1 ENS Live Breaking News

ప్రజల రక్షణార్ధం నిత్యం రైతుబజార్లు శానిటైజేషన్..

విశాఖ అర్భన్ లోని ప్రజల రక్షణార్ధం సీతమ్మధార మండలం పరిధిలో రైతుబజార్లను కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యం శానిటైజేషన్ చేస్తున్నట్టు తహశీల్దార్ జ్నానవేణి తెలియజేశారు. శుక్రవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నిత్యవసర సరుకులకు ఇబ్బంది లేకుండా క్రిష్ణాకాలేజీ మైదానం, హెచ్ బి అబ్దుల్ కలాం పార్కు, నర్సింహనగర్ డిఎల్భీ గ్రౌండ్ లలో రైతు బజార్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇరుకుగా ఉండే సీతమ్మధార రైతు బజార్ ను తాత్కాలికంగా మూసివేసినట్టు వివరించారు. జెసి ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తహశిల్దార్ వివరించారు. కరోనా కేసులు అధికంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటిస్తూ రైతు బజార్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి వీటిని కూడా ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నాం 12వరకూ మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని తహశిల్దార్ జ్నానవేణి కోరుతున్నారు.

సీతమ్మధార

2021-05-07 09:02:53

ఆక్వా రైతుల‌కు క‌ర్ఫ్యూ పాసులు..డిడి నిర్మలకుమారి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్న నేప‌థ్యంలో,  ఆక్వా రైతులు, సంబంధిత కార్య‌క‌లాపాలు చేసేవారు త‌ప్ప‌నిస‌రిగా క‌ర్ఫ్యూ పాసుల‌ను తీసుకోవాల‌ని మ‌త్స్య‌శాఖ ఉప సంచాల‌కులు నిర్మ‌లాకుమారి సూచించారు.  శుక్రవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, త‌మ శాఖ ద్వారా ఆర్‌డిఓలు లేదా తహశీల్దార్ల‌ నుంచి ఈ పాస్‌ల‌ను పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నియంత్రణ అధికంగా వుంటుందన్నారు. ఈ తరుణంలో ఆక్వా రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ పాసులను జారీచేస్తుందన్నారు. షాపుల‌ను మూసివేయిస్తుండ‌టం వ‌ల్ల‌, ఆక్వా రైతులు, వ్యాపారులు, ల్యాబ్ య‌జ‌మానులు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ య‌జ‌మానులు త‌మ రాక‌పోక‌లు సాగించేందుకు ఈ పాసులు ఉపయోగపడతాయన్నారు.

విజయనగరం

2021-05-07 07:57:26

ప్రజలు అప్రమత్తతో కరోనా కట్టడి సాధ్యం..

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ సూచనలు పాటిస్తే కరోనా నియంత్రణ త్వరలోనే సాధ్యపడుతుందని విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి సూచిస్తున్నారు. అవసరం ఉంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని చెబుతున్నారు. ఈ సందర్భంగా విశాఖలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఫాక్షిక కర్ఫ్యూ కి ప్రజలు సహకరించాలని కోరారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి తెల్లవారు జాము ఆరు గంటల వరకూ అమలు చేస్తున్న కర్ఫ్యూనిఅన్ని వర్గాలు పాటించాలన్నారు. ప్రభుత్వం ఎన్నో వ్యవయప్రయాసలకోర్చి చేస్తున్న సేవలను ప్రజలు గమనించాలని కోరారు. బయటకు వెళ్లే సమయంలో కూడా గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటిస్తూ పనులు చూసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండి..సహకరిస్తే అంతే త్వరగా కరోనా వైరస్ ను విశాఖలో శతశాతం తగ్గించడానికి అవకాశం వుంటుందన్నారు. ఇటు సిబ్బంది కూడా  ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలంటే అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఖచ్చితంగా 45 సంవత్సరాలు దాటిన వారంతా కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలని, మొదటి డోసు వేయించుకున్నవారు రెండవ డోసు కూడా వేయించుకోవాలని తహశీల్దార్ జ్నానవేణి కోరారు.

విశాఖపట్నం

2021-05-07 01:57:17

ప్రణాళికా బద్ధంగా ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా..

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రులకు ప్ర‌ణాళిక ప్ర‌కారం ఆక్సిజన్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని, జిల్లాలో ఎక్క‌డా ఆక్సిజ‌న్ కొర‌త లేద‌ని, సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని జిల్లా కలెక్టర్ డి.మురళీధరెడ్డి తెలిపారు. జిల్లాలో కోవిడ్ ప‌రీక్ష‌లు, రోగుల‌కు వైద్య సేవ‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ త‌దిత‌ర అంశాల‌పై గురువారం సాయంత్రం క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి వ‌ర్చువ‌ల్ విధానంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాకు విశాఖ‌ప‌ట్నం, అంగూల్ (ఒడిశా) నుంచి ఆక్సిజ‌న్ వ‌స్తోంద‌ని.. అన్‌లోడింగ్‌, ఫిల్లింగ్ ఆధారంగా ఆసుప‌త్రుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా సిలిండ‌ర్ల‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం జిల్లాలో రోజువారీ వినియోగం 33.8 కిలో లీట‌ర్లు కాగా,   సరఫరా ద్వారా 30 కిలో లీట‌ర్లు ట్యాంకులలోను, 3 కిలోలీటర్లు సిలిండర్లలలోను మొత్తంమీద రోజువారీగా 33 కిలో లీట‌ర్లు మేర ఆక్సిజ‌న్ అందుబాటులో ఉంటోంద‌ని వివ‌రించారు. ఆక్సిజ‌న్ వినియోగంలో నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన కాకినాడ‌లోని ఫౌండేష‌న్ ఆసుప‌త్రికి కోవిడ్ చికిత్స అనుమ‌తుల‌ను ర‌ద్దుచేశామ‌ని.. 78 కోవిడ్ నోటిఫై ఆసుప‌త్రుల‌పై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటోంద‌ని, వీటిలో ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన మ‌రికొన్ని ఆసుప‌త్రుల‌ను ఇప్ప‌టికే గుర్తించామ‌ని, వీటిని కూడా డీనోటిఫై చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆక్సిజ‌న్‌, రెమ్‌డెసివిర్ వినియోగంతో పాటు చికిత్సా ప్ర‌మాణాల‌పై ఆడిటింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అవ‌స‌రానికి మించి ఆక్సిజ‌న్‌ను నిల్వ చేసి, కృత్రిమ కొర‌త సృష్టించినా, ఎక్కువ‌గా వినియోగించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ హెచ్చ‌రించారు. జిల్లాలో గురువారం ఎనిమిది వేల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 44.68 శాతం పాజిటివిటీ న‌మోదైంద‌ని, చాలా ఫోక‌స్డ్‌గా కోవిడ్ ల‌క్ష‌ణాలున్న వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ఈ స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయ‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని,  సాధారణ స్థాయి వ్యాప్తి 15 శాతం లోపే ఉందని  క‌లెక్ట‌ర్ తెలిపారు.
      గురువారం  కోవిడ్ ఆసుపత్రుల నుండి స్వస్థత పొంది 757 మంది డిశ్చార్జి కాగా, క్రొత్తగా 417 అడ్మిష‌న్లు జ‌రిగాయ‌ని.. దీంతో 340 ప‌డ‌క‌లు ఖాళీ అయి, అందుబాటులోకి వ‌చ్చాయ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. గిరిజ‌న ప్రాంతాల్లో పాజిటివిటీ 15 శాతం లోపే ఉన్న‌ప్ప‌టికీ స్థిరీక‌ర‌ణ‌ను దృష్టిలో ఉంచుకొని రంప‌చోడ‌వ‌రం, చింతూరులో కోవిడ్ కేర్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేర్ కేంద్రాలకు ఆరు వేల ప‌డ‌క‌ల సామ‌ర్థ్యం ఉన్న‌ట్లు తెలిపారు. ఈ సీసీసీల్లో ప్రస్తుతం 817 మంది ఉన్నారని, ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, డిజిట‌ల్ ఎక్స్‌రే మిష‌న్ వంటి వాటిని సిద్ధంగా ఉంచామ‌న్నారు. తొలుత పూర్తిస్థాయిలో ట్ర‌యాజింగ్ చేసిన త‌ర్వాత మాత్ర‌మే ఆసుప‌త్రులు, సీసీసీల్లో అడ్మిష‌న్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్‌, కోవిడేత‌ర కారణాల వల్ల మ‌ర‌ణించిన వారికి సంబంధించి గౌర‌వప్ర‌దంగా అంతిమ సంస్కారాలు నిర్వ‌హించేందుకు విధానాన్ని నిర్థేశించామని,    ఈ అంశాన్ని జిల్లాస్థాయిలో జేసీ (సంక్షేమం) జి.రాజ‌కుమారి ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని తెలిపారు. ఈ ప్ర‌క్రియ‌లో సేవాభావంతో పాల్గొనేలా  గ్రామీణ ప్రాంతాల్లో యూత్‌క్ల‌బ్‌ల‌ను ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. యు.కొత్త‌ప‌ల్లిలో యూత్‌క్ల‌బ్ స‌భ్యులు, వాలంటీర్లు అంతిమ సంస్కారాల‌కు సంబంధించి ఇటీవల చేసిన ఓ మంచి ప్ర‌య‌త్నం ఇందుకు స్ఫూర్తి నిచ్చిందని ప్రశంసించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 31 మ‌హాప్ర‌స్థానం వాహ‌నాల‌ను అందుబాటులోకి తెచ్చామ‌ని వెల్ల‌డించారు. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కోవిడ్ క‌ట్ట‌డికి ప్ర‌త్యేకంగా క‌మిటీలు ఏర్పాటుచేశామ‌ని, ఇవి క్రియాశీలంగా ప‌నిచేస్తున్నాయ‌ని.. గురువారం స‌ర్పంచ్‌ల‌తో మ‌రోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించి, ప‌రిస్థితిని స‌మీక్షించిన‌ట్లు తెలిపారు.


వ్యాక్సినేష‌న్‌కు కూప‌న్లు:
భార‌త ప్ర‌భుత్వం నుంచి అందుతున్న డోసుల మేర‌కు జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని, మే 5, 6 తేదీల్లో రెండో డోస్ పంపిణీ మాత్ర‌మే చేప‌ట్టామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఏడో తేదీ నుంచి చేప‌ట్టే వ్యాక్సిన్ పంపిణీకి ల‌బ్ధిదారుల‌కు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, వాలంటీర్ల ద్వారా ఒక‌రోజు ముందే క‌ల‌ర్ కోడ్ కూప‌న్లు అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ కూప‌న్ల‌ను నిర్దేశ వ్యాక్సిన్ కేంద్రాల‌కు తీసుకెళ్లి, టీకా వేయించుకోవాల్సి ఉంటుంద‌న్నారు. ఫ్రంట్‌లైన్‌, హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు, ప్ర‌భుత్వ శాఖ‌ల ఉద్యోగులు, వృద్ధుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్నామ‌ని తెలిపారు. జ‌న‌ర‌ల్ ప‌బ్లిక్‌కు సంబంధించి 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి మాత్ర‌మే డోసులు పంపిణీ చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అర్హుల రిజిస్ట్రేష‌న్‌, టీకా పంపిణీ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశామ‌ని, అన‌ర్హుల‌కు ఎవ‌రైనా టీకా వేస్తే ఆ ఘ‌ట‌న‌తో సంబంధ‌మున్న వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇటీవ‌ల కాకినాడ‌లో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన అయిదుగురు సిబ్బందిని స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలిపారు. ఇండెంట్, డీడీలు అందించిన ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు అందించేందుకు ప్ర‌స్తుతం రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్లు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. క్షేత్ర‌స్థాయిలో కోవిడ్ బాధితుల గుర్తింపు, హోం ఐసోలేష‌న్‌, వ్యాక్సినేష‌న్, శానిటైజేష‌న్ త‌దిత‌ర అంశాల్లో గ్రామ‌, వార్డు వాలంటీర్లు కీల‌క‌పాత్ర పోషిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు.
వైద్య‌, ఇత‌ర సేవ‌ల‌పై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌: జేసీ(ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌
జిల్లాలోని కోవిడ్ నోటిఫై ఆసుప‌త్రుల్లో రోగుల‌కు అందిస్తున్న వైద్య సేవ‌ల‌తోపాటు ఆక్సిజ‌న్, ముఖ్య ఔష‌ధాల వినియోగం, ఆహారం, శానిటైజేష‌న్ ప్ర‌క్రియ‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తూ లోపాల స‌వ‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ప్ర‌త్యేకంగా క్షేత్ర‌స్థాయిలో ఆక్సిజ‌న్ నిల్వ‌లు, వినియోగంపై త‌నిఖీ చేసేందుకు డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, వైద్య‌, పోలీస్‌, రెవెన్యూ సిబ్బందితో కూడిన మొబైల్ ఆక్సిజ‌న్ మానిట‌రింగ్ స్వ్కాడ్ ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా స‌ర‌ఫ‌రా ఉంద‌ని ఆక్సిజ‌న్‌కు ఎక్క‌డా కొర‌త లేద‌ని, కావాల‌ని వ‌దంతులు సృష్టించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. హెల్ప్ డెస్క్‌, వైద్య సేవ‌లు, మెడిక‌ల్ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, ఫైర్ సేఫ్టీ, వైద్య సిబ్బంది, ఆరోగ్య‌శ్రీ అమ‌లు త‌దిత‌ర ప్ర‌మాణాల ఆధారంగా ఆసుప‌త్రుల ప‌నితీరును మ‌దిస్తున్నామ‌ని, స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌ని ఆసుప‌త్రుల‌ను డీనోటిఫై చేస్తామ‌ని జేసీ వెల్ల‌డించారు.

శాశ్వ‌త వ్యాక్సినేష‌న్ కేంద్రాలు: జేసీ(డీ) కీర్తి చేకూరి
జిల్లాలో శాశ్వ‌త వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, వైర‌స్ ఉద్ధృత వ్యాప్తి, వేసవి నేప‌థ్యంలో ఈ కేంద్రాల్లో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నామ‌ని జేసీ (డీ) కీర్తి చేకూరి తెలిపారు. ప్ర‌స్తుతం కోవీషీల్డ్ డోసులు అందుబాటులో ఉన్నాయ‌ని మండ‌లానికి 200-300 డోసులు చొప్పున అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రెడ్ క‌ల‌ర్‌, 45-60 ఏళ్ల వారికి బ్లూ క‌ల‌ర్‌, 60 ఏళ్లు పైబ‌డిన వారికి గ్రీన్ క‌ల‌ర్ కూప‌న్లను స‌చివాల‌యాల వారీగా అందిస్తామ‌ని వివ‌రించారు. ఈ కూప‌న్లు పొందిన అర్హులైన వారు నిర్దేశ వ్యాక్సిన్ కేంద్రాల‌కు వెళ్లి టీకా వేయించుకోవాల్సి ఉంటుంద‌ని జేసీ కీర్తి చేకూరి తెలిపారు.



అంతిమ సంస్కారాల‌కు ప్రోటోకాల్‌: జేసీ(డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి:
కోవిడ్ ఆసుప‌త్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌ర‌ణాలు సంభ‌విస్తే గౌర‌వ‌ప్ర‌దంగా మృత‌దేహాల త‌ర‌లింపు, అంతిమ సంస్కారాల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేకంగా నిబంధ‌న‌లు రూపొందించి, అమ‌లు చేస్తున్న‌ట్లు జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి తెలిపారు. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయి అధికారుల‌కు పంపిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ‌మే ఉచితంగా మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, అయితే ఎవ‌రైనా తామే మృత‌దేహాన్ని ప్రైవేటు వాహ‌నంలో తీసుకెళ్లి, కోవిడ్ జాగ్ర‌త్‌బల‌తో అంతిమ సంస్కారాలు నిర్వ‌హిస్తామ‌ని చెప్పిన సంద‌ర్భంలో ర‌వాణా శాఖ నిర్దేశించిన ఛార్జీల‌ను మాత్ర‌మే వ‌సూలు చేయాల్సి ఉంటుంద‌ని, ఈ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి దోపిడికి పాల్పడితే  చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. డెడ్ బాడీ త‌ర‌లింపున‌కు  వాహన అద్దె కింద రూ.1,500; డ్రైవ‌ర్ బ‌త్తా రూ.375; క్లీన‌ర్ బ‌త్తా రూ.300; ఫ్యూయ‌ల్ ఛార్జ్ ఆరు కి.మీ.ల‌కు లీట‌రు చొప్పున, అలాగే అంతిమ సంస్కారాలకు గరిష్టంగా 4,500 మాత్ర‌మే వ‌సూలు చేయాల్సి ఉంటుంద‌ని జేసీ(డబ్ల్యూ) స్ప‌ష్టం చేశారు.

కాకినాడ

2021-05-06 15:00:21

విశాఖలో మరో 300 పడకలు సిద్ధం..

కరోనావైరస్ సోకి, ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సరఫరా సదుపాయం ఉన్న 300 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ షీలానగర్‌లో ఉన్న వికాస్ విద్యానికేతన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్న ఈ కోవిడ్ వైద్య సేవల కేంద్రం పనులను గురువారం విజయసాయి రెడ్డి పర్యవేక్షించారు. ఈమధ్యనే నగరంలో కరోనా రోగులకు వైద్య సేవలు అందుతున్న తీరును విజయసాయి రెడ్డి స్వయంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పీపీఈ కిట్ ధరించి నేరుగా ఆస్పత్రికి వెళ్లిన విజయసాయి రెడ్డి, కరోనా రోగులతోను, వారి బంధువులతోనూ మాట్లాడి, వారి బాధలు విన్నారు. పలు సలహాలు, సూచనలు స్వీకరించారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా విజృంభణ, ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్న రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించేందుకు సంకల్పించారు.

కోవిడ్ రోగులకు అవసరమైన అత్యవసర వైద్య సహాయాన్ని ఈ కేంద్రంలో అందజేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణానికి బెడ్స్ చేరగా, ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి, సోమవారం నాటి కల్లా పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి అధికారులకు,పౌండేషన్ సభ్యులకు సూచించారు. 

దీంతో ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న కోవిడ్ బాధితులు ఈ కేంద్రానికి వచ్చి వైద్య సేవలు పొందవచ్చు. వైద్యం, మందులతో పాటు రోగులకు మూడు పూటలా మంచి భోజనం కూడా ఇక్కడ అందించాలని విజయసాయి రెడ్డి సూచించారు. ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్న తమ వారి గురించి తమకు సమాచారం అందటం లేదని రోగుల బంధువులు పలువురు విజయసాయిరెడ్డి దృష్టికి గతంలో తీసుకువచ్చారు. దీంతో ఈ కేంద్రంలో వైద్య సేవలు పొందే రోగులకు సంబంధించిన సమాచారాన్ని వారి బంధువులకు ప్రతిరోజూ అందించే ప్రయత్నం కూడా చేయనున్నారు. 

ఖర్చుకు వెనకాడకుండా, రోగులకు మంచి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని విజయసాయి రెడ్డి చెప్పారు. అందుకొసం ఆంధ్రా మెడికల్ కాలేజీ వైద్య సిబ్బంది, జిల్లా వైద్య అధికారుల సహకారం తీసుకొనున్నట్టు చెప్పారు...ప్రతి 30 మంది రోగులకు ఒక డాక్టరు ఇద్దరు నర్సులు వారికి ఇక్కడ అందుబాటులో ఉందన్నారు. ఇలా రోజుకు మూడు స్విఫ్ట్ లలో  డాక్టర్లు, నర్సులు  కరోనా బధితులకు వైద్య సహాయం అందించనున్నారు. ఈ 300 పడకల లో పూర్తిస్థాయిలో ఆక్సిజన్ తో కూడిన మెడికల్ వైద్యం అందిస్తారు. అలాగే రోగులకు మూడు పూటలా ఆహార సదుపాయం కల్పించనున్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ,కిమ్స్,విమ్స్,డి.ఎమ్.హెచ్.వో వైద్యులు సిఫార్సు చేసిన రోగులతొ పాటుగా, కారోన బారినపడిన వారు నేరుగా ఈ కేంద్రానికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చని ఆయన తెలిపారు.. ఎటువంటి తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా ఈ క్రమం ఈ కేంద్రానికి రావచ్చునని విజయసాయి రెడ్డి  వెల్లడించారు

ఈ కేంద్రంలోనే  ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ శాంపిల్ కలెక్షన్‌కు కూడా ఏర్పాట్లు చేయాలని సంకల్పించారు. ఇక్కడికి వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య సదుపాయాలు అందించనున్నారు.

కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో అనేక కార్యక్రమాలను తొలి నుంచి నిర్వహిస్తున్నారు. 

కాగా, గురువారం విజయసాయి రెడ్డితో పాటు వికాస్ విద్యానికేతన్‌లో కోవిడ్ కేంద్రం ఏర్పాట్లను పర్యవేక్షించిన వారిలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్, డీఎంహెచ్ఓ పి సూర్యనారాయణ, జీవీఎంసీ ప్రాజెక్టు డైరెక్టర్ వై శ్రీనివాస్, ప్రగతి భారత్ ఫౌండేషన్ ప్రతినిధులు గోపినాధ్ రెడ్డి జాస్తి బాలాజీ తదితరులు ఉన్నారు.

విశాఖపట్నం

2021-05-06 14:54:02

కోవిడ్ రోగులకు రూ.350 తో బలవర్ధక ఆహారం..

కోవిడ్ సోకిన ఒక వ్యక్తికి ప్రతి రోజు రూ.350 ఖర్చుతో బలవర్ధకమైన ఆహారాన్ని అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నగర శివారులోని శిల్పారామంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ సోకిన వారికి అందించేందుకు సిద్ధం చేస్తున్న ఆహారం తయారీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సోకిన వారు త్వరితగతిన కోలుకునేలా డబ్బుకు, ఖర్చుకు వెనకాడకుండా నాణ్యత కలిగిన రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. జిల్లాలో కోవిడ్ సోకిన వారికి రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారాన్ని అందించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 3 కోవిడ్ ఆస్పత్రులు, 3 కోవిడ్ కేర్ సెంటర్లలో ఆహారాన్ని అందిస్తున్నామని, మిగిలిన ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. నగరంలోని శిల్పారామంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు 1800 మందికి పైగా కోవిడ్ సోకిన వారికి నాణ్యత కలిగిన రోగనిరోధక శక్తి పెంచే ఆహారం అందజేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కోవిడ్ 19 మెనూ ప్రకారం ఆహారాన్ని తయారుచేసి అందిస్తున్నామన్నారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 580 మందికి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 400 మందికి, క్యాన్సర్ ఆస్పత్రిలో 260 మందికి, జె ఎన్ టి యు కోవిడ్ కేర్ సెంటర్ లో 330 మందికి, శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 70 మందికి, లేపాక్షి లోని బాలయోగి గురుకులం లో ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్ లో 185 మందికి కలిపి మొత్తం 1825 మందికి గురువారం ఆహారాన్ని సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు బెల్లం, పాలు కలిపి రాగిజావా అందిస్తున్నామన్నారు. అనంతరం అల్పాహారం మెనూ ప్రకారం ప్రతిరోజు ఒక రకమైన టిఫిన్ అందిస్తున్నామని, మధ్యాహ్నం ప్రతిరోజు చికెన్ కర్రీ అందిస్తున్నామని, అన్నం, చపాతి, వెజ్ కర్రీ, పప్పు కూర కూడా అందిస్తున్నామన్నారు. సాయంత్రం 4:30 గంటలకు టీ, బిస్కెట్ అందిస్తున్నామన్నారు. అలాగే రాత్రికి చికెన్ స్థానంలో ఉడికిన గుడ్లు 2 ఇస్తున్నామని, గుడ్లతో పాటు అన్నం, చపాతీ, చట్నీ, వెజ్ కర్రీ ఇస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు కోవిడ్ సోకిన వారు త్వరితగతిన కోలుకునేలా బలవర్ధకమైన, రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని సరైన వేళలకు కోవిడ్ 19 ఫుడ్ మెనూ చార్ట్ ప్రకారం అందిస్తున్నామన్నారు. మంచి నాణ్యత కలిగిన రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకొని కోవిడ్ సోకిన వారు త్వరితగతిన కోలుకొని వారి ఇళ్లకు చేరుకుంటున్నారన్నారు. ఆహారాన్ని ఎలాంటి ప్లాస్టిక్ వాడకం లేకుండా, పరిశుభ్రంగా ప్యాక్ చేసి కోవిడ్ సోకిన వారికి అందిస్తున్నామన్నారు. నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఆహారాన్ని తయారు చేసి అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. నాణ్యత కలిగిన ఆహారాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ కోవిడ్ సోకిన వారికి అందిస్తున్నారని, ఇందుకు పర్యాటక శాఖ అధికారి దీపక్, పర్యాటక శాఖ అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్, కర్నూలు, అనంతపురం జిల్లాలకు కోవిడ్ కేర్ సెంటర్ల ఇంచార్జ్ బాబూజీలను జిల్లా కలెక్టర్ అభినందించారు. కోవిడ్ సోకిన వారికి ఇలాగే నాణ్యత కలిగిన ఆహారాన్ని ఇకముందు కూడా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. శుక్రవారం నుంచి నగరంలోని ఎస్సి బాయ్స్ హాస్టల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ సోకిన వారికి అందించే ఆహారాన్ని తయారు చేస్తామని పర్యాటక శాఖ అధికారి తెలిపారు.

అంతకు ముందు  పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు భోజనం సరఫరా ఎలా జరుగుతుందో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కోవిడ్ సోకిన వారికి అందించే భోజనం నాణ్యతతో ఉందా లేదా అని తనిఖీ చేశారు. భోజనాన్ని ప్యాకింగ్ చేసి అందించడం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలలో టిఫిన్, భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నరా లేదని గిరిజన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ సోకిన వారికి సరైన వేళలకు క్రమం తప్పకుండా నాణ్యత కలిగిన భోజనాన్ని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

అనంతపురం

2021-05-06 14:42:53

రేపటి నుంచి కర్ఫ్యూని పక్కాగా అమలు చేయాలి..

క‌ర్ఫ్యూ అమ‌లు చేయ‌డం ద్వారా క‌రోనా వ్యాప్తిని నిరోధించాల‌నే స‌దుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రోజూ 18 గంట‌ల పాటు అమ‌లు చేయాల‌ని నిర్ణయించింద‌ని, దీనిని స‌మ‌ర్ధవంతంగా అమలుచేస్తే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గడంతోపాటు ఆసుప‌త్రుల్లో ప‌రిస్థితులు కూడా నియంత్రణ‌లోకి వ‌స్తాయ‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. దీనిని అమ‌లు చేయ‌డంలో పోలీసు యంత్రాంగానికి ప్రజ‌లంతా స‌హ‌క‌రించి 12 గంట‌ల త‌ర్వాత ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాల‌ని, వ్యాపార‌స్తులు కూడా 12 గంట‌ల స‌మ‌యానికి త‌మ వ్యాపార కార్యక‌లాపాలు నిలిపివేయాల‌ని కోరారు. ప్రజ‌లు స‌హ‌క‌రించి నిబంధ‌న‌లు పాటిస్తే కోవిడ్ వ్యాప్తిని నిరోధించ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల తర్వాత క‌ర్ఫ్యూ అమ‌లు జ‌రుగుతున్న తీరుపై ప‌రిశీలించే నిమిత్తం న‌గ‌రంలోని ప‌లు ముఖ్య కూడ‌ళ్లు, ముఖ్య ర‌హ‌దారుల్లో క‌లెక్టర్ గురువారం అద‌న‌పు ఎస్‌.పి. స‌త్యనారాయ‌ణ‌రావుతో క‌ల‌సి ప‌ర్యటించి ఆక‌స్మిత త‌నిఖీలు చేప‌ట్టారు. ముందుగా మూడు లాంత‌ర్ల కూడ‌లి వ‌ద్దకు చేరుకొని 12-15 నిముషాల త‌ర్వాత కూడా ప‌లు షాపులు తెర‌చి వుండ‌టాన్ని గ‌మ‌నించి ఆ షాపుల వ‌ద్దకు వెళ్లి మూసివేయించారు. రోడ్డుపై తోపుడుబ‌ళ్లు వ్యాపారుల వ‌ద్దకు వెళ్లి 12 త‌ర్వాత వ్యాపారం నిర్వహించ‌డానికి వీల్లేద‌ని స్పష్టం చేశారు. 12-30 గంట‌ల స‌మ‌యానికి కూడా మూడు లాంత‌ర్ల కూడ‌లి వ‌ద్ద వాహ‌నాల ర‌ద్దీ వుండ‌టాన్ని గ‌మ‌నించి ప‌లువురు వాహ‌న‌దారుల‌ను మంద‌లించారు. ప్రభుత్వం 12 గంట‌ల త‌ర్వాత రోడ్లపై సంచ‌రించ‌రాద‌ని స్పష్టంగా ప్రక‌టించిన తర్వాత కూడా వాహ‌నాల‌పై తిర‌గ‌డం ప‌ట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎం.జి.రోడ్డు మీదుగా క‌న్యకా ప‌ర‌మేశ్వరి కూడ‌లి, పేర్ల వారి వీధి, మార్కెట్‌ ప్రాంతాల‌ను ప‌రిశీలించి తెర‌చి వున్న షాపుల‌ను మూసి వేయించారు. అనంత‌రం రింగురోడ్డు, కొత్తపేట నీళ్లటాంకు, అంబ‌టిస‌త్రం ప్రాంతాల్లో క‌లెక్టర్ ప‌ర్యటించారు.

 
శుక్రవారం నుంచి మ‌రింత క‌ఠినంగా ఆంక్షలు అమ‌లు జ‌రిగేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని క‌లెక్టర్ ఈ సంద‌ర్భంగా పోలీసు అధికారుల‌కు సూచించారు. ఉద‌యం 11.30 గంట‌ల నుంచే మైకుల ద్వారా షాపులు మూసివేయాల‌నే విష‌యాన్ని ప్రచారం చేసి అన్ని మార్కెట్లను సంద‌ర్శించి ద‌గ్గర వుండి షాపులు మూసి వేయించాల‌న్నారు. రెవిన్యూ అధికారులతో బృందాలుగా ఏర్పడి అన్ని ప్రాంతాల్లోనూ 12 గంట‌ల‌కు అన్ని షాపులు ఖ‌చ్చితంగా మూసివేసేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌న్నారు. నిబంధ‌న‌ల‌కు అతిక్రమించే వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. ఈ ప‌ర్యట‌న‌లో ట్రాఫిక్ డి.ఎస్‌.పి. ఎల్‌.మోహ‌న‌రావు, త‌హ‌శీల్దార్ ప్రభాక‌ర‌రావు, సిఐలు శ్రీ‌నివాస్‌, మంగ‌వేణి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకొనే రాష్ట్ర ప్రభుత్వం క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తోంద‌న్నారు. ప్రజ‌లంతా తు.చ‌.త‌ప్పకుండా ఈ నిబంధ‌న‌ల‌న్నీ పాటించాల‌న్నారు.  కోవిడ్ రెండో వేవ్ చాలా త్వర‌గా వ్యాప్తి చెందుతోంద‌ని అందువ‌ల్ల ప్రజ‌లంతా అప్రమ‌త్తంగా వుంటూ బాధ్యత‌గా వ్యవ‌హ‌రించాల‌న్నారు. బ్యాంకు సేవ‌లు, జాతీయ ర‌హ‌దారుల ప‌నులు, విద్యుత్ స‌ర‌ఫ‌రా, మెడిక‌ల్ షాపులు, తాగునీటి స‌ర‌ఫ‌రా వంటి కొన్ని ర‌కాల అత్యవ‌స‌ర సేవల‌ను క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపులు ఇవ్వడం జ‌రిగింద‌న్నారు.

 
జిల్లాలో కోవిడ్ బాధితుల‌కు మూడు ర‌కాల వైద్య సేవ‌లు అందిస్తున్నామ‌ని జిల్లా క‌లెక్టర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు. ఇంట్లోనే వుంటూ వైద్యసేవ‌లు పొందేవారికి ఫోన్‌ద్వారా  వారి ఆరోగ్య ప‌రిస్థితిని ప్రతిరోజూ ప‌ర్యవేక్షిస్తున్నామ‌ని, ఇంట్లో ఐసోలేష‌న్‌లో వుండేందుకు సౌక‌ర్యాలు లేని వారికి కోవిడ్ కేర్ సెంట‌ర్లలో చేర్పించి చికిత్స అందిస్తున్నామ‌ని, ఆసుప‌త్రి సేవ‌లు అవ‌స‌ర‌మైన వారిని ఆయా కోవిడ్ ఆసుప‌త్రుల్లో చేర్పించి వైద్యస‌హాయం అందిస్తున్నట్టు చెప్పారు. కోవిడ్ సోక‌కుండా ప్రతిఒక్కరూ త‌మ‌వంతుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాల‌కు చేరుకొనే వ‌ల‌స కార్మికుల‌కు ప్రభుత్వ ప‌రంగా స‌హాయం అందించేందుకు చ‌ర్యలు చేప‌డుతున్నట్టు జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు. వారికి నిత్యావ‌స‌ర స‌రుకులు అందించ‌డం, క్వారంటైన్ కేంద్రాల్లో వారికి అవ‌స‌ర‌మైన భోజ‌నం, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించ‌డం వంటి చ‌ర్యలు చేప‌డ‌తామ‌ని, గ్రామాల్లో అవ‌స‌ర‌మైన వారికి ప‌నులు కూడా క‌ల్పిస్తామ‌న్నారు.

విజయనగరం

2021-05-06 14:35:33

కంటైన్మెంట్ జోన్ల కోసం మ్యాపింగ్ చేయాలి..

కోవిడ్ కంటైన్మెంటు జోన్లలో పర్యవేక్షణకు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని మేపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. కంటైన్మెంటు జోన్లను పకడ్బందీగా నిర్వహించాలని, కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. గురువారం మండల ప్రత్యేక అధికారులు, వైద్య శాఖ అధికారులు, వైద్య అధికారులతో టెలీ కాన్ఫరెన్సును కలెక్టర్ నిర్వహించారు. ఒక సచివాలయ ఉద్యోగికి కనీసం ముగ్గురు వాలంటిర్లను మ్యాప్ చేయాలని, ఆ ముగ్గురు పనులను సచివాలయ ఉద్యోగి పర్యవేక్షించాలని అన్నారు. ప్రతి రోజూ ఆర్.డి.ఓలు, సంబంధిత సర్విలెన్స్ అధికారులు, ఎం.పి.హెచ్.ఏలతో చొప్పున సమీక్షించాలని ఆయన ఆదేశించారు. ప్రతి కంటైన్మెంట్ జోన్ లో ఒక సచివాలయ ఉద్యోగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. హై పాజిటివిటీ నమోదు అవుతున్న మండలాలలో రెండు వందలకు తగ్గకుండా టెస్టులు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి పట్టణ ప్రాంతంలో రెండు వందల నుండి 250 కి తగ్గకుండా టెస్టులు చేయాలని పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్ కిట్స్ పంపిణీ జరగాలని, వాటిని యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.  ఈ టెలీ కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గరోడా, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్, టి.వి.ఎస్.జి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2021-05-06 10:06:21

ఒడిషాలో ప్రవేశిస్తే 14 రోజుల క్వారంటీన్..

ఒడిషా రాష్ట్రంలోకి ప్రవేశిస్తే 14 రోజుల క్వారంటీన్ ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల నుండి ఒడిషాలోకి ప్రవేశించే వారికి 14 రోజుల సంస్ధాగత క్వారంటీన్ విధిస్తూ ఒడిషా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కొరాపుట్ జిల్లా కలెక్టర్ తెలిపారని ఆయన వివరించారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల సరిహద్దు జిల్లాలైన గంజాం, గజపతి, రాయగాడ, కొరాపుట్, మల్కన్ గిరి, నౌరంగపూర్ జిల్లాలలో సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రంలోకి ప్రవేశించే చిన్నా, పెద్దా అన్ని మార్గాలలో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఒడిషా రాష్ట్రంలోని స్దానిక సంస్ధలకు కూడా దీనిపై తగు సమాచారం ఉందని కలెక్టర్ పేర్కొంటూ జిల్లా నుండి ఒడిషాకు వెళ్లే వారు ఒడిషా ప్రభుత్వ నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. రెండు డోసుల టీకా వేసుకుని, ఒడిషాలోకి ప్రవేశించుటకు 48 గంటలకు ముందు ఆర్ టిపిసిఆర్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ రిపోర్టు చూపించినవారికి 7 రోజుల హోమ్ క్వారంటీన్ విధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించినవారిపై విపత్తుల నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 51 నుండి 60 వరకు నిబంధనలు, ఎపిడమిక్ డిసీజ్ చట్టం 1897, ఐపిసి సెక్షన్ 188 క్రిందా శిక్షార్హులని ఒడిషా ప్రభుత్వం తెలియజేసిందని కలెక్టర్ చెప్పారు. ఒడిషా మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఒడిషాలో ఎక్కడా ఆగకుండా వెళ్ళుటకు అవకాశం కల్పించారని ఆయన తెలిపారు.

శ్రీకాకుళం

2021-05-06 10:04:23

ఉద్ధానం ఫౌండేషన్ అంబులెన్సులను వితరణ..

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కోవిడ్ బాధితులకు సేవలు సకాలంలో అందించుటకు ఉద్దానం ఫౌండేషన్ రెండు అంబులెన్సులను జిల్లా కలెక్టర్ జె నివాస్ కు అందజేసారు. ఈ మేరకు గురువారం సంస్థ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే, ఇచ్చాపురం నియోజకవర్గం వై.యస్.ఆర్.సి.పి సమన్వయకర్త పిరియా సాయిరాజ్, ఫౌండేషన్ కన్వీనర్  పిరియా విజయ రెండు ఉచిత అంబులెన్సులను జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద అందించారు. ఈ అంబులెన్సులను జిల్లా కలెక్టర్ ప్రారంభించి ఇచ్ఛాపురం తహశీల్దారుకు అందజేసారు. అంబులెన్సులు అందజేసిన ఉద్దానం ఫౌండేషన్ కు జిల్లా కలెక్టర్ నివాస్ కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉన్న సమయంలో రెండు వాహనాలు జిల్లా యంత్రాంగానికి అందడం ముదావహమన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించాలనే సంకల్పం గొప్ప విషయమని పేర్కొన్నారు.  ఉద్దానం ఫౌండేషన్ వ్యవస్ధాపకులు సాయిరాజ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నిర్మూలనలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యక్తిగత శ్రద్ధతో అన్ని చర్యలూ చేపడుతున్నారన్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్, మరో వైపు వైద్య సేవలు అందరికీ అందేలా నిత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు ఉద్దానం ఫౌండేషన్ ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా కోవిడ్ బాధితులకు అండగా నిలవాలని ఆశయంతో అంబులెన్సులను అందించడం జరిగిందన్నారు. ఫౌండేషన్ క్రియాశీలకంగా పని చేస్తూ సేవలను మరింతగా క్షేత్ర స్థాయిలో విస్తరింపజేయాలని ప్రభుత్వంతో పాటు కోవిడ్ బాధితుల సేవలో పాలు పంచుకోవాలనే  సత్సంకల్పంతో రెండు ఉచిత అంబులెన్సులను ఆక్సిజన్ కిట్లతో పాటు అందించామని వివరించారు. ఆక్సిజన్ స్దాయి తగ్గిన కరోనా రోగులను విశాఖపట్నం, శ్రీకాకుళం ఆసుపత్రులకు సకాలంలో చేర్చాలనే ఉద్దేశ్యంతో అందజేసామని తెలిపారు. కరోనా మహమ్మారి పల్లెలోను, పట్టణాల్లోను విస్తృతంగా వ్యాపిస్తుందని, గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కరోనా భారిన పడి ఆక్సిజన్ అందక సుదూర ప్రాంతాల్లో వున్న విశాఖపట్నం, శ్రీకాకుళం పట్టణాల్లో గల మంచి వైద్యానికి చేరాలంటే సామాన్యులు హెచ్చు మొత్తంలో అంబులెన్సులకు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. అంబులెన్స్ ఖర్చులు భరించలేక కొంత మంది ఇంటివద్దనే వుండి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం కరోనా రోగుల పట్ల సకాలంలో స్పందిస్తు౦ది అందులో ఉద్దానం ఫౌండేషన్ వంతు సహాయంగా రెండు  ఉచిత అంబులెన్సుల సహాయాన్ని అందించామని అన్నారు.


శ్రీకాకుళం

2021-05-06 10:02:42

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించడం హర్షదాయకం..

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్ గుర్తిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల జాతీయ జర్నలిస్టులం సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తూ మ్రుత్యువాత పడిన జర్నలిస్టులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కాస్త భరోసా దక్కుతుందన్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా ప్రభుత్వాలు జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా  ప్రకటించండం కూడా అభినందనీయమన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని శ్రీనుబాబు డిమాండ్ చేశారు. కరోనా అప్డేట్స్ ను ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ అందించేది ఒక్క మీడియానేనని అన్నారు. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్ కారణంగా ఇప్పటివరకు వందకు పైగా జర్నలిస్టులు మ్రుత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాంరు. ప్రభుత్వాలు బాధిత జర్నలిస్టుల కుటుంబాల సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాలను సత్వరమే అందించి మ్రుత్యువాత భారిన పడిన కుటుంబాలను ఆదుకోవాలని శ్రీనుబాబు ప్రభుత్వాన్ని కోరారు.

విశాఖపట్నం

2021-05-06 08:03:30

ఏపీ పేపర్ మిల్ నుంచి ఆక్సిజన్ సరఫరా..

రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్ నుంచి 10 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ నుంచి  కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయాలని 
 ఎంపీ, వైయస్సార్సీపి పార్లమెంటరీ చీఫ్విప్ మార్గాని భరత్ రామ్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఎంపీ సూచన మేరకు యాజమాన్యం ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీనితో రాజమహేంద్రం వరం నుంచి ఆక్సిజన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు పేపర్ మిల్ యాజమాన్యంతో  ముందుకు వచ్చింది. రోజుకు పది టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా చేస్తామని యాజమాన్యం ఎంపీకి తెలియజేసింది. దీనితో ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత తీర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎంపీ భరత్ తెలియజేశారు.

రాజమహేంద్రవరం

2021-05-06 08:01:02

ఉదయం 11.30 వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కోవిడ్ నియంత్ర‌ణంలో భాగంగా విధించిన క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అనుస‌రించి జిల్లాలో భూ క్ర‌య‌, విక్ర‌య రిజిస్ట్రేష‌న్ స‌మ‌యాల్లో మార్పు చేసిన‌ట్లు జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన క‌ర్ఫ్యూలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 7.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు పని చేస్తాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నుంచి త‌దుప‌రి ఆదేశాల వ‌చ్చే వ‌ర‌కు జిల్లాలోని రిజిస్ట్రార్‌, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. 

విజయనగరం

2021-05-06 07:59:58

శుభకార్యాలకు 20 మందికే అనుమతి..

కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదు అవుతున్న తరుణంలో శుభకార్యాలయాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు విశాఖ అర్బన్ తహశీల్దార్ జ్నానవేణి తెలియజేశారు. గురువారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం గతంలో 50 మందితో కూడిన అనుమతులు శుభకార్యాలకు ఇచ్చేదని అయితే ఇపుడు ఆ సంఖ్యను తాజాగా కుదించారన్నారు. అనుమతులు కోరేవారు దరఖాస్తుతోపాటు కరోనా టెస్టులు చేయించుకున్న నెగిటివ్ రిపోర్టులను నాలుగు రోజులు ముందుగా సమర్పించాల్సి వుంటుందన్నారు. అనుమతులు మాత్రం నగర పరిధిలో సిటీ పోలీస్ కమీషనర్ జారీ చేస్తారని చెప్పారు. అందరూ ఒకే దగ్గర గుమిగూడి ఉండకూడదని.. సామాజిక దూరం పాటిస్తూ  ప్రతీ ఒక్కరూ మాస్కులు ఖచ్చితంగా ధరించాలన్నారు. శానిటైజర్లు వినియోగించడం ద్వారా చేతిపై ఉంటే వైరస్ నాశనం అయ్యే అవకాశం వుంటుందని చెప్పారు. ప్రభుత్వం కొత్తగా జారీచేసిన ఈ ఉత్తర్వులను అందరూ పాటించి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని తహశీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు. 

విశాఖపట్నం

2021-05-06 01:56:45

అనంతలో పటిష్టంగా కర్ఫ్యూ..

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో బుధవారం నుంచి కర్ఫ్యూ అమలులో ఉందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బుధవారం నుంచి రెండు వారాల పాటు ప్రతిరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. బుధవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ విధిస్తామన్నారు. ఆ సమయంలో ఎక్కడ ఐదుగురికి మించి గుమిగూడి ఉండడానికి వీలు లేదన్నారు. ఉదయం 6 నుండి 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, సంస్ధలు, హోటళ్ళు, రెస్టారెంట్లు తదితర సంస్ధలు ఉంటాయని, 12 గంటల తరువాత అత్యవసర సేవలు – మందుల దుకాణాలు, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు, పాలు వంటి ఆహార పదార్ధాలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. దుకాణాలు 12 గంటలకు మూసివేయాల్సిందేనన్నారు. దుకాణాల వద్ద క్యూ లైన్ లో కోవిడ్ నిబంధనల మేరకు నిలిచి ఉండవచ్చని, గుమిగూడి ఉండరాదన్నారు. గుమిగూడి రద్దీ ఉంటే 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు అవుతాయన్నారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా వివాహ కార్యక్రమాలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. వివాహ వేడుకలకు హాజరయ్యేవారి పేర్లను తహశీల్దార్ కు సమర్పించాలని స్పష్టం చేసారు. వివాహ వేడుకలు జరిగే ప్రదేశాలను తహశీల్దార్లు తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు చేస్తారన్నారు. 

అనంతపురం

2021-05-05 14:45:48