1 ENS Live Breaking News

కు.ని. శస్త్ర చికిత్సల సంఖ్య పెరగాలి

చిన్న కుటుంబం చింతలులేని కుటుంబమని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తు న్నాయని, ఆ దిశగా వైద్యులు,సిబ్బంది కృషిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.మీనాక్షి పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ అనంతరం స్థానిక వైద్య ఆరోగ్య శాఖధికారి కార్యాలయంలో వైద్యులు, సిబ్బందితో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు అనుకున్నంత స్థాయిలో జరగడం లేదన్నారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మినహా మిగిలిన చోట్ల జరగడం లేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు ప్రోత్సహించడంలో ఉత్తమ సేవలు అందించిన వారికి నగదు పారితోషికం ఉంటుందని, అలాగే జిల్లాకు మంచి పేరు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై వైద్యులు, సిబ్బంది తమ పరిధిలో కుటుంబ నియంత్రణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేసక్టమీ,ట్యూబెక్టమీలపై దృష్టిని సారించాలని, వేసక్టమీ ఆపరేషన్ చాలా సులభతరమని వివరించాలన్నారు. జిల్లాలోఅంతర ఇంజక్షన్లు అనుకున్నంతగా చేపట్టకపోవడం వలన నగదు పారితోషికం కోల్పోయామని, వచ్చే ఏడాదిలో తప్పక ఆ బహుమానం పొందేలా చర్యలు తీసుకోవాలని, పిపిఐవిసిడిలను కూడా పెంచాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

అనంతరం  కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో ఉత్తమ సేవలు అందించిన టెక్కలి పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు డా.జయలక్ష్మి, దూసి పి.హెచ్.సి వైద్యులు డా.పి.రేఖలకు ఒక్కొక్కరికి రూ.10వేలు వంతున,నరసన్నపేట, సారవకోట పి.హెచ్.సి సిబ్బంది అగర్త తేజ మరియు బి.భారతిలకు రూ.5వేలు వంతున ప్రోత్సాహక బహుమతితో పాటు సర్టిఫికేట్లను బహూకరించారు. అలాగే శస్త్ర చికిత్సల విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన డిఎహెచ్ఓ కార్యాలయ డెప్యూటీ ఎస్.ఓ డి.శ్రీనివాస పట్నాయక్, పొన్నాడ,చాపర పి.హెచ్.సి వైద్యులు డా.ఎన్. శేషగిరి,డా.జి.గణపతి, జెమ్స్ మెడికల్ ఆఫీసర్ డా.పి.తార తదితరులకు జ్ఞాపికతో పాటు సర్టిఫికేట్లను బహూకరించారు. అదేవిధంగా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలైన బొద్దాన దుర్గ, ఉరిటి సాయితేజ, బి.ఉన్నీషా, డి.ధనలక్ష్మి, ఇ.ఉషారాణి, సిహెచ్.నందిని, పి.రమ్య, లేఖ రాణి తదితరులకు ధ్రువీకరణ పత్రాలు,జ్ఞాపికలను బహూకరించారు.తొలుత ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీలో జె.సితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకట రమణ, డా.కె.కృష్ణమోహన్, డా.కె.అప్పారావు,డా.ఎన్. శేషగిరి, డా.జి.గణపతి,డా.పి.తార,మంత్రి వెంకటస్వామి, సోమేశ్వర రావు, కె.ఎల్.నారాయణరావు, సూర్యకళ, ఏ.ఎన్.ఎంలు, ఆశావర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-11 08:34:59

NPPA తగ్గించిన ధరలను అమలుచేయాలి

కేంద్ర ప్రభుత్వం అత్యవసర మందుల ధరలను తగ్గిస్తూ జారీ చేసిన ఆదేశాలు (జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్ధ-ఎన్‌పీపీఏ ఎఫ్‌.నెం. 8(99)/2022/డి.పి./ఎన్‌పిపిఏ`డిఐవి`11 తేది : 30`6`2022)ను రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వానికి కన్సూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి పంపిన వినతిపత్రాన్ని శుక్రవారం అనకాపల్లిలో ఆయన ప్రసార మాధ్యమాలకు విడుదల చేశారు. రాష్ట్రంలోని అత్యధిక మందుల షాపులు యాజమాన్యాలు సవరించిన ధరలకు మందులు అమ్మడం లేదని, ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అధికారులు నిఘా ఉంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తగ్గించిన మందుల ధరల జాబితాలో రక్తపోటు, మధుమేహం, జీర్ణాశయ సమస్యలు, కొలెస్ట్రాల్‌, గుండెపోటు, పక్షవాతం, నొప్పి నివారణల మొదలగు 84 రకాల అత్యవసర ఔషధాలున్నాయన్నారు. దీనివల్ల వినియోగదారులపై 30 నుంచి 40 శాతం మేర ఆర్ధిక భారం తగ్గనుందన్నారు. ఎక్కువగా సమ్మిళిత ఔషధాల (కాంబినేషన్‌ డ్రగ్స్‌) ధరలు అదుపులోకి వస్తాయన్నారు. ‘ఇంటిగ్రేటెడ్‌ ఫార్మాస్యూటికల్‌ డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐపీడీఎంఎస్‌)’ ద్వారా మందుల ధరల జాబితాను ఔషధ తయారీదారులు ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రతి రిటైలర్‌, డీలర్‌ ఔషధ ధరలు, అనుబంధ ధరల పట్టికలను వ్యాపార ప్రాంగణాల్లో బహిరంగంగా వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలని కాండ్రేగుల వెంకటరమణ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు వినతిపత్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఔషధ నియంత్రణ పరిపాలన విభాగాలకు పంపినట్టు మీడియాకి విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Anakapalle

2022-07-08 14:03:53

పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవు

శ్రీకాకుళం జిల్లాలో జల్ జీవన్ మిషన్ (జెజెఎం) ద్వారా మంజూరైన పనుల్లో జాప్యం వహిస్తే చర్యలు తప్పవని, విధుల నుండి తప్పిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ జెజెఎం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ ద్వారా పనులను చేపట్టేందుకు లక్ష్యాలు నిర్దేశించినప్పటికి నేటి వరకు పూర్తి చేయకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తొలుత ఇప్పటివరకు చేపట్టిన పనులపై మండలాల వారీగా సమీక్షించిన కలెక్టర్ అనుమతులు ఉన్న పనులు కూడా ఇంజినీరింగ్ అధికారులు చేపట్టక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పగించిన చిన్న చిన్న పనులు కూడా చేపట్టని గ్రామీణ నీటిపారుదల శాఖ పనితీరు బాగులేదని అసహనం వ్యక్తం చేశారు. చేసిన పనులకు సంభందించిన బిల్లులు సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయని, అయినప్పటికీ పనులు ఎందుకు వేగవంతం కావడం లేదని ప్రశ్నించారు. పనులు వేగవంతం చేయడానికి  ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మూడు మాసాల్లో లక్ష్యాలను నిర్ధేశించినప్పటికి పూర్తి చేయలేకపోవడంపై వివరణ కోరారు. జిల్లావ్యాప్తంగా 20 వేలు కొళాయి కనెక్షన్లు ఎందుకు పూర్తి చేయలేక పోతున్నారని, 700 మంది ఇంజినీర్లు ఉండి పనులు వేగవంతం కాకపోవడం సరికాదని అన్నారు. జిల్లాలో కొళాయి కనెక్షన్లు కావాలని కోరుతున్నవారు చాలా మంది ఉన్నారని,వారికి మంజూరుచేస్తే సరిపోతుందని, ఆ విషయం కూడా గ్రహించలేక పోతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న మంచి కార్యక్రమం ఇదని కలెక్టర్ గుర్తుచేశారు.

 ఇందులో అంచనాలు రూపొందించడానికి   జాప్యం ఎందుకు జరుగుతుందని, ఏడాది కాలంలో మీ పనితీరు సంతృప్తి కరంగా లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బూర్జ మండలాన్ని సమీక్షిస్తూ 37 పనులకు ఎస్టిమేషన్ వేసి టెండర్లకు పిలిస్తే 8 పనులకు మాత్రమే టెండర్లు కన్ఫర్మ్ అయ్యాయని, మిగిలిన టెండర్లకు ఎవ్వరూ పాల్గొనక పోవడానికి కారణాలు తెలపాలని కలెక్టర్ కోరారు.  సహాయ ఇంజనీర్లు, గ్రామ స్థాయి ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ప్రణాళికలు రూపొందించుకుంటే పనులు వేగవంతం చేయవచ్చని సూచించారు.పనుల పురోగతి సంతృప్తినిచ్చేలా ఎప్పటి కపుడు పరిశీలించుకొని ముందుకువెళ్లాలని అన్నారు. పనుల్లో పురోగతి లేకపోతే మీకు వెనుకకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లాలో 20 వేల కనెక్షన్లు పూర్తిచేసేందుకు 700 మంది ఇంజినీర్లు ఉన్నారని, ఒక్కో ఇంజనీర్ సుమారు 30 కనెక్షన్లు చేయవలసి ఉండగ, వాటిని కూడా చేయలేకపోయారని అన్నారు. పనుల నిర్వహణకు మెటీరియల్ అందుబాటులో ఉందని, పనుల నిర్వహణలో సాంకేతిక కారణాల సమస్యలు ఉంటే తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. శాఖకు సులభతరమైన లక్ష్యాలను నిర్దేశించామని, జూలై మాసాంతానికి లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.అనంతరం కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనితీరుపై సమీక్షించిన ఆయన 614 ప్రదేశాల్లో స్థలం అందుబాటులో ఉందని, పనులకు సంబంధించిన చెల్లింపులు జరుగుతున్నాయని,నిధులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. బిల్లులు అప్లోడ్ చేసిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు.కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కట్టడంలో 26 జిల్లాల్లో 24వ స్థానంలో ఉండడం అసంతృప్తిగా ఉందని, ఇకపై ప్రగతి కనబరచాలని అన్నారు. జూలై మాసాంతానికి ఇంకా 23 రోజులే సమయం ఉన్నందున త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్, కార్యనిర్వాహక ఇంజినీర్ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-08 13:56:17

శ్రీ సిద్ధేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జులై 10 నుండి  18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జులై 9వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. జులై 10న ఉదయం 6.58 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి హంసవాహన సేవ నిర్వహిస్తారు. జులై 11, 12, 13, 14 మ‌రియు 17వ తేదీల్లో ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వ‌హిస్తారు.  అదేవిధంగా జులై 11న రాత్రి చంద్రప్రభ వాహనం, 12న‌ రాత్రి చిన్నశేష వాహనం, 13న రాత్రి సింహ వాహనం, 14న సాయంత్రం నంది వాహ‌న‌సేవ జ‌రుగుతాయి. జులై 15న సాయంత్రం 6 నుండి రాత్రి 7గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 7.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు.

      జులై 16న సాయంత్రం పల్లకీ సేవ, 17న సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం, 18న ఉదయం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు, సాయంత్రం 6 గంట‌ల‌కు వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.   జులై 19వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి,  శ్రీసిద్ధేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.  బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Tallapaka

2022-07-07 10:43:32

అప్పన్న గిరి ప్రదక్షిణకు రూట్ మ్యాప్

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ వరాలక్ష్మీ నారసింహ స్వామివారు(సింహాద్రి అప్పన్న) గిరి ప్రదక్షణ చేయడానికి దేవస్థానం అధికారులు రూట్ మ్యాప్ ని ప్రకటించారు. ఈ మొత్తం రూట్ మ్యాప్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బదులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ లో రెండేళ్ల పాటు నిలిపివేసిన ఈ సింహగిరి ప్రదక్షిణ మళ్లీ ఈ సారి దేవస్థానం అధికారులు ప్రారంభిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గిరి ప్రదక్షిణ కోసం మొత్తం 25 ప్రాంతాల్లో స్టాల్స్, పది ప్రదేశాల్లో మెడికల్ క్యాంపులు, 22 ప్రదేశాల్లో 200 టాయిలెట్లు, 12 చోట్ల 17 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలు అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ జరుగుతున్నందున భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో అధికారులు సర్వం సిద్దం చేశారు. గిరి ప్రదక్షిణ ఏఏ ప్రాంతాలు మీదుగా సాగుతుందనే విషయాన్ని తెలియజేయడానికి ఒక రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రూట్ మ్యాప్ ద్వారా ప్రజలకు మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నది.

Visakhapatnam

2022-07-07 10:29:55

జ్ఞాన సంపదతోనే దేశాభివృద్ధి సాధ్యం

ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకొని, కర్తవ్య నిర్వహణలో సమర్థతను,శక్తిని, ఉత్సాహన్ని పొందేందుకు జాతీయ మీడియా సదస్సు-2022 నిర్వహించడం జరుగుతుందని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పేర్కొంది. సంస్థ ప్రతినిధి బి.కె.రామేశ్వ రి(రమ) ఆధ్వర్యంలో గురువారం విశాఖలోని డాబాగార్డెన్స్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సదస్సుకు సంబంధించిన వివరాలను పలువురు అతిధుల ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్కికల్‌ ఎడ్యూకేషన్‌ ఆప్పిలేట్‌ ఆధారిటీ చైర్మన్‌ ఆచార్య జిఎస్ఎన్‌ రాజు. గౌరవ అతిధిగా జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ యాదగిరి శ్రీనివాసరావులు మాట్లాడుతూ నిరంతరం సమాజానికి దిక్సూచిగా వ్యవహరించే జర్నలిస్టులకు ఏటా జాతీయ మీడియా సదస్సు ఏర్పాటు చేసి వారికి అవసరమైన జ్ఞాన సంపదను పంచిపెట్టడం అభినందనీయమన్నారు. మీడియాతోనే ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగుతుందన్నారు. క్రమం తప్పకుండా ఈ జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం, అందులో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల జర్నలిస్టులను భాగస్వాములను చేయడం ఒక్క బ్రహ్మకుమారీలకే సాధ్యపడిందన్నారు. కార్యక్రమంలో అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా జాతీయ మీడియా సదస్సుకు విశాఖ నుంచి పలువురు జర్నలిస్టులు హాజరు కావడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా మౌంట్‌ ఆబూలో జరిగే మీడియా సదస్సుకు హాజరయ్యే జర్నలిస్టులు తమ అక్రిడేషన్‌, గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, జెరాక్స్ ,పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోను డాబాగార్డెన్స్‌ ప్రెస్‌క్లబ్‌(వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం) కార్యాలయం పనివేళల్లో ఈనెల 15వ తేదిలోగా సమర్పించి, తమ పేర్లును నమోదు చేసుకోవాలని కోరారు.

ఈ ఏడాది జాతీయ మీడియా సదస్సును ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 2 వరకూ మౌంట్‌ఆబూ శాంతివనంలో నిర్వహించడం జరుగుతుందని బ్రహ్మకుమారీస్‌ ప్రతినిధి బి.కె.రామేశ్వరి తెలిపారు. తొలిరోజు సాయంత్రం సదస్సు ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సమావేశాలు ముగిసిన అనంతరం సర్టిఫీకేట్లు అందజేసి మౌంట్‌ ఆబూ దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుతో జర్నలిస్టులకు తమ జీవితంలో అన్ని విధాలా ముందుకు సాగేందుకు చక్కని విలువలతో కూడిన జీవితం గడిపేందుకు ఉపకరిస్తుందన్నారు. కావున జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామేశ్వరి కోరారు. ఈ సందర్భంగా ఆమె అతిధులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విజెఎఫ్‌ ఉపాధ్యక్షుడు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ స్వాగతం పలకగా, కార్యవర్గ సభ్యులు ఎంఎస్‌ ఆర్‌ ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-07-07 08:40:51

విద్యార్థులను క్రమ శిక్షణగా తీర్చిదిద్దాలి

విద్యార్థులను క్రమ శిక్షణగా తీర్చి దిద్ది ఉన్నత విద్యావంతులుగా, ఉత్తమ పౌరులుగా తయారు చేయాల్సిన భాద్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. మంగళవారం లోచలి పుట్టు గిరిజన సంక్షేమ శాఖ నెంబర్ వన్ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని, పిల్లలను ఉత్తమ పౌరులుగా, విద్యావంతులుగా తీర్చి దిద్దటానికి ప్రభుత్వ కృషి చేస్తోందని వివరించారు. ఇటీవల కోవిడ్  కారణంగా విద్య ఫై  చాలా ప్రభావం పడిందని, విద్య స్థాయి పడిపోయిందని ఆవేదన వ్యక్త పరిచిన కలెక్టర్ ఈ రోజు నుండి ప్రారంభమైన పాఠశాలలకు విద్యార్థులు ప్రతి రోజు శత శాతం హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతి పేద వారు కూడా పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో జగనన్న విద్య కనుక కిట్లను పంపిణీ చేస్తోందని తెలిపారు ఇందులో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ , డిక్షనరీతో పాటు బేగ్, రెండు జతల యూనిఫామ్,షూస్, రెండు జతల శాక్స్ ఉంటాయన్నారు.   విద్యార్థులు చిన్నతనం నుండే పోటీతత్వం అలవరచుకోవాలి అందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. మన బడి నాడు-నేడు క్రింద పాఠశాలలను ఆధునీకరించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపిన కలెక్టర్ మొదటి విడతలో రూ. 104 కోట్లతో 367 పాఠశాలలు ఆధునీకరించామని. రెండో దశలో 393  పాఠశాలలు ఆధునీకరించనున్నామని వివరించారు.  జిల్లాలో అక్షరాస్యత శాతం కేవలం 54శాతం ఉందని, అక్షరాస్యత పెరుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ సూచించారు. అమ్మ ఒడి పథకం కింద లక్ష మంది వరకు లబ్ది పొందారని, విద్యార్థుల హాజరు శాతం 75 కు మించి ఉంటె మరికొంతమంది లబ్ది పొందేవారని తెలిపిన కలెక్టర్ తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండ పాఠశాలకు పంపాలన్నారు.  జగనన్న విద్య కానుక కిట్లను అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలనీ,  బయో మెట్రిక్ కు సిగ్నల్ సమస్య ఉంటే సచివాలయాలు సహాయం తీసుకోవాలని డిఇఓను ఆదేశించారు. అదేవిధంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని కోరారు. కిట్ల పంపిణీలో, ఆధార్ అప్ డేషన్  లో  ఎంపిడిఓలు సచివాలయాల సిబ్బందికి తగు సూచనలు జారీ చేయాలనీ ఆదేశించారు.. 

        జిల్లా విద్యా శాఖాధికారి డా. పి  రమేష్ మాట్లాడుతూ జిల్లాలో 2,716 పాటశాలల్లో 1,58,989 మంది విద్యార్థులు ఉన్నారని, 1,58,914 కిట్లు వచ్చాయని,  ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. ఐదవ తేదీ నుండి 30 వ తేదీ వరకు  ప్రతి పాఠశాలలో రోజుకు 25 మందికి చొప్పున పంపిణీ జరుగుతుందని, ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్ చేస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పాడేరు ఎంపిపి రత్న కుమారి, ఎంఇఓ సరస్వతి, ప్రధానోపాధ్యాయులు జివివి ప్రసాద్, కృష్ణమూర్తి, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధి ఎం శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. 

Paderu

2022-07-05 11:53:31

సమన్వయకర్త పోస్టుకి దరఖాస్తులు ఆహ్వానం

గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో కమ్యూనికేషన్స్ విభాగంలో జిల్లా సమన్వయకర్త పోస్టును ఆరు నెలల కాలానికి నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో సాంఘిక, ప్రవర్తన పరమైన మార్పుల కొరకు కమ్యూనికేషన్ విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ పోస్ట్ ను ఈ ఏడాది జూలై నుంచి డిసెంబరు వరకు ఆరు నెలల కాలానికి నియామకం జరుగుతుందని పేర్కొన్నారు. నెలకు 48 వేల రూపాయలు ఏక మొత్తంగా వేతనం ఉంటుందని ఆయన పేర్కొంటూ నియామకం చెందిన అధికారి కోవిడ్, ఇతర సమస్యల పరంగా వస్తున్న ప్రవర్తనపరమైన మార్పులు పట్ల ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అదేవిధంగా మహిళలు, బాల్యవివాహాలు, ఇతర సామాజిక రుగ్మతలు, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసే వివిధ సమావేశాల్లో సమన్వయ అధికారిగా పాల్గొంటూ సంబంధిత సమాచారాన్ని ఇతర శాఖలతో సమన్వయ పరచడం, ప్రజల వద్దకు తీసుకువెళ్లడం చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా దీన్ని ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన చెప్పారు.

 ఈ పోస్ట్ కు దరఖాస్తు చేసే అభ్యర్థి కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ లేదా ఇతర విభాగాల్లో మాస్టర్  డిగ్రీ కలిగి ఉండాలని, జిల్లా, రాష్ట్రస్థాయి కమ్యూనికేషన్ విభాగాల్లో నాలుగు నుండి ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని ఆయన వివరించారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు కనీసం మూడు సంవత్సరాల పాటు కమ్యూనిటీ మొబిలైజేషన్ లేదా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యం, ఐసిడిఎస్, పంచాయతీరాజ్, విద్య, రెవిన్యూ, మైనారిటీ, మున్సిపాలిటీ, సివిల్ డిఫెన్స్, సమాచార, ఫీల్డ్ పబ్లిసిటీ, మీడియా తదితర విభాగాల్లో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని వివరించారు. సామాజిక, మతపరమైన, సాంస్కృతిక పరమైన విషయాల్లో స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ఆ విభాగాల్లో పని చేసే సామర్థ్యం ఉండాలని చెప్పారు. సొంత లాప్ టాప్,  మొబైల్ ఫోను కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనం ఉండాలని, జిల్లాలో విస్తృతంగా పర్యటించుటకు ఆసక్తి కలిగి ఉండాలని చెప్పారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, డ్రాప్టింగ్, రైటింగ్ స్కిల్స్ తో పాటు మహిళా, శిశు అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. తెలుగు, ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ ఉండాలని, కంప్యూటర్ విభాగంలో ఎమ్మెస్ ఆఫీస్ లో పనిచేసే సామర్ధ్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ కు ఈ నెల 6 నుండి 8వ  తేదీ వరకు దరఖాస్తులను సమర్పించాలని ఆయన చెప్పారు. గడువు దాటిన తరవాత అందిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోవడం జరగదని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తులను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల జి.ఎస్.డబ్ల్యు.ఎస్ సమన్వయ అధికారి విభాగంలో 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీన మౌఖిక పరీక్ష నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. పోస్టు భర్తీ ప్రక్రియను మార్పులు చేర్పులు చేయుటకు గాని, వాయిదా వేయుటకు గాని, ఎటువంటి సమాచారం లేకుండా భర్తీ ప్రక్రియను పూర్తిగా నిలుపుదల చేయుటకు గాని నియామక చైర్మన్ లేదా అధికారికి పూర్తి హక్కులు ఉన్నాయని ఆయన వివరించారు.

Parvathipuram

2022-07-05 11:10:40

రీసర్వే పనులు వేగవంతం చేయాలి

జగనన్న భూ హక్కు భూ రక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న రీ సర్వే వేగవంతం చేసి పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరు కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో కలిసి సర్వే పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో జరుగుతున్న సర్వే పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కాకినాడ డివిజన్ కి సంబంధించి డ్రోన్ సర్వే పనులు జూలై నెల చివరి నాటికి, పెద్దాపురం డివిజన్ కి సంబంధించి అక్టోబర్ నెల చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. రీ సర్వే నిర్వహణలో సరిహద్దులు గుర్తింపులో ఎటువంటి గందరగోళానికి చోటివ్వకుండా స్పష్టంగా రీ సర్వే పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో సర్వే ఎడీ బి.లక్షీనారాయణ, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు బీవీ.రమణ, జే.సీతారామరావు, పెద్దాపురం డీఐఓఎస్ ఎం.జ్యోషిల ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-05 11:04:59

విధి నిర్వహణలో అలసత్వంపై చర్యలు

ప్రభుత్వ భవన నిర్మాణ విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న ప్రభుత్వ భవన నిర్మాణపు పనులపై మంగళవారం మండల తహశీల్దారులు, ఎం.పి.డి.ఓలు, పంచాయతీ రాజ్ ఇంజినీర్లతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిధుల కొరతతో నిర్మాణాల్లో జాప్యానికి కారణమని భావించి నిధులను మంజూరుచేసామని అన్నారు. నిధుల సమస్య ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకు రావాలని, నిధుల కొరతను అధిగమించేందుకు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ కు కోటి యాభై లక్షల రూపాయల చొప్పున  మూడు కోట్లు రూపాయలను వడ్డీ నిధుల నుండి విడుదల చేయడం జరిగిందని తెలిపారు. నిధులు విడుదల పిదప కూడా నేటికీ పనులను చేపట్టక పోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ తరపున చేపడుతున్న భవన నిర్మాణ పనులపై కలెక్టర్ మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ రాజ్ ఇంజినీర్లు పనుల పురోగతి పై అందించిన నివేదికలు సంతృప్తి కారణంగా లేవని, ఇందుకు ప్రధాన కారణం చేపడుతున్న పనులపై పర్యవేక్షణ లోపమని అన్నారు. భవన నిర్మాణ పనుల అమలుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ యుద్ద ప్రాతిపదికన పనులు ప్రారంభించి శరవేగంగా నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. నిధులు మంజూరు చేసి మూడురోజులు అయినప్పటికీ ఎటువంటి పనులు ప్రారంభించక పోవడం పట్ల  సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ తేల్చిచెప్పారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు భవన నిర్మాణాలపై తరచూ సమీక్షలు నిర్వహించి ప్రగతి పరిశీలిస్తున్నారని అన్నారు. ప్రగతిలో జిల్లా వెనుకబడి ఉందని వెంటనే పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శ్రీకాకుళం, టెక్కలి కార్య నిర్వాహక ఇంజినీర్లు  టెలీ కాన్ఫరెన్స్ లో రెస్పాన్స్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటాయించిన నిధులతో ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని, పనుల నిర్వహణకు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు చేపడతామని అన్నారు. టెక్కలి డివిజన్ లో చేపట్టిన భవన నిర్మాణ పనులపై మాట్లాడుతూ ఆన్లైన్ లో పూర్తిగా సున్న ప్రగతి ఉండడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన 101 పనులకు సంబంధించి పనుల్లో పురోగతి కనిపించాలని, పనుల నిర్వహణపై కథలు చెప్పడం మాని, పురోగతి చూపించాలని ఆదేశించారు. గత 4 వారాల నుండి బిల్లులు చెల్లింపులు చేయడం జరుగుతుందని, మిగిలిన పనులు కూడా పూర్తి చేసిన వెంటనే బిల్లులు అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ విషయాన్ని డి.ఇలు,ఎ.ఇలు, యం.పి.డి.ఓ  లు తహశీల్దార్లు, ఇంజనీరింగ్ సహాయకులు గమనించాలని అన్నారు.  గ్రామ సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ వెల్నెస్ సెంటర్స్  ఎక్కడ భవన నిర్మాణాలు ప్రారంభం కాలేదో, బిలో బేస్మెంట్ భవనాలు ఉన్నయో అన్నింటిపై చర్యలు చేపట్టి, రానున్న రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. జరుగుతున్న పనులకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నాయని, ఎవ్వరూ ఎటువంటి అపోహలకు గురికావద్దన్నారు.  ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ఎస్.ఇ పంచాయతీరాజ్ శాఖ, శ్రీకాకుళం, టెక్కలి ఈ ఈ లు, మండల తహశీల్దారులు, ఎం.పి.డి.ఓలు, పంచాయతీ రాజ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-05 10:58:53

ఇష్టంతో చదవితే విజయం మీ సొంతం

ఇష్టంతో చదివితే విజయం మీదేనని జిల్లా కలెక్టర్ నిశాంత్ అన్నారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం పార్వతీపురం మండలం పెద బొండపల్లి పాఠశాలలో మంగళ వారం విద్యా శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇష్టంతో చదువాలని అప్పుడు పేదరికం, ఆకలి అనే ఏది ఆటంకంగా నిలువలేవన్నారు. శ్రమ నీ ఆయుధం కావాలని... అప్పుడు విజయం నీ వెన్నంటి నిలుస్తుందని చెప్పారు. విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఉన్నత లక్ష్యాలతో ఉండాలని పేర్కొన్నారు. ఆశయాలు ఉండాలి... వాటిని సాధించాలని ప్రేరణ కల్పించారు. చదువుతో కుటుంబ సామాజిక, ఆర్థిక హోదా మారుతుందని ఆయన అన్నారు. పేదరికం నుండి బయట పడాలంటే చదువు ద్వారా సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. చదువుతో విజ్ఞానం, సామాజిక స్పృహ కలుగుతుందని ఆయన పేర్కొంటూ పేదరికం చదువుకు ఆటంకం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తుందని వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకొని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు.

 పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి పోటీతత్వం అలవరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. పేద ధనిక తేడా లేకుండా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయాలన్న దిశగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. అందులో భాగంగా నాడు నేడు పనులు కింద పాఠశాలలో ఆధునీకరణ, పేద విద్యార్థికి విద్యను అందించే విధంగా అమ్మఒడి పథకం, జగనన్న గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతి విద్యార్థులకు ఇంటర్వ్యూలను సులువుగా ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. గతంలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కష్ట తరంగా ఉండేదని, కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ తోనే సాధ్యమైందని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సాఫ్టు స్కిల్స్, బృంద చర్చలు అలవరచి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బాటలు వేయాలని స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా సుమారు రూ.931 కోట్ల జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయగా జిల్లాలో విద్యార్థులకు రూ.20 కోట్ల విలువైన కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  ప్రతీ విద్యార్థికి దాదాపు రూ.2వేలు విలువైన జగనన్న విద్యా కానుక క్రింద పాఠశాల తెరచిన రోజు నుండే ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. 

పార్వతీపురం మన్యం జిల్లాలో 1,03,883 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించడం జరుగుతుందన్నారు. ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం క్రింద మూడు జతల బట్టలు, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, రెండు జతర సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, జత బూట్లు, డిక్షనరీలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా బలిజిపేట మండలంలో ఆరు స్కూల్ కాంప్లెక్స్ ల కింద 56 పాఠశాలల్లోని 4,635 మంది విద్యార్థులకు, భామిని మండలంలో ఐదు స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 66 పాఠశాలలలోని 5,355 మంది విద్యార్థులకు, గుమ్మలక్ష్మీ పురం మండలంలో 9 స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 172 పాఠశాలల్లోని 9,023 మంది విద్యార్థులకు, గరుగుబిల్లి మండలంలో ఐదు స్కూల్ కాంప్లెక్స్ ల కింద 57 పాఠశాలల్లోని 4,612 మంది విద్యార్థులకు, జియ్యమ్మ వలస మండలంలో ఏడు స్కూలు కాంప్లెక్స్ ల కింద 95 పాఠశాలల్లోని 5,284 మంది విద్యార్థులకు, కొమరాడ మండలంలో ఏడు స్కూల్ కాంప్లెక్స్ ల కింద 127 పాఠశాలల్లోని 6,093 మంది విద్యార్థులకు, కురుపాం మండలంలో పది స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 177 పాఠశాలల్లోని 7,835 మంది విద్యార్థులకు, మక్కువ మండలంలో ఆరు స్కూల్ కాంప్లెక్స్ కింద 80 పాఠశాలల్లోని 5,458 మంది విద్యార్థులకు, పాచిపెంట మండలంలో తొమ్మిది స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 121 పాఠశాలల్లోని 7,496 మంది విద్యార్థులకు, పాలకొండ మండలంలో ఏడు స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 60 పాఠశాలల్లోని 5,822 మంది విద్యార్థులకు, పార్వతీపురం మండలంలో 11 స్కూల్ కాంప్లెక్స్ లో కింద 116 పాఠశాలల్లోని 10,493 మంది విద్యార్థులకు,  సాలూరు మండలంలో 12 స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 177 పాఠశాలల్లోని 11,849 మంది విద్యార్థులకు, సీతంపేట మండలంలో 15 స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 163 పాఠశాలల్లోని 10,076 మంది విద్యార్థులకు, సీతానగరం మండలంలో ఆరు స్కూల్ కాంప్లెక్స్ కింద 64 పాఠశాలల్లోని 4,445 మంది విద్యార్థులకు, వీరఘట్టం మండలంలో ఆరు స్కూలు కాంప్లెక్స్ ల క్రింద 62 పాఠశాలల్లోని 5,407 మంది విద్యార్ధులకు వెరసి 121 స్కూల్ కాంప్లెక్స్ కింద 1593 పాఠశాలల్లోని 1,03,883 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయడం జరిగింది. ఇందులో 52,195 మంది బాలురు, 51,668 మంది బాలికలు ఉన్నారని వివరించారు. 

శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక చిన్నారులకు వరం అన్నారు. కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు తీసిపోని విధంగా  చిన్నారులు తరగతులకు హాజరు కావాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పం అన్నారు. అందుకే ఎనిమిది వస్తువుల కలయికతో కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. టై, బూట్లు, బ్యాగుతో సహా అందించడం జరుగుతుందని దానితో పిల్లవాని రూపు రేఖలు మారిపోతుందని అన్నారు. బిడ్డలను చూసి తల్లులు మురిసిపోతున్నారని చెప్పారు. పాఠశాలలో చదువుతున్న అశ్వని అనే బాలిక మాట్లాడుతూ జగనన్న కానుక కిట్లు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాన్వెంట్లకు వెళ్ళే పిల్లలను చూసి బాధ పడే వారమని అయితే ఇప్పుడు సంతోషంగా జగనన్న ఉంచుతున్నారని చెప్పారు. అమ్మ ఒడి వస్తుందని, చదువు ఎలా అని బెంగ లేదని, విద్యా కానుక తో పుస్తకాలు వచ్చాయని, బూట్లు, టై లేవనే బాధ లేదని పేర్కొన్నారు.

Pedabondapalli

2022-07-05 08:47:36

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

రైతులకు  విత్తనాలు,  ఎరువులు పంపిణీ సక్రమంగా జరిగేటట్లు చూడాలని, అక్రమాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్  తెలిపారు.  మంగళవారం వీడియా కాన్ఫరెన్స్ హాలునందు  ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయాధికారులతో  జిల్లా కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులు ప్రారంభమైన ప్రస్తుత తరుణంలో ఎరువులు పంపిణీ చాలా ముఖ్యమని తెలిపారు. ఎరువులు కేటాయింపులకు ప్రణాళిక ఉండాలని, జిల్లా యంత్రాంగం నుండి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే కేటాయింపులు, రవాణా చేయాలని ఎరువుల కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. డీలర్లకు 50శాతం, మార్క్ ఫెడ్ కు 50 శాతం వంతున సరఫరా చేయాలని తెలిపారు. జాయింటు కలెక్టరు నుండి ఎరువుల కేటాయింపులకు సంబంధించి ఆమోదం తీసుకోవాలని తెలిపారు. ఎరువులు సరఫరాపై సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. మండలంలో అవసరాన్ని బట్టి కేటాయింపులు ఉండాలనితెలిపారు. ఎరువులు  అంతర్ జిల్లాల, అంతరాష్ట్ర రవాణా నిషేదమని, డీల్లర్లు రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, అమ్మకాలు, నిల్వలకు తేడాలు రాకూడదని హెచ్చరించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 అనంతరం వ్యవసాయ, అనుబంధ శాఖలైన ఉద్యానశాఖ, పశుసంవర్థక,మత్స్యశాఖ, పట్టుపరిశ్రమ శాఖ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తూ విత్తనాలు, ఎరువులు సకాలంలో పంపిణీ జరగాలన్నారు.  విత్తనాలు, ఎరువులు పంపిణీపై ప్రజలనుండి, ప్రజా ప్రతినిధులనుండి పిర్యాదులు రాకూడదన్నారు. గ్రామాలు, రైతు భరోసా కేంద్రం వారీగా డిమాండు, సప్లయిపై నివేదిక తయారుచేసుకొని, దాని ప్రకారం పంపిణీ చేయాలని తెలిపారు. గత సంవత్సరం విత్తనాలు, ఎరువులు కొరత వచ్చిన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలకు తగినన్ని నిల్వలు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు అవసరమైనన్ని  కంది, మినుము విత్తనాలు పంపిణీ చేసి వాటి వాడకంపై పర్యవేక్షణ చేయాలని అదికారులకు తెలిపారు. కౌలు రైతులకు రుణ అర్హత  కార్డులు అందజేయాలన్నారు. బ్యాంకు లింకేజీ కాని రైతుల బ్యాంకు అక్కౌంటులు ఆధార్ తో లింక్ చేసి వారికి ప్రభుత్వ పధకాలు అందేలా చర్యలుతీసుకోవాలని తెలిపారు.

Parvathipuram

2022-07-05 08:37:21

తిరుమలలో జూలై 10న ముగియనున్న దీక్ష

సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని, స‌క‌ల కార్యాలు సిద్ధించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపట్టిన " షోడ‌శ‌దినాత్మ‌క‌ అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష " జూలై 10వ తేదీ పూర్ణాహుతితో ముగియనుంది. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో జూన్ 25న ఈ దీక్ష ప్రారంభమైంది. "రామ‌స్య‌పాదౌజ‌గ్రాహ‌ల‌క్ష్మ‌ణ‌స్య‌చ‌ధీమ‌తః " అనే మహామంత్రం ప్రకారం అర‌ణ్య‌కాండలోని మొత్తం 75 స‌ర్గ‌ల్లో 2,454 శ్లోకాల‌ను 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేస్తున్నారు. వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, త‌ర్ప‌ణ‌, హోమాదులు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌లకు ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

Tirumala

2022-07-05 08:20:48

విశాఖలోనూ జగనన్న మహిళా మార్ట్

విశాఖ మహా నగరంలో మహిళా మార్ట్ ప్రారంభానికి జివిఎంసి కమిషనర్ సూచనల మేరకు మల్కాపురంలో సన్నాహాలు చేస్తున్నట్లు సోమవారం యుసిడి(పి.డి.), కె.వి. పాపు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలకు ఆర్ధిక స్వాలంబన సాధించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెప్మా వారి ఆధ్వర్యంలో ఇదివరకే తిరుపతి, చిత్తూరు, గూడూరు, పులివెందుల, అద్దంకి తదితర ప్రాంతాలలో జగనన్న మహిళా మార్ట్ ను ప్రారంభించారని తెలిపారు. కమిషనర్ సూచన మేరకు జివిఎంసి పరిధిలో మల్కాపురంలో ఈ మార్ట్ కి మంచి గిరాకీ ఉంటుందని అందువలన మల్కాపురం లో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేయడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా స్వయం సహాయక సంఘాలు(ఎస్.హెచ్.జి.), స్లం లెవల్ ఫెడరేషన్(ఎస్.ఎల్.ఎఫ్.) మరియు టౌన్ లెవల్ ఫెడరేషన్(టి.ఎల్.ఎఫ్) సభ్యుల నుంచి వాటాదనం రూ. 110/-లు మరియు సభ్యత్వ రుసుం కింద రూ.40/- లు, ఒక్కొక్కరికి మొత్తం రూ. 150/-లు చొప్పున మహిళా పరస్పర సహకార సంఘంలో రిజిస్ట్రేషన్ కాబడి, ఈ మార్ట్ ద్వారా అన్ని రకాల మహిళా సంఘాల ఉత్పత్తులు మరియు నిత్యావసరాలను విక్రయిస్తారని, ఇందులో సభ్యులే అన్ని బాధ్యతలూ నిర్వహిస్తారని తద్వారా వారి ఆర్ధిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.      

జివిఎంసీ

2022-07-05 07:47:25

సర్వపాపహరణం నారసింహుని దర్శనం

విశాఖలోని పాతనగరం లో కొలువున్న శ్రీ జగన్నాథ స్వామి దశావతార మహోత్సవాలు  అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వరాహ, నారసింహ అవతారాల్లో జగన్నాథుడు భక్తులకు  దర్శనం కల్పించి  కనువిందు చేస్తున్నారు. మంగళవారం నారసింహ అలంకరణలో  జగన్నాథుడు  భక్తులకు దర్శనం ఇవ్వగా  దర్శించుకున్నవారంతా భక్తిభావంతో పులకించిపోయారు. వరాహ ,నారసింహ అవతారాలలో ఉన్న జగన్నాథ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో అటువంటి భక్తులు సర్వ పాపాలు హరించుకుపోయి ,వారి కుటుంబాలు సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో కలకాలం చల్లగా ఉంటాయని అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఈ మేరకు నారసింహావతారం లో ఉన్న జగన్నాధుడుని మంగళవారం దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకంలో ఉన్న ప్రజలందరినీ సుభిక్షంగా స్వామి చల్లగా కాపాడాలని శ్రీను బాబు ఆకాంక్షించారు. గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని స్వామి ని వేడుకున్నట్లుగా శ్రీనుబాబు ఈ సందర్భంగా మీడియాకి చెప్పారు.

Visakhapatnam

2022-07-05 06:24:27