జాతి సమగ్రత, అభివృద్ది కొరకు కుల,మత, బాష, ప్రాంతాల కతీతంగా సమిష్టిగా కలిసి కృషిచేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిష్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా స్థాయి 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశభక్తి, జాతి గౌరవం ఉట్టిపడేలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేసి, సాయుధ దళాలు నిర్వహించిన సాంప్రదాయ సమ్మాన్ గార్డ్ ఆఫ్ ఆనర్, మార్చ్ పాస్ట్ వందనాలను స్వీకరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లాలో అమలౌతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ నిస్వార్థ, నిరుపమాన త్యాగాలతో నేటి తరానికి స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన మహనీయులకు వినమ్ర అంజలి ఘటించి కృతజ్ఞతలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరంలో ప్రజలంతా ఏక త్రాటిపై నిలిచి పోరాటం జరిగిపిన రీతిలోనే, నేడు మానవాళికి పెనుముప్పుగా సవాలు చేస్తున్న కరోనా మహమ్మారిపై మరోమారు సమిష్టిగా ఉద్యమిద్దామని ప్రజలకు మంత్రి పిలుపు నిచ్చారు. ప్రజా సంక్షేమం, సత్వరాభివృద్ది లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వ నవరత్న కార్యక్రమాలు జిలాల్లో విజయవంతంగా అమలు చేస్తూ, వాటి ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో 39,671 మంది రైతులకు వై.ఎస్.ఆర్ సున్నావడ్డీ పధకం క్రింద 6 కోట్ల 30 లక్షల వడ్డీ రాయితీని, వై.ఎస్.ఆర్ రైతు భరోసా-పి.ఎం.కిసాన్ పధకం ద్వారా 4.54 లక్షల మంది రైతుల ఖాతాలకు తొలివిడతగా 341 కోట్లు సహాయాన్ని జమచేశామని తెలిపారు.
అలాగే వై.ఎస్.ఆర్. ఉచిత పంటల భీమా పధకం క్రింద 1,47,726 మంది రైతులకు 219.26 కోట్ల రూపాయల భీమా పరిహారం ఖరీఫ్ ప్రారంభానికి ముందే సరైన సమయంలో అందించామని, రబీ సీజనులో 375 పిపిసి కేంద్రాలు ద్వారా 91,433 మంది రైతులకు చెందిన 11.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసామన్నారు. మత్స్యకార భరోసా పధకం ద్వారా వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన 30,213 మత్స్యకార కుటుంబాలకు 30.21 కోట్ల రూపాయల సహాయాన్ని అందిచామన్నారు. వివిధ వర్గాల ఆర్థికాభివృద్ది కొసం వైఎస్ఆర్ చేయూత పధకం క్రింద 423.35 కోట్లు, కాపు నేస్తం పధకం క్రింద 279.81 కోట్లు, వై.ఎస్.ఆసరా పధకం క్రింద 2810 కోట్లు, వై.ఎస్.ఆర్ పింఛను కానుకగా ప్రతి నెలా 157.41 కోట్లు, వై.ఎస్.ఆర్ వాహన మిత్రం పధకం ద్వారా 36.38 కోట్లు, జనన్న తోడు పధకం ద్వారా 62.70 కోట్లు వడ్డీ, పూచికత్తు లేని రుణాలు, నేతన్న నేస్తం పధకం ద్వారా 17.02 కోట్లు ఆర్థిక సహాయలను లక్ష్యిత ప్రజలకు పంపిణీ చేశామని తెలియజేశారు. . నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పధకం తొలిదశ క్రింద జిల్లాలోని 758 లే అవుట్లలో మెగా గ్రౌండింగ్ మేళాలు నిర్వహించి 73,610 గృహాల పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. నాడు-నేడు తొలి దశగా జిల్లాలోని 1371 పాఠశాలలను 373.70 కోట్ల నిధులతో అన్ని సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దామని, అమ్మ ఒడి పధకం ద్వారా 4.84 లక్షల మంది విద్యార్థులకు 726 కోట్లు, జగనన్న విద్యా దీవెన పధకం ద్వారా 1,11,098 మంది విద్యార్థులకు 69.10 కోట్లు, జగనన్న వసతి దీవెన పధకం ద్వారా 1,06,331 మంది విద్యార్థులకు 101.47 కోట్లు వారి తల్లుల ఖాతాలకు జమ చేసామని మంత్రి తెలిపారు.
కోవిడ్-19 మహమ్మారి నియంత్రణకు ముమ్మర వ్యాక్సినేషన్, ఆసుపత్రులలో చికిత్సా వసతుల అభివృద్ది చేపట్టామని, వ్యాధి నివారణలో ప్రభుత్వ కృషికి, ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఉపాధి హామీ పధకం క్రింద జిల్లాలో 3.91 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, 80 కోట్లతో 1248 గ్రామసచివాలయ భవనాలు, 43 కోట్ల నిధులతో 1209 రైతు భరోసా కేంద్రాలు, 32 కోట్ల నిధులతో 1100 హెల్త్ క్లినిక్ భవనాలు, 2.33 కోట్ల నిధులతో బల్క్ కూలింగ్ కేంద్రాలు నిర్మిస్తున్నామన్నారు. పోలవలం ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు 7 పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి కాగా మరో 19 కాలనీల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. వైఎస్ఆర్-జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పధకం ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో భూముల రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాన్నా. పారిశ్రామిక రంగంలో ఈ ఏడాది జిల్లాలో 60 కోట్ల పెట్టుబడితో 302 పరిశ్రమలు ఏర్పాటయి 2215 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్నారు. సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు జారీ చేస్తూ, సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమలకు 72.36 కోట్లు వివిధ ప్రోత్సాహకాలుగా అందించామన్నారు. జిల్లాలను అన్ని రంగాలలో ముందు నిలిపేందుకు చిత్త శుద్దితో కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్లు, స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మీడియా ప్రతినిధులు ప్రతిఒక్కరికీ మంత్రి కృష్ణదాస్ ధన్యవాదాలు తెలియజేసి, అందరి సమిష్టి కృషితో జిల్లా అభివృద్ది పధంలో మరింత ముందుకు సాగాలని కాంక్షించారు. అనంతరం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో 20 ప్రభుత్వ శాఖలు నిర్వహించిన శకటాల ప్రదర్శనను, హైస్కూల్, కళాశాల విద్యార్థినీవిద్యార్థులు ప్రదర్శించిన దేశ భక్తి పూరిత సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. ఉత్తమ శకట, సాంస్కృతిక ప్రదర్శనలకు, ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి మంత్రి కృష్ణదాస్ ప్రసంశాపత్రాలను అందజేశారు. అలాగే వేడుకలలో వివిధ ప్రభుత్వ శాఖలు తమ పధకాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనా స్టాళ్లను ఆయన తిలకించారు.