుండి 10.15 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు న‌వ‌సంధి, మాడ‌వీధి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఈవో రమేష్, సూపరింటెండెంట్‌  వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  శివ కుమార్ పాల్గొన్నారు.

Appalayagunta

2023-06-08 12:59:02