పశ్చిమగోదావరి జిల్లాలో వరదలు, భారీ వర్షాలు కారణంగా వరద తాకిడిగురై నీరు తొలగిన అనంతరం సహాయ చర్యలు ముమ్మురంగా చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వరద నీరు తగ్గిన గ్రామాల్లో మంగళవారం సాయంత్రం నాటికి ఐదు రకాల నిత్యసర వస్తువులను అన్ని గృహాలకు అందజేయడం జరిగిందన్నారు. అలాగే 3,107 వరద బాధిత కుటుంబాలకు సుమారు రూ.62 లక్షలు నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామన్నారు. మిగిలి ఉన్న లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ నెంబర్లను సచివాలయ సిబ్బంది ద్వారా సేకరిస్తున్నామని, పూర్తి వివరాలు అందిన వెంటనే వారి కుటుంబాలకు కూడా నగదును జమ చేయడం జరుగుతుందన్నారు. 22 గ్రామపంచాయతీలలో వరద ప్రభావం ఉందని ఆయా పంచాయతీల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. వీటిలో ఆచంట మండలంలో నాలుగు, ఎలమంచిలి మండలంలో 15, నరసాపురం మండలంలో మూడు పంచాయతీలు ఉన్నాయన్నారు.
పారిశుద్ధ్య పనుల కొరకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణకు 22 మంది పర్యవేక్షణ అధికారులు, 44 మంది సూపర్వైజర్లును, నిర్వహణకు 370 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించడం జరిగిందన్నారు. 14,655 కె.జిల బ్లీచింగ్, 34,465 కె.జిల సున్నం, 380 లీటర్ల పినాయిల్, 54 స్ప్రేలు, 27 ఫాగింగ్ మిషన్స్ సిద్ధం చేయడం జరిగిందన్నారు. అలాగే విద్యుత్ అంతరాయం కలిగిన ప్రాంతాల్లోని ఇప్పటివరకు 15 గ్రామాల్లో విద్యుత్తును పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 1,92,199 ఆహార పొట్లాలు, 11,21,500 వాటర్ ప్యాకెట్లు, 35.595 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,424 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 7 మెట్రిక్ టన్నుల, బంగాళదుంపలు, 1,424 లీటర్లు పామాయిల్, 7 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు, 8,196 లీటర్లు పాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆచంట, యలమంచిలి, నరసాపురం, పెనుగొండ మండలాల్లోని 6,933 పశువులకు 162.45 టన్నుల పశుగ్రాసాన్ని అందజేయడం జరిగిందన్నారు.