ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, పిలిచిన పలికే దేవతగా కొలిచే విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి అంకురార్పణ జరిగింది. సిరిమానోత్సవానికి కీలకమైన చింత చెట్లను జామి మండలం భీమసింగి సమీపంలో బలరాంపురంలో గుర్తించారు. పైడితల్లి అమ్మవారి దేవస్థానం పూజారులు, అధికారులు ఈ సిరిమాను చెట్టుకు సంప్రదాయబద్దంగా బుధవారం పూజలు చేశారు. బలరామపురం గ్రామానికి చెందిన పెంట సన్యాసప్పడు, పెంట తమ్మినాయుడు, పెంట అప్పలనాయుడు, పెంట ఎర్రునాయుడుల కళ్లంలో చింత చెట్లను గుర్తించి, ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో పూజారులు వేద మంత్రోచ్ఛారణలతో పూజా క్రతువును నిర్వహించారు. అమ్మవారు కలలోకి వచ్చి బలరామపురం గ్రామానికి చెందిన పెంట సన్యాసప్పడు కుటుంబానికి చెందిన కళ్ళంలో చెట్లను ఉత్సవానికి సిద్ధం చేయమని ఆజ్ఞాపించినట్లు, సిరిమాను ఉత్సవ పూజారి బంటుపల్లి వెంకటరావు వెల్లడించారు. అమ్మవారి అనుగ్రహం పెంట సన్యాసప్ప డు కుటుంబానికి, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి జి.వి.ఎస్.ఎస్.ఆర్. సుబ్రమణ్యం మాట్లాడుతూ అమ్మవారి ఆజ్ఞ మేరకు సిరిమాను, ఇరుసుమాను చెట్లను గుర్తించామన్నారు. ఈ నెల 12వ తారీఖున ఉదయం 9:15 గంటలకు సంప్రదాయాల ప్రకారం, అటవీ అధికారుల సాయంతో చెట్లను కొట్టించి, హుకుంపేటలోని ఉత్సవ పూజారి ఇంటికి తరలిస్తామని తెలిపారు. ఈ సారి ఉత్సవాలకు 60 అడుగుల సిరిమాను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్నిరకాల ముందు జాగ్రత్తలూ తీసుకొని ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. సిరిమాను చెట్ల దాతలు పెంట సన్యాసప్పడు కుటుంబీకులు మాట్లాడుతూ పైడితల్లమ్మవారి అనుగ్రహం కలగటం తమ అదృష్టమని పేర్కొన్నారు. తమ కళ్లం చెట్లను గుర్తించటం తమతోపాటు, గ్రామంలోని వారికి కూడా ఎంతో ఆనందంగా ఉంది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు డి.రామారావు, కె.రమణ మూర్తి, వేదపండితులు టి.రాజేష్ బాబు, ఎ.సాయికిరణ్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లి గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పర్యటించారు. ఈ సందర్భంగా పరిహారం పంపిణీ, నీటి నిల్వ విషయమై ప్రజలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సీబీఆర్ కింద ముంపునకు గురవుతున్న గ్రామాలకు సంబంధించి పరిహారం అందించామని, అందరికీ డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. బ్యాంకర్లతో మాట్లాడి మొత్తం డబ్బులు ఒకేసారి ఇచ్చేలా, పాత అప్పులకు జమ చేసుకోకుండా మొత్తం నగదు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజుల్లోపు గ్రామంలోకి నీళ్లు వచ్చేస్తాయని, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు 2006 వరకు మేజర్ అయ్యి ఉండి పెళ్లికాని యువతులకు కూడా పరిహారం అందించాలని కోరగా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ వారికి తెలియజేశారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అర్హులైన లబ్ధిదారులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్ డి ఓ మధుసూదన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
అక్కా కలెక్టర్ బాబు మన పొలానికొచ్చారే...లే లే... నమస్కారం కలెక్టర్ బాబూ... నమస్కారం.. ఏ అమ్మా ఎలావున్నారు.. పొలం పనులు బాగా గిట్టు బాటు అవుతు న్నాయా.. ఆయ్యో పొలాల్లో చాలా ఎక్కువగా కష్టపడుతున్నారే...మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందో లేదో.. కనీసం అధికారులైనా మీ దగ్గరకి ఎపుడైనా వస్తున్నారా.. ఈ ఏడాది దిగుబడి ఎలావుంది.. ఈ కుశల ప్రశ్నలన్నీ వేస్తున్నది ఓట్ల కోసం ఐదేళ్ల కోసారి వచ్చే ఏ రాజకీయనాయకుడో అనుకుంటున్నారా..అలా అనుకుంటే పొలం బురదలో కాలు పెట్టినట్టే.. రైతుల కష్టాలు.. పండే పంటలు ఏవిధంగా ఉన్నాయి.. వారి పరిస్థితి ఏంటి అనే విషయాలు స్వయంగా తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడి ఆత్మీయ పలరింపు. ఏవిషయాన్నై గ్రామస్థాయిలో స్వయం తెలుసుకొని మరీ ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంతో అనంతపురం జిల్లా కలెక్టర్ పెట్టింది. పేరు. అలాంటి ఆయన బత్తలపల్లి మండలం, రామాపురం గ్రామంలో వేరుశనగ పంట నష్టాలను స్వయంగా చూసి అంచనా వేశారు. అక్కడ రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. అక్కడ కన్నీటితో రైతులు వాస్తవ పరిస్థిని కలెక్టరుకు వివరించడంతో నష్టాన్ని ఆయనే నమోదు చేసుకున్నారు. నేరుగా కలెక్టరే వచ్చి రైతులు బాగోగులు తెలుసుకోవడానికి రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. కలెక్టర్ తో తమ సమస్యలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పారు. ఎంతో ఆప్యాయతగా పొలానికి వచ్చిన కలెక్టర్ మీతో పాటు కలిసి కాఫీ తాగాలని వుంది అంటూ అడగటంతో అక్కడ వున్న మహిళా రైతుల్లో ఒక్కటే ఆనందం... ఆయ్యో బాబూ మీరు మాతో కాపీ తాగుతారా అంతకంటే ఏం కావాలి అంటూ ఒక్క ఉదుకున వెళ్లి కాఫీ తెచ్చి మరీ ఇచ్చారు. రైతులతో కలిసి కాఫీ తాగి, వారితో అక్కడ గంటపాటు గడిపి వెనుతిరుగుతూ, మీ సమస్యలను తక్షణమే ప్రభుత్వానికి చేరవేస్తాను అంటూ చెప్పడంతో మీ దయబాబు...ఇన్నాళ్లకి మా రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వైఎస్ జగన ప్రభుత్వంలో ఆదేవుడే మా దగ్గరకి పంపాడంటూ ఆ రైతులంతా దండాలు పెట్టారు. ఈ తంతు అంతా గమనిస్తున్న అధికారులు ఒక్క గంటపాటు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. అదే సమయంలో తమ లోపాలు ఎక్కడ రైతులు కలెక్టర్ ముందు ఏకరువు పెడాతారోననే భయం ఒక్కటి. వెరసీ కలెక్టర్ రైతులతో కాఫీ తాగి, సమస్యలు అడిగి తెలుసుకున్న విషయం కళ్లకు కట్టినట్టుగా మీ ముందు ఉంచిదీ ఈఎన్ఎస్ లైవ్ యాప్. ప్రజల కష్టాలను, నష్టాలను, వారి బాధలను తెలుసుకోవాలంటే ఐఏఎస్ అధికారులు ఏసీ రూమల్లో కూర్చోరని, నిజ నిర్ధారణ చేసుకోవడానికి స్వయంగా పొలాలకు సైతం వెళతారని గంధం చంద్రుడు నిరూపించిన వైనం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ అయ్యింది.. ఎంతైనా దిల్ ఉన్న కలెక్టర్ దిల్లున్నోడే..!
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద అర్హులైన నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన పరిహారం చెల్లింపు ప్రక్రియను చేపడుతున్నామని, అందులో భాగంగా బుధవారం 50 కోట్ల రూపాయల వరకు లబ్ధిదారుల ఖాతాలో నగదు అయ్యిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బుధవారం ధర్మవరం తహశీల్దార్ కార్యాలయంలోని ఎపిఎన్జిఓ భవనంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ క్రింద ముంపునకు గురయ్యే గ్రామాలకు సంబంధించి పరిహారం పంపిణీ కోసం అధికారులు చేపట్టిన ప్రక్రియను మరియు అందుకు సంబంధించిన రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సీబీఆర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించడం కోసం రూ. 240.53 కోట్లను మంజూరు చేసిందన్నారు. అందుకు సంబంధించి సోమవారం నుంచి బిల్లులు సబ్మిట్ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా బుధవారం 50 కోట్ల రూపాయల వరకు సీబీఆర్ నిర్వాసితుల ఖాతాలలో నగదు జమ అయ్యిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులకు డబ్బులు అందించి, వారు ముంపునకు గురవుతున్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఈ ఏడాది 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అనంతపురం జిల్లాలో అధిక వర్షాల కారణంగా వేరుశనగ పంట దిగుబడి తగ్గిందని రైతులు తెలుపుతున్న దృష్ట్యా ఈ అంశాన్ని పరిశీలించి, వాస్తవాలను ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. బుధవారం బత్తలపల్లి మండలం ఓబుళాపురం పంచాయితీ పరిధిలోని రామాపురం గ్రామం వద్ద రైతు టి.రామాంజనేయులుకు చెందిన పొలంలో వేరుశనగ పంట కోతను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వేరుశెనగ పంట దిగుబడి విషయమై రైతు, కూలీలతో జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతు మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు అధికంగా రావడంతో వేరుశనగ పంట దిగుబడి తగ్గిందని తెలిపారు. సాధారణంగా ఎకరాకు 10 - 12 బస్తాల వేరుశనగ పంట వచ్చేదని, ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా రావడం వల్ల 5-6 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చే పరిస్థితి ఉందని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేరుశనగ పంట దిగుబడి విషయమై అంచనా వేసి,నష్టం జరిగివుంటే వివరాలను ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో మధుసూదన్, రైతులు కూలీలు పాల్గొన్నారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకి భారతరత్న ప్రకటించాలని డా.ఎన్టీఆర్ కళారాధన పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎల్ఎన్ స్వామి చేసిన డిమాండ్ కి తెలంగాణలోనూ మంచి స్పందన వస్తోందన్నారు. ఈ సందర్భంగా స్వామి బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ అభిమానుల ఐక్యవేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కోటి ఉత్తరాల ఉద్యమం చేపట్టామన్నారు. దానికి దేశవ్యాప్తంగా తెలుగువారందరి నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. కరీం నగర్ లో టిడిపి నాయకులు కె.ఆగయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారని అన్నారు. దాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టడానికి కార్యాచరణ చేపట్టడం శుభపరిణామం అన్నారు. ఎన్టీఆర్ అభిమాని ప్రతీఒక్కరూ ఆయనకు భారత రత్నఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారన్న స్వామి తెలుగువారి అన్నగారు, అభిమాన ఎన్టీఆర్ కళారాధన పీఠం ద్వారా 25 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న విషయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు సంఘాలుగా ఏర్పడి ఎన్టీఆర్ కోసం కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. తెలుగువారు వారు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అందరు కళాకారులు అభిమానించే ఏకైకన నటుడు స్వర్గీయ ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నేటికి భారత రత్న ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి గుర్తు చేస్తూ పోస్టుకార్డు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం కార్యక్రమాలు రూపొందించే విధంగా ఆగయ్య చేస్తున్న క్రుషి అభినందనీయమని ఎస్ఎల్ఎన్ స్వామి చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆట పరికరాలను ఏర్పాటు చేయాలని వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. నాడు–నేడు పనులపై బుధవారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత కార్యనిర్వాహక అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ. పనులు పక్కాగా జరగాలన్నారు. గ్రానైట్, టైల్స్ ను మాత్రమే వినియోగించాలని, గోడలకు పుట్టీలు పెట్టినపుడు ఫ్లోరింగుపై మరకలు ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తరగతి గది నుండి మరుగుదొడ్ల వరకు వెళ్ళే మార్గంలో పార్కింగు టైల్స్ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. తలుపులు, కిటికీలకు నాణ్యమైన గడియలు వినియోగించాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ లేదని ఆయన స్పష్టం చేసారు. జిల్లాలో నాడు నేడు మొదటి దశ పనుల క్రింద 1249 పాఠశాలలకు పనులు మంజూరు కాగా 1215 పాఠశాలల్లో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పనులను చేపట్టుటకు రూ.293.75 కోట్లతో అంచనాలు తయారు చేశామన్న జెసి సమగ్ర శిక్షా అభియాన్ 430 పాఠశాలల్లోనూ, ఏపిఇడబ్ల్యుఐడిసి 284 పాఠశాలల్లోనూ, పంచాయతీ రాజ్ 277 పాఠశాలల్లోనూ, గిరిజన సంక్షేమ శాఖ 221 పాఠశాలల్లోనూ, మునిసిపాలిటీలు 37 పాఠశాలల్లోనూ నాడు నేడు పనులకు పర్యవేక్షణ చేస్తుంది. ఈ పాఠశాలల్లో నాడు నేడు పనుల్లో ప్రభుత్వం నిర్ధేశించిన పనులతో పాటు తాగు నీరు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు,మరుగుదొడ్లకు నిరంతర నీటిసరఫరా, మరమ్మతుల నిర్వహణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్షా అభియాన్ సహాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.వి.రమణ, కార్యనిర్వహక ఇంజనీర్లు కె.భాస్కర రావు, వి.వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ విశాఖనగరంలో పిఎంఏవై పథకం పేర సుమారు 27వేలమంది వద్ద నుంచి రూ.25వేలు డిడిలు 2018లో కట్టించుకూని ఇప్పుడు జివిఎంసి కమీషనర్ డిడిలు కట్టిన ఇళ్ళు అన్నిటిని రద్దు చేశామని చెప్పడాన్ని సీపీఎం పార్టీ ఖండిస్తోందని గంగారామ్ చెప్పారు. విశాఖలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారిన తరువాత పాద లబ్దిదారులను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం బావ్యం కాదన్నారు. డిడిలు చెల్లించిన వారికి వెంటనే ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నగరంలో అర్హులందరికి ఇల్లు ఇస్తామని, పేదలందరికి పక్కాఇల్లు అన్న రాష్టప్రభుత్వం తన రాజకీయ లభ్దికోసం నిర్లక్ష్యంచేస్తోందని ఆరోపించారు. గాజువాక, మల్కాపురం, పెందుర్తి , అగనంపూడి, మదురవాడ, ఆరిలోవ మొదలగు ప్రాంతాలలో నిర్మణం ప్రారంభించి, కొన్ని ఇల్లు పూర్తిచేసినవి ఉండగా, 80శాతం పూర్తిఅయినవి ఎక్కవభాగం ఉన్నాయి. అలాంటి ఇళ్లన్నీ పాత లబ్దిదారులకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తన అనుచరులకు పంపిణి చేసుకోవడం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేయడం పద్దతి కాదన్నారు. ఈ పథకంలో డిడిలు కట్టిన లబ్దిదారులందరు వడ్డిలకు అప్పులు చేసి డిడిలు కట్టారు, రెండున్నర సంవత్సరాల తరువాత ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పడాన్ని తీవ్రంగా నిర్లక్ష్యనికి నిదర్శన మన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని,డబ్బులు కట్టిన వారందరికీ తక్షణమే ఇళ్లను కేటాయించాలని లేదంటే పెద్దఎత్తున లబ్దిదారులతో అందోళన చేస్తామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యార్థులకు ప్రకటించిన విద్యాకానుక పంపిణీని నేడు లాంఛనంగా కృష్ణాజిల్లాలో ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా గురువారం నుంచే విద్యాకానుక పంపిణీ ప్రారంభం కానుంది. ఏడు రకాల వస్తువులతో కూడిన కిట్లను ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ చేర్చారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలనూ తీసుకున్నారు. దీనిలో భాగంగా ప్రతీరోజూ ఉదయం 25 మంది విద్యార్థులకు, మధ్యాహ్నం 25 మందికి మాత్రమే పంపిణీ చేస్తారు. విద్యార్థితోపాటు తల్లితండ్రులు కూడా పాఠశాలలు వెళ్లాల్సి ఉంటుంది. కానుక తీసుకొనే విద్యార్థి తల్లి బయోమెట్రిక్ను లేదా ఐరిస్ను తప్పనిసరిగా నమోదు చేస్తారు. గతంలో విద్యార్థులు యూనిఫారాలు కోసం ఆ విద్యాసంవత్సరమంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వ హయాంలోనైతే ఏకంగా మూడేళ్లపాటు యూనిఫారాల పంపిణీయే జరగలేదు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాకముందే, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు, విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సామగ్రి, పుస్తకాలు వారి చేతికి అందుతుండటం విశేషం. జిల్లాలోని 2,803 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2,09,345 మంది విద్యార్థులకు ఈ కిట్లను అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరిలో 1,01,353 మంది బాలురు, 1,07,992 మంది బాలికలు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి సుమారు రూ.1530 విలువైన కిట్ను అందిస్తున్నారు. దీని ప్రకారం జిల్లాలో రూ.32.03కోట్ల రూపాయల విలువైన విద్యాకానుకలు విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. చీపురుపల్లిలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి చేతులమీదుగా గురువారం విద్యాకానుక పంపిణీ ప్రారంభం అవుతుంది. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అక్కడి ఎంఎల్ఏలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జగనన్న విద్యాకానుక క్రింద ప్రతీ విద్యార్థికి ఒక స్కూలు బ్యాగు, మూడు జతల యూనిఫారాలు, ఒక బెల్టు, బూట్లు, రెండు జతల సాక్సులు, నోటుపుస్తకాలు, పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు. ఏయే తరగతి విద్యార్థులకు ఏవి, ఎన్ని ఇవ్వాలో కూడా ప్రభుత్వం నిర్ధేశించింది. విద్యాకానుకకు సంబంధించి ఏమైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే 9121296051, 9121296052 టోల్ఫ్రీ నెంబరుకు సంప్రదింవచ్చు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బుధవారం గరుడసేవ వైభవంగా నిర్వహించారు. వేకకువ జామున సుప్రభాత సేవలతో సింహాద్రినా ధుడిని మేల్కొలిపి ఆరాధన పూర్తిచేశారు. అనంతరం స్వామివారిని గరుడవాహనంపై ఆశీనులను చేసి సేవ కార్యక్రమాన్ని కన్నులపండువగా జరిపించారు. ఒడిశాకు చెందిన వనమాలిక్ నాయకో దాస్ బృందం, అప్పన్న చందనోత్సవ కమిటీ సభ్యులు గంట్లశ్రీనుబాబు ఈ పూజల్లో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ నుంచి ప్రజలను పూర్తిగా విముక్తి చేయాలని కోరుకున్నట్టు చెప్పారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి నిర్వహించన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆలయ ప్రధాన పురోహితులు కరి సీతారామాచార్యులు, చిన్నపూజలు నిర్వహించారు. ఏఈవో పులి రామారావు పర్యావేక్షణ లో కార్యక్రమం నిర్వహించారు. ఆలయ సిబ్బంది, పలువురు భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని రోడ్డు మార్జిన్ లు, వీధుల్లో చెత్తవేయడాన్ని జీవిఎంసీ నిషేదించిందని కమిషనర్ డా.స్రిజన తెలియజేశారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు, చెత్తలు వేసేవారికి హెచ్చరికలు జారీచేశారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా.. భారీ జరీనామతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా గుర్తు తెలియని వ్యక్తులు భావన నిర్మాణ వ్యర్ధములు కానీ, చెత్తగానీ మీకు తెలిసిన ప్రాంతాల్లో పచేసినా తక్షణమే హెల్ప్ లైన్ నెంబర్ కు, టోల్ ఫ్రీ నెంబర్ కు 1800-42500009 తెలియజేయాలని కోరారు. విశాఖనగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు కమిషనర్ తెలియజేశారు. భవన యజమానులు నిర్మాణ వ్యర్థాల సేకరణ కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 8008182277 మరియు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా విశాఖ నగర పాలక సంస్థ నియమించిన ప్రోఎన్విరో సంస్థకు తెలియచేసి వ్యర్ధాలను తొలగించుకోవాలన్నారు. వారి సేవలు వినియోగించుకొని జివిఎంసికి సహకరించి “స్వచ్ఛ విశాఖ” పరిశుభ్రతకు మీ సంపూర్ణమైన తోడ్పాటును అందించవలసినదిగా కమిషనర్ కోరారు.
సవర రవితేజ స్ఫూర్తితో గిరిజన విద్యార్ధులు మంచి ర్యాంకులు సాధించాలని సమగ్ర గిరిజనాభివృధ్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వై.టి.సి.లో ఐ.ఐ.టి. సూపర్ -60 విజయకేతనం పై పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పి.ఓ. మాట్లాడుతూ గిరిజన విద్యార్ధులకు ఐ.ఐ.టి, నిట్ వంటి కళాశాలలలో ప్రవేశం కల్పించటానికి. జిల్లా కలెక్టర్ జె.నివాస్, గత పి.ఓ సాయికాంత్ వర్మ, ఆగస్టు 3న ఐ.ఐ.టి. సూపర్ 60ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వై.టి.సి.లో వారికి మంచి శిక్షణ నివ్వడం జరుగుతున్నదని తెలిపారు. 55 మందికి కోచింగ్ అందించగా 33 మంది ప్రవేశ పరీక్షకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. జె.ఇ.ఇ. అడ్వాన్స్ డ్ లో ఐ.ఐ.టి. కి అయిదుగురు, జె.ఇ.ఇ. మెయిన్స్ లో నిట్, ఐ.ఐ.టిలలో ప్రవేశానికి 12 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. జె.ఇ.ఇ. ప్రిపరేటరీ ర్యాంకులో మరొక నలుగురు విద్యార్ధులున్నారని, తెలిపారు. సవర రవితేజ, ఐ.ఐ.టి-జెఇఇ లో 832 వర్యాంకు సాధించడం ఒక గర్వకారణమన్నారు. రవితేజ పేరును ఒక తరగతి గదికి నామకరణం చేస్తామని, తద్వారా మిగిలిన విద్యార్ధులకు స్ఫూర్తి కలుగుతుందని తెలిపారు. మొదటి సారిగా 16 మంది విద్యార్ధులకు సీటు రావడం సంతోషదాయకమని గిరిజన విద్యార్ధులకు ఇది గర్వకారణమని అన్నారు. కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది మరిన్ని మంచి ఫలితాలు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. టీచింగ్ స్టాఫ్, , కోర్స్ కో-ఆర్డినేటర్ లు మంచి కృషి చేసారన్నారు.
ఐ.ఐ.టి, సూపర్ 60 ఎ.ఓ. గున్ను రామ్మోహన్ రావు మాట్లాడుతూ, 5 నెలల కాలంలోనే మంచి ఫలితాలు సాధించడం జరిగిందని, నిబధ్ధతతో ఉపాధ్యాయుల బోధన, మంచి పట్టుదల, క్రమ శిక్షణతో విద్యార్ధులు చదువుకోవడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కార్పోరేట్ కాలేజీలు సాధించని మంచి ర్యాంకులు గిరిజన విద్యార్ధులు సాధించడం చాలా సంతోషదాయ కమన్నారు. కరోనా సమయంలో విద్యార్ధులకు పి.ఓ., ల్యాప్ టాప్ లు అందించి, ఆన్ లైన్ ద్వారా శిక్షణ నిచ్చారన్నారు. రికార్డు స్థాయిలో ఫలితాలు రావడం గర్వ కారణమన్నారు. అనంతరం సవర రవితేజ, (ఐఐటి అడ్వాన్స్ ర్యాంక్ 832) మాట్లాడుతూ, తమకు టీచర్లు మంచి బోధన చేసారని, అన్నీ వివరంగా తెలిపేవారని చెప్పాడు. చాలా సంతోషంగా వుందన్నాడు. ఎన్.సునీల్ మాట్లాడుతూ, మంచి వాతావరణంలో బోధన, పెర్సనాలిటీ డెవలెప్ మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ తో మంచి కోచింగ్ అందించారని తెలిపాడు. ఎర్తా సింగ్ మాట్లాడుతూ, మంచి గైడెన్స్ ఇచ్చారని, న్యూ టెక్నిక్స్ తెలిపారని, చాలా సంతోషంగా వుందని తెలిపాడు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరక్టర్ మురళీ బాబు, ఫాకల్టీ సభ్యులు బి.కిరణ్, నళినీకాంత్ , విద్యార్ధులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (గ్రామ /వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎన్ఐసి భవనం నుంచి ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, సమగ్ర శిక్ష, ఆర్ అండ్ బి శాఖ ల పరిధిలో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని మండలాల ఇంజనీరింగ్ అధికారులతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన రైతు భరోసా కేంద్రాల భవనాలు, గ్రామ/ వార్డు సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు, అంగన్ వాడి భవనాల నిర్మాణం, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి పనులు, సిసి డ్రెయిన్లు, సీఎండిఎఫ్, డిఎంఎఫ్ మరియు రహదారుల నిర్మాణాల్లో పురోగతి కనిపించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే మొదలైన అన్ని రకాల అభివృద్ధి పనులను నిర్ణయించిన సమయం లోపు వంద శాతం పూర్తిచేయాలన్నారు. ఇంతవరకు మొదలుకాని పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు సంబంధించి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి వారం ఎంత పని చెయ్యాలో లక్ష్యాలను నిర్ణయించుకుని ఆ మేరకు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసేలా చూడాలన్నారు. ఆయా అభివృద్ధి పనుల్లో సిమెంట్ సమస్యలు ఏవైనా ఎదురైనా ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పని చేసి వాటిని అధిగమించి త్వరితగతిన పనులు పూర్తి పై శ్రద్ధ పెట్టాలని జిల్లాలోని అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులను జేసీ ఆదేశించారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయినందున అధికారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. జిల్లాకు భారీ వర్షాల ప్రభావం కూడా తగ్గిపోయింది కాబట్టి ఇసుక కొరత కూడా ఉండబోదనీ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలకు నిధుల కొరత కూడా లేనందున వీలైనంత తొందరగా పనులు పూర్తిచేయాలని కోరారు.
రాష్ట్రంలో నష్టాలలో ఉన్న 12 సహకార చక్కెర కర్మాగాలను పునరుద్థరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్థి శాఖామాత్యులు, రాష్ట్ర మంత్రి వర్గ సబ్ కమిటి సభ్యులు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జిల్లాలోని తాండవ, ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగారాలను ఉప సంఘం మంగళవారం సందర్శించి అక్కడి రైతులు, కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండవ, ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగారాలను సందర్శించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని, ఇందులో తాండవ ఫ్యాక్టరీకి 9 కోట్ల రూపాయలు, ఏటికొప్పాక ఫ్యాక్టరీకి 7 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించి కర్మాగారాలను పునరుద్థరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు ఆయన వివరించారు. కర్మాగారాలకు పూర్వవైభవం తీసుకురావడానికి కార్మికులు, రైతులు భాగస్వాములవ్వాలన్నారు. ఒక లక్షా పది వేల టన్నులు చెఱకు ఆడే కర్మాగారం 64 వేల టన్నులకు పడిపోవడానికి కారణం గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేయకపోవడమేనని తెలిపారు. రైతులు పంటను తిరిగి యధా స్థితిలో పండించి ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. కర్మాగారం పనిచేయడం వలన అనుబంధ పరిశ్రమలు, వారి కుటుంబాలు లబ్దిపొందుతాయన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, మంత్రి, రాష్ట్ర మంత్రి వర్గ సబ్ కమిటి సభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ఈ కర్మాగాలు మూతపడ్డాయని, సహకార చక్కెర కర్మాగారాలను పరశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, మంత్రి వర్గ సబ్ కమిటి సభ్యులు మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 12 పరిశ్రమలకు అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూర్చి తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. లాభనష్టాలతో ప్రమేయం లేకుండా చెరకు రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 12 చక్కెర కర్మాగారాలను కాపాడుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, రాష్ట్ర మంత్రి వర్గ సబ్ కమిటి సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి మూతపడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభించడానికి చిత్తశుద్థితో ఉన్నారని, ప్రారంభించడమే కాని మూసివేయడం ఉండదన్నారు. రాష్ట్రంలో 12 పరిశ్రమలకు అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూర్చి తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నష్టాలలో ఉన్న కర్మాగారాలపై సబ్ కమిటీ వేశారని చెప్పారు. కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి రైతులు, కార్మికుల నుండి సూచనలు, సలహాలు తీసుకొని ప్రభుత్వానికి నివేధిక రూపంలో సమర్పిస్తామన్నారు. కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా నుండి రెండు కర్మాగారాలను మూసివేయడమైనదని, ఆ ప్రాంతంలో పండించే చెఱకును తాండవ సహకార చక్కెర కర్మాగారం వారు తీసుకొనుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. తుని నియోజకవర్గ శాసన సభ్యులు దాడిశెట్టి రాజా, పత్తిపాడు శాసన సభ్యులు హరిచంద్ పూర్ణ ప్రసాద్, పాయకరావు పేట, అనకాపల్లి, నర్సిపట్నం శాసన సభ్యులు గొల్ల బాబురావు, గుడివాడ అమర్ నాథ్, ఉమా శంకర గణేష్లు మాట్లాడుతూ సహకార చక్కెర కర్మాగారాలు నడిపించి రైతులను ఆదుకోవాలని కోరారు. కర్మాగారం కార్మికులు మాట్లాడుతూ కర్మాగారం ప్రారంభించడానికి తమవంతు సహకార అందిస్తామని, కర్మాగారం తెరిపించాలని కోరారు. కర్మాగారం నిర్వహణ చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చాలని కోరారు. రైతులు మాట్లాడుతూ గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్.ఆర్.ఇ.జి.యస్. పథకానికి చెఱకు పంట సాగు అనుసంధానం చేయాలని కోరారు. ఇథనాల్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని, ఉత్పత్తి అయిన చక్కెరకు మార్కెటింగ్ కల్పించాలన్నారు. చెఱకు పంటకు కోతుల బెడద చాలా ఎక్కువగా ఉన్నదని, వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారాపురెడ్డి మౌర్య, తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు