1 ENS Live Breaking News

ఒడిషాలో ప్రవేశిస్తే 14 రోజుల క్వారంటీన్..

ఒడిషా రాష్ట్రంలోకి ప్రవేశిస్తే 14 రోజుల క్వారంటీన్ ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల నుండి ఒడిషాలోకి ప్రవేశించే వారికి 14 రోజుల సంస్ధాగత క్వారంటీన్ విధిస్తూ ఒడిషా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కొరాపుట్ జిల్లా కలెక్టర్ తెలిపారని ఆయన వివరించారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల సరిహద్దు జిల్లాలైన గంజాం, గజపతి, రాయగాడ, కొరాపుట్, మల్కన్ గిరి, నౌరంగపూర్ జిల్లాలలో సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రంలోకి ప్రవేశించే చిన్నా, పెద్దా అన్ని మార్గాలలో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఒడిషా రాష్ట్రంలోని స్దానిక సంస్ధలకు కూడా దీనిపై తగు సమాచారం ఉందని కలెక్టర్ పేర్కొంటూ జిల్లా నుండి ఒడిషాకు వెళ్లే వారు ఒడిషా ప్రభుత్వ నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. రెండు డోసుల టీకా వేసుకుని, ఒడిషాలోకి ప్రవేశించుటకు 48 గంటలకు ముందు ఆర్ టిపిసిఆర్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ రిపోర్టు చూపించినవారికి 7 రోజుల హోమ్ క్వారంటీన్ విధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించినవారిపై విపత్తుల నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 51 నుండి 60 వరకు నిబంధనలు, ఎపిడమిక్ డిసీజ్ చట్టం 1897, ఐపిసి సెక్షన్ 188 క్రిందా శిక్షార్హులని ఒడిషా ప్రభుత్వం తెలియజేసిందని కలెక్టర్ చెప్పారు. ఒడిషా మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఒడిషాలో ఎక్కడా ఆగకుండా వెళ్ళుటకు అవకాశం కల్పించారని ఆయన తెలిపారు.

శ్రీకాకుళం

2021-05-06 10:04:23

ఉద్ధానం ఫౌండేషన్ అంబులెన్సులను వితరణ..

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కోవిడ్ బాధితులకు సేవలు సకాలంలో అందించుటకు ఉద్దానం ఫౌండేషన్ రెండు అంబులెన్సులను జిల్లా కలెక్టర్ జె నివాస్ కు అందజేసారు. ఈ మేరకు గురువారం సంస్థ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే, ఇచ్చాపురం నియోజకవర్గం వై.యస్.ఆర్.సి.పి సమన్వయకర్త పిరియా సాయిరాజ్, ఫౌండేషన్ కన్వీనర్  పిరియా విజయ రెండు ఉచిత అంబులెన్సులను జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద అందించారు. ఈ అంబులెన్సులను జిల్లా కలెక్టర్ ప్రారంభించి ఇచ్ఛాపురం తహశీల్దారుకు అందజేసారు. అంబులెన్సులు అందజేసిన ఉద్దానం ఫౌండేషన్ కు జిల్లా కలెక్టర్ నివాస్ కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉన్న సమయంలో రెండు వాహనాలు జిల్లా యంత్రాంగానికి అందడం ముదావహమన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించాలనే సంకల్పం గొప్ప విషయమని పేర్కొన్నారు.  ఉద్దానం ఫౌండేషన్ వ్యవస్ధాపకులు సాయిరాజ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నిర్మూలనలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యక్తిగత శ్రద్ధతో అన్ని చర్యలూ చేపడుతున్నారన్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్, మరో వైపు వైద్య సేవలు అందరికీ అందేలా నిత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు ఉద్దానం ఫౌండేషన్ ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా కోవిడ్ బాధితులకు అండగా నిలవాలని ఆశయంతో అంబులెన్సులను అందించడం జరిగిందన్నారు. ఫౌండేషన్ క్రియాశీలకంగా పని చేస్తూ సేవలను మరింతగా క్షేత్ర స్థాయిలో విస్తరింపజేయాలని ప్రభుత్వంతో పాటు కోవిడ్ బాధితుల సేవలో పాలు పంచుకోవాలనే  సత్సంకల్పంతో రెండు ఉచిత అంబులెన్సులను ఆక్సిజన్ కిట్లతో పాటు అందించామని వివరించారు. ఆక్సిజన్ స్దాయి తగ్గిన కరోనా రోగులను విశాఖపట్నం, శ్రీకాకుళం ఆసుపత్రులకు సకాలంలో చేర్చాలనే ఉద్దేశ్యంతో అందజేసామని తెలిపారు. కరోనా మహమ్మారి పల్లెలోను, పట్టణాల్లోను విస్తృతంగా వ్యాపిస్తుందని, గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కరోనా భారిన పడి ఆక్సిజన్ అందక సుదూర ప్రాంతాల్లో వున్న విశాఖపట్నం, శ్రీకాకుళం పట్టణాల్లో గల మంచి వైద్యానికి చేరాలంటే సామాన్యులు హెచ్చు మొత్తంలో అంబులెన్సులకు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. అంబులెన్స్ ఖర్చులు భరించలేక కొంత మంది ఇంటివద్దనే వుండి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం కరోనా రోగుల పట్ల సకాలంలో స్పందిస్తు౦ది అందులో ఉద్దానం ఫౌండేషన్ వంతు సహాయంగా రెండు  ఉచిత అంబులెన్సుల సహాయాన్ని అందించామని అన్నారు.


శ్రీకాకుళం

2021-05-06 10:02:42

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించడం హర్షదాయకం..

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్ గుర్తిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల జాతీయ జర్నలిస్టులం సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తూ మ్రుత్యువాత పడిన జర్నలిస్టులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కాస్త భరోసా దక్కుతుందన్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా ప్రభుత్వాలు జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా  ప్రకటించండం కూడా అభినందనీయమన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని శ్రీనుబాబు డిమాండ్ చేశారు. కరోనా అప్డేట్స్ ను ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ అందించేది ఒక్క మీడియానేనని అన్నారు. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్ కారణంగా ఇప్పటివరకు వందకు పైగా జర్నలిస్టులు మ్రుత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాంరు. ప్రభుత్వాలు బాధిత జర్నలిస్టుల కుటుంబాల సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాలను సత్వరమే అందించి మ్రుత్యువాత భారిన పడిన కుటుంబాలను ఆదుకోవాలని శ్రీనుబాబు ప్రభుత్వాన్ని కోరారు.

విశాఖపట్నం

2021-05-06 08:03:30

ఏపీ పేపర్ మిల్ నుంచి ఆక్సిజన్ సరఫరా..

రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్ నుంచి 10 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ నుంచి  కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయాలని 
 ఎంపీ, వైయస్సార్సీపి పార్లమెంటరీ చీఫ్విప్ మార్గాని భరత్ రామ్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఎంపీ సూచన మేరకు యాజమాన్యం ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీనితో రాజమహేంద్రం వరం నుంచి ఆక్సిజన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు పేపర్ మిల్ యాజమాన్యంతో  ముందుకు వచ్చింది. రోజుకు పది టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా చేస్తామని యాజమాన్యం ఎంపీకి తెలియజేసింది. దీనితో ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత తీర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎంపీ భరత్ తెలియజేశారు.

రాజమహేంద్రవరం

2021-05-06 08:01:02

ఉదయం 11.30 వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కోవిడ్ నియంత్ర‌ణంలో భాగంగా విధించిన క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అనుస‌రించి జిల్లాలో భూ క్ర‌య‌, విక్ర‌య రిజిస్ట్రేష‌న్ స‌మ‌యాల్లో మార్పు చేసిన‌ట్లు జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన క‌ర్ఫ్యూలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 7.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు పని చేస్తాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నుంచి త‌దుప‌రి ఆదేశాల వ‌చ్చే వ‌ర‌కు జిల్లాలోని రిజిస్ట్రార్‌, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. 

విజయనగరం

2021-05-06 07:59:58

శుభకార్యాలకు 20 మందికే అనుమతి..

కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదు అవుతున్న తరుణంలో శుభకార్యాలయాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు విశాఖ అర్బన్ తహశీల్దార్ జ్నానవేణి తెలియజేశారు. గురువారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం గతంలో 50 మందితో కూడిన అనుమతులు శుభకార్యాలకు ఇచ్చేదని అయితే ఇపుడు ఆ సంఖ్యను తాజాగా కుదించారన్నారు. అనుమతులు కోరేవారు దరఖాస్తుతోపాటు కరోనా టెస్టులు చేయించుకున్న నెగిటివ్ రిపోర్టులను నాలుగు రోజులు ముందుగా సమర్పించాల్సి వుంటుందన్నారు. అనుమతులు మాత్రం నగర పరిధిలో సిటీ పోలీస్ కమీషనర్ జారీ చేస్తారని చెప్పారు. అందరూ ఒకే దగ్గర గుమిగూడి ఉండకూడదని.. సామాజిక దూరం పాటిస్తూ  ప్రతీ ఒక్కరూ మాస్కులు ఖచ్చితంగా ధరించాలన్నారు. శానిటైజర్లు వినియోగించడం ద్వారా చేతిపై ఉంటే వైరస్ నాశనం అయ్యే అవకాశం వుంటుందని చెప్పారు. ప్రభుత్వం కొత్తగా జారీచేసిన ఈ ఉత్తర్వులను అందరూ పాటించి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని తహశీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు. 

విశాఖపట్నం

2021-05-06 01:56:45

అనంతలో పటిష్టంగా కర్ఫ్యూ..

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో బుధవారం నుంచి కర్ఫ్యూ అమలులో ఉందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బుధవారం నుంచి రెండు వారాల పాటు ప్రతిరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. బుధవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ విధిస్తామన్నారు. ఆ సమయంలో ఎక్కడ ఐదుగురికి మించి గుమిగూడి ఉండడానికి వీలు లేదన్నారు. ఉదయం 6 నుండి 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, సంస్ధలు, హోటళ్ళు, రెస్టారెంట్లు తదితర సంస్ధలు ఉంటాయని, 12 గంటల తరువాత అత్యవసర సేవలు – మందుల దుకాణాలు, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు, పాలు వంటి ఆహార పదార్ధాలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. దుకాణాలు 12 గంటలకు మూసివేయాల్సిందేనన్నారు. దుకాణాల వద్ద క్యూ లైన్ లో కోవిడ్ నిబంధనల మేరకు నిలిచి ఉండవచ్చని, గుమిగూడి ఉండరాదన్నారు. గుమిగూడి రద్దీ ఉంటే 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు అవుతాయన్నారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా వివాహ కార్యక్రమాలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. వివాహ వేడుకలకు హాజరయ్యేవారి పేర్లను తహశీల్దార్ కు సమర్పించాలని స్పష్టం చేసారు. వివాహ వేడుకలు జరిగే ప్రదేశాలను తహశీల్దార్లు తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు చేస్తారన్నారు. 

అనంతపురం

2021-05-05 14:45:48

కోవిడ్ రోగులకు సకాలంలో వైద్యసేవలు..

కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల్లో భాగంగా 2,219 పడకలు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయగా అందులో భాగంగా చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 530 పడకలు, 50 వెంటిలేటర్లు, మదనపల్లె జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 120 పడకలు, శ్రీ పద్మావతి ఆసుపత్రి (స్విమ్స్)లో 654 పడకలు, వెంటిలేటర్లు 60, రుయాలో 890 బెడ్లు, 138 వెంటిలేటర్లు, ఈఎస్ఐ తిరుపతిలో 250 పడకలు, ఎస్.వి ఆయుర్వేదిక్ ఆసుపత్రి నందు 210 పడకలు, శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు 50 పడకలు, కుప్పం ఏరియా ఆసుపత్రి నందు 60 పడకలు ఏర్పాటు చేయడమైనది తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 36 ప్రైవేట్ ఆసుపత్రులో ఐసియు మరియు నాన్ ఐసియు పడకలతో కలిపి 2,380 పడకలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 
వీటితో పాటు కోవిడ్ కేర్ కేంద్రాలైన తిరుపతి పద్మావతి నిలయం – 1100, శ్రీనివాసం – 1270, విష్ణు నివాసం – 1034, ఆర్ వి ఎస్, చిత్తూరు – 170, మదనపల్లె లోని ఎస్ టి బాయ్స్ హాస్టల్ – 100 మరియు వశిష్టా పాఠశాల – 200, కార్వేటి నగరం లోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ – 100, వాయల్పాడు ఏ పి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ – 300, పలమనేరు పాలిటెక్నిక్ కాలేజీలో 128 పడకలను ఏర్పాటు చేయడమైనదని, కోవిడ్ బాధితులు వైద్య సూచనల మేరకు వారికి అందుబాటులో ఉన్న  కోవిడ్ కేర్ కేంద్రాల నందు వైద్య సేవలు పొందవచ్చునని, అక్కడ అంబులెన్స్ సౌకర్యంతో పాటు డాక్టర్లు అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఈసిజి, ఎక్స్ – రే, రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. 
కోవిడ్ లక్షణాలు ఉన్నట్లైతే పాజిటివ్ కాకున్నా స్థానిక పి హెచ్ సి, మెడికల్ అధికారులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల దగ్గర వెళ్ళి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జ్వరం, టైఫాయిడ్ అని చెప్పి కాలయాపన చేయకుండా జ్వరం తీవ్రత ఎక్కువై చివరి నిమిషంలో ఆసుపత్రిలకు చేరుకోవడం కంటే ముందుగానే కోవిడ్ లక్షణాలు ఉన్నట్లైతే పరీక్ష చేయించుకుని ట్రయాజింగ్ సెంటర్లో సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్, ఆసుపత్రికి పంపడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన బాధితులకు వైద్యుల సూచనల మేరకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఆక్సిజన్ అందిస్తేనే . . రెమిడిసివర్ ఇంజక్షన్ ఇస్తేనే కరోనా నయం అవుతుందన్నది అపోహ మాత్రమే అని, అధిక ధర చెల్లించి ఆక్సిజన్ సరఫరా రెమిడిసివర్ ఇంజక్షన్లు కొనుగోలు చేయరాదని, ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్ బెడ్ మరియు రెమిడిసివర్ ఇంజక్షన్ అవసరం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కరోనా భయంతోనే ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని, మంచి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంను స్వేకరిస్తూ మనో ధైర్యంతో యోగా, ప్రాణాయామం లాంటి జాగ్రత్తలు పాటిస్తూ కోలుకోవచ్చునన్నారు. ఒక వేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లకు తెలియజేయాలని, వారు వెంటనే పరీక్షించి ఎక్కడకి పంపాలన్నది నిర్ణయించి సత్వర చికిత్సలు అందించేలా అన్ని చర్యలు చేపడతారని, సమస్య తీవ్రమైన తరువాత ఆసుపత్రులకు వచ్చి చేరడం కంటే కరోనా లక్షణాలు ఉన్న వెంటనే జాగ్రత్త పడి వైద్యుల సలహా మేరకు చికిత్స పొంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

తిరుపతి

2021-05-05 14:40:46

కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే విధులు..

కోవిడ్ జాగ్రత్తలు నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులను కోరారు. బుధవారం ఆమె ఛాంబర్ లో జోనల్ కమిషనర్లు, ప్రధాన వైధ్యాధికారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కోవిడ్ రెండవ దశ చాలా ఉధృతంగా ఉన్నందున అధికారులు ఇంకా ముమ్మరంగా చర్యలు చేపట్టాలని, ప్రతీ వార్డులో కార్పొరేటర్ సూచనలు పాటిస్తూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయాలని సూచించారు. కొన్ని జోన్లలో వార్డులు ఎక్కువుగా ఉన్నందున, జోన్ ఒక్కొక్కటికి, ఒక టాటా ఏస్ మాత్రమే ఉన్నందున వాటి సమయం పెంచి రెండు పూటలా సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారి చేసే విధంగా చూడాలని ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని ఆదేశించారు. వార్డు వాలంటీర్ల ద్వారా హోమ్ ఐసొలేషన్లో ఎంత మంది ఉన్నారో, వారి ప్రైమరీ కాంటాక్ట్స్, వారికి కోవిడ్ మందులు కిట్స్ అందించే విధానం పై ఆరా తీసి, ఆయా వివరాలు తెలపాలని ఆదేశించారు. కోవిడ్ పేషంట్లు ఉన్న ఏరియాలలో సోడియం హైపోక్లోరైట్, వీధులలోనే కాకుండా ఇంటి పరిసరరాలలోను, ఇళ్ళల్లోనూ  చల్లించాలని ఆ చట్టు ప్రక్కల బ్లీచింగు కూడా చల్లించాలని ఆదేశించారు. వార్డు స్థాయిలో ఏర్పాటు చేసిన స్పెషల్ అఫీసర్సుతో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకోవాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. వార్డు అడ్మిన్, హెల్త్, శానిటరి, వెల్ఫేర్ మొదలగు వార్డు కార్యదర్శులు, ప్రతీ రోజు ఒక గంట వార్డులో తిరిగే విధంగా చూడాలని సూచించారు. ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి 250 బెడ్లు సమకూరుస్తున్నారని వాటిని మన కోవిడ్ సెంటర్లలో ఏర్పాటు చేస్తామని, ఈ రెండు సెంటర్లలో ఆక్సిజన్ ఉండే ఏర్పాట్లు అధికారులతో చేయించేలా చర్చిస్తున్నామని తెలిపారు. ఇంటివద్ద మరణించిన కోవిడ్ పేషంట్ ను తీసుకువెళ్ళుటకు చాలా ఇబ్బందిగా ఉందని, అందుకు వారి కొరకు జోనుకు ఒకటి చొప్పున ఒక మహా ప్రస్థానం (అంతిమ యాత్ర) వాహనం  ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టామని, ప్రతీ జోన్లో కోవిడ్ తో మరణించిన వారి కొరకు ఒక స్మశాన వాటికను ఏర్పాటు చేసే ప్రక్రియ పరిశీలించాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. నగర పరిధిలోగల మొత్తం 72అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరియు కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి అనువుగా ఉన్న కమ్మ్యునిటీ హాల్స్ గాని, ప్రైవేట్ బిల్డింగ్స్ గాని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, జోనల్ కమిషనర్లు అడిగిన పలు ప్రశ్నలకు మేయర్ మరియు ప్రధాన వైద్యాధికారి సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రీ, జోనల్ కమిషనర్లు గోవింద రావు, బొడ్డేపల్లి రాము, ఫణిరాం, సింహాచలం, శ్రీధర్, చక్రవర్తి, బయోలజిస్ట్ (పైడిరాజు), తదితరులు పాల్గొన్నారు. 

విశాఖపట్నం

2021-05-05 13:38:34

విధుల్లోకి చేరిన జెసి జి.రాజకుమారి

తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారి బుధవారం విధుల్లోకి చేరారు. ఏప్రిల్ 05 నుంచి 30వ తేది వరకు లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ,ముస్సోరి లో ఐఏఎస్ శిక్షణ విజయవంతంగా  పూర్తిచేసుకుని తిరిగి కాకినాడ చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల నుంచి 70 మంది ఐఎస్ లు ట్రైనింగ్ లో పాల్గొనగా ఈ ట్రైనింగ్ కాలంలో నిర్వహించిన అన్ని అంశాలలో  మొదటి స్థానం సంపాదించిన జి రాజకుమారి ఉత్తమ ప్రతిభకు గాను  ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను సైతం అందుకున్నారు. ఈ సందర్భంగా జేసి రాజకుమారి మాట్లాడుతూ  123వ ఇండక్షన్ శిక్షణా కార్యక్రమాన్ని  విజయవంతంగా పూర్తి చేశామన్నారు. గతంలో  కంటే  మరింత అంకితభావం, సేవాభావంతో విధులు నిర్వర్తించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుంచేందుకు కృషి చేస్తానిని ఆమె తెలిపారు. ఈ శిక్షణ తనకు విధినిర్వహణకు ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. నేటి నంచి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పాటు సంక్షేమ పథకాల పర్యవేక్షణ, కోవిడ్ విధులు సమర్థవంతంగా నిర్వహిస్తానని జేసీ రాజకుమారి తెలిపారు.

కాకినాడ

2021-05-05 13:27:50

తూ.గో.జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదు..

తూర్పుగోదావరి జిల్లాలో ఆక్సిజన్ సంబంధించి ఎక్కడా కొరత లేదని, రోగులకు అవసరమైనంత ఆక్సీజన్ అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు.  బుధవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఈఎన్టీ బ్లాక్ వద్ద ఉన్న కోవిడ్ వార్డులను జాయింట్ కలెక్టర్ (డి)కీర్తి చేకూరి , వైద్య అధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశతో పోల్చుకుంటే రెండవ దశ కోవిడ్ చాలా ఉధ్థృతంగా వ్యాపిస్తుదన్నారు. గతంలో 70% హోం ఐసోలేషన్ లోను,15% కొవిడ్
కేర్ సెంటర్ లోను,15%హాస్పిటల్ కి మాత్రమే ప్రజలు వచ్చే వారున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది ఆసుపత్రులకే వస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలు అపోహలను విడిచిపెట్టి కోవిడ్ పట్ల అప్రమత్తతతో ఉండాలన్నారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని, రోగులకు రోజువారీ అవసరమైన ఆక్సిజన్  అందుబాటులో ఉందన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆక్సిజన్ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నరన్నారు. ఆక్సిజన్ దుర్వినియోగం చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , ఇప్పటికే కొన్ని  ఆస్పత్రులపై చర్యలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి సంబంధించి ప్రజల రద్దీని నివారించే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. డ్యూటీ డాక్టర్స్ వాహనాలు,అంబులెన్స్, ఇతర అత్యవసర వాహనాలు మినహా ఇతరుల వాహనాలు జిజిహెచ్ లోపలకి రానివ్వకుండా చర్యలు చేపట్టలన్నారు. ఒక పేషెంట్ కి ఒక అటెండర్ మాత్రమే ఉండేవిధంగా పాసులు జారీ చేయబడతాయన్నారు. డిశ్చార్జి ప్రోటోకాల్ సంబంధించి  ఇద్దరు డాక్టర్లకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని ఇక నుంచి కోవిడ్ సోకి, వైద్య సేవలు పొంది , ఆరోగ్యం నిలకడగా ఉన్న వారిని క్రమంగా డిశ్చార్జి చేయడం జరుగుతుందన్నారు. ఆక్సిజన్ అవసరం లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు లేదా హోం ఐసోలేషన్ లో ఉండేవిధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ప్రజలు ఇప్పటికైనా మేల్కొనలి... కలెక్టర్.

   రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడం వల్ల మాత్రమే కాకుండా కరోనా వైరస్ పట్ల ఇప్పటికైనా  అవగాహనతో, బాధ్యతాయుతంగా ప్రజలు వ్యవహరించాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 12 గంటలకు అత్యవసరాలకు  సంబంధించినవి తప్ప మిగిలినవన్నీ మూసి వేయడం జరుగుతుందని, ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటికి పరిమితం కావాలని కలెక్టర్ తెలిపారు.
     ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పీ వెంకట బుద్ధ, ఆర్ యమ్ ఓ  డా ఇ. గిరిధర్, నోడల్ అధికారులు డా.ఎం కిరణ్, డా .హెచ్ విజయ్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు.

కాకినాడ

2021-05-05 13:23:59

144 సెక్షన్ అమలులో వుంటుంది..

కోవిడ్-19 మహమ్మారి కట్టడి లక్ష్యంగా జిల్లాలోని పబ్లిక్ ప్రదేశాలలో 5గురు అంత కంటె ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడాన్ని నిషేదిస్తూ జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి సిఆర్పిసి సెక్షన్-144 సెక్షన్ అమలుపై బుధవారం ఆదేశాలు జారీ చేశారు.  ఈ ఆదేశాలు ఈ నెల 18వ తేదీ వరకూ అమలులో ఉంటాయని, కర్ఫ్యూ సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులలోని పేరా-3 నందు మినహాయించిన సంస్థలు, సేవలకు సంబంధించిన వ్యక్తులు తప్ప మరెవరూ మద్యాహ్నం 12 గం.ల నుండి మరుసటి రోజు ఉదయం 6 గం.ల వరకూ పబ్లిక్ ప్రదేశాలలో సంచరించ కూడదని ఆయన ఆదేశించారు.  పేరా-3లో అనుమతించిన సంస్థలు, కార్యాలయాలు, సేవలు మినహా తక్కిన అన్ని సంస్థలు, షాపులు, ఎస్టాబ్లిష్మెంటులు, కార్యాలయాలు, రెస్టారెంట్లను విధిగా మద్యాహ్నం 12 గం.లకు మూసివేసి, తదుపరి రోజు 6 గం.లకు తెరవాలన్నారు. రాష్ట ప్రభుత్వ జిఓ.192 ఉత్తర్వులు మేరకు కర్ఫ్యూ వేళలో ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ లాబ్ లు, ఫార్మసీలతో పాటు అత్యవసర సేవలు అందించే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్ కాస్టింగ్, ఐటి, ఐటి ఎనేబుల్డ్ సర్వీసులు, పెట్రోల్ పంపులు, ఎల్పిజి, సిఎన్జి, పెట్రోలియం అండ్ గ్యాస్ అవుట్ లెట్ల కు అనుమతి ఉందన్నారు.  అలాగే పవర్ జనరేషన్, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్, వాటర్ సప్లయి, శానిటేషన్, కోల్డ్ స్టోరేజి, వేర్ హౌసింగ్, ప్రయివేట్ సిక్యూరిటీ సేవలకు అనుమతి ఉందన్నారు. అన్ని వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ఉత్పాదక పరిశ్రమలు  సంబంధిత వ్యవసాయ, పరిశ్రమల శాఖలు నిర్థేశించిన కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ నిర్వహించవచ్చునని తెలిపారు. అనుమతించిన సంస్థలు, సేవలకు హాజరైయ్యే  వ్యక్తులు తగిన గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుందన్నారు.   అంతర జిల్లా, అంతర రాష్ట్ర పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు అనుమతి లేదని, అత్యవసర సరుకుల రవాణా వాహనాలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ఆటోలు, టాక్సీలు, సిటి బస్సులు వంటి లోకల్ ట్రాన్స్ పోర్ట్ సేవలను ఉదయం 6 నుండి మద్యాహ్నం 12 గం.ల మద్య మాత్రమే కోవిడ్ నిబంధనల పాటించేలా అనుమతిస్తారన్నారు. ముందుగా షెడ్యూల్ చేసుకున్న వివాహాలు, ఫంక్షన్లను స్థానిక అధికారుల పర్మిషన్ తో, గరిష్టంగా 20 మంది వ్యక్తుల హాజరు మించకుండా కోవిడ్ నిబందనలు పాటిస్తూ జరుపుకోవచ్చున్నారు.  ఈ ఉత్తర్వులను సంబందిత శాఖల అధికారులు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశిస్తూ, విపత్తు నియంత్రణ, ప్రజారోగ్యరక్షణ దృష్ట్యా చేపట్టిన ఈ నియమ, నిబందనలను పాటించి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాకినాడ

2021-05-05 13:22:11

కోవిడ్ రోగుల కోసం ఎంతైనా ఖర్చుచేస్తాం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ సోకిన వారికి వైద్య సేవలు అందించేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని తెలియజేశారని,  రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం నగరంలోని ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరంలో కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, కరోనా కట్టడికి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, కరోనా సోకిన వారిని కాపాడేందుకు ఎంతయినా ఖర్చు చేస్తామన్నారు. జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు.

కరోనా నేపథ్యంలో బుధవారం నుంచి కర్ఫ్యూ మొదలవుతుందని, ప్రతి ఒక్కరు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. కర్ఫ్యూ విధించేందుకు కోవిడ్ కేసులు పెరగడమే కారణమని, కేసులు మరిన్ని పెరగకుండా అరికట్టేందుకు, తగ్గించడానికి కర్ఫ్యూని అమలు చేస్తున్నామన్నారు. గత ఏడాది ఏ విధంగా అయితే అధికారులు సమర్థవంతంగా లాక్ డౌన్ లో పనిచేసారో కర్ఫ్యూలో కూడా అలాగే పనిచేసేలా పాలుపంచుకోవాలన్నారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు, కరోనా టెస్టింగ్, వ్యాక్సిన్ కోసం వస్తున్న వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో జాతీయ రహదారుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దానిపై దృష్టి పెట్టాలన్నారు.

కరోనా సమయంలో శానిటేషన్ అనేది ముఖ్యమైన అంశమని, గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శానిటేషన్ పై ఎలాంటి అజాగ్రత్త, నిర్లక్ష్యం పనికిరాదన్నారు. క్షేత్రస్థాయిలో కాంట్రాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ను సక్రమంగా చేపట్టాలన్నారు. కరోనా పరిస్థితులలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసేలా చూడాలన్నారు. కరోనా కట్టడికి గత ఏడాది ఏ విధంగా అయితే టీం వర్క్ తో, ఒక స్ఫూర్తి తో పని చేసామో అదేవిధంగా జిల్లా యంత్రాంగం టీం వర్క్ తో కలిసి కట్టుగా పని చేయాలన్నారు. గత ఏడాది చేసిన మాదిరిగా కోవిడ్ కేర్ సెంటర్లను పూర్తి స్థాయిలో నిర్వహించాలని,  గతేడాది లాక్ డౌన్ సమయంలో ఆస్పత్రులపై ఒత్తిడి తక్కువగా ఉండేదని, ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రులపై ఎక్కువ ఒత్తిడి పడిందన్నారు. జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కరోనా నివారణకు కట్టుదిట్టంగా పనిచేయాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో భోజనం, వైద్య సదుపాయాలు, తదితర అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన, పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నామన్నారు. పోలీస్, రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్, తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నోడల్ అధికారులు కిందిస్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయించాలన్నారు.

హిందూపురం జిల్లా ఆస్పత్రిలో అవసరమైన సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) ఆదేశాలు ఇచ్చారన్నారు. కరోనా నేపథ్యంలో వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి కిట్లను ఇస్తున్నామని, వారికి తగిన సూచనలు, సలహాలు కూడా అందిస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో యువత నిర్లక్ష్యంగా ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని, ప్రజాసంక్షేమం, ఆరోగ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడకుండా కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. జిల్లాలో సరిపడినన్ని ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. హిందూపురం పరిధిలోని తూముకుంట వద్ద, తాడిపత్రి పరిధిలోని అర్జాస్ స్టీల్ ప్లాంట్ వద్ద ఆక్సిజన్ ప్లాంట్ లు ఉన్నాయన్నారు. ఆక్సిజన్ అందించే విషయమై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టామని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలని, లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

అనంతపురం

2021-05-05 13:17:59

జాతీయ లోక్ అదాలత్ వాయిదా..

శ్రీకాకుళంలో ఈ నెల 8వ తేదీన జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ వాయిదా వేసినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జి కె.జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ వాయిదా వేసినట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్ధ సభ్య కార్యదర్శి నుండి సమాచారం అందిందని పేర్కొన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తదుపరి ఉత్తర్వుల ఆధారంగా తెలియజేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. లోక్ అదాలత్ వాయిదా అంశాన్ని అధికారులు, కక్షిదారులు గమనించాలని ఆమె కోరారు.

శ్రీకాకుళం

2021-05-05 13:14:50

ఎంపీ భరత్ ఆ విధంగా విద్యా దానం చేశారు..

ఆ ఎంపీ కోటా కింద లెటరు ఇస్తే..కేంద్రీయ విద్యాలయంలో ఉచితంగా సీటు లభిస్తుంది.. వాస్తవంగా అయితే చాలా మంది ఎంపీలు ఈ అవకాశాన్ని పార్టీలో తమ కోసం పనిచేసిన కేడర్ కోసం వినియోగించి వారికి కేంద్రీయ విద్యాలయంలో చదివించే అవకాశం కల్పిస్తారు. కానీ రాజమండ్రి ఎంపీ భరత్ వినూత్నంగా ఆలోచించారు. తన కోటా కింద వచ్చే 10 సీట్లకు ప్రజల నుంచి దరఖాస్తులు కోరి వారి మద్యే డ్రా తీసి నిరుపేదలకు వాటిని అందించారు. ఎంపీ చేసిన ఈ ఉపకారంతో పది మంది నిరుపేద కుటుంబాల్లోని పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదువుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ మంచి కార్యక్రమానికి మార్గానీ ఎస్టేట్ వేదికైతే..వైఎస్సార్సీపీ నాయకులు, విద్యాలయంలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు సాక్షిగా మారారు. లక్కీ డ్రాలో సీటు పొందిన తల్లిదండ్రులంతా ఎంపీ భరత్ ను బాబూ నువ్వు చల్లగా ఉండాలి...పేదల కోసం విద్యా దానం చేసిన నీ మేలు మరిచిపోలేమంటూ బరువైన గుండెలతో..ఆనంద బాష్పాలతో దీవించారు.  ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, నేను ఎంపీగా మీ ఓటుతోనే గెలిచాను.. నేను మీకే సేవలు చేయాలి..అందుకే ఈ విధంగా సీట్లు డ్రా ద్వారా అందించాను. సీట్లు పొందిన వారంతా మంచి చదువులు చదువుకొని అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రావు, వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్,  నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, పార్లమెంట్  జిల్లా అధికార ప్రతినిధి కానుబొయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు..

రాజమహేంద్రవరం

2021-05-05 13:10:07