1 ENS Live Breaking News

అంగన్వాడీల సమ్మెకు టిడిపినేత ఆడారి కిషోర్ కుమార్ మద్దతు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీలు న్యాయమైన కోర్కెలను వెంటనే తీర్చాలని టిడిపి యువనాయకులు, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరవధిక ధర్నా చేస్తున్న అంగన్వాడీల ఆందోళనకు ఆయన సంపూర్ణ సంఘీబావాన్ని ప్రకటించారు. వారితో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ, అంగన్వాడీలను ప్రభుత్వం వర్కర్లుగా కాకుండా ఎందరో పిల్లలకు సంరక్షణగా నిలిచే తల్లులుగా చూడాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు డిమాండ్లు పరిష్కరించడం ద్వారా వీరంతా తిరిగి పిల్లలను సంరక్షించడానికి కేంద్రాలకు వెళ్లేందుకు అవకాశం వుంటుం దన్నారు. ప్రభుత్వం వీరి డిమాండ్ లను అంగీకరించేంతవరకూ చేసే పోరాటంలో తన మద్దతును తెలియజేస్తానని అన్నారు. కార్మిక చట్టాలను అనుసరించి గన్వాడీలకు జీతాలు పెంచాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు పెంచడంతోపాటు గ్రాడ్యుటీ కూడా అమలుచేయాలన్నారు.వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.19 రోజులుగా వీరుచేస్తున్న సమ్మెకారణంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాలు అరకొరగానే నడుస్తున్నాయన్నారు. అంగన్వాడీలు కేంద్రాల్లో ఉంటే పిల్లలకు నాణ్యమైన ఆహారంతోపాటు, ఆటపాటలు ఆడించడానికి అవకాశం వుంటుందన్నారు. ప్రస్తుతం కేంద్రాలన్నీ బోసీ ఉన్నాయనే విషయాన్నిప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలన్నారు. ఇన్నిరోజులుగా సమ్మె చేస్తున్నా కనీసం ప్రభుత్వం అంగన్వాడీల కోసం ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. వీరి న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని ఆడారి కిశోర్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు, ఆడారికిషోర్ కుమార్ యువసేన ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు అంగన్వాడీలు తమ డిమాండ్ల పత్రాన్ని ఆయనకు అందజేశారు.

Visakhapatnam

2023-12-30 16:34:09

ఐక్య కార్యాచరణతోనే బిసి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బిసి ఉద్యోగుల సమస్యలను ఐక్య కార్యాచరణతోనే పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కోసెట్టి అప్పారావులు పేర్కొన్నారు. శుక్రవారం సంఘం సర్వసభ్య సమావేశం చిలుకూరి బృందావన ఎస్టేట్ లో జరిగింది. ఈ సందర్భంగా 2024 డైరీ ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ,  రాబోయే 3సంవత్సరాలకు  రాష్ట్ర, కంపెనీలు,  జిల్లా కార్యవర్గాలను ప్రస్తుతం ఉన్నవాటినే కొనసాగించాలని తీర్మనించినట్టు చెప్పారు. అదేవిధంగా  ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించామన్నారు. ప్రధానంగా ఈపీఎఫ్ టు జిపిఎఫ్ సదుపాయాలను 2004 ఆగస్టు 31 ముందు జాయిన్ అయిన ఉద్యోగులందరికీ అందరికీ కల్పించాలని, ఉద్యోగులకు మెడికల్ సదుపాయం పూర్తిగా కల్పించాలని , డిపార్ట్మెంట్  జారీ చేసిన మెడికల్ క్రెడిట్ కార్డులను అన్ని హాస్పిటల్ వారు తక్షణమే ఆమోదించుటట్టుగా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని,

 ప్రతినెల జీతాలు ఒకటో తారీఖున ఉద్యోగులకు జమ చేయాలని,పి అర్ సి బకాయిలను ఒప్పందం ప్రకారం వెంటనే విడుదల చేయాలని,జేఎల్ఎం గ్రేడ్ 2 ఎంప్లాయిస్ ను విద్యుత్ సంస్థ ల ఎంప్లాయీస్ లాగా పరిగణించి అన్ని ప్రయోజనాలను కల్పించాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్స్ ఉద్యోగుల కు నేరుగా జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు,  ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనంతో కూడిన అత్యవసర సెలవులను మంజూరు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ,విద్యుత్ సంస్థలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని , కొత్తగా ఏర్పడిన డివిజన్ వలన కొంతమంది ఉద్యోగులు ఒక్క జిల్లా పరిధి నుంచి మరో జిల్లాకు బదిలీ అయిన వారిని పాత జిల్లాలోని వారి ని కొనసాగించాలనే సమస్యల పరిష్కారం కోసం ఏకవాఖ్య తీర్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ
  సనపల వెంకటరావు, కంపెనీ ప్రెసిడెంట్  సాయిబాబా,వర్కింగ్ ప్రెసిడెంట్  కె వి నరసింహారావు,  ఐదు జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు ప్రతినిధులు, బీసీ సభ్యులు హాజరయ్యారు.

Visakhapatnam

2023-12-29 15:30:06

ఏఎంఏఎల్ కాలేజ్ కి టీడీపీ నేత ఆడారి కిషోర్ రూ.20 వేలు విరాళం

కాలేజ్ విద్యార్థులకు మెరుగైన సదుపాయాల కోసం పూర్వవిద్యార్ధులు ముందుకి రావాలని తెలుగు దేశం యువ నేత, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజ్ కి ఆయన రూ.20 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, తన జన్మదినోత్సవం సందర్భంగా  చదువుకున్న కళాశాల అభివృద్ధి కోసం ఈ విరాళాన్నిఅందజేయడం ఆనందంగా ఉందన్నారు. చదువకున్న పాఠశాలలు, కళాశాలలకు విద్యార్ధులు తమవంతుగా ఏదో అంశంలో సహాయం చేయడం ద్వారా మరిన్ని సదుపాయాలు కల్పించడానికి అవకాశం వుంటుందన్నారు.  తాను విద్యార్థి గా ఓనమాలు దిద్దుకున్నది ఇక్కడేనని, తాను నేడు సమాజంలో నాయకునిగా ఎదగడానికి ఇక్కడే  బీజం పడిందన్నారు.ఈ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎదిగానని, ఆపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో సైతం విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైనట్టు తెలిపారు. తాను చదువుకున్న కళాశాలలోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభించడం కోసం  సంపూర్ణ సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు సాంకేతిక పరమైన శిక్షణ కూడా ఏర్పాటు చేసి, అతి త్వరలోనే విద్యార్థుల ఉపాధి కోసం జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. ఆ మొత్తాన్ని కళాశాల ప్రిన్సిపాల్ కు అందించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ గల్లా జయబాబు,  యాజమాన్యం, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బొడ్డేటి అప్పారావు, సూపరింటెండెంట్ అనురాధ, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ కే వి ఎస్ నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు ఆడారి కిషోర్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ యువసేన ప్రతినిధులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Anakapalle

2023-12-29 14:05:19

సేవ్ సాయిల్ రన్ కు..మిషన్ కర్షకదేవోభవ సంపూర్ణ మద్దతు

ప్రతీ ఒక్కరూ మట్టిని కాపాడుకోవడం ద్వారా జీవకోటి మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా ఉంటుందని మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ పేర్కొ న్నారు. మంగళవారం విశాఖ ఎంవీపి కాలనీ నుంచి ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం సుబ్రమణ్యశర్మ అనే సామాజికవేత్త ప్రారంభించిన సేవ్ సాయిల్ రన్ కు ఆయన సం పూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను కిషోర్ కుమార్ మార్గమధ్యలో కలిసి అభినందనలు తెలియజేశారు. 55ఏళ్ల వయస్సులో పుడమిపై ఉన్న ప్రేమ తో, ప్రతీ ఒక్కరికీ మట్టిపై అవగాహన కల్పిండానికి, మట్టిని కాపాడుకోవాలనే మంచి కాన్సెప్ట్ తో 33 కిలోమీటర్ల పరుగు చేపట్టడం చాలా గొప్పవిషయమన్నారు. మట్టి ని కాపాడుకుంటేనే.. రైతు వ్యవసాయం చేయడానికి ఆస్కారం వుటుందని, మొక్కలు నాటడానికి వీలుంటుందని.. తద్వారా రైతుకి పని, మనందరికీ ఆహారం సకాలంలో దొరుకుతుందని చెప్పారు. ఇలాంటి మంచి పనులకు తమవంతు మద్దతు ఎల్లప్పుడూ వుంటుందని సేవ్ సాయిల్ సుభ్రహ్మణ్యశాస్త్రికి తెలియజేశారు. ఈ సేవ్ సాయిల్ రన్ పూర్తయిన తరువాత తమన కార్యాలయానికి రావాలని కూడా ఆహ్వానించారు. అదేవిధంగా మిషన్ కర్షకదేవోభవ కోసం కిషోర్ కుమార్ ఆయనకు తెలియజేశారు.  




Visakhapatnam

2023-12-26 08:35:59

సమిష్టి కృషితో ‘పెవా’ను అగ్రగామి అసోసియేషన్ గా నిలపాలి

ఆంధ్రప్రదేశ్ లోని పద్మశాలీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్(పెవా) ను అగ్రగామిగా నిలబెట్టడానికి అందరి కృషి అవసరమని అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నీలంజోగిరాజు పేర్కొన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటలోని తిరుమల ఆసుపత్రి ప్రాంగణంలో డా.కోడి నానాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2024 కేలండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పద్మశాలీ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఈ అసోసియేషన్ అంచెలంచలుగా అతిపెద్ద ఉద్యోగుల సంఘంగా అవతరించేందుకు కార్యాచరణ జరుగుతోందన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యవచ్చినా పెవా అండగా వుంటుందనే విషయాన్ని ప్రతీ ఒక్క సభ్యుడూ గుర్తించుకోవాలన్నారు. ఉద్యోగులకు పనికొచ్చే సమాచారం, జీఓలను కూడా డైరీలో పొందుపరిచామన్నారు. ప్రముఖ వైద్యులు, కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. సిహెచ్.పాండురంగారావు మాట్లాడుతూ, ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తున్న పెవాకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. పద్మశాలీ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వైద్యులు, లాయర్లు, జర్నలిస్టులు ఇలా ప్రముఖ రంగాల్లో పనిచేస్తున్నవారు ఈ సంఘంలో సభ్యులుగా ఉండి పనిచేయడం అనేది చాలా గొప్పవిషయమన్నారు.

రిటైర్డ్ ఎంఈఓ, రాష్ట్ర ఉపాధ్యక్షులు  రాపర్తి సత్యనారాయణ,  మాట్లాడుతూ, ఉద్యోగుల సేవ, సంక్షేమమే పరమావధిగా పెవా అందిస్తున్నసేవలు ప్రతీ పద్మశాలీ ఉద్యోగి వరకూ చేర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అదే సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులంతా అసోసియేషన్ లో చేరాలని పిలుపునిచ్చారు. ప్రముఖ  కంటి వైద్య నిపుణులు హైమ నేత్రాలయం పసగడుగుల శివరాజ ప్రసాద్ మాట్లాడుతూ, పద్మశాలీ ఉద్యోగులకు, కులబాంధవులకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. అందరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రధాన రంగాల్లోని వారిని అసోసియేషన్ లో చేర్చి కార్యక్రమాలు చేపట్టడం అభినంద నీయమన్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు పెవా సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. జిల్లా ఉపాధ్యక్షులు కోసూరు నాగ వెంకట సూర్యనారాయణ మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వశాఖల్లోని పద్మశాలీ కులబాంధవులను గుర్తించి, వారిని సభ్యులుగా చేర్పిస్తున్నామన్నారు. దానికోసం ఇప్పటికే చేరిన సభ్యుల ద్వారా ప్రత్యేక క్యాంపైన్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు జాగు చినబాబు, అంజూరి శ్రీనివాసరావు ప్రతినిధులు, సభ్యులు జిఎన్ఎస్.శిరీష, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ బ్యూరోచీఫ్ పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు), తదితరులు పాల్గొన్నారు.

Payakaraopeta

2023-12-25 16:17:01

నాతవరం మండల అభివృద్ధికి సహకరించండి.. ఎంపీపీ సాగిన

అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణుమూర్తి పేర్కొన్నారు. శనివారం  జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చూడాలన్నారు. త్వరితగతిన ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తయ్యేలాగా అధికారులు కృషి చేయాలని సూచించారు. మండలంలో పలు రకాల సమస్యలపై సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. సచివాలయాల పరిధిలోని సమస్యలను  ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ మైనం నాగ గోపి, ఎంపీడీవో హనుమంతరావు, వివిధ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Nathavaram

2023-12-23 14:39:28

విద్యార్ధులూ కర్షక దేవోభవలో భాగస్వామ్యం కండి..కిషోర్ కుమార్

రైతు ఆర్ధికంగా అభివృద్ధి చెందినపుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. శనివారం అయన  అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా విద్యార్ధులకు రైతులు, మిషన్ కర్షక దేవోభవపై  అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతులకు ఆర్ధిక తోడ్పాటు పరిపూర్ణంగా ఇచ్చినపుడే వ్యవసాయం వృద్ధి చెంది, వాటి ఫలితాలతో ప్రజలు ఆరోగ్యం గా ఉం టారన్నారు. అదే సమయంలో వ్యవసాయా న్ని ప్రోత్సహించేందుకు, వారికి సరికొత్త వంగడాలను అందించేందుకు వీలుగా విద్యార్ధులు వ్యవసాయ విద్య ను అభ్యసిం చడంతోపాటు, సరికొత్త పరిశోధనలు చేయాలన్నారు. మనకి చేతినిండా డబ్బున్నా.. ఒక రైతు తన పనితాను చేయకపోయినా, వ్యయాసాయాన్ని పక్కనపె ట్టినా మాన వాళి ఆకలి తీరడం చాలా కష్టమైపోతుందన్నారు.  రైతులు ఎంతో శ్రమించి వ్యవసాయం చేయడం ద్వారానే మనం సమయానికి ఆహారం తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడు తుందన్నారు. అలాంటి రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయాన్ని పండుగలా మార్చే కార్యక్రమంలో భాగంగనే మిషన్ కర్షకదేవోభవను ప్రారంభించి నేటికి 50రోజులు పూర్తిచేసుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రజల దగ్గరకు తీసుకెళు తున్నామని తెలి యజేశారు. పచ్చదనం పెంపొదించడంలో  విద్యార్ధులు ముందుండాలని, ప్రతీ ఒక్కరూ తమ ఇంటి దగ్గర ఒక మూడు ఫలసాయాన్నిచ్చే మొక్కలు పెంచడం ద్వారా వ్యవసాయంపై ఆశక్తి పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని సూచించారు.  ఈ కార్యక్రమంలో మిషన్ సభ్యులు పాల్గొన్నారు.

Anakapalle

2023-12-23 13:50:37

సచివాలయ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు ఉపేక్షించేది లేదు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఐసిడిఎస్ సిబ్బంది చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఉపేక్షించేది లేదని డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం విశాఖజిల్లా అధ్యక్షులు సూర్య హెచ్చరించారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ల ఆదేశాలను పాటించడంమ తమవిధని, అంతేతప్పా తమకు అంగన్వాడీలపై ఎలాంటి వ్యతిరేక ఆలోచన లేదన్నారు. శనివారం ఈ మేరకు ఆయన గాజువాలక లో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సంఘం సమావేశంలో అంగన్వాడీలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీకు నచ్చినట్టు ఆందోళనలు చేసుకోవడం మీ హక్కు అని, అదే సమయంలో, సచివాలయ ఉద్యోగులపై మీడియా ప్రకటనలు, ప్రచారాలు సరికావన్నారు. ఆ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.  మీ హక్కుల కోసం పోరాడటం లో తప్పు లేదు  కానీ సచివాలయ ఉద్యోగుల పై పడి ఏడవటం, విమర్శలు చేయడం సరికాదన్నారు. తామేమీ సొంత నిర్ణయాలు తీసుకోమని, ప్రభుత్వ ఆదేశాలను పాటించడమ తమ విధి అనే విషయాన్ని అంగన్వాడీలు తెలుసుకోవాలని సూచించారు. కార్యకర్తలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రక్కన పెట్టి గ్రామ,వార్డు సచివాల యంలో పనిచేస్తున్న ఉద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడుతున్న మాటలను సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తాము ఎంతో కష్టపడి చదువుకొని డిఎస్సీ ద్వారా లక్షల మంది అభ్యర్ధులతో పోటీపడి మరీ ఉద్యోగాలు సాధించుకున్నామని, మా జాబ్ చార్ట్ ప్రకారం నడచుకోవడం మా కర్తవ్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ఏ ఉద్దేశ్యంతో అయితే గ్రామ,వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిందో దానికి అనుగుణంగా గ్రామ,వార్డు స్థాయిలో నే ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజలకు నిజాయతీ గా నిస్వార్ధము గా అవినీతి రహితంగా పని చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అంగన్వాడీలు ప్రవర్తించాలన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని  అటువంటి ఎంతో చక్కటి వ్యవస్థ ను తులనాడటం, నోటికొచ్చినట్టు మాట్లడటం సరికాదన్నారు. సచివాలయ ఉద్యోగులు కరోనా సమయం లో సైతం కనీసం సెలవులు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడటంలో ముందు ఉన్నారని గుర్తుచేశారు. అంగన్వాడీలు తమ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రతినిధులు బి.దివ్య, వి.క్రిష్ణ, ఎం.ప్రసాద్, అశోక్ కుమార్, పాల్గొన్నారు. 

Gajuwaka

2023-12-16 13:43:27

మాడుగుల నూతన వ్యవసాయ కమిటీ ఏర్పాటు

మాడుగులలో 20 మంది సభ్యులతో కూడిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీని ఒక సంవత్సరం కాలపరిమితితో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో చోడవరం మాడుగుల కలిపి ఉన్న మార్కెట్ కమిటీని నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేసారు. గౌరవ అధ్యక్షులుగా ఉపముఖ్య మంత్రి బూడి ముత్యాలనాయుడు,చైర్మెన్ గా సేనాపతి కొండల రావు, వైస్ చైర్మెన్ శ్రీనాదు శ్రీనివాసరావు సహా 17 మం ది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు ద్వారా  రైతులకు వారి వ్యవసా య ఉత్పత్తుల సేకరణ, అమ్మకంలో మరింత సులభతరం అవుతుందని రైతులు హర్షం వెలిబుచ్చారు. డిప్యూటీ సిఎం చొరవతో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పడి మాడుగుల రైతులకు మేలు జరుగుతుందని అశాభావం వ్యక్తం చేశారు.

Madugula

2023-12-14 14:54:41

విజెఎఫ్ ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి

అర్హత లేని, నకిలీ జర్నలిస్టులను ఓటర్లుగా చూపుతూ.. జరుగుతున్న విజెఎఫ్ ఎన్నికల ప్రక్రియను అర్హులైన జర్నలిస్టులకు సభ్యత్వాలు ఇచ్చేవరకూ నిలుపుదల చేయాలంటూ జర్నలిస్టులు రోడ్డెక్కారు. బుధవారం ఈ మేరకు విశాఖజిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. సీనియర్ జర్నలిస్టులు సత్యన్నారాయణ, రాము, పరశురామ్, శివ తదితరు ఆధ్వర్యంలో జరిగిన జర్నలిస్టుల నిరసనతో కలెక్టరేట్ ప్రాంగణం హోరెత్తింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ, అర్హత లేని జర్నలిస్ట్ లను వీజేఎఫ్ లో సభ్యులుగా చేర్చి వీజేఎఫ్ కున్న కోట్లాది రూపాయల ఆస్తిని కైవసం చేసుకోవడానికి కొంతమంది పన్నగం పన్నారని మండి పడ్డారు. సుమారు 140మందికి పైగా అర్హత లేనివారికి సభ్యత్వం ఇచ్చి, అర్హులైన జర్నలిస్టులకు సభ్యత్వాలు ఇవ్వకుండా కావాలనే అడ్డుకున్నారన్నారు.  

అనంతరం కలెక్టర్ మల్లిమార్జున్ ను కలిసి నకిలీ ఓట్లతో ఎన్నికలు జరిపుతున్న విధానాన్ని తెలియజేసి వినతి పత్రం సమర్పించారు. వీజేఎఫ్ ఆస్తులను కాజేసే కుట్ర జరుగుతుందని కలెక్టర్ కి  వివరించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే నకిలీ ఓటరులు పై చర్యలు తీసుకుని ఈ రోజు సాయంత్రానికి తనకు రిపోర్ట్ ఇవ్వాలని  డిఐజీ స్టాంప్స్ బాలకృష్ణ కు ఆదేశాలు జారీ చేశారు. సొసైటీ యాక్డుకి విరుద్ధంగా జరుగుతున్న వీజేఎఫ్ ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాన్ని తెలియజేస్తూ, వీజేఎఫ్ లో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చాలని, గతంలో  వచ్చిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటైన కమిటీల నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితా విడుదలైన రోజునే హడవుడిగా జారీ చేసిన వీజేఎఫ్ నోటిఫికేషన్ ను తక్షణమే రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉదృతంగా చేయడంతోపాటు న్యాయపోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అక్రిడేటెడ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-12-13 15:49:03

స్వచ్చమైన ఉత్పత్తుల వినియోగంతోనే చక్కటి ఆరోగ్యం

స్వఛ్చమైన పంటలను ప్రజలకు అందించి, ఆరోగ్యాన్ని కల్పించాలనే సంకల్పంతో విశాఖ లో ఆర్గానిక్ మేళా నిర్వహించడం అభినందనీయం అని మిషన్ కర్షక దేవోభవ  జాతీయ చైర్మన్, టిడిపి యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. విశాఖలో జరుగునున్న ఆర్గానిక్ మేళాను పురస్కరించుకుని మంగళవారం విశాఖ బీచ్ రోడ్ లో నిర్వహించిన  ఆరోగ్య పరుగులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించే స్వచ్చమైన ఆరోగ్యకర పంటలను ఈ మేళా లో ప్రదర్శి స్తున్నారని తెలిపారు. ఆర్గానిక్ మేళా ఈ నెల 14 నుండి 17 వ తేదీ వరకు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇంజనీరింగ్ మైదానం లో జరుగుతోందన్నారు.  ప్రకృతి ఆధారిత పంట లను విస్తారంగా పండించడం ద్వారా జల, వాయు, భూమి కాలుష్యం నివారించ వచ్చని వివరించారు. రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు, రసాయన కలు పుతీత మందులు వినియోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసుకున్న ప్రజలు ప్రకృతి ఆధారిత పంటలను ఆహారంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సదస్సులో 14వ తేదీ ఉత్తరాంధ్ర రైతుల సమావేశం, 15 వ తేదీ గ్రాడ్యుయేట్ రైతుల సమావేశం, 16 వ‌తేది ఆర్గానిక్ వ్యాపారం చేసే వారితో సమావేశం, 17 వ తేదీ మిద్దె తోట రైతుల సమావేశం జరుగుతున్నాయన్నారు. ప్రతీ రైతూ సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మారుతుందనే ఆశా భావం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి రైతుసంఘం , మేళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-12-12 07:36:43

ఆత్మరక్షణకు మార్షర్ ఆర్ట్స్ ఎంతో దోహదపడతాయి

ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహపడతాయని..అదీ చిన్ననాటి నుంచే ఆ నేర్పించడం ద్వారా యుక్తవయస్సు వచ్చేనాటికి మరింత దృఢంగా రాటు దేలడానికి అవకాశం వుంటుందని టిడిపి యువనాయకులు, మిషన్ కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖలో బోధి ధర్మ యుద్ధ కళా క్షేత్రం ఆధ్వర్యంలో బెల్డ్ గ్రేడింగ్ టెస్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధృడ భారతదేశ నిర్మాణంలో మార్ష్ట్స్ ఆర్ట్స్  కీలకభూమిక వహిస్తాయని అన్నారు. చిన్ననాటి నుంచే పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం ద్వారా శారీరకంగా, మానశికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కి చిన్నారుల ఆరోగ్యమే ఆలంబన అన్నారు. గ్రాండ్ మాష్టర్ ఆర్.దయామయ మాట్లాడుతూ, విశాఖ కేంద్రంగా బోధి ధర్మ యుద్ధ కళా క్షేత్రం యువతను మార్షల్ ఆర్ట్స్ లో తీర్చిదిద్దడానికి ఎంతో కృషిచేస్తుందన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆయన సూచించారు. స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ పి.గోవింద్ మాట్లాడుతూ, ప్రతీఒక్క ఆడబిడ్డ మార్ట్స్ శిక్షణ తీసుకోవాలన్నారు. ఏయూ సబ్ ఆడిట్ ఆఫిసర్ భరత్ సూర్య మాట్లాడుతూ, చిన్నారులంతా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా చదువులో కూడా చురుకుగా ఉండటానికి వీలుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాహో, సోషల్ వర్కర్ కమ్ మాస్టర్ వెంకట్, శ్రీకాకుళం మాస్టర్స్ లక్ష్మణ్ నాయుడు అధిక సంఖ్యలో విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-12-10 14:17:14

విశాఖలో ఘనంగా జాలాది విజయ జన్మదిన వేడుకలు

తెలుగు సినీ ప్రపంచంలో జాలాది జ్ఞాపకాలు నేటికి అనేక రూపాల్లో పదిలంగానే ఉన్నాయని,  సినీ గేయరచయితగా సమాజాభిృద్ధికి తన వంతు చేయూతనందించడంతో పాటు ఎంతో మంది ప్రజల మన్నననలు పొందిన రచయిత జాలాది ఆశయ సాధనకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని పలువురు వక్తలు కొనియాడారు. సమాజ్ వాద్ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్, రచయిత్రి జాలాది విజయ జన్మదిన వేడుకలు శుక్రవారం ఇక్కడ పౌర గ్రంధాలయంలో ఘనంగా నిర్వహించారు. పలువురు కళాకారులు, కళా సంఘాలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శాసనసమండలి సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, గౌరవ అతిధులుగా పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ జాలాది అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలుగు సినీ రంగంలో నేటికి జాలాది జ్ఞాపకాలు అనేక రూపాల్లో పదిలంగా ఉన్నాయన్నారు. తండ్రి వారసత్వాన్ని ఆసరాగా తీసుకొని కుమార్తె జాలాది విజయ కూడా అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో రాణించాలని వీరంతా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జాలాది విజయ మాట్లాడుతూ తన శక్తి మేరకు సమాజ సేవ చేస్తానన్నారు. ఏ రంగంలో ఉన్నప్పటికి ఆ రంగంలో తాను పలువురికి సాయమందించే విధంగా ముందుకు సాగుతామన్నారు.  పలువురు జాలాది విజయకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నేతలు మేడా మస్థాన్ రెడ్డి, ఖాన్, బయా శ్రీనివాస్, వర్రె నాంచారయ్య, సన్ మూర్తి, రాతో గణేష్ తో పాటు పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-12-01 16:08:01

బ్రెయిలీ లిపిలో మెనూ కార్డు.. సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌

సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌ మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. బ్రెయిలీ లిపిలో తయారు చేసిన మెనూ కార్డులను హోటళ్లు, రెస్టారెంట్లలో అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం నోవాటెల్‌ వరుణ్‌బీచ్‌లోని జాఫ్రాన్‌ రెస్టారెంట్‌లో ఈ మెనూ కార్డును ప్రారంభించారు.  ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.బుచ్చి రాజు, డిఆర్‌ఇహెచ్‌ హెడ్‌ డాక్టర్‌ అల్లు పద్మజ, కేజీహెచ్‌ డాక్టర్‌ వాసుపల్లి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దృష్టి లోపం ఉన్న అతిథులు మెనూను చదివి. ఎవరి సహాయం సహాయం కోరకుండా స్వతంత్రంగా ఆర్డర్‌ చేయగలిగినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు.  యంగ్‌ ఇండియన్స్‌ యాక్సెసిబిలిటీ చైర్‌ డా.త్రిప్తి యర్రామిల్లి, గౌరవ సభ్యురాలు కావ్య పూర్ణిమ, యంగ్‌ ఇండియన్స్‌ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Visakhapatnam

2023-11-28 13:38:25

మిషన్ కర్షక దేవోభవ కార్యాచరణపై మిజోరామ్ గవర్నర్ ప్రశంసలు

రైతుల అభ్యున్నతి కోసం చేపడుతున్న మిషన్ కర్షక దేవోభవ మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని మిజోరామ్ గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు ఆకాంక్షించారు. శనివారం విశాఖలో మిషన్ కర్షకదేవోభవ విశేషాలను ఆడారి కిషోర్ కుమార్ ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో చేపట్టిన అనుభవంతో మిషన్ కర్షక దేవోభవను కూడా దేశవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. రైతే దేశానికి వెన్నుముఖ అని అలాంటి రైతుల కోసం మంచి ఆలోచనతో ఒక ఉద్యమం చేపట్టి గ్రామ స్థాయి నుంచే దానిని అమలు చేస్తుండటం శుభ పరిణామం అన్నారు. రైతులు నకిలీ విత్తనాలు,పురుగు మందుల విషయంలో మోస పోకుండా మంచి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడితే మంచి ఫలితాలు వస్తాయని కిషోర్ కి సూచించారు. వ్యవసాయవిధ్య,పరిశోధనలవైపు విద్యార్ధులకు ఆశక్తి పెరిగే లా కూడా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం కిషోర్ కుమార్ మాట్లాడుతూ, మిషన్ కర్షక దేవోభవలో మొదటి నుంచి విద్యార్ధుల భాగస్వామ్యం చేశామన్నారు. అంతేకాకుండా..త్వరలోనే వ్యవసాయ పరిశోధన కేంద్రాలను సందర్శించి అక్కడ కొత్తరకం వంగడాల విషయాలను తెలుసుకోవడంతోపాటు, వాటిని రైతులకు చేర్చే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. దండగ అనుకునే వ్యవసాయాన్ని పండుగలామార్చేందుకు మిషన్ కర్షక దేవోభవ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని గవర్నర్ కు వివరించారు. అదేవిధంగా గవర్నర్ చేసిన అమూల్యమైన సూచనలు,సలహాలను తప్పక అమలు చేస్తామని కిషోర్ కుమార్ స్పష్టం చేశారు.

Visakhapatnam

2023-11-25 17:06:29