1 ENS Live Breaking News

ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు వితరణ..

శ్రీకాకుళం జిల్లాకు 50 ఆక్సిజన్ సిలిండర్లు, 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అందజేసారు. ఈ మేరకు ఎంపీ జిల్లా కలెక్టర్ జె నివాస్ కు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద శని వారం అందజేసారు. ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆర్గనైజేషన్ –ఆంధ్ర ప్రదేశ్ విభాగం ఆరు జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించగా శ్రీకాకుళం జిల్లాకు కూడా అందించాలని పార్లమెంటు సభ్యులు కోరడంతో రూ.50 లక్షల విలువగల సామగ్రిని అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు జిల్లాకు ఉపయోగకరం అన్నారు. కోవిడ్ సమయంలో ఇటువంటి సౌకర్యాలు అందించడం పట్ల అభినందించారు. ప్రజలకు సరైన సమయంలో వినియోగించుటకు అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు.పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. ఆరోగ్య అవసరాలు ఇంకా అవసరమని గుర్తించామని దాంతో ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరచాలని ప్రయత్నించామని చెప్పారు. ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి రూ.50 లక్షల విలువైన సామగ్రి అందించడం జరిగిందని పేర్కొన్నారు.  అవసరమైన ప్రాంతాలకు పంపిణీ చేసి కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సౌకర్యం అందించాలని కలెక్టర్ ను కోరామని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా మూడవ దఫా విజృంభించకుండా, జిల్లాలోకి ప్రవేశించకుండా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆర్గనైజేషన్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీతంపేట సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్, జిల్లా అటవీ అధికారి సందీప్ కృపాకర్ గుండాల, ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-05 14:32:49

కోవిడ్ రోగులను తక్షణమే గుర్తించండి..

 కోవిడ్‌-19 మూడో వేవ్ విప‌త్తు పొంచిఉంద‌న్న సంకేతాల నేప‌థ్యంలో కేసుల స‌త్వ‌రం చేపట్టాలని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలో కోవిడ్ మూడో ద‌శను ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధ‌తా చ‌ర్య‌ల్లో భాగంగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌పై శ‌నివారం సాయంత్రం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఉన్న‌త‌స్థాయి స‌మావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ కేసుల గుర్తింపు.. ఆపై నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని మౌలిక వ‌స‌తుల‌ను గ్రామ స్థాయి నుంచే ప‌టిష్ట‌ప‌ర‌చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. చిన్నారుల‌కు మూడోద‌శ‌లో ముప్పు ఉంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో చిన్న‌పిల్ల‌ల వైద్య నిపుణుల‌తో స‌హా వివిధ వైద్య విభాగాల నిపుణులు, జిల్లా వ్యాప్త వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌తి గ్రామంలోనూ సామాజిక ఐసోలేష‌న్ కేంద్రాల (ఎస్ఐసీ)ను ఏర్పాటుచేయ‌డం ద్వారా వైర‌స్ వ్యాప్తి ఉద్ధృతికి అడ్డుక‌ట్ట వేయ‌డంతో పాటు త‌క్ష‌ణ వైద్య స‌హాయం అందించ‌వ‌చ్చ‌ని, ఈ దిశ‌గా చేయాల్సిన ఏర్పాట్ల‌పై నివేదిక‌లు రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఏఎన్ఎం స్థాయిలోనే ఐసోలేష‌న్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాల‌న్నారు. 

మూడో వేవ్‌పై ప్ర‌జ‌ల‌కు విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాలని, ముఖ్యంగా భావి పౌరుల ఆరోగ్య భ‌ద్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌గా ప్ర‌జ‌లు గుర్తించేలా జ‌న‌జాగృతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. చిన్నారులు కోవిడ్ బారిన ప‌డిన ప‌రిస్థితుల్లో వారికి చికిత్స అందించే కేంద్రాల‌కు స‌మీపంలో త‌ల్లులు ఉండేలా వ‌స‌తి, ఇత‌ర ఏర్పాట్లు చేయాల‌ని, ఇందుకోసం ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తు చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌, త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న ప‌డ‌క‌ల్లో 10 నుంచి 15 శాతం ప‌డ‌క‌ల‌ను పూర్తిస్థాయిలో చిన్నారుల‌కు వైద్య సేవ‌లందించేలా సిద్ధం చేయాల‌న్నారు. మేజ‌ర్ ఆసుప‌త్రుల‌తో పాటు ఏరియా ఆసుప‌త్రులు, సీహెచ్‌సీలు, ఇత‌ర ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ లైన్లను ఏర్పాటుచేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేయాల‌ని, ఇందుకోసం టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని ఆదేశించారు. కోవిడ్ మానిట‌రింగ్ ప్రొఫైల్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు అద‌న‌పు ల్యాబ్ సామ‌గ్రిని సిద్ధం చేసుకోవాల‌న్నారు. సీపీఏపీ, హెచ్ఎఫ్ఎన్‌సీ, పీడియాట్రిక్ సెంట్ర‌ల్‌, పీఐసీసీ లైన్స్ వంటి వాటి ఏర్పాటు ద్వారా పీడియాట్రిక్ ఐసీయూల‌ను బలోపేతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

ఇంకా కలెక్టర్ ఏమ‌న్నారంటే..
- గ్రామ‌, వార్డు స‌చివాల‌య స్థాయిలో ఫీవ‌ర్ స‌ర్వేను అత్యంత క‌చ్చిత‌త్వంతో నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి. దీర్ఘ‌కాలిక వ్యాధులు, మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల వివ‌రాలు సేక‌రించాలి.
- కంటైన్‌మెంట్ జోన్ల వ్య‌వ‌స్థ‌ను ఆధునికీక‌రించి, క‌రోనా క‌ట్ట‌డికి వ్యూహాలు రూపొందించాలి. సామాజిక ఐసోలేష‌న్ కేంద్రాలు, కంటైన్‌మెంట్ జోన్ల నిర్వ‌హణ వంటి వాటికి మార్గ‌ద‌ర్శ‌కాల రూప‌క‌ల్ప‌న‌పై క‌స‌ర‌త్తు చేయాలి.
- అంగ‌న్‌వాడీ కేంద్రాల సిబ్బందికి కోవిడ్ మేనేజ్‌మెంట్‌పై శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హించాలి. ఇందుకోసం మాడ్యూళ్ల‌ను రూపొందించాలి.
- చిన్నారుల్లో వ్యాధినిరోధ‌క సామ‌ర్థ్యం పెంచేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. 
- వాలంటీర్ల ద్వారా స్లిప్‌ల పంపిణీ విధానం ద్వారా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిగేలా చూడాలి. మొద‌టి, రెండోద‌శ కోవిడ్ కేసుల వ్యాప్తి ఆధారంగా హాట్‌స్పాట్‌ల‌ను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న టీకా కార్య‌క్ర‌మం పూర్త‌య్యేలా చూడాలి.
- కోవిడ్ ఆసుప‌త్రుల్లో చికిత్స కోసం నిర్దేశించిన ప్ర‌త్యేక ఔష‌ధాలు 24X7 అందుబాటులో ఉండేలా చూడాలి.
- కోవిడ్ వైద్య సేవ‌లు అందించ‌డంలో మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌ర‌చిన వాటిని మాత్ర‌మే నోటిఫై ఆసుప‌త్రులుగా ప్ర‌క‌టించాలి. నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కుండా ప‌టిష్ట నిఘా ఉండేలా చూడాలి.
- డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా పేద‌ల‌కు ఉచితంగా, ఎలాంటి వివ‌క్షా లేని కోవిడ్ సేవ‌లు అందించేలా చూడాలి. 
- అవ‌స‌రం మేర‌కు వైద్య‌, ఆరోగ్య సిబ్బంది నియామ‌కానికి చ‌ర్య‌లు తీసుకోవాలి. వాకిన్ల ద్వారా వెంట‌నే నియామ‌కాలు పూర్త‌య్యేలా చూడాలి.
- 108 అంబులెన్సులు, ప్రైవేటు అంబులెన్సుల‌ను అవ‌స‌ర‌మైన వారికి త‌క్ష‌ణ‌మే అందుబాటులో ఉంచేందుకు ఏకీకృత విధానం అమ‌లుపై దృష్టిసారించాలి.

స‌మావేశంలో జీజీహెచ్ కోవిడ్ నోడ‌ల్ అధికారి సూర్య‌ప్ర‌వీణ్‌చాంద్‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, ఆరోగ్య‌శ్రీ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త డా. పి.రాధాకృష్ణ‌, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మి, డీసీహెచ్ఎస్ డా. టి.ర‌మేశ్‌కిషోర్, జీజీహెచ్‌లోని వివిధ వైద్య విభాగాల అధిప‌తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-05 14:23:26

స్త్రీనిధి ద్వారా జగనన్నతోడు రుణాలు..

శ్రీకాకుళం జిల్లాలో చిరు వ్యాపారులకు స్త్రీనిధి  పథకం ద్వారా గ్రామ సంఘాలకు జగనన్న తోడు రుణాలు అందించుటకు ప్రణాళికలు సిద్ధం చేసామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.శాంతి శ్రీ తెలిపారు. ప్రతి గ్రామ సంఘంలో కనీసం 12  మంది చొప్పున  1581 గ్రామ సంఘాలలో సుమారుగా 18 వేల మంది లబ్దిదారులకు రూ.18 కోట్లు  మంజూరు చేయుటకు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన జారీ చేస్తూ స్త్రీనిధి “జగనన్న తోడు “ రుణాలను ఈ నెల 8వ తేదీన సంక్షేమ క్యాలెండర్ లో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. అదే రోజున సభ్యుల ఖాతాలో  సొమ్ము జమ చేస్తారని పేర్కొన్నారు. ఈ కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులను  ఆదుకొనే నిమిత్తం  స్త్రీనిధి ద్వారా  జగనన్న తోడు రుణాలు అందజేయటం ఆనందంగా ఉందని ఆమె వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో జగనన్న తోడు రుణం స్త్రీనిధి ద్వారా  ప్రతీ సభ్యురాలికి రూ.10 వేలు చొప్పున 18 వేల మందికి సంఘాల ఖాతాకులో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. రుణం జమ విషయం  లబ్దిదారుని ఫోన్ కు అందుతుందని చెప్పారు. జగనన్న తోడు  రుణం 12 వాయిదాలలో 11 శాతం వడ్డీతో కలిపి నెలకు  రూ.890/-లు చొప్పున  స్త్రీనిధికి లబ్దిదారులు చెల్లించ వలసి ఉంటుందని ఆమె వివరించారు. ప్రభుత్వం సున్నా వడ్డీ క్రింద చెల్లించిన వెంటనే సభ్యుల ఖాతాకు ప్రస్తుతం చెల్లించిన వడ్డీ జమ అవుతుందని పేర్కొన్నారు. సురక్ష పథకం క్రింద స్త్రీనిధి రుణం మొత్తానికి బీమా కవరేజ్ చేయడం జరుగుతుందని, బీమాతో కూడిన  రుణంగా పరిగణిస్తామని శాంతి శ్రీ చెప్పారు.రూ.175 కోట్ల రుణాలు మంజూరు లక్ష్యం : 2021 -22 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాలో వివిధ రకాలైన జీవనోపాధులు మెరుగు పరుచుటకు సుమారు 35 వేల మంది సభ్యులకు స్త్రీనిధి ద్వారా రూ.175 కోట్లు రుణాలు మంజూరు చేయుటకు లక్ష్యంగా నిర్ణయించటం జరిగిందని, ఇప్పటకే రూ.30 కోట్ల రుణాలకు ప్రతిపాదనలు అందాయని తెలిపారు. 2020-21 సంవత్సరంలో స్త్రీనిధి రుణాలు లక్ష్యం రూ.108 కోట్లు కాగా, రూ.120 కోట్ల రుణాలు మంజూరు చేసామని, రికవరీ శత శాతం సాధించి రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ప్రదమ స్థానంలో నిలిచిందని ఆమె వివరించారు. 48 గంటల్లో స్త్రీ నిధి రుణాలు : జగనన్న చేయూత పథకంలో స్త్రీనిధి ద్వారా 18 వందల మంది లబ్ధిదారులకు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కిరాణా మొదలగు వ్యాపారాలు స్థాపించుటకు  రుణాలు మంజూరు చేసి సభ్యులు ఆర్దికంగా నిలదొక్కుకొనే విధంగా స్త్రీనిధి రుణాలు కోరిన సభ్యులకు 48 గంటలలో మంజూరు చేయటం జరుగుతుందని శాంతి శ్రీ చెప్పారు.

Srikakulam

2021-06-05 14:22:07

ఇవిఎం గోడౌన్ లను తనిఖీ చేసిన కలెక్టర్..

భారత  ఎన్నికల కమిషన్ ఆదేశాల  మేరకు ఇవియం గోడౌన్ లను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్  తనిఖీ చేశారు.  శనివారం  గుంటూరు ఆర్ డి ఓ కార్యాలయం ఆవరణలోని ఇవియం గోడౌన్ ను, ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్  యార్డ్ లో  వివి పాట్ లను  భద్రపరచిన గోడౌన్ లను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్  పరిశీలన చేశారు. గోడౌన్ల కు వేసిన తాళాల సీల్డ్ ను, గోడౌన్ల వద్ద ఉన్న అగ్నిమాపక పరికరాలను, సిసి కెమెరా లను, గార్డ్ డ్యూటీ లాగ్ బుక్ ను పరిశీలించారన్నారు.  ఇవియం ల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  ఈవీఎం గోడౌన్ల నోడల్ ఆఫీసర్, అమరావతి – అనంతపురం ఎక్స్ప్రెస్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, వి శైలజ, డిఆర్వొ కొండయ్య, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, గుంటూరు పశ్చిమ తహశీలార్డు మోహన్ రావు, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ సునీల్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-06-05 13:49:46

పేదలందరికీ సొంతిల్లే ప్రభుత్వ లక్ష్యం..

రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సొంత గృహాలను అందించడమే లక్ష్యంగా  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని గృహనిర్మాణ శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్.ఎన్ భరత్ గుప్తా అన్నారు. శనివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం,పసుమర్రు గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పధకంలో భాగంగా ఇళ్ళ నిర్మాణాలకు శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్.ఎన్.భరత్ గుప్తా, గుంటూరు జిల్లా కలెక్టర్ తోపాటు, చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని లు హాజరయ్యారు. కార్యక్రమానికి చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని అధ్యక్షత వహించారు.   ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లబ్ధిదారుల పండుగ సభలో రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్.ఎన్.భరత్ గుప్తా మాట్లాడుతూ ఒకే సారి ఎక్కువ సంఖ్యలో ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు తక్కువ ధరలకు నిర్మాణ సామాగ్రిని రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. దీంతో పాటుగా ప్రతి లబ్ధిదారునికి ఉచితంగా 20 టన్నుల ఇసుకను అందించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.  గృహనిర్మాణ  ప్రాంతాల దగ్గరే గృహనిర్మాణశాఖతో పాటుగా అందుకు అనుబంధంగా పని చేస్తున్న శాఖల అధికారులకు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణంలో ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బేస్ మెంట్ ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించేలా గ్రామ సచివాలయ అధికారులను నిరంతరం అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర మహిళలు సొంత ఇంటికలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

  గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జూన్ 1వ తేది నుంచి 10 వ తేదిలోపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన 10 వేల ఇళ్ళ నిర్మాణాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. గత పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అర్హత కలిగిన  అక్కచెల్లెమ్మలందరికీ నవరత్నాలు- పేదలకు ఇళ్ళు  పధకంలో భాగంగా ఇళ్ళ స్థలాలు కేటాయించారన్నారు. పేదలందరికీ  అనువైన ఇళ్ళ నిర్మాణం చేపట్టే కార్యక్రమానికి ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. ఎంతో గొప్ప మనసున్న ముఖ్యమంత్రిని తాను ఎన్నడూ చూడలేదని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఇటువంటి సంక్షేమ పధకాలు మరే ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం నుంచి ఇళ్ళ పట్టాలు అందుకున్న ప్రజలంతా ఏక కాలంలో ఇళ్ళు నిర్మించుకోవండం ద్వారా నిర్మాణ సామగ్రి తక్కువ ధరకు లభిస్తాయన్నారు.దీంతో పాటుగా స్థానికంగా ఉంటున్న ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు వెల్లువలా వస్తాయన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న గొప్ప నిర్ణయమని కలెక్టర్ వివేక్ యాదవ్ కొనియాడారు. ఒకే కాలంలో అటు ప్రజలకు ఆస్థులు పెరగడంతో పాటుగా, ఇటు ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు. అందివస్తున్న అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగ పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని మాట్లాడుతూ మాటలు చెప్పి, చేతులు దులుపుకునే ప్రజా ప్రతినిధులు ఉన్న ఈ సమాజంలో పేద ప్రజల గురించి ఆలోచించి పనిచేసి చూపిన ఏకైక ముఖ్యమంత్రిని తాము కళ్ళారా చూస్తున్నామని అన్నారు. ఆయన నాయకత్వంలో తాను ఒక మహిళా శాసన సభ్యురాలుగా పని చేయడం గొప్పవరమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సంక్షేమ పధకాలే అందుకు నిదర్శనమన్నారు. నవరత్నాల్లో ఏ పధకం తీసుకున్నా ఆడిన మాట తప్పకుండా ప్రజలకు ఆ పధకాలు చేరేవరకు అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి భాగస్వామిని అవుతానని అన్నారు. ఈ సందర్భంగా పసమర్రు ప్రాంతంలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పధకాలను శాసన సభ్యురాలు రజని వివరించి చెప్పారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలందరికీ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. లభ్ధిదారులకు కూడా త్వరితగతిన ఇల్లు కట్టుకొని సొంత ఇంటి యజమానులుగా మారాలని పిలుపు నిచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో లబ్ధిదారు మహబూబ్ బి అనే మహిళ స్థలం వద్ద సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.అనంతరం భూమిపూజ చేసి,నవధాన్యాలుచల్లి,నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

ఇళ్ళ నిర్మాణాల ప్రాంతంలోనే ప్రపంచ పర్యవరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు బోర్లలో తొలి బోరును ఏర్పాటు చేసి, గృహ నిర్మాణాలకు అవసరమైన నీటి సౌకర్యాన్ని సంబధిత అధికారులు ఏర్పాటు చేయగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్,ఎన్ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజనిలు ప్రారంభించారు.  చిలకలూరిపేట నియోజక వర్గంలోని పసుమర్రు గ్రామంలో 41.63 ఎకరాల భూమిని లే అవుట్ గా ఏర్పాటు చేశారు. మొత్తం 1773 మంది లబ్ధదారులకు ప్లాట్లు కేటాయించారు. ఇందులో తొలివిడతగా పిఎంఎవై - వైయస్ఆర్ (అర్భన్) – బిఎల్ సి పధకాల ద్వారా 1565 మంది పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు గృహనిర్మాణశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. మొత్తం నిర్మాణాలు,మౌలిక వసతులు కలిపి ప్రాజెక్ఠ్ ఖర్చు రూ. 2817.60 లక్షలు. ఇళ్ళ నిర్మాణ ప్రాంతంలో మొత్తం మూడు బోర్లు ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఒక బోరును ఏర్పాటు చేసి,విద్యుత్తు సౌకర్యం కల్పించి భవన నిర్మాణాలకు నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. విద్యత్తు ఏర్పాటుకు అంచనా ఖర్చు  రూ.20.74 లక్షలు.

 సభా కార్యక్రమానికి ముందు మీడియాతో రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్.ఎన్.భరత్ గుప్తా, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని లు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పధకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్, జిల్లా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలరావు, మున్సిపల్ కమీషనర్ రవీంద్ర,  మన్సిపల్ ఛైర్మన్ రఫాని, మార్కెట్ యార్డు ఛైర్మన్ చిన్నా, తహాశీల్థార్ సుజాత, ఎమ్పీడివొ హేమలతదేవి, పలుశాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-06-05 13:48:39

అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ మరువలేని సేవలు ..

అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ సోకి మరణించిన వారి  తరపు కుటుంబ సభ్యులకు, బంధువులకు ఉచితంగా వసతులు కల్పించడం ఎంతో అభినందనీ యమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ  శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు  కొనియాడారు. శనివారం స్థానిక నల్లపాడు రోడ్ లో శ్రీ నాగసాయి మందిరం ఎదురు మిర్చి యార్డు దగ్గర అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నూతన భవనాన్ని, ట్రస్ట్ ఆవరణలో  జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహాన్ని  రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్, సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవిన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్   లు కలసి ప్రారంభించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ కోవిడ్ సోకిన వ్యక్తులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు.  అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారు కోవిడ్ సోకి చనిపోతున్న వ్యక్తులకు దహన సంస్కారాలు చేయడం, వారి తరపున వుండే కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చడం, ఆరోగ్య రీత్యా  మందులు అందించడం, భోజన వసతి కల్పించడం, అన్ని విధాలుగా సౌకర్యంగా చూడడం చాలా గొప్పగా ఉందన్నారు.  ఇలాంటి స్వచ్చంధ  సంస్థలకు దాతలు ఇతోధికంగా సహాయం అందిచాలని ఆయన కోరారు.  పింగళి వెంకయ్య ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు మూడు రంగుల జాతీయ జెండాను రూపొందించారని, ఆయన భావాలను గుర్తించి ప్రజలందరూ వారు సూచించిన  మార్గంలో నడవాలన్నారు. 

నగర మేయర్  కావటి శివనాగ మనోహర్  నాయుడు మాట్లాడుతూ, అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్  నిర్వాహకులు స్వామి  ప్రసన్న గిరి 25 సంవత్సరాల నుండి కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకుని, ఎలాంటి సహకారం లేని వ్యక్తులకు సేవా దృక్పధంతో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నదన్నారు.  ఇలాంటి కోవిడ్ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కరోనా సోకి చనిపోయిన వ్యక్తులను ఎవరు పట్టించుకోని స్థితిలో ఆసుపత్రుల నుండి నేరుగా శ్మశాన వాటికలకు తీసుకుని  వెళితే  ఎలాంటి అలుపు సొలుపు లేకుండా దహన సంస్కారాలు చేయడం  జరుగుతున్నదని  కొనియాడారు. కోవిడ్ సోకిన వ్యక్తులకు మన సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోని స్థితిలో ఇలాంటి ట్రస్టు ల ద్వారా ఎంతో మేలు  జరుగుతుందన్నారు.  కరోనా సోకిన వ్యక్తులకు ప్రభుత్వం చేసే  సాయంతో పాటు ఈ ట్రస్టుకు దాతలు విరాళాలు ఇస్తున్నారని,               కరోనా సోకి ఖర్చులు పెట్టుకోస్థితిలో ఉన్న వారికి వారికి ఇటువంటి ట్రస్టులు ఎంతో మేలు చేస్తాయనే విషయాన్ని గుర్తించాలన్నారు.  

  గుంటూరు తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా  మాట్లాడుతూ  కోవిడ్ -19 సోకిన వ్యక్తులకు తమ వంతు సహాయంగా టీకాలు  వేయించేందుకు అన్ని విధాల తోడ్పాటునందించడం జరుగుతుందన్నారు.  ప్రజలు కూడా అప్రమత్తంగా వుండి ప్రభుత్వం చెప్పిన విధంగా మాస్కులు, శానిటైజర్  వాడుతూ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. గుంటూరు  పశ్చిమ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ కరోనా మొదటి వేవ్  కన్నా సెకండ్ వేవ్ చాలా ఉదృతంగా ఉన్నట్లుగా మనందరం చూడడం జరుగుతున్నదని, అన్నారు. కోవిడ్ వల్ల  ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్  రెడ్డి కోవిడ్ -19 వైద్య చికిత్స కోసం కేటాయించిన ప్రతి ఆసుపత్రిలో కరోనా రోగులకు 50 శాతం బెడ్లు కేటాయించాలని చెప్పడం జరిగిందన్నారు.  ప్రజలకు ఈ కోవిడ్ మహమ్మారి ఎంతో నష్టం చేకూర్చిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్–19 రోగులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నదన్నారు.  ఇకనైనా తగ్గిపోతుందని ఆశిస్తున్నామన్నారు.  

  అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు స్వామి  ప్రసన్న గిరి మాట్లాడుతూ కోవిడ్ బారినపడి చనిపోయిన   వ్యక్తి యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇళ్ళకు రాలేని బాధితులకు ఈ ట్రస్ట్ లో వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  ఇలాంటి బాధితులు 200  మందికి వసతి కల్పించడంతో పాటు,  అన్ని కులాలకు, మతాలకు అతీతంగా ఎలాంటి తారతమ్యం లేకుండా  భోజన, వసతి  సౌకర్యాలు, మందులు అందించడం జరుగుతుందన్నారు. కోవిడ్ సోకి మరణించిన  వ్యక్తులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ట్రస్ట్ కు అప్పగించిన బాధ్యతలను తప్పక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు కోవిడ్ సోకి చనిపోయే వ్యక్తుల  దహన సంస్కారాలు చేయడం వలన మా ట్రస్ట్ సిబ్బంది కొన్ని సమయాల్లో నిద్రరావడం లేదని చెప్పడం జరుగుతుందన్నారు.  అయినప్పటికీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ప్రభుత్వానికి అందించడమే మా ధ్యేయమన్నారు.  ఈ కార్యక్రమంలో బొమ్మిడాల భానుమూర్తి ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.    

Guntur

2021-06-05 13:46:18

137 మందికి కోవిషీల్డ్ టీకా పంపిణీ..

విద్య, ఉద్యోగం, ఇతర అత్యవసర కారణాలపై విదేశాలకు వెళ్లవలసిన 18- 45 సంవత్సరాల వయస్కుల వారికి శనివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజిలో నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ శిభిరంలో 137 మందికి కోవిషీల్డ్ టీకాలు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేశారు. ఇంకా జిల్లాలో  విదేశాలకు వెళ్లవసిన  18 నుంచి 45 ఏళ్ల వయస్సు వారేవరైనా ఉంటే మరో మారు ఇటువంటి ప్రత్యేక శిభిరం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.  వ్యాక్సిన్ వేయించుకునేందుకు తమ వివరాలను, డాక్యుమెంటరీ రుజువుల పత్రాలతో డియంహెచ్ఓ కార్యాలయం 3వ ఫ్లోర్  లోని కోవిడ్ వాక్సినేషన్ సెల్ లో ఉదయం 10 గం.ల నుండి మద్యాహ్నం 2 గం.ల వరకూ అందుబాటులో ఉండే అధికారి ఎ.హేమలత ను వ్యక్తిగతంగా సంప్రతించాలని తెలియజేశారు.  అభ్యర్థులు తమ పేరు, అడ్రస్, ఆధార్ నెంబరు,పాస్ పోర్ట్, ఫోన్ నంబరు, ఏ రోజు, ఏ దేశానికి వెళుతున్నది, వివరాలతో పాటు చదువు కోసం వెళ్లేవారు అడ్మిషన్ లెటర్, ఉద్యోగార్ధమైతే అపాయింట్ మెంట్ లెటర్, ఇతర అత్యవసర కారణాలైతే టికెట్ వివరాలను ఇందుకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.  అందిన ధరఖాస్తులను పరిశీలించి ఏతేదీన తదుపరి ప్రత్యేక టీకా శిభిరం నిర్వహించేది తెలియజేయడం జరుగుతుందన్నారు. 

Kakinada

2021-06-05 13:43:35

కోవిడ్ యోధులకు రూ.50లక్షలు భీమా..

 కోవిడ్19 పోరాట యోధులుగా సేవలు అందిస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పాకేజి ఇన్స్యూరెన్స్ పధకం క్రింద 50 లక్షల భీమా కవరేజి కల్పించిందని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి తెలియజేశారు.  ఈ పధకం క్రింద కమ్యూనిటీ హెల్త్ కేర్ వర్కర్లు,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలోను, ప్రభుత్వ నోటిఫైడ్ ప్రయివేట్ ఆసుపత్రులలోను కోవిడ్ సేవల కొరకు కాంట్రాక్ట్, డైలీ వేజ్, అడ్ హాక్, ఆవుట్ సోర్స్, రిటైర్డ్, ఆశా కార్యకర్తలు, లోకల్ బాడీ తదితర  పద్దతులలో నియమితులై కోవిడ్ రోగులకు డైరక్ట్ కాంటాక్ట్ తో ఆరోగ్య సేవలు అందింస్తూ దురదృష్టవశాత్తు కోవిడ్ సోకి, లేదా కోవిడ్ సేవలు అందిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన హెల్త్ కేర్ వర్కర్ల కుటుంబాలకు 50 లక్షల భీమా సహాయాన్ని అందజేస్తారన్నారు.  ఈ పధకానికి  భీమా ఎన్ రోల్ మెంట్ అవసరం లేదని, ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అలాగే వయో పరిమితి కూడా లేదని, ఏ ఇతర ఇన్య్సూరెన్స్ కవరేజిలు ఉన్నా ఈ పధకం క్లెయిమ్ అదనంగా చెల్లిస్తారని తెలిపారు.  మార్చి 2020 నుండి న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా అమలు చేస్తున్న ఈ పధకాన్ని మరో ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందన్నారు.  జిల్లాలో కోవిడ్ పోరాట యోధులుగా నిరుపమాన సేవలు అందిస్తూ చనిపోయిన హెల్త్ కేర్ వర్కర్ల కుటుంబ సభ్యులు పధకం క్రింద బీమా క్లెయిమ్ కొరకు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఫారమ్, మృతుడు, క్లెయిమెంట్ ల ఐడెంటీ రుజువులు, వారి రిలేషన్ షిప్ రుజువు, కోవిడ్ పాజిటీవ్ గా నిర్థారణ జరిగిన లాబ్ టెస్ట్( ICMR/HRCT) రిపోర్ట్, చనిపోయిన ఆసుపత్రి నుండి డెత్ సమ్మరీ, మృతుడు పనిచేసిన ఆసుపత్రి, సంస్థ నుండి కోవిడ్ విధులపై  పనిచేసిన ధృవీకరణల సర్టిఫైడ్ కాపీలు, అఫాడవిట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఓరిజినల్ డెత్ సర్టిఫికేట్ వివరాలతో డియంహెచ్ కార్యాలయంలో ఐడిఎస్పి సెల్ అధికారి డిస్ట్రిక్ ఎపిడెమియోలజిస్ట్ డా.రవికుమార్ ను సంప్రదించాలని కోరారు.   కోవిడ్ విధుల నిర్వహణలో ప్రమాద వశాత్తు సంభవించిన సందర్భంలో లాబ్ రిపోర్ట్ బదులు పోస్ట్ మార్టమ్, ఎఫ్ఐఆర్ ల సర్టిఫైడ్ కాపీలు సమర్పించాలన్నారు.   జిల్లాలో ఇప్పటి వరకూ 8 గురు కోవిడ్ పోరాట యోధులకు ఈ పధకం ద్వారా భీమా సహాయాలను క్లెయియ్ చేయడం జరిగిందని జేసి(డి) తెలియజేశారు. 

Kakinada

2021-06-05 12:37:53

రోడ్డు వెడల్పు అంచనాలు సమర్పించాలి..

విశాఖ జీవిఎంసీ పరిధిలోని చిన్నముషిడివాడ ప్రధాన రహదారి (శారదా పీఠం రోడ్డు) వెడల్పునకు అంచనాలను తయారుచేసి కౌన్సిల్ ఆమోదానికి పంపాలని కమిషనర్ డా.జి.స్రిజన ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని 8వజోన్ పరిధిలోని చిన్న ముషిడివాడ తదితర ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చాలని అధికారులను ఆదేశించారు. చిన్న ముషిడివాడ మెయిన్ రోడ్డులో ఉన్న పార్కును అభివృద్ధి చేయాలని, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెట్లను పెంచి పచ్చదనాన్ని పెంపొందించాలని, నిషేదిత ప్లాస్టిక్ ను విడనాడాలని, వర్షపు నీటిని ఆదా చేయాలని కమిషనర్ తెలిపారు. అనంతరం రూ.1.12కోట్ల వ్యయంతో సత్య నగర్ పార్కును అభివృద్ధి పరచాలని, దీనిని ఆగస్టు నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రూ.48 లక్షల వ్యయంతో సత్యనగర్ లో ప్రధాన కాలువలను మరమత్తులు చేపట్టుటకు కౌన్సిల్ ఆమోదం కొరకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. పులగాని పాలెం 40 అడుగుల రోడ్డు విస్తరణ కొరకు అంచనాలను తయారు చేసి కౌన్సిల్ ఆమోదం కొరకు పంపాలని కమిషనర్ ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సేనాపతి వసంత, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీరు రాజారావు, జోనల్ కమిషనర్ చక్రవర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధుకుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్ (మెకానికల్) చిరంజీవి, ఎఎంఒహెచ్ లక్ష్మి తులసి, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. 

చినముషిడివాడ

2021-06-05 12:33:29

పర్యావరణాన్ని మొక్కతోనే కాపాడాలి..

పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జీవిఎంసీ ప్రాంగణంలో  మేయర్ శనివారం డిప్యుటీ మేయర్ జియ్యాని శ్రీధర్ తో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1972 జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా  ప్రకటించిందని, అప్పటినుండి పర్యావరణ పరిరక్షణకు  యావత్ ప్రపంచం కృషి చేస్తుందని అందులో భాగంగా మన విశాఖపట్నంలో  మొక్కలు నాటే కార్యక్రమం నా చేతుల మీదుగా  నాటడం నా అదృష్టంగా భావిస్తున్నానని మేయర్ తెలిపారు.  జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం లో అడవులు పాత్ర ఎంతో కీలకమైనదని,  రోజురోజుకు భూమిపై పచ్చదనం నశించిపోతుందని,  మానవుడు చెట్లను నరికి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారని,  అడవులను నరికి నందు వలన అకాల వర్షాలు, అధిక ఎండలు, కరువు ఏర్పడి మానవజాతి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని,  ఒక చెట్టు తొలగించే ముందు దాని స్థానంలో ఐదు మొక్కలు నాటాలని, నేడు ప్లాస్టిక్ భూతం పర్యావరణానికి అడ్డంకిగా మారిందని, కాలువలోను, గెడ్డలలోను చెత్త మరియు ప్లాస్టిక్ వస్తువులు వేయడం వలన చాలా వరకు నష్టం చేకూరుతుందని,  పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు కృషి చేయాలని అప్పుడే మనిషి దగ్గరకు ఎటువంటి రోగాలు దరిచేరవని మేయర్ తెలిపారు. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ, ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జివిఎంసి మేయర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందని,  చెట్లు  వలన మనకు ప్రాణవాయువు లభిస్తుందని అలాంటి చెట్లను నరికి వేయడం వలన మానవ మనుగడకే ప్రమాదం అని, కావున ప్రతి ఒక్కరు తమ ఇంటిముందు మొక్కలు  నాటాలని సూచించారు.  మన విశాఖ ఇప్పటికే పచ్చదనంతో మెరుస్తుందని, దీనిని మరింత  పచ్చదనంతో తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ ఆషాజ్యోతి,  ఎ.డి.(హార్టికల్చర్) ఎం. దామోదర రావు,  ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజనీర్ (పి.ఎల్.&సి) మెహర్ బాబా,  డాక్టర్ మురళీ మోహన్, యు.ఎన్.డి.పి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-06-05 12:25:39

సింహాద్రి అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామి వారికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబానికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆపై  కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈఓ మంత్రికి ముత్తంశెట్టికి  ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఆలయ అధికారులు  పాల్గొన్నారు.

సింహాచలం

2021-06-05 12:19:18

విద్యా ఉపాదికే ప్రభుత్వం పెద్దపీట..

భ‌విష్య‌త్తులో యువ‌త‌కు సుస్థిర ఉపాధి, నాణ్య‌మైన జీవితం ల‌భించాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌త నైపుణ్యాలు, విలువ‌ల‌తో కూడిన విద్య‌ను అందించేందుకు కృషిచేస్తోంద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వ‌రూప్‌, వ్య‌వ‌సాయ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌,  రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ స్పెష‌ల్ ఛీఫ్ సెక్ర‌ట‌రీ, జేఎన్‌టీయూకే ఇన్‌ఛార్జ్ ఉప‌కుల‌ప‌తి స‌తీష్‌చంద్ర‌, ఎంపీ వంగా గీత‌, ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు, కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి త‌దిత‌రుల‌తో క‌లిసి విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూల‌పు సురేష్ శ‌నివారం కాకినాడ జేఎన్‌టీయూలో ఏర్పాటుచేసిన భార‌త‌ర‌త్న బాబాసాహెబ్ డా. బీఆర్ అంబేడ్క‌ర్ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో రూసా నిధుల‌తో నిర్మించ‌నున్న పీజీ బాలుర వ‌స‌తి గృహానికి శంకుస్థాప‌న చేశారు. నేష‌న‌ల్ స‌ర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్‌) ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుచేసిన జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌చ‌ర మంత్రుల‌తో క‌లిసి విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ మీడియాతో మాట్లాడుతూ బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యా రంగంలో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు అమ‌లుచేస్తోంద‌ని తెలిపారు. 

ఈ మార్పులు, సంస్క‌ర‌ణ‌లు దేశానికే ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తున్నాయ‌ని, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లిష్ మాధ్య‌మంలో బోధ‌న‌, సీబీఎస్ఈ పాఠ్య‌ప్ర‌ణాళిక అమ‌లుకు గౌర‌వ ముఖ్య‌మంత్రి కృషిచేస్తున్నార‌న్నారు. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వ‌ర్క్ (ఎన్ఐఆర్ఎఫ్‌)లో తొలి ప‌ది స్థానాల్లో ఎస్‌వీయూ, ఏయూ, జేఎన్‌టీయూ త‌దిత‌ర విశ్వ‌విద్యాల‌యాల‌ను నిలిపే ల‌క్ష్యంతో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, విద్య‌లో ప్ర‌మాణాలు పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. అత్యున్న‌త నైపుణ్యాల‌తో ఉన్న‌త విద్య‌ను అందించే ల‌క్ష్యంతో విద్యా రంగంలో స‌మూల మార్పుల‌కు ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌న్నారు. విద్యారంగంలో జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన వంటి సంక్షేమ కార్య‌క్ర‌మాలు కూడా అమ‌ల‌వుతున్నాయ‌ని, మ‌న‌బ‌డి-నాడునేడు ద్వారా పాఠ‌శాల‌ల రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయ‌న్నారు. నాడునేడు తొలిద‌శ‌లో రూ.3,600 కోట్లు, రెండో ద‌శ‌లో దాదాపు రూ.నాలుగు వేల కోట్ల‌తో పాఠశాల‌ల‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. జూనియ‌ర్‌, డిగ్రీ క‌ళాశాల‌ల‌ను కూడా మౌలిక వ‌స‌తులు, విద్యా ప్ర‌మాణాల ప‌రంగా అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. విద్యార్థి జీవితంలో ప‌రీక్ష‌లు చాలా ముఖ్య అంశ‌మ‌ని, త‌ల్లిదండ్రుల ఆందోళ‌న‌, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప‌రీక్ష‌ల‌ను వాయిదావేశామ‌ని, కోవిడ్ ఉద్ధృతి త‌గ్గిన త‌ర్వాత అన్ని జాగ్ర‌త్త‌ల‌తో ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, జులై నాటికి ప‌రిస్థితి కుదుట‌ప‌డే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని వెల్ల‌డించారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ వ‌ల్ల ఉన్న‌త విద్యాకోర్సుల్లో ప్ర‌వేశాలు, పోటీప‌రీక్ష‌లు త‌దిత‌రాల ప‌రంగా విద్యార్థుల‌కు ఇబ్బందులు త‌ప్పుతాయ‌న్నారు. కోవిడ్ మేనేజ్‌మెంట్  విష‌యంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చ‌ర్య‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నాయ‌ని మంత్రి ఆదిమూల పు సురేష్ స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో జేఎన్‌టీయూ-కాకినాడ రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ సీహెచ్ స‌త్య‌నారాయ‌ణ‌; జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిట‌రింగ్ క‌మిటీ స‌భ్యులు న‌క్కా చిట్టిబాబు, వ‌ర్సిటీ అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-05 12:07:20

జూన్ 8న డిడిఆర్సీ సమావేశం..

విజ‌య‌న‌గ‌రం జిల్లా అభివృద్ధి స‌మీక్ష మండ‌లి స‌మావేశం జూన్ 8వ తేదీన ఉద‌యం 10.30 గంట‌ల‌కు క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో జ‌రుగుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగే స‌మావేశంలో జిల్లాకు చెందిన ఉప ముఖ్య‌మంత్రి  పాముల పుష్ప‌శ్రీ‌వాణి, పుర‌పాల‌క శాఖ మంత్రి  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లాకు చెందిన పార్ల‌మెంటు స‌భ్యులు, శాస‌న‌స‌భ్యులు, శాస‌న మండ‌లి స‌భ్యులు పాల్గొంటార‌ని పేర్కొన్నారు. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొంటార‌ని తెలిపారు. జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల అమ‌లుపై ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తార‌ని వెల్ల‌డించారు.

విజయనగరం

2021-06-05 11:58:39

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి..

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని  శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు  పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం పరిధిలోని గోశాల వద్ద సహచర సభ్యులతో కలిపి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ తమ ఇంటి ఆవరణలోనే  మొక్కలను నాటాలన్నారు. చిన్న పిల్లలకు ఇప్పటి నుంచే మొక్కలు నాటడం ఆలవాటు చేస్తే వారి తరం వచ్చేసరికి పచ్చదనం పరిఢవిల్లుతుందన్నారు. ముఖ్యంగా ఫలసాయాలు, పచ్చదనం ఇచ్చే మొక్కలు నాటడం ద్వారా అవి భావి తరాల వారికి ఎంతో బాగ ఉపయోగపడతాయన్నారు.  ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది కూడా పాల్గొని మొక్కలు నాటారు.

Simhachalam

2021-06-05 03:39:30

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి..

పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని  శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం పరిధిలోని తోటల్లో ఆమె ఈఓతో  కలిపి పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ తమ ఇంటి ఆవరణలోనే రెండు మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు వారే చూసుకోవాలన్నారు. ముఖ్యంగా ఫలసాయాలు, పచ్చదనం ఇచ్చే మొక్కలు నాటడం ద్వారా అవి భావి తరాల వారికి ఎంతో బాగ ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం కాకుండా అడ్డుకోవడానికి మంచి ఆయుధంగా కూడా పనిచేస్తాయన్నారు. భూమితల్లి ఒడిలో తమ బిడ్డల్లా మొక్కలను పెంచి మన చుట్టూ వున్న వాతావరణాన్ని పచ్చగా చేసుకోవడం ద్వారా మనం పీల్చే గాలికూడా స్వచ్ఛంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది కూడా పాల్గొని మొక్కలు నాటారు.

Simhachalam

2021-06-05 02:45:55