1 ENS Live Breaking News

మత్స్యకారులు చేప‌ల వేటకు వెళ్లొద్దు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భారీవ‌ర్షాలు త‌గ్గిన‌ప్ప‌టికీ జిల్లా వ్యాప్తంగా గ‌త వారం రోజులుగా కురిసిన వ‌ర్షాల కార‌ణంగా న‌దులు, వాగులు పొంగే అవ‌కాశం వున్నందున మ‌త్స్య‌కారులు గానీ ఇత‌రులు గానీ చేప‌లు ప‌ట్టేందుకు వాగుల్లోకి వెళ్ల‌కుండా అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఆయా గ్రామాల్లోని వాలంటీర్లు అప్ర‌మ‌త్తంగా వుంటూ ఎవ‌రూ న‌దుల్లోకి, వాగుల్లోకి ప్ర‌వేశించ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. భారీవ‌ర్షాల నేప‌థ్యంలో జిల్లాలోని త‌హ‌శీల్దార్‌లు, ప్ర‌త్యేక అధికారులతో జిల్లా క‌లెక్ట‌ర్ సోమ‌వారం ఉద‌యం టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి ప‌రిస్థితిని స‌మీక్షించారు. వ‌ర్షాల కార‌ణంగా పంట పొలాలు ముంపున‌కు గురైతే అటువంటి స‌మాచారాన్ని జిల్లా అధికారుల‌కు వెంట‌నే తెలియ‌జేయాల‌ని ఆదేశించారు. వ‌ర్షాలు త‌గ్గాయ‌ని ఆద‌మ‌ర‌చి వుండొద్ద‌ని, ఆయా మండ‌లాల్లో నిరంత‌రం ప‌రిస్థితిని గ‌మ‌నిస్తూ ఎక్క‌డైనా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రిగితే  వెంట‌నే త‌గిన స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.  పంట న‌ష్టం వివ‌రాల‌పై రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, పంట న‌ష్టం వివ‌రాల‌ను ఆయా గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కుల నుంచి సేక‌రిస్తున్న‌ట్టు తెలిపారు. వాతావ‌ర‌ణం సాధార‌ణ స్థితికి వ‌చ్చేవ‌ర‌కూ మండ‌లాల్లోని క్షేత్ర‌స్థాయి అధికారులంతా అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని సూచించారు.

2022-10-10 16:44:53

త్వరలోనే 3మూడు రాజధానుల బిల్లు..

మూడు రాజధానుల బిల్లు త్వరలోనే ప్రవేశపెడతామని, ఇందులో ఎవరికీ అనుమానం అక్కర్లేదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సర్క్యూట్ హౌస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికేంద్రీకరణకు అన్ని వర్గాల నుంచి మద్దతు పుష్కలంగా లభిస్తోందని, విశాఖ పరిపాలన రాజధాని కావడాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు గొప్ప అవకాశంగా భావిస్తున్నారని అన్నారు. ఎవరైనా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటే వద్దు అనరని, టిడిపి నాయకుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నారని, ఆయన నైజాన్ని ఈ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు అజెండాను అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రజలపై రుద్దడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.

 25 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని ఉత్తరాంధ్రకు మేలు జరిగే కార్యక్రమం ఒకటైన చేశారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన అచ్చెన్నాయుడు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను గౌరవించటం లేదని ఆయన అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలే ఉంటాయని..  వికేంద్రీకరణ, విశాఖ పరిపాలన రాజధాని వద్దంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం ఆత్మహత్యా సదృశ్యమేనని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకం అయితే మీరు మాట్లాడకండి.. చంద్రబాబు నాయుడు బంట్రోతు లుగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నష్టం చేయొద్దని ఆయన అచ్చెన్నాయుడుకు హితవు చెప్పారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే వ్యక్తుల నోర్లు మూయించేoదుకే విశాఖ గర్జనను నిర్వహిస్తున్నామని తెలియజేశారు.పాదయాత్ర పేరుతో చేసిన దండయాత్రలు నిలువరించేందుకే ఈ గర్జన అని  ఆయన చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తున్న పాదయాత్రికులు భయపడే విధంగా గర్జన ఉంటుందని అమర్నాథ్ వివరించారు.

చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కొత్తగా వికేంద్రీకరణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అమర్నాద్ అన్నారు. గర్జనపై ఆయన చేసిన ట్వీట్లు చంద్రబాబు విధానాలకు అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. 'ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి కానీ.. ఇక్కడి ప్రజల కష్టాల గురించి  గానీ మీకు తెలియవు.. గర్జన గురించి మీకేం తెలుసు? మీకు గర్జించడం రాదు..' అని పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గత  ఎన్నికల్లో విశాఖ ప్రజలు మిమ్మల్ని ఓడించినందువల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతోనే మీరు వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా దుయ్యబట్టారు.

 ఎవరి రాజధాని అమరావతి అన్న పుస్తక ఆవిష్కరణ సభలో మీరు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోవాలని అమర్నాథ్ పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం పవన్ కళ్యాణ్ కి నటన నేర్పింది. ఆయన నట జీవితానికి వన్నెతెచ్చిన విశాఖకు వెన్నుపోటు పొడవాలని పవన్ భావించటం బాధాకరమని అన్నారు.  వికేంద్రీకరణ కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని,  ఈ విధానం సరైనది కాదని భావిస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అమర్నాథ్ చెప్పారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించి మూడు రాజధానుల బిల్లు తో ముందుకు వస్తానని అమర్నాథ్ పునరుద్ఘాటించారు.

2022-10-10 16:29:51

జాప్యం లేకుండా అర్జీలను పరిష్కరించాలి

అర్జీల పరిష్కారంలో జాప్యం  లేకుండా త్యరితగతిన పరిష్కరించాలని అధికార్లను జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి ఆదేశించారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ లో సమస్యలు పరిష్కారానికి  వచ్చిన ప్రజల నుంచి  జాయింట్ కలెక్టర్  వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చిన అర్జీలను గడువులోగా  పరిష్కరించే విధంగా జిల్లా, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.స్పందనలో అందిన అర్జీలను రీఓపెన్ కాకుండా స్పష్టతతో పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్పందన పరిష్కారం చేసేటప్పుడు ఫిర్యాదు దారునితో మాట్లాడుతున్న ఫోటో అప్ లోడ్ చేయాలని,సమస్య పరిష్కారం కాకముందు ఉన్న ఫోటో , పరిష్కారం అయిన తర్వాత ఫోటో లు  అప్ లోడ్ చేయని ధరఖాస్తు పరిష్కరించబడినదిగా పరిగణనలోకి తీసుకోవడం జరగదని జాయింట్ కలెక్టరు జె వి మురళి అన్నారు. 

స్పందన కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి దాసి రాజు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కుమారి డి.అఖిల, జిఎస్ డబ్ల్యూఓ కె.సి.హెచ్. అప్పారావు, డి.ఎస్.పి ఎస్.బి.వి. సుభాకర్, డిపిఓ ఎం.నాగలతలు పాల్గొని ప్రజల నుంచి  అర్జీలు స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలలో దివ్యాంగుల సదరన్ సర్టిఫికెట్లు, పింఛన్లు, హౌసింగ్, భూమి తగాదాలు, భూమి రికార్డు ఆన్లైన్, తదితర సమస్యల పై 190  వినతులు అందాయి.  ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

2022-10-10 10:35:10

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు వలన నదులు, చెరువులు, వాగులు, వంకలు పూర్తిస్తాయిలో నిండియున్న  ప్రాంతాలకు ప్రజలు వెళ్లరాదని సంయుక్త కలెక్టర్ ఎం విజయ సునీత జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె ఛాంబరులో జిల్లాలోని వర్షాభావ పరిస్థితులపై బులెటిన్ విడుదల చేసారు. వర్షాభావం వలన ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గ్రామస్థాయి ప్రజలకు వాలంటీర్లతో సహా సిబ్బందితో వరద ప్రభావ పరిస్థితులపై ఎప్పటికపుడు హెచ్చరికలు జారీచేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. పలాస మండలం కేదారిపురంలో ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగిందని, ఇటువంటివి జరకుండా జిల్లా యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసినట్లు ఆమె వివరించారు. 

జిల్లాలోని అన్ని నదులు, చెరువులు, వాగులు, వంకలు అత్యధికంగా ప్రవహిస్తున్న కారణంగా వాటిని దాటడం, దిగడం చేయరాదని, అలాగే స్నానాలకు వెళ్లడం, బట్టలు ఉతకడం వంటివి చేయరాదని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆమె కోరారు. గత రాత్రి జిల్లాలో 948 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదయిందని,  సగటున 31 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు ఆమె వివరించారు. దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైందని, సారవకోట, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని అని స్పష్టం చేశారు. జిల్లాలో అత్యధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేసి సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు ఆమె చెప్పారు. 

కంట్రోల్ రూమ్ ద్వారా పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని, వర్షాలు తగ్గిన వెంటనే దీనిపై దృష్టి సారిస్తామని ఆమె వివరించారు. అధిక వర్షాల వలన వ్యవసాయ పరంగా దెబ్బతిన్న పంటలకు రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేలా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు జెసి స్పష్టం చేశారు. వర్షాలు తగ్గేవరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

2022-10-10 09:23:36

30న విజెఎఫ్ ప్రతిభకు ప్రోత్సాహం

వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈఏడాది కూడా అక్టోబర్‌ 30న ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మీడియా అవార్డుల కమిటీ చైర్మన్‌ ఆర్.నాగరాజు పట్నాయక్‌లు తెలిపారు. సోమవారం విశాఖలోని డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో శ్రీనుబాబు అధ్యక్షతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం కార్యదర్శి దాడి రవికుమార్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. తమ పాలకవర్గం హయంలో జర్నలిస్టుల, కుటుంబ సభ్యులు  వైద్య ఖర్చులు, మృతుల ఖర్చుల కోసం సుమారు రూ.23లక్షలు వెచ్చించినట్టు పేర్కొన్నారు. 

అలాగే దీపావళి నిర్వహణతో పాటు 30న ఏయూ వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ప్రతిభావంతులైన జర్నలిస్టులకు మీడియా అవార్డులు అందజేస్తామన్నారు. కపిలగోపాలరావు, మసూనా మాస్టార్‌  అవార్డులతో పాటు పలు కేటగిరిల్లో ప్రిండ్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, ఫోటో, వీడియో, వెబ్‌ జర్నలిస్టులకు 32 మందికి నగదు, ప్రశంసపత్రాలు, అవార్డులు అందిస్తామని చెప్పారు. జర్నలిస్టుల పిల్లలకు సుమారు 150 మందికి ఉపకార వేతనాలు అందించేందుకు తుది జాబితాను సిద్దం చేశామన్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా గంట్ల శ్రీనుబాబు వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. సీతమ్మధారలోని  నార్ల భవన్‌ మరమ్మత్తులు త్వరలో చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. 

ఇక విజెఎఫ్‌కు సంబంథించి నాలుగు వ్యాజ్యాల్లో అనుకూలంగా తీర్పులు రావడంతో ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించడానికి కార్యవర్గం తీర్మానించిన విషయాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ డా.మల్లికార్జున్‌కు తెలియజేసి సజావుగా ఎన్నికల నిర్వహణకు తగిన సహయం అందించాలని కోరామన్నారు. న్యాయ పరంగా కేసులు పెండింగ్‌లో ఉండటం వల్లే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగిందని..కావున సభ్యులంతా తమకు గతంలో మాదిరిగానే సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో  ఉపాధ్య క్షుడు టి.నానాజీ,  కోశాధికారి పిఎన్‌ మూర్తి,  కార్యవర్గ సభ్యులు పి,వరలక్ష్మీ, ఇరోతి ఈశ్వరరావు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, పి.దివాకర్‌,డి.గిరిబాబు, డేవిడ్‌, గయాజ్‌,శేఖర్‌ మంత్రి, సనపల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. 

2022-10-10 09:18:49

ధాన్యం సేకరణలో వాలంటీర్లే కీలకం..

ధాన్యం సేకరణలో వాలంటీర్లే కీలకపాత్ర పోషించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ధాన్యం సేకరణ పై సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ లో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రొక్యూర్ మెంట్ ద్వారా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ధాన్యం సేకరణ పై గ్రామ వాలంటీర్లే కీలకపాత్ర పోషించాలని తెలిపారు. ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలన్నారు.  అందరికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.  టెక్నికల్ అసిస్టెంట్లు జాబితా ఇప్పటికే సేకరించినట్లు చెప్పారు. కేటగిరీల వారీగ  రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని చెప్పారు. మండల స్థాయిలోను సమావేశాలు నిర్వహించాలన్నా రు.  టెక్నికల్ అసిస్టెంట్లు అర్హత గల వారే ఉండాలన్నారు.  

ధాన్యం సేకరణలో పాల్గొనే వాలంటీర్లకు 1500 రూపాయలు ప్రోత్సాహకం ఉంటుందని వివరించారు. ఈ క్రాప్ లో నమోదు చేసుకున్నవారి వద్ద నుండి మాత్రమే ధాన్యం సేకరణ జరగాలన్నారు.  ఈ క్రాప్ పై రైతుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోలీసులు చెక్ పాయింట్ల ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా బోర్డర్లు నుండి ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చూడాలని చెప్పారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని వెళ్లాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు అన్ని వసతులను ముందుగానే చూసుకోవాలన్నారు. జిల్లా పైన ప్రత్యేక దృష్టి ఉంటుందని, జాగ్రత్తగా చేయాలని తెలిపారు. 

  ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జయంతి, డిఎస్ఓ వెంకటరమణ, జిల్లా కోపరేటివ్ జాయింట్ రిజిస్ట్రార్ ఎస్. సుబ్బారావు, రవాణా శాఖ అధికారి గంగాధర్, మార్కెటింగ్ శాఖ ఎడి కాళేశ్వరరావు, ఫుడ్ కార్పొరేషన్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-30 12:19:33

సంపూర్ణ పోషణ పథకంపై అవగాహన కల్పించండి

సంపూర్ణ పోషకాహార పథకం పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని , ఏక్కడా మాతా శిశు మరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఐ సి డి యస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టరు  పి.ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం భీమవరం పురపాలక సంఘం నుండి ఐ సి డి యస్ ఆధ్వర్యంలో  అంగనవాడి కార్యకర్తలు, కిషోర్ బాలబాలికలు తదితరులు  సంపూర్ణ పోషకాహార పథకాలు, ఇతర పథకాల అవగాహన పై  2 కె రన్ ర్యాలీని జిల్లా కలెక్టరు  పి.ప్రశాంతి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, సుషోషిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుటకు పోషకాహార మాసోత్సవాలు విజయవంతంగా జరిగాయని, ఈరోజు ముగింపు రోజని సుపోషణ గ్రామాలు, వార్డులు దిశగా అడుగులు వేద్దామని ఆమె అన్నారు. జిల్లాలో 1562  అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణీలు, బాలింతలు , శిశువులకు  పౌష్టికాహారం పై అవగాహన కల్పించేందుకు ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించటం జరిగిందని ఆమె అన్నారు. 

ప్రతి  అంగనవాడి కేంద్రాలలో ఖాళీ స్థలంలో న్యూట్రీగార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చెయ్యాలని, అందరికీ పౌష్టికాహారం పై మరింత అవగాహన కలుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి సంపూర్ణ పోషకాహార పథకం ప్రజలలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నామని, భవిషత్ లో కూడా ఈ విధంగా ఫాలో అవ్వాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సి డి పి వోలు, సిబ్బంది ముఖ్యపాత్ర పోషించాలని, అంగన్వాడీ కేంద్రాలలో పండుగ వాతావరణం సృష్టించడం, ఆశా వర్కర్లు వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ యొక్క న్యూట్రిషన్ కిట్ల ను ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ఇవ్వాలని ఆమె అన్నారు. ఇచ్చిన వస్తువులను సరిగ్గా ఉపయోగించేలా సంపూర్ణ పోషకాహారం ఏవిధంగా పొందవచ్చునో వారికి వివరించాలని కలెక్టరు అన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో అందిస్తున్న రాగి, సజ్జ , జొన్న , అటుకులు, ఎండు ఖర్జూరం , బెల్లం వేరుశనగ చిక్కీలు వంటి పౌష్టికాహారంతో పాటు  పాలు, గుడ్లు వినియోగాన్ని వారికి  వివరించాలని ఆమె అన్నారు. 

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఏ ఆహారం తీసుకోవాలి ఇంటింటికి వెళ్ళి వివరించాలని, జిల్లాలో ఎక్కడ పోషకాహారం లోపంతో  గర్భిణీలు, బాలింతలు ,శిశువులు ఏవరూ ఉండకూడదని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు. ఇంటికి వెలుగు పాపాయి - కంటికి వెలుగు బొప్పాయి , ఆహారం పై సమాచారం ఇంటింటికి చేర వేద్దాం, చిరు ధాన్యాల ఆహారంలో భాగస్వామ్యం చేసుకుందాం అనే నినాదాలతో  పురపాలక సంఘం నుండి ప్రకాశం చౌక్ వరకూ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో జిల్లా రెవిన్యూ అధికారి కె. కృష్ణ వేణి, ఐ సి డి యస్ పి డి బి. సుజాతా రాణి, పురపాలక సంఘం కమీషనరు యస్. శివ రామ కృష్ణ, సి డి పి వో లు వి. వాణి విజయ రత్నం, సి హెచ్ ఇందిర,బి. ఊర్మిళ, మేరీ ఎలిజబెత్, పి ఆర్ రత్న కుమారి,శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ. రంగ సాయి, నరహరి శెట్టి. కృష్ణ, తది తరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-09-30 10:16:39

ప్రభుత్వ పథకాల లక్ష్యాలను అధిగమించాలి

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న హౌసింగ్‌, వ్యవసాయ, ఎస్‌హెచ్ జి  బ్యాంక్‌ లింకేజ్‌ ,జగనన్న తోడు తదితర రంగాలకు లక్ష్యం మేరకు రుణాలందించి జిల్లా ఆర్ధిక ప్రగతిలో భాగస్వాములు కావాలని  జిల్లా కలెక్టరు డా. ఎ.మల్లిఖార్జున బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా స్ధాయి బ్యాంకర్ల సమావేశం కలెక్టరు అధ్యక్షతన  జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరు  మాట్లాడుతూ జిల్లాలో  అర్హులైన  వారందరికి ఇళ్లు  మంజూరు గావించడం జరుగుతోందని,  వారికి ఇళ్లు  నిర్మాణాలను పూర్తి గావించడంలో రుణాలను మంజూరు లో బ్యాంకర్లు  సహకరించాలన్నారు.  జిల్లాలో లక్ష ఇళ్లు జి.వి.ఎం.సి పరిధిలో మంజూరు కాబడ్డాయన్నారు. అదే విధంగా ఏపీ టిడ్కో ఇండ్లకు పూర్తి సహకారం అందించాలని కోరారు.  

జగనన్న తోడు వంటి పధకాల క్రింద చిరు వ్యాపారులకు ఆర్ధిక సహకారాన్ని అందించాలని,  ఈ విషయంలో బ్యాంకర్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. అగ్రికల్చర్ మరియు నాబార్డు స్కీంల క్రింద  వ్యవసాయ దారులకు, మత్స్యకారులు  మరియు  పాడి రైతులకు  పథకాల మంజూరులో  ఎదురయ్యే సమస్యలను  బ్యాంకర్లు  అధికారులతో చర్చించి వాటిని  నివృత్తి  చేసుకుని లబ్దిదారులకు  లబ్ది చేకూర్చాలన్నారు.   బ్యాంకింగ్ సేవలకు దూరంగా వున్న గ్రామాలలో  రైతు భరోసా కేంద్రంలో ఏ. టి.ఎం లు ఏర్పాటు చేయాలని ఎల్. డి ఎం కు సూచించారు. గ్రామాలలో రైతుల కోసం రుణ మేళాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.వ్యవసాయ యాంత్రీకరణకు రైతులకు  రుణాలు అందించాలని అన్నారు.

 తదుపరి కలెక్టరు ఎమ్.ఎస్.ఎం.ఇ, ముద్ర లోన్స్, స్టాండ్అప్ ఇండియా, పీ.ఎం స్వనిధి, పీఎంఈజీపీ తదితర కార్యక్రమాల క్రింద రుణాల మంజూరు పై బ్యాంకర్లతో సమీక్ష చేసారు.   ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు కె.ఎస్.విశ్వనాధన్, ఎల్.డి.ఎం  వి.ఎస్. శర్మ,  ఆర్.బి.ఐ, ఎల్.డి.ఓ  పీ.ఎం. పూర్ణిమ, డిఆర్డిఏ పి.డి శోభారాణి , జీ.వి.ఎం.సి యు.సీ.డి పాపి నాయుడు, జెడి పశుసంవర్ధక శాఖ డా.రామకృష్ణ, జెడి మత్స్యశాఖ సుమలత, పలువురు జిల్లా అధికారులు, బ్యాంకర్లు ఈ సమావేశానికి హాజరైయ్యారు. 

Visakhapatnam

2022-09-30 10:05:06

అటవీశాఖలో ఫారెస్టు డివిజన్ పునర్వ్యవస్థీకరణ

శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖలో పునర్వ్యవస్థీకరించబడిందని జిల్లా అటవీ శాఖ అధికారి నిషా కుమార్ ఒక శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గతంలో శ్రీకాకుళం ఫారెస్ట్ డివిజన్ 70,876.02 హెక్టార్ల విస్తీర్ణంలో 5 రేంజ్ లు అంటే శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, పాతపట్నం & కాశీబుగ్గ, 22 ఫారెస్ట్ సెక్షన్లు, 43 ఫారెస్ట్ బీట్లతో ఉండేదన్నారు. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో పాలకొండ, పాతపట్నం ఫారెస్టు రేంజ్ లో కొంత భాగం కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం ఫారెస్ట్ డివిజన్ లో విలీనం చేయబడిందని వివరించారు. నూతనంగా పునర్వ్యవస్థీకరణలో భాగంగా పునర్వ్యవస్థీకరించబడిన శ్రీకాకుళం ఫారెస్ట్ డివిజన్లో 4 రేంజ్ లు ( శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం & కాశీబుగ్గ), 18 ఫారెస్ట్ సెక్షన్లు, 31 ఫారెస్ట్ బీట్లతో 44,574.95 హెక్టార్ల అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

  పునర్వ్యవస్థీకరించబడిన శ్రీకాకుళం ఫారెస్ట్ డివిజన్ యొక్క అధికార పరిధి శ్రీకాకుళం జిల్లా పరిధిని కలిగి యున్నదన్నారు.   శ్రీకాకుళం సోషల్ ఫారెస్ట్రీ డివిజన్, గతంలో 5 సోషల్ ఫారెస్ట్రీ రేంజ్లను,  శ్రీకాకుళం - 1, శ్రీకాకుళం - II, శ్రీకాకుళం - IV, నరసన్నపేట & పాలకొండ కలిగి ఉండేదని, ప్రస్తుతం పాలకొండ సోషల్ ఫారెస్ట్రీ రేంజ్ మినహా శ్రీకాకుళం సోషల్ ఫారెస్ట్రీ డివిజన్ టెరిటోరియల్ డివిజన్ లో విలీనం చేయబడిందని పేర్కొన్నారు.  ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (HoFF), ఆంధ్రప్రదేశ్, గుంటూరు జారీ చేసిన సూచనల ప్రకారం పై అధికార పరిధితో పునర్వ్యవస్థీకరించబడిన / శ్రీకాకుళం ఫారెస్ట్ డివిజన్ 28.09.2022 నుండి పని చేయడం ప్రారంభించినట్లు ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2022-09-30 10:01:17

1.34 కోట్ల పనిదినాల కల్పనే లక్ష్యం

పార్వతీపురం మన్యం జిల్లాలో  2023-24 సంవత్సరానికి కోటి ముప్పైనాలుగు లక్షల పనిదినాలు కల్పించాలని  లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరు సమావేశమందిరంలో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులు, 2023-24 సంవత్సరానికి లక్ష్యాలు, ప్రణాళికపై  డుమా అధికారులతో సమావేశంనిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఈ సంవత్సరానికి ఇప్పటివరకు డబ్బది అయిదు లక్షల పనిదినాలు కల్పించారని, రానున్న నెలలలో మరొక డబ్బది అయిదు లక్షల పనిదినాలు కల్పించాలని తెలిపారు. 2023-24 సంవత్సరానికి కోటి ముప్పైనాలుగు లక్షల పనిదినాలు కల్పించాలని  లక్ష్యంగా నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. కనీస వేతనం రెండువందలనలబై రూపాయలు ఉండేటట్లు చూడాలన్నారు. 

కుల, వర్గాలకతీతంగా అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని తెలిపారు.  లక్షాలను పూర్తిచేయుటకు ప్రతినెలలో చేపట్టవలసిన పనులను ముందస్తు ప్రణాళిక తయారుచేసుకోవాలన్నారు.  పనులకు సంబంధించిన ఫైలు మెయింటైన్ చెయ్యాలని, ఆడిట్ సమయంలో సమర్పించాలని తెలిపారు. ఫైల్ వర్కు ఏరోజుపని ఆరోజు పూర్తిచేయాలని, తద్వారా ఉన్నతాధికారులు అడిగినప్పుడు అవకతవకలకు వీలులేకుండా  సరైన వివరాలు అందజేయగలరని తెలిపారు. పనులలో ఎటువంటి అవినీతి జరుగకూడదని, ఆడిట్ సమయంలో ఫైల్ తయారు చేసేవిధానం మానుకోవాలన్నారు. ప్రజాభిప్రాయం మేరకు పనులు చేపట్టాలని,  వ్యక్తిగతంగా లబ్దిచేకూర్చి యితరులకు యిబ్బందిపెట్టె పనులు చేయకూడదని తెలిపారు.   మండల అభివృద్ది అధికారులు ప్రతిపంచాయతీలోను చేపట్టేపనులను వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. 

జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు మాట్లాడుతూ  నైపుణ్యంలేని కూలీలకు కనీసం వందరోజులు పనిదినాలు కల్పించి వారి కుటుంబాలను ఆర్దికంగా ఆదుకొనుటకు ప్రభుతం ప్రవేశపెట్టిన ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పధకం ప్రవేశ పెట్టడం జరిగిందని, గ్రామాలలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, పనిదినాలు లక్షం పూర్తిచేయాలన్నారు.  ప్రతినెలకు ముందుగానే చేపట్టవలసిన పనులు గుర్తించి ప్రణాళిక రూపొందించుకొనుట ద్వారా లక్ష్యం సాధించుటలో విజయం సాధించవచ్చునని తెలిపారు.ఈ సమావేశంలో మండల అభివృద్ది అధికారులు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-30 09:42:15

స‌రోగసీ సృష్టికి విరుద్దం.. అమ్మ‌త‌నానికి అగౌవ‌రం

అభివృద్ధి అనే పేరుతో వ‌చ్చిన స‌రోగ‌సీ విధానం సృష్టికి విరుద్ద‌మ‌ని, అమ్మ‌త‌నానికి అగౌవ‌ర‌మ‌ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేస‌లి అప్పారావు వ్యాఖ్యానించారు. మ‌న స‌మాజంలో మహిళ‌ల‌కు ఎంతో ఓర్పు, స‌హ‌నం ఉంటాయ‌ని అలాంటి మ‌హిళ‌ల‌ను, అమ్మ‌త‌నాన్ని అగౌర‌వ ప‌రిచే విధంగా కొంత‌మంది వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విచారం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల కొన్ని ప్ర‌యివేటు ఆసుప‌త్రుల సంద‌ర్శ‌న‌లో స‌రోగ‌సీ విధానం ద్వారా చేస్తున్న ప్ర‌క్రియ త‌న‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని గుర్తు చేశారు. పూర్తిస్థాయి ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌తో సాగాల్సిన ఆ ప్ర‌క్రియ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా సాగుతోంద‌ని, దారిత‌ప్పుతోంద‌ని విచారం వ్య‌క్తం చేశారు. ఉద్యోగ‌, వ్యాపార‌, ఇత‌ర కార్య‌క‌లాపాల్లో బిజీ అయిపోయిన కొంత‌మంది ఈ విధానానికి మొగ్గు చూపుతున్నార‌ని, అది స‌రైన నిర్ణ‌యం కాద‌ని ఆయ‌న‌ అభిప్రాయ‌ప‌డ్డారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో కలెక్ట‌రేట్ ఆడిటోరియంలో శుక్ర‌వారం జ‌రిగిన‌ పోష‌ణ్ అభియాన్ మాసోత్స‌వాల ముగింపు స‌ద‌స్సులో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

ఆరోగ్యక‌ర‌మైన సమాజాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వహిస్తోంద‌ని గ‌ర్భిణుల, చిన్నారుల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌శంస‌ణీమ‌యైన చ‌ర్యలు తీసుకుంటోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంబంధిత ప‌థ‌కాల‌ను ల‌బ్ధిదారులకు అందేలా అంగ‌న్‌వాడీ సిబ్బంది శ్ర‌ద్ధాశ‌క్తులు వ‌హించాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు. గ‌ర్భిణుల‌కు అన్ని ద‌శ‌ల్లో అండ‌గా ఉంటూ వారికి త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించాల‌ని హిత‌వు ప‌లికారు. వారికి స‌మ‌తుల్య ఆహారం అందించాల‌ని, ఆరోగ్యాన్ని కాపాడాల‌ని చెప్పారు. అలాగే ఆడ‌పిల్లలు అంటే చిన్న చూపు పోవాల‌ని వారికి త‌గిన గౌర‌వం, ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు. అంగ‌న్‌వాడీల ద్వారా అందుతున్న సేవ‌లు ప్రశంస‌ణీయమైన పాత్ర పోషిస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న కితాబిచ్చారు.

అనంత‌రం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌దిమంది గ‌ర్భిణుల‌కు సీమంతాలు, ఐదుగురు చిన్నారుల‌కు అన్న‌ప్రాశ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. సంప్ర‌దాయాల‌ను అనుస‌రించి గ‌ర్భిణుల‌కు చీర‌, గాజులు, ఇత‌ర సామ‌గ్రి అంద‌జేశారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ముఖులంద‌రూ చిన్నారుల‌ను ఆశీర్వ‌దించారు. కార్య‌క్ర‌మంలో ఐసీడీఎస్ పీడీ బి. శాంత‌కుమారి, మహిళా- శిశు సంక్షేమ సంఘం ప్రాంతీయ చైర్ ప‌ర్శ‌న్ మాధురి వ‌ర్మ‌, సీడ‌బ్ల్యూసీ ఛైర్ ప‌ర్శ‌న్ బిందు మాధ‌వి, స్టాండింగ్ క‌మిటీ ఛైర్ ప‌ర్శ‌న్, బొబ్బిలి జ‌డ్పీటీసీ శాంత‌కుమారి, ఎన్‌.ఆర్‌.సి. కేంద్ర కో-ఆర్డినేట‌ర్ డా. స్వ‌ర్ణ‌ల‌త‌, ఐసీడీఎస్ ఈవోలు, సీడీపీవోలు, కార్య‌క‌ర్తలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-09-30 08:09:09

రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు

పార్వతీపురంజిల్లాలో రోడ్డు  ప్రమాదాలు జరుగుచున్న ప్రదేశాలలో నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టర్  కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్యక్షతన  జిల్లా  రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ప్రమాద ప్రదేశాలుగా  గుర్తించిన ఆరు ప్రదేశాలలో వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.  బ్లాక్ స్పాట్ లుగా గుర్తించిన ఇరవై ఏడు ప్రదేశాలలో కుడా ప్రమాదాలు నివారణకు తెసుకోవలసిన చర్యల గూర్చి ప్రతిపాదనలు సిద్దం చేయాలని రోడ్డు,భవనాలు శాఖ అధికారులను ఆదేశించారు.  జాతీయ రహదారులలో  రోడ్డు సేప్టీపనులను వెంటనే ప్రారంభించాలని జాతీయ రహదారుల అధికారులకు అదేశించారు.   

అనుమతి లేని బ్యాన్లర్లు తొలగించాలని, అటువంటివాటిపై అపరాదరుసుం విధించాలని, అనుమతిలేని బ్యానర్లు, హోర్డింగులను గుర్తించి చర్యలు తీసుకొనుటకు ప్రత్యేక స్క్వాడ్ ను నియమించాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. హోటల్లు, డాబాల వద్ద పార్కింగు ఏర్పాట్లుచేయాలని, నిబంధనలు పాటించని వాటిని గుర్తించి  చర్యలు తీసుకోవలసినదిగా  తహశీల్దార్లకు ఆదేశాలు జారీచేయాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని తెలిపారు. రవాణా వాహనాలలో మనుషుల ప్రయాణం నిషేదమని, ట్రాక్టర్లు, గూడ్సు వాహనాలలో మనుషుల రవాణాపై చర్యలు తీసుకోవాలన్నారు.   ఆర్.టి.సి. డ్రైవర్లు కొంతమంది నిర్లక్షంగా, దురుసుగా డ్రైవింగు చేయడం గుర్తించడమైనదని అటువంటి వారిని గుర్తించి చర్యలుతీసుకొనుటకు ప్రత్యేకంగా ప్రతిరూటులో పర్యవేక్షకులను నియమించాలని తెలిపారు. ప్రతి 108 వాహనంనకు జి.పి.ఎస్. వ్యవస్థ ఉండాలని తెలిపారు. 

 జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి ఎం . శశికుమార్ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, ప్రణాళిక గూర్చి వివరించారు. జిల్లాలో  రోడ్డుప్రమాదాలు జరుగుచున్న ఆరు అత్యంత ప్రమాద, ఇరవైఏడు బ్లాక స్టాట్లను గుర్తించడం జరిగిందని తెలిపారు.  అక్కడ ప్రమాదాలు జరుగుచున్న కారణాలను గుర్తించటకు , నివారణ చర్యలు చేటట్టుటకు  వివిధశాఖల అధికారులతో కమిటీ వేసి తీసుకోవలసిన చర్యలపై నివేదిక తయారుచేసినట్లు తెలిపారు.  జంగిల్ క్లియరెన్స్ చేయాలని, రోడ్డు సిగ్నల్స్ కన్పించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై కాలేజీలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై గీతలు వేయించాలన్నారు.  ట్రిబుల్ రైడింగు, డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగు చేస్తున్న వారికి కౌన్సిలింగు నిర్వహించి, అపరాద రుసుము విదిస్తున్నట్లు తెలిపారు. పరిమిత వేగం  మించి వెళ్లుటవలన ఎక్కువ ప్రమాదాలు జరుగుచున్నాయని స్పీడ్ గన్లద్వారా అటువంటివారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. 

అడిషనల్ ఎస్.పి. ఒ. దిలీప్ కుమార్ మాట్లాడుతూ  రాష్ర్టంలో అత్యంత ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో  ఈ జిల్లాలో ఆరు ఉన్నట్లు తెలిపారు. అక్కడ వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్లాక్ స్పాట్ గా గుర్తించిన ప్రదేశాల వద్ద సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయుటద్వారా ప్రమాదం చేసిన వాహనం గుర్తించి చర్యలు తీసుకొనుటకు వీలవుతుందని తెలిపారు. రోడ్డుప్రక్కన పశువులను కట్టకుండా నివారించాలన్నారు. అటువంటి పశువులను తరలించుటకు, సంరక్షించుటకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పాలకొండ డి.ఎస్.పి . ఎం .శ్రావణి  ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్, వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లారీ యూనియన్ నాయకుడు  ఎం .వి.రమణ మాట్లాడుతూ రోడ్లు నిర్వహణ చేపట్టాలని, రోడ్లుపై గుంతలు వలన వాహనములు పాడవుతున్నాయని, నిర్వహణ భారం పెరుగుతుందని కోరగా రోడ్లుభవనాల శాఖ అధికారులను వెంటనే రోడ్డుమరమ్మత్తుపనులు చేపట్టివలసినదిగా ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి ఆనంద్, పోలీసు,  రవాణాశాఖ, రోడ్లు, భవనాలు, మున్సిపల్ శాఖ, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-30 08:03:56

ప్రాధాన్యత పనులు సత్వరమే ప్రారంభించండి

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా గుర్తించిన అత్యంత ప్రాధాన్యత పనులకు  అక్టోబర్ 5 లోగా మంజూరు ఉత్తర్వులు జారీ చేసి, అక్టోబర్ చివరికి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయడం లో స్థిరమైన వృద్ధి సాధించాలన్నారు. గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గడప గడపకు మన ప్రభుత్వం లో ఇచ్చిన పనుల మంజూరు ఉత్తర్వులు, ఈ క్రాప్ నమోదు, ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు జీ ఎస్, అర్భికే, హెల్త్ క్లినిక్స్, మిల్క్ యూనిట్స్ , డిజిటల్ లైబ్రరీ భవనాల  నిర్మాణం, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జగనన్న ఇండ్లు, టిడ్కో గృహాలు, జగనన్న భూ హక్కు - భూ రక్షా సర్వే, స్పందన, జాతీయ రహదారుల భూసేకరణ అంశాలపై సిఎం సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్భంగా సీ యం సమీక్షిస్తూ  అత్యంత ప్రతిష్టత్మకంగా  చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గ్రామ వార్డ్ సచివాలయాల పరిధి లో ప్రజా ప్రతినిధులు, అధికారులు  ఇంటింటి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడం తో పాటు ఆయా గ్రామాలకు సంబందించిన అవసరమయిన పెండింగ్ మరియు  నూతన పనులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి కృషి  తోడ్పాటును అందించాలని  ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనం నిర్మానాలు, ఈ - క్రాఫ్ వంటి విషయంలో జిల్లాలో కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, మండల స్థాయి అధికారులు  క్షేత్ర స్థాయిలో  పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో భీమవరం కలెక్టర్ కార్యాలయం  నుండి  జిల్లా కలెక్టర్  పి.  ప్రశాంతి , ఎస్ పి యు. రవిప్రకాష్ , జాయింట్ కలెక్టర్  జె వి మురళి, డి ఆర్ ఓ కె. కృష్ణ వేణి,  పంచాయతీరాజ్ ఎస్ ఈ . శ్రీనివాసరావు, సీపీవో  కె  .శ్రీనివాస్ , జిల్లా హోసింగ్ అధికారి   రామరాజు ,  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  జ.వెంకటేశ్వరరావు ,  డ్వామా పి డి, రాజేశ్వరరావు , డి ఎల్ డి వో లు  కె .సి హెచ్ అప్పారావు  తదితరులు  పాల్గొన్నారు.

Bhimavaram

2022-09-29 13:18:50

నవరత్నాల పథకాలు పూర్తిచేయాలి

నవరత్నాలు పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందించేందుకు జిల్లా కలెక్టర్లు  క్రుషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి సూచించారు. గురువారం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  గడప గడపకు మన ప్రభుత్వం లో ఇచ్చిన పనుల మంజూరు ఉత్తర్వులు, ఈ-క్రాప్ నమోదు, ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, మిల్క్ యూనిట్స్ , డిజిటల్ లైబ్రరీ భవనాల  నిర్మాణం, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జగనన్న ఇండ్లు, టిడ్కో గృహాలు, జగనన్న భూ హక్కు - భూ రక్షా సర్వే, స్పందన, జాతీయ రహదారుల భూసేకరణ అంశాలపై సిఎం సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా  చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గ్రామ వార్డు సచివాలయాల పరిధి లో ప్రజా ప్రతినిధులు, అధికారులు  ఇంటింటి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడం తో పాటు ఆయా గ్రామాలకు సంబందించిన అవసరమయిన  పనులు మంజూరు చేసి  అభివృద్ధికి   తోడ్పాటు అందించాలన్నారు.  ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మానాలు, ఈ-క్రాఫ్ వంటి విషయాలలో  కలెక్టర్లు,  జిల్లా మండల వ్యవసాయ అధికారులు  క్షేత్ర స్థాయిలో  పర్యవేక్షణ చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అనకాపల్లి నుండి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి జిల్లా ఎస్పీ గౌతమి శాలి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు. 

Anakapalle

2022-09-29 13:06:30

ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణతో పెండింగ్ ప‌నులు పూర్తి

విజ‌య‌న‌గ‌రంజిల్లాలో వివిధ ప‌థ‌కాలు, ప్రాజెక్టుల‌కు సంబంధించిన పెండింగ్ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన‌ పూర్తి చేసేందుకు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించామ‌ని, ప్ర‌ణాళికాయుతంగా ముందుకెళ్లి నిర్ణీత కాలంలో ల‌క్ష్యాల‌ను చేరుకుంటామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లీనిక్‌, వెఎస్సార్ అర్బ‌న పీహెచ్‌సీల నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపు పూర్త‌య్యాయ‌ని మిగిలిన ప‌నుల‌ను త్వ‌రిగ‌తిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ సేవ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. డిజిట‌ల్ లైబ్ర‌రీల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి వీలైనంత త్వ‌ర‌గా అందుబాటులోకి తీసుకొస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రితో గురువారం జ‌రిగిన వీసీలో పాల్గొన్న ఆమె జిల్లాలో చేప‌ట్టిన సంక్షేమ‌, అభివృద్ధి ప‌నుల గురించి వివ‌రించారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువాంర తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. గడప గడపకు మ‌న‌ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన ప‌నులు, మంజూరైన ప‌నులు, ఈ-క్రాపింగ్‌, ఉపాధి హామీ ప‌నులు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, యూపీహెచ్‌సీలు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలు త‌దిత‌ర ప‌నులపై, ప‌థ‌కాల‌పై ఆయ‌న స‌మీక్షించారు.  భ‌విష్య‌త్తులో చేరుకోవాల్సిన ల‌క్ష్యాల‌ను నిర్దేశించారు. జ‌గ‌న‌న్న పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంలో భాగంగా ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాల‌ని, అర్హులంద‌రికీ ప‌ట్టాలు పంపిణీ చేయాలని, రీ స‌ర్వే ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు, వైఎస్సార్ హెల్త్ క్లీనిక్‌లు, యూపీహెచ్‌సీల ప‌నుల్లో మ‌రింత పురోగ‌తి సాధించాల‌ని, డిజిట‌ల్ లైబ్ర‌రీల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ఉత్త‌మ ఫ‌లితాలు సాధించాల‌ని ముఖ్య‌మంత్రి జిల్లా క‌లెక్ట‌ర్‌కు సూచించారు.

వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారితో పాటు, ఎస్పీ దీపికా ఎం. పాటిల్‌, జేసీ మ‌యూర్ అశోక్‌, కె.ఆర్‌.ఆర్.సి. ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్ సూర్య‌నారాయ‌ణ‌, సీపీవో బాలాజీ, జ‌డ్పీ సీఈవో అశోక్ కుమార్‌, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి తార‌క రామారావు, పంచాయ‌తీ రాజ్ ఎస్‌.ఈ. ఆర్‌.ఎస్‌. గుప్తా, డ్వామా పీడీ ఉమా ప‌ర‌మేశ్వ‌రి, హౌసింగ్ పీడీ ర‌మ‌ణ‌మూర్తి, స‌ర్వే విభాగం స‌హాయ సంచాల‌కులు త్రివిక్ర‌మ‌రావు, టిడ్కో ఈఈ జ్యోతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-09-29 12:49:26