1 ENS Live Breaking News

Tadepalli

2021-08-05 03:29:34

ప్రభుత్వ తప్పిదం.. సచివాలయ ఉద్యోగులకు ఇరకాటం..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. అక్టోబరు 2వ స్తే సచివాలయాలు ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతుంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల సచివాలయాల్లోని లక్షా 20 వేల మంది ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సి వుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ కావాలంటే క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను పెడతామని, అది పాసైతే ప్రొబేషన్ అన్న ప్రభుత్వం ఇపుడు అలాంటి పరీక్షలేవీ లేవని, పెట్టబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేక కార్యదర్శి అజయ్ కల్లాం ప్రకటించి ఇక్కడో మెలిక పెట్టారు. సిబీఏసి పరీక్ష అయితే ఉండదు గానీ.. ఆయా శాఖలకు చెందిన డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసవ్వాల్సి వుంటుందని ఇపుడు ప్రకటించారు. వాస్తవానికి 16 ప్రభుత్వ శాఖల్లోని సచివాలయ ఉద్యోగులకు వీరి ఉద్యోగాలకు సంబంధించి శాఖల వారీగా అందరికీ జీఓలు గానీ,  గెజిట్ పబ్లికేషన్లు గానీ ప్రచురించలేదు. అలా ఏశాఖ ఉద్యోగులకై గెజిట్ పబ్లికేషన్లు ప్రకటించారో, జీఓవో పలానా శాఖ డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసవ్వాలని పెట్టారో ఆ మేరకు కొందరే పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. మరికొందరు తమ సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత పదోన్నతుల కోసం తర్వాత రాసుకుందామని వదిలేశారు. కాలక్రమంలో 2 నెలలు తక్కువ రెండేళ్లు గడిచిపోతున్నాయి. దీనంతో కధ మళ్లీ మొదటికి వచ్చింది. ఇపుడు తాజాగా ప్రభుత్వం సర్వీసు రెగ్యులర్ కావాలంటే సచివాలయ ఉద్యోగులకు నిర్ధేశించిన(ఇప్పటికీ కొందరు ఉద్యోగులకు జీఓలు విడుదలచేయకపోయినా) డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసవ్వాలనేది కొత్త నిబంధన పెట్టారు.వాస్తవానికి రాష్ట్రప్రభుత్వం ఏశాఖలో అయినా రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీచేసే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే ప్రత్యేక జీఓలు విడుదల చేసిన తరువాత వాటి ఆధారంగా భర్తీ కార్యక్రమం చేపడుతుంది. ఆపై గెజిట్ పబ్లికేషన్ చేపట్టి ఏ జీఓ ద్వారా అయితే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో.. అందులోనే సర్వీసు రెగ్యులర్ కావడానికి ఏఏ డిపార్టమెంటల్ పరీక్షలు రాయాలో పొందుపరుస్తారు. దీనితో ఉద్యోగాల్లోకి చేరిన వారంతా వారి రెండేళ్ల ప్రొబేషన్  కాలంలో నాలుగు సార్లు నిర్వహించే డిపార్ట్ మెంటల్ పరీక్షలను పాసై తమ సర్వీసులను రెండేళ్లు పూర్తికాగానే రెగ్యులర్ చేయించుకుంటారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని సుమారు 16 రకాల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసే సమయంలో కేవలం గ్రేడ్-5 కార్యదర్శి ఉద్యోగాలకు మాత్రమే గెజిట్ నోటిఫికేషన్(రాజముద్ర) పబ్లిష్ చేసి.. మిగిలిన శాఖ ఉద్యోగుల విషయంలో ఎలాంటి ఉత్తర్వు విడుదల చేయకుండా ఉండిపోయింది.  అలా రాజముద్ర విడుదల చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా చట్ట బద్ధత ఉండదనేది ఒక అంశంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ సమయంలోనే ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ కావాలంటే క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను పెట్టం కానీ సచివాలయ ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ టెస్టులు పాస్ కావాలని చెప్పడంతో... సదరు ఉద్యోగులు డిపార్టమెంటల్ పరీక్షలు పాసైన వారు ఆనందం వ్యక్తం చేస్తుండగా, పరీక్ష రాయని వారు తాము ఆ.. పరీక్షలు పాసయ్యేంత వరకూ రూ.15వేలు జీతంతోనే కాలం వెల్లదీయాలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు ద్వారా శాఖ పరమైన జీఓలు ఉద్యోగాలు భర్తీ చేసే సమయంలో విడుదల చేస్తాయి. ప్రభుత్వం ఏ నిబంధన ద్వారా అయితే జీలో విడుదల చేసి  జిల్లాల్లో కలెక్టర్లకు పంపుతారో దానిని సదరు ప్రభుత్వ శాఖ జిల్లా అధికారులు ఎంపీడీఓ ద్వారా సచివాలయాల్లోని ఉద్యోగులకు జీఓలోని అంశం చేరేటట్టు తెలియజేయాలి. తద్వారా కొత్తగా విధుల్లోకి చేరిన ఉద్యోగాలకు ప్రభుత్వం తమ ఉద్యోగాలకు సంబంధించి ఏఏ నిబంధనలు పెట్టిందో సిబ్బందికి తెలుస్తుంది. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో నేటికీ ఆవిధానం అమలు జరగడం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు. దీనితో ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏ ఏ డిపార్ట్ మెంటల్ పరీక్షలు రాయాలో తెలియకుండా పోయింది. ఆ కారణంతోనే చాలా మంది ఉద్యోగులు డిపార్టమెంటల్ పరీక్షలు రాయలేదు. రెండేళ్ల పాటు ఆయా ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లు ఈ విషయంలో లైట్ తీసుకోవడమే ఇపుడు ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఇపుడు 2 నెలల్లో సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ అవుతుందని తెలిసిన వేళ.. సదరు ప్రభుత్వ శాఖల్లో ఏఏ డిపార్టమెంటల్ పరీక్షలు పాసైతేనే మీ సర్వీసులు  రెగ్యులర్ అవుతాయని చెప్పడంతో ఉద్యోగుల గుండెల్లో మళ్లీ రాయి పడినట్టు అయ్యింది. ఉద్యోగాల్లోకి చేరి దాదాపు రెండేళ్లు కావొస్తున్న సమయంలో ప్రభుత్వం ఇప్పుడా ఆ డిపార్టమెంట ల్ పరీక్షల కోసం మెలిక పెట్టడమా అని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఖచ్చితంగా డిపార్టమెంటల్ టెస్టులు రెండేళ్ల ప్రొబేషన్ సమయంలోనే పాసవ్వాలనే నిభందన  అమలు చేస్తే..ఈ విషయంలో ఆయా ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు, జిల్లా కలెక్టర్లు, జిల్లాశాఖల అధికారులదే తప్పు అవుతుంది. కారణమేంటంటే ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విధి విధానాలు ఏ జీఓ రూపంలో నేటికీ ప్రభుత్వం విడుదల చేయకపోవడమేనని ఉద్యోగులు బల్లగుద్ది చెబుతున్నారు. అప్పటికీ సమాచార హక్కుచట్టం దరఖాస్తు ద్వారా గ్రామ సంక్షేమ, విద్య సహాయకులు తమ పదోన్నతులు సంగతేంటని కోరినా.. రాష్ట్ర అధికారులే ఇంకా అలాంటి నిబంధనలు, ప్రత్యేక అంశాలు ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏమీ పెట్టలేదని, ఒక వేళ పెడితే జిల్లా అధికారుల ద్వారా తెలియజేస్తామని, ఆ సమయంలో వారిని సంప్రదించాలని ఆ సమాచార హక్కుచట్టం దరఖాస్తులో జవాబుగా తెలియజేశారు కూడా. ఈ విషయం ఇప్పటిది కాదు 2020లో జరిగిన సంఘటన ఆ తరువాత కూడా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖల్లో ప్రస్తుత పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే పదోన్నతులు, డిపార్ట్ మెంటల్ టెస్టుల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇద్దామనుకుంటే సమయం చాలానే ఉండేది. కరోనా సమయంలో కాలం రివ్వున తిరిగిపోయినా.. అధికారులు ఎలాంటి జీఓలు విడుదల చేయలేదు. ఇపుడు తాజాగా సర్వీసులు రెగ్యులర్ కావాలంటే కనీసం డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసవ్వాలని ఎలా చెబుతున్నారో తమకు అర్ధం కావడం లేదని.. జిల్లా శాఖల అధికారులు కూడా ఈ విషయం తమకు నోటీసుల ద్వారా కూడా చెప్పలేదని వాపోతున్నారు. సర్వీసు రెగ్యులర్ లో తమకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, తప్పులను కోర్టుకి విన్నవించి న్యాయపోరాటం చేస్తామంటున్నారు ఏ సమాచారం లేకుండా డిపార్ట్ మెంట్ పరీక్షలు రాయకుండా ఉండిపోయిన అభ్యర్ధులంతా. నిజంగా అదే జరిగితే అటు రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిలు, కమిషనర్, జిల్లా స్థాయిలో కలెక్టర్, సదరు జిల్లా అధికారులు కోర్టుముందు సమాధానం చెప్పాల్సి వస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. అలాకాకుండా ఇపుడు వారి సర్వీసులను రెగ్యులర్ చేసి.. ఆపై కొంత సమయం ఇస్తున్నట్టు ప్రకటన చేసి అప్పటి కూడా సచివాలయ ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాస్ కాపోతే అపుడు తమపై చర్యలు తీసుకోవచ్చునని ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా తమ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డికి వినతి పత్రాలు సమర్పించారు తప్పితే.. రాష్ట్ర అధికారులు చేసిన తప్పువలన నేటికీ చాలా మంది డిపార్టమెంటల్ పరీక్షలు రాయలేపోయారని, దానికి కారణం వివిధ శాఖల ఉద్యోగులకు నేటికీ పదోన్నతులు, డిపార్ట్ మెంటల్ పరీక్షలు, సర్వీసు రెగ్యులర్ కి సంబంధించి జీఓలు విడుదల చేయలేదని అడగక పోవడం విశేషం. దీనితో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు మాదిరిగానే అన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శాఖల వారీగా గెజిట్ నోటిఫికేషన్లు, జీఓలు విడుదల చేసి ఒక నిర్ధిష్ట్ ఉత్తర్వులు విడుదల చేస్తే తాము ఈ డిపార్టమెంటల్ పరీక్ష గందర గోళం విషయం నుంచి బయట పడతామని ఉద్యోగులంతా ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేసిన తప్పును ఒప్పుకుంటుందా.. నాలుగైదు ప్రభుత్వ శాఖలను కలిపి ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, నాలుగు శాఖలను కలిపి విద్యా, సంక్షేమ సహాయకులను, రెండు శాఖలను కలిపి సర్వేయర్ల ఉద్యోగాలు స్రుష్టించడం వలనే ఇప్పటి వరకూ ఏ శాఖ తరపున జీఓలు, గెజిట్లు విడుదలచేయక వదిలేశామని ఒప్పుకుంటారో.. లేదంటే తాము చెప్పకపోయినా ప్రస్తుత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల నుంచి ఎందుకు మీరు దాదాపు రెండేళ్ల సమయం పూర్తవుతున్నా తెలుసుకోలేకపోయారని ఉద్యోగులపైనే నెపం అంతా నెట్టేస్తుందో..చూడాలి..!

తాడేపల్లి

2021-08-05 01:42:26

సచివాలయాల్లో సర్వీసు రూల్స్ ఎక్కడ..?

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తిచేసుకోబుతున్నా నేటికీ  కొన్నిశాఖల ఉద్యోగులకు సర్వీసు రూల్స్ ప్రభుత్వం తయారు చేయలేదు. ఈ విషయంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సదరు శాఖలను ఆదేశించలేదో.. లేదంటే ఆ శాఖల ముఖ్య కార్యదర్శిలకు ఖాళీలేకనో తెలీదు కానీ ఉద్యోగుల సర్వీసు రూల్స్ ఫ్రేమ్ చేసే విషయంలో మాత్రం నేటికీ ఒక్క అడుగు కూడా పడలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో కొందరు సిబ్బందిని నాలుగైదు శాఖలను కలుపుతూ ఒక ఉద్యోగంగా తయారు చేసింది ప్రభుత్వం. దీనితో ఏశాఖ తరపున వీరికి సర్వీసు రూల్సు తయారు చేయాలో తెలీక ప్రభుత్వం మధనపడుతోంది. మిగతాశాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, పదోన్నతల విషయంలో ఒక క్లారిటీ వచ్చినా మరికొన్నిశాఖల సిబ్బందికి క్లారిటీ రాకపోవడంతో వారి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా..? లేదా..  తాము జీవితాంతం ఇదే ఉద్యోగం చేయాలా.? అనే అనుమానంతో కొట్టిమిట్టాడుతున్నారు. ఇందులో ముఖ్యంగా విద్య, సంక్షేమ సహాయకులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు ప్రధానంగా ఉన్నారు. విద్య, సంక్షేమ సహాయకులను తీసుకుంటే వీరి ఉద్యోగం(బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గల నాలుగు శాఖలను కలిపి ఒక ఉద్యోగాన్ని తయారు చేశారు), ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను తీసుకుంటే(పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, హౌసింగ్, ఎస్ఎస్ఏ ఇలా ఐదు ప్రభుత్వ శాఖల)ను కలిపి ఒక పోస్టుగా తయారు చేశారు. ఇక సర్వేయర్ల విషయానికొస్తే వీరు ప్రస్తుతం పనిచేసేది రెవిన్యూశాఖ అయినప్పటికీ, వీరికంటూ సర్వే శాఖ ఒకటుంది. అలాగనీ వీరు ఈ రెండు శాఖల అధికారులద దగ్గరా పనిచేస్తున్నారు. వీరంతా అన్ని శాఖలకు సంబంధించిన పనులూ చేస్తున్నప్పటికీ వీరికి ఏశాఖ నుంచి సర్వీసు నిబంధనలు అమలు చేయాలి, వీరికి సర్వీసులో ఏశాఖ నుంచి పదోన్నతి కల్పించాలి అనే విషయంలో క్లారిటీ లేదు.

 ఈ మూడు శాఖలకు చెందిన సిబ్బంది 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 45వేలకు పైనే ఉన్నారు. ప్రస్తుతం అన్నిశాఖలకు సర్వీసు నిబంధనలు, పదోన్నతుల విషయంలో ప్రత్యేకంగా జీఓలు వచ్చినప్పటికీ వీరికి మాత్రం ఎలాంటి జీఓలు రాలేదు. దీనితో తాము ఏశాఖకు చెందిన ఉద్యోగులగా తమను ప్రభుత్వం గుర్తిస్తుందో తెలీక ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రభుత్వం ఇచ్చే జీతం చాలక.. ఉద్యోగాలకు రాజీనామాలు చేసి, మంచి ఉద్యోగాల్లో చేరిపోయారు. అంతేకాకుండా ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 85శాతం ఉద్యోగులంతా పట్టభద్రులే అయినప్పటికీ, వీరి ఉద్యోగం నాల్గవ తరగతికి చెందినదా, 5వ తరగతికి చెందినదా..లేదంటే వీరిని ప్రభుత్వం ఒక ప్రత్యేక సంఖ్య ఉద్యోగులుగా గుర్తించినదా అనేదీకూడా తెలియడం లేదు. వాస్తవానికి ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు, గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలా వ్యత్యాసాలు ఉండటంతో ప్రభుత్వం కల్పించే పదోన్నతుల విషయంలో చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోనీ రెగ్యులర్ ఉద్యోగం కదాని దైర్యం చేసి కొనసాగించుకుందామనుకున్నా..నేటికీ వీరందరికీ సర్వీసు రూల్సు లేకపోవడం, రెండేళ్ల ప్రొబేషన్ కాలం అక్టోబర్ 2తో పూర్తవడంతో తమను ఏ శాఖ కింద ఉద్యోగులుగా ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందోనని వీరిలో ఉత్కంఠ మొదలైంది. ఈ విషయమై ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం ద్రుష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఈ మూడు శాఖల ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 

మరోపక్క మిగిలిన శాఖలకు సంబంధించి సర్వీసు నిబంధనలు అమలు చేసినా, అవి మిగిలిన ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే మరీ తక్కువ స్థాయి పదోన్నతులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నో ఆశలతో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోకి ఉద్యోగులుగా చేరితే తమకి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చే విషయంలో కనీసం ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు ఈ ఉద్యోగం కంటే మంచి ఉద్యోగాలు వచ్చాయని వెళ్లిపోవడంతో, మరికొంత మంది ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదని ఉన్న ఉద్యోగాలను వదిలి వెళ్లిపోతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఏర్పడగా, మరికొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం ఇంకా భర్తీచేయకుండానే వదిలేసింది.. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తోంది తప్పితే.. వీరి సర్వీసు రూల్సు, పదోతన్నల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే పనికి మాత్రం పూనుకోవడంలేదు. మరో విచిత్రం ఏంటంటే మరో మూడు నెలల్లో సర్వీసులు రెగ్యులర్ చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రం ఉద్యోగులందరికీ సర్వీసు రిజిస్టర్లు  ఓపెన్ చేసింది ప్రభుత్వం. అక్టోబరు 2 తరువాత ఆ రిజిస్టర్ లో ఆయా ప్రభుత్వ శాఖలు సర్వీసు నిబంధనల ఆధారంగా ఎంట్రీలు జరపాల్సి వుంటుంది. మరి ఆ సమయంలో ఏ ప్రభుత్వశాఖ కింద ఈ ఉద్యోగులను చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో తెలియన పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందనేది మాత్రం అక్టోబరు 2 దాటేవరకూ ఒక కొలిక్కి వచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు..!

Tadepalle

2021-08-04 02:09:30

ఈఎన్ఎస్ వార్తకు స్పందన.. సచివాలయ ఉద్యోగుల సిబిఏసీ పరీక్ష రద్దు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అక్టోబరు 2 నాటికి ఉద్యోగులందరికీ రెండేళ్ల ప్రొభేషన్ పూర్తయ్యే సమయానికి పెట్టాలనుకున్న క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఈ పరీక్ష వలన ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను, సాంకేతిక కారణాలను, అవసరమైతే కోర్టుకు వెళ్లాలనుకున్న విషయాన్ని కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారికి మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించింది. దీనితో రెండేళ్లపాటు సర్వీసులు అందించిన సచివాలయ ఉద్యోగులకు సిబిఏసీ పరీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారని, ఆయన ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం వెల్లడించారు. సీఎం సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధించిన ఈ పరీక్షలో మినహాయింపు ఇవ్వడం పట్ల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని అన్ని రకాల ముఖ్యవిషయాలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహిస్తూ.. తమకు సహాయ సహకారాలు అందిస్తున్న ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి సచివాలయ ఉద్యోగులు ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విషయంలో ఉద్యోగులంతా సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి ధన్యవాదములు తెలియజేశారు.

తాడేపల్లి

2021-08-03 02:11:18

ఈఎన్ఎస్ వార్తకు స్పందన.. విలేజ్ క్లినిక్స్ లోనూ మెడికల్ టెస్టులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు ఆనుకుని నిర్మిస్తున్న విలేజ్ క్లినిక్స్ లలో 14 రకాల మెడికల్ టెస్టులు చేయడానికి నిర్ణయించింది. గతంలో కేవలం మందులను, సిబ్బందిని మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో, నాటి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ కలను ప్రస్తావిస్తూ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారికి మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించింది. దీనితో స్పందించిన సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నేత్రుత్వంలోని ప్రభుత్వం ప్రాధమిక వైద్యం అందించేచోట, ప్రాధమిక వైద్యపరీక్షలు కూడా అందుబాటులో తేవాలని సంకల్పించింది. ఆపై మందుల సంఖ్యను తగ్గిస్తూ.. మెడికల్ టెస్టులను విలేజ్ క్లినిక్ లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షలో రాష్ట్ర అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్లినిక్ లలో స్టాఫ్ నర్సుతోపాటు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు కూడా అందుబాటులో ఉంటారు. పిల్లకు అన్ని రకాల వేక్సిన్లు ఇక్కడే వేస్తారు. ఆరోగ్యశ్రీకార్డుల సమాచార కూడా వివేజ్ క్లినిక్ లకు మేపింగ్ చేస్తారు. వీటి ద్వారానే ప్రాధమిక వైద్యం అందించి.. మరీ అవసరమైతే ఇక్కడి నుంచే పీహెచ్సీకి, ఆపై జిల్లా ఆసుపత్రులకు రోగులను పంపించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. 62 రకాల మందులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. 12 రకాల ప్రాధమిక వైద్యసదుపాయాలు, టెలీమెడిసిన్, వీడియో కాన్ఫరెన్సు విధానం కూడా అందుబాటులో వుంటుంది. అవుట్‌పేషెంట్‌ ఎగ్జామినేషన్‌ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్‌ హాల్, ఏఎన్‌ఎం క్వార్టర్స్‌కూడా అక్కడే ఉంచుతున్నామన్న అధికారులు దీనివల్ల 24 గంటలపాటు ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారని, 67 రకాల బేసిక్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విలేజ్ క్లినిక్ విధానం దేశంలోనే ఒక వినూత్న విధానమని, వీటి ద్వారా గ్రామీణ ప్రజలు వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను, ఆర్ఎంపీలను ఆశ్రయించే పరిస్థితి ఉండదన్నారు. గ్రామస్థాయిలో వివిధ రకాల మెడికల్ టెస్టులు చేయడం వలన ప్రజల ఆరోగ్యపరమైన భారం పూర్తిగా తగ్గుతుందని అధికారులు చెప్పారు. మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విలేజ్ క్లినిక్ లలో మెడికల్ టెస్టులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది..

తాడేపల్లి

2021-08-03 01:55:13

Tadepalle

2021-08-01 15:49:55

సచివాలయాలున్నా.. మీ-సేవాలదే హవా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల ను ఏర్పాటుచేసి అందులో 745 సర్వీసులను అందుబాటులోకి తెచ్చినా నేటికీ మీ-సేవ సర్వీసులదే అగ్ర తాంబూలాన్ని అందుకుంటున్నాయి.. విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మీసేవా కేంద్రాల్లో 62వేల దరఖాస్తులకు ద్రువీకరణ పత్రాలు ఇస్తే సచివాలయాల్లో కేవలం 21 వేల దరఖాస్తులకు కేవలం 18వేల ద్రువీకరణ పత్రాలు మాత్రమే జారీచేశారు. ఈ సంఖ్య తూర్పుగోదావరి జిల్లాలోని ఓ మండలంలోనిది. ఆధారాలు లేకుండా చెబుతున్న సంఖ్య కాదు, అధికారికంగా తహశీల్దార్ లాగిన్ ద్వారా విడుదల చేసిన సంఖ్య. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తూర్పుగోదావరి రెండవ అత్యధి మండలాలున్న జిల్లాగా ఉంది(64). ఈ జిల్లాలోని ఒక్క మండలంలోనే 16 గ్రామ సచివాలయాలున్నచోట మీసేవా కేంద్రాలు అంతభారీ సంఖ్యలో ద్రువీకరణ పత్రాలు మంజూరు చేశాయంటే..ఇక జిల్లావ్యాప్తంగా ఎన్ని వేలు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని లక్షల ద్రువీకరణ పత్రాలు మంజూరు చేశారో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి గ్రామసచివాలయాలు వచ్చిన తరువాత మీ-సేవ సర్వీసుల సంఖ్య తగ్గాలి. కానీ దానికి విరుద్దంగా సచివాలయాల్లో అత్యల్పంగా సర్వీసులు అందుబాటులోకి వస్తే.. మీ-సేవల ద్వారా సచివాలయాల కంటే నాలుగింతలు ద్రువీకరణ పత్రాలు మంజూరు చేయగలుగుతున్నాయి.

ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం చేసిన తప్పిదమే కనిపిస్తుంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం అన్ని గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను నియమించింది. వారిని నియమించి 20నెలలు గడుస్తున్నా వారికి చట్టబద్ధంగా జీఓనెంబరు 149 ద్వారా  కట్టబెట్టాల్సిన అధికారాలు, బాధ్యతలు ఇవ్వలేదు. అధికారాలు చేతిలో ఏమీ లేకపోవడంతో గ్రేడ్-5 కార్యదర్శిలు కూడా మిన్నకుండిపోయారు. అధికారాలు ఇవ్వకుండా తాము ఎలా పనిచేయాలో తెలియడం లేదని సమాధానం చెబుతున్నారు. తద్వారా ప్రభుత్వం అక్షరాల కోల్పోయిన ఆదాయం చూసుకుంటే కోట్ల రూపాయల్లోనే ఉంది. అటు ప్రభుత్వం కూడా సేవలైతే అందుబాటులోకి తెచ్చింది గానీ, ఆయా ప్రభుత్వశాఖలకు మీసేవాలను అనుసంధానం మాత్రం చేయలేదు. దీనితో ఏ సేవ కోసం సచివాయాలకు వచ్చినా ప్రజలకు ఇక్కడ ప్రస్తుతం ఆ సేవలు అందుబాటులో లేవనే సమాధానమే వచ్చేది. ఇక్కడలేని సేవలు మీ-సేవలోనే ఉంటాయని భావించి అందరూ అక్కడి నుంచే వివిధ రకాల ద్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. నాటి నుంచి నేటి వరకూ సచివాలయాల్లో అందించే సేవలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో నేటికీ అత్యవసర పనులకు వారంతా మీ-సేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. అలా రాష్ట్రంలో మీసేవా కేంద్రాలు 60శాతం సర్వీసు రిక్వెస్టులకు ద్రువీకరణ పత్రాలు మంజూరు చేయగలిగితే.. కేవలం రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాలు కేవలం 40శాతం ఒక్కోసారి తక్కువగా 30 శాతం కూడా కొన్ని జిల్లాల్లో సర్వీసులు మాత్రమే ఇస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

వాస్తవానికి గ్రామవాలంటీర్లు, 12శాఖల సిబ్బందితో పూర్తిస్థాయిలో సేవలు అందించే సచివాలయాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా అధికారాలు కట్టబెట్టగలిగితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగేది. కేవలం పంతానికి పోయి, ఆ అధికారాలన్నింటినీ గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల చేతిలోనే ఉంచేయడంతో వీరి ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు అందకుండా పోయాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. సీనియర్ పంచాయతీ కార్యదర్శిలకు ఒక్కొక్కరికీ రెండు నుంచి మూడు పంచాయతీలు ఇన్జార్జి బాధ్యలు, డిప్యూటేషన్లు అప్పగించడం, ప్రధాన సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులోకి లేకపోవడంతో సచివాలయం నుంచి అందించే సేవలు ఏ రకంగా ప్రజలకు అందుతున్నాయో తెలుసుకోలేని పరిస్థితి. మిగిలిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు సచివాలయాల్లోనే ఉన్నా..వారికి అధికారాలు ఇవ్వకపోవడంతో.. తమని ప్రభుత్వం ఏ తరహా పనులు పురమాయించిందో అవే పనుల్లో వారు నిమగ్నం అయిపోతున్నారు. ఈ తరుణంలో సచివాలయాలకు రావాల్సిన సర్వీసు రిక్వెస్టులన్నీ మీ-సేవా కేంద్రాలకు తరలిపోతున్నాయి. 

ఇలా ప్రభుత్వానికి కోట్ల రూపాయాల్లో ఆదాయం పోతుండటమే కాకుండా, అసలు సచివాలయాల్లో ఎన్ని సేవలు అందుతున్నాయో కూడా ప్రజలకు అవగాహన కలగడం లేదు. ఇదే విషయాన్ని గ్రేడ్-5 కార్యదర్శిలు మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో డీపీఓ, కలెక్టర్, రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రాలు సమర్పించినా జీఓనెంబరు 149పై ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో అధికారం ఇవ్వకుండా తామెలా పనిచేయగలమంటూ వారు కూడా ప్రభుత్వాన్నిప్రశ్నిస్తున్నారు. ఫలితంగా సచివాలయాలకు వివిధ సేవల ద్వారా రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది. సచివాలయాలున్న.. మీ సేవా కేంద్రాలదే అగ్రరాజ్యమవుతుంది. ఒక రోజులో ఒక్కో సచివాలయంలో సగటు పది సర్వీసు రిక్వెస్టులకు ద్రువీకరణ పత్రాలిస్తే..మీ-సేవా కేంద్రాల్లో మాత్రం రోజుకి 20 నుంచి 60 వరకూ సర్వీసు రిక్వెస్టులు పూర్తిచేయగలుగుతున్నారు. ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, గ్రామ, వార్డు సచివాలయాలకు జాయింట్ కలెక్టర్లు మారారు. వీరైనా ఈ జీఓనెంబరు 149పై ద్రుష్టిసారితే గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు వచ్చి, గ్రామ సచివాలయాల ద్వారానే ప్రజలకు అన్ని రకాల సేవలు అంది ప్రభుత్వానికి ఆదాయం కూడా కోట్ల రూపాయాల్లో అందుతుంది. అలా కాకుండా  అధికారాలన్నీ గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల చేతుల్లోనే ఉంచేస్తే మాత్రం ఇదే పద్దతి కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది..!

Tadepalle

2021-08-01 06:43:33

స్టేట్ లిటిగేషన్ పాలసీ సమర్థవంతంగా అమలు..

నూతనంగా తీసుకురానున్న స్టేట్ వ్యాజ్యం(Litigation) పాలసీని సమర్థ వంతంగా అమలు చేస్తే జాప్యం లేకుండా కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ పేర్కొన్నారు.శనివారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో  వ్యాజ్యాలు (Litigation)అంశంపై న్యాయ అధికారులు,కార్యదర్శులతో ఇంటరాక్టివ్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో పాల్గొన్న సిఎస్ మాట్లాడుతూ స్టేట్ లిటిగేషన్ పాలసీని నిరంతరం మానిటర్ చేస్తూ పటిష్టంగా అమలు చేస్తే కేసుల్లో జాప్యాన్ని నివారించి సత్వరం పరిష్కారం అయ్యేలా చూడవచ్చని అన్నారు.ఈ విధానంతో కేసులు వివరాలు ప్రభుత్వ న్యాయవాదులకు, ప్రభుత్వ శాఖలు అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తాయని తద్వారా సకాలంలో ఆయా కేసుల్లో కౌంటర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక ఈ విధానాన్ని సమన్వయంతో ఒక నిర్దిష్ట కాలవ్యవధి తో నిర్వహించ గలిగితే కోర్టులపై ప్రభుత్వ వ్యాజ్యాల భారాన్ని తగ్గించ వచ్చని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ను మరింత బలోపేతం చేసేందుకు ఈ పాలసీ దోహదం చేస్తుందని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ చెప్పారు.అందుకే ఎపి ఆన్ లైన్ లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు.దానివల్ల జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులకు సంబంధించిన వివిధ వ్యాజ్యాల సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు.దీనిపై ప్రభుత్వ శాఖల అధికారులకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ చెప్పారు.

సమావేశంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరాం మాట్లాడుతూ ప్రభుత్వ న్యాయవాదులు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆదిశగా కృషి చేయాలని కోరారు. అంతకుముందు ఈసమావేశంలో  నూతన లిటిగేషన్ పాలసీపై విస్తృతంగా చర్చించారు.అదేవిధంగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఆయా శాఖలకు సంబంధించిన విధానాలు,నిబంధనల ప్రేమ్ వర్క్ గురించి ప్రభుత్వ న్యాయవాదులు(GP)లకు నిరంతరం వివరించే మెకానిజం ఏర్పాటు చేయడం ద్వారా వివిధ వ్యాజ్యాలు అడ్మిషన్ స్థాయిలోనే కంటెస్ట్ చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

అదే విధంగా వివిధ వ్యాజ్యాలపై పీరియాడికల్ సమీక్ష, ఫెల్యూర్ పై జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేయడంపై న చర్చించారు. అంతేగాక ఆన్లైన్ కేసు లోడ్ మేనేజిమెంట్ సిస్టమ్ (OLCMS)అమలు విధానం పైన సమీక్షించారు.అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ ప్లీడర్ల (GP)లో కార్యాలయాలను మరింత బలోపేతం చేయడం తోపాటు ఆకార్యాలయాల్లో ఆన్ లైన్ కేసు లోడ్ మేనేజిమెంట్ సిస్టమ్ (OLCMS)ను ప్రవేశ పెట్టడంపై చర్చించారు. అంతేగాక ప్రతి ప్రభుత్వ శాఖలోను లైజన్ అధికారులు, లీగల్ ఆడ్వయిజర్లను నియమించుకునే అంశంపై చర్చించారు. కోర్టు కేసుల నిర్వహణ పై మార్గదర్శకాలు జారీ, అధికారులకు అవగాహన అంశాలపై చర్చించారు.

ఈసమావేశంలో ,రాష్ట్ర ఆదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్ రెడ్డి,న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీతతో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు, పలువురు న్యాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-07-31 17:13:00

సంక్షేమ సహాయకులకు పదోన్నతులు లేవు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ శాఖలో పనిచేసే ఉద్యోగికైనా సర్వీసులో పదోన్నతులు ఉంటాయి..విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్యా సంక్షేమ సహాయకులకు మాత్రం వారి ఉద్యోగాల్లో మాత్రం పదోన్నతులు లేవట. ఇదే ఎవరో అన్నమాట కాదు. సాక్షాత్తూ.. ప్రభుత్వమే ఈ విషయాన్ని సమాచార హక్కుచట్టం దరఖాస్తుపై ఇచ్చిన క్లారిటీ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న విద్యా, సంక్షేమ సహాయకులకు ఇప్పటి వరకూ పదోన్నతులపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని, దానిపై ఇప్పటి వరకూ సర్వీస్ రూల్స్ పై దానికోసం నిర్ధేశాలు జారీ చేయలేదని, కనీసం డిపార్ట్ మెంటల్ టెస్టులు కూడా పెట్టలేదని, దానికి సంబంధించిన కారణాలను కూడా పొందు పరచలేదనే విషయాన్ని పేర్కొంది. అయితే ఈ సమాచారం ఇప్పటిది కాదు.. 30-09-2020న కర్నూలుకి చెందిన కె.శ్రీరాములు అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకి  సంక్షేమశాఖ డైరెక్టర్ కె.హర్షవర్దన్ 30-09-2020న ఇచ్చిన సమాధానం. ఇదెందుకు మీకు ఇపుడు గుర్తొచ్చిందనే అనుమానం కూడా ఈ వార్త చదువుతున్న వారికి రావొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులను నిబంధనలకు లోబడి రెండేళ్లు పూర్తికావస్తొన్న సందర్భంగా.. క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టి అందులో పాసైన వారికే ప్రభుత్వం ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని ప్రకటించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా ఆందోళన చేస్తున్న వేళ ఈ ఆర్టీఐ సమాచారం కూడా ఉద్యోగుల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అలాగని నాటి నుంచి నేటి వరకూ విద్యా సంక్షేమ సహాయకుల పదోన్నతుల విషయమై ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీనితో రెండేళ్లు గడుస్తున్నా తమ ఉద్యోగాల్లో పదోన్నతులపై సరైన వివరణ ఇవ్వని ప్రభుత్వం.. టంచనుగా ప్రొబేషన్ పూర్తైన తమకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టడానికి సిద్ధమైపోయిందని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశేషం ఏంటంటే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ విద్యా, సంక్షేమ సహాయకుల ఉద్యోగులను సచివాలయాల్లో నియమించేందుకు బిసీవెల్ఫేర్, ఎస్సీవెల్ఫేర్, మైనార్టీవెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇలా నాగు శాఖల ఉద్యోగాలను కలిపి తమ ఒక్క శాఖగా మార్చేసిందని.. తద్వారా ఇక్కడ మూడు శాఖల్లో ఉద్యోగాలు కూడా రద్దైనట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇన్నిచేసి, తమకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం రెండేళ్ల సమయంలో సర్వీస్ రూల్స్ ని మాత్రం తయారు చేయలేదని, అలాగని పదోన్నతుల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ నిరుపేద కుటుంబాలకు అందించే తమ ఉద్యోగాలు, పదోన్నతులపై క్లారిటీ లేకపోతే తాము జీవితాంతం ఈ ఉద్యోగమే సచివాలయాల్లోనే చేయాలా.. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా తమకు ఎలాంటి పదోన్నతులు ఉండవా, ఇదెక్కడి ప్రభుత్వ ఉద్యోగమో తమకు తెలియడం లేదని అంతా తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 20 వేల మంది ఉద్యోగాల్లో కొన్ని శాఖలకే ప్రభుత్వం సర్వీస్ రూల్స్, గెజిట్ నోటిఫికేషన్(రాజపత్రం) విడుదల చేసిందని, తమ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీచేయపోవడంతో తాము ఏ ప్రభుత్వశాఖకు చెందుతామో మాకే అర్ధం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాగని సచివాలయాల్లోనైనా అన్ని వసతులు ఉన్నాయా అంటే అదీలేదని, కనీసం ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో సొంత మొబైల్ ఇంటర్నెట్, తమ కంప్యూటర్లతోనే పనులు చేస్తూ ప్రజలకు సేవలు చేయాల్సి వస్తుందని విద్యా, సంక్షేమ సహాయకులు కన్నీరు మున్నీరవుతున్నారు.  ఈ సమయంలో చాంతాడంత సిలబస్ సర్వీసు రెగ్యులర్ చేయడానికి మూడు నెలల ముందు ఇచ్చి దీని ద్వారా ప్రభుత్వం పెట్టే పరీక్ష పాసవ్వాలని.. లేదంటే ప్రస్తుతం ఉన్న రూ.15 వేల జీతంతోనే మళ్లీ పరీక్ష పెట్టే వరకూ పనిచేయాలని నిబంధన పెట్టడం ఎంతవరకూ సమంజసమని వీరంతా ప్రశ్నిస్తున్నారు.

రెండేళ్లు గడస్తున్నా నేటికీ ప్రతీ చిన్న పనికీ పంచాయతీలపైనే ఆధార పడాల్సి వస్తుందని, సచివాలయాలు ఏర్పాటు చేసినా వాటికి స్వయం పతిపత్తి లేదని, కనీసం పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి ఇచ్చిన జీఓనెంబరు 149ని అమలు చేయడం ద్వారా గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు, పరిపాలన అనుమతులు ఇస్తే కనీసం కాస్తైనా సౌలభ్యంగా వుంటుందని వీరంతా వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10వేల గ్రామ పంచాయతీల్లో గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు 1852, గ్రేడ్-2లో 703, గ్రేడ్-3లో 1679, గ్రేడ్-4లో 2907 మంది పనిచేస్తున్నారని వీరంతా చెబుతున్నారు. అందులో ఒక్కో  సీనియర్ కార్యదర్శికి రెండు మూడు పంచాయతీలు ఇన్చార్జిలు, డిప్యూటేషన్లు వేయడంతో కనీస అవసరాలు కూడా వారంతా వచ్చేంత వరకూ తీరడం లేదని, ఒక్కో సారి అత్యవసర సమయంలో తమ సొంత డబ్బులే పెట్టుకొని పనులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. అలాగని చేసిన పనులకు, ఖర్చుకి తిరిగి పంచాయతీల నుంచి వస్తున్నాయా అంటే అదీలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా అధికారాలు ఇస్తే కనీసం నిత్యం తమకు అందుబాటులో ఉండే వారి ద్వారానైనా పనులు జరుగుతాయంటే.. దానిని కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై గ్రేడ్-5 కార్యదర్శిలను ప్రశ్నిస్తే.. ప్రభుత్వం ఏవిధంగా పనిచేయమంటే తాము ఆవిధంగా పనిచేయాలని, ఇప్పటికే తాము కూడా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎక్కడా కనీసం ఫలితం కూడా రావడం లేదని చెబుతున్నారని విద్యా, సంక్షేమ సహాయకులు వాపోతున్నారు.

2019 అక్టోబర్ 2న ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నేటికీ ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఏఏ ఉద్యోగులు ఏఏ శాఖల కిందకు వస్తారు. వారికి ఎలాంటి పదోన్నతులు ఉంటాయి, వారు ఎవరికీ జవాబుదారీ, కొన్ని ఉద్యోగాలకే గెజిట్లు(రాజపత్రం) విడుదల చేసి, మిగిలిన శాఖల ఉద్యోగుల కోసం ఎందుకు రాజపత్రాలు విడుదల చేయలేదు, అసలు వీరి ఉద్యోగాలు ఎప్పటికి రెగ్యులర్ అవుతాయో కూడా సరైన క్లారిటీ ఇవ్వడంలో నేటికీ ప్రభుత్వంలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ నుంచి అనుబంధ శాఖల నుంచి కూడా క్లారిటీ రాలేదు. దీనితో తమ ఉద్యోగాలు జీవితాంతం రూ.15వేలు జీతంతోనే అరకొర వసతులతోనే పనిచేయాలేమో అనుమా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో వీరి ఆందోళన తారాస్థాయికి చేరుకోవడంతో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని వివిధ శాఖల ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో జరిగే సంభాషనలు ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేస్తున్నాయానే అనే అనుమానాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జూలై నెల పూర్తైపోయింది..ఇక మిగిలింది ఆగస్టు, సెప్టెంబరు, నెలలు మాత్రమే. అక్టోబరు 2నాటికి ఎంత మంది వార్డు, సచివాలయ ఉద్యోగుల ఉద్యోగాలు సర్వీసులను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందో.. అదే సమయంలో సంక్షేమ, విద్యా సహాయకుల ఉద్యోగాలకు పదోన్నతులపైనైనా మార్గనిర్ధేశకాలు ఇస్తుందో.. అవేమీ చేయకుండా.. ఖజానాపై సుమారు 300 కోట్లకు పైనే భారం పడుతుందని, వీరి సర్వీసుని మరో రెండేళ్లు ఇదే జీతానికి పనిచేసేలా అడుగుడుగునా ప్రత్యేక పరీక్షల పేరుతో మరికొంత కాలం కాలయాపన చేస్తుందా అనేది తేలాల్సి వుంది..!

Tadepalli

2021-07-31 01:41:33

జర్నలిస్టు హెల్త్ స్కీం ప్రీమియం చెల్లించాలి..

రాష్ట్ర వ్యాప్తంగా క్రొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం రూ. 1250/- cfms.ap వెబ్ సైట్ ద్వారా క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ను 2021-22 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, 31 మార్చి, 2022 వరకు అమలులో ఉండే ఈ పధకానికి  జర్నలిస్టు వాటాగా రూ. 1250/- చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ. 1250/- లను చెల్లిస్తుందని కమిషనర్ తెలిపారు. అక్రిడిటేషన్ల మంజూరుకు అడ్డంకులు తొలగిన నేపధ్యంలో జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జర్నలిస్టులు cfms.ap వెబ్ సైట్ నందు DDO Code:8342–00–120-01-03-001-001 VN, DDO Code : 2703–0802–003 నందు తమ వాటాను చెల్లించాలని ఆయన సూచించారు.  ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, అక్రిడిటేషన్ కార్డు జిరాక్సు కాపీ, రెన్యువల్ జర్నలిస్టులయితే హెల్త్ కార్డు జిరాక్స్ కాపీలను రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు విజయవాడలోని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనరేట్ కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులైతే సంబంధిత జిల్లా కేంద్రంలో గల సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయవలసిందిగా ఆ ప్రకటనలో తెలిపారు.

Tadepalle

2021-07-30 16:04:24

ఇక న్యాయపోరాటంతోనే సర్వీస్ రెగ్యులర్..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసును కోర్టును ఆశ్రయించి సాధించుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేపట్టినపుడు కనీసం మూడు నెలలు కూడా శాఖ పరమైన శిక్షణ ఇవ్వకుండా ఇపుడు ఏకంగా గ్రూప్-1 స్థాయిని తలపించేంత సిలబస్ ఇచ్చి ప్రొబేషన్ పూర్తైన సచివాలయ ఉద్యోగులకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టి అందులో పాసైన వారికే ప్రభుత్వం ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని చూస్తుంది ప్రభుత్వం. దీనితో ఇప్పటికే ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి నియామకాల్లో విడుల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా కాకుండా ప్రత్యేకంగా పరీక్ష పెట్టడానికి వీరితోపాటు అన్ని సుమారు 16 కేటగిరీల్లోని సచివాలయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అందునా రెండేళ్లు పాటు పరీక్షలు పెట్టకుండా కేవలంల అక్టోబరు 2 నాటికి రెండేళ్లు ప్రొబేషన్ కాలం పూర్తవుతుందనగా కొండంత సిలబస్ ఇచ్చి ఇపుడు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు లేకుండా జీఓనెంబరు2 ద్వారా వీఆర్వోలకు అధికారాలు కట్టబెట్టడం, పంచాయతీరాజ్ చట్టాన్ని, ఆర్టికల్ 73కు వ్యతిరేకంగా డిడిఓ అధికారాలు వీఆర్వోలకు బదలాయించిన విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 అంతేకాకుండా జీఓనెంబరు 149ని అమలు చేయకుండా గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల వద్దే పంచాయతీల్లో అధికారాలు ఉంచేసింది ప్రభుత్వం. ఈ విషయంలో ఎన్నిసార్లు గ్రేడ్-5 కార్యదర్శిలు ఎందరు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇపుడు ఇదే సమయంలో ఇపుడు సచివాలయ ఉద్యోగులందరికీ ఒకేసారి ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తే సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందనే ఉద్దేశ్యంతో సచివాలయ ఉద్యోగులకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష అది పాసైతేనే సర్వీసు రెగ్యులర్ చేస్తామని లేదంటే ప్రొబేషన్ మరికొంత కాలం పెంచుతామని..ఉద్యోగాలు మాత్రం తీయని చేసిన ప్రభుత్వ ప్రకటన ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాలలను రేకిత్తిస్తోంది. ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో లేనివిధంగా కేవలం రూ.15వేల జీతంతో రెండేళ్లు పనిచేయించుకొని, ఇపుడు ప్రభుత్వం ఈ విధంగా మాట మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క గ్రామ విద్యా, సంక్షేమ సహాయకులకు సైతం ఈ ఉద్యోగం తరువాత వీరికి ఏ విధంగా ప్రమోషన్లు ఇస్తాయో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఇదే విషయాన్ని ఇటు వారు కూడా సామాజిక మాద్యమాల్లో ప్రభుత్వానికి దాఖలైన సమాచార హక్కచట్టం దరఖాస్తుకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారాన్ని తెలియజేస్తున్నారు. 

మరోపక్క మహిళా పోలీసులు సైతం డిగ్రీ చదువుకున్న తమను సాధారణ పోలీస్ కానిస్టేబుళ్లుగా ప్రభుత్వం గుర్తించి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇస్తామని జీఓనెంబరు 59 ద్వారా ప్రకటించడంతో వారు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉన్నత విద్య ఉన్న తమకు ఎస్ఐగా ప్రమోషన్లు ఇవ్వాలని వీరంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అటు అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్, ఫిషరీష్,  యానిమల్ హజ్బండరీ సహాయకులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సైతం ఈ ఉద్యోగం తరువాత ఏ స్థాయి ప్రమోన్ ఇస్తారో వారికి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు.  ఇలా గ్రామ, వార్డు సచివాలయ శాఖల్లోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ,వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న లక్షా 20వేల మంది ఉద్యోగులు భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. ప్రభుత్వం పెడతామన్న పరీక్ష పాస్ కాకపోతే మరో ఏడాది పాటు రూ.15వేల జీతంతో ఎలా బతకాలనీ.. నిత్యవసర సరకుల ధరలు అమాంతంగా పెరిగిన సమయంలో వచ్చే జీతమే ఎటూ చాలడం లేదని ఉద్యోగులంతా గగ్గోలు పెడుతున్నారు. తమతో రెండవ శనివారాలు, ఆదివారాలు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా పనులు చేయించుకుని ఇపుడు తీరా ఉద్యోగాలు రెగ్యులర్ చేసే సమయానికి కొత్త కొత్త నిబంధనలు తెరపైకి తీసుకు వస్తున్నారని ఉద్యోగులంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఇన్ని ఇబ్బందులు నడుమ తమ ఉద్యోగాలు రాజమార్గంలో రెగ్యులర్ కావాలన్నా..భవిష్యత్తులో ప్రభుత్వం ప్రత్యేక పరీక్ష పాసవ్వాలనే మెలిక పోవాలన్నా.. పేస్కేలు అమలై జీతం పెరగాలన్నా న్యాయస్థానం ఒక్కటే సరైన మార్గమని భావించి ఆదిశగా అన్నిశాఖల ఉద్యోగులు కోర్టు ఆశ్రయించాలని, దానికోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, ఆ తరువాత వచ్చిన జీఓలు, గెజిట్ నోటిఫికేషన్ ఆర్డర్లు, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వమే ఇచ్చిన అధికారక సమాధానాలు, ఇప్పటి వరకూ తమ ఉద్యోగాల్లో కోల్పోయిన పేస్కేలులోని మొత్తం, ప్రభుత్వం పెట్టబోయే పరీక్ష కాకపోతే మరో ఏడాది పాటు కోల్పేయే జీతం ఇలా అన్ని అధారాలను కోర్టు ముందుంచి న్యాయం కోరాలని చూస్తున్నారట. అటు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు 8 డిఏలు, ఒక పీఆర్సీ అమలు చేయలేదు. వారికి సిపిఎస్ కూడా రద్దు చేయలేదు. ఇపుడు వారి జాబితాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేరనున్నారు. వీరంతా ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినా.. సహకారం అందించకపోయినా భారీ స్థాయిలో ప్రభుత్వం వీరి నుంచి మద్దతు కోల్పోపోయే ప్రమాదం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాడు టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పులు, ఉద్యోగుల డిమాండ్ల పట్ల నిర్లక్ష్యం కంటే.. నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అంతకంటే తప్పులు చేసే దిశగా పయనిస్తుందని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఏవిధమైన నిర్ణయం తీసుకుంటోందోనని అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు 40 మంది ఉన్న సలహాదారుల్లో ఒక్కరు కూడా ఈ ఉద్యోగుల విషయంలో సీఎంకు సరైన సలహాలు ఇవ్వకపోగా, ఉద్యోగ వ్యతిరేక విధానాలనే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాటినే ఇపుడు ఉద్యోగుల సామాజిక మాద్యమ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందనేది..!

Tadepalle

2021-07-30 01:57:29

ఆ ప్రచారం అంతా అవాస్తవం..

రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసుకునే క్రమంలో పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందనే ప్రచారం అవాస్తవమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ స్ధితిగతులను వివరించేందుకు బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి సమాచార శాఖా కమిషనరు టి.విజయకుమార్‌రెడ్డితో కలిసి విజయవాడలోని ఆర్ అండ్ బి భవన సముదాయంలో మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణ దువ్వూరి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి అప్పుల విధానంపై ప్రతిపక్ష పార్టీలు, కొన్ని మీడియా సంస్ధలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తలసరి ఆదాయం ఏపికి వనరులు జనాభాతో పోలిస్తే సగం మాత్రమేనన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై వక్రీకరించి ప్రజలను తప్పుదోవపట్టించేలా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఇటువంటి చర్యల వలన ఆర్ధిక సంస్ధలను కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించడమేనన్నారు. ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసుకునేందుకు రుణాలు తీసుకోవడం ఎ ప్పటినుండో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానమని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదేవిధానాన్ని అనుసరిస్తున్నాయని ఈవిషయాన్ని ప్రతిపక్షాలు గుర్తెరెగాలని అన్నారు. 

ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం రుణం 17.15 శాతంమేర పెరిగితే రాష్ట్ర ప్రభుత్వ రుణం 15.26 శాతం మాత్రమే పెరిగిందని ఆయన వివరించారు. రాష్ట్ర విభజననాటికేమన రాష్ట్రంపై ఎ న్నో వేల కోట్ల రూపాయలు రుణం ఉందని దీనికి తోడు గత ప్రభుత్వం కూడా వేల కోట్ల రూపాయలను రుణం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రం తీసుకున్న రుణం విపరీతంగా పెరిగి పోయిందన్నారు. విభజన తర్వాత ఏపికి రూ. 97 వేల 102 కోట్లు అప్పు మిగలగా, ఐదేళ్లలో రూ. 2 లక్షల 68 వేల 225 కోట్ల రూపాయలకు పెరిగిపోయిందన్నారు. 2021 మార్చి నాటికి రాష్ట్ర అప్పు రూ. 3 లక్షల 56 వేల 172 కోట్లకు చేరిందని ఆయన అన్నారు. 2016-17, 2017-18, 2018-19 ఆర్ధిక సంవత్సరాలలో అప్పటి ప్రభుత్వం రూ. 16 వేల కోట్ల మేర పరిమితికి మించి అప్పులు చేసింది వాస్తవం కాదా అన్నారు. విభజన నాటికి రూ. 14 వేల కోట్లు ఉన్న అప్పులు గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 2019 మార్చి నాటికి రూ. 39 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ క్రింద రూ. 58 వేల కోట్లుగా ఉందని ఆయన అన్నారు. విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించి వ్యయం 2014లో రూ. 2893 కోట్లు ఉండగా, గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 2019 నాటికి రూ. 21540 కోట్లుగా ఉందన్నారు. 

ఈపరిస్ధితుల్లో 2019లో అధికారం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసి పెట్టుబడులు తీసుకురావడంతోపాటు ప్రజల జీవన అవసరాలు మెరుగుచేసే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు రుణాలను తీసుకోవడం జరిగిందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అనూహ్యంగా రాష్ట్ర ఆర్ధిక స్ధితిగతులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. 2020-21లో రూ. 7780 కోట్లు కేంద్ర పన్నుల వాటాలో నష్టం, రాష్ట్ర పన్నుల్లో రూ. 7 వేల కోట్లు నష్టం, కోవిడ్ వ్యయం రూ. 8 వేల కోట్ల రూపాయలతో కలిపి మొత్తం రూ. 24 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్నారు. ఈపరిస్ధితుల్లో అప్పుచేయడం తప్పని పరిస్ధితిగా మారిపోయిందన్నారు. అప్పులు పెరగలేదని తమ ప్రభుత్వం చెప్పడం లేదని ప్రజలకు మేలు చేయాలన్నదే ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి పాలనా లక్ష్యమన్నారు. ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుని ఒక్క సంక్షేమ పధకం కూడా ఆగకుండా సమయానికి లబ్దిదారులకు ఖాతాలలో సొమ్ము జమచేయడమే ఇందుకు నిదర్శనం అని ఆయన అన్నారు. తీసుకున్న రుణంలో ఏఒక్క రూపాయి వృధాచేయ లేదని, పారదర్శకంగా అభివృద్ధికి ఖర్చు చెెస్తున్నామని ఇంతవరకూ రూ. లక్ష కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పధకాల క్రింద నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి అన్నారు.

Tadepalli

2021-07-28 15:57:34

నాడు-నేడుకి లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్లు విరాళం..

నాడు-నేడు పధకం రెండో విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్‌ ల్యాబ్స్‌ తరపున నాలుగు కోట్లరూపాయలను సీఈవో డాక్టర్‌ చావా సత్యనారాయణ విరాళంగా అందజేశారు. మొత్తానికి సంబంధించిన చెక్కును,  పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు  అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ, మూడు, నాలుగు విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్‌ ల్యాబ్స్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎంకు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు.  లారస్‌ ల్యాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా కృష్ణ చైతన్య, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా నరసింహరావు, కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-07-28 15:36:03

ప్రభుత్వంపై రూ.300 కోట్ల భారం పడకూడదనే..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని లక్షా 20వేల మంది ఉద్యోగాలను అక్టోబరు 2 తరువాత రెగ్యులర్ చేస్తే ఖజానాపై నెలకు రూ.300 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుంది. అదీ ప్రభుత్వం సచివాల ఉద్యోగులకు నియామక ఉత్తర్వుల్లో 2015 పీఆర్సీ నిబంధనలకు లోబడి ఇచ్చిన పేస్కేలు ఆధారంగా..  అదే ప్రొబేషన్ పూర్తైన సచివాలయ ఉద్యోగులకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టి అందులో పాసైన వారికే ప్రభుత్వం ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని బావించింది. అలా చూసుకుంటే ఎంత మంది పాసవుతారో ప్రస్తుత పరిస్థితిలో చెప్పలేనివిధంగా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగంలోనైనా నియామక సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన పేస్కేలు మొత్తం అమలు చేసి జీతాలు ఇస్తారు. కానీ ప్రొబేషన్ మాత్రం రెండేళ్ల తరువాతే చేస్తారు. ఆ రకంగా చూసుకున్నా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు లక్షకు పైగా చేరడంతో ప్రభుత్వం వీరికి  రూ.15వేలు జీతమనే లక్ష్మణ రేఖ పెట్టింది. ఈ నిబంధనకు లోబడి ఉద్యోగాల్లో చేరినందుకు ఒక్కో సచివాలయ ఉద్యోగి రెండేళ్లలో కోల్పోయిన జీతం రూ.2.40లక్షలు(ప్రస్తుత పేస్కేలు ఆధారంగా రమారమీ రూ.25వేలు జీతం వస్తే). ఈ మొత్తం జీతం పోయినా రెండేళ్ల తరువాత ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయనుకున్న ఉద్యోగులకు ప్రభుత్వ ప్రకటన గుండెళ్లో రాయిపడేసినంత పనిచేసింది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఉద్యోగం గ్రూప్-4 కేడర్ ఉద్యోగమే అయినా వీరందరికీ క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పాస్ కావాలంటే ఇచ్చిన సిలబస్ మాత్రం గ్రూప్-1  సిలబస్ ను తలపించేదిగా ఉందని ఉద్యోగులు భయపడిపోతున్నారు. 

ప్రభుత్వం ఇంతస్థాయిలో సిలబస్ ఇచ్చే ఆలోచన ఉంటే ఈ రెండేళ్లలో ఈ తరహా ఉద్యోగం ఎప్పుడైనా పెట్టి ఉండవచ్చునని, ఉద్యోగులందరికీ ఈ పరీక్ష పాస్ కాకపోతే ప్రొబేషన్ పూర్తవదనే నిబంధన అప్పుడే పెట్టి ఉంటే ఈ రెండేళ్లలో అందరు ఉద్యోగులం పాస్ అయ్యేవారమని.. ఇపుడు ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని అంతా ఆశగా ఎదరుచూసే సమయానికి క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పాసైతేనే ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని.. అపుడు మాత్రమే పేస్కేలు వర్తిస్తుందని చెప్పడం పద్దతి కాదని ఉద్యోగులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 20వేల మంది ఉద్యోగులం పనిచేస్తున్నామని.. తమకు ఇచ్చే రూ. 15వేల జీతంలో కేవలం రూ.180 కోట్ల రూపాయలు నెలకు ప్రభుత్వానికి అవుతుందని.. మా సర్వీసులు రెగ్యులర్ చేస్తే ఉన్నపళంగా ప్రభుత్వంపై రూ.300 కోట్లు భారం పడుతుందనే కారణంతోనే ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు ఈ ప్రత్యేక పరీక్ష విధానాన్ని ప్రభుత్వం ముడిపెట్టి తెరపైకి తీసుకొచ్చిందని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఉద్యోగంలోనైనా ఈ తరహా పరీక్షలు ఉంటాయని చెబుతున్న ప్రభుత్వ సలహాదారులు ఈ విషయాన్ని ఉద్యోగాల్లో చేరే సమయంలో ఎందుకు ప్రకటించలేదని, ఈ రెండేళ్లలో ఈ పరీక్ష పెడితే మొత్తం ఉద్యోగులమంతా పాస్ అయి ఉద్యోగాల రెగ్యులరైజేషన్ లైన్ క్లియర్ అయ్యేది కదాని ప్రశ్నిస్తున్నారు. అలాకాకుండా ఇప్పటిప్పుడు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి చాంతాండంత సిలబస్ ఇచ్చీ.. తూతూ మంత్రంగా ఉద్యోగంలో చేరినపు శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ప్రత్యేక ప్రవేశ పరీక్ష విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యే 3 నెలల సమాయానికి ముందు ప్రత్యేక పరీక్షను తీసుకురావడం భావ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ఆధారంగా ప్రవేశ పెడితే కనీసం రాష్ట్రవ్యాప్తంగా 50శాతం ఉద్యోగులు కూడా పాసయ్యే అవకాశం లేదని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఏడాది ఒక్కసారే పెడితే పరీక్ష పాస్ కాని వారంతా మరో ఏడాది పాటు రూ.15వేల జీతంతోనే ఉద్యోగాలు ఏ విధంగా చేయాలో ప్రభుత్వమే చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక పరీక్ష 6నెలలకు ఒకసారి, ఏడాది ఒకసారి లేదంటే రెండేళ్లకు ఒకసారి పెడుతుందా అనే విషయం కూడా ప్రభుత్వం నేటికీ క్లారిటీ ఇవ్వకపోవడం ఉద్యోగుల ఆందోళన మరింత పెంచుతున్నది. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని గ్రామస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసినందకు ఆనందించామని.. ఈ వ్యవస్థలో తొలి ఉద్యోగాలు చేస్తున్నందకు గర్వపడ్డామని.. తమ ఆనందం మొత్తం ప్రత్యేక ప్రవేశ పరీక్షనెపంతో ప్రభుత్వం నీరుగార్చేయడం అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. రెండు దశల్లో కరోనా వైరస్ వచ్చినపుడు సచివాలయ ఉద్యోగుల విధులకు కనీసం రెగ్యులర్ ఉద్యోగులకి ఇచ్చిన వెసులు బాటు కూడా ఇవ్వకుండా విధులు నిర్వహించేలా చేశారని.. తామంతా కూడా ప్రజలకు సేవచేసే భాగ్యం వచ్చిందన్నట్టుగా రెండవ శనివారాలు, ఆదివారాలు అనే తేడా లేకుండా సెలవులు కూడా తీసుకోకుండా అధనపు విధులు నిర్వర్తించినందుకు ప్రభుత్వం ఈ స్థాయిలో గుర్తిస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు ఉద్యోగులంతా. ప్రాణాలకు తెగించి అదనపు విధులు చేసినందుకు గుర్తుగా సర్వీసు రెగ్యులర్ అయ్యేంత వరకూ రూ.15వేలకే ఏళ్ల తరబడి పనిచేయించుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 ఇప్పటి వరకూ ఏ రాష్ట్రప్రభుత్వమూ పెట్టని నిబంధన రూ.15వేలకే ఉద్యోగం చేయడమే పెట్టి.. అదే జీతం తమ ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యేంత వరకూ ఇచ్చి తమ ముందు కొండం సిలబస్ పెట్టి ఎప్పటికీ పాస్ కాకుండా చేద్దామనే కుటిల బుద్ధితోనే ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక ఆరునెలలు, లేదా ఏడాది ముందు ఈ విషయం చెప్పినా.. సిలబస్ విడుదల చేసినా శిక్షణ పొందడానికి, సిలబస్ మొత్తం చదువుకోవడానికి వీలుండేదని.. ఆఖరి సమయంలో ఇంత పెద్ద సిలబస్ ఇస్తే ఎలాగూ వీరు పాసవరని.. ప్రభుత్వంపై పడే భారాన్ని తగ్గించుకోవడానికే ఈ విధంగా ప్లాన్ చేశారని ఇటు విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అందులోనూ వయస్సు మళ్లిన(45ఏళ్లు దాటిన వారు) సుమారు రాష్ట్రవ్యాప్తంగా 20 నుంచి 30వేలకు పైగా ఉద్యోగులం ఉన్నామని, ఈ వయస్సులో తాము ఈ సిలబస్ ఎప్పటికి చదివి..మరెప్పటికీ పాసవుతామో తెలియడం లేదని వాపోతున్నారు. దీనితో ఇప్పటి వరకూ ప్రభుత్వంపై ఎంతో గౌరవం పెంచుకున్న సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినట్టుగానే రెండు రోజుల నుంచి సంకేతాలు అందతున్నాయి.. అంతేకాదు ఇంత కష్టపడి పనిచేసినందుకు ఇదా ప్రభుత్వం తమకిచ్చే గౌరవమంటూ.. ఉద్యోగ సంఘాల సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో రోజూ చర్చలు జరుగేంత స్థాయికి చేరుకున్నారు. ఇదే కొనసాగితే ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు పూర్తిస్థాయిలో వ్యతిరేకమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోట్లాది రూపాయిలు సంక్షేమ పథకాలు పేదలకు అందించామని.. తెల్లవారు జామున 5గంటలకే వెళ్లి పించన్లు ఇచ్చినందుకు గుర్తుగా తమకి ప్రభుత్వం చాలా బాగా గుర్తించిందంటూ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. చూడాలి ప్రభుత్వ చర్యలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల విషయంలో రెగ్యులైజేషన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందో..!

Tadepalle

2021-07-28 02:00:47

మీకు మెమో ఇస్తే నాకునేను ఇచ్చుకున్నట్టే..

గ్రామ, వార్డు సచివాలయాల్లో జిల్లాకలెక్టర్లు, జేసిలు తనిఖీలు చేసినట్టుగా రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లు, ఐటిడిఏ పీఓ చేయకపోవడం బాధాకరం.. మనం తరచుగా తనిఖీలు చేస్తేనే అక్కడ ప్రజలకు సేవలు బాగా అందుతాయి..పనిచేయని ఏ అధికారికైనా మెమో ఇవ్వండి..అలా మెమో ఇవ్వడమంటే నాకు నేను ఇచ్చుకున్నట్టేనని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వివిధశాఖల మంత్రులు, రాష్ట్ర శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామ, వార్డు సచివాలయాలకు, ఆర్బీకెలకు  వెళ్లినప్పుడు కచ్చితంగా ఎస్‌ఓపీ పాటిస్తున్నారా?లేదా?చూడాలన్నారు. మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ ప్రజలకు అందుబాటులో ఉండి వారినుంచి విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కారాలు చూపాలన్నారు. ఖచ్చితంగా బయో మెట్రిక్ అమలు చేస్తూ రోజుకి రెండుసార్లు సిబ్బంది హాజరు నమోదు కావాలన్నారు. కరో సమయంలో రాష్ట్రవ్యాప్తం సిబ్బందిగా బాగా కష్టపడి పనిచేశారన్నారు.  నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, ఫెర్టిలైజర్స్‌ దుకాణాలపై దృష్టి పెట్టాలి:
అలాంటి వాటిపై కలెక్టర్లు, ఎస్పీలు కలిసి.. సంయుక్తంగా దాడులు నిర్వహించాలని అప్పుడే కల్తీలు ఆగుతాయని సీఎం పేర్కొన్నారు. విధి నిర్వహణలో వున్న సిబ్బంది, ఏ స్థాయి అధికారపై అయినా చర్యలు చేపట్టాల్సిందేనంటూ అధికారులను ఆదేశించారు.  ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్‌ అడ్మినిస్టేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tadepalle

2021-07-27 17:09:11