ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్ నిజమైన లీడర్ అని, గడప వద్దకే మంచి పాలన తీసుకువచ్చిన ఆయన దేశంలోనే అత్యుత్తమ సీఎంగా చరిత్ర సృష్టించారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్ ప్రజా సంక్షేమ పాలనకు రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా అమరావతిలో సీఎం హాజరయ్యే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం బయలుదేరిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మేనిఫెస్టోను దైవంగా భావించి అందులో హామీలను ఇప్పటికే 95 శాతం అమలు చేసి, హామీ ఇవ్వని ఎన్నో అంశాలను సైతం పరిష్కరించారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలిచిందని అన్నారు. పెన్షన్ల పెంపు మొదలుకొని, లక్షలాది ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు- నేడు, విప్లవాత్మక మార్పులతో ఆరోగ్యశ్రీ,, వైయస్సార్ వాహన మిత్ర, చేయూత, మత్స్యకార భరోసా, కాపు నేస్తం లాంటి ఎన్నో కార్యక్రమాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా నవరత్నాలు పేరుతో పేదలందరికీ ఇండ్లు అందజేసి దేశ వ్యాప్తంగా సీఎం మన్ననలు పొందారని చెప్పారు. సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికాయన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసిపి అఖండ విజయం సాధించడం ప్రభుత్వం పట్ల ప్రజలకున్న గట్టి నమ్మకాన్ని తెలియజేసినట్లు అయిందన్నారు.
పాదయాత్ర సందర్భంగా ప్రత్యేకించి ఉత్తరాంధ్ర కష్టాలను చూసిన జగన్ మాట ఇచ్చిన విధంగానే ఇక్కడ అభివృద్ధికి కట్టుబడ్డారని చెప్పారు. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం రక్షిత మంచినీటి పథకం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, భావనపాడు పోర్టు, మూడు ఫిషింగ్ హార్బర్లు, నదుల అనుసంధానం, నేరడి బ్యారేజి నిర్మాణం, సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, నరసన్నపేటలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఆమదాలవలసలో వ్యవసాయ పాలిటెక్నిక్ సహా ఇంకా ఎన్నెన్నో పథకాలకు రూపకల్పన చేస్తున్నారని కృష్ణదాస్ వివరించారు.
రెవెన్యూ శాఖా మంత్రిగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూ రక్ష పథకం (రీ సర్వే) తన చేతుల మీదుగా అమలు చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జీవితకాలం రుణపడి ఉంటానని కృష్ణ దాస్ పేర్కొన్నారు.