1 ENS Live Breaking News

హౌసింగ్ మెగా డ్రైవ్ విజయవంతం కావాలి..

విశాఖ జిల్లాలో గృహనిర్మాణ  కార్యక్రమాన్ని   అధికారులు, సిబ్బంది ప్రణాళికాయుతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  ఆదేశించారు.  శనివారం మధ్యాహ్నం  జిల్లా కలెక్టర్ “నవరత్నాలు –పేదలందరికి  ఇళ్లు” మెగా గ్రౌండింగ్  మేళా పై జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం, అవగాహనా కార్యక్రమాన్ని  నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టరు  మాట్లాడుతూ  అర్హులైన  పేదలందరికి ఇళ్లు కట్టించే కార్యక్రమానికి  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని  తెలిపారు. ఈ కార్యక్రమం అమలులో హౌసింగ్ శాఖ సిబ్బందితో పాటు   అన్ని శాఖల అధికారులు  జిల్లా మరియు మండల స్థాయిలలో  పని చేసి విజయవంతం గావించాలన్నారు.  జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి విశాఖ డివిజన్, జాయింట్ కలెక్టర్  పి.అరుణ్ బాబు, అనకాపల్లి డివిజన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) కల్పనా కుమారి నర్సీపట్నం డివిజన్, జి.వి.ఎం.సి కమిషనర్ డా.జి.సృజన  జి.వి.ఎం.సి పరిధిలో  పేదలందరికి  ఇళ్ల కార్యక్రమానికి  ఇన్ చార్జిలుగా  ఉంటారన్నారు. తదుపరి  ప్రతి నియోజక వర్గానికి   డిప్యూటి కలెక్టర్ స్థాయి అధికారిని, మండల స్థాయిలో  మండల ప్రత్యేకాధికారిని నియమించడం జరిగిందన్నారు.  అదే విధంగా మండలాల్లోని కొన్ని సచివాలయాలకు ఒక అధికారిని  నియమించడం జరుగుతుందని, చివరిగా లే-అవుట్ స్థాయిలో  సచివాలయ స్థాయి సిబ్బందిని  బాధ్యులుగా  నియమించడం జరుగుతుందన్నారు.  ఈ ఐదు అంచెల ఎడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ లో ప్రతి ఒక్కరు అంకిత భావంతో  పని చేయాలన్నారు. ఈ మెగా గ్రౌండింగ్  మేళాకు తేదీల వారీగా  చేపట్టవలసిన పనులను  వివరించారు.  26వ తేదిన జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయి  అధికారులకు  శిక్షణా కార్యక్రమం నిర్వహణ, 28వ తేదీన మండల ప్రత్యేకాధికారులు, మండల స్థాయిలో అధికారులకు, సిబ్బందికి శిక్షణ, ప్రజా ప్రతినిధులతో  సమావేశాల నిర్వహణ,  యాక్షన్ ఫ్లాన్ తయారు గావించుట. 29వ తేదిన  సచివాలయాల స్థాయిలో  శిక్షణ , 30వ తేదీన వాలంటీర్లు లబ్దిదారులకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్దిష్టంగా నిర్వహించాలని అన్నారు.   జూలై 1వ తేదీన  గ్రౌండింగ్ మేళాకు శత శాతం లబ్దిదారులు   హజరు కావాలని,  దీనికి గాను  ప్రతి ఒక్కరూ సూక్ష్మ స్థాయిలో ప్రణాళికతో  పని చేయాలని స్పష్టం చేశారు .
జాయింట్ కలెక్టరు ఎం.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ  గృహ నిర్మాణాలకు ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. అందరికీ అందుబాటులో వీలును బట్టి లే అవుట్ దగ్గరలోనే ఇసుకను వుంచుతామని చెప్పారు.  ప్రతి మండలంలో ఒక ఇసుక డిపోను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి   జాయింట్ కలెక్టర్లు, ఎం .వేణుగోపాల రెడ్డి,  పి. అరుణ్ బాబు,  జి.వి.ఎం .సి కమిషనర్ డా. జి.సృజన,  జాయింట్ కలెక్టరు (హౌసింగ్)   కల్పనా కుమారి, హౌసింగ్ ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాసరావు,  జిల్లా స్థాయి అధికారులు హాజరైయ్యారు. 

Visakhapatnam

2021-06-26 12:58:36

కరోనా థర్డ్ వేవ్ కి సిద్ధంగా ఉండాలి..

శ్రీకాకుళంజిల్లాలో కోవిడ్ మూడవ దశ వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్స్, ఇతరత్రా ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్ మూడవ దశపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ మూడవ దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని,  అందుకు తగిన విధంగా ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఇతరత్రా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ ఆసుపత్రి , నర్సింగ్ హోమ్ మినిమమ్ స్టాండర్స్ ఎక్విప్ మెంట్ , ఫర్నిచర్ కలిగి ఉండాలని సూచించారు. యాభై నుండి వంద పడకల గల ఆసుపత్రులు మరియు  వంద పడకల గల ఆసుపత్రుల్లో 100 ఆక్సిజన్ సిలిండర్లు ఉండాలని చెప్పారు.  50 కంటే తక్కువ పడకలు గల ఆసుపత్రి, నర్సింగ్ హోమ్ లలో 40 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రతీ బెడ్ కు ఆక్సిజన్ మాస్కుతో పాటు రెగ్యులేటర్ కూడా ఉండాలని జె.సి వివరించారు. పి.ఎస్.ఎ ఆక్సిజన్ ప్లాంటులు ఉన్నఆసుపత్రులలో ప్రతీ 100 పడకలకు 1000ఎల్.పి.ఎం ( లీటర్ పర్ మినిట్ ), 50 నుండి 100 పడకలు కలిగిన వాటికి 500 ఎల్.పి.ఎం, 50 కంటే తక్కువ పడకలు గల ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు లేదా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. 50 పడకల కంటే ఎక్కువ గల అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు లేదా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతమున్న వెంటిలేటర్ల సంఖ్య కంటే 50 శాతం అదనంగా పెంచాలని అన్నారు. 100 పడకలు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20 శాతం పడకలను ICU పడకలుగా మరియు 80 శాతం  పడకలను నాన్ ఐసియు పడకలుగా కేటాయించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనుమతి పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో దాదాపు పడకల సంఖ్యతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, లేని ఆసుపత్రుల్లో వాటిని ఏర్పాటుచేసుకోవాలని, వీటితో పాటు ప్రభుత్వం సూచించిన అన్ని వసతులు ఏర్పాటుచేసుకోవాలని జె.సి ఆదేశించారు.

          ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సమన్వయకర్త డా.ప్రకాశరావు, డా. కె.సునీల్ నాయక్, కిమ్స్, సింధూర, మెడికవర్, పి.వి.యస్.రామ్మోహన్ రావు, జెమ్స్, బగ్గు సరోజిని, గొలివి, అమృత, జిఎంఆర్ ఆసుపత్రుల యాజమాన్యాలు మరియు కమల, లైఫ్, సూర్యముఖి, ట్రస్ట్, యునిక్, ఎ-వన్, సన్ రైజ్, వాసంతి, నారాయణ మల్టిస్పెషాలిటీ, ద్వారకమాయి, ఎస్.పి.వి ఆసుపత్రుల అధినేతలు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-26 12:51:19

మహిళల రక్షణే సీఎం జగనన్న లక్ష్యం..

మహిళల ఆత్మరక్షణకు కవచంగా దిశా యాప్ పనిచేస్తుందని.. యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకొని వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామ మహిళా పోలీసులు, సంఘ మిత్రలు, మహిళా సంఘ లీడర్లకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మేరకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో దిశ యాప్ వినియోగానికి చెవిరెడ్డి సంకల్పించారు. శనివారం శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం వేదికగా దిశా చట్టం, యాప్ పై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు శ్రీ పద్మావతీ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జమున, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు విచ్చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ.. మహిళా రక్షణ గురించి సిఎం జగనన్నకు బాగా తెలుసన్నారు. అద్భుతమైన ఆలోచన, ఆశయంతో దిశచట్టానికి రూపకల్పన చేశారన్నారు. దేశంలోనే మొట్టమొదటి గా మహిళా రక్షణ కోసం చట్టం చేశారన్నారు. దిశ యాప్ ను ప్రతి ఒక్క మహిళ ఫోన్ లో డౌన్ లోడ్ చేయించాలన్నారు. కేంద్రం అమలు చేసిన నిర్భయ, ఫోక్సో చట్టాల కన్నా బలమైన చట్టంగా దిశా అవతరించిందన్నారు. జగనన్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళా అఘాయిత్యాలకు గురికాకూడదని సీఎం సంకల్పించారన్నారు. మహిళల మాన, ప్రాణాలకు భంగం కలిగించాలన్న ఆలోచన రాకుండా దిశా చట్టం పరిధిలో శిక్షలు రూపొందించారని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం రూపొందిన దిశా యాప్ ను ఆపదలో ఉన్న మహిళలు ఉపయోగించుకునేలా అవగాహన కలిగివుండాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో సంఘ మిత్రలు దిశా యాప్ డౌన్ లోడ్ చేయించి ఎక్కువ మందికి అవగాహన  కల్పించాలన్నారు. అలా ఎక్కువ మందికి చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం అందించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జనం కోసం నడిచిన వాడు.. కష్టం విలువ తెలిసిన వ్యక్తి.. సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.  అందరికి మేలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. పథకాలతో ప్రతి నిరుపేదను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. రైతును రాజుగా మార్చే ప్రణాళిలతో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ జగన్ పాలనను ఆశక్తిగా గమనిస్తున్నారన్నారు. 

అనంతరం శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ఆచార్య జమున మాట్లాడుతూ.. దిశా చట్టం సిఎం మానసపుత్రిక అన్నారు. మహిళా భద్రతకు సిఎం పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. దిశా చట్టాన్ని ఏపిలో పకడ్బందీగా అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి మహిళ మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ.. సమాజంలో ఆడపిల్లల పట్ల అనునిత్యం జరుగుతున్న దారుణాలను ఉదహరించారు. మహిళలందరికీ రక్షణ కల్పించే కవచం దిశ చట్టం ఒక్కటే అని అన్నారు.  దిశ యాప్ ను ప్రతి మహిళ డౌన్ లోడ్ చేయాలని కోరారు. అత్యవసరమైన పరిస్థితుల్లో దిశ యాప్ మహిళకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం ఏపీలో దిశ యాప్ ను తీసుకొచ్చారన్నారు. మహిళలపై దాడులు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రార్ ఆచార్య మమత, రెక్టార్ ఆచార్య శారద, అడిషనల్ ఎస్పీ సుప్రజ ప్రసంగించారు. ప్రతి మహిళా స్పృహతో పాటు ఎంతో అప్రమత్తంగా మనల్ని మనం రక్షించుకోవాలని విశ్లేషించారు. స్త్రీకి కావాల్సిన భద్రత, గౌరవాన్ని  కాపాడటానికి ఏర్పాటు చేసిన దిశా యాప్ ను కొనియాడారు. ముందు ఇంటి నుంచే స్త్రీకి భద్రత పెరగాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దిశా యాప్ ద్వారా ఎవరు.. ఎవరికీ మేసేజ్ చేయాలి.. మహిళా పోలీస్, సంఘ మిత్రలు, మహిళా సంఘాల లీడర్లకు వీడియో ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికీ దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించారు. సదస్సులో మహిళలు తాము దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నామని తమ మొబైల్స్ ను చూపారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి మహిళ డౌన్ లోడ్ చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సుకు చంద్రగిరి నియోజకవర్గ మహిళా సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, మహిళా సమాఖ్య లీడర్లు, గ్రామ  మహిళా పోలీస్ లు పాల్గొన్నారు.

Tirupati

2021-06-26 12:42:49

మా సమస్యలు పరిష్కరించండి సారూ..

విశాఖ ఫిష్ లాండింగ్ సెంటర్ లో బోట్లు నిలిపివేత, ఉత్పత్తుల అమ్మకాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాకినాడ అర్బన్ మండలం దుమ్ములపేట, పర్లోపేట గ్రామ టూనా ఫిష్టింగ్ ఫైబర్ బోట్ ఓనర్స్ శనివారం రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు.  కాకినాడ రేవుకు తిన్నగా సుదూర జలాల్లో వేట సాగిస్తున్నపుడు నీటి వడిని బట్టి తమ బోట్ లు ఇటు తమిళనాడు లేదా అటు ఓడిస్సా వైపు వెళ్లిపోతాయని అక్కడి నుండి తిరిగి కాకినాడ వచ్చేలోపు ఆయిల్ అయిపోవడం, చేపలు కుళ్లిపోవడం జరుగుతోందన్నారు.  అందువల్ల ఒడిస్సా తీర జలాల ఉన్నపుడు సమీపంలోని విశాఖపట్నం ఫిష్షింగ్ హార్బర్ లో బోట్లు పెట్టుకుని, వేట చేపలు అమ్ముకుని  గత 40 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని, అయితే ఇటీవల కాలంలో స్థానికంగా కొంత మంది దౌర్జన్యకారులు తమను చంపుతామని బెదిరిస్తూ, విశాఖపట్నం ఫిష్షింగ్  హార్బర్ లోకి తమ బోట్లను రానీయ కుండా తరిమేస్తున్నారని జిల్లా మత్స్యకారులు మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందువల్ల జీవనోపాధి కోల్పోయి బోట్లు అమ్ముకునే స్థితిలో ఉన్నామని, దౌర్జన్యకారులపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని జిల్లా మత్స్యకారులు ఆయనను వేడుకున్నారు. వారి విజ్ఞాపనపై మంత్రి కురసాల కన్నబాబు స్పందిస్తూ, పొరుగు జిల్లాల్లోని ఫిష్ లాండింగ్ హార్బర్లలో జిల్లా మత్స్యకారులకు ఎదురౌతున్న సమస్యలపై ఆయా జిల్లాల అధికారులు, రాష్ట్ర అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని తెలియజేశారు.  అలాగే కెఎస్ఈ జడ్ లో సేకరించిన భూముల తిరిగి అప్పగింత ప్రక్రియలో తమ సమస్యలను, విజ్ఞాపనలను పరిగణలోకి తీసుకోవలని ఎస్ఈజడ్ రైతులు కోరుతూ శనివారం మంత్రి కన్నబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నపం సమర్పించారు.  రైతుల సమస్యలను, వినతులను పరిశీలించి తగు పరిష్కారం అందించాలని ఎస్ఈజడ్ అధికారులు, ఆర్డిఓలకు సూచిస్తామని మంత్రి కన్నబాబు  తెలిపారు. 

Kakinada

2021-06-26 12:38:54

ఫస్ట్ ఎయిడ్ లేకపోవడం దారుణమే..

ఫస్ట్ ఎయిడ్ కు అవసరమైన వాటిని కూడా అందుబాటులో ఉంచుకోకుంటే ఎలా అంటూ అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందిని నగర మేయర్ మహమ్మద్ వసీం ప్రశ్నించారు. అనంతలోని  నాయక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను నగర మేయర్ శనివారం  ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్  సెంటర్ కు వచ్చే ప్రజలకు ఏమి వసతులు లేవని స్థానికులు  మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యం చేయడానికి అవసరమైన మందులు కాటన్ ఇతర మెడిసిన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది తీరుపై మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  స్థానికంగా వైద్యం అందుబాటులో ఉందని ఇక్కడికి బాధతో, రోగంతో వస్తే మందులు లేవు,ఫస్ట్ ఎయిడ్ లేదు అని వెనక్కు పంపిస్తే ఎలా అని సిబ్బందిని మేయర్ ప్రశ్నించారు. ముందస్తుగా అవసరమైన మెడిసిన్ ను తెప్పించుకోవాలని మందులు సరఫరా చేసే అపోలో వారు చేయకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో తెచ్చుకోవాలి కానీ తమ వద్ద లేవని రోగులకు వైద్య సేవలు అందించక పోవడం సరి కాదన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.  అవసరమైన మందులు ఇతరత్రా వాటిని  సప్లై చేసే అపోలో వాళ్ళతో మాట్లాడి వెంటనే వాటిని  ఏర్పాటు చేయాలని  డిప్యూటీ కమిషనర్ తో పాటు  హెల్త్ ఆఫీసర్ ని మేయర్ ఆదేశించారు. అంతేకాకుండా అర్బన్ హెల్త్ సెంటర్ లో  శానిటేషన్ గ్యాంగ్ వర్క్ ఏర్పాటు చేసి శుభ్రం చేయించాలని సూచించారు. ఆసుపత్రి గేటు వద్ద చాలా మంది ప్రజలు పడుతున్నారని వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకురాగ వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని సిబ్బందికి మేయర్  సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు సాకే చంద్ర శేఖర్ ,అనిల్ కుమార్ రెడ్డి, కమల భూషణ్ వైఎస్ఆర్ సీపీ నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-26 12:35:23

మటన్ మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచాలి..

అనంతపురం మటన్ మార్కెట్ లో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని పాతురు మటన్ మార్కెట్ లో శనివారం  నగర మేయర్  పర్యటించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ,  మార్కెట్ కు ప్రజలు  ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా  సూచించారు. మటన్ మార్కెట్ నందు తగిన వసతులు సరిగా లేవని ,మరమ్మతులు చేయించాలని అక్కడున్న వ్యాపారస్తులు మేయర్  దృష్టికి తీసుకు వచ్చారు. .దీనిపై స్పందించిన మేయర్  వెంటనే మరమ్మతులు చేయించి పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత  అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా మార్కెట్  బయట ఉన్న డంపర్ బిన్ రోజు క్లీన్ చేయించి పరిశుభ్రంగా ఉంచాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి,  హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ ,కార్పొరేటర్ లు రామాంజినమ్మ, బాబా ఫక్రుద్దీన్, అనిల్ కుమార్ రెడ్డి, కమల భూషణ్ కో ఆప్షన్ మెంబర్ షంషుద్దీన్, వైఎస్ఆర్ సీపీ నాయకులు సుబ్బయ్య, ఖాజా  తదితరులు పాల్గొన్నారు.

పాతురు

2021-06-26 12:31:17

యునిసెఫ్ కోవిడ్ సూచనలు పాటించాలి..

 కోవిడ్ 19 బారిన పడకుండా ఉండేందుకు యూనిసెఫ్ సూచించిన సూత్రాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనిసెఫ్ లో రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్  జిల్లా అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పలు వైవిధ్యాలుగా రూపాంతరం చెందుతున్న కరోనా వైరస్ ను సమర్ధ వంతంగా ఎదుర్కొనేందుకు యూనిసెప్ చిన్నారులు, పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా కలెక్టర్ అధికారులకు వివరించి గ్రామ స్థాయి నుంచే కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు. గతంలో లాగా కోవిడ్ సోకితే హోం క్వారంటైన్ లో చికిత్స పొందకుండా కోవిడ్ కేర్ సెంటర్లు/ ఆసుపత్రుల్లో చేర్చి  చికిత్సలు పొందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.   ఈ సమీక్షా సమావేశంలో  జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా - రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్(సచివాలయాలు- అభివృద్ధి) పి. ప్రశాంతి, సంయుక్త కలెక్టర్(ఆసరా - సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్(గృహనిర్మాణం) అనుపమా అంజలి, జిల్లా ట్రైనీ కలెక్టర్ శుభం బన్సాల్, డి ఆర్ వొ కొండయ్య, గుంటూరు నగర కమీషనర్ చల్లా అనురాధ, నాలుగు డివిజన్ల ఆర్.డి,వొలు, మండల తహాశీల్దార్లు, ఎం.పి.డి.వొ లు, గృహ నిర్మాణ, విద్యుత్తు, ఏపి ఫైబర్ నెట్ శాఖల అధికారులు, ఆయా శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-06-26 12:27:36

మెగా హౌసింగ్ డ్రైవ్ సక్సెస్ చేయాలి..

గుంటూరు జిల్లాలో జులై 1,3 మరియు 4 వ  తేదీలలో నవరత్నాలు –పేదలందరికీ ఇళ్ళు ప్రత్యేక గ్రౌండింగ్ మేళా కార్యక్రమం విజయవంతమయ్యేలా అధికారులు సమన్వంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఎస్.ఆర్. శంకరన్ హాల్లో  నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు నిర్మాణాల ప్రత్యేక గ్రౌండింగ్ మేళా కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జులై 1,3, మరియు .4 తేదిల్లో స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించనున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో 61 వేల ఇళ్ళ  గ్రౌండిగ్ కార్యక్రమం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాకు గతంలో నిర్ధేశించిన 10వేల ఇళ్ల శంఖుస్థాపన కార్యక్రమం  విజయవంతానికి కృషిచేసిన అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇదే తరహాలో జగనన్న ఇళ్ళ నిర్మాణాల గ్రౌండిగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ లక్ష్యం మేరకు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు అధికారులు లబ్ధిదారులను చైతన్య పరిచి ఇళ్ళ నిర్మాణాలు జరిగే విధంగా చూడాలన్నారు. అందుకు అనుగుణంగా  నిర్మాణ సామాగ్రిని లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సూచించారు.  ఈ రోజు నుంచే మండల నోడల్ అధికారులు గృహనిర్మాణ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు వాలంటీర్లు, విఆర్వొలు, పంచాయితీ అధికారులు, గ్రామ సచివాలయ కార్యదర్శుల సహకారం తీసుకొని ప్రణాళికా  బద్ధంగా పనులు చేపట్టేలా కార్యకలాపాలను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గృహనిర్మాణ కార్యక్రమంలో ఇప్పటి వరకు పూర్తి అయిన  పనుల పురోగతిని జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలరావును అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో గృహనిర్మాణాలకు ఎదురవుతున్న అవాంతరాలను తెలుసుకొని వాటికి పలు పరిష్కార మార్గాలను జిల్లా కలెక్టర్ సూచించారు. గృహనిర్మాణాలకు సంబంధించి తొలి దశను పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అధికారి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయాలని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గృహనిర్మాణాలకు  సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు నరసరావుపేట డివిజన్ లోని 15 వేల ఇళ్ళకు జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా - రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, గుంటూరు డివిజన్ లోని 20 వేల ఇళ్ళకు  సంయుక్త కలెక్టర్(సచివాలయాలు- అభివృద్ధి) పి. ప్రశాంతి, గురజాల డివిజన్ లోని 6 వేల ఇళ్ళకు సంయుక్త కలెక్టర్(ఆసరా – సంక్షేమం) శ్రీధర్ రెడ్డి కి, తెనాలి డివిజన్ లోని 20  వేల ఇళ్ళకు సంయుక్త కలెక్టర్(గృహనిర్మాణం) అనుపమా అంజలికి పర్యవేక్షణ బాధ్యతలు  కేటాయించినట్లు  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పురోగతిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి  ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా ట్రైనీ కలెక్టర్ శుభం  బన్సాల్ కు జిల్లా కలెక్టర్ బాధ్యతలను అప్పగించారు. జులై నెలలో మూడు రోజుల పాటు జరిగే గృహనిర్మాణాల స్పెషెల్ డ్రైవ్ గ్రౌండింగ్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు అధికారులు పని చేయాలని  జిల్లా కలెక్టర్ కోరారు. గృహాల గ్రౌండింగ్ పురోగతి పనులను రాష్ట్ర పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు  పర్యవేక్షించే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారులంతా అప్రమత్తతతో పని చేయాలని తెలిపారు. లబ్ధిదారులను జగనన్న కాలనీల దగ్గరకు తీసుకువచ్చేందుకు గ్రామ సర్పంచిలు, వార్డు వాలంటీర్లు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. అవసరమైన గృహనిర్మాణ సామాగ్రి మొత్తాన్ని లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకువచ్చి పనులు సజావుగా  జరిగేలా చూడాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్లు ఎస్. దినేష్ కుమార్, పి. ప్రశాంతి, అనుపమ అంజలి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలందరికీ ఇళ్ళ కార్యక్రమం లక్ష్యాలను చేరుకునేందుకు కింది స్థాయి అధికారులను సమన్వయ పరుచుకొని గ్రౌండిగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.

 ఈ సమీక్షా సమావేశంలో  జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా - రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్(సచివాలయాలు- అభివృద్ధి) పి. ప్రశాంతి, సంయుక్త కలెక్టర్(ఆసరా - సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్(గృహనిర్మాణం) అనుపమా అంజలి, జిల్లా ట్రైనీ కలెక్టర్ శుభం బన్సాల్, డి ఆర్ వొ కొండయ్య, గుంటూరు నగర కమీషనర్ చల్లా అనురాధ, నాలుగు డివిజన్ల ఆర్.డి,వొలు, మండల తహాశీల్దార్లు, ఎం.పి.డి.వొ లు, గృహ నిర్మాణ, విద్యుత్తు, ఏపి ఫైబర్ నెట్ శాఖల అధికారులు, ఆయా శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-06-26 12:24:47

మెగా గ్రౌండింగ్ మేళా డేస్ పక్కాగా జరగాలి..

నవరత్నాలు - పేదలందరికీ ఇల్లులో భాగంగా చేపట్టిన "మెగా గ్రౌండింగ్ మేళా డేస్" కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, జిల్లాకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఇళ్ల గ్రౌండింగ్ ను పూర్తిస్థాయిలో 100 శాతం చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. శనివారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న డిపిఆర్సీ భవనంలో నవరత్నాలు పేదలందరికి ఇళ్లు కింద ఇళ్ల గ్రౌండింగ్ కు సంబంధించి మెగా గ్రౌండింగ్ మేళా డేస్ పై ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, ఏ.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్ తో పాటు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని, ఇందులో భాగంగా జూలై 1, 3, 4 తేదీలలో రోజుకు 10 వేల చొప్పున జిల్లాకు కేటాయించిన 30 వేల ఇళ్ల గ్రౌండింగ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులంతా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటిదశలో 1,11,099 ఇల్లు మంజూరు కాగా, జూలై 8,9 తేదీలలో ఆషాడ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జూలై 1వ తేదీన 10 వేలు, 3న 10 వేలు, 4వ తేదీన 10 వేలు చొప్పున మొత్తం 30 వేల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తిచేయాలని, సంబంధిత అన్ని శాఖల అధికారులు ఒక ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఇళ్ల గ్రౌండింగ్లో లబ్ధిదారులను తీసుకురావాలని, లబ్ధిదారులు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు ఇళ్ల గ్రౌండింగ్ కు మార్కింగ్ ఇవ్వాలన్నారు. పనులన్నీ ఎర్త్ వర్క్ వరకు జరగాలన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఇసుక, సిమెంట్ అంతా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ కు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్, వాలంటీర్లు గ్రౌండింగ్ అయిన ఇళ్లతో ఫోటోలు తీసి ఖచ్చితంగా సంబంధిత యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ రోజు సంబంధిత లబ్ధిదారులు ఎంతో కీలకమని, తప్పనిసరిగా వారు వచ్చేలా చూసుకోవాలన్నారు. అవసరమైతే లబ్ధిదారులకు వాహనం ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కూడా కల్పించాలన్నారు. సంబంధిత లబ్ధిదారులు రాకపోతే ఇళ్ల గ్రౌండింగ్ చేయరాదన్నారు. ఇందుకు సంబంధించి నియోజవర్గ స్థాయి స్పెషలాఫీసర్ లతో సంబంధిత ప్రజా ప్రతినిధులతో మాట్లాడి ఇళ్ల గ్రౌండింగ్ పై లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ సమయంలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా లేఔట్లో ఉండాలన్నారు.

పెద్ద ఎత్తున ఇళ్ల గ్రౌండింగ్ నేపథ్యంలో గ్రామస్థాయి స్పెషల్ ఆఫీసర్లకు, లేఔట్ స్పెషల్ ఆఫీసర్లకు షెడ్యూల్ ప్రకారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈనెల 28వ తేదీన మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లకు, నియోజకవర్గ స్థాయి స్పెషల్ ఆఫీసర్లకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈనెల 29వ తేదీన సచివాలయ స్థాయిలో సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 30వ తేదీన లబ్ధిదారులకు వాలంటీర్లు ఇళ్ల గ్రౌండింగ్ పై అవగాహన కల్పించాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఇళ్ల గ్రౌండింగ్ ను పూర్తి చేయాలన్నారు. 1వ తేదీన ఎంత మంది గ్రౌండింగ్ చేస్తున్నారో ఈనెల 29వ తేదీనే తెలిసేలా ముందుగానే చూసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇళ్ల గ్రౌండింగ్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని లేఔట్ల వద్ద మాస్కులను అందుబాటులో ఉంచాలన్నారు.

ఇళ్ల గ్రౌండింగ్ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ లోపు లేఔట్లలో నీటి వసతి ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, ఏపీఎస్పిడిసిఎల్ ఎస్ఈని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లు తమ పరిధిలోని మండల స్థాయి అధికారులతో నీటి వసతి, విద్యుత్ సరఫరాపై నిర్వహించాలన్నారు. అర్బన్ లేఅవుట్లలో నీటి సరఫరా చేయాలని పబ్లిక్ హెల్త్ ఎస్ఈని ఆదేశించారు. డిఆర్డిఎ పిడి, లీడ్ బ్యాంక్ మేనేజర్ లు సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు ఆర్థికంగా సహాయం చేసేలా చూడాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ లక్ష్యాలను పూర్తి చేస్తే సంబంధిత అధికారులను అభినందిస్తూ అవార్డులు అందజేస్తామని, మండలాల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇళ్ల నిర్మాణానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని, ఇందులో భాగంగా జూలై 1, 3, 4 తేదీలలో మెగా గ్రౌండింగ్ మేళా డేస్ లో భాగంగా పెద్ద ఎత్తున ఇళ్ల గ్రౌండింగ్ చేపట్టాలన్నారు. మండల, నియోజకవర్గ స్థాయి వారిగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, ఈనెల 28వ తేదీ కల్లా ఏ రోజు ఎంత మంది గ్రౌండ్ చేస్తారు అనే జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ రోజు ఉదయం 10:30 గంటల కల్లా పూర్తయ్యేలా చూడాలన్నారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు మండల స్పెషల్ ఆఫీసర్ లతో మాట్లాడాలని, ప్రతి ఒక్కరికి వారు చేయాల్సిన కార్యక్రమాలపై పూర్తి స్పష్టత ఉండాలన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిరి మాట్లాడుతూ మెగా గ్రౌండింగ్ మేళా డేస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు ఇళ్ల గ్రౌండింగ్ గురించి వాలంటీర్లు లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మెగా గ్రౌండింగ్ మేళా డేస్  కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జూలై 1, 3, 4 రోజున ఎవరెవరు ఏ ఏ రోజుల్లో ఇళ్ల గ్రౌండింగ్ చేస్తారు అనేది లబ్ధిదారుల జాబితా ముందుగానే తయారు చేయాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ కు సంబంధించి నివేదికలను ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. ఇందులో భాగంగా మార్కింగ్ ప్రక్రియను ఒకరోజు ముందుగానే చేపడతారని, ఇళ్ల గ్రౌండింగ్ చేసినప్పుడే జియో ట్యాగింగ్, లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ వరకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ వెంకటరమణ, పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ శ్రీనాథ్, ఎల్డిఎం మోహన్ మురళి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డిఆర్డిఎ పిడి నరసింహారెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, ఆర్ డి వో లు నిశాంత్ రెడ్డి, మధుసూదన్, గుణ భూషణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, హౌసింగ్ డి ఈలు, ఏఈ లు, మండల స్పెషల్ ఆఫీసర్ లు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-26 12:19:05

కరోనా కేసుల విషయంలో అలసత్వం వద్దు..

కరోనా కేసులు కొంతమేర తగ్గినా ట్రేసింగ్, టెస్టింగ్ విషయాల్లో ఏమాత్రం అలసత్వం వహించడానికి లేదని జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు. శనివారం ఒంగోలు నగరంలోని అన్నవరప్పాడు, హౌసింగ్‌బోర్డు కాలనీ, మరాఠిపాలెం, కబాడిపాలెం, క్లౌపేట వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆయా సచివాలయాల పరిధిలో కరోనా కేసులు నమోదవుతున్న తీరు, నియంత్రణ
చర్యలను అమలు చేస్తున్న పద్ధతి, కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్న వి ధానంపై ఆయన ఆరాతీశారు. తమ పరిధిలో ఇప్పటికీ 94 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు హౌసింగ్ బోర్డు సచివాలయ అధికారులు ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. 89 మంది కరోనా బాధిత ులను హోంఐసోలేషన్‌లో పెట్టామని చెప్పారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ కరోనా పాజిటివిటీ రేటు జిల్లాలో ఇప్పటికీ ఐదుశాతానికి పైగా ఉందని, ఇది ఆందోళన కలిగించే అంశమేనన్నారు. కరోనా నియంత్రణకోసం ప్రజల్లో మరింత అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. స్థానిక ప్రజలు ఇతర ప్రాంతాలకు సాగిస్తున్న రాకపోకలపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా 45 సంవత్సరాలు పైబ డిన వారందరికీ త్వరగా వ్యాక్సిన్ వేయాలని అన్నారు. కరోనా అనుమానితులను గుర్తించడానికి ప్రస్తుతం జరుగుతున్న ఫీవర్ సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టంచేశారు. కరోనా నిబంధ నలు పాటించాలని, అనుమానిత లక్షణాలు ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకువచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అందుబాటులో ఉన్న కరోనా పరీక్షా కేంద్రాల వివరాలను వాలంటీర్ల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వై.ఎస్.ఆర్. బీమా పథకానికి అర్హులను త్వరగా గుర్తించాలని చెప్పారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవల్లో ఎలాంటి జాప్యం ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కె. భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు, కోవిడ్ నోడల్ ఆఫీసర్ రమాదేవి, ఆయా యు.హెచ్.సి.ల డాక్టర్లు, తదితరులు ఉన్నారు.

Ongole

2021-06-26 12:13:53

పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరం..

నగర పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరమని  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు.  శనివారము ఆమె జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలిసి,  భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు విశాఖపట్నం విచ్చేస్తున్న సందర్భంగా ఆయన వచ్చే మార్గం విశాఖపట్నం విమానాశ్రయం నుండి పోర్ట్ గెస్ట్ హౌస్ వరకూ, చుట్టుప్రక్కల ఉన్న పరిసరాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా వారు  ఇరువురు మాట్లాడుతూ భారత ఉపరాష్ట్రపతి వచ్చే మార్గంలో చెత్త లేకుండా శుభ్రంగా ఉంచాలని,  గ్రీన్ బెల్ట్ లో ఉన్న మొక్కలను కట్ చేసి అందంగా ఉండే విధంగా చూడాలన్నారు. పరిపాలనా రాజధాని త్వరలో విశాఖపట్నం వస్తున్న తరుణంలో నగరాన్ని మరింత సుందరంగా ఉండేందుకు ప్రజల సహకారం అవసరమని,  రోడ్డుకిరువైపులా డస్ట్ బిన్లు ఉన్నాయని, ప్రజలు చెత్తను రోడ్డుపై వేయకుండా డస్ట్ బిన్లలోనే వేయాలని సూచించారు.  గ్రీన్ బెల్ట్ ఏరియాలోని ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురికాకుండా చూడాలని, ప్రతి దుకాణం ముందు మూడు డస్ట్ బిన్లు తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలని  శానిటరి అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీరు వినయ్ కుమార్,   కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, సుధాకర్, శ్రీనివాస్, గణేష్ కుమార్, సిటీ వెటర్నరి డాక్టర్. కిషోర్, ఎఎంఒహెచ్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-26 12:03:07

పండుగలా మెగా మెళా జరగాలి..

విజయనగరం జిల్లాలోని  గృహ నిర్మాణాల మెగా  మేళా ఒక పండగల జరగాలని విజయనగరం  శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. వార్డ్ వారీగా లబ్ది దారులకు వలాంటిర్ల  ద్వారా  అవగాహన కలిగించాలని అన్నారు. అందుకోసం వార్డ్ వారీగా  బృందాలను  వేయాలని తెలిపారు. ఆప్షన్ 1,2,3 ఇచ్చిన వారి వివరాలను సేకరించాలని అన్నారు. ఆర్.డి.ఓ భవాని శంకర్ మాట్లాడుతూ మండల వారీగా, క్లస్టర్ వారీగా లాయ్ ఔట్ వారీగా ఇన్ఛార్జ్ లను నియమించడం జరిగిందని, ఎవరు ఏ పని చెయ్యాలో  స్పష్టం గా చెప్పడం జరిగిందని అన్నారు.  లే ఔట్ మార్కింగ్, భూమి పూజ చేసి స్థలాన్ని  తదితర పనులను 27 వ తేదీ నుండి 30 వరకు చేయాలని అన్నారు.   ఈ సమావేశం లో నియోజకవర్గం  ప్రత్యేకాధికారి  సుబ్బా రావు, హౌసింగ్ పి.డి రమణ మూర్తి, మున్సిపల్ కమీషనర్ వర్మ, తహసీల్దార్  ప్రభాకర్, హౌసింగ్ డి ఈ లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-26 11:57:23

రోగులకు నాలుగు చక్రాల సైకిళ్లు పంపిణీ..

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని రోగులకు డిగ్నిటీ డ్రై ఫౌండేషన్ సంస్థ   నాలుగు చక్రాల సైకిళ్ళు ఇచ్చేందుకు ముందుకు రావడం చాలా అభినందించదగ్గ విషయమని సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవిన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్ పేర్కొన్నారు.  శనివారం డిగ్నిటీ డ్రై ఫౌండేషన్ సంస్థ ద్వారా జీజీహెచ్ లో రోగులకు  నాలుగు చక్రాల సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో  జెసి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్నిటీ డ్రై ఫౌండేషన్  సంస్థ కోవిడ్ -19 రోగులను దృష్టిలో పెట్టుకుని కోవిడ్, నాన్ కోవిడ్ రోగుల కొరకు 20 నాలుగు చక్రాల సైకిళ్ళు అందజేసి దాతృత్వాన్ని చాటుకుందని అన్నారు.  జిల్లాలో దాతలు ముందుకు వచ్చి రోగులకు  ఏ రకమైన సహాయం అందించినా,  వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.  జీజీహెచ్ లో వివిధ రకాల చికిత్సలు  పొందే రోగులు ఉన్నారని, ఆ రోగుల యొక్క అవసరాన్ని గుర్తించి పెద్ద మనస్సుతో సహాయపడగలరని ఆయన సూచించారు.  డిగ్నిటీ డ్రై ఫౌండేషన్ సంస్థ  జిల్లాలోని కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఇలాంటి నాలుగు చక్రాల సైకిళ్ళ ను అందించడం జరుగుతుందన్నారు.  జీజీహెచ్  నోడల్ మరియు మానిటరింగ్ అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసుధనరావు ను నియమించినట్లు తెలిపారు. స్వచ్చంధంగా  రోగులను ఆదుకునేందుకు ఎవరైన  దాతలు ముందుకు వచ్చినట్లైతే వారిని  సంప్రదించాలన్నారు.  

  డిగ్నిటీ డ్రై ఫౌండేషన్ సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి రీనా గ్రేస్ మాట్లాడుతూ, ఈ సంస్థకు ఇతర దేశాల నుండి కూడా దాతలు సహాయం చేయడం జరుగుతుందని, అలానే సహాయం అందించే దాతలు టోల్ ఫ్రీ నెంబర్ 18005470071 ను  సంప్రదించవచ్చన్నారు.  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని రోగులకు సంబంధించి  మెడికల్ మరియు ఏమైనా అవసరాలు అందించడానికి సంస్థ సిద్దంగా ఉందన్నారు. సంయుక్త కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ సూచించిన మేరకు జిల్లాలో రోగులకు  చేతనైనంత సహాయ సహకారాలు అందించే ప్రయత్నం జరుగుతుందని  ఆమె తెలిపారు.  కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఎన్. ప్రభావతి,  జూవెనెల్ ప్రొటెక్షన్  ప్రొడక్షన్ అధికారి  విజయ కుమార్, ఆసుపత్రి డాక్టర్స్, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Guntur

2021-06-26 11:53:57

వేగంగా మౌలిక సదుపాయాల కల్పన..

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ పునరావాస కాలనీలలో యుద్థప్రాతిపధికన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ జె.వెంకట మురళి (ఆర్ బి. అండ్ ఆర్) అధికారులను ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్ట్, గుండ్లకమ్మ రిజర్వాయర్ , యర్రం చిన్న పోలిరెడ్డి పధకాల అభివృద్థి పనులు, భూసేకరణ పై సంబంధిత అధికారులతో శనివారం స్థానిక ప్రకాశం భవనంలోని ఆయన ఛాంబరులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టులో త్వరలోనే జలాలను నింపడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని జే.సి.
తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రాజెక్టు ముంపు గ్రామాలలోని నిర్వాసితులను తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా పునరావాస కాలనీలో త్రాగునీటి సౌకర్యం, విద్యుత్, రహదారులు, మురికి కాల్వల నిర్మాణం తక్షణమే చేపట్టాలన్నారు. కనీస సదుపాయాలు పునరావాస కాలనీలలో ఏర్పాటు చేస్తే నిర్వాసితులను తరలించడానికి వీలవుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలు, హస్పిటల్, గుడి, మసీదులు, చర్చీలు, షాపింగ్ కాంప్లెక్స్, గ్రంధాలయం, పోస్టాఫీస్, బస్ షెల్టర్ , షాంపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. పునరావాస కాలనీలకు అనుబంధంగా స్మశానభూమి కేటాయించాలని, భూమి లేని ప్రాంతాలలో భూసేకరణ చేయాలన్నారు.
నిర్దేశించిన గడువులోగా గుత్తేదారులు పనులు చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పురోగతిలేని పనులకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాజెక్టులో జలాలు నిల్వ చేస్తే ముంపునకు గురయ్యే గ్రామాలలో భూసేకరణ అత్యంత వేగంగా చేపట్టాలని జె.సి. మురళి తెలిపారు. ప్రాజె క్టు కాల్వలకోసం భూసేకరణ చెయ్యాలన్నారు. దేవరాజుగట్టు - 1 పునరావాస కాలనీలో రూ.88 లక్షల నిధులు విద్యుద్దీకరణకు విడుదలయినప్పటికీ పనులు మొదలుకాకపోవడంపై ఆరాతీశారు.
11 కి.మీ. మేర అంతర్గత రహదారుల నిర్మాణం, 11.08 కి.మీ. మురికి కాల్వ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. దేవరాజుగట్టు - 2 పునరావాస కాలనీ లో 11.8 కి.మీ. మేర రహదారి నిర్మించాల్సి ఉండగా, ప్రస్తుతం గ్రావెల్ రోడ్డు నిర్మించడం, 77 కల్వర్టులకు గాను 35 పూర్తయ్యాయన్నారు. వేములకోటలో 11 కి.మీ. మేర సి.సి.రోడ్ల నిర్మాణం 60 శాతం పూర్తయిందన్నారు. గోగులదిన్నె లో ఆర్.డబ్ల్యు.ఎస్. మంచినీటి ట్యాంకు నిర్మించగా విద్యుద్దీకరణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. భూసేకరణ, అభివృద్థి పనులలో అధికారులు తప్పు చేసినట్లు తేలితే ఉపేక్షించేది లేదని జె.సి. హెచ్చరించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఇడుపూరు - 1 పునరావాస కాలనీలో నిర్మిస్తున్న పాఠశాల భవనాలు మూడు చివరిదశలో ఉండగా, నాలుగు దేవాలయాలు పునాది దశ దాటి గోడలు నిర్మిస్తున్నారని, గ్రంధాలయాలు, పోస్టాఫీసు, స్మశాన భూమి ప్రహరీ గోడ నిర్మాణం కాకపోడంపై ఆయన వివరాలడిగి తెలుసుకున్నారు. ఇడుపూరు - 2 లో ఆసుపత్రి శ్లాబు దశలో నిలిచిపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. విద్యుద్దీకరణకు ఏర్పాట్లు చెయ్యాలన్నారు. గోగులదిన్నెలో పాఠశాల భవనాలు పునాదిస్థాయిలో ఉండగా, రెండు చర్చీలు, రెండు దేవాలయాలు పునాది దశలో ఉన్నాయని స్థలం
అప్పగింతలపై ఆరాతీశారు. తోకపల్లిలో 2.6 కి.మీ. సి.సి.రోడ్డును నిర్మించగా అంతర్గత మురకి కాల్వలు, వైద్యశాల
భవన నిర్మాణాలు చివరిదశలో ఉన్నాయన్నారు. షాపింగ్ కాంప్లెక్స్, చిల్డ్రన్‌పార్క్ వివిధ దశలలో ఉన్నాయన్నారు.
ఉందుట్లలో భవన నిర్మాణాలు 20 శాతం పూర్తి కాగా సచివాలయం, ఆర్ .బి.కె., అం గన్ వాడీ కేంద్రం, హెల్త్ క్లినిక్
టెండర్ దశలో ఉన్నాయని, మిగిలిన పనులు వివిధ దశలలో ఉన్నాయన్నారు. కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ క్రింద రెండవ దశలో ముంపు కాలనీలోని 889 కుటుంబాలవారికి పునరావాసం తక్షణమే కల్పించాలని జె.సి. చెప్పారు. ప్రాజెక్టు క్రింద 24 ముంపు కాలనీలు ఉండగా ఏడింటిని తరలించారని, మిగిలిన వారిని తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. తొలిదశలోని పునరావాస కాలనీలకు
స్మశాన భూమి యుద్థప్రాతిపథికన ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. యర్రం చిన్నపోలిరెడ్డి
ఎత్తిపోతల పధకం క్రింద భూసేకరణ వేగంగా చేపట్టాలని, పాలేరు రిజర్వాయర్ క్రింద 103 ఎకరాల భూ సేకరణపై
ఆయన ఆరా తీశారు. ప్రాజెక్ట్‌ల అభివృద్థి పనులు వేగంగా చేపట్టాలని అధికారులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. సమావేశంలో భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎస్.సరళా వందనం, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఇ. మర్థన్ అలీ, ప్రాజెక్ట్ ఇ.ఇ., డి.ఇ.లు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-06-26 11:49:36

ఈ దఫా పాత విధానంలోనే ప్రెస్ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి..

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా మంజూరు చేసే ప్రెస్ అక్రిడిటేషన్లు  పాత విధానంలోనే ఈ దఫా మంజూరు చేయాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రధాన సంపాదకులు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా లో జర్నలిస్టుల ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకొని సమాచారశాఖ మంత్రి పేర్ని నానికి లేఖ రాసినట్టు ఆయన వివరించారు. ప్రభుత్వం జీఓ లో పేర్కొన్న అంశాలను ఇప్పటికిప్పుడు మీడియా సంస్థలు ఆన్ లైన్ లో దాఖలు చేసే పరిస్థితి లేదన్నారు. అందులోనూ కరోనా సమయంలో మీడియా సంస్థలకు ఎన్నో వ్యవ ప్రయాశలకోర్చి నిర్వహణ చేస్తున్నాయని.. ప్రభుత్వం ఈ దఫా ప్రెస్ అక్రిడిటేషన్లు పాద పద్దతిలోనే మంజూరు చేసి..తరువాత రెవున్యువల్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని కోరారు. లేదంటే ప్రస్తుత నిబంధనల కారణంగా పెద్ద పత్రికలు, టివి ఛానళ్లకు తప్పా మరెవరికీ అక్రిడిటేషన్లు వచ్చే పరిస్థి లేదన్నారు. అదే సమయంలో చాలా వరకూ మీడియా సంస్థలు ప్రెస్ క్లిప్పింగులను సమాచారశాఖ జిల్లా కార్యాలయాల్లో సమర్పించాయని, ఇపుడు వాటిని పీడిఎఫ్ రూపంలోకి మార్చి మళ్లీ ఆన్ లైన్ సమాచారశాఖ వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలంటే చిన్న, మధ్య తరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, లోకల్ కేబుల్ టీవీలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కరోనా లో జర్నలిస్టుల ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అక్రిడిటేషన్లు మంజూరు చేయాలన్నారు. లేదంటే చిన్న, మధ్యతరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, లోకల్ కేబుల్ టివిలు అక్రిడిటేషన్లను కోల్పోవాల్సి వుంటుందన్నారు. కరోనాలో ప్రాణాలకు తెగించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు అందించిన సేవలను కూడా ప్రభుత్వం గుర్తించాలని ఈఎన్ఎస్ బాలు కోరారు.

Visakhapatnam

2021-06-26 09:46:12