నూతన సంవత్సర వేడుకలలో భాగంగా డిశంబరు 31న మద్యం దుకాణాలకు రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటిండెంట్ కార్యాలయంలో బుధ వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అమిత్ బర్దార్ మాట్లాడుతూ ప్రజలు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ, శాంతులతో జీవించాలని, వారి ఆకాంక్షలు నెరవేరాలని వాంచించారు. కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు సాధారణంగా జరుపుకోవాలని కోరారు. డిశంబరు 31న మద్యం దుకాణాలకు రాత్రి 9 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లకు రాత్రి 11 గంటల వరకు, హోటళ్ళకు రాత్రి 12 గంటల వరకు అనుమతించడం జరుగుతుందని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైన, బహిరంగంగా మద్యం సేవించిన వారిపైనా, మద్యం సేవించి అమర్యాదకరంగా ప్రవర్తించే వారిపైన కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. బాణా సంచాకు అనుమతించడం లేదని ఆయన స్పష్టం చేసారు. అధిక మొత్తంలో అపరాధ రుసుములు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పోలీసు బీట్లు అధికం చేస్తామని, ఎల్.సి.సి.ఓ మీటర్లను రహదారులపై ఏర్పాటు చేస్తున్నామని, సిసి కెమెరా నిఘా ఉంటుందని ఎస్.పి తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు.
జిల్లాలో క్రైమ్ తగ్గుముఖం : జిల్లాలో 2020 సంవత్సరంలో క్రైమ్ బాగా తగ్గుముఖం పట్టిందని అమిత్ బర్దార్ తెలిపారు. మర్డర్లు సంభవించలేదని, సాధారణ దొంగతనాల కేసులు 28.86 శాతం, మోసాలు 51 శాతం, 307 ఐపిసి కేసులు 21 శాతం, ప్రమాదాలలో మరణాలు 5.61 శాతం, గేమింగు చట్ట పరిధి క్రింద 21 శాతం, ఎక్సైజ్ చట్ట పరిధి క్రింద కేసులు 17 శాతం తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్.పి కె.శ్రీనివాస రావు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నాటు సారా ప్రవాహం దాదాపు ఆగిందని జిల్లా పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటిండెంట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అమిత్ బర్దార్ మాట్లాడుతూ, జూలై నెలలలో ప్రారంభమైన జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్.ఇ.బి) ఏర్పాటుతో నాటు సారాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరిగిందన్నారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించి, ఒడిషా పోలీసుల సంయుక్త సహకారంతో దాడులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గంగాపూర్, రామచంద్రాపురం, కొండ బీజాపూర్ ప్రాంతాలలో దాడులు నిర్వహించి వేల ఎకరాల నాటు సారా ఊటను ధ్వంసం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల పరిధిలో నాటు సారా తయారు చేసి సరిహద్దులు దాటి ఆంధ్రాలో ప్రవేశించడం జరుగుతోందని ఎస్.పి చెప్పారు. గోంగాపూర్ గ్రామ పరిధిలో 27,600 లీటర్ల బెల్లపు ఊట, 250 లీటర్ల నాటు సారాను, రామచంద్రపూర్ గ్రామ పరిధిలో 6 వేల లీటర్ల బెల్లపు ఊటను, కొండబీజాపూర్ గ్రామ పరిధిలో 4,800 లీటర్ల బెల్లపు ఉటను, 20 లీటర్ల నాటుసారాని వెరశి 38,400 లీటర్ల బెల్లపు ఉట, 270 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని, సరిహద్దు ప్రాంతాల నుండి నాటు సారా రవాణా లపై ప్రతేక నిఘా వుంచి, నాటుసారా తయారీ స్థావరాలపై మెరుపు దాడి చేసి పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని తెలియజేశారు. వీరఘట్టాం, హిరమండలం, పాతపట్నం, మందస, సోంపేట తదితర ప్రాంతాల దగ్గరలోగల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమైన అక్రమ తయారీ స్థావరాలపై నిరంతరం దాడులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్.పి కె.శ్రీనివాస రావు పాల్గొన్నారు.
జివిఎంసీ పరిధిలో పారిశుధ్యం, ప్రజామరుగు దొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని శానిటరీ ఇనెస్పెక్టర్లను అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు ఆదేశించారు. బుధవారం రెండవ జోన్ లో 9, 11 వార్డులలో పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, అన్నివార్డుల్లోని సచివాలయ సిబ్బంది పారిశుధ్యం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అనంతరం 9, 11వార్డు లలో సీతమ్మధార, టి.పి.టి కొలని, గురుద్వారా తదితర ప్రాంతాలలో పారిశుధ్య పనుల వార్డుల శానిటరీ ఇన్స్పెక్టర్ల తో కలసి క్షేత్ర పరిశీలన చేసారు. మరుగుదొడ్లకు రిపేర్లు అవసరమైనచో వెంటనే చేయించాలని ఆదేశించారు. ఒ.డి.ఫ్. బృందం తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు స్వచ్చ సర్వేక్షణ్ -2021పై అవగాహన కల్పించాలని, తడి - పొడి చెత్తను వేరు చేసి తీసుకోవాలని పారిశుధ్య విభాగపు సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం వార్డులలో వార్డు శానిటరీ కార్యదర్శులు పర్యటించి సీజనల్ వ్యాధులపై పరిశీలన సూక్ష్మ స్థాయిలో చేయాలన్నారు. పర్యటనలో 9,11 వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఆయా వార్డు శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
కనీవినీ ఎరుగని స్థాయిలో ఒకేసారి ఏకంగా 30లక్షల, 75వేల ఇళ్ల పట్టాల పంపిణీ దేశ చరిత్రలోనే ఒక చిరస్మరణీయ ఘట్టమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసన సభ్యులు, అధికారులు కొనియాడారు. ఇటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు తమ జన్మ ధన్యమయ్యిందని పేర్కొన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గుంకలాంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖామంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలను నెరవేర్చిన రోజు చారిత్రక దినమని పేర్కొన్నారు. వారి గుండెల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి చిరస్మరణీయంగా నిలిచిపోతారని కొనియాడారు. దేశానికి స్వతంత్రం వచ్చి 73ఏళ్లు పూర్తయినప్పటికీ, ఈ 73 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయలేని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కేవలం 73 వారాల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి చేశారని చెప్పారు. ఆయన ఒక అన్నలా ప్రజా సమస్యలు విని, ఒక అమ్మలా పాలిస్తున్నారని కొనియాడారు. రామరాజ్యాన్ని, రాజన్న రాజ్యాన్ని కలిపి మన కళ్లముందుంచిన ఘనత జగన్కే దక్కిందన్నారు. జగన్ మోహనరెడ్డి మహిళా పక్షపాతి అని, పదవులూ, పథకాలను మహిళకోసమే తెచ్చి, పథకాల ఫలాలను కూడా మహిళలకే అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆశలను నెరవేరుస్తూ, ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఆయన చేతులమీదుగా పట్టాల పంపిణీ జరగడం ఒక అధృష్టంగా పేర్కొన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలవద్దకే పాలన అందించారన్నారు. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పేదలు, బిసిలు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు ఎక్కువని, వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి పలాసలో రూ.600 కోట్లతో వాటర్ గ్రిడ్ తెచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి వెంట నడచేందుకు జనం ఉర్రూతలూగుతున్నారని ధర్మాన అన్నారు.
రాష్ట్ర పట్టణాభివృద్ది, పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఇళ్ల పట్టాలు పొందడం పేదల చిరకాల స్వప్నమని, దానిని ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి నెరవేర్చారని కొనియాడారు. ఎన్నికల ప్రణాళిక తమ పార్టీకి ఒక భగవద్గీత అని, దానిని తూచ తప్పకుండా పాటిస్తామని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, నిర్ణీత కాలవ్యవధిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికే దక్కిందన్నారు. నిధులకు కటకటలాడుతున్న క్లిష్ట పరిస్థితిలో కూడా, దైర్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. లక్షలాది మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాకుండా, వారికి ఇళ్లు మంజూరు చేసి, సొంతింటి కలలను నిజం చేస్తున్నారని అన్నారు. విజయనగరం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రస్తావించి, వాటిని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని బొత్స కోరారు.
సభాధ్యక్షత వహించిన విజయనగరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, ఇళ్ల పట్టాల కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రజల ఆకాంక్షలు నేటికి నెరవేరాయని అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకొనేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన 40ఏళ్ల అనుభవాన్నంతా ఉపయోగించినా, ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ముందు అవి ఫలించలేదని పేర్కొన్నారు. అర్హులందరికీ అవినీతికి, పక్షపాతానికి తావులేకుండా ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. గుంకలాం లేఅవుట్ను రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీల్లో ఒకటిగా రూపొందించామని, దీనికి ముఖ్యమంత్రి పేరుమీదుగా జెఎన్ఆర్ కాలనీగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. విజయనగరం కార్పొరేషన్ను మోడల్ సిటీగా అభివృద్ది చేయాలని, వైద్యకళాశాల నిర్మాణాన్ని ప్రారంభించాలని కోలగట్ల కోరారు.
ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ మాట్లాడుతూ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 1164 లేఅవుట్లను అభివృద్ది చేయడం జరిగిందన్నారు. దీనిలో గుంకలాం లేవుట్ రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్లలో ఒకటిగా నిలిచిందని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం లక్షా, 8వేలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. దీనిలో తొలివిడతగా 98,886 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. వీటిని 18 నెలల్లో పూర్తి చేయనున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా,ఆయనను స్ఫూర్తిగా తీసుకొని, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సమిష్టిగా జిల్లా అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఫలితంగా జిల్లాకు 16 ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయని, వీటి స్పూర్తితో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గుంకలాంలో ఇంటి పట్టాను పొందిన లబ్దిదారు, పద్మావతినగర్కు చెందిన కొమరగిరి రత్నకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. తాను టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, తనకు సొంతింటి భాగ్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. అద్దె ఇంటి కష్టాలను చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇప్పటివరకూ దాదాపు 12 ఇళ్లు మారానని, తన కష్టాలు కొద్ది కాలంలోనే గట్టెక్కిపోతాయంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం వల్ల తన కూతురు బిటెక్ వరకూ చదువుకోగలిగిందని చెప్పారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో తనకు వితంతు పింఛన్ వచ్చిందని, ఇప్పుడు ఇళ్లు కూడా మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
సభానంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. అంబేద్కర్ కాలనీకి చెందిన పిన్నింటి రామలక్ష్మి, కెఎల్ పురానికి చెందిన మజ్జి మౌనిక, 28వ వార్డుకు చెందిన పోల జయలక్ష్మి ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలను అందుకున్నారు. అలాగే టిట్కో ఇళ్లకు సంబంధించి జి.పార్వతి, కె.దివ్య ముఖ్యమంత్రి చేతులమీదుగా పట్టాలను పొందారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గృహనిర్మాణ శాఖామంత్రి చెరకువాడ శ్రీరంగనాధరాజు, పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్, గొట్టేటి మాధవి, ఎంవివి సత్యనారాయణ, సత్యవతి, ఎంఎల్సి పి.సురేష్బాబు, ఎంఎల్ఏలు పీడిక రాజన్నదొర, బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు,శంబంగి వెంకట చినప్పలనాయుడు, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, కంబాల జోగులు, రెడ్డి శాంతి, కళావతి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్, వైకాపా జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి, డిఐజి కాళిదాస్ రంగారావు, ఎస్పి బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్కుమార్, సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్డిఏ పిడి కె.సుబ్బారావు, ఇతర అధికారులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, కోలగట్ల శ్రావణి తదితర పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పాత్రికేయుల సంక్షేమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ) తన మార్కు విజయాలను నమోదు చేసుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. బుధవారం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ డైరీని అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ఇతర కార్యవర్గంలో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, అసోసియేషన్ సభ్యులకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. భరోసా ఇస్తోందని ఆయన కొనియాడారు. ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచిన పాత్రికేయుల సంక్షేమం విషయంలో జర్నలిస్టుల సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పాత్రికేయుల సంక్షేమం కోసం ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. అసోసియేషన్ సభ్యులు ఎంతో ఐక్యతతో వారి సమస్యలు వారి పరిష్కరించుకోవడం అభినందనీయమని చెప్పారు. ఆత్మీయ అతిధిగా హాజరైన సీనియర్ పాత్రికేయుడు, అసోసియేషన్ గౌరవ సలహాదారు ఎన్.నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. నాలుగేళ్లల్లో సాధించిన ప్రగతిని వివరించారు.
ఉద్యోగాలు కోల్పోయిన జర్నలిస్టులకు కనీసం ఆరు నెలలపాటు ఉపకార వేతనాలు ఇచ్చే విధంగా అసోసియేషన్ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ నాలుగేళ్లల్లో అసోసియేషన్ సాధించిన విజయాలను వెల్లడించారు. స్వల్ప సంఖ్య సభ్యత్వంతో మొదలైన అసోసియేషన్ ప్రయాణం నేడు రెండు వందల మార్కుకు చేరువలో ఉందని తెలిపారు. స్మార్ట్ సిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలను అసోసియేషన్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అసోసియేషన్కు పక్కా భవనం సమకూర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. సభ్యులు, వర్కింగ్ జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. ను విజయవంతంగా నడిపిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా డైరీ సహా అసోసియేషన్ ప్రగతి పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. డైరీ ఆవిష్కరణకు ముందు ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. నాలుగేళ్ల ప్రగతి పై రూపొందించిన ఏవీ (ఆడియో, వీడియో)ని విడుదల చేశారు.
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్య, కార్యదర్శి అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కిరణ్, రామకృష్ణ, రిషికేష్, కోశాధికారి అశోక్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి పద్మజ, సునీల్ కుమార్, అనీష్ కుమార్, కార్యవర్గ సభ్యులు ఎల్లాజీ, సూర్య, మదన్, రాజు, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సభ్యులకు మిఠాయిలు , డైరీ పంపిణీ చేశారు. డైరీ కోసం శ్రమించిన అసోసియేషన్ ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమానికి సంధానకర్తగా చైతన్య వ్యవహరించారు.
శ్రీకాకుళంలో టిడ్కో గృహాల విక్రయాల ఒప్పంద పత్రాలను లబ్దిదారులకు బుధ వారం నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య అందజేసారు. బాపూజి కళామందిర్ లో జరిగిన కార్యక్రమంలో పత్రాలను నల్లనయ్య అందజేసారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఆయన అన్నారు. పేద ప్రజానీకానికి గూడు కల్పంచాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొంటూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. టిడ్కో గృహా సముదాయం చక్కని ప్రదేశంలో ఉందని ఆయన అన్నారు. వెయ్యికి పైగా కుటుంబాలు నివశిస్తూ మంచి కాలనీగా అవతరించనుందని ఆయన చెప్పారు. టిడ్కో గృహాల సేల్ అగ్రిమెంట్లను అక్కాచెల్లెమ్మలకు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. 300 చదరపు అడుగులు టిడ్కో గృహాలను కేవలం రూపాయికే ప్రభుత్వం అందిస్తుందని, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్ళకు లబ్దిదారులు కట్టవలసిన ముందస్తు వాటాలోని 50 శాతం సొమ్ము కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన అన్నారు. పేద వారి సొంత ఇంటి కల నెరవేరుతుందని కమీషనర్ అన్నారు. అంతకుముందు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని లైవ్ ద్వారా లబ్దిదారులకు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టిపిఆర్ ఓ జగన్మోహన రావు, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సకాలంలో అందేలా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కృషిచేయాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామ, వార్డు సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు, డెవలప్ మెంట్ సెక్రటరీలకు సంక్షేమ పథకాలపై డివిజనల్ స్థాయి శిక్షణ తరగతులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని అన్నారు. ప్రతీ సంక్షేమ పథకం ద్వారా అందిస్తున్న లబ్ధి, వర్గం, పథకం అమలుచేసే ప్రభుత్వ శాఖ, అర్హతల వివరాలు క్షుణ్ణంగా తెలిసిఉండాలని సూచించారు. ప్రభుత్వం కుల,మత,పార్టీలకు అతీతంగా పారదర్శకంగా పథకాలను అమలుచేస్తున్నందున అసలైన లబ్ధిదారులను గుర్తించాలని చెప్పారు. అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడు సంక్షేమ పథకాలను నష్టపోరాదని, అలాగే అనర్హులకు ఎట్టి పరిస్థితిల్లో పథకాలు అందరాదని స్పష్టం చేసారు. ఈ విషయంలో సచివాలయ సిబ్బంది నిజాయితీగా పనిచేయాలని వివరించారు. నిజమైన లబ్ధిదారునికి పథకం అమలుకానట్లయితే దానిని అమలుచేసేలా కృషిచేయాలని అన్నారు.
సచివాలయ సిబ్బంది వద్ద సంక్షేమ పథకాలకు సంబంధించిన డైరీ అందుబాటులో ఉంచుకోవాలని, ఆ డైరీలో ప్రభుత్వం అందించే పథకాలతో పాటు లబ్ధిదారుల జాబితా, అనర్హుల వివరాలు ఉండాలని అన్నారు. అనర్హలుగా గుర్తిస్తే అందుకు గల కారణాలను దరఖాస్తుదారునికి స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్లు, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి మరియు ఇతర అధికారులు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారని, సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు సిబ్బంది వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో బాగా పనిచేసే సచివాలయాలు ఉన్నాయని, అదేవిధంగా నామమాత్రంగా పనిచేసే సచివాలయాలు ఉన్నందున ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్న సంగతిని ఆయన గుర్తుచేసారు. సంక్షేమ పథకాల అమలులో సచివాలయ సిబ్బంది ఎటువంటి ఒత్తిడులకు తలొగ్గవద్దని, నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు హాజరై బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని, మంచి సేవలను అందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ప్రతీ లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు సకాలంలో అందేందుకు సాయశక్తుల కృషిచేయాలని, ప్రభుత్వం అమలుచేసే కొత్త పథకాలు, టెక్నాలజీలపై ఎప్పటికపుడు అప్ డేట్ కావాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పరిషత్ ఉప ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకులు యం.పద్మ, డివిజనల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ అలివేలు మంగ, డా.కృష్ణప్రసాద్, డి.పి.ఎం ఆర్.వి.రమణ, పలు ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, విలేజ్ వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, వార్డు వెల్ఫేర్ మరియు డెవలప్ మెంట్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
అక్కాచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు ఇళ్ల పట్టాల పంపిణీని ఒక బాధ్యతగా తీసుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని, ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సకల వసతులతో వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. విజయనగరం పట్టణ పేదలకోసం గుంకలాం గ్రామం వద్ద రూపొందించిన అతిపెద్ద లేఅవుట్లో 12,301 ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పట్టాల పంపిణీ కార్యక్రమం గుంకలాంలో జరిగింది. ఒకేసారి 12,301 మందికి పట్టాలను పంపిణీ చేయడంతో, ఈ ప్రాంతమంతా కోలహలంగా మారి పండుగ వాతావరణాన్ని తలపించింది. లబ్దిదారుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. వినూత్నంగా జరిగిన ఈ కార్యక్రమంలో, లబ్దిదారులు తమకు కేటాయించిన ఇంటి స్థలంలోనే ఆశీనులై ముఖ్యమంత్రి ప్రసంగాన్ని విన్నారు. తమను సొంత ఇంటివారిని చేసినందుకు జగనన్నకు జేజేలు పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి మాట్లాడుతూ, సొంత ఇంటి కోసం పేదలు కంటున్న కలలను, అద్దె ఇళ్లల్లో వారు పడుతున్న అవస్థలను తన సుదీర్ఘ పాదయాత్రలో గమనించానని అన్నారు. అందుకే నవరత్నాల్లో భాగంగా 25లక్షల ఇళ్లను కట్టిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చామని, కానీ అంతకంటే అధికంగా, ఏకంగా 30లక్షల, 75వేల ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది చివరిలో జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం, ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. అన్ని రకలా మౌలిక వసతులతో జగనన్న కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తాము ఇళ్లను కాకుండా, ఏకంగా ఊళ్లనే కట్టిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పేదలకు మంచి చేస్తుంటే చూడలేక, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, అతని అనుచర గణం ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డకోడానికి ఎన్నో కుయుక్తులు పన్నారని, కోర్టులను ఆశ్రయించి స్టేలు తెచ్చుకున్నారని అన్నారు. నిరుపేదలకు ఇళ్లు కేటాయిస్తుంటే చూడలేక, కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని, ఇదేమి రాజకీయమని ప్రశ్నించారు. దీనివల్ల పట్టాల పంపిణీలో కొంత జాప్యం జరిగినప్పటికీ, ఇన్నాళ్లకు పేదల కలలను నెరవేర్చామని చెప్పారు. అయినప్పటికీ సుమారు 3,74,000 మందికి చంద్రబాబు పుణ్యాన ఇళ్లు రాకుండా ఆగిపోయాయని, కోర్టు కేసులు పరిష్కరం అయినవెంటనే వీరందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని అన్నారు.
ఇళ్లులేని నిరుపేదలందరికీ సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం 30లక్షల, 75వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వీటిలో 28లక్షల, 30వేల మందికి కొత్తగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, 2.62లక్షల మందికి టిట్కో ఫ్లాట్లను ఇస్తున్నామని తెలిపారు. కేవలం పట్టాలను ఇచ్చి వదిలేయకుండా, తొలివిడతగా 15లక్షల, 60వేల ఇళ్లను నిర్మిస్తామని, మలివిడతలో మిగిలినవాటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. సుమారు రూ.7వేల కోట్లతో కాలనీల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెళ్లడించారు. లబ్దిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని మూడు పద్దతుల్లో పూర్తి చేసుకోవచ్చని, వాటిని వివరించారు. గుంకలాంలో అతిపెద్ద లేఅవుట్ను రూపొందించడం ద్వారా ఒక టౌన్షిప్నే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ లేఅవుట్లో పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, పోలీసు స్టేషన్లు, కల్యాణమండపాలు ఇలా ప్రజలకు అవసరమయ్యే ప్రతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అక్కాచెల్లెమ్మలు అద్దె ఇళ్లల్లో, గుడిసెల్లో పడుతున్న కష్టాలను తొలగించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లక్షలాది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా దాదాపు 30 రకాల వృత్తులవారికి ఉపాది దొరకడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థకు మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుందని అన్నారు. అలాగే పచ్చదనాన్ని పెంపొందించేందుకు జగనన్న కాలనీల్లో సుమారు 13లక్షల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు.
కేవలం 18 నెలల కాలంలోనే కులమత, వర్గ విభేదాలకు తావులేకుండా, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా, అన్ని వర్గాలకు పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రభుత్వ పధకాలను అందజేశామని ముఖ్యమంత్రి చెప్పారు. సుమారు 40లక్షల కుటుంబాలకు అమ్మ ఒడి ద్వారా, అరకోటి మంది రైతులకు రైతు భరోసా ద్వారా, చేయూత పథకం క్రింద 25లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు, 87లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా, 18.5లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ది చేకూర్చామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 62లక్షల మందికి ప్రతీనెలా 1వ తేదీన కోడికూయక ముందే వారి ఇంటికే పింఛన్ను పంపిస్తున్నాని అన్నారు. సున్నా వడ్డీద్వారా డ్వాక్రా మహిళలను, రైతులను ఆదుకుంటున్నామన్నారు. రైతుకు బీమా సదుపాయాన్ని కల్పించడమే కాకుండా, గ్రామగ్రామానా రైతు భరోసా కేంద్రాలను పెట్టి, వివిధ రకాల సేవలను వారి ముంగిటకు చేర్చామన్నారు. పంట నష్టం జరిగితే, ఆ జరిగిన సీజన్లోనే వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మార్పులు చేసిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పధకం ద్వారా సుమారు కోటి,35లక్షల మందికి మేలు చేస్తున్నామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రజల ముంగిటికి చేర్చడమే కాకుండా, లక్షా, 30వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. దాదాపు 2.60లక్షల మందిని వాలంటీర్లుగా నియమించామన్నారు. ఇంటిముంగిటకే ఇంగ్లీషు మీడియం చదువులను తెచ్చామన్నారు.
విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి పలు వరాలను ప్రకటించారు. కురుపాంలో మంజూరు చేసిన జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాలకు రూ.150కోట్లు కేటాయించామని, టెండర్లు పిలవడం కూడా జరిగిందని చెప్పారు. సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరవుతుందని, దీనికోసం త్వరలో కేంద్ర బృందం వస్తుందని చెప్పారు. విజయనగరంలో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించేందుకు జనవరిలో టెండర్లు పిలుస్తామని, మార్చిలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉత్తరాంధ్రకు మేలు చేకూర్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి దశ పనులు రూ.2వేల కోట్లతో జరుగుతున్నాయని అన్నారు. రూ.4,134 కోట్లతో రెండో దశ పనులను ఇటీవలే మంజూరు చేశామన్నారు. వీటి ద్వారా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.471కోట్లు మంజూరు చేసి, రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టుకు రూ.620కోట్లు మంజూరు చేసి, రెండేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అదనంగా 5వేల ఎకరాలకు నీరిచ్చే వెంగళరాయసాగర్ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. రాముడువలస, లోచర్ల ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసి, ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. గుంకలాం జగనన్న కాలనీలో మౌలిక సదుపాయల కల్పనకు నిధులు మంజూరు చేసి, 18 నెలల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీఇచ్చారు.
ఏపీ సీఎం వైఎస్ జగనన్న మహిళల అభివ్రుద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మహిళా విభాగం రాష్ట్రకార్యదర్శి జి.రోజారాణి ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారు. మంగళవారం వైఎస్ జగనన్న మహిళా మణుల సైన్యం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖ జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఈ వైఎస్సార్సీపీ సాంస్క్రుతిక విభాగం అధ్యక్షురాలు రాధను ఘనంగా సత్కరించారు. అనంతరం కార్పోరేషన్ డైరెక్టర్లు యువశ్రీ, సమీరాబేగంలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగనన్న మహిళలను అన్నిరంగాల్లో ముందుంచాలనే లక్ష్యంతో కార్పోరేషన్ పదవుల్లో 50శాతం మమిళలకు డైరెక్టర్ పదవులు కల్పించారని కొనియాడారు. మహిళా లోకమంతా జగనన్న వెంటే వుంటుందని ఈ సందర్భంగా మహిళలంతా ముక్తకంఠంతో చెప్పారు. రాష్ట్రం లో ప్రతీ మహిళ జగనన్నను తన కుటుంభ సభ్యుడుగా భావిస్తున్నారన్నారు. మహిళా మణులు తమ కార్యక్రమాలను తరుచూ నిర్వహించాలని ఈ సందర్భంగా తీర్మాణించినట్టు రోజారాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజవర్గం వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రతినిధులు జుట్టు లక్ష్మి, తదిరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో రాష్ట్రంలోని సమస్యలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకొని నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నారని రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అట్టడుగున ఉన్న వర్గాలకు అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంతకుముందు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అనంతపురంకు స్నేహలత ను దారుణంగా చంపేశారని, స్నేహలత కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపడానికి వారిని పరామర్శించడం జరిగిందని, వారి కుటుంబానికి అందరి సహకారం అందించాలన్నారు. ఇలాంటి సంఘటనలు సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. సమాజంలో చెడును నిర్మూలించాలని మంచికి సహకారం అందించాలన్నారు. స్నేహలత కుటుంబ సభ్యులకు ఐదెకరాల పొలం, ఐదు సెంట్ల భూమి, 10 లక్షల డబ్బు, ఒకరికి ఉద్యోగం అందించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాగుండాలని కోరుకుంటుందని, రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి తప్పు జరిగినా తక్షణం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని, వారికి భద్రత కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యుగంధర్, ఎస్సీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ తో కలిసి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలోనే వినూత్నమైన పథకాలతో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ రాజ్యం అమలు చేస్తోందని, నవరత్నాల పథకాలు అమలు అనేది దేశ చరిత్రలోనే పెద్ద సంక్షేమ కార్యక్రమమన్నారు. ఇందులో భాగంగా అమలుచేస్తున్న పేదలందరికీ ఇల్లు కింద 30.75 లక్షల ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో సంక్రాంతి పండగలా జరుగుతోందన్నారు. 'వైస్సార్ రైతు భరోసా మరియు నవంబర్ లో వర్షాలతో జరిగిన పంట నష్టాలకు సంబంధించిన పంట నష్ట పరిహారంను రైతుల ఖాతాలలోకి జమ చేయడం జరిగిందని, కరుణా లాంటి కష్ట సమయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశారన్నారు.
ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలు, చెప్పనవి కూడా 90 శాతం మేరకు అమలు చేశారన్నారు. తుఫాన్ల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఒక నెల రోజుల వ్యవధిలోనే పంట నష్టపరిహారం ఇచ్చారని, తన పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలు చూసి మేనిఫెస్టో తయారు చేసి దానిని ఖురాన్, బైబిలు, భగవద్గీత లా భావించి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజులలో నవరత్నాల చుట్టూనే దేశ రాజకీయాలు తిరుగుతాయని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్ధి కి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్రంలో ఆదర్శవంతంగా పరిపాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, నిష్పక్షపాతంగా ఇంటి పట్టాల పంపిణీ జరుగుతోందన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి తన అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటు, ఫీజు రీయింబర్స్మెంటు, అమ్మఒడి, విద్యా దీవెన, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, పెన్షన్ లాంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, బీసీల కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి సామాజికంగా, ఆర్థికంగా వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అట్టడుగున ఉన్న వర్గాలను ఆదుకోవాలని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థను, సివిల్ సర్వీసెస్ ను దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకూ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని, రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధికి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2300 ట్రక్కులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారికి అందజేశామని తెలిపారు.
ఇటీవల దారుణ హత్యకు గురైన అనంతపురానికి చెందిన స్నేహలత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఇప్పటికే స్నేహలత కుటుంబ సభ్యులకు ఐదెకరాల పొలం, ఐదు సెంట్ల భూమి, 10 లక్షల డబ్బు, ఒకరికి ఉద్యోగం అందించామని, నిందితులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసమే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యుగంధర్, ఎస్సీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిర్దేశిత ప్రణాళికలతో ప్రగతి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో తహశీల్దారులు, మండల అభివృధ్ధి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బి.టి.రోడ్లు, సి.సి.రోడ్లు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, గ్రామ సచివాలయాల నిర్మాణం తదితర ఇంజనీరింగు పనులపై మండలవారీగా వారాంతపు ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత వారం కన్నా ఈ వారంలో ప్రగతి సాధన బాగున్నదని ప్రశంసించారు. సీతంపేట, కంచిలి, రేగిడి మండలాలలో ఇంజనీరింగ్ పనులు బాగా జరిగాయన్నారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, సిమ్మెంటు కొరత లేదని తెలిపారు. ముఖ్యంగా ఉపాధిహామీ పనులకు మొదటి ప్రాధాన్యత నివ్వాలని తెలిపారు. మండలంలో వారానికి ఒక కిలో మీటరు చొప్పున రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్ల సమన్వయంతో పనులు చేయాలన్నారు. డి.ఇ.ల వారీగా నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. ఇసుక కొరతను అధిగమించడానికి గాను దగ్గరలో వున్న ఇసుక రీచ్ ల నుండి తీసుకోవాలన్నారు సి.సి. రోడ్ల నిర్మాణానికి మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో పనులు చేపట్టాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లను నియమించడం జరిగిందని, వారి సహకారం తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు వేగవంతం కావాలన్నారు. నిర్ధిష్ట ప్రణాళికతో పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, పంచాయితీ రాజ్ ఎస్.ఇ. ఆర్.కె.భాస్కర్,. జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. లక్ష్మీపతి, ఆర్.డబ్ల్యు,ఎస్, పంచాయితీరాజ్ డి.ఇ.లు, ఎ.ఇ.లు తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
వైఎస్సార్ చేయూత లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో వై ఎస్ ఆర్ చేయూ త పధకం పై కన్వెర్జెన్స్ మీటింగ్ జరిగింది. చేయూత లబ్ధిదారులకు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల యూనిట్ లను త్వరిత గతిన అందచేయాలన్నారు. మంచి పశువులను కొనుగోలు చేయాలి అన్నారు. పాల సేకరణకు వందగ్రామాలను గుర్తించాలని తెలిపారు. పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణo రైతు భరోసా కేంద్రాల వద్ద నిర్మిo చాలని, ఒక్కో కేంద్ర నిర్మాణానికి రూ.16లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా లో 650 పాల సీతలీకరణ కేంద్రాలు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాల సేకరణ, ట్రాన్స్ పోర్ట్, తదితర అంశాలపై ప్రణాళికలు రూపొందించి, లక్ష్య సాధన కు కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జె సి లు సుమీత్ కుమార్, ఆర్. శ్రీరాములు నాయుడు, డి ఆర్ డి ఎ పిడి బి. శాంతిశ్రీ, పశు సంవర్ధక శాఖ జె డి ఎ. ఈశ్వర్ రావు, పంచాయతీ రాజ్ ఎస్ ఈ ఆర్. కె. భాస్కర్, ఎల్ డి ఎం హరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులలో నైతిక విలువలు పెంచి మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రెస్ అకాడమీ పనిచేస్తుందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తమ జర్నలిజం అస్వస్థత అయిన సమయంలో అకాడమీ ఛైర్మన్ గా నా శక్తి సరిపోతుందా అనే ప్రశ్న నన్ను వెంటాడుతున్నదని, నిబద్దత , నిష్పక్షపాత, సామాజిక స్పృహ , నైతిక విలువలు కలిగిన జర్నలిస్టులకు సమాజంలో గౌరవం ఎప్పుడూ దక్కుతుందని అన్నారు. జాగ్రత్తలు కలిగి వార్తల సేకరణ వృతి మమకారం , గౌరవం విలువలు పాటించాల్సిన సమయం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమని అన్నారు. తన అనుభవాలు పంచుకుంటూ రాయలసీమ వర్షపాతం లేని ప్రాతం కావడం , నీళ్లులేక వ్యవసాయం సాగక వేరొకరి పంచన చేరి కక్షలు , కార్పణ్యలకు తావువివ్వడం గమనించి , నీళ్లులేకే కధా సమాజం ఇలావుందని ఆలోచన చేసినట్టు చెప్పారు. అప్పటి ఇరిగేషన్ అధికారులతో నికరజలాలు – మిగులు జలాలు ఏంటని తెలుసుకుని పనిచేస్తున్నది ఆంధ్రప్రభ అయినా అందరి మిత్రులతో కలసి సమాజ చైతన్య వార్తలు రాయడంతో ఉద్యమం రూపుదాల్చి నేడు నీటి సౌకర్యం కలిగియున్న చిత్రావతి, గండి కోట చూస్తే సంతృప్తి కలుగుతున్నదని ఆకోణంలో ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించే వార్తలకు ప్రాధాన్యానిస్తే జర్నలిజం మనుగడ సాగిస్తుందని అన్నారు.
జర్నలిజం కోర్సులకు అకాడమీ ప్రోత్సాహం ఇవ్వనున్నదని, ఇప్పటికే అకాడమీ 12 పుస్తకాలను రూపకల్పన చేసిందని, కరోనా మహమ్మారితో నేరుగా 13 జిల్లాల జర్నలిజం క్లాసులు ఇవ్వకపోయినా జూమ్ యాప్ ద్వారా 11 జిల్లాలు పూర్తి చేశామని, విలేకర్ల స్పందన చూస్తే పూర్వ వైభవం జర్నలిజం తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టిలో వుంచమని న్యాయం జరుగుతుందని తెలిపారు. సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ కరోనా సంక్షోభంతో ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు అందాల్సినవాటిపై దృష్టి పెట్టాలని కోరారు. గత 30 సంవత్సరాల్లో ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా అభివృద్ది చెందింది, సాంకేతికత వల్ల జర్నలిస్టులకు వుపాధి అవకాశాలు తగ్గాయని అన్నారు. జర్నలిజంలో వున్నవారు 99 శాతం పేదలని వారికి ప్రభుత్వ పరం గా గౌరవప్రధంగా అండాల్సిన వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. భవిష్యత్తు సోషల్ మీడియాదే , జరంలిస్టులలో ఆందోళన వుంది అందుకు అనుగుణంగా మారాల్సివుందని తెలిపారు. ఎస్.వి.యూనివర్సిటీ లో విలువలుకలిగిన జర్నలిజం కోర్సులు తిరిగి ప్రారంభించాలని విసి ని కోరారు.
ఎస్.వి.యూనివర్సిటీ విసి మాట్లాడుతూ నిర్మాణాత్మక జర్నలిజం ఎల్లప్పుడూ ఒక స్థానం గర్వాన్ని కలిగి ఉంటుంది. సమాజంలో శ్రీ దేవిరెడ్డి శ్రీనాధ్ గారు ఈ రకమైన వారు అని నేను నమ్ముతాను. నైతిక నివేదన మరియు నిర్మాణాత్మక జర్నలిజం ఎల్లప్పుడూ ఒక స్థానం కలిగియుంటుందని అందుకు నిదర్శనమే నేటి సమాజంలో శ్రీ దేవిరెడ్డి శ్రీనాధ్ గారు అన్నారు. వియత్నం గటన జర్నలిజం, ఫోటో జర్నలిజంకు సాక్ష్యాలుగా నేటికీ నిలుస్తున్నాయని వివరించారు.
స్థానిక పాత్రికేయులు ఎస్.వి.యు.రిజిస్ట్రార్ శ్రీధర్ రెడ్డి , రవికుమార్, ఆనందరావు, మురళి, నగేష్ , లక్ష్మీపతి, జగన్నాధం, లోకేష్, సురేంద్రరెడ్డి,రామచంద్రా రెడ్డి, మణికుమార్, నేతాజీ , మహిళా విశ్వవిద్యాలయ జర్నలిజం అద్యపకులు త్రిపుర సుందరి,వాణి, టిటిడి పిఆర్.ఓ. రవి తదితరులు తమ అభిప్రాయాలను తెలుపుతూ ఛైర్మన్ ను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు శ్రీధర్, రచయిత రాజగోపాల్ నిర్వహించిన శ్రీనాధ్ మిత్రా బృందం ఆత్మీయ సమావేశం స్థానిక ఎస్.వి.యూనివర్సిటీ సెనేట్ హాల్ లో నిర్వహించగా సభ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వర రావు, విశిష్ట అతిధిగా ఎస్ వి.యూనివర్సిటీ విసి రాజారెడ్డి పాల్గొన్నారు.