1 ENS Live Breaking News

ఎన్ఎంఆర్ ఉద్యోగుల వేతనాలు పెంపు..

నామిన‌ల్ మ‌స్ట‌ర్ రోల్ (ఎన్ఎంఆర్‌) 2021-22 సంవత్సరానికి ఉద్యోగులు, కార్మికులకు రోజువారీ క‌నీస వేత‌నాలను నైపుణ్యం గ‌ల‌వారికి రూ.650,  పాక్షిక నైపుణ్యాలున్న వారికి రూ.460, నైపుణ్యం లేని వారికి రూ.370 లుగా పెంచుతూ నిర్ణ‌యించిన‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్  అధ్య‌క్ష‌త‌న ఎన్ఎంఆర్ పద్దతిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేత‌న నిర్ణయం పై ప్ర‌త్యేక క‌మిటీ స‌మావేశం వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగింది. వినియోగ‌దారు ధ‌ర‌ల సూచీ (సీపీఐ) ఆధారంగా మదింపు చేసి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీస‌ర్, కార్మిక‌శాఖ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌లు వేత‌నాల‌పై రూపొందించిన ప్ర‌తిపాద‌న‌ల‌పై క‌మిటీ చ‌ర్చించింది. అదే విధంగా 2020-21లో నిర్దేశించిన నైపుణ్యం ఉన్న‌వారికి రూ.643, మ‌ధ్య‌త‌ర‌హా నైపుణ్యం ఉన్న‌వారికి రూ.460, నైపుణ్యం లేనివారికి రూ.367 వేత‌నాలకు, ప్ర‌స్తుత ప్ర‌తిపాద‌న‌ల మ‌ధ్య వ్య‌త్యాసాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి స‌మావేశంలో వివ‌రించారు. అన్ని అంశాల‌నూ సహేతుకంగా ప‌రిశీలించిన మీద‌ట క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. 2021-22కు కొత్త క‌నీస వేత‌నాల‌ను సవరిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. జిల్లాలో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద భారీఎత్తున జ‌ర‌గ‌నున్న ఇళ్ల నిర్మాణాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను దృష్టిలో ఉంచుకొని వేత‌నాల‌ను స్థిరీకరించామని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఉపాధి క‌ల్పించే వారికి, ఉపాధి పొందే వారికి ఇద్ద‌రికీ ఇబ్బంది లేకుండా స‌మ‌తుల్యం పాటిస్తూ క‌మిటీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. కొత్త వేత‌నాల‌ను ప‌టిష్టంగా అమ‌ల‌య్యేలా సంబంధిత శాఖ‌ల అధికారులు చూడాల‌ని, నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, సీపీవో బాలాజీ, కార్మిక శాఖ అదనపు కమిషనర్ ఎన్. బుల్లిరాణి తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-04 16:00:24

చంద్రుడూ గుడ్ జాబ్..సీఎం వైఎస్ జగన్..

తాడిపత్రి తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'చంద్రుడూ.. గుడ్ జాబ్' అంటూ జిల్లా కలెక్టరు గంధం చంద్రుడును అభినందించారు. కోవిడ్ కష్ట కాలంలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నిల్వలను ఉపయోగించుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రిని నిర్మించిన జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అంతకు ముందుు సీఎం వర్చువల్ విధానంలో ఆసుపత్రిని ప్రారంభించారు.  ఆసుపత్రి నిర్మాణంలో పాలు పంచుకున్న అర్జాస్ స్టీల్స్, మేఘా గ్రూప్ మరియు ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఆసుపత్రిలో డాక్టర్లు అవసరమైతే స్వతహాగా డాక్టర్లైన ఎమ్మెల్యేలైన మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి సేవలను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సరదాగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నుంచి అభినందనలు దక్కడపై జిల్లా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే వారికి బెడ్డు లేదు అని ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం చేపట్టి, అహర్నిశలూ పని చేశామని, కేవలం రెండు వారాల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయగలగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కష్టానికి ముఖ్యమంత్రి నుంచి అభినందన దక్కడం బోనస్ అన్నారు.  ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ .. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రిలో కడప, కర్నూలు జిల్లాల ప్రజలకు పడకలు కేటాయిస్తామన్నారు. కేవలం 14 రోజుల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం జరిగిందన్నారు. ఆక్సిజన్ అందిస్తున్న అర్జాస్ స్టీల్స్,  ఆక్సిజన్ సరఫరా కోసం కాపర్ పైపులు అందించిన మేఘా గ్రూప్ మరియు స్థల దాతలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. 

Tadipatri

2021-06-04 15:53:02

రుణాలు సత్వరమే వచ్చేలా చూడండి..

జగనన్న తోడు పథకంలో అర్హులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో రుణాలు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించనున్న నేపధ్యంలో జిల్లాలోని పరిస్థితిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం తన ఛాంబర్లో సమీక్షించారు.
చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు ఇప్పించి వారిని ఆదుకోవాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్నిఆన్ లైన్ చేస్తున్నందున అర్హులంద రూ లబ్దిపొందేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 32,248 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు ఈ సందర్భంగా కలెక్టరుకు తెలిపారు. వీరిలో పట్టణ ప్రాంతాల్లోని 10 వేల మందికి పి.ఎమ్. స్వనిధి నిధులను పి.డి.సి.సి. బ్యాంకు ద్వారా అందించాల్సి ఉందన్నారు. మిగ తావారికి డి.ఆర్.డి.ఏ. ద్వారా స్త్రీనిధి నిధులతో ఈ ఆర్థిక సహాయం అందించాల్సి ఉందని వారు వివరించారు. అయితే బ్యాంకుల వద్ద కొన్ని దరఖాస్తులు పరిశీలన పెండింగ్ లో ఉందని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వీటిని వెంటనే పరిష్కరించి అర్హులందరికీ రుణాలు మంజూరు చేసేలా చూడాలని బ్యాంకు అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.ఎస్. చేతన్ (సచివాలయాలు, అభివృద్థి), డి.ఆర్.డి.ఏ. పి.డి. బాబూరావు, మెప్మా పి.డి. పి.వి. నారాయణ, ఎల్.డి.ఎమ్. యుగంధర్, పి.డి.సి.సి. బ్యాంకు సి.యి.ఓ. శివకోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు

2021-06-04 15:37:23

సుందర నగరంగా మన ఒంగోలు..

మన ఒంగోలు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యుత్, అటవీ శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి  బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని 2.93 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆమలు చేయడానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఒంగోలు నుండి కొప్పోలు రహదారిలో97లక్షల రూపాయల తో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. అలాగే గుంటూరు రోడ్లు లో మరియు కర్నూలు రోడ్డు లో 1.96కోట్ల రూపాయల తో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందనిఆయన అన్నారు.ఒంగోలు నగరంలో కోవిడ్ వల్ల అభివృద్ధి పనులు జ్యా పము జరుగుతుందన్నారు. త్వరలో ఒంగోలు నగరం లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు. కోవిడ్ నియంత్రణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కారంచేడు ప్రభుత్వ వైద్యులు ఆరోగ్యం కాపాడటానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.  ప్రభుత్వ వైద్యులు ఊపితిత్తులు మార్పిడి కోసం అయ్యే ఖర్చు1.5కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్.ఎన్. పాడు ఎమ్మెల్యే టి.జె.ఆర్.సుధాకర్ బాబు, ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీవ్ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, ఇ.ఇ సుందర్ రామిరెడ్డి, వై.సి.పి నాయకులు ఐ.ఘన శ్యామ్, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్ రావు,తదితరులు పాల్గొన్నారు. 

Ongole

2021-06-04 15:33:33

తిరుమ‌లలో ఘనంగా హనుమజ్జయంతి..

తిరుమల క్షేత్రంలోని అంజ‌నాద్రి కొండ‌పై ఆంజ‌నేయ‌స్వామివారు జ‌న్మించిన ఆకాశ గంగ తీర్థం వ‌ద్ద హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లను శుక్ర‌వారం తొలిసారిగా టిటిడి ప్రారంభించిన‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్స‌వాల‌ను అకాశ‌గంగ‌, జాపాలి వ‌ద్ద నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.  ఇందులో భాగంగా ఆకాశ‌గంగ వ‌ద్ద అంజ‌నాదేవి, బాల ఆంజ‌నేయ‌స్వామివారికి నిర్మించిన ఆల‌యంలో అభిషేకం, త‌మ‌ల‌పాకుల‌తో పూజ‌, మ‌ల్లె పూల‌తో అర్చ‌న నిర్వ‌హించామ‌న్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహించిన‌ట్లు తెలిపారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌ధ్యంలో ఇక్క‌డ‌కు రాలేని భ‌క్తులు ఎస్వీబిసి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షించి స్వామివారి అనుగ్ర‌హ‌నికి పాత్రులు కావాల‌ని కోరారు. ఈ ఉత్స‌వాల‌కు ఏర్పాట్లు చేసిన టిటిడి సిబ్బందిని ఆయ‌న అభినందించారు.  అనంత‌రం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ మాట్లాడుతూ వైశాఖ శుద్ధ ద‌శ‌మినాడు హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు నిర్వ‌హిస్తార‌న్నారు. స్కంధ పురాణంలో తెలిపిన విధంగా మాతంగా మ‌హ‌ర్షి సూచ‌న మేర‌కు అకాశ‌గంగ తీర్థం వ‌ద్ద అంజ‌నాదేవి వేలాది సంవ‌త్స‌రాలు త‌ప‌స్సు చేసి ఆంజ‌నేయ‌స్వామివారికి జ‌న్మ‌నిచ్చిన‌ట్లు చెప్పారు. ఇప్పుడు ఆల‌యం నిర్మించిన ప్ర‌దేశంలోనే అంజ‌నాదేవి త‌ప‌స్సు చేసిన‌ట్లు తెలిపారు. భార‌తీయ స‌నాత‌న ధ‌ర్మం, సంస్కృతికి మూల‌మైన పురాణాల‌ను అనుస‌రించి ఆంజ‌నేయ‌స్వామివారు ఇక్క‌డ జ‌న్మించార‌ని వివ‌రించారు. త‌రువాత అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి  జ‌యంతి సావిత్రి బృందం హ‌నుమంతుని వైభ‌వంపై హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు. ఈ పూజ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు. సివిఎస్వో  గోపినాధ్ జెట్టి దంప‌తులు, ఎస్వీబిసి సిఇవో  సురేష్ కుమార్‌, విజివో  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 9.00 గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వ‌హించారు.

Tirumala

2021-06-04 15:29:32

జాపాలి ఆంజనేయునికి పట్టు వస్త్రాలు..

తిరుమలలోని జాపాలి తీర్థంలో గల శ్రీ ఆంజనేయస్వామివారికి హనుమజ్జయంతి సంద‌ర్భంగా టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు శుక్ర‌వారం ఉద‌యం పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించి ప్ర‌త్యేక పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఆకాశ గంగ తీర్థంలో అంజ‌నాదేవి త‌ప‌స్సు చేసి వాయుదేవుని ఆశీర్వ‌దంతో ఆంజ‌నేయ‌స్వామివారికి జ‌న్మ‌నిచ్చింద‌న్నారు. త్రేత‌యుగంలో అంజ‌నాద్రి కొండ‌పై జాపాలి మ‌హ‌ర్షి త‌ప‌స్సు చేసి ఆంజ‌నేయ‌స్వామివారిని ప్ర‌స‌న్నం చేసుకున్నార‌ని తెలిపారు. కావున ఈ క్షేత్రానికి జాపాలి క్షేత్రం అని పేరు వ‌చ్చింద‌ని, ఇక్క‌డ ఉన్న స్వామివారు స్వ‌యంభూ అని వివ‌రించారు. దుష్ట శ‌క్తుల‌ను సంహ‌రించే ఆంజ‌నేయ‌స్వామివారు క‌రోనా మ‌హ‌మ్మ‌రిని నిర్ములించి లోకంలోని ప్ర‌జ‌ల‌కు ఆయురారోగ్యాల‌ను ప్ర‌సాదిస్తార‌న్నారు. అంత‌కుముందు ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న టిటిడి అద‌న‌పు ఈవో దంప‌తులకు, సివిఎస్వో  గోపినాధ్ జెట్టి దంప‌తుల‌కు హ‌థీరాంజీ మ‌ఠం మ‌హంతు  అర్జున్‌దాస్ స్వాగ‌తం ప‌లికారు.  కారోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారికి అభిషేకం, పూజ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంత‌గా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా జాపాలి క్షేత్రంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి  పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఆధ్వ‌ర్యంలో క‌ళాకారులు ఉద‌యం 10 నుంచి 11 గంటల వరకు హనుమాన్ చాలీసా ప‌ఠించారు. అనంత‌రం అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు భాగ‌వ‌తార్ ఆంజ‌నేయ‌స్వామివారి అవిర్భంపై హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.  ఈ కార్యక్రమాల్లో  శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాధ్‌, ఒఎస్‌డి  పాల శేషాద్రి, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, ఎస్టేట్ విభాగం డెప్యూటీ ఈవో  విజ‌య సార‌ధి, విజివో  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-06-04 15:26:55

హ‌నుమ‌త్ సేవ.. అష్ట‌సిద్ధుల‌కు త్రోవ..

లోకంలోని మాన‌వులలో ఎవ‌రైతే హ‌నుమంతుడిని సేవిస్తారో వారికి అష్ట‌సిద్ధులు సిద్ధిస్తాయ‌ని ప్ర‌ముఖ పండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం ఆచార్యులు రాణి స‌దాశివ‌మూర్తి ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లో హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో మొద‌టి రోజైన శుక్ర‌వారం నాద‌నీరాజ‌నం వేదిక‌పై  హ‌నుమంతుడు - అష్ట‌సిద్ధులు అనే అంశంపై ప్ర‌వ‌చన‌ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉప‌న్య‌సిస్తూ యోగశాస్త్రంలో ప్ర‌సిద్ధి చెందిన ఎనిమిది సిద్ధులు ఉన్నాయ‌ని, అందులో అణిమ, మహిమ, ల‌ఘిమ‌, గ‌రిమ‌, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశ‌త్వం, వ‌శీత్యం ఉన్నాయ‌న్నారు. వెంక‌టాద్రి క్షేత్రంలోని అంజ‌నాద్రి కొండ‌పై జ‌న్మించిన ఆంజ‌నేయ‌స్వామిలో జ‌న్మ‌తః ఈ అష్ట‌సిద్ధులు ఉన్నాయ‌ని, అందువ‌ల‌నే సూర్యుని పండుగా భావించి సూర్య మండ‌లానికి వెళ్లాడ‌ని తెలిపారు. సుంద‌ర‌కాండ‌లో హ‌నుమంతుని ప్ర‌వేశం నుండి యుద్ధ కాండ చివ‌రి వ‌ర‌కు అష్ట‌సిద్ధుల వ‌ల‌న ఆయ‌న లోకానికి అద్భుతాల‌ను చూపించి రామాయ‌ణాన్ని ఒక సుంద‌ర‌ ఇతి హ‌సంగా మ‌ల‌చ‌డానికి కార‌ణం అయ్యార‌న్నారు.   స‌క‌ల దేవ‌తా స్వ‌రూప‌ముగా, రుద్రావ‌తార మూర్తిగా, వాయుదేవుని అంశ‌తో ఉద్భ‌వించిన ఆంజ‌నేయ‌స్వామి లోకాల‌ను అలంరించిన తీరు అద్భుత‌మ‌న్నారు. యోగ శాస్త్రంలో వాయు బంధ‌నం చేసి య‌మ నియ‌మ ఆశ‌నాదుల ద్వారా సాధ‌న చేసిన సాధ‌కుడు అష్ట‌సిద్ధుల‌ను పొంద‌గ‌ల‌ర‌ని చెప్పారు. అన్ని వ్య‌వ‌హ‌రాల్లో సాఫ‌ల్యం సాధించ‌డానికి ఆంజ‌నేయ‌స్వామిని ఉపాస‌న చేయ‌డం వ‌ల‌న అష్ట‌సిద్ధులు పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించారు.   మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి విగ్రహానికి మ‌ధ్యాహ్నం 3 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు టిటిడి పూజా కార్యక్రమాలను నిర్వహించింది.

Tirumala

2021-06-04 15:24:32

స్వచ్ఛంద సంస్థలకు సహకారం అవసరం..

కోవిడ్ పై పోరులో స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యం అత్యంత విలువైనదని  జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. శుక్రవారం  కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ)  దినేష్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్వచ్ఛంద సేవా సంస్థల సమన్వయ కమిటి సమావేశం జరిగింది. సందర్భంగా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ నివారణ కొరకు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ యంత్రాంగం కలిసి ప్రణాళికా బద్ధంగా పని చేసినట్లైతే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లాస్థాయి ప్రభుత్వ సంస్థలు మరియు ఎన్.జి.ఓ కో- ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కోవిడ్ ను ఎదుర్కొనడానికి చేపడుతున్న చర్యలలో భాగంగా అవసరమైన ప్రాజెక్ట్ నివేదికలను తయారుచేయడానికి, పరికరాలను సమకూర్చుకోవడానికి, మానవ  వనరుల సైన్యాన్ని తయారు చేసుకోవడానికి, వివిధ స్థాయిలలో నిధులను సమకూర్చుకోవడానికి స్వచ్ఛంద సేవా సంస్థల నుండి నిష్ణాతులైన వ్యక్తులు ముందుకు రావాలని ఆయన కోరారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల కు కూడా వెళ్లి  ప్రజల అవసరాల మేరకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం నుండి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ భాగస్వామ్యాన్ని క్షేత్రస్థాయిలో పటిష్ట పరచడానికి డివిజన్ మరియు మండల స్థాయి, గ్రామ స్థాయిలో కమిటిల ఏర్పాటుకు అవసరమైన ఉత్తర్వులను అధికారులకు త్వరలో జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా స్థాయి ప్రభుత్వ సంస్థలు మరియు ఎన్.జి.ఓ కో- ఆర్డినేషన్ కమిటీకి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన రావు, కన్వీనర్ గా పిల్లల రక్షణ అధికారి విజయ్ కుమార్ సభ్యులుగా నియమిస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారిని మనోరంజని వివిధ స్వచ్ఛంద సంస్థ లైన  రెడ్ క్రాస్, డి బి ఆర్ సి, సీడ్స్, వి ఆర్ ఓ, అసిస్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Guntur

2021-06-04 15:22:07

ప్రాధమిక ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేదల ఆరోగ్య పరిరక్షణకి పెద్ద పీట వేస్తున్నారని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. శుక్రవారం అనకాపల్లి జోన్ లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు ఆమె ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్, ఎంపీ బివి సత్యవతిలతో కలసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సీఎం హెల్త్ సెంటర్స్ ద్వారా మెరుగైన ప్రాధమిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పధకం క్రింద అనేక జబ్బులకు ఉచితంగా కార్పోరేట్ వైద్యం అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాదయాత్రలో ఇచ్చిన హామీలు 90శాతం  నేరవేర్చిన సీఎం వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. ఎంపీ మాట్లాడుతూ, అనకాపల్లిలో రెండు ఆసుపత్రులు ఒక్కొక్కటి రూ.80లక్షల వ్యయంతో ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.  ఈ రెండు ఆసుపత్రులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని జివిఎంసి ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ మేయర్ జియ్యని శ్రీధర్, కార్పొరేటర్ ఎం. చినతల్లి, 84వ వార్డు వై.సి.పి. ఇంచార్జ్ పలక రవి, పర్యవేక్షక ఇంజినీరు రాజా రావు, కార్యనిర్వాహక ఇంజినీరు మత్స్యరాజు, జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.      

Anakapalle

2021-06-04 15:18:35

ఫిషింగ్ హార్బర్ల కోసం ప్రత్యేక పరిశీలిన..

విజయనగరం జిల్లాలో  ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, ఫిష్ ల్యాండ్ లకు అనువైన ప్రదేశాల ఎంపికపై సాధ్యాసాధ్యాలను చెన్నై నుంచి వచ్చిన బ్రుందంతో కలిసి పూసపాటి రేగ మండలంలో పరిశీలించినట్టు మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మల కుమారి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని చింతపల్లిలో ఆమె బ్రుందంతో కలిసి పర్యటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ఏడు ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ లను నిర్మించ తలపెట్టిందని, అందులో భాగంగా జిల్లాలో నిర్మించ తలపెట్టిన ఫిషింగ్ హార్బర్ కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ కి చెందిన నిపుణులతో  అక్కడి ప్రాంతాలను పరిశీలించామన్నారు. అంతేకాకుండా మత్స్యకారుల ద్వారా ఈ ప్రాంతం యొక్క బౌగోళిక పరిస్థితులు, తుఫానులు వచ్చినపుడు సంభవించే పరిస్థితులు, ఇతరత్రా అంశాలను చర్చించి స్వయంగా  బ్రుందంతో కాలిపి పరిశలించామన్నారు. పైగా ఏ ప్రాంతంలో అయితే హార్బర్ కి అనువుగా వుంటుందనే కోణంలో కొన్ని అంశాలపై స్థానిక మత్స్యకారులతో కూడా మాట్లాడినట్టు చెప్పారు. ఓడరేవులకు మార్గాలు, తీరాలకు జాతీయ స్థాయిలో సాంకేతికతకు సంబంధించిన అంశాలు కూడా ప్రత్యేక బ్రుందంతో చర్చించామన్నారు. ఇక్కడి ప్రాంతాల పరిశీలన అనంతరం ఫిష్ ల్యాండ్ కి సంబందిచిన విషయాన్ని ప్రభుత్వానికి చెన్నై బ్రుందం నివేదిక ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సహాయ సంచాలకులు కిరణ్ కుమార్,  అభివ్రుద్ధి అధికారిణి చాందిని, గ్రామ మత్స్యశాఖ సహాయకులు, మత్సకార మిత్రాలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Pusapatirega

2021-06-04 15:08:53

పన్ను నవీకరణలపై సూచనలివ్వండి..

మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని కొత్తగా వేసే పన్నులపై ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నట్టు కమిషనర్ డా.జి.స్రిజన తెలియజేశారు. ఈమేరకు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం 1955 ప్రకారము తేది.24.11.2020న జారి చేసిన జి.ఓ.ఎం.ఎస్.నెం.198లోని “ఆస్థి పన్ను విధింపు నియమాలు –2020” ననుసరించి, ఆస్తుల క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ నిర్ణయించిన భవనాలు, వాటి స్థలముల “మూలధన విలువల” ఆధారముగా తేది.01.04.2021 నుండి ఆస్థి పన్ను విధించుటకు నిర్ణయించి, నివాస భవనముల “మూలధన విలువ” మొత్తమునకు 0.15% మరియు నివాసేతర భవనముల “మూలధన విలువ” మొత్తముపై 0.30% ,  ఖాళీ స్థలముల “మూలధన విలువ” మొత్తముపై 0.50% విధించుటకు కార్పోరేషన్ తరపున ప్రతిపాదించామని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు,  Email:- revenuegvmc@gmail.com కి మెయిల్ చేయాల్సిందిగా కోరారు. 

GVMC office

2021-06-04 14:10:52

రోజుకి 5వేల కరోనా పరీక్షలు చేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌తి రోజూ 5వేల క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు ఖ‌చ్చితంగా జ‌ర‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వైద్యాధికారుల‌ను ఆదేశించారు. ఆయా పి.హెచ్‌.సి.ల‌కు నిర్దేశించిన ల‌క్ష్యం మేర‌కు త‌ప్ప‌నిస‌రిగా టెస్టులు నిర్వ‌హించాల‌న్నారు. వైద్యాధికారుల‌తో క‌లెక్ట‌ర్ శుక్ర‌వారం టెలి కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. వైద్యాధికారులు త‌మ వ‌ద్ద ఉన్న వ్యాక్సిన్ నిల్వ‌ల‌ను పూర్తిస్థాయిలో వినియోగించి చివ‌రి డోసు వ‌ర‌కూ పూర్తిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. జిల్లాలో 21 వేల డోసుల వ్యాక్సిన్ మిగిలి వుంద‌ని ఈ వ్యాక్సిన్ నిల్వ‌ల‌ను శుక్రవారం సాయంత్రంక‌ల్లా పూర్తిచేయాల‌న్నారు. వ్యాక్సినేష‌న్ పై జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ధి) డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.కూర్మ‌నాథ్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ విధేఖ‌రే, డి.ఎం.హెచ్‌.ఓ. డా.ర‌మ‌ణ‌కుమారి, జిల్లాపరిష‌త్ సి.ఇ.ఓ. వెంక‌టేశ్వ‌ర‌రావుల‌కు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌న్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 72 కోవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రాల ద్వారా సాయంత్రానికి ప‌దివేల మందికి వ్యాక్సినేష‌న్ పూర్తిచేశారు.

Vizianagaram

2021-06-04 13:59:45

అప్పన్న ఆదాయం రూ.29.99 లక్షలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన మూడు హుండీల లెక్కింపులో రూ.29లక్షల 99వేల 975 రూపాయాలు ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎంవీసూర్య కళ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో అన్ని నిబంధనలు అమలు చేసి ఆలయ సిబ్బందితోనే పరకామణిలో హుండీ లెక్కింపు చేపట్టి నట్టు చెప్పారు. హుండీలో నగదుతోపాటు 10 కతార్ రియాల్స్, ఒక యుఎస్ డాలర్, రెండు సామ్లు, రెండు గ్రాముల బంగారం కూడా లభించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమం ట్రస్టు సభ్యుల సమక్షంలో ఈఓ పర్యవేక్షణలో నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-06-04 13:55:35

అప్పన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు..

 శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి పేర్కొన్నారు. శుక్రవారం సింహాచలం కొండ దిగువన, పైన అన్ని సౌకర్యాలతో మెరుగులు దిద్దిన బస్ టికెట్ కౌంటర్ ను ఆమె ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భక్తులకు ఆలయ వాతావరణంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు అన్ని ప్రాంతాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు. దీనికోసం ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్ చేపడుతున్నట్టు చెప్పారు. 
అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో అన్నదాన సత్రం, ప్రసాదాల కౌంటర్లును కూడా ఆధునీకరించడానికి డిజైన్లను కూడా ఆహ్వానించినట్టు చెప్పారు. త్వరలోనే స్వామివారి ఆలయంలో మరిన్ని అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సంచయిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎంవీ సూర్యకళ, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు...

Simhachalam

2021-06-04 13:46:05

రూ.28.లక్షల ఆక్సిజన్ మిషన్లు వితరణ..

అమెరిక‌న్ ఇండియా ఫౌండేష‌న్ ట్ర‌స్ట్‌, పేటీఎం ఫౌండేష‌న్ సంయుక్తంగా తూర్పుగోదావ‌రి జిల్లాకు దాదాపు రూ.26 ల‌క్ష‌ల విలువైన 38 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చాయి. ఈ మేర‌కు అమెరిక‌న్ ఇండియా ఫౌండేష‌న్ ట్ర‌స్ట్, పేటీఎం ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అంద‌జేశారు. కోవిడ్ బాధితులకు అవ‌స‌ర‌మైన ప్రాణ వాయువును అందించే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు స‌మ‌కూర్చిన అమెరిక‌న్ ఇండియా ఫౌండేష‌న్ ట్ర‌స్ట్‌, పేటీఎం ఫౌండేష‌న్‌ల‌కు క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కోవిడ్ విప‌త్తు స‌మ‌యంలో బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో త‌మ వంతు స‌హాయంగా కాన్సంట్రేట‌ర్ల‌ను అందించ‌డం గొప్ప విష‌య‌మ‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో జేసీ (డీ) కీర్తి చేకూరి, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, అమెరిక‌న్ ఇండియా ఫౌండేష‌న్ ట్ర‌స్ట్ ప్ర‌తినిధి, స్టేట్ ప్రోగ్రాం మేనేజ‌ర్ కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-04 13:38:55