1 ENS Live Breaking News

1 నుంచి మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళా..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలందరికి ఇళ్ల నిర్మాణంలో భాగంగా జులై 1వ తేదీ నుండి మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళాను జిల్లాలో నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. గృహ నిర్మాణాలకు ఆయా గ్రామాల వారీగా లబ్ధిదారులను సమాయత్తం చేయడంతో పాటు, ఇందుకు అవసరమైన ఇసుక కూపన్లు, సిమెంటు సరఫరా తదితరాలపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 90వేల గృహ నిర్మాణాలకు గాను 80వేల గృహాలకు గ్రౌండింగ్ జరగాల్సి ఉందన్నారు. ఇవన్నీ జూలై 1వ తేదీ నుండి గ్రౌండింగ్ ప్రారంభం కావాలన్నారు. జులై 1,2,3,4 తేదీల్లో జిల్లాలోని అన్ని గృహాలు గ్రౌండింగ్ కావాలని, ప్రతీ రోజు సుమారు 16వేలకు పైచిలుకు గ్రౌండింగ్ కావాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రౌండింగ్ అయిన వెంటనే గృహ నిర్మాణాలకు సంబందించిన ఇసుక, సిమెంట్, ఇతర సామాగ్రిని  ఆయా హౌసింగ్ ఏ.ఈలు సిద్ధం చేసుకోవాలని, గ్రౌండింగ్ ఆయిన తక్షణమే గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గృహాలు మహిళల పేరునే ఉన్నందున స్వయం సహాయక బృందాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా గ్రౌండింగ్ అయ్యేందుకు అవసరమైన నిధులను సమకూర్చాలని డి.ఆర్.డి.ఏ పథక సంచాలకులు బి.శాంతిశ్రీని కలెక్టర్ ఆదేశించారు. దూర ప్రాంతాల్లో ఉండే లే అవుట్లకు లబ్ధిదారులు చేరుకునేందుకు వీలుగా మండల అధికారులు, మునిసిపల్ కమీషనర్లు రవాణా సదుపాయాలతో పాటు లేఅవుట్ల వద్ద టెంటు మరియు ఇతరత్రా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. గృహాలు గ్రౌండింగ్ విషయమై లబ్దిదారులకు ముందుగానే తెలియపరచాలని, ఇందుకు రానున్న 4 రోజుల్లో జిల్లా, మండల, గ్రామ స్థాయి సమావేశాలను ఏర్పాటుచేసి లబ్దిదారులకు వివరించాలని చెప్పారు. ఈ నెల 30 నాటికి జిల్లాలోని అన్ని గృహాలు గ్రౌండింగ్ నకు సిద్ధం కావాలని,  లేఅవుట్లలో విద్యుత్, తాగునీరు అత్యంత ఆవశ్యకమని వాటిని సంబంధిత శాఖాధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వివరించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి కమిటీలు వేసి వాటిని సకాలంలో పూర్తిచేయాలని అన్నారు.           

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, గృహనిర్మాణ శాఖ సంయుక్త సంచాలకులు హిమాంశు కౌశిక్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా నీటియాజమాన్య సంస్థ  పథక సంచాలకులు హెచ్.కూర్మనాథ్, గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహనరావు, ఆర్.డబ్ల్యూ.ఎస్., ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ ఎస్.ఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-25 16:03:26

బ్లాక్ ఫంగ‌స్‌పై ఆందోళ‌న వ‌ద్దు..

బ్లాక్ ఫంగస్ పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు.  ప్ర‌స్తుతం జిల్లాలో ఆరు ప్ర‌భుత్వ‌, 35 ప్రైవేటు మొత్తం 41 ఆసుప‌త్రులు కోవిడ్ వైద్య సేవ‌లందిస్తున్నాయ‌ని, వీటిలో 3,299 ప‌డ‌క‌లు ఉండ‌గా, 78 శాతం ఖాళీగా ఉన్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. బొమ్మూరు, బోడ‌స‌కుర్రు కోవిడ్ కేర్ కేంద్రాల్లో 5000 వ‌ర‌కు ప‌డ‌క‌లు ఉన్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో 280 బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోదుకాగా.. ప్ర‌స్తుతం 122 మంది చికిత్స పొందుతున్నార‌ని, రాష్ట్రంలోనే కాకినాడ జీజీహెచ్ బ్లాక్ ఫంగ‌స్‌కు అత్యుత్త‌మ చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్‌తో త‌ల్లిదండ్రుల‌ను పోగొట్టుకొని అనాథలైన చిన్నారుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌లు డిపాజిట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. 

Kakinada

2021-06-25 15:00:22

థర్డ్ వేవ్‌కు ముంద‌స్తు కార్యాచ‌ర‌ణ‌..

కోవిడ్ మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో ఆసుప‌త్రుల్లో మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి కార్యాచ‌ర‌ణ రూపొంచాలని డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో నెం.57 ప్ర‌కారం ప్రైవేటు ఆసుప‌త్రులు త‌ప్ప‌నిస‌రిగా ప్రాథ‌మిక మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. కోవిడ్‌తో సంబంధం లేకుండా 100కు పైబ‌డి ప‌డ‌క‌లు ఉన్న ఆసుప‌త్రులు 100 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌కు స‌మాన సంఖ్య‌లో ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను, ఆక్సిజ‌న్ మాస్కులు, రెగ్యులేట‌ర్ల‌ను స‌మ‌కూర్చుకోవాల‌న్నారు. అదే విధంగా వెయ్యి ఎల్‌పీఎం సామ‌ర్థ్య‌మున్న ఆక్సిజ‌న్ పీఎస్ఏ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. ఆక్సిజ‌న్ యూనిట్‌కు ఆగ‌స్టు 1వ తేదీ డెడ్‌లైన్ కాగా.. మిగిలిన వాటి ఏర్పాటుకు జులై 7వ తేదీని గ‌డువుగా నిర్దేశించిన‌ట్లు తెలిపారు. 50 నుంచి 100 పడ‌క‌లున్న ఆసుప‌త్రులు 100 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌కు స‌మాన సంఖ్య‌లో కాన్సంట్రేట‌ర్లు, మాస్కులు, రెగ్యులేట‌ర్లు ఏర్పాటు చేసుకోవాల‌ని, వీటికి అద‌నంగా 500 ఎల్‌పీఎం సామ‌ర్థ్య‌మున్న ఆక్సిజన్ పీఎస్ఏ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంద‌న్నారు. 50లోపు ప‌డ‌క‌లుంటే 40 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌కు స‌మాన సంఖ్య‌లో కాన్సంట్రేట‌ర్లు, మాస్కులు, రెగ్యులేట‌ర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. మూడో వేవ్‌లో చిన్నారుల‌పై అధిక ప్ర‌భావం ఉంటుంద‌న్న సూచ‌న‌ల నేప‌థ్యంలో స‌న్న‌ద్ధ‌త‌తో పీడియాట్రిక్ సాధార‌ణ‌, ఐసీయూ ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పీడియాట్రిక్ వైద్యులు, ఇత‌ర సిబ్బంది నియామ‌కం, ఆక్సిజ‌న్ పైపులైన్ల ఏర్పాటు, ఔష‌ధాలు త‌దిత‌రాల‌పై దృష్టిసారిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాకినాడ జీజీహెచ్‌లో ప్ర‌త్యేకంగా 200 పీడియాట్రిక్ ప‌డ‌క‌లతో విభాగాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ట్ర‌యాజింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామ‌న్నారు. సీహెచ్‌సీలు, ఏరియా ఆసుప‌త్రుల్లోనూ మూడో వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి మాట్లాడుతూ కోవిడ్ పోరాట యోధులుగా సేవలు అందిస్తూ మరణించి హెల్త్ కేర్ వర్కర్ల కుటుంబాలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇన్య్సూరెన్స్ పధకం అందించే 50 లక్షలు పరిహారం కొరకు జిల్లాలో ఇప్పటి వరకూ 17 ధరఖాస్తులు అందగా, 8 ధరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను చెల్లించడం జరిగిందని, మరో 9 ధరఖాస్తులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు.  ఈ పధకంతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ చికిత్సలు అందిస్తూ మరణించిన డాక్టర్లకు 25 లక్షలు, స్టాఫ్ నర్సులకు 20 లక్షలు, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలకు 15 లక్షలు, ఇతర ఆరోగ్య సిబ్బందికి 10 లక్షలు చొప్పున ఎక్సగ్రేషియా ప్రకటించిందన్నారు.  కోవిడ్ సేవలు అందిస్తూ మరణించిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కుటుంబాలు ఈ పరిహారాల కొరకు ధరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.  చిన్న పిల్లలను పొంచి ఉన్న  కోవిడ్ ధర్డ్ వేవ్ ముప్పునుండి రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నామన్నారు.  కాకినాడ జిజిహెచ్లో 200 పడకలతో పిడియాట్రిక్ విభాగాన్ని సిద్దం చేస్తున్నామని, అలాగే 50 ఆపై పడకలున్న సిహెచ్సి లలో 700 ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు పనులు నాలుగు రోజులలో పూర్తి కానున్నాయన్నారు.   3నెలల కాలానికి నియమించిన కోవిడ్ సిబ్బంది సేవలను 6 నెలలకు పొడిగించడం జరిగిందన్నారు.  ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ యోజన క్రింద ప్రతి నెల 9వ తేదీన గర్బిణులకు పి హెచ్ సిలలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల సందర్భంగా గర్బవతులలో కోవిడ్ పాజిటీవ్ సోకిన వారిని గుర్తించి వైద్య పర్యవేక్షణలో ఉంచుతున్నామన్నారు.  పాఠశాల విద్య,  ఐసిడిఎస్  సిబ్బందికి కోవిడ్ లక్షణాలుష కలిగిన పిల్లలను గుర్తించండంలో ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. చాలా మంది స్వంత వైద్యంతో కోవిడ్ ట్రీట్మెంట్ జాప్యం చేసుకుని ఆఖరి నిమిషంలో చికిత్సకు రావడం వల్ల ప్రాణాలు కాపాడటం కష్టమౌతోందని, కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తప్పని సరిగా కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రుల సేవలను పొందాలని కోరారు. 

ఆర్ఎంసి ప్రిన్సిపాల్ డా.బాబ్జీ మాట్లాడుతూ కోవిడ్ ఫస్ట్, సెంకండ్ వేవ్ లను జిల్లా యంత్రాంగం సహకారంతో ఆర్ఎంసి, జిజిహెచ్ లు సమర్ధవంతంగా ఎదుర్కోవడ జరిగిందన్నారు.  కోవిడ్ ధర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు అత్యుత్తమమైన నియోనేటల్ సేవలు  కాకినాడ జిజిహెచ్ పిడియాట్రిక్ విభాగంలో అందుబాటులో ఉన్నాయన్నారు.  జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ఆర్.మహాలక్ష్మి మాట్లాడుతూ ఆసుపత్రిలో 280 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా మల్టీ డిసిప్లినరీ టీములతో 100 మందికి సర్జరీలు చేసామని, 15 నెలల బాబుకు అరుదైన సర్జరీ విజయవంతంగా నిర్వహించమాన్నారు. కోవిడ్ ఒకసారి వచ్చిన వారికి మరో మారు రాదనే అపోహలను ప్రజలు వీడి ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలను తప్పని సరిగా పాటించాలని ఆమె కోరారు.  ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా. గౌరీశ్వరరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.      

Kakinada

2021-06-25 14:44:56

ఫీవర్ సర్వేతోపాటు కరోనా టెస్టులు పెంచాలి..

ప్ర‌తి గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల స్థాయిలో అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా ఫీవ‌ర్ స‌ర్వే, పీవ‌ర్ క్లినిక్‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లోని వివేకానంద హాల్‌లో కోవిడ్ ప్ర‌స్తుత ప‌రిస్థితి, క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌తో పాటు మూడో ద‌శ స‌న్న‌ద్ధ‌త కార్యాచ‌ర‌ణ‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి జిల్లా, డివిజ‌న‌ల్ స్థాయి వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంకా కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నందున , రోజుకు కరోనా పరీక్షలు 12 నుంచి 15 వేల వరకు పెంచాలని ఆదేశించారు. అంతేకాకుండా నిర్ల‌క్ష్యానికి తావులేకుండా కోవిడ్ నివార‌ణ, నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను కొన‌సాగించాల‌న్నారు. ప‌రీక్ష‌లు, చికిత్స‌, కంటైన్‌మెంట్‌, వ్యాక్సినేష‌న్ త‌దిత‌ర అంశాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్ర‌జ‌లు కూడా పూర్తి అవ‌గాహ‌న‌తో జాగ్ర‌త్త‌లు పాటించేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఆసుప‌త్రిలో క‌నీస మౌలిక వ‌స‌తులు అందుబాటులో ఉండేలా; ప‌డ‌క‌ల‌ను బ‌ట్టి సిలిండ‌ర్లు, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌కూర్చుకునేలా చూడాల‌న్నారు. పీఎస్ఏ యూనిట్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటుచేసుకొని, ద‌శ‌ల వారీగా 1000 ఎల్‌పీఎం సామ‌ర్థ్యాన్నికి పెంచుకోవాల‌న్నారు. మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, వైద్య ఉప‌క‌ర‌ణాల అందుబాటుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించేలా ప్రైవేటు ఆసుప‌త్రుల‌పై నిరంత‌ర స‌మీక్ష నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. పీడియాట్రిక్ సాధార‌ణ‌, ఐసీయూ ప‌డ‌క‌ల ఏర్పాటు; ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌, కోవిడ్ ప్రొఫైల్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఔష‌ధాలు, ఫిర్యాదుల ప‌రిష్కారం, మాన‌వ వ‌న‌రుల నియామ‌కం, శిక్ష‌ణ త‌దిత‌రాల‌కు సంబంధించి ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేయాల‌ని సూచించారు. నోడ‌ల్ అధికారుల వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని, కొత్త నోడ‌ల్ అధికారుల‌కు స‌రైన విధంగా శిక్ష‌ణ ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. సీహెచ్‌సీలు, ఏరియా ఆసుప‌త్రులు, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా ఆసుప‌త్రి, కాకినాడ జీజీహెచ్ ఆసుప‌త్రుల వారీగా మౌలిక వ‌స‌తుల అభివృద్ధి ప్ర‌ణాళిక‌పైనా క‌లెక్ట‌ర్ చ‌ర్చించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, డీసీహెచ్ఎస్ డా. ర‌మేశ్ కిషోర్‌, రంగ‌రాయ మెడిక‌ల్ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డా. కె.బాబ్జీ, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మి, ఆర్ఎంవో డా. ఇ.గిరిధ‌ర్‌, ఆరోగ్య‌శ్రీ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త పి.రాధాకృష్ణ‌, ఏపీ ఎంఎస్ఐడీసీ ఈఈ కె.సీతారామరాజు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Kakinada

2021-06-25 14:41:26

ఇళ్ల నిర్మాణాలపై అధికారులకు శిక్షణ..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జూలై నెల 1, 3, 4 తేదీలలో నిర్వహించనున్న గృహ నిర్మాణాల మేళాపై మండల ప్రత్యేకాధికారులకు శనివారం ఉదయం శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్  తెలిపారు.  శుక్రవారం సాయంత్రం సంయుక్త కలెక్టర్లతో ఆయన ఛాంబరులో మేళా  ఏర్పాట్లపై  సమీక్షించారు.  మేళా విజయవంతం చేయడానికి సంయుక్త కలెక్టర్లను, సబ్ కలెక్టర్ ను, ఐటిడిఎ పి.ఓను నియోజక వర్గాల పర్యవేక్షణాధికారులుగా నియమించారు. నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు, మండల ప్రత్యేకాధికారులు గృహ నిర్మాణాల మేళాకు ఇన్ ఛార్జిలుగా వ్యవహరిస్తారన్నారు. ప్రతీ మండలంలో మంజూరైన అన్ని గృహాలను 1వ తేదీన ప్రారంభమయ్యేలా చూడాలని ఆదేశించారు.  మిగిలిపోయినవి 3, 4వ తేదీలలో పూర్తి చేయాలన్నారు.   అందుకోసం మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, సచివాలయాల కార్యదర్శిలను, వాలంటీర్లను పూర్తి స్థాయిలో బాగస్వామ్యమయ్యేలా చూడాలన్నారు.  శిక్షణకు అవసరమగు అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలని గృహినిర్మాణ జె.సి. మయూర్ అశోక్ కు సూచించారు.  ఇన్ ఛార్జి అధికారులందరికి వెంటనే ఉత్తర్వులు సిద్దం చేయాలని హౌసింగ్ పిడి రమణమూర్తికి సూచించారు.  ఈ సమావేశంలో  సంయుక్త కలెక్టర్లు డా.మహేష్ కుమార్, జె.వెంకటరావు, సిపిఓ విజయలక్ష్మీ పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-25 14:13:00

కాలనీల నిర్మాణాలకి ప్రత్యేక ప్రణాళిక..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర‌కు పేద‌లంద‌రికీ ఇళ్లు కార్యక్రమంలో జిల్లాలోని పేద‌ల‌కు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ప్రత్యేక కార్యాచ‌ర‌ణ రూపొందిం చామ‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖ‌ల‌ను, ప్రజాప్రతినిధుల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ వ‌చ్చే జూలై 1,3,4 తేదీల్లో జిల్లాలో ఇళ్ల నిర్మాణ ప‌నులు ప్రారంభించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేప‌ట్టనున్నట్టు తెలిపారు. జూలై 1, 3 తేదీల్లో 8,900 ఇళ్లు చొప్పున‌, 4న 8,974 ఇళ్ల నిర్మాణాన్ని చేప‌ట్టడం ద్వారా ప్రత్యేక క్యాంపెయిన్‌లో మొత్తం 26,774 ఇళ్ల నిర్మాణం ప‌నులు ప్రారంభించేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామ‌న్నారు. జిల్లాలో 98,286 ఇళ్లు తొలి విడ‌త‌లో మంజూరు కాగా ఇందులో లే అవుట్లలో 53,403, ల‌బ్దిదారుల సొంత స్థలాల్లో 44,883 ఇళ్లు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్పటికే జిల్లాలో 8,833 ఇళ్ల నిర్మాణం ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని పేర్కొన్నారు. జూలై 1,3,4 తేదీల్లో చేప‌ట్టే ప్రత్యేక ఇళ్లనిర్మాణ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేసేందుకు ఒక్కో జాయింట్ క‌లెక్టర్ రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల బాధ్యత‌లు అప్పగిస్తున్నామ‌ని, మ‌రో నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కోసం మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్రత్యేక అధికారుల‌ను ఇప్పటికే నియ‌మించామ‌ని వీరంద‌రినీ ఈ కార్యక్రమంలో భాగ‌స్వామ్యం చేసి ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేప‌ట్టేలా చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు.

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని ఉద్యమ రీతిలో చేప‌ట్టేందుకు గృహ‌నిర్మాణ శాఖ ముఖ్య కార్యద‌ర్శి అజ‌య్ జైన్‌, సి.ఎం.ఓ. అధికారులు శుక్రవారం జిల్లా క‌లెక్టర్‌లు, హౌసింగ్ జాయింట్ క‌లెక్టర్‌లు, గృహ‌నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైర‌క్టర్‌ల‌తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్సులో త‌న క్యాంపు కార్యాల‌యం నుంచి పాల్గొన్న జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల నిర్మాణ కార్యాచ‌ర‌ణ ప్రణాళిక‌ను ముఖ్య కార్యద‌ర్శికి వివ‌రించారు. మండ‌ల స్థాయి అధికారులు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లతో శ‌నివారం స‌మావేశ‌మై ఇళ్ల నిర్మాణ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిస్తామ‌ని క‌లెక్టర్ పేర్కొన్నారు. మండ‌ల స్థాయి అధికారులు ఒక్కొక్కరికి మూడు స‌చివాల‌యాల ప‌రిధిలో ఇళ్ల నిర్మాణ బాధ్యత‌లు అప్పగిస్తామ‌న్నారు. గ్రామ స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లు అంద‌రినీ దీనిలో భాగ‌స్వాముల‌ను చేసి వారికి కూడా ల‌క్ష్యాలు నిర్దేశిస్తామ‌ని పేర్కొన్నారు.

ఇళ్ల నిర్మాణంలో జిల్లాలోని అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులంద‌రినీ భాగ‌స్వాముల‌ను చేసి వారి స‌హ‌కారం తీసుకుంటామ‌ని క‌లెక్టర్ వివ‌రించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇళ్ల నిర్మాణ కార్యాచ‌ర‌ణ‌పై వారితో చ‌ర్చించి ఖ‌రారు చేస్తామ‌న్నారు. గృహ‌నిర్మాణ శాఖ‌ ముఖ్య కార్యద‌ర్శి అజ‌య్ జైన్ మాట్లాడుతూ జూలై 1,3,4 తేదీల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక కాంపెయిన్  చేప‌ట్టాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించార‌ని, మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ అన్ని శాఖ‌ల భాగ‌స్వామ్యంతో విజ‌య‌వంతం చేసిన‌ట్లే ఇళ్ల నిర్మాణంలోనూ అన్ని శాఖ‌ల అధికారుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని ఆదేశించిన‌ట్లు టెలికాన్ఫరెన్సులో చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ జూలై 1,3,4 తేదీల‌ను స్పెష‌ల్ క్యాంపెయిన్ దినాలుగా ప‌రిగ‌ణించి ఆయా రోజుల్లో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బందిని భాగ‌స్వాముల‌ను చేసి పెద్ద ఎత్తున ఇళ్ల ప‌నులు ప్రారంభించాల‌ని సూచించారు. టెలి కాన్ఫరెన్సులో గృహ‌నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైర‌క్టర్ ఎస్‌.వి.ర‌మ‌ణ‌మూర్తి కూడా పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-25 14:05:33

ఎయిర్ పోర్టు పనులు వేగం పెంచాలి..

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ , రాయిపూర్–విశాఖ జాతీయ రహదారి కి సంబంధించి పెండింగ్  పనులు వేగంగా జరగాలని  సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ ఆదేశించారు.  శుక్రవారం ఆయన ఛాంబర్ లో భూ సేకరణ తదితర పనుల పై జే.సి  సమీక్షించారు.  భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం  కోర్ట్ కేసు లలో ఉన్న 89.47 ఎకరాల  భూమి  కి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, అందుకు సంబంధించి  ఎ.రావి వలస, సవరవల్లి, రావాడ, గుడెపు వలస గ్రామాలలో  అటవీ క్లియరెన్స్ , ఉద్యాన పంటల లెక్కింపు త్వరిత గతిన పూర్తి చెయ్యాలణి  ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు.  కోర్ట్  కేసు ల పరిష్కారం, గజెట్ పబ్లికేషన్ తదితర పనులను వేగంగా జరిగేలా చూడాలని రెవిన్యూ దడివిజినల్ అధికారి భవానీ శంకర్ కు సూచించారు.  ఎయిర్ పోర్ట్ అథారిటీ, జాతీయ రహదారి ప్రాజెక్ట్ అధికారి తో  ఉప కలెక్టర్లు  మాట్లాడుకొని రీ కన్సిలేషన్ పనులు కూడా సత్వరమే పూర్తయ్యేలా చూడాలన్నారు.  జాతీయ రహదారి కి సంబంధించి ఉప కలెక్టర్ లు ప్రతి రోజు క్షేత్ర స్థాయి లో పర్యటించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించి పనులను ముందుకు వెళ్ళేలా చూడాలన్నారు.  భూ సేకరణ పూర్తి చేసి  అవార్డులను పాస్ చెయ్యాలని ,  అధికారులంత సమన్వయంతో పని చెయ్యాలని అన్నారు. ఈ సమావేశం లో ఉప కలెక్టర్లు హెచ్. జయరాం, పద్మావతి,   వెంకటేశ్వర రావు,  తహసిల్దార్ ,  ఉద్యాన, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Bhogapuram

2021-06-25 14:03:37

ఎస్ఐ ఉద్యోగానికి సార్ధకత తీసుకువాలి..

ఎన్నో పరీక్షలు  కష్టపడి నెగ్గి సాధించిన ఎస్ ఐ ఉద్యోగానికి సార్థకత తీసుకొని రావాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ప్రొబిషనరీ ఎస్ఐలకు హిత బోద చేశారు. ఐదు నెలల శిక్షణ నిమిత్తం సిద్దిపేట కమిషనరేట్ కు వచ్చిన 26 మంది  ప్రొబిషనరీ ఎస్ఐలతో చట్ట ప్రకారం  నేర్చుకోవాల్సిన విధివిధానాలపై ఎస్ఐలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,  ప్రస్తుత శిక్షణా కాలంలోనే పోలీసు స్టేషన్లలోని విధుల పట్ల పూర్తి అవగాహన కల్పించుకోవాలన్నారు. ఎస్ఐ స్థాయి అధికారులు ప్రజలతో మమేకమై విధులు నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావించాలన్నారు.  సిబ్బందితో కలసి  విధులు నిర్వహింహించడం ద్వారా అన్ని విషయాలపట్ల మంచి అవగాహన ఏర్పడుతుందన్నారు. ప్రజలు పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు వారి సమస్యను సామరస్యపూర్వకంగా విని ఏ విధంగా పరిష్కరించాలో పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. సమాజం ప్రజలు పోలీసు చేసే ప్రతి పనిని పరిశీలిస్తోందని అది గమనిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. చట్టప్రకారం విధులు నిర్వహించి డిపార్ట్మెంట్ , వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, మర్యాదగా మాట్లాడాలని పేద ప్రజలు  పోలీస్ స్టేషన్కు వచ్చినపు వారికి మీ ద్వారా సహాయం అందుతుందనే భరోసా కల్పించాలన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగిస్తూ ముందుకు సాగాలన్నారు.  సమాజం, ప్రజలు మెచ్చుకునే విధంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు పోలీస్ డిపార్ట్ మెంట్ పై నమ్మకం పెరుగుతందన్నారు.

Siddipet

2021-06-25 13:55:20

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుచేయాలి..

విశాఖజిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకల సంఖ్యను పెంచుకోవాలని  అందుకు అవసరమైన ప్రణాళికలు ప్రతిపాదనలు  రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు.  శుక్రవారం ఉదయం కలెక్టరు  జిల్లాలోని  కె జి హెచ్, విమ్స్, ఆర్ సి డి, ఛాతీ ఆసుపత్రి, ఘోషా ఆసుపత్రి, మరియు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్లు, ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు వివరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటి లేటర్లు, మానిటర్లు మొదలగు  వాటి ప్రస్తుత సంఖ్య, వాటిని ఏమేరకు  పెంచగలము అనే విషయముపై వైద్యాధికారులు, ఎపి ఎస్ ఎమ్ ఐ.డి.సి. అధికారులతో చర్చించారు.  ఈ సందర్భముగా  కలెక్టరు ఆసుపత్రుల వారీగా చర్చించి పలు సూచనలు చేశారు.   ఎపి ఎస్ ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డి.ఎ.నాయుడును  కె జి హెచ్ లోని  వార్డులను స్వయంగా పరిశీలించి పడకల పెంపుదలకు, పైప్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కె.జి.హెచ్.లో  పీడియాట్రిక్ వెంటిలేటర్లు ఎన్ని కావాలో  అంచనా వేయాలన్నారు. విమ్స్ ఆసుపత్రిలో  పడకల సంఖ్య 650 కి పెంచాలని  వాటికి ఆక్సిజన్ సరఫరాకు లైన్లను పరిశీలించాలన్నారు.  ఛాతీ ఆసుపత్రి లో ఆక్సిజన్ బెడ్లు 50 కి పెంచాలన్నారు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులపై సమీక్షస్తూ ప్రతి రోజు ఒక ఆసుపత్రిని పరిశీలించాలని  డి సి హెచ్ ఎస్ లక్ష్మణరావును ఆదేశించారు. ఆక్సిజన్ బెడ్లు పెంచాలన్నారు.  అనకాపల్లి, పాడేరు, అరకు, నర్సీపట్నంలలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, మరియు సి.హెచ్.సి.లలో  ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంపుదల  అందుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై చర్చించారు.  ప్రతి పి.హెచ్.సి, కోవిడ్ కు సంబంధించి టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ విషయాలలో సమర్దవంతంగా పనిచేయగలిగేలా ఉండాలన్నారు. ఈ సమావేశంలో  ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డా. సూర్యనారాయణ,  ఆసుపత్రుల  జిల్లాకోఆర్డినేటర్ డా.లక్ష్మణరావు, ఎపి ఎస్ ఎం ఐ డి సి  ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు  డి.ఎ.నాయుడు,  జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు రామలింగరాజు  తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-06-25 13:30:11

సింహాద్రినాథునికి రూ.1,01,116 విరాళం..

విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన మాజీ సైనిక ఉద్యోగి సింగంశెట్టి కృష్ణారావు సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 (లక్షా వెయ్యినూటపదహారు) విరాళంగా అందించారు. ఆ చెక్కును గురువారం ఈ మేరకు పీఆర్వో ఆఫీసులోని కౌంటర్ లో క్యాష్ అందించారు. ఈ సందర్బంగా దాత మాట్లాడుతూ, తమ పెళ్లిరోజు 20-06-2022న భక్తులకు అన్నదానం చేయాలని దేవస్థాన నిర్వాహకులను కోరినట్టు చెప్పానన్నారు. తాను ఉద్యోగం నుంచి రిటైరవ్వడం వల్ల కొంత మొత్తం అందిందని అందులో కొంత స్వామికి సమర్పించానని చెప్పారు. స్వామివారి కృపవల్లే తాను ఆయురారోగ్యాలతో సుఖంగా జీవిస్తున్నానని,  అందుకే విరాళమిచ్చినట్లు కృష్ణారావు తెలిపారు. అనంతరం దాతకు రిసిప్టుతోపాటు అన్నదానం బాండ్ అందించారు ఆలయ సిబ్బంది. అంతకుముందు స్వామిని దర్శించుకొని తీర్ధ  ప్రసాదాన్ని స్వీకరించారు. 

Simhachalam

2021-06-24 16:49:51

హౌసింగ్ లక్ష్యాలను అధిగమించాలి..

అన్ని ప్రభుత్వ శాఖ‌ల అధికారులంతా స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి, ఇళ్ల నిర్మాణాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి కోరారు. న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మంలో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తోందని, దీనిని దృష్టిలో ఉంచుకొని స‌కాలంలో నిర్మాణాల‌ను పూర్తి చేసేందుకు కృషి చేయాల‌ని అన్నారు. లేఅవుట్ల‌లో నెలాఖారునాటికి మౌలిక  వ‌స‌తులు క‌ల్పించాల‌ని జెసి (హౌసింగ్) అధికారుల‌ను ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న‌న్న కాల‌నీల నిర్మాణంపై, జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) మ‌యూర్ అశోక్, సంబంధిత అధికారుల‌తో గురువారం క‌లెక్టరేట్‌లో స‌మీక్షా స‌మావేశాన్నినిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల మాట్లాడుతూ, పేద‌ల సొంతింటిక‌లను సాకారం చేసేందుకు ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌న్నారు. దీనిలో భాగంగానే ప్ర‌తీ జిల్లాకు ప్ర‌త్యేకంగా ఒక జాయింట్ క‌లెక్ట‌ర్‌ను నియ‌మించింద‌ని చెప్పారు. ప్ర‌భుత్వ‌ ప్రాధాన్య‌త‌ను గుర్తించి, అధికారులంతా స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని కోరారు. ఇళ్లు మంజూరైన ల‌బ్దిదారుల‌ను చైత‌న్య ప‌రిచి, వారు త‌క్ష‌ణ‌మే నిర్మాణాన్ని ప్రారంభించేలా చూడాల‌ని సూచించారు. జులై 1 నుంచి మెగా శంకుస్థాప‌నా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నామ‌ని ఎంఎల్ఏ తెలిపారు.

           జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ మాట్లాడుతూ, అన్ని లేఅవుట్ల‌లో ఈ నెలాఖ‌రునాటికి మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న పూర్తి చేయాల‌ని ఆదేశించారు. విద్యుత్ క‌న‌క్ష‌న్‌లు యుద్ద‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేసి, బోర్లుకు మోటార్లు బిగించాల‌ని సూచించారు. జులై 1 నాటికి అన్ని లేఅవుట్ల‌లో నీటి స‌దుపాయం త‌ప్ప‌నిసరిగా ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. వివిధ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపంపై జెసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనివ‌ల్ల తీవ్ర జాప్యం జ‌రుగుతోంద‌ని అన్నారు. ఇక‌నుంచీ ఇళ్ల నిర్మాణంపై ప్ర‌తీరోజూ స‌మీక్ష నిర్వ‌హించాల‌ని ఎంపిడిఓను ఆదేశించారు. అతిపెద్ద గుంక‌లాం లేఅవుట్ ను దేశంలోనే ఒక మోడ‌ల్ కాల‌నీగా రూపొందుతుంద‌ని అన్నారు. భ‌విష్య‌త్తులో ఇదొక న‌గ‌ర పంచాయితీగా మారుతుంద‌న్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన‌ప్పుడు మాత్ర‌మే, ల‌క్ష్యం పూర్తిగా నెర‌వేరిన‌ట్ల‌ని, అంత‌వ‌ర‌కూ ప్ర‌తీఒక్క‌రూ స‌మ‌న్వ‌యంతో, ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ప‌నిచేయాల‌ని జెసి కోరారు.

           స‌మావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, హౌసింగ్ పిడి ఎన్‌వి ర‌మ‌ణ‌మూర్తి, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు, ఎంపిడిఓ చైనులు, హౌసింగ్‌, ఆర్‌డ‌బ్ల్యూఎస్‌, విద్యుత్ శాఖ‌ల‌ డిఇలు, ఏఈలు, వార్డు ఎనిమిటీ అసిస్టెంట్లు, స‌ర్పంచ్‌లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-24 16:42:41

పోర్టు గెస్ట్ హౌస్ పరిశుభ్రంగా ఉంచాలి..

విశాఖలో ఈ నెల 26వ తేదీన భారత ఉప రాష్ట్రపతి బి. వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా, ఆయన  విడిది చేసే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని జివిఎంసి అదనపు కమిషనర్,  లైజింగ్ ఆఫీసర్ డా. బి. సన్యాసిరావు శానిటరి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నాలుగవ జోన్ 28వ వార్డులో ఉన్న పోర్టు గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన భారత ఉప రాష్ట్రపతి విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఆయన విడిది చేసే పోర్ట్ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని రోడ్లు, కాలువలును శుభ్రం చేయాలని, ఆయా ప్రాంతాల్లో  బ్లీచింగ్ జల్లించి, ఫాగింగ్ చేయాలని, ఆయా ప్రాంతాలలో ఆవులు, గేదెలు, కుక్కలు, పందులను సంచరించకుండా చూడాలని శానిటరి అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ  శానిటరి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-24 15:22:17

రోడ్లపై పశు సంచారాన్ని నియంత్రించాలి..

మహా విశాఖ నగర పరిధిలోని రోడ్లపై పశు సంచారం లేకుండా చూడాలని జివిఎంసి కమిషనర్  డా. జి. సృజన శానిటరి అధికారులను ఆదేశించారు. గురువారం 3వ జోన్, 14వ వార్డు పరిధిలోని సీతమ్మధారలోని ఎ.ఎస్.ఆర్.నగర్ పరిసర ప్రాంతాలలో ఆమక పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్లపై ఆవులు, గేదెలు సంచారం ఎక్కువగా ఉందని వాటి వలన రోడ్లన్నీ అసభ్యంగా తయారవుతున్నాయని శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి ఆ పశువుల యజమానులకు అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. రోడ్డుపై మెకానిక్, అతని సామాగ్రి ఉండడం చూసి వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించాలని, ఆ షాపు యజమాని నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ ప్రదేశాల్లో ఉన్న చెత్తను తొలగించాలని, ఖాళీ ప్రదేశాలు, ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురికాకుండా  చూడాలన్నారు. ఆయా ప్రాంతాలలో నిర్మిస్తున్న భవనముల యొక్క నిర్మాణ సామగ్రి రోడ్డుపై ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు నిర్మించుకునే వారు రోడ్డుపై భవన నిర్మాణ సామాగ్రిని వేయరాదని హెచ్చరించారు. వర్షం వలన ఎగువ ప్రాంతం నుండి బురద ఇసుకమేట రోడ్డు పైకి వచ్చిందని, దానిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. 
అనంతరం శాంతి ఆశ్రమం వద్ద సముద్రంలో కలుస్తున్న మురుగునీటి కాలువలు పరిశీలించి, మురుగు నీరు సముద్రంలో కలవకుండా ఎస్.టి.పి.కి మళ్ళించే పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి..శాస్త్రి, 3వ జోనల్ కమిషనర్(ఇంచార్జ్) బి.వి.రమణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ భాస్కర్ బాబు, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, శివ ప్రసాద్ రాజు, కార్యనిర్వాహక ఇంజినీర్లు వెంకటేశ్వరరావు(యు.జి.డి.),  చిరంజీవి (మెకానికల్), శ్రీనివాస్ (వాటర్ సప్లై), శ్రీనివాస్ (వర్క్స్) తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-06-24 15:19:46

ఇళ్ల నిర్మాణాలపై ద్రుష్టిసారించాలి..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై  అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ఏ భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి సమావేశ మందిరంలో  కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి లేఔవుట్ల పరిస్థితి, మౌలిక సదుపాయాల కల్పనపై  ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు డివిజన్,  మండల స్థాయి హౌసింగ్ ఏఈలతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జేసీ  ఏ.భార్గవ్ తేజ  మాట్లాడుతూ,  కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 131 లేఔవుట్లలో 33,590  మంది లబ్ధిదారులకు తొలిదశలో గృహ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అన్ని లేఅవుట్లలో లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నీరు, విద్యుత్, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. లేఅవుట్లలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని ఆయన తెలిపారు.  ఈ సమావేశంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎడిసి సిహెచ్ నరసింహారావు, కాకినాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో  హౌసింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-24 15:16:22

దిశ యాప్ పై విస్త్రుత అవగాహన..

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను  దిశ యాప్ ద్వారా  అరికట్టేందుకు మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్టు సంయుక్త కలెక్టర్( సచివాలయాలు, అభివృద్ధి) పి. ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళల పై అత్యాచారాలను నిరోధించడాన్ని దృష్టిలో పెట్టుకుని దిశ చట్టంను తీసుకొచ్చారన్నారు తెలిపారు.  ఈ దిశ చట్టంపై మహిళలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు ప్రతి రోజు  ఇంటింటికి వెళ్లి ఈ దిశ యాప్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై అవగాహన కల్పిస్తున్నారన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు ఇబ్బందులు ఎదురైతే  దిశ యాప్ ను ఉపయోగించి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఇటీవల తాడేపల్లి, సీతానగరంలో జరిగిన అఘాయిత్యం భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  గురువారం వాలంటీర్లు, సంబంధిత సచివాలయం మహిళా  పోలీసు బృందంగా కలసి నూజెండ్ల మండలం ఉప్పలపాడు, కంభంపాడు, మాచర్ల మునిసిపాలిటీ, గురజాల మండలం చర్లగుడిపాడు, మాడుగుల, పులిపాడు, దాచేపల్లి మండలం పొందుగల, రామాపురం, తెనాలి పట్టణంలో ఇంటింటికి వెళ్ళి దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం, దానిని ఉపయోగించడంపై అవగాహన కల్పించినట్లు సంయుక్త కలెక్టర్  వివరించారు.          

Guntur

2021-06-24 15:13:20