1 ENS Live Breaking News

ఎస్బీఐ రూ.23 లక్షల పిపిఇ కిట్లు వితరణ..

విశాఖపట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం సిఎస్ ఆర్ క్రింద రూ.23 లక్షల విలువైన పి.పి.ఇ కిట్లు,  సర్జికల్ మాస్కులను డిఎంహెచ్ఓ కు అందజేసినట్టు బ్యాంకు మాడ్యుల్ డిజిఎం కె.రంగరాజన్  తెలిపారు.  గురువారం ఈ మేరకు యస్.బి.ఐ ఫౌండేషన్ కార్పొరేట్ సెంటర్, ముంబయి సహకారంతో 1500 పి.పి.ఇ కిట్లు, సర్జికల్ మాస్క్‌లను  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు పంపిణీచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  ఈ పి.పి.ఇ కిట్లు  సర్జికల్ మాస్క్‌లను ప్రజలకు సేవ చేస్తున్న  వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఆరోగ్య సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతలో యస్.బి.ఐ ఎపుడూ ముందుంటుందని, ప్రతీ ఏడాది వివిధ సామాజిక కార్యక్రమాలను చేపడుతుందని ఆయన గుర్తుచేశారు. గతేడాది కరోనా సంక్షోభ సమయంలో సామాజిక బాధ్యత క్రింద వెంటిలేటర్లను పంపిణీచేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో యస్.బి.ఐ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-24 14:39:25

ఉపరాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలి..

 విశాఖ జిల్లాలో ఈ నెల 26న భారత ఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు పర్యటించ నున్నారని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలియజేశారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని  జిల్లా కలెక్టరు అధికారులను  ఆదేశించారు.  గురువారం  ఉదయం కలెక్టరు  జిల్లాలో  ఉప రాష్ట్రపతి  పర్యటన  సందర్భముగా  ఏర్పాట్లుపై  జిల్లా అధికారులతో  సమావేశం  నిర్వహించారు.  ఈ సందర్భముగా కలెక్టర్  మాట్లాడుతూ  ఉప రాష్ట్రపతి  26వ తేదీన ఉ.11.45 గంటలకు  జిల్లాకు  రానున్నారని,  పోర్టు గెస్ట్ హౌస్ లో  బస చేస్తారన్నారు.  ఎయిర్ పోర్టులో  రిసెప్షన్ కు అవసరమైన  ఏర్పాట్లు గావించాలన్నారు.  పోర్టు గెస్ట్ హౌస్ లో  వారి  బస చేయినున్నందున  ప్రోటోకాల్ నిబంధనల  ప్రకారము  అధికారులు అన్ని  ఏర్పాట్లు చేయాలన్నారు.   ఏర్పాట్లలో  ఎటువంటి  అలసత్వం  కూడదని ప్రతి ఒక్క అధికారి వారికి కేటాయించిన  విధులపై  పూర్తి అవగాహనతో ముందుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని,  ఎటువంటి ఇబ్బంది, సమస్య రాకుండా  జాగ్రత్త వహించాలన్నారు . పోర్టు గెస్ట్ హౌస్ లో నిరంతర   విద్యుత్తు సరఫరా, నీటి సదుపాయము, ఎసి, బోజన ఏర్పాట్లు  గావించాలన్నారు.  ఎయిర్ పోర్టు నుండి  పోర్టు గెస్ట్ హౌస్ వరకు రోడ్లు సరిగా ఉండేలా తగు చర్యలు చేపట్టాలని  జి.వి.ఎం.సి ఇంజనీర్ల ను  ఆదేశించారు.  వారి పర్యటనకు అవసరమైన  వాహనాలను ఏర్పాటు గావించాలని  డిప్యూటి ట్రాన్స్ పోర్టు కమిషనర్ ను   ఆదేశించారు.  అంబులెన్స్, డాక్టర్లు, ఇతర  వైద్య సదుపాయాలను  నిబంధనల ననుసరించి ఏర్పాటు గావించాలని   కె.జి.హెచ్. సూపరింటెండెంట్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.  27వ తేదీన  ఉప రాష్ట్రపతి వర్చువల్ మోడ్ లో   పాల్గొను కార్యక్రమానికి  అవసరమైన  ఏర్పాట్లు  గావించాలని  ఎన్.ఐ.సి అధికారులను ఆదేశించారు. పర్యటన , కార్యక్రమాలలో  విధులలో ఉన్న అధికారులు,  సిబ్బంది అందరూ కోవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని  ఆదేశించారు.    ఈ  సమావేశంలో  జాయింట్ కలెక్టర్  ఎం .వేణుగోపాల్ రెడ్డి,  డి.ఆర్.ఓ. ఆర్.గోవిందరావు,  జి.వి.ఎం.సి., పోలీసు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-06-24 14:33:22

నెలిమర్ల జ్యూట్ మిల్ తెరిపించండి..

నెల్లిమ‌ర్ల జ్యూట్‌మిల్లును తెరిచేందుకు ఇరు వ‌ర్గాలూ ఒక మెట్టు దిగి ప్ర‌య‌త్నించాల‌ని,  యాజ‌మాన్యాన్ని, కార్మిక నాయ‌క‌త్వాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు కోరారు. కార్మికులు న‌ష్ట‌పోకుండా మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ఆలోచించాల‌ని సూచించారు. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం మ‌రో విడ‌త చ‌ర్చ‌లు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే మూత‌బ‌డ్డ నెల్లిమ‌ర్ల జ్యూట్‌మిల్లును తిరిగి తెరిపించేందుకు, జాయింట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రావు స‌మ‌క్షంలో  క‌లెక్ట‌రేట్‌లో యాజ‌మాన్య ప్ర‌తినిధులు, కార్మిక నాయ‌కులతో బుధ‌వారం చ‌ర్చ‌లు జ‌రిగాయి. ముందుగా డిప్యుటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ లేబ‌ర్ సిహెచ్ పురుషోత్తం మాట్లాడుతూ, ఎటువంటి నోటీసు ఇవ్వ‌కుండానే జ్యూట్‌మిల్లు యాజ‌మాన్యం ఆక‌స్మాత్తుగా వ‌ర్క్‌ స‌స్పెన్ష‌న్‌కు పాల్ప‌డింద‌ని చెప్పారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం 90 రోజుల ముందుగా నోటీసు ఇచ్చి, స‌హేతుక కార‌ణాలు చూపిన త‌రువాత, అనుమ‌తి తీసుకొని మాత్ర‌మే మిల్లు మూయ‌డానికి అనుమ‌తి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

             నెల్లిమ‌ర్ల జ్యూట్‌మిల్స్‌ కంపెనీ లిమిటెడ్ సిఇఓ ఎంవి రావు మాట్లాడుతూ, తీవ్ర ఆర్థిక న‌ష్టం కార‌ణంగా మిల్లును మూసివేయాల్సి వ‌చ్చింద‌ని, ఇలాంటి ప‌రిస్థితిలో ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ప్ర‌దానంగా కార్మికులు త‌ర‌చూ విధుల‌కు గైర్హాజ‌రు కావ‌డం, ఉత్ప‌త్తి ప‌డిపోయి, ఖ‌ర్చు పెరిగిపోవ‌డంతో, మిల్లులో ఉత్ప‌త్తిని ఆపివేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. ఉత్ప‌త్తి 50శాతం ప‌డిపోయిన‌ప్ప‌టికీ, నిర్వ‌హ‌ణా వ్య‌యం మాత్రం యదాత‌థ స్థితిలోనే ఉంద‌ని చెప్పారు. కార్మికులు ఒక పూట విధుల‌కు హాజ‌రై, మ‌రోపూట రాక‌పోవ‌డం, నెల‌లో ఎక్కువ‌సార్లు గైర్హాజ‌రు కావ‌డం వ‌ల్ల స‌గ‌టు హాజ‌రు శాతం త‌క్కువ‌గా ఉండి, ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా ప‌డిపోయింద‌ని తెలిపారు. ఇక్క‌డ ముడిస‌రుకు దొర‌క‌క‌పోవ‌డం వ‌ల్ల, ట‌న్నుకు అద‌నంగా రూ.3వేలు చెల్లించి మ‌రీ బెంగాల్ నుంచి తీసుకువ‌స్తున్నామ‌ని, తాము కూడా మిల్లును న‌డప‌డానికి సిద్దంగా ఉన్నామ‌ని చెప్పారు. త‌మ‌ది సిక్ ఇండ‌స్ట్రీగా బిఎఫ్ఆర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, మిల్లును న‌డుపుతున్నామ‌ని అన్నారు. త‌మ ష‌ర‌తుల ప‌త్రాన్ని జెసికి, కార్మికుల‌కు అంద‌జేశారు.

            శ్రామిక సంఘం అధ్య‌క్షులు ప‌తివాడ అప్పారావు మాట్లాడుతూ, యాజ‌మాన్యం వాద‌న‌ను వ్య‌తిరేకించారు. ఎలాగైనా మిల్లును న‌డిపించాల‌న్న ల‌క్ష్యంతో, ప‌లు అంశాల్లో రాజీప‌డి మ‌రీ, యాజ‌మాన్యానికి స‌హ‌క‌రిస్తున్నామ‌ని చెప్పారు. కార్మికులు స‌క్రంగా విధులకు రావ‌డం లేద‌న్న వాద‌న‌ను ఖండించారు. పాత‌కాలం నాటి మిష‌న్లు, నాశిర‌కం ముడిస‌రుకుల కార‌ణంగానే ఉత్ప‌త్తి త‌గ్గిపోయింద‌ని, ఆ నెపాన్నికార్మికుల‌పై నెట్ట‌డం స‌రికాద‌ని అన్నారు. క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో కూడా  ఎన్నో వ్య‌య ప్ర‌యాశ‌ల‌కోర్చి, కార్మికులు విధుల‌కు హాజ‌ర‌య్యార‌ని చెప్పారు. కార్మికులనుంచి వ‌సూలు చేసిన పిఎఫ్ సొమ్మును, తాను చెల్లించ‌వ‌ల‌సిన షేర్‌ను కూడా యాజ‌మాన్యం దీర్ఘ‌కాలంగా క‌ట్ట‌లేద‌ని చెప్పారు. అలాగే గ్రాడ్యుటీ చెల్లించ‌లేద‌ని, ఇఎస్ఐ సౌక‌ర్యం కూడా అంద‌డం లేద‌ని, చివ‌ర‌కు కార్మికులు యాజ‌మాన్యానికి  జీతాల‌నుంచి అప్పుగా ఇచ్చిన‌ సొమ్ము కూడా, తిరిగి చెల్లించ‌డం లేద‌ని చెప్పారు. స‌గ‌టున కార్మికులకు 16 రోజుల ప‌నిమాత్ర‌మే దొరుకుతోంద‌ని, దీంతో ఆ కుటుంబాలు ఎలా బ్ర‌తుకుతాయ‌ని ప్ర‌శ్నించారు.

             చివ‌రిగా జాయింట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రావు మాట్లాడుతూ, ఇరువ‌ర్గాలూ ఒక మెట్టు దిగిన‌ప్పుడు మాత్ర‌మే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. యాజ‌మాన్యం, కార్మికులు త‌మ డిమాండ్ల‌పై చ‌ర్చించి, మ‌ధ్యేమార్గంగా ఒక‌ అంగీకారానికి రావాల‌ని సూచించారు. మిల్లును బ్ర‌తికించే బాధ్య‌త ఇరువ‌ర్గాల‌పైనా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.  జ్యూట్‌మిల్లుల ప‌రిశ్ర‌మ ఇప్ప‌టికే కుదేలై ఉంద‌ని, చాలా మిల్లులు మూత‌బ‌డి ఉన్నాయ‌ని అన్నారు. అందువ‌ల్ల వాస్త‌వ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని, స‌మ‌స్య‌ను సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని చెప్పారు. ముఖ్యంగా కార్మికుల ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకొని, యాజ‌మాన్యం విశాల హృద‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. మిల్లును న‌డ‌ప‌డ‌మే ఇరువ‌ర్గాల‌కు శ్రేయోదాయ‌క‌మ‌ని పేర్కొన్నారు. వారం రోజుల్లోపే మ‌రో సారి, ఇరువ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు ఏర్పాటు చేస్తామ‌ని జెసి వెంక‌ట‌రావు తెలిపారు.

             ఈ చ‌ర్చ‌ల్లో ఏసిఎల్ ర‌మాదేవి, ఏఎల్ఓ అరుణ‌కుమారి, మిల్లు యాజ‌మాన్యం త‌ర‌పున జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పికె ఘోష్‌, క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ పంక‌జ్ రెడ్డి, శ్రామిక సంఘం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ వెంక‌ట గోవింద‌రావు,  కార్య‌ద‌ర్శి మ‌ద్దిలి వెంక‌ట‌ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-23 15:30:20

రుణాలు సత్వరం మంజూరుచేయాలి..

ప్రభుత్వ పథకాలకు బ్యాంకు లింకేజీ రుణాలు వేగవంతంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ జూమ్ ద్వారా నిర్వహించిన  జిల్లా కన్సల్టెటివ్ కమిటీ మీటింగ్ (డీసీసీ), జిల్లా స్థాయి రివ్యూ కమిటీ మీటింగ్(డీఎల్ఆర్సీ)లో పాల్గొన్నారు. సమావేశంలో 2021–22 ఆర్దిక సంవత్సరానికి సంబంధించి రూ.31,500 కోట్లతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ వివేక్ యాదవ్  విడుదల చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ రైతులకు,  కౌలు రైతులకు వ్యవసాయ పంటరుణాలు బ్యాంకర్లు వెంటనే ఇచ్చేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పేదరికం నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి  కార్యక్రమాలకు బ్యాంకులు ప్రాధన్యత ఇవ్వాలన్నారు. మండల స్థాయిలోని బ్యాంకు మిత్రాలను ఆర్బీకేలకు అనుసంధానం చేసి రైతులకు అవసరమైన రుణాలు వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు డ్వాక్వా సంఘాల అర్హత ఉన్న మేరకు విరివిగా రుణ సదుపాయం కల్పించాలన్నారు.

 అమూల్ ప్రాజెక్టు అమలు చేస్తున్న గ్రామాలలోని స్వయంసహాయక గ్రూప్ సభ్యులకు పాడి పశువులు కొనుగోలుకు ఎస్హెచ్జీ రుణాలు మంజూరు చేయాలన్నారు. పశు కిసాన్ కార్డుల ద్వారా పశువుల కొనుగోలుకు రుణాలు మంజూరు అయ్యేలా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  దేశంలోనే వాణిజ్య పంటలకు గుంటూరు రాజధానిగా ఉందని, దానికి తగిన విధంగా బ్యాంకులు వ్యవసాయ, అనుబంధరంగాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రుణాల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకర్లు పేదలకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ఓపెన్ చేసి అందరికి బ్యాంకులు అందుబాటులో ఉండాలన్నారు.  కౌలు రైతులకు విరివిగా పంట రుణాలు అందించేందుకు బ్యాంక్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజరు రాంబాబు మాట్లాడుతూ 2021–22 రుణ వార్షిక ప్రణాళిక కేటాయింపులను వివరిస్తూ వ్యవసాయ రంగానికి రూ.19వేల కోట్లు, ప్రాధాన్యతా  రంగాలకు రూ.26 వేల 500 కోట్లు కేటాయించామన్నారు. గత ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.16,400 కోట్లుకు గాను, రూ.16,196.75 కోట్లు పంపిణీ చేసి 99శాతం ఫలితాలు సాధించినట్లు తెలిపారు.
 
సమావేశంలో సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఎఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ డీజీఎం, డీఎల్ఆర్సీ కన్వీనర్ రవి కుమార్, నాబార్డు డీడీఎం కార్తిక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ టీ కామేశ్వరరావు, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Guntur

2021-06-23 14:36:47

సెజ్ భూములు రైతులకే ఇచ్చేయాలి..

కాకినాడ ప్ర‌త్యేక ఆర్థిక మండ‌లి (ఎస్ఈజెడ్‌)లో సేక‌రించిన 2,180 ఎక‌రాల భూముల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఏడాది మార్చిలో విడుద‌ల చేసిన జీవో నెం.12 మేర‌కు తిరిగి రైతుల‌కు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా పూర్తిచేసేందుకు కృషిచేయాల‌ని రాష్ట్ర  పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆర్.కరికాల వలవన్ పేర్కొన్నారు. బుధ‌వారం సాయంత్రం కాకినాడ‌లోని జీఆర్‌టీలో కాకినాడ సెజ్ భూముల‌ను రైతుల‌కు తిరిగి ఇచ్చే కార్య‌క్ర‌మంపై క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, రెవెన్యూ, ప‌రిశ్ర‌మ‌లు, సెజ్ త‌దిత‌ర విభాగాల అధికారుల‌తో ఆర్.కరికాల వలవన్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌రికాల వ‌లవ‌న్ మాట్లాడుతూ కేట‌గిరీ-1లో 1357.18 ఎక‌రాల మేర ఎవ‌రి భూముల‌ను వారికి ఇవ్వాల్సి ఉండ‌గా,  కేట‌గిరీ-2లో 821.61 ఎక‌రాల ప్ర‌త్యామ్నాయ భూముల‌ను ఇవ్వాల్సి ఉందన్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు త్వ‌రిత‌గ‌తిన రైతుల పేరిట భూముల రిజిస్ట్రేష‌న్‌ను పూర్తిచేసేందుకు కాకినాడ‌, పెద్దాపురం డివిజ‌న్ల‌లో చేప‌ట్టిన ముంద‌స్తు స‌ర్వేను పూర్తిచేయాల‌ని, భూ య‌జ‌మానులు మ‌ర‌ణించిన కేసులపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని సూచించారు. 

కేట‌గిరీ-1లో 1,341 మంది రైతుల‌కు, కేట‌గిరీ-2లో 1,131 మంది రైతుల‌కు భూముల‌ను రిజిస్ట్రేష‌న్ చేసి ఇచ్చేందుకు డాక్యుమెంట్ల‌ను సిద్ధం చేయాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మాన్ని నిరాటంకంగా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న విజ‌య‌వంతంగా పూర్తిచేసేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేకంగా రెవెన్యూ, ప‌రిశ్ర‌మ‌లు, స‌ర్వే త‌దిత‌ర విభాగాల అధికారులు, సిబ్బందితో ఏర్పాటుచేసిన బృందాలు క్షేత్ర‌స్థాయి కార్య‌క‌లాపాల్లో కీల‌కపాత్ర పోషిస్తున్నాయ‌ని, అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని బృందాల‌ను ఏర్పాటు చేయాల‌ని, విలేజ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాల‌న్నారు. క్షేత్ర‌స్థాయిలో ఏవైనా స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మైతే అధికారులు స‌మ‌న్వ‌యంతో వాటిని ప‌రిష్క‌రించి, కార్య‌క‌లాపాల‌ను ముందుకు తీసుకెళ్లాల‌ని ఆర్.కరికాల వ‌లవ‌న్ సూచించారు. స‌మావేశంలో కాకినాడ ఆర్‌డీవో, పెద్దాపురం ఇన్‌ఛార్జ్ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, కాకినాడ సెజ్ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ కె.మ‌నోర‌మ‌, ఏపీఐఐసీ జోన‌ల్ మేనేజ‌ర్ కేపీ సుధాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-23 14:31:51

నీటి ప్రణాళికలు సిద్దం చేయండి..

 తాగు, సాగు నీటి సరఫరాపై అవసరమైన ప్రణాళికలను త్వరితగతిన సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో హెచ్ఎల్సీ, హెచ్ఎన్ఎస్ఎస్, మైనర్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యుఎస్, పబ్లిక్ హెల్త్, ఏపీఎస్ఐడిసి శాఖల అధికారులతో ఇరిగేషన్ మరియు తాగునీటి సరఫరా పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఎల్సీ, హెచ్ఎన్ఎస్ఎస్ కింద వివిధ రిజర్వాయర్ లకు, ప్రాజెక్టులకు, ట్యాoకులకు తాగు, సాగు నీటి సరఫరా చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆయా రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు, ట్యాoకులకు ఎంత నీరు ఇవ్వాల్సి ఉంటుంది అనేది చూసుకుని కేటాయించిన లక్ష్యం మేరకు నీటి సరఫరాను చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు ఎన్ని టిఎంసిల నీరు కేటాయించారు అనేదానికి అనుగుణంగా నీటి సరఫరా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఆయా బ్రాంచ్ కెనాల్స్ కింద ఆయకట్టుకు అవసరమైన నీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్, హెచ్ఎల్సీ అధికారులు సమన్వయం చేసుకుని ఎన్ని ట్యాంకులకు తాగు నీరు సరఫరా చేస్తారు అనేది ముందుగానే నిర్ణయించుకోవాలన్నారు. హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మిగిలిన ఆధునీకరణ పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

ఆర్డబ్ల్యూఎస్ కింద జగనన్న హౌసింగ్ కాలనీలలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల పనులు పూర్తిచేసి ఈనెల 31వ తేదీ లోపు నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో ప్రతిరోజు తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గత ఏడాది నవంబర్ నెలలో నిర్వహించిన డిఆర్సి సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జూలై నెలలో మరోసారి ఇరిగేషన్ మరియు తాగునీటి సరఫరా పై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, అన్ని రకాల వివరాలతో సమావేశానికి హాజరు కావాలన్నారు. అలాగే త్వరలో నిర్వహించే డిఆర్సి సమావేశానికి అన్ని విధాలా సమగ్ర సమాచారంతో హాజరయ్యేలా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా హెచ్ఎల్సి కింద తుంగభద్ర డ్యాం గురించి, కాలువలు, ఆయకట్టు వివరాలు, నీటి సరఫరా, నీటి ప్రవాహం, రిజర్వాయర్ల వివరాలు, తదితర వాటిని జిల్లా కలెక్టర్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. హెచ్ఎన్ఎస్ఎస్ కింద జీడిపల్లి, పేరూరు, మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్ లు, పుంగనూరు, మడకశిర బ్రాంచ్ కెనాల్ గురించి, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1, ఫేజ్ 2 కింద చేపట్టిన పనుల వివరాలను, హెచ్ఎన్ఎస్ఎస్ కింద నీటి సరఫరా ఎంత జరుగుతోంది, ఎప్పుడు నీటి విడుదల చేస్తారు, జిల్లాకు ఈ ఏడాది ఎన్ని టీఎంసీలు కేటాయించారు తదితర వివరాలను ఎస్ఈని అడిగి తెలుసుకున్నారు. అలాగే మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న ప్రాజెక్టుల వివరాలు, పబ్లిక్ హెల్త్ కింద చేపట్టిన పనులు, నీటి సరఫరా వివరాలు, ఏపీఎస్ఐడిసి కింద చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఆయా శాఖల కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ వెంకటరమణ, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ సతీష్ చంద్ర, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, ఏపీఎస్ఐడిసి డీఈఈ అనురాధ, ఈఈ రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-23 14:24:03

సత్వరమే ప్రభుత్వ నిర్మాణాలు జరగాలి..

ప్రభుత్వ నిర్మాణాలను సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వేమూరు మండలం, జంపని గ్రామంలో  ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రంతో పాటు జనగన్న కాలనీ నిర్మాణాలను అధికారులతో కలసి పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన బిల్లులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఎస్.ఈ నతానియేల్, తెనాలి ఇన్ చార్జ్ ఆర్ డి ఓ భాస్కర రెడ్డి, తెనాలి డివిజన్ మండలాల తహశీల్దార్లు, యంపిడిఓ లు, విద్యుత్, గృహ నిర్మాణ, పంచాయితీ రాజ్, ఏ.పి ఫైబర్ నెట్ శాఖాధికారులు, సచివాలయాల కార్యదర్శులు,  వాలంటీర్లు  తదితరులు పాల్గొన్నారు.  

Vemuru

2021-06-23 14:17:47

ఇళ్ల నిర్మాణాలు లక్ష్యాలు చేరుకోవాలి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు -పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు.  బుధవారం జిల్లాలోని వేమూరు మండల పరిషత్తు కార్యాలయంలో నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, వేమూరు శాసన సభ్యులు మేరుగ నాగార్జునతో కలసి  సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని వేమూరు, చుండూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కార్యక్రమం పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని  అన్నీ నియోజకవర్గాల వారిగా  చూస్తే వేమూరు నియోజకవర్గంలో పనుల్లో వేగం పెంచాల్సి వుందన్నారు.  నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళ పధకం పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా త్వరితగతిన పేదలకు ఇళ్ళు నిర్మించేలా అవసరమైతే  స్వచ్ఛంధ సంస్థలు, ఆయా గ్రామ సర్పంచ్ ల సహకారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.    అనంతరం వేమూరు నియోజవర్గానికి సంబంధించి నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పధకం ఇళ్ళ నిర్మాణాలలో ఏర్పాటు చేస్తున్న మౌళిక వసతుల  వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

 ఐదు మండలాల్లో 169 లే అవుట్లు ఏర్పాటు అయినట్లు అధికారులు నివేదిక ద్వారా వెల్లడించారు. ఇళ్ళ స్థలాల కోసం 11,003 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 1366 మందికి ఇళ్ళ స్థలాలున్నాయని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 12369 మంది లబ్దిదారులు ఇళ్ళు నిర్మించుకునేందుకు అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇందులో గ్రౌండింగ్ పూర్తి అయిన ఇళ్ళ స్థలాలు 1432  ఉండగా, 247 మంది సొంత స్థలాలు వుండి ఇళ్ళు నిర్మించుకునేందుకు సమ్మతి తెలియజేసినట్లు అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.  తొలిదశలో 1679 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళు నిర్మించుకునేందుకు అనుమతి మంజూరు చేసినట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వేణు గోపాలరావు జిల్లా కలెక్టర్ కు వివరించారు. మొత్తం 169 లే అవుట్లకు గాను మౌళిక వసతులకు సంబంధించి ఇప్పటి వరకు ఐదు మండలాల్లో 18 లే అవుట్లలో బోర్లు వేయడం జరిగిందన్నారు. 119 చోట్ల బోర్లు వేసే పనులు కొనసాగుతున్నాయన్నారు. మరో 26 చోట్ల పనులు ప్రారంభంకావలసి వుందన్నారు. విద్యుత్ లైన్లకు సంబంధించి  14 లే అవుట్లలో విద్యుత్ లైన్ల కార్యక్రమం పూర్తి అయిందన్నారు.  మరో 63 చోట్ల పనులు కొనసాగుతున్నాయని, 78 చోట్ల త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.

 చుండూరు మండలంలోని 35 లే అవుట్ల లో విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం లేదని అధికారులు వివరించారు. ఫ్లాట్ల మ్యాపింగ్ కార్యక్రమం 12344 చోట్ల పూర్తి అయిందని, మరో 25 చోట్ల మ్యాపింగ్ చేయాల్సి వుందన్నారు.  12 126 ఫ్లాట్ల కు జియోట్యాగింగ్ పూర్తికాగా, 243 ఇళ్ళ స్థలాలకు జియోట్యాగింగ్ చేయాల్సి వుందన్నారు. 11630 ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి కాగా, 739 స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వుందన్నారు. 12 369 మంది లబ్దిదారులకు  ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం జాబ్ కార్డ్ లను అనుసంధానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కు తెలియజేసారు.  

  వేమూరు నియోజకవర్గ  శాసన సభ్యులు మేరుగ నాగార్జున మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో ఎక్కువ లోతట్టు గ్రామాలు వేమూరు నియోజకవర్గంలోనే ఎక్కువగా వున్నాయన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళు నిర్మిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వేణు గోపాలరావు, తదితర అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఇళ్ళ స్థలాలను లోతట్టు, మాగాణి ప్రాంతాలలో జగనన్న కాలనీ లే అవుట్లు ఏర్పాటు చేయడం వలన మెరక కోసం మట్టిని ఏర్పాటు చేసుకోవలసిన పరిస్థితి వుందన్నారు.  

దీనిపై స్పందింన జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంతాలలో వున్న కాలనీ లలో మౌళిక ఏర్పాటుతో పాటు ఇళ్ళ స్థలాలకు అవసరమైన మెరక మట్టిని లబ్దిదారులకు అందించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా వేమూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీ లు నిర్మించి పెదలందరికి మేలు చేస్తామని శాసన సభ్యులు పేర్కొన్నారు.  సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.  పేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మూడు విధానాల్లో ఇళ్ళ నిర్మాణాల కార్యక్రమం వేగవంతం చేయాలని కోరారు.
  
  సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ క్రొత్తగా ఎంపిక అయిన సర్పంచ్ లను మాట్లాడాలని కోరారు. దీంతో పలువురు సర్పంచ్ లు నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు నిర్మాణాలలో ఎదురు అవుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. తదుపరి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మీడియా వారితో మాట్లాడుతూ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళ పధకం పురోగతి వివరాలను  వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఎస్.ఈ నతానియేల్, తెనాలి ఇన్ చార్జ్ ఆర్ డి ఓ భాస్కర రెడ్డి, తెనాలి డివిజన్ మండలాల తహశీల్దార్లు, యంపిడిఓ లు, విద్యుత్, గృహ నిర్మాణ, పంచాయితీ రాజ్, ఏ.పి ఫైబర్ నెట్ శాఖాధికారులు, సచివాలయాల కార్యదర్శులు,  వాలంటీర్లు  తదితరులు పాల్గొన్నారు.  

Guntur

2021-06-23 14:16:21

10వేల గ్రుహాలు ప్రారంభం కావాలి..

జగనన్న కాలనీలలో ఈ నెలాఖరులోగా పదివేల గృహ నిర్మాణాల ప్రారంభానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై బుధవారం మార్కాపురం ప్రెస్ క్లబ్ లో మార్కాపురం డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. అధికారులు కష్టపడి మిషన్ మోడ్ లో  పనిచేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. గ్రామస్థాయి నుంచి  ప్రణాళికలు రూపొందించుకొని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన మార్గనిర్దేశం చేశారు. జిల్లాకు చెడ్డ పేరు రానివ్వద్దని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక క్యాంపైన్ లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల నిధులు వెచ్చిస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలలో పురోగతి సాధించలేకపోతే ఎలా అంటూ అధికారులను కలెక్టర్ నిలదీశారు. మండలాల వారీగా నిర్ణయించిన లక్ష్యాల సాధనకు అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. జగనన్న కాలనీలలో లబ్ధిదారులను ప్రోత్సహించి గృహాలు నిర్మించుకునేలా చైతన్యపరచాలి అన్నారు.

           జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పనుల ప్రారంభంలో అధికారులు నిర్లిప్తత ప్రదర్శిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రస్తుతం మార్కాపురం డివిజన్లో 12 క్లస్టర్లలో లోని లేఅవుట్లలో భూమి సమస్య పరిష్కారం కాలేదన్నారు. వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జియో ట్యాగింగ్, ఆధార్ అనుసంధానం, ఆన్లైన్ నమోదు, మ్యాపింగ్ ప్రక్రియ జిల్లాలో 70 శాతం ఉందన్నారు. జూలై 4వ తేదీ నాటికి నూరు శాతం గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అర్ధవీడు మండలంలో గృహాల నిర్మాణం గ్రౌండింగ్ 4%, దోర్నాల మండలంలో 2 శాతం, పుల్లల చెరువు మండలంలో ఏడు శాతం, మార్కాపురం పట్టణంలో 71 గృహాలు మాత్రమే గ్రౌండింగ్ జరగడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా మూడు వేల గృహాల నిర్మాణం పనులు ప్రారంభం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందన్నారు. అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న కాలనీలలో జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో  మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను  ప్రజలలోకి తీసుకు వెళ్లాలన్నారు. 

మంజూరైన గృహాల నిర్మాణ పనులు ప్రారంభించకుండా అభ్యంతరాలు వ్యక్తం చేసే లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలన్నారు. వారి నుంచి అనుమతి పత్రం తీసుకున్న తదుపరి నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆ స్థలాలు కేటాయించడానికి అధికారులు పరిశీలించాలన్నారు. కోవిడ్ కేసులు జిల్లాలో నేటికి పూర్తిగా తగ్గలేదని జాగ్రత్తలు పాటిస్తూనే అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.  సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్లు (ఆర్.బి అండ్ ఆర్ ) జె. వెంకట మురళి,  కె.ఎస్. విశ్వనాథన్, గృహ నిర్మాణ శాఖ పీడీ సాయినాథ్ కుమార్, డ్వామా పి డి శీనా రెడ్డి, పీ ఆర్ ఎస్ఈ కొండయ్య, ఉప కలెక్టర్ గ్లోరియా, ట్రాన్స్కో ఎస్ సి, మార్కాపురం ఆర్డీవో ఎం.వి.శేషి రెడ్డి, తహసిల్దార్లు, ఎం డి వో లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Markapuram

2021-06-23 13:08:44

సత్వరమే నిర్మాణాలు పూర్తిచేయాలి..

 గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ,  అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.  భవన నిర్మాణ పక్షోత్సవాలలో భాగంగా పొదిలి మండలం తలమళ్ల గ్రామంలో రూ.40 లక్షల నిధులతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం మాదాలవారిపాలెంలో రూ.40లక్షలతో నిర్మాణం పూర్తిచేసిన సచివాలయం భవనం, రూ.21.8 లక్షల నిధులతో  నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాలను పరిశీలించారు. రూ.17.59 లక్షల నిధులతో చేపట్టిన వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనం అంచనాలు మారడంతో అర్ధాంతరంగా నిలిచిన  నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పేదలందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేయడానికి సచివాలయాలు వేదికగా మారాయని కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ప్రభుత్వ సచివాలయ భవనాలు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ యూనిట్ల భవనాలు కూడా నిర్మాణం జరుగుతున్నాయన్నారు. భవన నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో రాజీ పడరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

భవన నిర్మాణ పక్షోత్సవాలలో భాగంగా పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. కోవిడ్ నివారణపై మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.  ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఏడు శాతం కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయని, అవి పూర్తిగా తగ్గాలన్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరిగా పాటించేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. ముఖ్యంగా జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైయస్సార్ చేయూత లబ్ధిదారులు ముందుకు రావాలన్నారు. డెయిరీ యూనిట్లు నడుపుకునే స్వయం సహాయక సంఘాలలోని పొదుపు సభ్యులు అమూల్ సంస్థ ఏర్పాటుచేసిన పాల సేకరణ కేంద్రాలలో పాలు పోసేలా చూడాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ రోగులను పర్యవేక్షించాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని ఆయన పలు సూచనలు చేశారు. గోగినేనివారిపాలెం గ్రామంలో  పాల సేకరణ కేంద్రాన్ని  ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శీనారెడ్డి, పీఆర్ ఎస్ఈ కొండయ్య, తహసిల్దార్ ఏ వి హనుమంతరావు, ఎంపీడీవో పి శ్రీకృష్ణ, స్థానిక సర్పంచ్ సుబ్బమ్మ, వివిధశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Podili

2021-06-23 13:04:09

జూలై 10న జాతీయ లోక్ అదాలత్..

రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించు కోవడాని కి నేషనల్ లోక్ అదాలత్  చక్కటి పరిష్కార వేదికని ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి వెంకట జ్యోతిర్మయి అన్నారు జూలై నెల 10వ తేదీ దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ లోక్ అదాలత్ లో భాగంగా ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది అని ఈ సందర్భంగా రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు మరియు అన్ని రకాల సివిల్ కేసులు మోటారు వాహన ప్రమాద బీమా పరిహారం చెల్లింపు కేసులు వివాహ సంబంధం కేసులు మరియు  చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించ పడతాయని ఈ అవకాశాన్ని కక్షిదారులు ఇరువురూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Ongole

2021-06-23 12:58:27

25న అరసవెల్లిలో హుండీ లెక్కింపు..

శ్రీకాకుళం జిల్లాలోని ఈ నెల 25న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీలు లెక్కింపు ఉంటుందని దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమీషనర్, కార్య నిర్వహణాధికారి వి. హరి సూర్య ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.  25వ తేదీన (శుక్రవారం) ఉదయం 9 గంటలకు 40 మంది సిబ్బందితో డిపార్టమెంటు వారి సమక్షములో అనువంశిక ధర్మకర్త, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం హుండీలు తెరచుటకు నిర్ణయించడమైనదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Arasavilli

2021-06-23 12:38:38

కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రభుత్వం కోవిడ్ నిబంధనల సడలింపు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ కర్ఫ్యూ వేళల్లో మాత్రమే సడలింపు ఉందని గుర్తించాలని ఆయన అన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకొనుటకు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. అధికారులు కోవిడ్ నిబంధనలను అమలు చేయడంలో పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు పాటించి అనుమతి మేరకు మాత్రమే వేడుకలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. పరిమితికి మించి గుమిగూడరాదని ఆయన అన్నారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ తగ్గుముఖంలో మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించక పోతే కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జాయింట్ కలెక్టర్ అన్నారు. మొదటి దశ చివరలో జిల్లాలో కేసులు తగ్గు ముఖం పట్టాయని, ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని సందర్భాలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ నిబంధనల పట్ల అశ్రద్ద వలన వేల సంఖ్యలో కేసుల పెరుగుదల వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలందరూ మాస్క్ లను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరం అయితేనే బయటకు రావాలని ఆయన సూచించారు. జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా చేయుటకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

 జిల్లాలో సామర్థ్యం మేరకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, నమూనాలు విస్తృతంగా సేకరించాలని ఆయన జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.  కనీసం పది రోజుల పాటు రోజుకు ఆరు నుంచి ఏడు వేల వరకు నమూనాలు సేకరించాలని అన్నారు.   ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మండల ప్రత్యేక అధికారులు, వైద్యులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-23 12:32:22

Simhachalam

2021-06-23 06:49:38

మాన్సాస్ ఆక్రమాలు ఆ విధంగా తెరపైకి ..

విజయనగర రాజ వంశంలో కీలకంగా వున్న మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇపుడు మాన్సాస్ లో జరిగిన అక్రమాలు బయటకు తీస్తారా..వాటిలో ఎవరి హస్తం ఉందో ఆకోణంలో వాస్తవాలు బయటకొస్తాయని చెబుతున్నారు. దానికి విశాఖలో రాజ్యసభ్య సభ్యులు వి.విజయసాయిరెడ్డి చేసిన ఆశక్తికర వ్యాఖ్యలు బలాన్ని చేకూరస్తున్నాయి. మొన్నటి వరకూ టిడిపి అధికారంలో ఉండటంతో ఆ ట్రస్టుకి చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తూ వచ్చారు.  వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ఆ ట్రస్టు, సింహాచల దేవస్థాన చైర్మన్ పదవులు సంచయిత గజపతిరాజు చేతిలోకి వచ్చాయి.. చాలా ఏళ్ల తరువాత ట్రస్టు చేతులు మారిందని, దాని రూపు రేఖలు మారుతాయనుకున్న తరుణంలో మళ్లీ హైకోర్టులో అశోక్ గజపతిరాజు తరపున న్యాయవాధి వాదలను వినిపించడంతో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఆ వెంటనే రాజకీయాలకు తెరలేపిన అశోక్ గజపతిరాజు ప్రభుత్వంపై చాలా వ్యాఖ్యలే చేశారు. వాటిని సుమోటాగా స్వీకరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ వచ్చింది. అయితే గత వారం రోజుల నుంచి మాన్సాస్ అక్రమాలపై ప్రభుత్వ పెద్దలు కాస్త గట్టిగానే ద్రుష్టిపెట్టినట్టు వార్తలొస్తున్నాయి. మాన్సాస్ విషయంలో చేసిన అవినీతిని బయట పెడతామని విజయసాయిరెడ్డి ప్రకటించండంతో ఆ వేడి మరింత రాజుకుంది. ఉత్తరాంధ్రాలోని కీలకమైన అంశంగా మాన్సాస్ వ్యవహారం గజపతిరాజు వంశాన్ని ఓ కుదుపు కుదిపింది. మాన్సాస్ వ్యవహారంలో ఒకే కుటుంబంలో కూతురు, చిన్నాన్నలు కోర్టుకెళ్లి నువ్వా నేనా అని తలపడిన సమయంలో హైకోర్టు చిన్నాన్న వైపే తీర్పు వెలువడింది. ఈ తీర్పును సవాల్ గా తీసుకున్న ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకి వెళ్లి పోరాటం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాజు మాన్సాస్ లో చేసిన అవినీతి ఆధారాలతో సహాయ బయట పెట్టిన తరువాత వాటితో సుప్రీం కోర్టుకి వెళ్లాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ట్రస్టు భూములు పక్కదారిపట్టాయని వాటి పరిరక్షిస్తామని చెప్పడంతో ఈ విషయంలో గట్టిగానే సమాధానం చెబుతామన్నా మంత్రులు ప్రకటనలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈ విషయంలో ప్రభుత్వాని వ్యతిరేకంగా వున్న మీడియా దీనినే ప్రధాన అంశంగా కూడా చూపిస్తూ ప్రజలను ఆలోచింపచేస్తున్నా..వాస్తవ అక్రమాలను బయటకు తీసినపుడు అదే స్థాయి ప్రచారం కల్పించి రాజు అవినీతి వ్యవహారాన్ని బట్టబయలు చేయాలనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో మాన్సాస్ మరో మలుపు తిరిగి ప్రభుత్వానికి తలనొప్పిగా మారినా..వాస్తవాలను ప్రజలకు తెలియజేసి మళ్లీ సంచయిత గజపతిరాజుని ట్రస్టుకి చైర్మన్ ను చేయాలనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అంశం. అందుకే నేటికి కూడా గజపతిరాజు సంచయిత కోర్టు తీర్పు విషయంలో ఒక్క ప్రకటన కూడా చేయలేదు. హైకోర్టు తీర్పు ఇచ్చిన నాటి నుంచి నేటి వరకూ ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడటం, గజపతిరాజు, టిడిపి నేతల ఆరోపణలపై స్పందిస్తున్నారు తప్పితే సంచయిత మాత్రం నోరు విప్పడం లేదు. అటు ఈ విషయంలో విజయనగర రాజులకు ప్రతిష్టాత్మకంగా వున్న మాన్సాస్ ట్రస్టు విషయంలో కుటుంబ పరువు తీసుకోవద్ద చిన్నాన్న, కుటుంబ సభ్యులు సంచయితపై ఒత్తిడి తెస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు మాన్సాస్ లోని ముఖ్యమైన వ్యవహారాలు చేధించినట్టుగానే కనిపిస్తుంది. ఆ కారణంతోనే వాస్తవాలతోనే ప్రజలముందుకి వస్తామనే మాటలకు బలం చేకూరుతుంది.  చాలా ఏళ్ల నుంచి మాన్సాస్ ట్రస్టును టిడిపి నాయకులు మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహిస్తూ వస్తున్నారు. అదేసమయంలో సింహాచలం ట్రస్టుబోర్టులో కూడా ఈ కుటుంబం నుంచే అనువంశికంగా ధర్మకర్తలు కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా తెరపైకి వచ్చిన సంచయిత గజపతిరాజుని ప్రభుత్వం ప్రమోట్ చేయడం..ప్రత్యేక జీఓల అధికారం చేతిలో పెట్టినా ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మాన్సాస్ లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం కూడా చాలా గట్టి పట్టే పట్టింది. ఈ రసవత్తర సమయంలో మాన్సాస్ విషయంలో సంచయిత గజపతిరాజుకి సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందా తిరిగి మళ్లీ మాన్సాస్ కి మహారాణి అవుతుందా..ఏ స్థాయిలో రాష్ట్రప్రభుత్వం మాన్సాస్ లో జరిగిన అవినీతిని బయటకు తీసి అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచుతుంది అనేది ఆశక్తికరంగా మారింది..! 

Visakhapatnam

2021-06-23 02:49:42