1 ENS Live Breaking News

పోర్టు కాలుష్యంపై ప్రత్యేక చర్యలు..

విశాఖ పోర్టు నుంచి వెలువడే కాలుష్య నివారణకు చర్యలు చేపట్టినట్టు జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె నాలుగవ జోన్ 39 వ వార్డు కోట వీధి పరిసర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, వార్డు కార్పొరేటర్ డా. మహమ్మద్  సాధిక్ తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ విశాఖ పోర్ట్ ట్రస్ట్ కు చెందిన భారీ వాహనాల వలన శబ్ద, వాయు కాలుష్యం అధికంగా ఉందని, భారీ వాహనాలు ఎక్కువగా తిరగడం వలన రోడ్డులు, భూగర్భ పైపులు ద్వంసం అవుతున్నాయని, పోర్టు భారీ వాహనాలకు మరో మార్గం ద్వారా పంపించేందుకు  పోర్ట్ చైర్మన్ తో మాట్లాడతామని తెలిపారు. పాత పోస్టాఫీసు బస్సులు ఆగు ప్రదేశంలో ప్రయాణీకులకు మరుగుదొడ్లు సదుపాయం లేదని, వాటిని వెంటనే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కాలువలలో పూడికలు తొలగించనందుకు వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే పూడికలు తీయించాలని ఆదేశించారు. భూగర్భ మురుగు కొరకు తీసిన గోయ్యలను కాంక్రీటు తో పూడ్చి , ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఇపిడిసిఎల్ వార్డు భూగర్భ ఎలక్ట్రికల్ పైపులను బయటకు వదలి ఆ గోయ్యలును పూడ్చనందుకు ఇపిడిసిఎల్ వారికి నోటీసు ఇచ్చి, వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని అధికారులను అదేశించారు. డోర్ టు డోర్ చెత్త సేకరించే పద్దతిని స్థానిక ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. భూగర్భ మురుగు నీటిలో ఎటువంటి వ్యర్ధ పదార్ధాలు, నేప్కిన్స్, డ్రైపర్సు వేయరాదని సూచించారు. స్థానిక చేపల  బజారులో చెత్త బుట్టలు ఏర్పాటు చేయాలని ప్రధాన వైధ్యాధికారిని ఆదేశించారు. 
సెయింట్ జాన్ హై స్కూలు(హెరిటేజ్ బిల్డింగు) శిధిలావస్థలో ఉందని, దానిని తొలగించి నూతనంగా బిల్డింగు నిర్మించాలని, టిడ్కో ఇళ్ళ నిర్మాణ పనులు ఇంకా మొదలు పెట్ట లేదని, స్థానిక సచివాలయం మార్పుచేయాలని, ఫేరీ రోడ్డులో ఉన్న అంగన్వాడి కేంద్రంలో విద్యుత్ దీపాలు లేవని, ఆ ప్రాంతంలో ఉన్న పార్కుకు మరమత్తులు చేయించాలని కార్పొరేటర్ తెలపగా, మేయర్, కమిషనర్ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, పర్యవేక్షక ఇంజినీరు శివ ప్రసాద రాజు, కార్య నిర్వహాక ఇంజినీర్లు గణేష్ బాబు, శ్రీనివాస రావు, చిరంజీవి, ఎఎంఒహెచ్ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.     

విశాఖసిటీ

2021-07-09 12:56:08

చైతన్య యాత్రలతో రైతులకు అవగాహన..

చైతన్య యాత్రల ద్వారా రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా- రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ పేర్కొన్నారు.  9 -7- 2021 నుంచి 23 -7- 2021 వరకు డాక్టర్ వైయస్ ఆర్ రైతు భరోసా పై రైతులను చైతన్యవంతం చేయాలన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్తు ఎదురుగా ఉన్న కృషిభవన్ ఆవరణలో డాక్టర్ వైయస్ ఆర్ రైతు భరోసా చైతన్య వాహన యాత్రలను సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా- రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా- రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పెదకూరపాడు, ప్రతిపాడు, పెదకాకాని, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాల్లో క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, పశు సంవర్ధక, ఉద్యానవనం, పట్టు పరిశ్రమ ,మార్కెటింగ్, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించామన్నారు. గ్రామాలలో రైతుల సమస్యలపై అవగాహన కల్పించేందుకు పై శాఖల అధికారులు, సిబ్బంది వాహనాలను ఉపయోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు విత్తనాలపై అవగాహన కల్పించేందుకు విలేజ్ అసిస్టెంట్స్, మండల అధికారులు, వ్యవసాయ క్షేత్ర అధికారులు రైతుల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ పద్ధతిని లాభసాటిగా ఉండేవిధంగా ప్రదర్శన చేయాలన్నారు. రైతులు పండించిన పంటకు మార్కెట్ లో అధిక ధరలు వచ్చేవిధంగా చూడాలన్నారు. వరి ని ఎక్కువగా రైతులు పండించడం వలన ఆ పంట మార్కెట్ కు వచ్చేసరికి ధర తగ్గుతుందనే అపోహ రైతుల్లో ఉందన్నారు. అలాంటి అపోహాలకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆర్బికె గ్రామాల పరిధిలోని వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాల్సిన వరి వంగడాల లక్షణాలు తట్టుకునే చీడ, పీడల గురించి అవగాహన కల్పిచాలన్నారు. నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో బోర్లకింద ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చునన్నారు. రైతులు తప్పని సరిగా అధీకృత డీలర్ల దగ్గర విత్తనాలు కొనుగోలు చేయాలని, సదరు రశీదును పంటకాలం పూర్తి అయ్యేవరకు భద్ర పరుచుకోవాలని, అనధికార విత్తన విక్రయాల సమాచారమును రైతులు తక్షణమే స్థానిక వ్యవసాయ, పోలీసు అధికారులకు తెలియజేయాలన్నారు. యంత్ర సేవ కేంద్రాలు  ఆర్బికె పరిధిలో రైతు సంఘాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కస్టమ్ హైరింగ్ కేంద్రాల వివరాలను రైతులకు తెలయజేయాలన్నారు. ఈ క్రాఫ్ అప్లికేషన్స్ వారి గ్రామాల్లో పండించే అన్ని వ్యవసాయ ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుగ్రాస, సామాజిక అటవీశాఖ, మత్స్యశాఖలకు సంబంధించిన  సర్వేనంబర్ల విస్తీర్ణం రైతు వివరాలతో సమోదు చేస్తారన్నారు. ఈ క్రాఫ్ లో నమోదు కాబడిన రైతుల వివరాలను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. పెట్టుబడిని తగ్గించి సమగ్ర పంటల విధానంలో నాణ్యమైన అధిక దిగుబడిని సాధించాలని రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విజయభారతి, ఉప సంచాలకులు ఐ. మురళి, పి. రామాంజనేయులు. సహాయ సంచాలకులు కె.వి. శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-07-09 12:51:45

రాష్ట్రంలో పల్లెసీమలన్నీ ప్రగతిబాట..

రాష్ట్రంలోని పల్లెలన్నీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ముందుచూపుతో ప్రగతిబాటలో పయనిస్తున్నాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన శుక్రవారం జిల్లాలోని టెక్కలి డివిజన్ పరిధిలోగల టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా టెక్కలిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ.75 లక్షలతో నిర్మించిన, కార్పొరేట్ బ్యాంకులకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉన్న పలు విభాగాలను అతిథులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇచ్చాపురం టౌన్ 15వ వార్డ్ బెల్లుపడ వద్ద రూ.80 లక్షలతో నిర్మించే హాస్పటల్ కు శంఖుస్థాపన చేశారు. ఇచ్చాపురం టౌన్ లో 1వ వార్డ్ లో రూ. 80 లక్షలతో నిర్మించే అర్బన్ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన చేసారు. ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో రూ1.84 కోట్లతో నిర్మాణం కానున్న పబ్లిక్ హెల్త్ సెంటర్ హాస్పిటలకు శంఖుస్థాపన చేశారు. ఈదుపురం గ్రామంలో డిసిసిబి బ్యాంకు శాఖని ప్రారంభించారు. అక్కడే 1.84 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతోందని అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి, సంక్షేమ బాటలో నడిపించిన చరితార్థుడని అన్నారు. తండ్రి వారసుడిగా, ఆయన ఆశయాలే ఊపిరిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చారని తెలిపారు. రైతులను సీఎం జగన్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. పంట దిగుబడి తగ్గితే బీమా వచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చడానికి ప్రభుత్వం విశేషకృషి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ప్రజలు ఇచ్చిన వినతులను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వీకరించారు. ఇచ్చాపురంలో తాగునీటి సమస్య, సోంపేట థర్మల్ విద్యుత్ వ్యతిరేక పోరాటంలో కేసులు నమోదు చేసిన 725 మందిపై కేసులు ఎత్తివేయాలని, వారిలో చాలామంది విద్యార్థులు ఉండటం కారణంగా వారి భవిష్యత్తుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.  వీటి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

       ఈ కార్యక్రమాలలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, డిసిఎంఎస్ అద్యక్షులు పిరియా సాయిరాజ్,మున్సిపల్ ఛైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు ఉలాల విజయభారతి, తహశీల్దార్ మురళి, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, స్థానిక నాయకులు నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా(లల్లూ), సర్తు సరేంద్ర, పిరియా విజయ, నిమ్మన దాసు, కడియాల ప్రకాశ్, దువ్వు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Srikakulam

2021-07-09 12:47:27

ప్రతీరోజు 200 గృహాలు గ్రౌండింగ్ జరగాలి..

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతీ మండలంలో రోజుకి 200 గృహాలు గ్రౌండింగ్ కావాలని గృహనిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్ హిమాంశు కౌశిక్ గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమంపై గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ జిల్లాలో 92 వేలు గృహాలు గ్రౌండింగ్ కావలసి ఉండగా ఇప్పటివరకు 69 వేలు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. ఈ నెల 1,2 మరియు 4వ తేదీలలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 92 వేలు గృహాలకు గ్రౌండింగ్ జరగాల్సిఉండగా 69 వేలు మాత్రమే గ్రౌండింగ్ కావడంపై జె.సి అసంతృప్తి వ్యక్తం చేశారు.   హౌసింగ్ గ్రౌండింగ్ వెనుకబడి ఉండటం వలన రాష్ట్రస్థాయిలో జిల్లా 11వ స్థానానికి చేరుకుందని అన్నారు. కావున గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జె.సి సూచించారు. ప్రతి మండలంలో రోజుకి 200 గృహాలు గ్రౌండింగ్ అయితేనే లక్ష్యాన్ని సాధించగలమని జె.సి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ ఇంజినీర్లు, మండల తహసీల్దారు, ఎం.పి.డి.ఓలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకొని లక్ష్యాన్ని అధిగమించాలని అధికారులను జె.సి ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-09 12:45:22

కేజీ చందనం సమర్పించిన భక్తులు..

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ న్రుసింహస్వామివారికి విశాఖ రవీంద్రనగర్ కు చెందిన బాబురావు - సత్యవతి దంపతులు శుక్రవారం అరకేజీ చందనం సమర్పించారు. అదేవిధంగా బోయపాలెం వాస్తవ్యులు  ఈశ్వరరావు-లక్ష్మి దంపతులు మరో అరకేజీ చందనం సమర్పించారు. ఈ మేరకు రూ.10,116 (పదివేల నూట పదహారు) చొప్పున ఏఈఓ రాఘవకుమార్ అందించి రసీదు పొందారు. అనంతరం దాతలకు స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-07-09 12:43:39

రూ.60 లక్షల పరికరాలు వితరణ..

శ్రీకాకుళంజిల్లాలో కోవిడ్ సెకెండ్ వేవ్ నుండి ప్రస్తుతం బయటపడ్డామని, చాలావరకు కేసులు తగ్గుముఖం పట్టాయని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. శుక్రవారం  కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సుమారు రూ.60 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, హెచ్.ఎఫ్.ఎన్.సిలు, ఐసియు పారా మానిటర్లు, ఎన్ – 95 మాస్కులు, శానిటైజర్లను డా. రెడ్డీస్ ల్యాబ్ జిల్లా కలెక్టర్ కు అందజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సెకెండ్ వేవ్ నుండి బయటపడినప్పటికీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు వార్తలు కూడా వచ్చాయని, ఇటువంటి తరుణంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద కొన్ని పరికరాలను అందజేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా  పైడి భీమవరంలోని డా. రెడ్డీస్ ల్యాబ్ ముందుకువచ్చి దాదాపు రూ.60 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, హెచ్.ఎఫ్.ఎన్.సిలు, ఐసియు పారా మానిటర్లు, ఎన్ – 95 మాస్కులు, శానిటైజర్లను ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. దీంతో పాటు జిల్లాలోని మూడు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను ( నిమిషానికి 200 లీటర్లు సామర్ధ్యం ) నెలకొల్పబోతున్నట్లు కలెక్టర్ చెప్పారు.  ఇప్పటికే రూ.25 లక్షలతో రణస్థలం వద్ద ఆక్సిజన్ ప్లాంటును నెలకొల్పడం జరిగిందని,  త్వరలో పాలకొండ, రాజాం ప్రాంతాల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇవేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన పరికరాలు, జిల్లాలో స్వంతంగా కొనుగోలు చేసి కొన్ని పరికరాలను సిద్ధం చేసామని చెప్పారు. వీటితో జిల్లాలో థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకువెళ్లే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేసారు. రూ.60 లక్షల విలువైన పరికరాలను అందజేసిన డా. రెడ్డీస్ ల్యాబ్ కు  అభినందనలు తెలిపిన కలెక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తరపున పరికరాలు ఇచ్చేందుకు కృషిచేసిన ఎచ్చెర్ల ఎచ్చెర్ల గొర్లె కిరణ్ కుమార్ ను కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, డా. రెడ్డీస్ ల్యాబ్ సీనియర్ డైరక్టర్ కె.వి.యస్.ఎన్.రాజు, అసోసియేట్ డైరక్టర్ వి.ఆర్.జోగారావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. జి.సుమన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-07-09 12:39:16

సుందర శ్రీకాకుళం లక్ష్యంగా పనిచేయాలి..

శ్రీకాకుళంను సుందర నగరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్  శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ప్రతి పౌరుని లక్ష్యం కావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని పెదపాడు చెరువును, నాగావళి నదిలో నిర్మిస్తున్న డైక్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. చెరువు మంచి పర్యాటక ఆకర్షణ కాగలదని, సుందరంగా తయారు చేయడం వలన నగరానికి మరింత శోభ చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. మన ఊరు మన చెరువు కార్యక్రమం కింద పెదపాడు చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలని ఆయన చెప్పారు. విభిన్న ఏజెన్సీలు కాకుండా ఒకే ఏజెన్సీ పనులను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పనులు పూర్తి చేయుటకు నిర్దిష్ట గడువు కచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ముందుగా చెరువు సరిహద్దులను గుర్తించాలని వాటికి మార్కింగ్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేయాలని దానితో పాటుగా సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇరువైపులా మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలని ఆయన అన్నారు. పెద్దపాడు గ్రామంలోనూ, చెరువు చుట్టుపక్కల ఎక్కడ బహిరంగ మలవిసర్జన ఉండకుండా అన్ని చర్యలు చేపట్టాలని గ్రామ సర్పంచ్ కలగ శ్రీనివాస్ కు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఇంటి వద్ద మరుగుదొడ్లు ఉన్నాయని, వాటిని విధిగా వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం నీటి సరఫరా లేనప్పుడు ఇంటివద్ద నీటి తొట్టెలు ఏర్పాటు చేసుకుని తద్వారా వినియోగించాలి ఆయన పేర్కొన్నారు.  గ్రామ, నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణం తయారవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రవర్తనా పరమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచిస్తూ బహిరంగ మల విసర్జనకు పూర్తిగా నిలుపుదల చేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. నగరపాలక అధికారులు తెలవారుతుండగానే రహదారులపై ఉండాలని ఆయన ఆదేశించారు. పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అనేక చోట్ల చెత్త కుప్పలు కనిపిస్తున్నాయని తద్వారా నగర పారిశుద్ధ్యానికి, ఆహ్లాదానికీ, సుందరీకరణకు ఆటంకంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. ప్రత్యేక అధికారి హోదాలో నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను వ్యక్తిగతంగా తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. 

డైక్ త్వరగా పూర్తి చేయాలి: నాగావళి నదిలో నిర్మిస్తున్న డైక్ ను అతి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణం తీవ్ర జాప్యం అయిందని ఆయన పేర్కొన్నారు.  వర్షాలకు ముందే వీలైనంత ఎక్కువ పనులను చేపట్టాలని ఆయన చెప్పారు. నగరంలో రివర్ ఫ్రంట్ పార్క్ ఉండటం వలన మరింత శోభ చేకూరుతుందని ఆయన అన్నారు. నగరంలో చేపడుతున్న  పనులపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.  

      ఈ కార్యక్రమంలో వంశధార పర్యవేక్షక ఇంజినీర్ డోల తిరుమల రావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. ఓబులేసు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు అధికారి హెచ్. కూర్మా రావు, ప్రజారోగ్య కార్యనిర్వాహక ఇంజనీర్ పి.సుగుణాకర రావు, నగరపాలక  ఇంజనీర్ రమణ మూర్తి, ప్రజారోగ్య శాఖ డిఇ దక్షిణామూర్తి, తాహసిల్దార్ వై.వి.ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-09 12:33:34

చెత్త రహిత నగరానికి సహకరించండి..

మహా విశాఖనగరం మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారమే ముఖ్య భూమికని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన అన్నారు. గురువారం ఆమె 4వ జోన్ 30వ వార్డు పరిధిలోని కొత్త జాలారి పేట, రెల్లివీధి మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాన్ని “డస్ట్ బిన్ ఫ్రీ సిటీ” గా తీర్చిదిద్దేందుకు ప్రజల సహాయ సహకారాలు అవసరమన్నారు. రోడ్డు అడ్డంగా ఉన్న ఇంటి నిర్మాణ సామగ్రిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. వార్డులలో సరిపడే పారిశుధ్య సిబ్బంది ఉన్నారని,  పిన్ పాయింట్ వారిగా కార్మికులను సర్దుబాటు చేసి, ఎవరికి నిర్దేశించిన పనిని వారిచే చేయించాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త అధికంగా ఉందని, చెత్త వేసే వారిపై నిఘా ఉంచి వారి నుండి అపరాధ రుసుము వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్లును ఆదేశించారు. ప్రతి రోజూ చెత్త తరలించే వాహనాలు డిప్లోయ్మెంట్ ప్రకారం వస్తున్నాయా అని శానిటరీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు ఇంటింటికి వచ్చి తడి-పొడి చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజుల్లో డస్ట్ బిన్లను, లిట్టర్ బిన్లను తొలగిస్తామని ప్రతి ఇంటికి మూడు రంగుల చెత్త డబ్బాలు ఇవ్వడం జరుగుతుందని, వాటితో తడి-పొడి మరియు ప్రమాదకరమైన చెత్తగా విభజించి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ప్రజలకు సూచించారు. ప్రతి దుకాణం ముందు మూడు రంగుల చెత్త డబ్బాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వీధి లైట్లు వెలగడం లేదని స్థానిక ప్రజలు తెలుపగా సాయంత్రం లోగా వీధి లైట్లు వెలిగించాలని సహాయక ఇంజినీరు(ఎలక్ట్రికల్)ను ఆదేశించారు.  
ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, పి.శ్రీనివాస రావు, గణేష్ కుమార్, వెటర్నరి  డాక్టరు కిషోర్, సహాయక ఇంజినీరు విల్సన్, ఎస్.ఎస్. శ్రీనివాస రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నాజీ, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.   

విశాఖ సిటీ

2021-07-08 15:25:03

సిబ్బందికి మాస్కులు, మిఠాయిలు పంపిణీ..

స్వర్గీయ డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, 72వ జయంతి సందర్భంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జివిఎంసి  ప్రధాన కార్యాలయం సిబ్బందికి మాస్కులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఎంతో అభివృద్ధి చేశారని,  అందులో భాగంగా మన విశాఖను ప్రత్యేకంగా అభివృద్ధి పరచడంలో ఆయన కృషి ఎంతో ఉందని, హనుమంతువాక జంక్షన్ నుండి అడవివరం వరకు  విశాఖ నుండి పెందుర్తి జంక్షన్ వరకు బిఆర్టిఎస్ రోడ్డును అభివృద్ధి పరిచిన ఘనత ఆయన దేనని కొనియాడారు.  ఈ  కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జివిఎంసి సిబ్బంది పాల్గొన్నారు.  

విశాఖ సిటీ

2021-07-08 15:22:01

మహానేత వైఎస్సార్ కి ఘన నివాళి..

మహా నేత,  బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్భంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వైఎస్సార్  విగ్రహానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ తో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మహా నేత ఆంధ్రుల ఆరాధ్య దైవము, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ ధరణి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి, ప్రజలకు ఎనలేని సేవ చేశారని, విశాఖ అభివృద్దికి మూలకారకుడు అని,  విశాఖకు ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించి విశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.

విశాఖ సిటీ

2021-07-08 15:18:58

మెడిక‌ల్ హ‌బ్స్‌ కి స్థలాలు చూడండి..

విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్‌కు స‌మీపంలో మెడిక‌ల్ హ‌బ్స్ ఏర్పాటు చేసేందుకు స్థ‌లాల‌ను గుర్తించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. ప‌ట్ట‌ణానికి రెండుమూడు కిలోమీట‌ర్ల దూరంలోనే, ఒక్కొక్క‌టి 3 నుంచి 5 ఎక‌రాలు చొప్పున‌, క‌నీసం ఐదారు ప్రాంతాల‌ను ఎంపిక చేయాల‌ని సూచించారు. వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌ర్‌ త‌న క్యాంపు కార్యాల‌యంలో గురువారం సాయంత్రం నిర్వ‌హించిన స‌మావేశంలో వివిధ అంశాల‌పై స‌మీక్షించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, కార్పొరేష‌న్‌కు స‌మీపంలో మెడిక‌ల్ హ‌బ్స్‌ను ఏర్పాటు చేసి, వివిధ ర‌కాల సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేవ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని, దీనికోసం శుక్ర‌వారం సాయంత్రానికి స్థ‌లాల‌ను గుర్తించాల‌ని ఆదేశించారు. వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, 45 ఏళ్లు పైబ‌డిన ప్ర‌తీఒక్క‌రికీ వేక్సినేష‌న్‌ను పూర్తి అయ్యేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను విస్తృతం చేయాల‌ని, రోజుకు 4వేల నుంచి 5వేల వ‌ర‌కూ టెస్టుల‌ను నిర్వ‌హించాల‌ని చెప్పారు. పార్వ‌తీపురంలో వైరాల‌జీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

                  క‌రోనా మూడోద‌శ‌పై అన్ని విభాగాలూ అప్ర‌మ‌త్తంగా ఉండ‌టంతోపాటుగా, కోవిడ్ నిబంధ‌న‌ల‌పై మ‌రింత విస్తృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. దీనికోసం ప్ర‌భుత్వం ఇచ్చిన అన్ని ర‌కాల టాస్క్‌ల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌తీ సోమ‌వారం నో మాస్క్‌-నో ఎంట్రీ, మంగ‌ళ‌వారం నోమాస్క్‌-నో రైడ్‌, బుధ‌వారం నో మాస్క్‌-నో బిజినెస్ అన్న అంశాల‌ను ప్ర‌చారం చేయాల‌ని సూచించారు. అర్బ‌న్ క్లీనిక్కుల నిర్మాణాన్ని త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని, వైద్య సేవ‌ల‌ను త్వ‌ర‌గా అందుబాటులోకి తీసుకురావాల‌ని కోరారు. కోవిడ్ కార‌ణంగా త‌ల్లితండ్రులిద్ద‌రినీ కోల్పోయి అనాధ‌లైన పిల్ల‌ల‌ను గుర్తించి, వారికి ప్ర‌భుత్వం నుంచి ప‌రిహారాన్ని ఇప్పించాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు.

                 ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, డిఐఓ డాక్ట‌ర్ గోపాల‌కృష్ణ‌, పిఓ డిటిటి డాక్ట‌ర్ బాల‌ముర‌ళీకృష్ణ‌, డిపిఆర్ఓ డి.ర‌మేష్‌, ఎపిఐఐసి జోన‌ల్ మేనేజ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-08 14:45:04

జిల్లాలో ఘనంగా రైతు దినోత్సవం..

శ్రీకాకుళం జిల్లాలో రైతు దినోత్సవం గురు వారం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం  దివంగత ముఖ్య మంత్రి స్వర్గీయ వై.యస్.ఆర్.రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం విదితమే. రైతు దినోత్సవం గురు వారం ఉదయం నుంచి అంగరంగ వైభవంగ జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పోలాకి మండలం ఈదులవలసలో ఉదయం 8 గంటలకే కార్యక్రమంలో పాల్గొని రూ.21.80 లక్షలతో సుందరంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అచ్చట నుండి నరసన్నపేట మండలం కరగాం గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వై.యస్.ఆర్ వెల్ నెస్ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారం ఆమదాలవలస వ్యవసాయ మార్కెటింగు యార్డులో రూ.61 లక్షలతో నిర్మించిన వై.యస్.ఆర్ అగ్రి లాబ్ ను ప్రారంభించారు. రాజాంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారం స్ధానిక శాసన సభ్యులు కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పాల్గొన్నారు. రైతు దినోత్సవంలో భాగంగా వై.యస్.ఆర్ యంత్ర సేవ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాలో 134 రైతు భరోసా కేంద్రాలు, 140 యంత్ర సేవా కేంద్రాలు, నాలుగు అగ్రి లాబ్ లు గురు వారం ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమాల్లో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసగించిన ఉప ముఖ్య మంత్రి క్రిష్ణదాస్, స్పీకర్ సీతారాం ప్రజలకు స్ఫూర్తిదాయక సూచనలు చేసారు. దివంగత రాజశేఖర రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేసారన్నారు. ప్రతి రైతు ముఖంలో ఆనందం చూడాలని రాజశేఖర రెడ్డి ఆలోచించగా రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి రైతు జీవితాలు మరింత మెరుగుపడాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా అందిస్తున్నారని, రైతులకు అవసరమగు అన్ని సౌకర్యాలు అందించుటకు రైతు భరోసా కేంద్రాలను గ్రామ సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసారని తెలిపారు. అగ్రీ లాబ్ లను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు అందుటకు తద్వారా రైతు లాభదాయక విధానంలో వెళ్ళుటకు అన్ని చర్యలు చేపడుతున్నారని ఆయన చెప్పారు. రైతు దేశానికి వెన్నెముక అన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందన నమ్మిన వ్యక్తి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 

Srikakulam

2021-07-08 14:34:59

యుద్ధప్రాతిపదికన పనులు పూర్తికావాలి..

ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేకూరేలా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో వై.యస్.ఆర్.జగనన్న శాస్వత భూహక్కు , భూరక్ష , డిజిటల్ లైబ్రరీలు, గృహ పట్టాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వై.యస్.ఆర్. జగనన్న శాస్వత భూహక్కు మరియు భూరక్ష పథకానికి సంబంధించి శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి  రెవిన్యూ డివిజనల్ పరిధిల్లో రీ సర్వే చేయమని ఆదేశించడం జరిగిందన్నారు. శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని పోలాకి మండలం సంతలక్ష్మీపురం, కోటబొమ్మాళి మండలంలోని ఆనందపురం, పాలకొండ మండలంలోని పరశురాంపురం ప్రాంతాల్లో రీసర్వే పనులపై ఆరా తీసిన ఆయన అందుకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. మధ్య తరగతి వారికి అందజేస్తున్న గృహ పట్టాలను త్వరితగతిన భూమిని సేకరించాలని, సేకరించిన భూమి  అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు వచ్చి స్వయంగా స్వీకరించే విధంగా  ఆ స్థలం ఉండేలా చూడాలన్నారు. 90 రోజుల్లో పట్టాలకు సంబంధించి మాట్లాడుతూ పట్టాల పంపిణీకి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు ప్రింటింగ్ వేగవంతం చేయాలని చెప్పారు. జగనన్న కాలనీ లేఔట్లు గురించి మాట్లాడుతూ లేఔట్లకు సంబంధించి ఏవైతే కోర్టు కేసులు పెండింగులో ఉన్నాయో వాటిపై దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వ న్యాయవాదులతో మాట్లాడి ఆ కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. లేఔట్లు సిద్ధంగా ఉంటే లబ్ధిదారులకు అందజేసేందుకు వీలుగా ఉంటుందని అన్నారు. జిల్లాలో గల 15 మండలాల్లో 178 డిజిటల్ లైబ్రరీలకు ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని, వీటికి సంబంధించి ఒక్కో డిజిటల్ లైబ్రరీకి ఐదు సెంట్లు చొప్పున స్థలాన్ని సేకరించి త్వరితగతిన ప్రభుత్వానికి నివేదిక అందించాలని చెప్పారు. రైతులకు రుణకార్డుల ద్వారా రుణాలను మంజూరుచేయాలని, యల్.డి.ఎంతో మాట్లాడి  గతంలో రైతు భరోసా నిధులు  ఏ ఖాతాల్లో పడ్డాయో ఆ ఖాతాల్లో రైతులకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) హిమాంశు కౌశిక్, టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, శ్రీకాకుళం, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిశోర్, టి.వి.ఎస్.జి.కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-07-08 14:19:33

మత్స్య, ఆక్వా రంగాలకు పెద్దపీట..

మత్స్యకారులు,ఆక్వా రైతుల అభివ్రుద్ధే ధ్యేయంగా  వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. గురువారం విజయనగరంలో రూ. 47.30 లక్షల వ్యయంతో నిర్మించిన ఆక్వా ల్యాబ్ ను ఆమె ఎమ్మెల్యే  కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారిల తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం “వై.ఎస్.ఆర్, మత్స్యకార భరోసా” పధకం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా.. ఆ మహానేత గుర్తుగా ఆక్వాల్యాబ్ ప్రారంభించడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి, నాణ్యమైన సీడ్, ఫీడ్, ఆక్వా కల్చర్ అనుమతులు పొందడం కోసం రాష్ట్రంలో మూడు చట్టాలును (ఆంధ్రప్రదేశ్ ఫిష్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) (సవరణ) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ చట్టం 2020) వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మత్స్యకారులు, ఆక్వా రైతులందరికీ ఆక్వా లాబ్ సేవలు అందిచడం ద్వారా వారి యొక్క ఉత్పాదకతను అధికంగా పెంచుకోవడానికి వీలుపడుతందని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రంలో ఎనిమిది ఇంటిగ్రేటెడ్ ఆక్వా లాబ్ లు, అయిదు ఆక్వా ల్యాబ్ లను ఆధునీకరించిందన్నారు. మత్స్యశాఖ డిడి నిర్మల కుమారి మాట్లాడుతూ, ఈ ఆక్వా ల్యాబ్ ద్వారా విజయనగరం జిల్లాలో గల 67మంది ఆక్వా రైతులు, 52 స్వదేశీ మత్స్యకార సహకార సంఘాలకు సేవలు అందుతాయన్నారు. ఈ ఆక్వాల్యాబ్ లో మట్టిని, నీటిని, మేత కోసం పరీక్షలు చేస్తారని వివరించారు. అలాగే చేపలకు వచ్చిన లేదా రాబోయే వ్యాధులను తెలుసుకొని వాటికి నియంత్రిణ చర్యలు చేపట్టి ఆక్వా రైతులు, మత్స్యకారుల నష్టాలను తగ్గించుకో వచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టర్ జి.సి. కిషోర్ కుమారు, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు మరియు FISHCOPFED, డైరెక్టర్  బర్రి చిన్నప్పన్న,  మత్స్య శాఖ సహాయ సంచాలకులు  పి. కిరణ్ కుమార్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి యు.చాందిని, మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మత్స్యకారులు, ఆక్వా రైతులు, మత్స్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-08 13:22:04

అందరి సహకారంతో పుష్కరిణి అభివృద్ధి..

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి చెందిన వరాహ పుష్కరణి ని అందరి సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు 
ఆలయ ఏఈవో నక్కాన  ఆనంద్ కుమార్ అన్నారు. గురువారం వరాహ పుష్కరిణీ ప్రాంగణంలో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ ప్రాంత వైద్యులు సంక్షేమ సంఘం(అర్ఎంపీ )ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దివంగత నేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వరాహ పుష్కరిణి అభివృద్ధికి ఆలయ ఈఓ సూర్యకళ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు. గౌరవ అతిథిగా హాజరైన అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, వరాహ పుష్కరిణి ని పర్యావరణ ప్రాంతం గా తీర్చి దిద్దాలని ఈఓని తాను ఇప్పటికే కోరామని పేర్కొన్నారు. పుష్కరిణి అభివృద్ధికి దేవస్థానం పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు. భక్తులు తొలుత ఈ వరాహ పుష్కరణీ లో  పుణ్యస్నానమాచరించి ఆ తర్వాతే సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అటువంటి పుష్కరణిని అందంగా తీర్చిదిద్దితే భక్తులతో పాటు స్థానిక పరిసర గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ సేద తీరే  అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జంఘము జోషి,కార్యదర్శి లోగిశ గణేషు మాట్లాడుతూ, వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే తమకు మేలు చేసే విధంగా జీవో ఇచ్చారని గుర్తుచేశారు. చాలా మంది అర్ఎంపీ  వైద్యులుకి ఆ జీవో  ద్వారా మేలు జరిగిందన్నారు.అనంతరం వైస్సార్ కి ఘనంగా నివాళులు అర్పించారు. సంఘం ప్రతినిధులు, దేవస్థానం అధికారి ముద్దాడ వెంకట రమణ,సంఘం ఇంచార్జి ఆకుల శ్రీనివాస్,ప్రెసిడెంట్ బాల శశంకర రావు, కళ, రంగారావు,పూర్ణ,పద్మావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Simhachalam

2021-07-08 06:37:32