1 ENS Live Breaking News

అంగన్వాడీలకు బలవర్ధక బియ్యం..

అంగన్వాడీ కేంద్రాలకు జూన్ నుండి బలవర్ధక బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్  జె నివాస్ తెలిపారు. ఈ బలవర్ధక బియ్యాన్ని పౌరసరఫరాల సంస్ధ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐరన్, ఫోలిక్ ఏసిడ్, బి 12లతో సమ్మిళితం చేసిన బియ్యపు పిండిని తిరిగి బియ్యం రూపంలో మరల్చి (Fortified Rice) ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. పౌష్టికాహారం కలయికతో గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు బలవర్దకమైన ఆహారం అంది ఆరోగ్యంగా ఎదుగుదలకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. బలవర్ధక ఆహార అవగాహన పోస్టర్లను బుధ వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నివాస్ విడుదల చేసారు. జిల్లాలో 4,192 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 18,599 మంది గర్భిణీలు, 17,817 మంది బాలింతలు వెరశి 36,416 మంది మహిళలు, 3 నుండి 6 సంవత్సరాల వయస్సుగల చిన్నారులు 57,685 మంది బలవర్ధక ఆహారం పొందుతారని ఆయన చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నెలకు 2,219.59 క్వింటాళ్ళ బరవర్ధక బియ్యాన్ని జూన్ నుండి ప్రారంభం జరుగుతుందని ఆయన వివరించారు.   ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, జిల్లా సరఫరా అధికారి డి.వి.రావు, పౌరసరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ ఎన్.నరేంద్ర బాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరక్టర్ జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-02 13:58:38

విద్యార్డులకు డ్రై రేషన్ సరుకులు పంపిణీ..

జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా పాఠశాలల విద్యార్డులకు డ్రై రేషన్ గా  కందిపప్పుపంపిణీ  కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి బుధవారం ఉదయం కలెక్టరేట్ లో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా మధ్యాహ్న బోజన పధకం అమల చేస్తున్న పాఠశాలల విద్యార్డులకు సెప్టెంబర్ 2020 నుండి జనవరి 2021 నెలల మధ్య కాలములో 100 రోజులు పనిదినములుగా లెక్కించి డ్రై రేషన్ గా కందిపప్పును జగనన్న గోరుముద్ద (MDM) పథకంలో భాగంగా డ్రై రేషన్ గా ఈ నెల 2వ తేదీ నుండి సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమం క్రింద ప్రాధమిక పాఠశాలల విద్యార్థులకు 4.5 KGలు,  ప్రాధమికోన్నత/ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 6.5KGలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యా శాఖాధికారి మాట్లాడుతూ కందిపప్పు సరఫరా చేసేవారు వచ్చినప్పుడు ఆయా పాఠశాలల ప్రధానోపథ్యాయులు/ఉపాధ్యాయులు వచ్చి తీసుకుని, వెంటనే IMMS యాప్ నందు నమోదు చేయాలని తెలిపారు. అలాగే కందిపప్పును విద్యార్థులు/తల్లిదండ్రులకు  పంపిణీ చేసిన తరువాత కూడా వివరాలు IMMS యాప్ నందు నమోదు చేయాలన్నారు.  ఈ డ్రై రేషన్ పంపిణీ చేసేపుడు కోవిడ్-19 నిబంధనలను, జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని డిఈఓ కోరారు. 

కాకినాడ

2021-06-02 13:38:48

కోవిడ్ నియంత్రణలో అధికారుల క్రుషి ప్రశంసనీయం..

విశాఖ జిల్లాతో పాటుగా రాష్ట్రంలో కూడా  కోవిడ్ తగ్గుముఖం పట్టిందని, కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. బుధవారం కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ వర్కర్ల కృషి ఫలితంగా పాజిటివ్ రేటు 13 శాతానికి తగ్గిందన్నారు. అయినా ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వుండాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో జిల్లాలో కరోనా పరిస్థతి, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించామని చెప్పారు.  
నగరంలో కోవిడ్ చికిత్స 7 కోవిడ్ కేర్ సెంటర్లు, 74 ఆసుపత్రులలో  నిర్వహిస్తున్నారని, 5,779 పడకలు అందుబాటులో వున్నాయన్నారు.  కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ విశాఖ విస్తృతి, ఇతర జిల్లాల ఒత్తిడి వున్నందున కరోనా ఆసుపత్రులను తగ్గించట్లేదన్నారు. జిల్లాలో 113 బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్స జరుగుతుందని, అందులో 82 మందికి  కెజిహెచ్ లో చికిత్స  చేస్తున్నారని, మరో 9 ఆసుపత్రులను ముందు జాగ్రత్త చర్యగా సిద్దం చేశారని వెల్లడించారు. జిల్లాలో కరోనా, దానికి సంబంధించిన రుగ్మతలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఇతర పరికరాలు, సామగ్రి, హోమ్ ఐసోలేషన్ కిట్లు  అందుబాటులో వున్నాయన్నారు.  104 సెంటర్ సేవలు విషయంలో జిల్లా  ముందులో వుందన్నారు.  జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రణాళికా ప్రకారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  వ్యాక్సిన్ వేయించుకునే వారు ఎక్కువ సమయం వేచి వుండకుండా వారికి కేటాయించిన సమయాని ముందుగా తెలయజేయడం జరుగుతుందన్నారు.  వైద్యం, చికిత్స సేవాభావంతో చేయాలని, ముఖ్యమంత్రి ఆసుపత్రులకు స్పష్టం చేశారని, నిబందనలు పాటించని ఆసుపత్రులకు జరిమానాలు విధించామన్నారు. కోవిడ్ ను ఆరోగ్యశ్రీ కింద తీసుకొనని హాస్పటల్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబందనలు పాటించని ఆసుపత్రులకు రూ.57 లక్షలు జరిమానా, 30 కేసులు పెట్టడం, 8 నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. స్మశానాల వద్ద సౌకర్యాలు పెంచాలని జివియంసి పూర్తి ఖర్చు భరించేలా తీర్మానించామన్నారు.  బ్లాక్ ఫంగస్ పట్ల శ్రద్ద వహించవలసినదిగా ఈ.ఎన్.టీ. ఆసుపత్రిని ఆదేశించామన్నారు.  

అభివృద్ధి పనులపై సమీక్ష 
విశాఖ మహా నగర సంస్థ అభివృద్ధి పనులలో ఎక్కువగా పర్యావరణ అనుమతుల మూలంగా జాప్యం జరుగుతున్నదని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో సమన్వయం చేస్తారని చెప్పారు.  భూగర్భ మురుగు కాల్వలు, భూగర్భ విద్యుత్ కేబిల్స్ మధ్య సక్రమమైన అనుసంధానం వుండాలని గుర్తించామన్నారు.  అదే విధంగా అనకాపల్లి, అగనంపూడి, కొమ్మాది తాగునీటి పైపులైన్లు ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. అభివృద్ధి పనులకు కాలనిర్ణయిం చేసి, నిర్ణీత సమయాలలో సమీక్ష చేస్తారన్నారు.  విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వి.యం.ఆర్.డి.ఏ.) కు సంబంధించి రోడ్లు,  కైలాసగిరి అభివృద్ధి, ప్లానిటోరియం, కాపులుప్పాడ నేషనల్ హిస్టరీ పార్క్, మ్యూజియం పనులు, ముడసర్లోవ అభివృద్ధి పనులపై చర్చించడం జరిగిందన్నారు.  అంతే కాకుండా జిల్లాలోని గ్రామీణ ప్రాంత అభివృద్ధి, తాగు, సాగు నీటి పథకాలపైనా చర్చించామని వెల్లడించారు. 
అంతకు ముందు పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న పనులలో 70 శాతం పనులు పూర్తయ్యారని తెలిపారు.  జివియంసి కి రావలసిన బిల్లులు, పన్ను చెల్లింపు బకాయిల సమస్యను పిరిష్కరిస్తామన్నారు. రాజ్యసభ సభ్యులు  వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖను గొప్ప నగరంగా తీర్చి దిద్దాలన్న ముఖ్యమంత్రి ఉద్దేశాలకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేశామన్నారు.  అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో అభివృద్ది పనులపై సమీక్షలు నిర్వహిస్తామన్నారు.  నగరంలోని 98 వార్డుల అభివృద్ధికి కమిటీలను వేసి ప్రణాళికా బద్దంగా పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.  ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్, మళ్ళ విజయ ప్రసాద్, కె.కెరాజు తదితరులు పాల్గొన్నారు. 

Collector Office

2021-06-02 13:35:57

నగర వాసులంతా చెత్తను వేరుచేసి ఇవ్వాలి..

విశాఖనగర ప్రజలు తమ ఇంటిలో వ్యర్ధాలను 3 రంగుల చెత్త బుట్టలలో వేరు చేసి రోజూ పారిశుధ్య సిబ్బందికి అందించాలని అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు కోరారు. బుధవారం 3 జోన్ నందు 19వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో ముందుగా 19వ వార్డు పెద్దజాలారిపేట లో ప్రతీ ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరుగుతున్న విధానాన్ని తనిఖీ చేశారు. ప్రతి ఇంటిలో వ్యర్ధాలను వేరు చేయుటకు గాను, 3 రంగుల చెత్త బుట్టలను నివాసితులకు ఉచితంగా అదనపు కమిషనర్ పంపిణీ చేశారు. అనంతరం అదనపు కమిషనర్ నివాసితులతో మాట్లాడుతూ మీ మీ ఇంటిలో చెత్తను 3 రకాలుగా వేరు చేయాలని, అందుకు తడి చెత్తను పచ్చ బుట్టలోను, పొడి చెత్తను నీలం బుట్టలోను, ప్రమాదకరమైన చెత్తను ఎరుపు రంగు గల బుట్టలోను వేరు చేసి రోజూ మీ ఇంటికి వస్తున్న పారిశుధ్య సిబ్బందికి అందించాలని, పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని తెలిపారు. అనంతరం 21వ వార్డు నందు అదనపు కమిషనర్ పర్యటించారు. ఈ వార్డు నందు మెయిన్ రోడ్డు లో గల ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోయి ఉన్నందున ఆ స్థలాల్లో చెత్తను వెంటనే తరలించాలని వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ ను అదనపు కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జివిఎంసి స్టేటస్టికల్ అధికారి రమణ మూర్తి, శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.      

విశాఖ సిటీ

2021-06-02 13:32:39

ప్రైవేటు ఆసుపత్రులపై ఉక్కుపాదం..

విశాఖ లోని ప్రైవేటు ఆసుపత్రులలో పేషెంట్ల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయాడాన్ని అరికట్టాలని వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు.  మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరములో కోవిడ్-19 నివారణ, జివియంసి, విఎంఆర్డిఎ ప్రాజెక్టులపై  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి, నగర మేయర్ జి. వెంకట హరి కుమారి, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, ప్రభుత్వ విప్ బూడిముత్యాల నాయుడు, జె.సి.లు, ఇతర అధికారులతో సుధీర్ఝంగా సమీక్షించారు.  మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్యానికి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, అలాంటి ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు.  ఈ విషయమై నోడల్ అధికారులు స్ట్రాంగ్ గా ఉండాలన్నారు.  ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల వద్ద నుండి 70 లక్షల రూపాయలు వసూలు చేయడమైనదని, వాటిని ప్రభుత్వానికి జమ చేస్తామని జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు.  ఆరోగ్య శ్రీ పథకంలో క్యాస్ లెస్ వైద్యం జరుగుతోందన్నారు.  కెజిహెచ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలుపైన అడిగి తెలుసుకున్నారు.  కోవిడ్ మెటీరియల్ ఏ ఏ పి.హెచ్.సి. లకు కావాలో కనుక్కొని వారికి అందజేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.  బ్లాక్ ఫంగస్ కు  మరింత మెరుగ్గా వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.  కెజిహెచ్ లో నాన్ కోవిడ్ వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అని సూపరింటెండెంట్ డా. మైథిలిని ఆయన అడుగగా నాన్ కోవిడ్ వైద్య సేవలు ఉన్నట్లు తెలిపారు.  ఆసుపత్రులకు అవసరమైన ఎక్వీప్ మెంట్ ల కోసం ప్రతిపాదనలు పంపాలని చెప్పారు.  క్రిటికల్ కేర్ యూనిట్లు పై ఆసుపత్రుల సూపరింటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.  ENT, CHEST, VIMS ఆసుపత్రులపైన సమీక్షించి విమ్స్ లో వైద్యులు ఎంత మంది వైద్యులు ఉన్నారని డైరక్టర్ ను అడుగగా వైద్యులందరూ డెప్యుటేషన్ పై పనిచేస్తున్నట్లు తెలిపారు.   రాజ్య సభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ విమ్స్ ఆసుపత్రిలో వైద్యులు, కాంట్రాక్టు సిబ్బందిల పై జిల్లా కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకొన్నారు.  ఎంఎన్ఒ, తదితరులను శాశ్వతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడమైనదని, వైద్యులు డెప్యుటేషన్ పై పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.  అంతకు ముందు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ జిల్లాలో 74 నోటిఫై చేసిన ఆసుపత్రుల్లో కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఆక్సిజన్ సరఫరా, నిల్వ, బ్లాక్ ఫంగస్ కు చేస్తున్న వైద్యం, వ్యాక్సినేషన్, తదితర విషయాలపైన, మొబైల్ టీంలు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ద్వారా చేస్తున్న పరీక్షలు, మందులు పై వివరించారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో జిల్లా కలెక్టర్, ఎఎంసి ప్రిన్సిపల్, కెజిహెచ్ సూపరింటెండెంట్ లకు ఏ సమయంలో ఫోన్ చేసినా రెస్పాండ్ అయి సమస్యను పరిష్కరించే వారని తెలిపారు.  
  జివిఎంసిలో ప్రస్తుతం నడుస్తున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు జివియంసి కమీషనర్ కు చెప్పారు.  నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన పనులను వేగవంతం చేయాలన్నారు.  రూ.552 కోట్లతో  ప్రస్తుతం జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు, వాటర్ పైపు లైన్లు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.  జివియంసి కమీషనర్ సృజన మాట్లాడుతూ అనకాపల్లి, గాజువాక, హనుమంతవాకలలో పైపులైన్ పనులు జరుగుతున్నాయని,  కోర్టు సమస్య పూర్తి అయినందు వలన వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు.  రోడ్డ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి చెప్పగా భూ గర్భ విద్యుత్ లైన్ పనులు వలన రోడ్డు పనులు జాప్యం జరుగుతుందని కమీషనర్ మంత్రికి వివరించారు.  అవసరమైన పార్క్ లు, తదితర డిపిఆర్ లు అందజేస్తే గ్రాంట్లు కేటాయించనున్నట్లు రాజ్య సభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి చెప్పారు.  సామాజిక భవనాలు, కమ్యూనిటి హాల్ లు, శ్మశానాలు, రైతు బజార్ లకు భూమి కేటాయించాలని కమీషనర్ కు తెలిపారు. నగర మేయర్ జి. వెంకట హరి కుమారి మాట్లాడుతూ ఆరిలోవలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని మంత్రి కన్నబాబును కోరగా జాయింట్ కలెక్టర్ భూమి కేటాయిస్తే నిధులు తక్షణమే విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు.  వీధి లైట్లు, శానిటేషన్, తదితర అంశాలపై పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కమీషనర్ దృష్టికి తీసుకువచ్చారు. 
  బీచ్ రోడ్ ను కలిపే విశాఖ వేలీ స్కూలు రహదారి, లా కాలేజి , ITSEZ పెద్ద ఋషికొండ రహదారి, 380 ఎకరాల కైలాసగిరి పై  రీ స్టోరేషన్ అండ్ రీ డెవలప్ మెంట్ (వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్టు), రాం నగర్ లో వాణిజ్య సముదాయం, బీచ్ రోడ్ లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం అండ్ టూరిజం కాంప్లెక్స్, కైలాసగిరిపై ప్లానెటోరియం, తదితర ప్రాజెక్టులపై  ప్రస్తుతం చేపడుతున్న, చేపట్టబోయే ప్రాజెక్టులపైన  విఎంఆర్డిఎ కమీషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ప్రాజెక్టులు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని చెప్పారు.  రాజ్య సభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కైలాసగిరి నుండి భోగాపురం వరకు 6 లైన్ల రహదారి విఎంఆర్డిఎకే వస్తుందని, ఇందుకు సంబంధించి ఒక డిపిఆర్ తయారు చేయాలని కమీషనర్ కు సూచించారు.  ఎపిఇపిడిసిఎల్ సిఎండి నాగలక్ష్మి భూగర్భ విద్యుత్ లైన్ పురోగతిపై వివరించారు.  నగరానికి సంబంధించిన ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులకు సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు అవకాశం ఉంటుందని, శాఖల మద్య సమన్వయం చేసుకొని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి గావించాలన్నారు.
సమావేశానంతరం పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి. ప్రసాద్ మృతికి ఘనంగా నివాళులు అర్పించారు.  సమావేశానికి ముందు కోవిడ్ తో మృతి చెందిన వారికి తమ సంతాపాన్ని తెలిపారు.
  ఈ సమావేశంలో సమావేశంలో శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, ఉమాశంకర్ గణేష్, జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, జివియంసి కమీషనర్ సృజన, ఎపిఇపిడిసియల్ సిఎండి నాగలక్ష్మి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Collector Office

2021-06-02 13:27:19

అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడ అనధికార నిర్మాణాలు జరిగినా వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను హెచ్చరించారు. బుధవారం నాలుగవ జోన్  29వ వార్డులో జోనల్ కమిషనర్ తో కలసి ఆమె పర్యటించారు. ఈ వార్డు పర్యటనలో వెంకటపతిరాజు నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న కట్టడాన్ని కమిషనర్ పరిశీలించారు. భవన నిర్మాణ ప్లాన్ అనుమతుల నిబంధనలకు విరుద్ధంగా, సెట్ బ్యాకులు విడువకుండా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమీపంలో రోడ్డునకు ఆనుకొని అనధికారంగా దేవాలయ నిర్మాణంపై సంబంధిత టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఝాన్సీ ను వివరణ కోరారు. ఈ అనధికార కట్టడాలపై తగిన పరిశీలనలు జరపని టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఝాన్సీ, ప్లానింగ్ సెక్రటరిపై తగిన చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ ఫణిరాం ను ఆదేశించారు. భవన నిర్మాణ ప్లాన్ అనుమతులు పొందిన ప్రతీ నిర్మాణ ప్రదేశాలలో తప్పని సరిగా అనుమతి పొందిన ప్లాన్ కాపీను నిర్మాణదారులు ప్రదర్శించేలా చూడాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. అనధికార నిర్మాణాలను చేపడితే సహించేది లేదని, సంబంధిత ప్లానింగు అధికారులు నిత్యం పర్యటిస్తూ భవన నిర్మాణాలను పరిశీలించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. అనంతరం చెత్తను వేరు చేసి ఇవ్వని సుహారిక అపార్ట్మెంట్ ను కమిషనర్ పరిశీలించారు. అపార్ట్మెంట్ నివాసితులు చెత్తను వేరు చేసి రోజూ పారిశుధ్య సిబ్బందికి అందించనందున అపార్ట్మెంట్ నివాసితులకు జరిమానా విధించమని కమిషనర్ ప్రధాన వైధ్యాదికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని ఆదేశించారు. అనంతరం వార్డు నందు పలుచోట్ల రోడ్లను తవ్వి, పూడ్చకుండా వదిలేయడం వలన ప్రజల రాకపోకల ఇబ్బందిని కమిషనర్ గమనించారు. రోడ్ల పనులు పూర్తి అయిన పిదప, సిమెంటు పూడ్చకుండా వదిలేసిన ఇపిడిసిఎల్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు జరిమానా విధించాలని జోనల్ కమిషనర్ ఫణిరాం ను ఆదేశించారు. అనంతరం, ఆ వార్డు నివాసితులతో మాట్లాడుతూ, ప్రతి ఇంటి వారు చెత్తను వేరు చేసి అందించాలని అన్నారు. రాబోయే వర్షాకాలంలో దోమలు వృద్ధి చెందకుండా నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. తద్వారా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా అరికట్టవచ్చన్నారు. ప్రతీ రోజూ ఇంటింటి నుండి వేరు చేసిన చెత్తను పారిశుధ్య సిబ్బంది సేకరించేలా అందరు శానిటరి ఇన్స్పెక్టర్లు చూడాలని కమిషనర్ అన్నారు. వీధిలో రోడ్లను ఊడ్చి చెత్తను సేకరించుటకు కావలసిన గార్బేజ్ బ్యాగులను సీవేజ్ ఫారం నుండి పొందవలెనని కమిషనర్ శానిటరి ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్ ఫణిరాం, కార్యనిర్వాహక ఇంజినీర్(ఎలక్ట్రికల్) పి. శ్రీనివాస రావు, కార్యనిర్వాహక ఇంజినీర్(మెకానికల్) చిరంజీవి, అసిస్టెంట్ ఇంజినీరు (వాటర్ సప్ప్లై) విల్సన్, శానిటరి సూపర్వైజర్ శ్రీనివాస రాజు, శానిటరి ఇన్స్పెక్టర్ అప్పలరాజు, వార్డు సెక్రటరి తదితరులు పాల్గొన్నారు.   
 

29ward vizag

2021-06-02 13:25:30

ఉద్యోగస్తుల కోసం ఇళ్ల స్థలాల పరిశీలన..

ప్రభుత్వంలోని మధ్యతరగతి ఉద్యోగులకు ఎమ్ ఐ జి స్కీమ్ లో  ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు రాజమండ్రి నగరపాలక సంస్థ కమీషనర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. బుధవారం ఈ మేరకు  వెలుగుబంద,తొర్రేడు, రాజవోలు తదితర ప్రాంతాల్లో లభ్యత లో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. అర్హులైన వారికి నిర్దేదించిన మార్గదర్శకాలను అనుసరించి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ పర్యటనలో కమీషనర్ వెంట సిటీ ప్లానర్ ప్రసాద్, రాజనగరం,రూరల్ మండల తహసీల్దార్ లు పాల్గొన్నారు.

Rajahmundry

2021-06-02 13:12:50

స్వామి సేవలన్నీ కళ్యాణమండపంలోనే..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో  స్వామివారికి ఆదివారం, గురువారం, ఏకాదశినాడు తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ సహస్రనామం, అష్టత్తరాలతను కళ్యాణ మండపంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు దేవస్థానంలోని అర్చకులు, ప్రధాన సిబ్బందితో ఆమే సమావేశం అయి పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్వామి సేవల్లో పాల్గొన్నవారికి లైవ్ లింక్ ప్రత్యేకంగా పంపించాలని నిర్ణయించారు.  శుక్రవారం నుంచే ఈ సేవలు ప్రారంభంకానున్నాయని చెప్పిన ఈఓ.. కోవిడ్ 19 సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈసమయంలో  స్వామిని మరింత నిశితంగా చూసేందుకు భక్తులకు అవకాశం కలుగుతోంది.  సహస్రనామాలు ఉదయం 7:00 నుంచి 8:00 గంటల వరకు , అష్టోత్తరం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, గురువారం, ఆదివారం, ఏకాదశినాడు వేరే సేవలున్న రోజుల్లో  సహస్రనామాలు, అష్టోత్తరాలుండవుని ఈఓ వివరించారు..

Simhachalam

2021-06-02 13:05:42

అప్పన్న హుండీ ఆదాయం రూ. 32.42 లక్షలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీ లెక్కింపులో 32లక్షల 42వేల 439  రూపాయల ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియ జేశారు. ఈ మేరకు దేవస్థానంలో ఆమె మీడియాలో మాట్లాడారు. కోవిడ్ నిబంధన లతో దేవస్థానంలో మూడు హుండీలను లెక్కింపు చేపట్టినట్టు చెప్పారు. ఉన్న సిబ్బంది తోనే  మధ్యాహ్నం 12:00 గంటల వరకు లెక్కింపు చేపట్టినట్టు వివరించారు. మిగతా హుండీల లెక్కింపు తేదీని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.  దేవస్ధాన అధికారులు, ట్రస్టు బోర్డు సభ్యుల పర్యవేక్షలో కౌంటింగ్ జరిగిందని వివరించారు. నగదుతోపాటు 70 యూరోలు, 20 డాలర్లుకూడా హుండీల్లో స్వామికి వచ్చాయని చెప్పారు.

Simhachalam

2021-06-02 12:59:43

మెప్మా పిడిగా సుధాక‌ర్‌..

విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పేద‌రిక నిర్మూళ‌నా సంస్థ (మెప్మా) ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా బి.సుధాక‌ర‌రావు బుధ‌వారం అద‌న‌పు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయ‌న ప్ర‌స్తుతం డుమా ఏపిడిగా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఇది కాకుండా, 104 కాల్ సెంట‌ర్ ఇన్‌ఛార్జిగా కూడా క‌మాండ్ కంట్రోల్ రూములో బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల వ‌ర‌కూ మెప్మా పిడిగా అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌హించిన‌ కె.సుగుణాక‌ర‌రావు, ఆ బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పుకోవ‌డంతో, సుధాక‌ర‌రావును ఇన్‌ఛార్జిగా నియ‌మించారు. బాధ్య‌త‌లు స్వీక‌రించిన సుధాక‌ర్‌ను ప‌లువురు అధికారులు, సిబ్బంది అభినందించారు.

Vizianagaram

2021-06-02 12:52:17

వాహనమిత్ర పధకానికి దరఖాస్తు చేసుకోండి..

ఆటో, ట్యాక్సీ, క్యాబ్ వాహ‌న‌దారుల‌కు ఆర్థిక సాయం అందించే నిమిత్తం రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వాహ‌నమిత్ర ప‌థ‌కానికి అర్హ‌త క‌లిగిన వారు ఈ నెల 7వ తేదీ లోగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. ల‌బ్ధిదారుల‌కు ఒక్కొక్క‌రికి రూ.10వేల ఆర్థిక సాయం వ‌రుస‌గా మూడో సంవ‌త్స‌రం కూడా అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని కావున కొత్తగా వాహ‌నాలు కొనుగోలు చేసుకున్న‌వారు సంబంధిత స‌చివాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసుకొని సాయం పొందిన వారు మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేయ‌న‌వ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే పాత‌వారు స‌చివాల‌యాల్లో ల‌బ్ధిదారుల జాబితాల‌ను స‌రిచూసుకోవాల‌ని ఒక వేళ పేర్లు లేన‌ట్ల‌యితే మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని చెప్పారు. ద‌ర‌ఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, తెల్ల రేష‌న్‌ కార్డు, వాహ‌నం యొక్క రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, బ్యాంకు ఖాతా పాస్ బుక్ మొద‌టి పేజీ కాపీ, కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించాల‌ని వివ‌రించారు. వాహ‌నం భార్య పేరుమీద‌ ఉండి ఆమెకు లైసెన్స్ లేక‌పోయినా, భ‌ర్త‌కు లైసెన్స్ ఉంటే అర్హులేన‌ని చెప్పారు. అలాగే వాహ‌నం తల్లి, తండ్రి లేదా కూతురు, కుమారుడు పేరిట ఉండి లైసెన్స్ మేజ‌ర్ కుమారుడు పేరుమీద ఉన్నా ప‌థ‌కానికి అర్హులేన‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ద‌ర‌ఖాస్తు నింప‌డంలో, నింపిన ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించ‌టంలో స‌మ‌స్యలు ఉన్న‌చో స్థానిక ఎంపీడీవో, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో సంప్ర‌దించాల‌ని సూచించారు. ఈ నెల 7వ తేదీ లోగా స‌మ‌ర్పించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న ప్ర‌క్రియ 12వ తేదీలోపు పూర్త‌వుతుంద‌ని పేర్కొన్నారు. జూన్ 15వ తేదీన ముఖ్య‌మంత్రి చేతుల‌ మీదుగా అర్హులైన ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.10వేల ఆర్థిక సాయం జ‌మ అవుతుంద‌ని వివ‌రించారు. ఈ మేర‌కు జిల్లాలో సంబంధిత విభాగాల అధికారులతో బుధ‌వారం టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి ల‌బ్ధిదారుల ఎంపిక‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. సంబంధిత సాంకేతిక ప్ర‌క్రియ‌లు పూర్తి చేయాల‌ని, ల‌బ్ధిదారుల ఎంపికిలో పార‌ద‌ర్శ‌క‌త వ‌హించాల‌ని సూచించారు. టెలీకాన్ఫ‌రెన్స్‌లో సంయుక్త క‌లెక్ట‌ర్లు జి.సి. కిశోర్ కుమార్‌, జె. వెంక‌ట‌రావు, జిల్లా ర‌వాణా శాఖ ఉప క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవి, సీఈవో టి. వెంక‌టేశ్వ‌రరావు, ఎంపీడీవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-02 12:49:21

చివరి సాగుభూమి నీరందిస్తాం..

విజయనగరం  జిల్లాలోని  సాగుభూమి అంతటికీ నీరందేలా చర్యలు చేపట్టినట్టు  జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవాహర్ లాల్  తెలిపారు.   అందుకోసం నీటి పారుదల శాఖ ఒక ప్రణాళికను తయారు చేసిందని అన్నారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  జిల్లా ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు  ఆధ్వర్యం లో బుధవారం జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం వర్చువల్ విధానం లో  జరిగింది. ఈ సమావేశం లో జిల్లాకు చెందిన శాసన సభ్యులు, శాసన  మండలి సభ్యులు వర్చువల్ గా పాల్గొన్నారు. జిల్లా నీటి వనరుల వివరాలను, సాగు నీటి ప్రణాళికలను ఎస్.ఈ తొలుత వివరించారు.  ఈ సందర్భంగా   జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  జిల్లాలో  5,03,250 ఎకరాల ఆయకట్  కు  నీరందించవలసి ఉందని,  భారీ , మధ్య , చిన్న తరహా నీటి పారుదల వనరుల ద్వారా 35.75 టి.ఎం.సి ల నీటి నిల్వ  సామర్ధ్యం  ఉందని,  ప్రస్తుతం 8.272 టి.ఎం.సి ల నీరు నిల్వ ఉందని  తెలిపారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున  సాగు నీటికి ఇబ్బంది ఉందని భావిస్తున్నామన్నారు.   వర్షాలతో పాటు అన్ని జలాశయాలను, చప్టా లను, కల్వర్ట్  లను మరమ్మతులు చేసి  నీటి సామర్ధ్యాన్ని పెంచడానికి  తగిన ప్రణాళికలు తయారు చేశామన్నారు. 
బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వెంకట  చిన్న అప్పల నాయుడు  మాట్లాడుతూ ప్రొజెక్టులకు సంబంధించిన భూ సేకరణ  చెల్లింపులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే రైతులకు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ 14.80 కోట్ల కు గాను 10.80 కోట్ల బకాయిలు చెల్లించడం జరిగిందని, మిగిలిన మొత్తం కూడా సి.ఎఫ్.ఎం.ఎస్. లో బిల్ పెట్టడం జరిగిందన్నారు.  పార్వతిపురం శాసన సభ్యులు అలజంగి జోగా రావు మాట్లాడుతూ   నీటిని నెల రోజుల ముందుగానే విడుదల చేయాలని కోరారు. సాగు నీటి సామర్ధ్యాన్ని పెంచడానికి  మైనర్ ఇరిగేషన్ టాంక్ ల సామర్ధ్యాన్ని పెంచవలసి ఉందని కలెక్టర్ ను కోరారు. నీటి విడుదల కోసం ఆయా ప్రజా ప్రతినిధులతో చర్చించి,  తేదీలను ఖరారు చేస్తామని అన్నారు.  మైనర్ టాంక్ ల అభివృద్ధి కోసం  ఇప్పటికే 50 కోట్ల విలువ గల పనుల కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.   సాలూరు శాసన సభ్యులు రాజన్న దొర మాట్లాడుతూ పెద్ద గెడ్డ  పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.   
జంఝావతి రబ్బర్ డ్యామ్ అంతర్ రాష్ట్ర  సమస్యను  పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయి లో చర్చ జరగవలసి ఉందని, దీనిని ప్రభుత్వ దృష్టికి తేవడం జరిగిందని అన్నారు.  ఈ ప్రాజెక్టు  పనుల కోసం 3.8 కోట్ల తో అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.  ప్రపంచ బ్యాంక్  నిధులతో 20 పనులు మంజూరు కాగా 17 పనులు పురోగతి లో ఉన్నాయని తెలిపారు. ఈ ఖరీఫ్ కు ప్రతి ఏకరాకు సాగు నీరు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 
ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో  జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ పోలేశ్వర రావు, ,  బొబ్బిలి ఎస్.ఈ రాంబాబు, ఈ ఈ లు  అప్పల నాయుడు, రామచంద్ర రావు, తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.  

Vizianagaram

2021-06-02 12:47:09

వైద్య, ఆరోగ్యానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత..

రాష్ట్రంలో ప్రజలందరికీ అత్యాధునిక వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలతో రాష్ట్రం ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ గా మారుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేవలకు సిఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రంలో 95శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని ఉచితంగా అందించడంతో పాటుగా వేల కోట్ల రుపాయల వ్యయంతో కొత్త మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్ లు, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.
పార్వతీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక వైద్యశాలను బుధవారం ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు 104 కాల్ సెంటర్  ద్వారా అవసరమైన సహాయ సహకారాలను అందించడం జరుగుతోందని చెప్పారు. కోవిడ్ నియంత్రణ కోసం సిఎం చేపట్టిన చర్యలను కేంద్ర మంత్రులు కూడా ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. రాష్ట్ర జనాభాలో 95శాతం మంది ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉండగా వారికి అవసరమైన చికిత్సలన్నింటినీ పూర్తి ఉచితంగా అందించడానికి, కోవిడ్ ఆస్పత్రుల్లోనూ 50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పథకానికి చెందిన రోగులకే కేటాయించడానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. అధిక ఫీజులను గుంజుతున్న ఆస్పత్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కూడా కార్పొరేట్ వైద్యసేవలు అందించడం ద్వారా పేదలకు ఆరోగ్యభరోసాను కల్పించారని కితాబిచ్చారు. కరోనా తో పాటుగా బ్లాక్ ఫంగస్ వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి వాటికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందించడంతో పాటుగా చికిత్సానంతరం రోగి విశ్రాంతికాలంలోనూ ఇబ్బంది పడకుండా నెలకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని వైయస్సార్ ఆరోగ్య భరోసాగా అందిస్తున్నారని చెప్పారు. అత్యాధునికమైన వైద్య సేవలను పొందడానికి రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలలోని నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా 16 హెల్త్ హబ్ లను ఏర్పాటు చేయడానికి చర్యలను తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక వైద్య కళాశాల, 500 పడకల అత్యాధునిక ఆస్పత్రి ఉండేలా రూ.8 వేల కోట్ల వ్యయంతో ఒకేసారి 16 కొత్త మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి ప్రస్తావించారు. ఇప్పటికే ప్రతి మండలంలోనూ 108 ఆంబులెన్స్ వాహనాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేసారు. ఇది కాకుండా రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రజల ముంగిళ్లలోకే వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల ఫలితంగా రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మారుతోందని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావుతో పాటుగా పార్వతీపురం మున్సిపల్ ఛేర్ పర్సన్ బోన గౌరీశ్వరి కూడా పాల్గొన్నారు.

Parvathipuram

2021-06-02 12:45:33

పంపిణీకి సిద్ధమైన పాఠ్యపుస్తకాలు..

విజయనగరం జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు పంపిణీ చేసేందుకు పాఠ్య‌పుస్త‌కాలు సిద్ద‌మ‌య్యాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు  26ల‌క్షాల‌, 66వేల‌, 378 పుస్త‌కాలు అవ‌స‌ర‌మ‌ని అంచ‌నా. కాగా వీటిలో మొద‌టి విడ‌త‌గా 5ల‌క్ష‌ల‌, ఒక వెయ్యి, 471 పుస్త‌కాలు వ‌చ్చాయి. వీటిని ఆయా ప్రాంతాల్లోని గోదాముల్లో భ‌ద్ర‌ప‌రిచారు. ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా విద్యార్థుల‌కు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగ‌మ‌ణి తెలిపారు. కరోనా కేసుల ద్రుష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకొని విద్యార్ధులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు డిఈఓ తెలియజేశారు.

Vizianagaram

2021-06-02 12:43:56