భారత దేశాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించిన ఘనత కాంగ్రెసుకే దక్కుతుంటుందని సంకు వెంకటేశ్వర రావు అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ 136వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండా ఎగురవేసి మహాత్మాగాంధీ,ఇందిరాగాంధీ,చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ముందుండి నడిపించి స్వాతంత్య్రం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఘనత తమ పార్టీదేనన్నారు. దేశంలో, అనేక రాష్టాల్లో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటుచేసి జనరంజకముగా ఎంతో అనుభవజ్ఞులైన నాయకులతో సమర్ధవంతంగా పరిపాలించిన కాంగ్రెస్ సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు. కాంగ్రెస్ పాలనలో చేసిన పారిశ్రామికాభివృద్ధి,వ్యవసాయరంగంలో అభివృద్ధి,సాంకేతిక అభివృద్ధి వల్లే భారత దేశానికీ గుర్తింపు వచ్చిందన్నారు. బీజేపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. అన్నదాతలను కూడా రోడ్డుమీదకీడ్చిన ఘనత బీజేపీ పాలకులదని సంకు దుయ్యబట్టారు. త్వరలోనే రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో,డాక్టర్ సాకే శైలజానాథ్ నేత్రుత్వంలో రాష్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసారు. భోగి రమణ,మూలా వెంకటరావు,సోడాదాసుసుధాకర్,సింకా,గుత్తుల శ్రీనివాసరావు,వజ్జిపర్తి శ్రీనివాసరావు,తుమ్మల త్రినాధరావు,నూనెల పోలరావు,పరదేశి,మండలి శ్రీనివాసరావు,కస్తూరి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్రలో ఈ రోజు పదవులనుభవిస్తున్న అనేకమంది నేతలు ఉత్తరాంధ్ర టైగర్ ద్రోణంరాజు సత్యనారాయణ తయారు చేసినవారేనని వైఎస్సార్సీపీ నేత ,మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ అన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ద్రోణం చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెసు నేతగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకొని ప్రజా హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. ద్రోణం రాజకీయ వారసుడు శ్రీవాస్తవ కు పార్టీలో మంచి గుర్తింపునివ్వాలని, ద్రోణం కుటుంబానికి అన్నివిధాలా సహకరించాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. ప్రతీ ఏటా తన శక్తికొలది ద్రోణం పేరుమీదుగా సేవ కార్యక్రమాలు చేస్తానని ప్రకటించారు. ముఖ్య అతిధిగా హాజరైన శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, రాజకీయాల్లో మచ్చలేని నాయకుడని,ఎంతోమందికి రాజకీయాల్లో ఓనమాలు నేర్పరన్నారు. మాజీ శాసనసభ్యుడు మళ్ల విజయ ప్రసాద్ మాట్లాడుతూ, ఉన్నతవిలువలు కలిగిన రాజకీయ నేత ద్రోణంరాజని కొనియాడారు.మాజీ శాసనసభ్యుడు తిప్పల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ తనకు ద్రోణంరాజు తనకు గురుతుల్యులని ప్రజాసేవలో ఎక్కడ రాజీ పడవద్దని హితబోధ చేసేవారని గుర్తుచేసుకున్నారు.మాజీ శాసన సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతలవరకు అందరి అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయకుడని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో రాజకీయనాయకులను తయారుచేసే యూనివర్సిటీ గా గుర్తింపుపొందారన్నారు.వుడా మాజీ చైర్మన్ రవి మాట్లాడుతూ ఎన్ఠీఆర్ ను ఎదుర్కొని అధిష్టానం ప్రశంసలందుకొన్న ధీరుడన్నారు.బెహెరా భాస్కర రావు మాట్లాడుతూ ద్రోణం మచ్చలేని రాజకీయనాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ అని,అనేకమంది నాయకులు,కార్యకర్తలను తయారుచేసిన దిగ్గజంగా పేరొందారన్నారు.ద్రోణంరాజు శ్రీవాత్సవ మాట్లాడుతూ, రాజకీయాల్లో ఏనాడూ పదవులనాశించకుండా పనిచేసిన మహా మనిషి అని,తాతగారికి,తండ్రికి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా రాజకీయాల్లో రాణించాలన్నదే తన అభిమతమని తెలిపారు.తమ కుటుంబానికి ప్రజల్లో ఉన్న పేరు ప్రఖ్యాతులు తాతగారి వల్లేనన్నారు.అనంతరం ముఖ్య అతిధుల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేసారు.దాదాపు వెయ్యిమందికి అన్న సంతర్పణ చేసి ద్రోణం పై తనకున్న అభిమానాన్ని దాడి సత్యనారాయణ చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగ్గుపల్లి అప్పల రాజు, హేమలత,వైసీపీ నాయకులు రవి రెడ్డి,పీలా వెంకట లక్ష్మి అధిక సంఖ్యలో కార్యకర్తలు,అభిమానులు పాల్గొని ద్రోణంరాజు సత్యనారాయణ చేసిన సేవలను స్మరించుకుని నివాళులర్పించారు.
శ్రీకాకుళంజిల్లాలో స్పందన కార్యక్రమానికి 43 వినతులు వచ్చాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖకు సంబంధించి 17 వినతులు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 3 వినతులు, ఇతర శాఖలకు సంబంధించి 23 వినతులు వచ్చాయని తెలిపారు. కరోనా వైరస్ ఉద్రుతి వలన ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 43 మంది ఫోన్ చేసి తమ ఫిర్యాదులను తెలియజేసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయపు హెచ్ సెక్షన్ నుండి జె.చలమయ్య, స్పందన విభాగం సూపర్ వైజర్ బి.వి.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
మాస్కు ధారణే కరోనా నివారణకు రక్షణ కవచమని మార్కెటింగ్ సహాయ సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. కోవిడ్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో గల రైతు బజార్లు, అంపోలు మార్కెట్ యార్డు తదితర ప్రదేశాల్లో కోవిడ్-19 ప్రవర్తన నియమావళిపై సోమ వారం పలు కార్యక్రమాలను చేపట్టారు. రైతులకు, గోదాములలో పని చేసే కలాసీలు తదితరలకు కోవిడ్ వ్యాప్తి, ఎదురయ్యే సమస్యలు, వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. మాస్కు ధారణ అవసరమని, మాస్కు రక్షణ కవచంలా పనిచేస్తుందని సహాయ సంచాలకులు అన్నారు. ఆరు అడుగుల భౌతిక దూరం, చేతుల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు. సామాజిక క్రమశిక్షణ కలిగి కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు కె.కార్తీక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి బి. రవికిరణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతతో సుస్థిర ప్రగతి సాధ్యపడుతుందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఏయూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఆచార్యులు డాక్టర్ టి.షారోన్ రాజు రచించిన ‘ విమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్’ పుస్తకాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ మహిళలకు విద్య ఎంతో ఆవశ్యకమని, ఈ దిశగా వర్సిటీ పూర్తిస్థాయిలో కృషిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల బధ్రత, సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి మహిళాభ్యుదయానికి బాటలు వేస్తున్నారన్నారు. పుస్తక రచయిత డాక్టర్ షారోన్ రాజును అభినందించారు. ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత మాట్లాడుతూ నేడు మహిళలకు లభిస్తున్న ప్రోత్సాహం, సహకారం, గుర్తింపు అపారమన్నారు. పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, డాక్టర్ క్రిష్ణమంజరి పవార్లు మాట్లాడుతూ అట్టడుగు, అణగారిన వర్గాలు, మహిళల అభ్యున్నతికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించడం శుభపరిణామమన్నారు.
మహిళలకు విద్య ఎంతో ఆవశ్యకమన్నారు. ఉన్నత విద్య అపార అవకాశాలను కల్పిస్తుందనే వాస్తవాన్ని, మహిళా విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ డాక్టర్ షారోన్ రాజు పుస్తక రచన చేయడం శుభపరిణామమన్నారు.పుస్తక రచయిత డాక్టర్ టి.షారోన్ రాజు పుస్తకాన్ని వివరిస్తూ మహిళా విద్య-సాధికారత ప్రాధాన్యతను వివరిస్తూ ప్రముఖంగా భారతీయ విద్యా వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలలో మహిళా విద్యకు అందించిన ప్రాధాన్యత, ప్రోత్సాహం, మహిళల హక్కులు, మహిళల సాధికారత- దృక్కోణాలు, మహిళా విద్య ఫలితాలు-ప్రతికూలతలతోపాటు జాతీయ విద్యా విధానంలో మహిళా విద్య ఆవశ్యకత తదితర అంశాలను పుస్తకంలో వివరించడం జరిగిందన్నారు.కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఆసెట్, ఆఈట్ ప్రవేశాలకు వెబ్ఆప్షన్లకు ఈ నెల 29 నుంచి అవకాశం ఇస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు తెలిపారు. సైన్స్ కోర్సుల వారు ఈ నెల 29, 30వ తేదీలలో, ఆర్టస్ విభాగాల వారు ఈ నెల 31, జనవరి 1వ తేదీలలో, పరీక్ష అవసరం లేని కోర్సులవారు జనవరి 2వ తేదీన, ఆసెట్లో అన్ని కోర్సుల్లో మిగిలిన విద్యార్థులు జనవరి 3వ తేదీన వెబ్ ఆప్షన్లు ఇవ్వవలసి వస్తోంది. ఆఈట్ కోర్సుల్లో ప్రవేశాలకు జనవరి 4,5 తేదీలలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు సీట్లు జనవరి 6న కేటాయిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు జనవరి 7 నుంచి 12 తేదీల వరకు నిర్ణీత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 18, 19 తేదీలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి. జనవరి 20వ తేదీనుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 (పీఎంకేవీవై 3.0)ను పటిష్టంగా అమలుచేసేందుకు కృషిచేస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళిక అమలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నైపుణ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని రంగాలకే పరిమితం కాకుండా.. జిల్లాలోని వనరుల స్థితిగతులను విశ్లేషించి, యువతలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వివిధ విభాగాల సమన్వయంతో ఉమ్మడి వేదిక ఆధారంగా ఇకపై యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీనికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. యువతకు మెరుగైన జీవనోపాధిని కల్పించేందుకు ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ముఖ్యమని పేర్కొన్నారు. రిటైల్, ఆటోమోటివ్ వంటి రంగాలకే పరిమితం కాకుండా ఉపాధి అవకాశాలు లభించే రంగాలకు సంబంధించి కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు శిక్షణ కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు. పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు (ఐటీఐ), ఒకేషనల్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు సుస్థిర ఉపాధికి అవసరమైన అదనపు నైపుణ్యాలను గుర్తించి, శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. జిల్లాలో 38 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ (ఈఎస్సీ), ఆరు యూత్ ట్రయినింగ్ సెంటర్స్ (వైటీసీ) తదితరాల ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా యువతకు ప్లేస్మెంట్స్ లభించేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు.
సమన్వయం ముఖ్యం: జేసీ (సంక్షేమం) జి.రాజకుమారి
మంచి ఉపాధి అవకాశాలు లభించేలా బ్యాచ్ల వారీగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, ఆపై సర్టిఫికెట్లు అందించి.. ప్లేస్మెంట్ లభించేలా చూడటం.. ఈ మొత్తం ప్రక్రియలో వివిధ శాఖల అధికారుల సమన్వయం ముఖ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం), జిల్లా నైపుణ్య కమిటీ నోడల్ అధికారి జి.రాజకుమారి పేర్కొన్నారు. 2021, జనవరి నుంచి మార్చి వరకు వివిధ విభాగాల కార్యాచరణను జేసీ సమావేశం ముందుంచారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధికి అత్యుత్తమ శిక్షణ భాగస్వాములను గుర్తించడం ప్రధానమని, దీనిపై దృష్టిసారించినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామ, పట్టణాల స్థాయిలో పటిష్టమైన వలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉందని, ఈ వ్యవస్థ సహాయంతో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలపై యువతకు అవగాహన కల్పించనున్నట్లు డీఆర్డీఏ పీడీ, జిల్లా నైపుణ్య కమిటీ కన్వీనర్ వై.హరిహరనాథ్ తెలిపారు. సమావేశంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు, వికాస పీడీ కె.లచ్చారావు, ఎల్డీఎం జె.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 29వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రూ. 2 వేలుతో పాటు ఇన్పుట్ సబ్సిడీ సైతం జగన్ ప్రభుత్వం రైతులకు చెల్లించబోతున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. సోమవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్ద వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి స్వయంగా అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని తక్షణ పరిష్కారం సూచించారు. తొలుత పోతేపల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతులు మంత్రిని కలిసి తమ ఇబ్బందిని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పొలాలు నేలపై ఒరిగిపోయాయని పదే పదే వ్యవసాయాధికారిణీకి చెబుతున్నా ఆమె తమ పేర్లను నమోదు చేయడం లేదని, అదేమని అడిగితే పక్క మండలాల్లో కలెక్టర్ , జె సి లు వ్య్వవసాయ క్షేత్రాలు పరిశీలించారని అక్కడ కన్నా ఇక్కడ ఎక్కువ నష్టం జరిగినట్లు ఎలా రాస్తానని తమతో వాదిస్తున్నట్లు మంత్రి ఎదుట రైతులు వాపోయారు.
ఈ విషయమై స్పందించిన మంత్రి వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులతో మాట్లాడి రైతులకు ఏమైనా నష్టం జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వెంటనే రైతుల సమస్యను పరిష్కరించాలని జె డి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఇన్పుట్ సబ్సీడీ ఆధార్ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బుతో పాటు ఇన్పుట్ సబ్సిడీని ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొందని దీంతో డిసెంబరు 29 తేదీన ( రేపు మంగళవారం ) 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ మొత్తాలను వ్యవసాయ శాఖ జమ చేయనున్నట్లు తెలిపారు. స్థానిక 6 వ వార్డుకు ( కొబ్బరితోట) చెందిన సంకుల శిరీషా మంత్రికి తన అభ్యర్ధనను తెలిపింది, తాను ప్రస్తుతం గిలకలదిండిలో వార్డు అడ్మిన్ గా పనిచేస్తున్ననని 26 వ వార్డు లో అడ్మిన్ ఖాళీ ఉందని తనను అక్కడకు బదిలీ చేయాలనీ కోరింది.
హనుమాన్ జంక్షన్ సమీపంలోని వీరవల్లి గ్రామానికి చెందిన కాటూరు కనకదుర్గ మంత్రిని కలిసి తన గోడు వెళ్లబోసుకొంది. తమ ఇంటిపై తనఖా రిజిస్ట్రేషన్ చేశామని తమ అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఇపుడు బ్యాంకు వారు 11 లక్షల రూపాయలను తమను చెల్లించమని వత్తిడి తెస్తున్నారని మీరే మమ్ములను కాపాడాలని వేడుకొంది. స్థానిక సుల్తాన్ నగరానికి చెందిన చిట్టిబొమ్మ సుబ్బరావమ్మ మంత్రికి తన కష్టాన్ని చెప్పుకొంది. తనకు వృద్ధ్యాపు పింఛన్ రావడం లేదని అలాగే అగ్రి గోల్డ్ తాలూకా డబ్బు ఇంకా సెల్లించలేదని తెలిపింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి పేర్కొన్నారు. ఈ నెల 28 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తి నియజకవర్గం ఊరందూరు లో పర్యటన సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం సభా వేదిక వద్ద ఏర్పాట్లను డిప్యూటీ సీఎం రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి మంత్రి పర్యటన సలహాదారు తలశీల రఘురాం, చిత్తూరు ఎంపి ఎన్. రెడ్డెప్ప, శ్రీకాళహస్తి, మదనపల్లె ఎం ఎల్ ఏ లు బియ్యపు మధుసూదన్ రెడ్డి, నవాజ్ బాషా, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త, జేసీ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం, జె సి (సంక్షేమం) రాజశేఖర్, తదితర జిల్లా స్థాయి అధికారలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలకు పట్టాలిచ్చే కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశైలం దేవస్థానంలో చివరకు కీలక పరిణామం చోటు చేసుకుంది. తొమ్మిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆలయ పాలక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం గోశాల పర్యవేక్షకురాలు సాయికుమారిని ఆ పోస్ట్ నుంచి బదిలీ చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా శ్రీశైలం గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ,ఆలయ షాపింగ్ కాంప్లెక్ అన్య మతస్తులచేతుల్లో చిక్కుకుపోయి లక్షల ఆదాయం గండిపడిందని,పరాయి మతస్తుల పెత్తనం పెరిగిందని,కాటేజెర్లముందు కార్ పార్కింగ్ స్థలం లో అక్రమదుకాణాలు వెలిసి తీవ్ర అసౌకర్యం కల్గిస్తున్నారనే ఆరోపణల నేపధ్యంలో ఈ విషయములు అటు రాజకీయపక్షాల్లోనూ,ఇటు మీడియా, సోషల్ మీడియాలో విపరీతమై ప్రచారం జరిగింది. గోవుల విషయంలో తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రజాక్, చక్రపాణి కలిసి శ్రీశైలం దేవస్థానంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై అటు రాజాసింగ్, ఇటు రజాక్, శిల్ప చక్రపాణి మధ్య మాటల యుద్ధం సాగింది. కాగా, ఈ ఆరోపణల పర్వం నేపథ్యంలో గోశాల ఉద్యోగుల బదిలీపై ఇప్పటికైనా కొంత చర్య జరిగినందుకు హిందూత్వ వాదులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా అన్య మతస్తుల కొలువులు,అలాగే హిందు ఆలయాల ఆదాయాన్ని ఇతర మతాలకు చెందిన నిర్మానాలకు మళ్లించటం అరికట్టి హిందు ఆలయాల్లో అన్యమతస్తుల ఉద్యోగాలు,తొలగించాలని హిందూత్వ వాదులు కోరుతున్నారు.
విశాఖపట్నం లాంటి మహానగరంలో పేద మహిళలకు ఒక్క రూపాయికే ఇల్లు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని కైలాసపురం లో గల డి.ఎల్. బి. మైదానంలో నిర్వహించిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ పేదలకు ఇచ్చే జగనన్న కాలనీలలో అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. నగరంలో ఉన్న 2లక్షల 7 వేల కుటుంబాలకు నగరం చుట్టుపక్కల 62 ప్రాంతాలలో కాలనీలను నిర్మించనున్నట్లు చెప్పారు. 3,800 ఎకరాల స్థలం లో రూ. 90 కోట్లతో ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పారు. రూ. లక్ష 80వేల ఖర్చుతో ఇళ్ల నిర్మాణం చేపడతారని తెలిపారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ప్రజలకు ఏమి చెప్పారో అదే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూఉత్తర నియోజక వర్గంలో 27 వేల మందికి పట్టాలు ఇస్తున్నట్లు, 4,120 టిడ్కో ఇళ్లను కూడా మంజూరు చేసినట్లు చెప్పారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని అన్నారు. బొత్స సత్యనారాయణ గారి సహకారంతో త్వరలోనే విశాఖకు గోదావరి జలాలు వస్తాయని నగరం లో 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన నవరత్నాలు లో భాగంగా పేదలందరికీ ఇల్లు పథకాన్ని క్రిస్టమస్ రోజున ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారని చెప్పారు. ఈ కార్యక్రమాలను 12 రోజులు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బడుగు బలహీన, పేద గృహిణుల పేరుమీద ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామని, నగరంలో లబ్ధిదారులకు ఇచ్చే స్థలం రూ.5 నుండి 7 లక్షల ఖరీదు చేస్తోందన్నారు. జిల్లాలో గల లబ్ధిదారుల్లో ఎక్కువమంది విశాఖ నగరం లోనే ఉన్నారని జిల్లాలో 2 లక్షల 93 వేల కుటుంబాలకు పట్టాలు ఇస్తామని, 24,192 టిడ్కో ఇళ్లను అందజేస్తున్నట్లు చెప్పారు.
విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ జి.సృజన మాట్లాడుతూ సాంకేతిక కారణాల మూలంగా ప్రస్తుతం స్థలాన్ని చూపింఛలేక పోతున్నామని, కానీ లబ్ధిదారులకు ఇంటి స్థలాన్ని మంజూరు చేసినట్లుగా ఇంటిపట్టా ఇస్తున్నందున వారు నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మూడు ఆప్షన్ లను ఇచ్చారన్నారు. ఇంటి నిర్మాణానికి మంజూరైన సొమ్ముతో లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకోవడం , నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం అందజేసి నిర్మాణానికి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులకు ఇవ్వడం, ప్రభుత్వమే పూర్తిగా ఇంటిని కట్టి ఇవ్వడం అనే మూడు మార్గాల ద్వారా ఇంటి నిర్మాణం జరుపుకోవచ్చు అని తెలిపారు.
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గుంకలాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే సభకు హాజరయ్యే వారికి తనిఖీల కోసం కోవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. సభా ప్రాంగణంలోకి వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు, శానిటైజేషన్, ముఖానికి మాస్కు ధరించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.జి.నాగభూషణరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణకుమారి లను ఆదేశించారు. ఈ మేరకు ప్రతి ఒక్కరినీ వారికి కేటాయించిన బ్లాకులోకి పంపినపుడే స్కానింగ్ చేసి, శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకొని, మాస్కు ధరించేలా జాగ్రత్తలు పాటించేందుకు వీలుగా తగినన్ని స్కానర్లు, శానిటైజర్లు అన్ని బ్లాకుల్లో సిద్ధంగా వుంచాలని కలెక్టర్ సూచించారు. సభకు హాజరయ్యే వారందరికీ తాము మాస్కులు అందజేస్తున్నామని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. ముఖ్యమంత్రి ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో కలసి జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అప్పగించిన బాధ్యతలు, సి.ఎం.సభకు ఏర్పాట్లు ఏ మేరకు జరిగాయనే అంశంపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా డి.సి.హెచ్.ఎస్. డా.నాగభూషణ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభకు హాజరయ్యే ప్రజానీకం, ప్రముఖులు, ఇతర అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించేందుకు మూడు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వేదిక వద్ద 104, 108 వాహనాలతో పాటు ఒక వైద్య బృందం ఏర్పాటు చేస్తున్నామని, కాన్వాయ్ లో ఒక బృందం, ప్రముఖులు విడిది చేసే జిల్లాపరిషత్ అతిథిగృహంలో ఒక బృందాన్ని అందుబాటులో ఉంచనున్నట్టు వివరించారు. ఎండ ప్రభావంతో వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించేలా అవసరమైన ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, డీహైడ్రేషన్ మందులతో వైద్య బృందాలు ఒక శిబిరం ఏర్పాటు చేసి సిద్ధంగా వుండాలని కలెక్టర్ ఆదేశించారు.
సభకు హాజరయ్యే వారికి బస్సుల ఏర్పాటులో పార్కింగ్ సమస్యలను దృష్టిలో వుంచుకొని కేవలం 200 బస్సులు, మరో వంద వరకు మ్యాక్సీ కాబ్లకు మాత్రమే అవకాశం వుంటుందని ఆ మేరకు బస్సులను అనుమతిస్తామని డి.ఐ.జి. వి.కాళిదాస్ రంగారావు చెప్పారు. ఇందుకు తగ్గట్టే బస్సులను తగ్గిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హెలిపాడ్ నుండి సభా వేదిక వరకు డబుల్ బ్యారికేడింగ్ చేయాలని డి.ఐ.జి. రోడ్లు భవనాల శాఖ అధికారులను కోరారు. బస్సులన్నీ ఒకే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో బయలుదేరేలా జాగ్రత్తలు వహించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ వేదిక ప్రాంగణంలో లబ్దిదారులు బ్లాకులుగా కూర్చొనే ఏర్పాట్లు చేయడం జరిగిందని, లబ్దిదారులకు ఏ బ్లాకులో ప్లాటు కేటాయిస్తే వేదిక వద్ద అదే బ్లాకుకు సంబంధించి తమకు కేటాయించిన సీట్లలో కూర్చొనేలా ఇన్ చార్జి అధికారులంతా ముందురోజే తగిన ప్రాక్టీసు చేయాలన్నారు. ఇన్ చార్జి అధికారులు అన్ని బ్లాకుల వద్ద తగినంత తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నగరం నుండి లబ్దిదారులు గుంకలాం సభావేదిక వద్దకు చేరుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లపై మునిసిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, రవాణాశాఖ ఉప కమిషనర్ శ్రీదేవి, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ అప్పలరాజు తదితరులు వివరించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.జి.సి. కిషోర్ కుమార్ సభా ప్రాంగణం ప్లాన్ను, లే అవుట్ను మ్యాప్ ద్వారా అధికారులకు వివరించారు. ఎస్.ఇ.బి. అదనపు ఎస్.పి. శ్రీదేవి రావు, డి.ఎస్.పి. అనిల్ కుమార్, వై.ఎస్.ఆర్.సి.పి. జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా నేటితో కోవిడ్ లేని జిల్లాగా మారి గ్రీన్ జోన్ లోకి వెళ్లిందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. డిసెంబరు 1వ నుండి 26వ తేదీ వరకు జిల్లాలో 74 వేల 41 పరీక్షలు నిర్వహించగా 310 మందికి కోవిడ్ పోజిటివ్ నిర్థారణ అయిందని, మూడు మరణాలు సంభవించాయని తెలిపారు. గత వారం రోజులుగా పోల్చిచూస్తే 20వ తేదీన 4 కేసులు నమోదు కాగా 21న తేదీన 8, 22,23 తేదీలలో 4, 24వ తేదీన 6 కేసులు 25వ తేదీన 4 కేసులు నమోదు కాగా 26వ తేదీన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. జిల్లాలో క్రమేనా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం సంతోషంగా వుందని అన్నారు. కోవిడ్ రెండవ దశ విస్తరించకుండా వుండేందుకు 50 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని, వివిధ శాఖల ద్వారా అవగాహనా ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతోందని, ఈ కారణంగానే కోవిడ్ కేసుల సంఖ్య క్రమేణా తగ్గుముఖం పట్టిందన్నారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వుండి జిల్లాను గ్రీన్ జోన్ లో కొనసాగించేందుకు సహకరించాలని ఆ ప్రకటనలో కోరారు. జిల్లా గ్రీన్ జోన్ గా మారినందున ఆదివారం పలువులు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు కలెక్టర్ అభినందనలు తెలిపారు.
మానవ మనుగడకు చెట్లె ఆధారమని కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలను నాటి, భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని అందించాలని పిలుపు నిచ్చారు. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గాలన్నా, సకాలంలో వర్షాలు పడాలన్నా కేవలం మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. విజయనగరం పట్టణ పేదలకోసం రూపొందించిన గుంకలాం లేఅవుట్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం కలెక్టర్ ప్రారంభించారు. ఇక్కడి చెరువు చుట్టూ మొక్కలను నాటారు. వాటికి ట్రీ గార్డులు అమర్చి, నీళ్లు పోశారు. నాటిన మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ ఎస్.జానకి రావు, పశు సంవర్ధక శాఖ జెడి డాక్టర్ ఎంవిఏ నర్సింహులు, డుమా పిడి ఏ. నాగేశ్వరరావు, తాసిల్దార్ ప్రభాకర రావు, ఎంపిడివో నాగ వెంకట చైనులు, మున్సిపల్ ఇంజనీర్ డాక్టర్ కె. దిలీప్, మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్.శ్రీనివాసరావు, మున్సిపల్ ప్లాంటేషన్ ఏ. రవి, హరిత విజయనగరం కో-ఆర్డినేటర్ రామ్మోహన్, డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తమ సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ‘అనంత’ లబ్ధిదారులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారులకు కొడిమి లేఔట్లో ఆదివారం ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్లాట్ల వద్ద ‘థ్యాంక్యూ జగనన్న’ అని అక్షరాలుగా నిలబడి ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ సొంతిళ్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడ్డామని, సీఎం జగన్ తమను ఓ ఇంటి వాళ్లుగా చేశారని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, ఇంత మంచి ప్రాంతంలో ఇంటి స్థలాలను అందించినందుకు ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన పట్టాల పంపిణీ సంబరం మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగింది. లేఔట్లోని ప్రతి ప్లాట్ వద్దకు స్వయంగా వెళ్లి పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనంత అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.