1 ENS Live Breaking News

సీఎం వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన..

తిరుమలలోని శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి చేపట్టనున్న ప్రారంభోత్స‌వాలు ప్ర‌దేశాల‌ను, అక్క‌డి ఏర్పాట్ల‌ను ఇంజినీరింగ్‌, భ‌ద్ర‌తా అధికారుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప‌రిశీలించారు. ముందుగా అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో నిర్మాణం పూర్త‌యిన పైక‌ప్పును ప‌రిశీలించారు. అనంత‌రం అలిపిరి పాదాల మండపం వ‌ద్ద ప‌నులు పూర్త‌యిన‌ గోమందిరంలో గోపూజ‌, గోతులాభారం, గోవిజ్ఞాన కేంద్రం ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. గోమందిరం లోప‌లికి వెళ్లేందుకు, వెలుప‌లికి వ‌చ్చేందుకు జ‌రుగుతున్న రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. లైటింగ్‌, వైరింగ్ త‌దితర ప‌నుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనంత‌రం ఎస్వీ పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వ ఏర్పాట్ల‌పై ఈవో తన ఛాంబ‌ర్‌లో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఆసుప‌త్రి వివ‌రాల‌తో మూడు నిమిషాల నిడివి గ‌ల వీడియో త‌యారు చేయాల‌ని బ‌ర్డ్ అధికారుల‌ను ఆదేశించారు. ఆసుప‌త్రిలో త‌గినంత మంది వైద్య సిబ్బంది, పారామెడిక‌ల్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు. ఈ స‌మావేశంలో టిటిడి జెఈవో వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ  జ‌గదీశ్వ‌ర్‌రెడ్డి, సిఎంఓ డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌, సిఎస్ ఆర్ఎంవో  శేష‌శైలేంద్ర‌, ప్ర‌త్యేకాధికారి డాక్ట‌ర్ ఆర్‌.రెడ్డెప్ప‌రెడ్డి, డాక్ట‌ర్ శ్రీ‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-05 10:47:23

అప్పన్న నిత్యాన్నధాన పథకానికి రూ.1,00,116

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి నిత్యన్నధాన పథకానికి విశాఖలోని వేపగుంట అప్పన్నపాలెంకు చెందిన కేవీఆర్వీ లక్ష్మీ, కృష్ణారావు దంపతులు ఒక లక్షా నూట పదహారు రూపాయలు (రూ.1,00,116 ) విరాళమిచ్చారు. ఆ మొత్తాన్ని దేవస్థానంలో సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, తమ పెళ్లిరోజైన ఫిబ్రవరి 24వ తేదీన స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని కోరారు. ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలం పనిచేసిన తాము రిటైరయ్యామని స్వామివారి దయవల్ల చల్లగా ఉన్నామని లక్ష్మీ, కృష్ణారావు దంపతులు తెలిపారు. అనంతరం స్వామివారి దర్శినం చేసుకోని, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాలను దాతలకు అందజేశారు.

Simhachalam

2021-10-05 10:28:51

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు..

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణంకు ఊప‌యోగించే దర్భ చాప, తాడును వ‌రా‌హ‌స్వామి అథితి గృహా‌ల వ‌ద్ద ఉన్న టిటిడి అట‌వీ విభాగం కార్యాల‌యం నుండి మంగ‌ళ‌వారం  డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాసులు రెడ్డి, సిబ్బంది ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకొచ్చారు. అనంత‌రం శ్రీ‌వారి ఆల‌యం రంగ‌నాయ‌కుల మండ‌పంలోని శేష‌వాహ‌నంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 7వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ధ్వజస్తంభం  మీదకు గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్బతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్బలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో  విష్ణు దర్బ ఉపయోగిస్తారు.  ఇందుకోసం వడమాల పేట పరిసర ప్రాంతమైన చెల్లూరు పంటకాలువల మీద పెరిగే ఈ దర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరిస్తారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెడతారు. ఆ తరువాత దర్బను బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేస్తారు. ధ్వజారోహణంకు 5.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 175 అడుగుల తాడు అవసరం అవుతాయి.  అయితే అటవీశాఖ ఈ సారి 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడు సిద్ధం చేసింది.   ఈ కార్యక్రమంలో విజివో  బాలిరెడ్డి, ఎఫ్‌ఆర్‌వోలు  ప్ర‌భాక‌ర్‌రెడ్డి,  స్వామి వివేకానంద‌, వెంక‌ట‌సుబ్బ‌య్య‌, ఎవిఎస్వోలు  సురేంద్ర‌, గంగ‌రాజు పాల్గొన్నారు.        

Tirumala

2021-10-05 10:26:45

గృహ నిర్మాణాలకు ఇసుక కొరత ఉండదు..

శ్రీకాకుళంజిల్లాలో గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఇసుక కొరత ఉండబోదని జేపీ గ్రూప్ స్పష్టం చేసింది. జిల్లాలో ఇసుక పరిస్థితిపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, జేపీ గ్రూప్ తో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మంగళవారం ఉదయం సమీక్షించారు. జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ఇసుక కొరత ఎక్కడ ఉండరాదని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత కూడా సృష్టిస్తున్నారు అనే ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇసుక ఉత్పాదనలో ముందు వరుసలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స్థానిక సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించుకుని ఇసుక సరఫరాలో ఎటువంటి సమస్యలు, లోపాలు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఇసుక రీచ్ లలో లేదా ఇసుక స్టాక్ పాయింట్ లో సమస్యలు, నిర్వహించలేని పరిస్థితి ఉంటే దాన్ని వ్రాతపూర్వకంగా సమర్పించాలని వాటిని అవసరం మేరకు ప్రభుత్వ విభాగాల ద్వారా నిర్వహించుటకు చర్యలు చేపడతామని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 26 రీచ్ లు పనిచేస్తున్నాయని, ఎక్కడ సమస్య ఉన్నా తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి స్టాక్ పాయింట్ వద్ద ప్రభుత్వ భవనాల నిర్మాణం, గృహ నిర్మాణాలకు వచ్చే వాహనాలకు ప్రత్యేక వరుస ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఇసుకకు వచ్చే వాహనాలకు టోకెన్లు ఉండాలని, వెళ్లే సమయం, గమ్యస్థానానికి చేరే సమయం, వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య కూడా టోకెన్ లో ముద్రించాలని ఆయన సూచించారు. ప్రతి రీచ్ వారీగా పక్కాగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. టెక్కలిలో గురు వారం నాటికి స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.  సమస్యలు ఉంటే వాటిని దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉంచరాదని, వాటిని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకు రావడం వలన అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. గనుల శాఖ, ఎస్.ఇ.బి సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. 

 జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేక వరసలు ఉండటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.  జేపీ గ్రూప్ సీఈఓ వి.ఎం.విష్ణునాథ్  మాట్లాడుతూ జిల్లాలో 19 రీచ్ లలో మ్యాన్యువల్ నుండి యంత్రాలు  ఉపయోగించుటకు అనుమతులు కోరామన్నారు. గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు.జగనన్న గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇసుక కొరత ఉండబోదని ఎప్పటికప్పుడు ఇసుక సరఫరా చేయుటకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. స్టాక్ పాయింట్ వద్ద ఇసుక ప్రదర్శించనున్నారని, అదే అంశాన్ని ప్రజలకు పత్రికల ద్వారా తెలియజేయుటకు కూడా చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. కనీస ధరతో గమ్య స్థానం వరకు చేరుటకు అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. టెక్కలి లో దేవదాయ శాఖ భూమిలో స్టాక్ పాయింట్ నిర్వహించడం జరుగుతుందని, మరో రెండు సంవత్సరాలు నిరభ్యంతర పత్రం జారీ ద్వారా స్టాక్ పాయింట్ నిర్వహించే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఈబి ఏఎస్పి కే. శ్రీనివాసరావు, గనుల శాఖ ఉపసంచాలకులు సిహెచ్ . సూర్య చందర్రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.గణపతి, ప్రజా ఆరోగ్య శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ పి. సుగుణకరరావు,  వివిధ శాఖల ఇంజనీర్లు, జేపీ గ్రూప్ మేనేజర్ ఎన్. గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-05 09:26:59

పరిశుభ్రత కోసం తల్లుల్లో అవగాహన పెంచాలి..

పరిశుభ్రత కోసం పిల్లలు తమ తల్లుల్లో అవగాహన పరచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ విద్యార్థులకు సూచించారు.  మంగళవారం స్వేచ్ఛ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభ కార్యక్రమంనకు శ్రీకాకుళంలో ఏవియన్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల నుండి హాజరైన అనంతరం పాఠశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడారు. పాఠశాలలో రన్నింగ్ వాటర్ వస్తుందా లేదా అని అడుగగా రన్నింగ్ వాటర్ వస్తుందని విద్యార్థులు తెలియజేశారు.  గతంలో ఫ్యాన్ లు ఎన్ని ఉన్నాయని కలెక్టర్ విద్యార్థులను అడుగగా కారుణ్య అనే విద్యార్థి మాట్లాడుతూ  గతంలో రూంలో ఒక ఫ్యాన్ మాత్రమే ఉండేదని, ప్రస్తుతం 8 ఫ్యాన్లు ఉన్నాయని కలెక్టర్ కు వివరించారు.  మేఘన అనే విద్యార్థి మాట్లాడుతూ గతంలో పెయింటింగ్ ఉండేది కాదని, ప్రస్తుతం పాఠశాలలో పెయింటింగ్, బాలికలకు, బాలురకు వేరు, వేరుగా మరుగుదొడ్లు ఉన్నాయని తెలిపారు. పాఠశాల నాడు ఎలా ఉందని, ప్రస్తుతం ఎలా ఉందని విద్యార్థులను అడుగగా  నేడు కలెక్టర్ అడుగగా గతంలో కంటే ప్రస్తుతం చాలా బాగుందని విద్యార్థులు తెలిపారు.  పరిశుభ్రత విషయంలో ఎలాంటి సిగ్గు లేకుండా తల్లులకు కూడా పరిశుభ్రత గూర్చి అవగాహన పరచాలన్నారు.  మొదటి నుండి శుభ్రత పాటస్తేనే వ్యాదులకు దూరంగా ఉండొచ్చునని తెలిపారు.  భోజనాలు ఎలా పెడుతున్నారు, మెనూ అమలు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ విద్యార్థులను అడుగగా భోజనాలు బాగున్నాయని, మెనూ కూడా అమలు చేస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ కు వివరించారు. భోజనాలు పై ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  వంద రూపాయలు నోటు తీసుకొని నోటుపై ఎన్ని భాషలు ఉన్నాయో చూడాలని విద్యార్థులకు ఆయన సూచించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఇన్ ఛార్జ్ డిఇఓ జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష అభియాన్ ఏపిసి తిరుమల చైతన్య, పి.ఇందిరామణి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-05 07:52:48

బాలికల ఆరోగ్య పరిశుభ్రతే ప్రభుత్వ ధ్యేయం..

బాలికల ఆరోగ్య పరిశుభ్రతే ధ్యేయం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చిన్న కారణాల వలన విద్యలో వెనుకబాటు ఉండరాదని, విద్యకు స్వస్తి పలుకరాదని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళ వారం ముఖ్య మంత్రి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా కిషోర బాలికలకు నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 7 నుండి 12 వ తరగతి వరకు గల కిషోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏదాదికి 120 నాప్కిన్స్ అందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు దాదాపు రు 32 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 23 శాతం మంది బాలికల చదువులు ఆగిపోవడానికి నెలసరి పీరియడ్స్ లో ఏర్పడుతున్న ఇబ్బందులు కారణమని ఐక్యరాజ్య సమితి పారిశుధ్య విభాగం నివేదిక తెలియజేసింది. ఈ అంశాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వయస్సు పరంగా వస్తున్న మార్పుల పట్ల అరోగ్య పరంగా తీసుకోవలసిన సూచనలు, సలహాలు అందించాలని సూచించారు. మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులు చైతన్యం కల్పించాలని అన్నారు. దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం పట్ల కూడా ప్రతి నెల అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఒక మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకులు నోడల్ అధికారిగా నియమించడం జరుగుతోందని చెప్పారు. పర్యావరణ హితంగా డిస్పొజ్ చేయుటకు. రాష్ట్రంలో 6417 ఇన్సినేటర్లు ద్వారా డిస్పోజ్ చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీకాకుళంలో   ఏవియన్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాకు 22 లక్షల శానిటరీ నాప్కిన్ లు సరఫరా అయ్యాయన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న 5,742, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న 2,731, ప్రాథమిక, ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాటశాలల్లో చదువుతున్న 60,391 మంది వెరసి 68,864 మందికి పంపిణీ చేశామన్నారు. శారీరక పరిశుభ్రత గూర్చి అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులను సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఇన్ ఛార్జ్ డిఇఓ జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష అభియాన్ ఏపిసి తిరుమల చైతన్య, పి.ఇందిరామణి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-05 07:50:03

శ్రీ సూర్యనారాయణ స్వామివారికి మంత్రి అవంతి పూజలు..

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. సోమవారం అరసవల్లి శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనములు పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్య ప్రకాష్ మంత్రికి సన్మానించి సూర్యనారాయణ స్వామి వారి ఛాయాచిత్ర ఫొటో ను అందజేశారు.  ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషోర్, తహసీల్దార్ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-04 16:37:18

ఓటరు సవరణకు రాజకీయపార్టీలు సహకరించాలి..

ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ (ఎస్ఎస్ఆర్‌)-2022 కార్య‌క్ర‌మం ద్వారా దోష‌ర‌హిత ఓట‌రు జాబితాల రూప‌క‌ల్ప‌న ప్ర‌క్రియ న‌వంబ‌ర్ 1 నుంచి ప్రారంభం కానుంద‌ని, ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి స‌హ‌క‌రించాల‌ని గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ కోరారు. ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ‌-2022, పోలింగ్ కేంద్రాల హేతుబ‌ద్ధీక‌ర‌ణ, కొత్త‌గా ఓట‌ర్ల న‌మోదు త‌దిత‌ర అంశాల‌పై సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్‌.. అధికారుల‌తో క‌లిసి వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాదుతూ ప్ర‌స్తుతమున్న 4,597 పోలింగ్ కేంద్రాల‌కు అద‌నంగా మ‌రో నాలుగు కేంద్రాల ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు అందిన‌ట్లు తెలిపారు. చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్-ఏపీ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ (ఎస్ఎస్ఆర్‌)-2022 కింద నవంబరు 1వ తేదీన ఇంటిగ్రేటెడ్ ఓటరు జాబితాల ముసాయిదాలను ప్రచురించి, అప్ప‌టి నుంచి నవంబరు 30 వ‌ర‌కు క్లెయిములు, అభ్యంతరాలు స్వీక‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకు మాన్యువ‌ల్ విధానంతో పాటు ఎన్‌వీఎస్‌పీ పోర్ట‌ల్‌, ఓట‌ర్ హెల్ప్‌లైన్ యాప్ (వీహెచ్ఏ)ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌న్నారు. 2022, జనవరి 5వ తేదీన ఓటరు జాబితాల తుది ప్రచురణ జ‌ర‌గ‌నుంద‌న్నారు. 2022, జ‌న‌వ‌రి 1 అర్హ‌త తేదీగా కొత్త‌గా ఓట‌రుగా పేరు న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని, న‌వంబ‌ర్ 1 నుంచి ఈ ప్ర‌క్రియ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ ఓట‌రుగా న‌మోదు చేయించుకునేలా ప్రోత్స‌హించాల‌న్నారు. న‌వంబ‌ర్ 20, 21 తేదీల‌ను స్పెష‌ల్ క్యాంపెయిన్ డేస్‌గా గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకునేలా ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. 2022, జ‌న‌వ‌రి 1 నాటికి 18 ఏళ్లు నిండ‌నున్న విద్యార్థులు ఓట‌ర్లుగా న‌మోదు చేయించుకునేందుకు వీలుగా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ నెల 7, 27వ తేదీల్లో అన్ని ఉన్న‌త విద్యాసంస్థ‌ల్లో ప్ర‌త్యేక శిబిరాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్రమంపై క‌ళాశాల‌ల విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ (క‌లెక్ట‌రేట్‌) ఎం.జ‌గ‌న్నాథంతో పాటు కె.పోతురాజు (ఐఎన్‌సీ), సీహెచ్ ర‌మేశ్ (బీజేపీ), టి.మధు (సీపీఐ), ఎం.రాజ‌శేఖ‌ర్ (సీపీఐ-ఎం), టి.ర‌మేశ్ (టీడీపీ), ఆర్‌.వెంక‌టేశ్వ‌ర‌రావు (వైఎస్సార్ సీపీ) త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-04 16:21:58

మానవ వనరుల వినియోగం మరింత పెంచాలి..

గిరిజన సహకార సంస్థలో నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలంటే శతశాతం మానవనరుల వినియోగాన్ని పెంచి ప్రణాళికా ప్రకారం ముందుకి వెళితే ఫలితాలు వస్తాయని జిసిసి చైర్మన్ డా.శోభస్వాతీరాణ పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని జిసిసి సమావేశ మందిరంలో  ఎండీ పీఏశోభ, ఇతర డివిజనల్ మేనేజర్లలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. జిసిసి ఉత్పత్తులపై అన్ని వర్గాల ప్రజలకు అపార నమ్మకం వచ్చేవిధంగా నాణ్యతలో రాజీ పడకుండా తయారు చేయాలన్నారు. జిసిసి ద్వారా గిరిజనులకు సకాలంలో నిత్యవసర వస్తువులు అందించాలన్నారు. పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీల్లో అక్రమాలు జరగకుండా చూడాలని, అలాంటివి గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టు, ఇతర ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రాంతాల వద్ద జిసిసి స్టాల్స్ ను ఏర్పాటు చేసి ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు సరుకులు తరలించే విషయమై సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి కేంద్రాల జాబితా జెసి, ఐటీడీఏ పీఓ ద్వారా సకాలంలో తీసుకొని వాటిపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజన రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇచ్చే విషయంలో సత్వరమే స్పందించి గిరిజనులకు అండగా నిలవాలన్నారు. అటవీ ఫలసాయాల కొనుగోలు 523 లక్షల టార్గెట్ కు 242 లక్షలు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవడంపై చైర్మన్ అసంత్రుప్తి వ్యక్తం చేశారు. అనుకున్న లక్ష్యం కంటే అధికంగా కొనుగోలు జరిగేలా  చూడాలని జిసిసి ఎండీకి సూచించారు. ఈ కార్యక్రమంలో  డివిజన్ మేనేజర్లు, సొసైటీ మేనేజర్లు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-04 15:28:32

ఒప్పంద ఉద్యోగులకు అండగా ఉంటాం

అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ లో ఒప్పంద ఉద్యోగులకు అన్ని విధాలా  అండగా ఉంటామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. 60 సంవత్సరాల పైబడి పదవి విరమణ పొందిన 22 మంది ఒప్పంద కార్మికుల కుటుంబీకులకు సోమవారం ఒప్పంద కార్మికులుగా నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో మేయర్ పాటు డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అనేక ఏళ్ల పాటు ఒప్పంద కార్మికులుగా సేవలు చేసిన సేవలకు గుర్తింపుగా వారి కుటుంబాలకు తోడుగా ఉండాలన్న భావనతో తిరిగి ఒప్పంద కార్మికులుగా తీసుకోవడం జరిగిందన్నారు.అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్,అనీల్ కుమార్ రెడ్డి,బాబా ఫక్రుద్దీన్ ,లీలావతి, రహంతుల్లా బాలంజనేయులు కార్యదర్శి సంగం శ్రీనివాసులు, వైఎస్ఆర్సిపి నాయకులు రాధాకృష్ణ, దాదు, దాదా ఖలందర్ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-10-04 15:12:18

జనసురక్ష పథకాలు అర్హులకి అందాలి..

భారత ప్రభుత్వం తలపెట్టిన జన శ్రేయోదాయక ప్రాయోజిత పథకాలు అర్హులైన ప్రతి పౌరునికి అందేలా చర్యలు తీసుకోవాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.వి.బి.డి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేసారు.  ప్రధానమంత్రి జనధన యోజన ( పి.ఎం.జె.డి.వై ), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పి.ఎం.యస్.బి.వై ), ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన (పి.ఎం.జె.జె.బి.వై ), అటల్ పెన్షన్ యోజన ( ఏ.పి.వై ) మొదలైన జన సురక్ష పథకాలను భారత ప్రభుత్వం అమలుచేస్తుందని, ఈ పథకాలను  అర్హులైన ప్రతి పౌరునకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఆర్ధిక సేవల విభాగం అన్ని జాతీయ బ్యాంకుల మేనేజింగ్ డైరక్టర్లు, సి.ఇ.ఓలను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగా యస్.ఎల్.బి.సి రాష్ట్రంలోని అన్ని జిల్లాల లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిందని తెలిపారు. ఈ నెల 31వరకు అన్ని బ్యాంకులు  ఈ పథకాలపై క్యాంపులను నిర్వహించి ప్రజలకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. కావున జిల్లాలోని అన్ని బ్యాంకు బ్రాంచుల్లోని సిబ్బంది, మేనేజర్లు, ఫీల్డ్ సిబ్బంది, బ్యాంకు మిత్రాలు, ఆర్ధిక అక్షరాస్యతా కౌన్సిలర్లు సమిష్టిగా కృషి చేసి జన సురక్ష పథకాలు శతశాతం ప్రతీ పౌరునికి అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. 

Srikakulam

2021-10-04 15:08:10

పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ..

విశాఖజిల్లాలో 1వ తేదీన 2022 సంవత్సరానికి సంబంధించిన ఓటర్ల జాబితా  ప్రకటించడం జరుగుతుందని డిఆర్వో శ్రీనివాసమూర్తి తెలిపారు.  సోమవారం కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా జిల్లాలో 38 పోలింగ్ కేంద్రాల లొకేషన్ లను మార్చడం జరిగిందని, 12 కేంద్రాలకు సంబంధించి భవనాల పేరు మార్చారని, కొత్తగా ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగిందని వారికి వివరించారు.  ఈ సమావేశంలో భారత జాతీయ కాంగ్రేస్, బిజెపి, సిపియం, వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-04 14:55:26

అక్రమ మద్యం పై చర్యలు తీసుకోవాలి..

రాష్ట్రంలో అక్రమ మద్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ 13 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు.  సోమవారం ఆయన డీజీపీ గౌతమ్ సవాంగ్ తో కలసి  అన్ని జిల్లాల  జిల్లా కలెక్టర్లు ఎస్.పి.లు ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మద్యం వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దిశ యాప్ వాడకాన్ని విస్తృత పరచాలని గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. విశాఖపట్నం నుంచి జిల్లా కలెక్టర్  ఏ. మల్లికార్జున వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ గ్రామ సచివాలయ స్థాయిలో దిశా యాప్ పట్ల అందరికీ అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పోలీసు, ఎక్సైజు, అటవీ శాఖ అధికారులతో కలసి జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో గంజాయి అక్రమ రవాణా పై దాడులు చేయడం, కేసులు పెట్టడం, సాగును గుర్తించి ధ్వంసం చేయడం మొదలైన చర్యలు చేపట్టామని చెప్పారు. పోలీసు సూపరింటెండెంట్ మాట్లాడుతూ అక్రమ మద్యాన్ని తయారు చేస్తున్న, విక్రయిస్తున్న వారిపై కేసులు పెట్టడం, నల్ల బెల్లాన్ని,  బెల్లపు ఊటను  గుర్తించి ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో విశాఖపట్నం నుండి ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.వి.వి. ఎన్. బాబ్జి రావు, అడిషనల్ ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-04 14:53:15

మా..ఎన్నికలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు..

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన బందరులో మీడియాతో మాట్లాడుతూ, అక్టోబ‌రు 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (జరిగే ఎన్నికలకు ప్రభుత్వానికి, జగన్మోహనరెడ్డికి ఏ మాత్రం ఆసక్తి,,  ఉత్సాహం లేదని ఈ మేరకు తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.   

bandar

2021-10-04 13:37:31

ధ‌ర్మ ప్ర‌చారం కోసం గీతాగాన య‌జ్ఞం పోటీలు..

సనాత‌న ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా భ‌గ‌వ‌ద్గీత‌లోని 700 శ్లోకాల‌ను విస్తృతంగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లో గీతాగాన య‌జ్ఞం పేరిట శ్లోక ప‌ఠ‌న పోటీలు నిర్వ‌హిస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి పరిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.   ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌ శ్రీ‌వారి భ‌క్తుల కోసం అర్చ‌క‌స్వాముల సాయంతో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వ్ర‌త విధానానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. శ్రీ‌వారి వైభ‌వాన్ని వ్యాప్తి చేసేందుకు భ‌క్తుల‌తో శ్రీ వేంక‌టేశ్వ‌ర నామ‌కోటి రాయించాల‌ని, ఇందుకోసం పుస్త‌కాలు సిద్ధం చేసుకోవ‌డం, వాటిని భ‌ద్ర‌ప‌ర‌చ‌డం త‌దిత‌ర అంశాల‌తో విధి విధానాలు రూపొందించాల‌ని సూచించారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుప‌తిలో భ‌క్తులు సంచ‌రించే అలిపిరి, ఎయిర్ పోర్టు, రైల్వేస్టేష‌న్ త‌దిత‌ర ప్రాంతాల్లో విద్యుత్ అలంక‌ర‌ణ‌లు పెంచాల‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ‌ల 516 గోశాల‌ల‌ను టిటిడి గోసంర‌క్ష‌ణ‌శాల‌కు అనుసంధానం చేసి త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించాల‌న్నారు. టిటిడి త‌యారు చేస్తున్న అగ‌ర‌బ‌త్తుల‌కు భ‌క్తుల నుండి డిమాండ్ ఉంద‌ని, ఉత్ప‌త్తి మ‌రింత పెంచాల‌ని గోశాల అధికారుల‌ను ఆదేశించారు. డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం స‌హ‌కారంతో డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జీ ద్వారా స్వామి, అమ్మ‌వార్ల ఫొటోలు, క్యాలెండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు తదితరాలు త్వ‌రిత‌గ‌తిన త‌యారుచేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. దేశీయ గోవుల కొనుగోలు కోసం ఒక క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని, క‌మిటీ స‌భ్యులు ఉత్త‌ర భార‌త‌దేశంలో ప‌ర్య‌టించి గోవుల‌ను కొనుగోలు చేయాల‌ని ఈవో ఆదేశించారు. ఉద్యోగుల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాల‌ని వైద్య విభాగం అధికారుల‌కు సూచించారు. ఈ నెల 15వ తేదీ నాటికి టిటిడి ఉద్యోగులంద‌రికీ నూత‌న గుర్తింపు కార్డులు మంజూరుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు  స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో గోపినాథ్ జెట్టి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-10-04 11:26:55