1 ENS Live Breaking News

ఎన్నికలకు మాప్రాణాలు ఫణంగా పెట్టలేం..

కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహించలేమని ఏపీఎన్జీఓ విశాఖ యూనిట్ అధ్యక్షులు కె. ఈశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం విశాఖలోని ఏపీఎన్జీఓ హోంలో అధ్యక్షులు రమేష్ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో తాము ఎన్నికల విధులు చేయలేమని ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలను ద్రుష్టిలో పెట్టుకొని కరోనా వేక్సినేషన్ పూర్తియిన తరువాత, పరిస్థితి సద్దుమణిగిన తరువాత ఎన్నికల నోటిఫికేషన్ తిరిగి ప్రకటించాలన్నారు.  కరోనా సమయంలో, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేమని, అదే సమయంలో తాము కూడా దైర్యంగా విధులు నిర్వహించలేమన్నారు. ప్రభుత్వం కృషితో కరోనాపై నియంత్రణ సాధిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ప్రజాహితం కాదన్న ఆయన ఎన్నికల సంఘం చైర్మెన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొండిగా ముందుకు వెళితే ఉద్యోగులంతా సామూహికంగా ఎన్నికలను భహిష్కరిస్తామని హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి చర్యలు ప్రారంభించిన తరుణంలో వైద్య సిబ్బంది, ఇతర శాఖ ఉద్యోగులు విధినిర్వహణలో నిమగ్నమై వున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా కరోనా సమయంలో విధులు నిర్వహించి ప్రాణాలు పోగొట్టుకున్న వారిని ద్రుష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఎన్నికలను వాయిదా వేయాలన్నారు. కొందరు ఉపాద్యాయ సంఘాల ప్రతినిధులు కరోనా విధులు నిర్వహణ విషయంలో మాట్లాడుతున్న మాటలను వెనక్కి తీసుకోవాలని, ఏపీఎన్జీఓ సంఘం విధుల్లోనూ, కార్యకలాపాల్లో వేలు పెట్టవద్దని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తమకు సూచన చేసే అధికారం ఉపాధ్యాయ సంఘాలకు లేదన్నారు. కరోనా కేసులు తగ్గిన తరువాత ఎన్నికలు పెడితే వేక్సిన్ తీసుకున్న ఉద్యోగులతో విధులు నిర్వహించడానికి తాము సిద్దమేనన్నారు. తక్షణమే ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఆర్.శ్రీనివాసరావు, జె.క్రిష్ణమోహన్, సత్యనాగమణి, అప్పలరాజు, ప్రసాద్, సత్తిబాబు తదితరలు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-10 16:02:40

మతసామరస్యాన్ని పెంపొందించేందుకు చర్యలు..

మత సామరస్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని, మతసామరస్యాలకు విఘాతం కలిగించేలా ఆలయాలపై ఎవరైనా దాడులకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్( రెవిన్యూ మరియు రైతు భరోసా ) నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయి మత సామరస్య కమిటీల ఏర్పాటుపై మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స అభివృద్ధి)ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఇంతకుముందు మతాల మధ్య అలజడులు చెలరేగిన సంఘటనలు రాష్ట్రంలో జరగలేదని, ప్రజలంతా కలిసిమెలిసి ఉంటున్నారని, గడిచిన కొన్ని రోజుల కాలంలో రాష్ట్రంలో మతపరమైన సంస్థలపై జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో మత సామరస్యాన్ని చెడగొట్టే ఎందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిధిలోని అన్నిమతాల ప్రార్థనా మందిరాల వద్ద సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో ఎటువంటి సంఘటనలు జరిగినా వాటిని పరిష్కరించేందుకు జిల్లా స్థాయి మతసామరస్యం కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.   మతసామరస్య జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు :  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రజల మతపరమైన విశ్వాసాలకు విఘాతం కలుగకుండా, వారి మనోభావాలను పరిరక్షించేందుకు జిల్లాస్థాయి మత సామరస్యం కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారని, జిల్లా ఎస్పీ వైస్ ఛైర్మన్ గా ఉంటారన్నారు. జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) మెంబర్ కన్వీనర్ గా, హిందూ ప్రతినిధులుగా పుట్టపర్తి చెందిన రత్నాకర్ రాజు, అనంతపురం చెందిన శ్యామసుందర శాస్త్రి, కె. చంద్రశేఖరరావు లను, ముస్లిం ప్రతినిధులుగా అనంతపురం కు చెందిన షేక్ షాకీర్ హుస్సేన్, అడ్వకేట్ అబ్దుల్ రసూల్ లను, క్రిస్టియన్ ప్రతినిధులుగా సుధాకర్ బాబు, సంపత్ విజయ్ కుమార్ లను, జైన్ ప్రతినిధిగా వసంతకుమార్ జైన్ లను నియమించామన్నారు. మెంబర్లుగా జిల్లా మైనారిటీ అసిస్టెంట్ డైరెక్టర్, ఎండోమెంట్ అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి మెంబర్లుగా ఉంటారన్నారు. జిల్లాస్థాయి మత సామరస్యం కమిటీని ఏర్పాటు చేయగా, అలాగే డివిజన్, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాస్థాయి మత సామరస్యం కమిటీ జిల్లాలో ఏవైనా ఘటనలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా లో క్షేత్రస్థాయి పర్యటన చేసే అవకాశం కమిటీకి ఉంటుందన్నారు. అన్ని మతాల మధ్య లో శాంతి వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు మాట్లాడుతూ జిల్లాలో కరోనా లాంటి క్లిష్ట సమయంలో అన్ని మతాలవారు కూడా ఒకరి కొకరు సహకరించి కరోనా నుంచి బయటపడేందుకు కృషి చేశారన్నారు. మన జిల్లా మత సామరస్యానికి ప్రతీకని, అందరూ కలిసిమెలిసి ఉన్నారన్నారు. అన్నారు. జిల్లాలో మతసామరస్యాలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు కమిటీ దృష్టికి వస్తే తమకు తెలియజేయాలని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా 9044 హిందూ ఆలయాలు, 800 పైగా మసీదులు, 600 పైగా చర్చిలు, 15 జైన్ ఆలయాలు ఉండగా, వాటిని పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. అన్నిమతాల ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. జిల్లాలో 800కుపైగా ప్రార్థనా మందిరాల వద్ద 3200 సీసీ కెమెరాలను గత రెండు నెలల్లో ఏర్పాటు చేశామన్నారు. ఎండోమెంట్ పరిధిలోని ఆలయాలకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. జిల్లాలో మతసామరస్యం పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయా ఆలయాల వద్ద స్థానికంగానే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు రాత్రిపూట ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా మతాల వారికి తెలియజేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స అభివృద్ధి)ఏ.సిరి మాట్లాడుతూ భారతదేశం అన్ని మతాలకు అనువైనదని, ఇక్కడ అందరూ సమానమన్నారు. జిల్లావ్యాప్తంగా మతసామరస్యానికి విఘాతం కలిగించేలా ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో మతసామరస్యం పెంపొందించేందుకు మత పెద్దలు అందరూ తమ సహకారం అందించాలన్నారు.  ఈ సమావేశంలో డీఆర్ఓ గాయత్రిదేవి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ మహమ్మద్ రఫీ, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు, మైనారిటీ కార్పొరేషన్ ఈడి మస్తాన్, కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ వసంతలత, డీఈఓ శామ్యూల్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ మతాల మెంబర్ లు చంద్రశేఖర్ రావు, శ్యామ సుందర శాస్త్రి, షాకిర్ హుస్సేన్, అబ్దుల్ రసూల్, సుధాకర్ బాబు, సంపత్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-01-09 20:38:39

ఉత్తరంలో ప్రజాసంకల్పయాత్ర సంబురాలు..

సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర  విజయవంతంగా పూర్తయి శనివారం నాటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె కె రాజు  ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కె కె కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కె కె రాజు  మాట్లాడుతూ, అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా మన  వై ఎస్  జగన్మోహన్ రెడ్డి  ప్రజా సమస్యలను ప్రజలు వద్దకు వెళ్లి తెలుసుకోవడానికి పాద యాత్ర చేపట్టారన్నారు. ఆ తరువాత ప్రజలకు అండగా ఉండేందుకు చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రతో  సమస్యలు తెలుసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి గా వారికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రజల సమస్యలను ఇంటి ముంగిటే పరిష్కరించేందుకు గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.. ఈ కార్యక్రమంలో వార్డు  అభ్యర్థులు, వార్డు అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-09 19:37:13

సచివాలయ కార్యదర్శిలు ప్రజల్లోకి వెళ్లాలి..

సచివాలయ కార్యదర్శులు ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, వారి అవసరాలను సచివాలయాల ద్వారా తీరుస్తామని భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా వార్డు కార్యదర్శులకు మార్గనిర్దేశం చేశారు. శనివారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలోని దుర్గా నగర్ కాలనీ (16వ వార్డు) సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో తగ్గించి, ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తేవాలని అన్నారు. ఇదే తరహాలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరుగా స్వీకరించే విధానాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త విధానాన్ని ప్రధాన ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లోనూ అమలు చేయాలన్నారు. కార్యదర్శులు నిత్యం ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కమ్యూనిటీ కార్యదర్శులు వార్డు యొక్క భౌతిక, మౌళిక స్వరూపాలను జియోగ్రాఫిక్ విధానంలో పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు. తాగునీటి పైపులు, రోడ్లు, వీధిదీపాలు, భవనాలు, ఖాళీ స్థలాలు అన్నింటిని జియో టాకింగ్ చేయాలన్నారు. అనంతరం పౌర సేవలు అందిస్తున్న తీరుపై సమీక్షించారు. స్థానిక ప్రజలకు సంబంధించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారానే అందించే లాగా చూడాలన్నారు. సచివాలయాల్లో అందుతున్న పౌర సేవలపై స్థానిక ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, ప్రభుత్వం నుంచి పొందే సర్వీస్ కైనా సచివాలయాల వద్దకే రావాలనే విషయాన్ని తెలియ చెప్పాలన్నారు. సచివాలయాల్లో పౌర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ శ్రీలక్ష్మి, ఆరు గోపాల కృష్ణ వర్మ, సానిటరీ ఇన్స్పెక్టర్ జగన్, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.

Chittoor

2021-01-09 19:32:01

అన్ని మతాల వారు సోదర భావం తో మెలగాలి..

అన్ని మతాల వారు సోదర భావం తో మెలిగే ఘనమైన సం స్కృతి మన దేశ ప్రత్యేకత దీన్ని మనమందరం కలసి కాపాడుకుందాం అని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్త తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక జిల్లా సచివాలయంలో ని సమావేశ మందిరంలో జిల్లాలో మత సామరస్యంను పెంపొందించడం అనే అంశం పై జిల్లాలోని అన్ని మతాలకు చెందిన మత పెద్దలతో జిల్లా కలెక్టర్, తిరుపతి ,చిత్తూరు ఎస్.పి లు రమేష్ రెడ్డి,సెంథిల్ కుమార్ లతో కలసి సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు, తిరుపతి ఏ.ఎస్.పి లు మహేశ్, ఆరిఫుల్లా, జిల్లా సంయుక్త కలెక్టర్ (సంక్షేమం ) రాజశేఖర్, డి‌ఆర్‌ఓ మురళి, శ్రీకాళహస్తి ఈ.ఓ పెద్దిరాజు, వివిధ సంబందిత శాఖల అధికారులు, మతపెద్దలు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత సామరస్యం ను పెంపొందించుటకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మత సామరస్య పరిరక్షణ కమిటీలు (COMMUNAL HARMONY COMMITTEES) ఏర్పాటులో భాగంగా జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా, ఎస్.పి వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తూ వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు ఒక్కొక్కరు చొప్పున దేవాదాయ, మైనారిటీ శాఖలకు చెందిన అధికారులు కమిటీ గా ఏర్పాటై ఈ కమిటీకి కన్వీనర్ గా జిల్లా సంయుక్త కలెక్టర్(రెవెన్యూ) వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాకు శాంతి భద్రతల పర౦గా మంచి పేరు ఉన్నదని మన జిల్లా శాంతి భధ్రతల విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచేలా అందరూ కలసి కట్టుగా ఉందామన్నారు. అన్ని మతాల వారు సోదర భావంతో మెలిగే ఘనమైన సంస్కృతి మన దేశ ప్రత్యేకత అని దీన్ని మమమందరం కలసి కాపాడుకుందాం అని తెలిపారు. చిత్తూరు ఎస్.పి మాట్లాడు తూ మత సామరస్య పరి రక్షణ కమిటీలు జిల్లా స్థాయి లో నే కాక మండల, పంచా యతీ, గ్రామ స్థాయిలో కూడా ఏర్పాటు ద్వారా సత్ఫలితాలు ఉంటాయని తెలిపారు. ప్రతి ప్రార్థనా స్థలాల వద్ద కచ్చితంగా సి.సి కేమరాలను ఏర్పాటుకు కమిటీలు చర్యలు చేపట్టా లని కోరారు. పోలీస్ శాఖ వారు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అన్ని ప్రార్థనా స్థలాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణకు గట్టి నిఘాను ఏర్పాటు చేయదమైనదని తెలిపారు. తిరుపతి అర్బన్ ఎస్.పి మాట్లాడుతూ మత సామ రస్యంను పెంపొందించే అంశంలో చిత్తూరు జిల్లా అందరికీ మార్గ దర్శకంగా నిలిచేలా ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించా లని కోరారు. కరోనా విప త్కర సమయంలో ప్రజలం దరూ సమిష్టిగా జిల్లా యంత్రాoగంనకు సహకరిం చడం జరిగిందని ఆ ఐకమ త్యమే మత సామరస్యం ను పెంపొందించుటలో కూడా ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలన్నారు. ఈ సమావేశంలోభాగంగా మత పెద్దల నుండి మత సామరస్యం పెంపునకు తీసుకోవలసిన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించారు...

Chittoor

2021-01-09 19:18:29

మ‌త సామ‌ర‌స్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక క‌మిటీ..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మ‌త సా‌మ‌రస్యాన్ని  కాపాడేందుకు అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్నామ‌ని.. దానిలో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు జిల్లా మ‌త సామ‌ర‌స్య కమిటీ ఏర్పాటు చేశామ‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. ప‌విత్ర పుణ్య‌క్షేత్రం రామ‌తీర్థంలో ఇటీవ‌ల జరిగిన ఘ‌ట‌న నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్, ఎస్పీ బి.రాజ‌కుమారి సంయుక్తంగా క‌మిటీ స‌భ్యులతో క‌లిసి శ‌నివారం క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో జ‌రిగిన‌ విలేక‌రుల స‌మావేశంలో దీనికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. మ‌త‌సామ‌ర‌స్యాన్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం అన్ని చ‌ర్య‌లూ చేప‌డుతుంద‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. దానిలో భాగంగానే వివిధ మ‌తాల‌కు చెందిన ప్ర‌తినిధులతో జిల్లా మ‌త సామ‌ర‌స్య క‌మిటీ ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. దీనిలో హిందు, సిక్కు, జైన‌, ముస్లిం, క్రైస్త‌వ  మ‌తాలకు చెందిన వ్య‌క్తులు స‌భ్యులుగా ఉంటార‌ని చెప్పారు. వీరంతా మ‌త‌సామ‌ర‌స్యాన్ని కాపాడేందుకు.. శాంతి భ‌ద్ర‌తల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని వెల్ల‌డించారు. మ‌త ప్రాతిప‌దిక‌న జ‌రిగే హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను.. ఉద్రిక్తత‌కు దారితీసే ప‌రిస్థితుల‌ను అదుపు చేసేందుకు క‌మిటీ స‌భ్యులు కృషి చేస్తార‌ని వివ‌రించారు. భ‌ద్రతా ప‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టి స‌మాజంలో శాంతి నెల‌కొల్ప‌టమే ల‌క్ష్యంగా అంద‌రం క‌లిసి క‌ట్టుగా ప‌ని చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. స‌మాజంలో విశ్వాసం పెంపొందించేందుకు.. ప్ర‌జ‌ల్లో ధైర్యం నింపేందుకు గ్రామాల్లో కమిటీ సభ్యులు ప‌ర్యటిస్తార‌ని వివ‌రించారు. స‌మ‌స్యాత్మ‌క‌.. అతి స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌ను గుర్తించి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. అనంత‌రం క‌మిటీ సభ్యుల వివ‌రాలు.. విధివిధానాల గురించి వివ‌రించారు. అనంత‌రం ఎస్పీ బి.రాజ‌కుమారి మాట్లాడుతూ జిల్లాలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను  కాపాడేందుకు పోలీసు శాఖ నుంచి అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు సంయ‌మ‌నం  పాటించి శాంతిభ‌ద్ర‌తలు కాపాడేందుకు స‌హ‌కారం అందించాల‌ని కోరారు. జిల్లాలో ఉన్న సున్నిత‌మైన ప్రాంతాల్లో ఇప్ప‌టికే భ‌ద్ర‌తా ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని.. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌ఠిష్ట‌మైన భ‌ద్రత ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. జిల్లాలో గ‌త నాలుగు నెల‌ల్లో ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించి సున్నిత‌మైన ప్రాంతాల‌ను గుర్తించామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ ఆల‌యాల్లో 95 మాత్ర‌మే సి.సి. కెమెరాలు ఉండేవ‌ని ప్ర‌త్యేక డ్రైవ్ అనంత‌రం జిల్లాలోని వివిధ ఆల‌యాల్లో.. ప్రార్థ‌నా మందిరాల్లో  928 సి.సి. కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. సుమారు 2000 ప్రార్థ‌నా మందిరాలు, ఆల‌యాల్లో మ‌రిన్ని సి.సి కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా నోటీసులు పంపించామ‌ని వెల్ల‌డించారు.  గ్రామాల్లో శాంతి క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌టం.. మ‌హిళా పోలీసుల స‌హ‌కారంతో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడేందుకు అన్ని ర‌కాలు చర్య‌లూ తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. శాంతి క‌మిటీల ద్వారా గ్రామాల్లో ఉండే మ‌త‌ప‌ర‌మైన క‌ట్ట‌డాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని పేర్కొన్నారు. 2019లో నెల్లిమ‌ర్ల‌.. ఇటీవ‌ల రామ‌తీర్థంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్లో మాత్ర‌మే వివ‌రాలు ల‌భ్యం కాలేద‌ని మిగ‌తా అన్ని కేసుల‌ను ఛేదించామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయి సమీక్ష‌లు నిర్వహించి రామ‌ తీర్థంలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఎస్పీ వివ‌రించారు. ఎలాంటి సంఘ‌ట‌న జ‌రిగినా త‌క్ష‌ణ చ‌ర్య‌లుతీసుకుంటున్నామ‌ని చెప్పారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల్లో త‌ప్పు చేసిన వారిపై మాత్ర‌మే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని.. నిర్థోషుల‌ను ఎవ‌రినీ ఇబ్బంది పెట్ట‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌త‌ప‌రమైన ఉద్రిక్త‌త‌ను ప్రోత్స‌హించే వారిపై ఏపీ ప‌బ్లిక్ సేఫ్టీ చ‌ట్టాన్ని అనుస‌రించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. మ‌త‌సామ‌ర‌స్యాన్ని కాపాడేందుకు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని.. అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటామ‌ని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా మ‌త సామ‌ర‌స్య క‌మిటీ.. 1. జిల్లా క‌లెక్ట‌ర్ - ఛైర్మ‌న్‌ 2. ఎస్పీ            - వైస్ ఛైర్మ‌న్‌ 3. స‌హాయ సంచాల‌కులు (మైనారిటీస్‌)- మెంబ‌ర్‌ 4. సహాయ క‌మీష‌న‌ర్ (దేవాదాయ శాఖ‌)- మెంబ‌ర్‌ 5. సంయుక్త క‌లెక్ట‌ర్ (రెవెన్యూ)- మెంబర్ క‌న్వీన‌ర్‌ 6. పీస‌పాటి సంప‌త్ కుమార్ ఆచార్యులు (హిందూ)- మెంబ‌ర్‌ 7. ఎస్‌.కె. అన్స‌ర్ జానే మౌజాన్ (ముస్లిం)  - మెంబ‌ర్‌ 8. లూర్దు మార్నేని ( క్రైస్త‌వ‌)     - మెంబ‌ర్‌ 9. ప్ర‌వీణ్ కుమార్ అంచాలియా (జైన్‌)- మెంబ‌ర్‌ 10. బాబాజీ జస్‌బీర్ సింఘ్ (సిక్కు)- మెంబ‌ర్‌ 

Vizianagaram

2021-01-09 18:59:18

మతసామరస్యాన్ని దెబ్బతీస్తే కఠిన చర్యలు..

తూర్పుగోదావ‌రి జిల్లాలో మ‌త సామ‌ర‌స్యం వెల్లివిరుస్తోంద‌ని, ఇదే విధ‌మైన ఐక్య‌తా వాతావ‌ర‌ణం కొన‌సాగాల‌ని దీనికి వివిధ మ‌తాల పెద్ద‌లు స‌హ‌క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, అడిష‌న‌ల్ ఎస్‌పీ (ఎస్ఈబీ) సుమిత్ గరుడ్, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్‌.. వివిధ మ‌తాల ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జా క్షేమ‌మే లక్ష్యంగా ప్ర‌భుత్వ యంత్రాంగం చేప‌ట్టిన చ‌ర్య‌ల్లో మ‌త పెద్ద‌లు చేసిన కృషి మ‌రువ‌లేనిద‌ని పేర్కొన్నారు. ఇదే ర‌క‌మైన సేవాభావం, స‌హ‌కార స్ఫూర్తిని కొన‌సాగించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జిల్లాలో ప్ర‌జ‌లు, పోలీసులు, మ‌త‌పెద్ద‌లు, అధికారులు అంద‌రూ మిత్రుల మాదిరి వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని పేర్కొన్నారు. వివిధ మ‌తాలకు సంబంధించిన పండ‌గ‌ల స‌మ‌యంలో ఎవ‌రూ ఎప్పుడూ స‌హ‌నం కోల్పోలేద‌ని, ఐకమ‌త్యంగా మెలిగారన్నారు. ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు వెంట‌నే స్థానిక పోలీసు యంత్రాంగాన్ని సంప్ర‌దించాల‌ని, శాంతియుతంగా స‌మ‌స్య ప‌రిష్క‌రానికి కృషిచేయాల‌న్నారు. అయితే జ‌రిగిన సంఘ‌ట‌న‌ను ర‌క‌ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను ఆశించి, వ‌క్రీక‌రించి వ‌దంతులు సృష్టించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ హెచ్చ‌రించారు. శాంతికి విఘాతం క‌లిగించేలా సోష‌ల్ మీడియా లేదా మ‌రేవిధంగానైనా వ‌దంతుల‌ను ప్ర‌చారం చేసే అసాంఘిక శ‌క్తుల‌పై ఐపీసీ 504, ఐపీసీ 295 (ఏ) సెక్ష‌న్ల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌తాన్ని ఆయుధంగా ఉప‌యోగించుకొని ల‌బ్ధిపొందాల‌నుకునే వారిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేద‌న్నారు. క‌రోనా వంటి పెద్ద క‌ష్టంతో ఒక‌వైపు ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డుతుంటే, దీనికి అద‌నంగా కొత్త స‌మ‌స్య‌ల్ని సృష్టించేందుకు ప్ర‌య‌త్నించ‌డం మంచిదికాద‌న్నారు. క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లకు ఆసరాగా నిల‌బ‌డేందుకు ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లుచేస్తున్నస‌మ‌యంలో అశాంతికి ప్ర‌య‌త్నించ‌డం త‌గ‌ద‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. జిల్లా స్థాయిలో మ‌త శాంతి, సామ‌ర‌స్య క‌మిటీ: రాష్ట్ర ప్ర‌భుత్వ జీవో నెం.6 ప్ర‌కారం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి క‌మిటీకి స‌మాంత‌రంగా జిల్లాస్థాయిలో మ‌త సామ‌ర‌స్య క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. మ‌త‌ప‌ర‌మైన ప్ర‌జ‌ల విశ్వాసాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు, సామ‌రస్యాన్ని కాపాడే ల‌క్ష్యంతో ఈ క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాస్థాయి క‌మిటీకి క‌లెక్ట‌ర్ ఛైర్మ‌న్‌గా, సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైస్ ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌న్నారు. ప్ర‌తి మ‌తం నుంచి ఓ ప్ర‌తినిధి స‌భ్యులుగా ఉంటార‌ని వివ‌రించారు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (మైనారిటీస్‌), అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (ఎండోమెంట్స్)లు కూడా స‌భ్యులుగా ఉంటార‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్ (రైతు భ‌రోసా, రెవెన్యూ) స‌భ్య క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. స‌భ్యుల కూర్పుపై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌న్నారు. స‌మావేశానికి హాజ‌రైన హిందూ, ముస్లిం, క్రైస్త‌వం, సిక్కు, బౌద్ధం, జైన త‌దిత‌ర మ‌తాల‌కు చెందిన పెద్ద‌ల నుంచి మ‌త సామ‌ర‌స్యాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సూచ‌న‌లు ఆహ్వానించారు. ఈ సూచ‌న‌ల‌ను ప‌రిశీలించి, త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ద‌శ‌ల వారీగా గ్రామ‌, మండ‌ల‌, డివిజ‌న్ స్థాయిలోనూ మ‌త సామ‌ర‌స్య క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. క‌మిటీ విధివిధానాల‌ను వివ‌రించిన జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌ జిల్లాస్థాయి మ‌త సామ‌ర‌స్య క‌మిటీ విధివిధానాలను జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స‌మావేశంలో వివ‌రించారు. ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణతో కమిటీ రంగంలోకి దిగుతుంద‌ని, మ‌త శాంతి, సామ‌ర‌స్య పున‌రుద్ధ‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని జేసీ వివ‌రించారు. మ‌త సామ‌ర‌స్య సాధ‌న‌కు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మావేశాలు నిర్వ‌హిస్తుంద‌న్నారు. గ‌త సంఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకొని కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తుంద‌ని తెలిపారు. సెన్సిటివ్‌, హైప‌ర్ సెన్సిటివ్ ప్రాంతాల‌ను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు క‌మిటీ స‌మీక్షిస్తుంద‌న్నారు. భూములు లేదా ఇతర సంఘటనల వల్ల ఘ‌ర్ష‌ణలు చెలరేగే అవకాశం ఉన్నచోట పరిష్కారం కోసం కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తుంద‌న్నారు. ప్రార్థ‌నా మందిరాలు, నిర్మాణాలు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతా ప్ర‌ణాళిక‌ను రూపొందించి, అమ‌లు చేస్తుంద‌ని తెలిపారు. ప్రజల్లో మతసామరస్యం పెంపొందించేలా జిల్లా స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటన‌లు జ‌రుపుతుంద‌న్నారు. మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేవారిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణ పురోగతిని క‌మిటీ స‌మీక్షిస్తుంద‌న్నారు. ఐక్య‌తా భావాన్ని, మ‌త సామ‌ర‌స్య స్ఫూర్తిని విద్యార్థుల్లో పెంపొందించేందుకు పాఠ‌శాల‌లు, క‌ళాశాలల్లో కార్య‌క్ర‌మాలను ఏర్పాటుచేస్తుంద‌ని జేసీ వివ‌రించారు. మ‌త సామ‌ర‌స్య స్థాప‌న‌కు పోలీసు శాఖ ప‌టిష్ట ఏర్పాట్లు చేసిన‌ట్లు అడిష‌న‌ల్ ఎస్‌పీ (ఎస్ఈబీ) సుమిత్ గరుడ్ స‌మావేశంలో తెలిపారు. పోలీసు శాఖ నుంచి ఎలాంటి స‌హ‌కారం అందించ‌డానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని మ‌త పెద్ద‌ల‌తో పేర్కొన్నారు. ప్రార్థ‌నా స్థ‌లాల వ‌ద్ద రాత్రిపూట గ‌స్తీ నిర్వ‌హిస్తున్నామ‌ని, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో శాంతి క‌మిటీలు ఏర్పాటుచేసిన‌ట్లు వెల్ల‌డించారు. స‌మావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ (రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) కేఎన్‌వీడీవీ ప్ర‌సాద్‌, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి పీఎస్ ప్ర‌భాక‌ర‌‌రావు, జిల్లా వ‌క్ఫ్‌బోర్డ్ ఇన్‌స్పెక్ట‌ర్ సులేమాన్ బాషా, వివిధ మ‌తాల పెద్ద‌లు పాల్గొన్నారు.

Kakinada

2021-01-09 16:27:28

చెట్లనూ తల్లిదండ్రులుగా భావించాలి..

మ‌న‌కు జ‌న్మ‌నిచ్చేది త‌ల్లి అయితే స్వ‌చ్ఛ‌మైన గాలి అందించి మ‌న ఆయుష్షును పెంచేవి మొక్క‌ల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. మెర‌క‌ముడిదాం మండ‌లం గ‌ర్భాంలోని మంచినీటి కోనేరు ఆవ‌ర‌ణ‌లోను, బుద‌రాయ‌వ‌ల‌స‌ల్లో చేయూత ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన భారీగా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాల్లో క‌లెక్ట‌ర్ శ‌నివారం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విద్యార్ధుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ అప‌రిశుభ్ర‌తే అనారోగ్యానికి కార‌ణ‌మ‌ని, మ‌న ఇంటినే కాకుండా మ‌న గ్రామాన్ని ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌ని అన్నారు. ఆరోగ్యానికి మించిన సంప‌ద మ‌రొక‌టి లేద‌ని అన్నారు. మ‌నం వందేళ్లు బ‌త‌కాలంటే ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాల‌న్నారు. మూగ జీవాల‌కూ మ‌న‌లాగే నీరు అవ‌స‌ర‌మ‌ని చెరువుల్లో  వ్య‌ర్ధాలు వేసి నీటిని క‌లుషితం చేయ‌వ‌ద్ద‌న్నారు. ప్ర‌తి వ్య‌క్తికీ 97శాతం ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మ‌ని పేర్కొంటూ అది చెట్ల  ద్వారానే ల‌భిస్తుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో జిల్లా అట‌వీ అధికారి జాన‌కిరావు, డ్వామా పి.డి. నాగేశ్వ‌ర‌రావు, ఎంపిడిఓ త్రినాధ‌రావు, త‌హ‌శీల్దార్ ర‌త్న‌కుమార్‌, ఎక్స‌యిజ్ ఎస్‌.ఐ. చిన్నంనాయుడు, గ్రామ మాజీ స‌ర్పంచ్ తాడ్డి వేణుగోపాల‌రావు, చేయూత ఫౌండేష‌న్ అధ్య‌క్షుడు ముడిదాపు రాము, గౌరవ అధ్య‌క్షులు మీసాల శ్రీ‌కాంత్‌, కన్వీన‌ర్ విజినిగిరి శంక‌ర‌రావు, డి.సి.ఎం.ఎస్‌. ఛైర్మ‌న్ శిరువూరి ర‌మ‌ణ‌మూర్తి రాజు, మాజీ జెడ్పీటీసీ కోట్ల  వెంక‌ట్రావు, ఇ.ఓ. వాసుదేవ‌రావు, గ్రామ యువ‌త‌, విద్యార్ధులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Vizianagaram

2021-01-09 16:25:08

బలవంతపు ఫీజుల వసూలు ఆపాలి..

విశాఖజిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి బలవంతపు ఫీజు వసూలు వెంటనే ఆపాలని డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు యుఎస్ఎన్ రాజు డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బలవంతంగా  ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కరోనా కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వారి నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమని అన్నారు. ఒకవేళ ఏ విద్యా సంస్థ అయినా ఆ రకంగా ఫీజు అడిగితే తమకు వెంటనే తెలియజేయాలని ఆయన కోరారు. ఫిర్యాదు చేయడానికి విద్యార్ధులు, విద్యార్ధలు తల్లి దండ్రులు ఈ నెంబర్లలో సంప్రదించాలన్నారు.  9490944049, 88864 01852.

Visakhapatnam

2021-01-09 16:16:42

అప్పన్నను దర్శించుకున్న మంత్రి కుటుంబం..

విశాఖ జిల్లా సింహాచలంలోని  శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామి వారిని..రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రిడా  శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు   శనివారం  దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబ సభ్యులకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి కుటుంబ సభ్యులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి..వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా.. ఆలయ అధికారులు..తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో  సింహాచలం బోర్డ్ సభ్యులు,  స్థానిక నాయకులు , ఆలయ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Simhachalam

2021-01-09 16:15:58

ధనుర్మాస పూజతో వెయ్యేళ్ల పూజాఫలం..

ధ‌నుర్మాస ఉత్స‌వాల్లో భాగంగా క‌ర్నూలు న‌గ‌రంలోని ఎపిఎస్‌పి మైదానంలో శుక్రవారం సాయంత్రం ధ‌నుర్మాస లక్ష్మీదీపారాధ‌న కార్య‌క్ర‌మం వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, శ్రీ లక్ష్మీ దేవి ఉత్సవమూర్తులను వేదికపై వేంచేపు చేశారు.  ఈ సందర్భంగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్రతీర్థ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ పవిత్రమైన ధనుర్మాసంలో పూజలు చేస్తే వెయ్యేళ్ల పూజాఫలం సిద్ధిస్తుందని  ఉద్ఘాటించారు. దీపం త్రిమూర్తులకు, నక్షత్ర దేవతలకు ఆవాస స్థానమని, ధనుర్మాసంలో లక్ష్మీ దీపారాధన వల్ల సమస్త మానవాళికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. భగవంతుడు సర్వస్వతంత్రుడని, అయితే భక్తులు ఎక్కడైతే ఆర్తితో కొలుస్తారో అక్కడ ప్రత్యక్షమౌతాడని వివరించారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కర్నూలుకు వేంచేయడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. హైందవ సనాతన ధర్మాన్ని, ఆచారాలను విస్తృత ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు విశేషంగా కృషి చేస్తోందని కొనియాడారు. ధర్మ ప్రచారంతో పాటు సమాజ సంక్షేమం కోసం ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి తిరుమలకు వెళుతున్న భక్తులకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేస్తోందన్నారు.           అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, టీటీడీ ప్రపంచంలోనే ప్రసిద్ధ ధార్మిక సంస్థ అని చెప్పారు. ప్రభుత్వం, పాలక మండలి నేతృత్వంలో అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆధ్యాత్మిక సంపదను ప్రజలకు మరింత చేరువ చేసి, యువతను సన్మార్గంలో పయనింప చేసే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పురాణాల పట్ల ప్రజలకు ఆసక్తి కల్పిచేందుకు టీటీడీ ప్రయత్నిస్తోందన్నారు. కరోనా వైరస్ ను నిర్మూలించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ సుందరకాండ, విరాటపర్వం, భగవద్గీత పారాయణం లాంటి ఎన్నో కార్యమాలను టీటీడీ నిర్వహిస్తోందన్నారు. వీటి ఫలితంతో పాటు ప్రభుత్వం చేసిన శాస్త్ర సంబంధ కార్యక్రమాల వల్ల రాష్ట్రం లో కరోనా ప్రభావం ఒక శాతం కంటే తక్కువకు చేరిందన్నారు.       కార్తీక మాసం శివుడికే కాక శ్రీ మహా విష్ణువుకు కూడా ప్రీతికరమైందని పురాణాలు వెల్లడిస్తున్నాయని ఈవో తెలిపారు.అందువల్లే కార్తీక మాసంలో టీటీడీ తిరుమల లో శ్రీ మహావిష్ణువు, తిరుపతిలో పరమ శివుడికి సంభందించిన అనేక వ్రతాలు, పూజలు నిర్వహించిందని డాక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా గోదా కళ్యాణం, కనుమ పండుగ రోజు గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. లక్ష్మీ దీపారాధన కార్యక్రమం విజయవంతం చేయడానికి రూపకల్పన చేసిన అదనపు ఈవో  ధర్మారెడ్డి, శాసన సభ్యులు  కాటసాని రాం భూపాల్ రెడ్డి తో పాటు మిగిలిన దాతలకు, జిల్లా అధికార యంత్రాంగానికి ఈవో కృతజ్ఞతలు తెలిపారు.         ఈ సందర్భంగా మైదానంలోని వేదికను విద్యుద్దీపాల‌తో, పుష్పాల‌తో శోభాయ‌మానంగా తీర్చిదిద్దారు. విశేష సంఖ్యలో హాజరైన మ‌హిళ‌లు భౌతిక దూరం పాటించి ‌దీపాలు వెలిగించారు.  మైదానంలో బారీకేడ్లు, తివాచీలు ఏర్పాటు చేశారు. వైదిక మంత్ర పఠనం, శ్లోకప్రార్థనతో కార్య‌క్ర‌మం ప్రారంభమైంది. కార్యక్రమం ఎలాంటి విఘ్నం లేకుండా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, కాలశుద్ధి, స్థలశుద్ధి కోసం వేదస్వస్తి నిర్వహించారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకురాలు డా.కె.వందన బృందం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తూ కనకధారా స్తోత్రం పఠించారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్రీ మారుతి మ‌హాల‌క్ష్మీ అనుగ్ర‌హ ఆవ‌శ్య‌క‌త‌ను, దీప ప్ర‌శ‌స్తిని వివరించారు. ఆ త‌రువాత శ్రీ అల‌మేల్మంగ నామావ‌ళి, అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం నృత్య రూప‌కం, గోవింద‌నామాలు పారాయ‌ణం చేశారు. కార్యక్రమాన్ని డ్రోన్ ద్వారా తీసిన వీడియో భక్తులను విశేషంగా ఆకర్షించింది.       ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంపి  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు  వేమిరెడ్డి ప్రశాంతి,  మురళీకృష్ణ, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, డిఐజి వెంకటరామరెడ్డి, జిల్లా ఎస్పీ డా.కె. ఫకీరప్ప,  నగరపాలక సంస్థ కమీషనర్ డి.కె. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Kurnool

2021-01-08 22:41:45

పైలట్ గ్రామాలుగా తమటాడ, మర్రివలస..

సర్వే అఫ్ విలేజెస్ అండ్ మాపింగ్  విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ  ఇన్ విలేజ్ ఏరియాస్( స్వమిత్వ )  పధకం క్రింద సమగ్రంగా సర్వే జరపాలని సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవం సందర్భంగా 2020 ఏప్రిల్ 24 న ప్రధాన మంత్రి  ప్రారంభించిన స్వమిత్వ  పధకం  ద్వార  గ్రామాలలోనున్న ఆస్తి హక్కు దారులకు రికార్డుల పై హక్కులను కల్పించడం జరుగుతుందని అన్నారు.  హక్కుదారులు వారి ఆస్తుల పై బ్యాంకు ల నుండి రుణాలు పొందడానికి   వీలయ్యే అంత శుద్ధంగా  రికార్డు లు ఉండాలని ఉద్దేశించే ఈ సర్వే  కోసం పైలట్ గ్రామాలుగా రెండు డివిజిన్ల నుండి రెండు గ్రామాలను ఎంపిక  చేయడం జరిగిందన్నారు.  బొండపల్లి  మండలం తమటాడ , రామభద్ర పురం మండలం మర్రివలస గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సర్వే పూర్తి చేయాలని  అన్నారు.       శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశ మందిరం లో  సర్వే కార్యక్రమం పై రెండు మండలాలకు చెందిన రెవిన్యూ, పంచాయతి రాజ్, సర్వే శాఖల అధికారు లు, సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేసారు.    గ్రామం లోని ప్రతి ఇంటికి కొలతలు వేసి, హద్దు లను నిర్ధారించాలన్నారు.  అదేవిధంగా ఖాళీ  స్థలాలను, ప్రభుత్వ స్థలాలను, గ్రామకంఠం  ను కూడా కొలతలు వేసి పొడవు, వెడల్పులను, సరి హద్దులను గుర్తించి  హద్దు రాళ్ళను  పాతాలని  సూచించారు.డ్రోన్ ద్వారా ఫోటో లను తీయడం జరుగుతుందని, అందుకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలను ఇతర సామగ్రిని తొలగించాలన్నారు. ఈపధకం ద్వారా గ్రామా స్థాయి రెవిన్యూ రికార్డులన్నీ సమగ్రంగా శుద్ధం అవుతాయని తెలిపారు.  మాస్టర్ ట్రైనీ లతో సర్వేయర్స్ కు,  సచివాలయ కార్యదర్సులకు సర్వే అంశాల పై పూర్తి స్థాయి శిక్షణ  త్వరగా ఇవ్వాలన్నారు.      ఈ సమావేశం లో జిల్లా పచయతి అధికారి సునీల్ రాజ్ కుమార్, సర్వే సహాయ సంచాలకులు పోలా రాజు, డివిజినల్ పంచాయతి అధికారి మోహన రావు ,  బొండపల్లి, రామభద్రాపురం  మండలాల ఎంపిడిఓ లు, తహసిల్దార్ లు, సర్వేయర్లు , ఈ ఓ పి ఆర్ డి లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-01-08 22:24:24

తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి..

కర్నూలు నగర పాలక పరిధిలో వివిధ టెలికామ్ రంగ సంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లను ఇష్టరీతిన ధ్వంసం చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ హెచ్చరించారు. నగరంలో చాలా చోట్ల అనుమతులు లేకుండా రహదారులు తవ్వినప్పుడు భూమి లోపల ఉండే తాగునీటి పైప్ లైన్ ధ్వంసం అయి ప్రధాన పైప్ లైన్ మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో పలుమార్లు వివిధ ప్రాంతాల్లో మునిసిపల్ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై నగర పాలక పరిధిలో టెలికామ్, కేబుల్ రంగ యాజమాన్యం వారు తమ వైరింగ్ పనులు చేపట్టే ముందు తప్పకుండా కర్నూలు మునిసిపల్ కొర్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోని తిరిగి పనులు పూర్తయ్యాక వాటిని పూడ్చివేయాలని కోరారు. నగర ప్రజలు కూడా ఇలాంటి పనులు ఎవరైనా చేపడుతునట్లు గుర్తిస్తే వెంటనే నగర పాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 7422992299 కు ఫోన్ ద్వారా కానీ...వాట్సాప్ లో మెసేజ్ రూపం గాని మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని కోరారు.

Kurnool

2021-01-08 22:15:26

వాసుపల్లీ.. రాజీనామా చేసి గెలిచి చూపించు..

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లికి దమ్ము,ధైర్యం ఉంటె రాజీనామా చేసి గెలవాలని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ సవాలు విసిరారు.శుక్రవారం జిల్లా కార్యాలయంలో పార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం శాసనసభ్యునిగా గెలిచి వైసీపీ కండువా కప్పుకోకుండా తన భజనపరులకు వైసీపీ కండువాలు కప్పడం హస్స్యాస్పదంగా ఉందన్నారు.ఈ రోజు వాసుపల్లి కండువాలు కప్పినవారందరూ అయన భజనపరులేనన్నారు.తెలుగుదేశం దయవల్ల  రెండుసార్లు శాసనసభ్యునిగా గెలిచి సొంతబలమని విర్రవీగుతున్నారని దుయ్యబట్టారు.సంస్కరహీనంగా మాట్లాడటం విద్యాధికునిగా ఆయనకు చెల్లదని హితవు పలికారు.తెలుగుదేశం కార్యకర్తల బలమేమిటో ఆయనకు బాగా తెలుసన్నారు.ప్రస్తుతం వాసుపల్లి వాలకం చూస్తుంటే మతిభ్రమిచిందేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు.ఏ1,ఏ2, ల పార్టీ లో చేరిన తరువాత గతం మరిచి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత స్వార్ధం తో వైసీపీ పంచన చేరారన్నారు.రాబోయే కార్పొరేషన్ ఎన్నికలల్లో మేయర్ పీఠం తెలుగుదేశందేనని  ఘంటాపధంగా చెప్పారు.సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో దాదాపు ఇరవై ఏడు సీట్లు గెలుచుకుంటామన్నారు.ఇళ్ల పట్టాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.దేవాలయ సంఘటనలపై మంత్రులు అసభ్యంగా మాటాడుతున్నారని,రాష్ట్రానికి శనిలా దాపురించారని విమర్శించారు.శాసనసభ్యునిగా రాజీనామా చేసి తన బలమేమిటో వాసుపల్లి తెలుసుకోవాలని మరొక్కసారి హితవుపలికారు.దక్షిణ నియోజకవర్గ వార్డు ఇంచార్జులు,కార్పొరేటర్ అభ్యర్థులు పత్రికా సమావేశంలో పాల్గొని వాసుపల్లి అసభ్యకర ప్రకటనలపై దుమ్మెత్తిపోశారు.ఈ కార్యక్రమంలో విల్లురి చక్రవర్తి,చిన్నరహ్మన్,దాసన త్యనారాయణ,ఎల్లపుశ్రీనివాసు,పొడుగుకుమార్, సత్యవతి,బొత్సరాము, రామానంద్,సీఎం రమణ,జగదీశ్,కనగళ్లసత్య.బాపుఆనంద్. కోడిగుడ్లశ్రీధర్,ఈమంది రంగారావు,లక్ష్మీ శివప్రసాద్.తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-08 22:03:34