1 ENS Live Breaking News

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుచేయాలి..

విశాఖజిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకల సంఖ్యను పెంచుకోవాలని  అందుకు అవసరమైన ప్రణాళికలు ప్రతిపాదనలు  రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు.  శుక్రవారం ఉదయం కలెక్టరు  జిల్లాలోని  కె జి హెచ్, విమ్స్, ఆర్ సి డి, ఛాతీ ఆసుపత్రి, ఘోషా ఆసుపత్రి, మరియు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్లు, ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు వివరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటి లేటర్లు, మానిటర్లు మొదలగు  వాటి ప్రస్తుత సంఖ్య, వాటిని ఏమేరకు  పెంచగలము అనే విషయముపై వైద్యాధికారులు, ఎపి ఎస్ ఎమ్ ఐ.డి.సి. అధికారులతో చర్చించారు.  ఈ సందర్భముగా  కలెక్టరు ఆసుపత్రుల వారీగా చర్చించి పలు సూచనలు చేశారు.   ఎపి ఎస్ ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డి.ఎ.నాయుడును  కె జి హెచ్ లోని  వార్డులను స్వయంగా పరిశీలించి పడకల పెంపుదలకు, పైప్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కె.జి.హెచ్.లో  పీడియాట్రిక్ వెంటిలేటర్లు ఎన్ని కావాలో  అంచనా వేయాలన్నారు. విమ్స్ ఆసుపత్రిలో  పడకల సంఖ్య 650 కి పెంచాలని  వాటికి ఆక్సిజన్ సరఫరాకు లైన్లను పరిశీలించాలన్నారు.  ఛాతీ ఆసుపత్రి లో ఆక్సిజన్ బెడ్లు 50 కి పెంచాలన్నారు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులపై సమీక్షస్తూ ప్రతి రోజు ఒక ఆసుపత్రిని పరిశీలించాలని  డి సి హెచ్ ఎస్ లక్ష్మణరావును ఆదేశించారు. ఆక్సిజన్ బెడ్లు పెంచాలన్నారు.  అనకాపల్లి, పాడేరు, అరకు, నర్సీపట్నంలలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, మరియు సి.హెచ్.సి.లలో  ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంపుదల  అందుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై చర్చించారు.  ప్రతి పి.హెచ్.సి, కోవిడ్ కు సంబంధించి టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ విషయాలలో సమర్దవంతంగా పనిచేయగలిగేలా ఉండాలన్నారు. ఈ సమావేశంలో  ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డా. సూర్యనారాయణ,  ఆసుపత్రుల  జిల్లాకోఆర్డినేటర్ డా.లక్ష్మణరావు, ఎపి ఎస్ ఎం ఐ డి సి  ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు  డి.ఎ.నాయుడు,  జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు రామలింగరాజు  తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-06-25 13:30:11

సింహాద్రినాథునికి రూ.1,01,116 విరాళం..

విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన మాజీ సైనిక ఉద్యోగి సింగంశెట్టి కృష్ణారావు సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 (లక్షా వెయ్యినూటపదహారు) విరాళంగా అందించారు. ఆ చెక్కును గురువారం ఈ మేరకు పీఆర్వో ఆఫీసులోని కౌంటర్ లో క్యాష్ అందించారు. ఈ సందర్బంగా దాత మాట్లాడుతూ, తమ పెళ్లిరోజు 20-06-2022న భక్తులకు అన్నదానం చేయాలని దేవస్థాన నిర్వాహకులను కోరినట్టు చెప్పానన్నారు. తాను ఉద్యోగం నుంచి రిటైరవ్వడం వల్ల కొంత మొత్తం అందిందని అందులో కొంత స్వామికి సమర్పించానని చెప్పారు. స్వామివారి కృపవల్లే తాను ఆయురారోగ్యాలతో సుఖంగా జీవిస్తున్నానని,  అందుకే విరాళమిచ్చినట్లు కృష్ణారావు తెలిపారు. అనంతరం దాతకు రిసిప్టుతోపాటు అన్నదానం బాండ్ అందించారు ఆలయ సిబ్బంది. అంతకుముందు స్వామిని దర్శించుకొని తీర్ధ  ప్రసాదాన్ని స్వీకరించారు. 

Simhachalam

2021-06-24 16:49:51

హౌసింగ్ లక్ష్యాలను అధిగమించాలి..

అన్ని ప్రభుత్వ శాఖ‌ల అధికారులంతా స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి, ఇళ్ల నిర్మాణాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి కోరారు. న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మంలో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తోందని, దీనిని దృష్టిలో ఉంచుకొని స‌కాలంలో నిర్మాణాల‌ను పూర్తి చేసేందుకు కృషి చేయాల‌ని అన్నారు. లేఅవుట్ల‌లో నెలాఖారునాటికి మౌలిక  వ‌స‌తులు క‌ల్పించాల‌ని జెసి (హౌసింగ్) అధికారుల‌ను ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న‌న్న కాల‌నీల నిర్మాణంపై, జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) మ‌యూర్ అశోక్, సంబంధిత అధికారుల‌తో గురువారం క‌లెక్టరేట్‌లో స‌మీక్షా స‌మావేశాన్నినిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల మాట్లాడుతూ, పేద‌ల సొంతింటిక‌లను సాకారం చేసేందుకు ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌న్నారు. దీనిలో భాగంగానే ప్ర‌తీ జిల్లాకు ప్ర‌త్యేకంగా ఒక జాయింట్ క‌లెక్ట‌ర్‌ను నియ‌మించింద‌ని చెప్పారు. ప్ర‌భుత్వ‌ ప్రాధాన్య‌త‌ను గుర్తించి, అధికారులంతా స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని కోరారు. ఇళ్లు మంజూరైన ల‌బ్దిదారుల‌ను చైత‌న్య ప‌రిచి, వారు త‌క్ష‌ణ‌మే నిర్మాణాన్ని ప్రారంభించేలా చూడాల‌ని సూచించారు. జులై 1 నుంచి మెగా శంకుస్థాప‌నా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నామ‌ని ఎంఎల్ఏ తెలిపారు.

           జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ మాట్లాడుతూ, అన్ని లేఅవుట్ల‌లో ఈ నెలాఖ‌రునాటికి మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న పూర్తి చేయాల‌ని ఆదేశించారు. విద్యుత్ క‌న‌క్ష‌న్‌లు యుద్ద‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేసి, బోర్లుకు మోటార్లు బిగించాల‌ని సూచించారు. జులై 1 నాటికి అన్ని లేఅవుట్ల‌లో నీటి స‌దుపాయం త‌ప్ప‌నిసరిగా ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. వివిధ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపంపై జెసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనివ‌ల్ల తీవ్ర జాప్యం జ‌రుగుతోంద‌ని అన్నారు. ఇక‌నుంచీ ఇళ్ల నిర్మాణంపై ప్ర‌తీరోజూ స‌మీక్ష నిర్వ‌హించాల‌ని ఎంపిడిఓను ఆదేశించారు. అతిపెద్ద గుంక‌లాం లేఅవుట్ ను దేశంలోనే ఒక మోడ‌ల్ కాల‌నీగా రూపొందుతుంద‌ని అన్నారు. భ‌విష్య‌త్తులో ఇదొక న‌గ‌ర పంచాయితీగా మారుతుంద‌న్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన‌ప్పుడు మాత్ర‌మే, ల‌క్ష్యం పూర్తిగా నెర‌వేరిన‌ట్ల‌ని, అంత‌వ‌ర‌కూ ప్ర‌తీఒక్క‌రూ స‌మ‌న్వ‌యంతో, ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ప‌నిచేయాల‌ని జెసి కోరారు.

           స‌మావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, హౌసింగ్ పిడి ఎన్‌వి ర‌మ‌ణ‌మూర్తి, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు, ఎంపిడిఓ చైనులు, హౌసింగ్‌, ఆర్‌డ‌బ్ల్యూఎస్‌, విద్యుత్ శాఖ‌ల‌ డిఇలు, ఏఈలు, వార్డు ఎనిమిటీ అసిస్టెంట్లు, స‌ర్పంచ్‌లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-24 16:42:41

పోర్టు గెస్ట్ హౌస్ పరిశుభ్రంగా ఉంచాలి..

విశాఖలో ఈ నెల 26వ తేదీన భారత ఉప రాష్ట్రపతి బి. వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా, ఆయన  విడిది చేసే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని జివిఎంసి అదనపు కమిషనర్,  లైజింగ్ ఆఫీసర్ డా. బి. సన్యాసిరావు శానిటరి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నాలుగవ జోన్ 28వ వార్డులో ఉన్న పోర్టు గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన భారత ఉప రాష్ట్రపతి విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఆయన విడిది చేసే పోర్ట్ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని రోడ్లు, కాలువలును శుభ్రం చేయాలని, ఆయా ప్రాంతాల్లో  బ్లీచింగ్ జల్లించి, ఫాగింగ్ చేయాలని, ఆయా ప్రాంతాలలో ఆవులు, గేదెలు, కుక్కలు, పందులను సంచరించకుండా చూడాలని శానిటరి అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ  శానిటరి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-24 15:22:17

రోడ్లపై పశు సంచారాన్ని నియంత్రించాలి..

మహా విశాఖ నగర పరిధిలోని రోడ్లపై పశు సంచారం లేకుండా చూడాలని జివిఎంసి కమిషనర్  డా. జి. సృజన శానిటరి అధికారులను ఆదేశించారు. గురువారం 3వ జోన్, 14వ వార్డు పరిధిలోని సీతమ్మధారలోని ఎ.ఎస్.ఆర్.నగర్ పరిసర ప్రాంతాలలో ఆమక పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్లపై ఆవులు, గేదెలు సంచారం ఎక్కువగా ఉందని వాటి వలన రోడ్లన్నీ అసభ్యంగా తయారవుతున్నాయని శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి ఆ పశువుల యజమానులకు అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. రోడ్డుపై మెకానిక్, అతని సామాగ్రి ఉండడం చూసి వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించాలని, ఆ షాపు యజమాని నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ ప్రదేశాల్లో ఉన్న చెత్తను తొలగించాలని, ఖాళీ ప్రదేశాలు, ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురికాకుండా  చూడాలన్నారు. ఆయా ప్రాంతాలలో నిర్మిస్తున్న భవనముల యొక్క నిర్మాణ సామగ్రి రోడ్డుపై ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు నిర్మించుకునే వారు రోడ్డుపై భవన నిర్మాణ సామాగ్రిని వేయరాదని హెచ్చరించారు. వర్షం వలన ఎగువ ప్రాంతం నుండి బురద ఇసుకమేట రోడ్డు పైకి వచ్చిందని, దానిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. 
అనంతరం శాంతి ఆశ్రమం వద్ద సముద్రంలో కలుస్తున్న మురుగునీటి కాలువలు పరిశీలించి, మురుగు నీరు సముద్రంలో కలవకుండా ఎస్.టి.పి.కి మళ్ళించే పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి..శాస్త్రి, 3వ జోనల్ కమిషనర్(ఇంచార్జ్) బి.వి.రమణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ భాస్కర్ బాబు, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, శివ ప్రసాద్ రాజు, కార్యనిర్వాహక ఇంజినీర్లు వెంకటేశ్వరరావు(యు.జి.డి.),  చిరంజీవి (మెకానికల్), శ్రీనివాస్ (వాటర్ సప్లై), శ్రీనివాస్ (వర్క్స్) తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-06-24 15:19:46

ఇళ్ల నిర్మాణాలపై ద్రుష్టిసారించాలి..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై  అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ఏ భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి సమావేశ మందిరంలో  కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి లేఔవుట్ల పరిస్థితి, మౌలిక సదుపాయాల కల్పనపై  ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు డివిజన్,  మండల స్థాయి హౌసింగ్ ఏఈలతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జేసీ  ఏ.భార్గవ్ తేజ  మాట్లాడుతూ,  కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 131 లేఔవుట్లలో 33,590  మంది లబ్ధిదారులకు తొలిదశలో గృహ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అన్ని లేఅవుట్లలో లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నీరు, విద్యుత్, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. లేఅవుట్లలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని ఆయన తెలిపారు.  ఈ సమావేశంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎడిసి సిహెచ్ నరసింహారావు, కాకినాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో  హౌసింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-24 15:16:22

దిశ యాప్ పై విస్త్రుత అవగాహన..

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను  దిశ యాప్ ద్వారా  అరికట్టేందుకు మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్టు సంయుక్త కలెక్టర్( సచివాలయాలు, అభివృద్ధి) పి. ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళల పై అత్యాచారాలను నిరోధించడాన్ని దృష్టిలో పెట్టుకుని దిశ చట్టంను తీసుకొచ్చారన్నారు తెలిపారు.  ఈ దిశ చట్టంపై మహిళలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు ప్రతి రోజు  ఇంటింటికి వెళ్లి ఈ దిశ యాప్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై అవగాహన కల్పిస్తున్నారన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు ఇబ్బందులు ఎదురైతే  దిశ యాప్ ను ఉపయోగించి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఇటీవల తాడేపల్లి, సీతానగరంలో జరిగిన అఘాయిత్యం భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  గురువారం వాలంటీర్లు, సంబంధిత సచివాలయం మహిళా  పోలీసు బృందంగా కలసి నూజెండ్ల మండలం ఉప్పలపాడు, కంభంపాడు, మాచర్ల మునిసిపాలిటీ, గురజాల మండలం చర్లగుడిపాడు, మాడుగుల, పులిపాడు, దాచేపల్లి మండలం పొందుగల, రామాపురం, తెనాలి పట్టణంలో ఇంటింటికి వెళ్ళి దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం, దానిని ఉపయోగించడంపై అవగాహన కల్పించినట్లు సంయుక్త కలెక్టర్  వివరించారు.          

Guntur

2021-06-24 15:13:20

జూలై4న ఉచిత భోజనసాల ప్రారంభం..

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కోటి రూపాయల నిధులతో రోగుల సహాయకుల కోసం నిర్మించిన  ఉచిత భోజనశాల భవనాన్ని జులై 4న  ప్రారంభిస్తున్నట్లు  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు జిల్లా ఇన్ చార్చి మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం  గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఎన్.జి.వొ లకు  కేటాయించిన  స్థలంలో రోగుల సహాయకుల కోసం నిర్మించిన భోజనశాలను   రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు జిల్లా ఇన్ చార్చి మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పరిశీలించారు. ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉన్న ఎన్.జి.వొ ల  భవనాన్ని మంత్రి సొంత నిధులు  కోటి రూపాయలు వెచ్చించి భవనాన్ని పూర్తి చేయించారు. సుమారు 350 మంది రోగుల సహయకులకు భోజన ఏర్పాట్లు కొనసాగించేందుకు ఉపయోగ పడేలా భవనాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. పనులను పరిశీలించిన  మంత్రి వర్యులు  చెరుకువాడ శ్రీరంగనాథ రాజు  సంతృప్తి వ్యక్తం చేశారు. వీటితో పాటు ఉచిత భోజన భవనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దెందుకు మొక్కలు ఏర్పాటు చేసి ఆరోగ్య వాతావరణాన్ని కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం మంత్రి మీడియా వారితో మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల కు  చుట్టుపక్కల ఐదు జిల్లాల నుంచి మెరుగైన వైద్యకోసం రోగులు, సహాయకులు నిత్యం రావడం జరుగుతుందని తెలిపారు. అయితే వారికి సరిపడ భోజనం కానీ, వసతులు కానీ  ఈ వైద్యశాలలో  లేకపోవడాన్ని గమనించామన్నారు.  ఆరునెలల క్రితం భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ భోజనశాలలో రోగుల సహాయకులకు రెండు పూటల నాణ్యమైన సరిపడా ఆహారాన్ని ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.  రోగుల సహాయకులకు భోజనం పెట్టేందుకు దాతృత్వం కలిగిన తన మిత్ర బృందం  మధురాన్నం ట్రస్ట్ ముందుకు రావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నానన్నారు.  ఈ కార్యక్రమం ద్వారా రోజుకు నాలుగు వేల మందికి ఉచిత భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తాము చేసే ఈ కార్యక్రమానికి  సహకారం అందిస్తే వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రతి రోజు రోగుల సహాయకుల తో పాటు భోజనం తయారుచేసే సిబ్బందికి రూ. లక్ష మేర ఖర్చు అవుతుందని,  దీనిని మధురాన్నం ట్రస్ట్ వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు.  గత కరోనా సమయంలో కూడా వేలాది మంది వలస కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సహాయకులకు, రోగుల సహాయకులకు భారీ ఎత్తున భోజన వసతులు కల్పించడం జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చొరవ, వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు.  ముఖ్యమంత్రి స్పూర్తి తో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలలో రోజుకు నాలుగు వేల మందికి ఉచిత భోజన కార్యక్రమాలు కొనసాగించామన్నారు.  ముఖ్యమంత్రి  ఆదేశాలను అనుసరిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలను మధురాన్నం ట్రస్ట్ ద్వారా కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు.  
  కార్యక్రమంలో మధురాన్నం ట్రస్ట్ కార్యదర్శి పెనుమచ్చ రామకృష్ణ గోపాల రాజు,  కోశాధికారి పేరూరి కాసయ్య, జాయింట్ సెక్రటరి పి. సత్యనారాయణ మూర్తి, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు,  జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ప్రభావతి, రెడ్ క్రాస్ సొసైటి వైస్ ఛైర్మన్ రామచంద్ర రాజు, భారతీయ విద్యా మిషన్ కోశాధికారి మాజేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.    

Guntur

2021-06-24 14:59:44

యుద్ధప్రాతిపదికన నాడు–నేడు పనులు..

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు–నేడు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిర్ణీత సయమానికి పూర్తిచేయాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  కార్యనిర్వాహక ఇంజినీర్లు, సెక్టోరియల్ అధికారులతో నాడు–నేడు పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ జిల్లాలో గల 38 మండలాల్లో 1,248 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పనులు జరుగుతున్నాయని, కొన్ని పాఠశాలలు తుదిదశకు చేరుకోగా, మరికొన్ని కొద్దిపాటి పనులు మాత్రమే మిగిలిఉన్నాయని అన్నారు. వీటన్నింటిని యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టి ఈ నెల 30 నాటికి పూర్తిచేయాలని చెప్పారు.  నాడు–నేడు పనులు జరుగుతున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దగ్గర ఉండి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల నిర్వహణలో ప్రధానోపాధ్యాయులు గైర్హజరు కారదన్నారు. రెవిన్యూ డివిజన్ పరిధిలో గల ఉప విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలలన్నింటిలో నాడు - నేడు పనులపై దృష్టి సారించి వాటిని పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కొద్దిపాటి పనులు మాత్రమే మిగిలివున్న ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సామాగ్రి సిద్ధంగా ఉందని, అందువలన సెక్టోరియల్ అధికారులు వాటిపై దృష్టి సారించి పనులు పూర్తిచేయాలని  సూచించారు. నాడు–నేడు పనులు జరుగుతున్న పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు  ఎప్పటికపుడు బిల్లులను ఆన్ లైన్ నందు నమోదుచేయాలని పేర్కొన్నారు.  రోజు వారీ ఖర్చులకు చెందిన నివేదికలను మండల విద్యాశాఖాధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని, ఇంజినీరింగ్ అధికారులు తమకు చెందిన బాధ్యతలను యుద్ధప్రాతిపదికన నిర్వహించి సకాలంలో పనులు పూర్తిచేయాలని, పనులు పూర్తయిన పాఠశాలల యం.బుక్ లను ఆన్ లైన్ నందు అప్ లోడ్ చేయాలని జె.సి కోరారు.  తుదిదశలో ఉన్న 174  పాఠశాలల్లోని పనులను  శనివారం నాటికి పూర్తిచేసి ఆన్ లైన్ నందు అప్ లోడ్ చేయాలని స్పష్టం చేసారు. ఎట్టిపరిస్థితిల్లోనూ  నాడు – నేడు పనులు  ఈ నెల 30 నాటికి పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి కుసుమ చంద్రకళ,  సమగ్ర శిక్ష ప్రోజెక్ట్ అధికారి  పైడి వెంకటరమణ, ఉప విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష కార్యనిర్వాహక ఇంజినీర్ కె.కృష్ణయ్య, నగరపాలక సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్ యస్.వెంకట్, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ మురళీ, కార్యనిర్వాహక ఇంజినీర్లు కె.సుగుణాకరరావు, భాస్కరరావు,  సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-24 14:56:10

స్వచ్ఛ సంకల్పం విజయవంతం కావాలి..

గ్రామాలను పరిశుభ్రంగా, సుందరంగా  తీర్చిదిద్దేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.  గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, కలక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ధి ) పి. ప్రశాంతి  గ్రామాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమ నిర్వహణపై యంపిడిఓ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ద్యాన్ని మెరుగుపరచి వ్యర్ధాలను సక్రమంగా నిర్వహించేందుకు జూలై 8 వ తేది నుండి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం వంద రోజులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.  ప్రతి గ్రామంలోను సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షేడ్స్ ను వినియోగంలోకి తీసుకురావాలన్నారు.  షేడ్స్ లేని గ్రామాల్లో నూతన షెడ్ల నిర్మాణానికి, మరమ్మత్తులు ఉన్న చోట మరమ్మత్తులకు ఉపాధి హామీ పధకం క్రింద ప్రతిపాదనలు అందించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.  ప్రతి గ్రామంలోను డోర్ టు డోర్ తడి – పొడి చెత్త వేరుచేసి సేకరించేందుకు గ్రీన్ అంబాసిడర్లను, పుష్ కార్టులను సిద్దం చేసుకోవాలన్నారు.  సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లకు తరలించిన  వ్యర్ధాల నుండి ప్లాస్టిక్ ను, ఇతర ముడి పదార్ధాలను  పూర్తిస్థాయిలో వేరు చేయాలన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ శివారు ఓబులునాయుడుపాలెం లో ఉన్న జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు సమీప గ్రామాల్లోని వ్యర్ధాలను తరలించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.  పల్నాడు ప్రాంతాలలోని గ్రామాలు సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీ లకు ప్లాస్టిక్ వ్యర్ధాలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  జగనన్న స్వచ్ఛ సంకల్పం లో భాగంగా వంద రోజులు నిర్వహించే కార్యక్రమాల్లో స్థానిక ప్రజలతో పాటు, స్వచ్చంద సేవా సంస్థలను భాగస్వామ్యులను  చేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.  గ్రామాల్లోని హాట్  స్పాట్స్  శుభ్రం చేసి మొక్కలు నాటాలని, కార్యక్రమాలు చేపట్టక ముందు ఉన్న పరిస్థితులు, అభివృద్ధి చేసిన పరిస్థితులు నాడు  – నేడు నివేదికలు ఫొటోలతో సహా రికార్డు చేయాలన్నారు.  ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న పారిశుధ్య పరిస్థితులను బట్టి ఎ ప్లస్, ఎ, బి, సి, డి, ఇ కేటగిరీ లుగా వర్గీకరించడం జరిగిందని, ఇ కేటగిరీ లో ఉన్న గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా మెరుగుపడేలా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలన్నారు.  స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం  అమలుకు, పర్యవేక్షణకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు జిల్లా స్థాయిలో సీనియర్ అధికారులు, నిపుణులతో ప్రత్యేకంగా కమిటీ ని ఏర్పాటు చేయాలన్నారు.  జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం పూర్తి అయ్యే నాటికి గ్రామాల్లో పారిశుద్ధ్యంతో పాటు మురుగునీటి పారుదల, సురక్షిత మంచినీటి సరఫరాలో స్పష్టమైన మార్పులు కనిపించేలా గ్రామాలూ ఎ ప్లస్ కేటగిరీ లో ఉండేలా  అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.  

      సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ధి ) పి. ప్రశాంతి మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుకు గత నెల రోజుల నుండి  స్వచ్ఛ సన్నాహక  కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే గ్రామ సర్పంచ్ లకు, సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.  కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన మెన్, మెటీరియల్, మిషనరీ లను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రతి గ్రామంలోను   యంపిడిఓ లు సమకూర్చుకునేల చర్యలు తీసుకోవాలన్నారు.   గ్రామాల్లో  ప్రతి ఇంటిలో వ్యర్ధాలను వేరుచేసి గ్రీన్ అంబాసిడర్లకు అందించేలా వాలంటీర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం వంద రోజుల కార్యక్రమ నిర్వహణలో గ్రామ వాలంటీర్లు, గ్రీన్ అంబాసిడర్లు, క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు, పంచాయితీ సెక్రటరీలు, మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలను వివరించారు. స్వచ్ఛ సంకల్పం ప్రారంభించిన రోజు నుండి పది రోజులు రోజువారీగా చేపట్టాల్సిన  కార్యక్రమాలను తెలియజేసారు. 

  కార్యక్రమంలో జిల్లాలోని గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పారిశుద్ధ్య పరిస్థితులకు అనుగుణంగా ఎ ప్లస్, ఎ, బి, సి, డి, ఇ కేటగిరీ జాబితాను కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ధి ) పి. ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం ) కే. శ్రీధర్ రెడ్డి, జెడ్ పి సి ఇ ఓ చైతన్య, డిపిఓ కేశవరెడ్డి, డ్వామ  పీడీ శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు.  

Guntur

2021-06-24 14:52:31

లాభదాయక పంటలను సూచించండి..

రైతులకు  లాభదాయకంగా ఉండే పంటలపై శాస్త్రీయమైన సూచనలు, సలహాలను రైతులకు అందించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీషా జిల్లా, మండల వ్యవసాయ సలహా మండళ్లలను కోరారు. గురువారం ఉదయం స్థానిక బోట్ కబ్ల్ సమీపంలోని కృషి భవన్ లో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆద్వర్యంలో జిల్లా, మండల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్ లకు ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించారు.  సదస్సుకు జాయింట్ కలెక్టర్ (ఆర్) లక్ష్మీశ ముఖ్య అతిధిగా హాజరై  వినూత్న వ్యవసాయ సంస్కరణగా రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల లక్ష్యం, రైతుల సంక్షేమం కొరకు   సలహాలు, సూచనలు అందించాల్సిన అంశాలు, అవగాహనా కార్యక్రమాలు, అభ్యుదయ కార్యాచరణలు తదితర అంశాలను వివరించారు.  రైతు భాగస్వామ్యంతో రైతులకు లాభదాయకమైన వ్యవసాయ విధానాలను రైతులే నిర్ణయించుకోవడమే వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు మౌళిక ఆశయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, అనుబంద రంగాలలో మార్కెట్ డిమాండు, స్థానిక బౌగోళిక, వాతావరణ పరిస్థితుల కనుగుణంగా లాభదాయకమైన, వైవిద్యమైన పంటలు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని, తదనుగుణమైన విధాన రూపకల్పనకు ప్రభుత్వానికి సూచనలు చేయాలని వ్యవసాయ సలహా మండళ్లను కోరారు.   రైతు ఆదాయలను పెంచే ఉత్తమ విధానాలపై వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం, నీటి వనరుల సమర్థ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలను విస్తరించడం, ప్రజల ఆహార బధ్రత, పౌష్టికత పెంచే పంటల సాగు ద్వారా రైతుల ఆర్థికంగా బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల డిమాండు, సప్లయి మద్య లోపాల సవరణ తదితర రైతు సంక్షేమ అంశాలు కార్యాచరణగా  సలహా మండళ్లు తమ సలహాలను, సూచనలను ప్రభుత్వానికి అందించాలని కోరారు. 
జిల్లాలో మూడు పంటల ప్రణాళిక ద్వారా రైతులు ఆర్థికంగా మరింత ప్రయోజనం పొందవచ్చునని, ఈ మేరకు ఖరీఫ్, రబీ పంటలను సకాలంలో పూర్తిచేసుకుని మూడవ పంటగా అపరాలు, పచ్చి రొట్ట పైర్లు చేపట్టేలా సలహా మండళ్లు రైతులకు సూచించాలని కోరారు. ఇందుకు పంటకాల వ్యవధిని తగ్గించే నేరుగా విత్తన నాట్లు, డ్రమ్ సీడింగ్, లైన్ నాటింగ్, మెషిన్ ద్వారా నాటే పద్దతులను పాటించేలా రైతుల్లో ప్రోత్సహించాలన్నారు.   అలాగే  జిల్లాలోని మెట్ట మండలాల్లో బోర్లు బావుల క్రింద వరి సాగు చేస్తున్న రైతులకు తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటల వల్ల ప్రయోజనాలను వివరించి, ఆరుతడి పంటల సాగుకు మారేట్లు అవగాహన కల్పించాలన్నారు.  మార్కెట్ డిమాండు లేని, ఎక్కువ విరుగుదల, మచ్చలతో నాణ్యత తక్కవగా ఉండే యంటియు-3626, యంటియు-1010, 1001, 1153, 1156, యంసి13 వంటి సాధారణ బొండాల రకాల సాగును రైతులు విడనాడి, స్థిరమైన డిమాండుతో అధిక దిగుబడి, ఆదాయం ఇచ్చే  స్వర్ణ, సాంబమసూరి, శ్రీకాకుళం సన్నాలు వంటి వరి వంగడాల సాగు రైతులు చేపట్టేలా సూచించాలని కోరారు.  నికర వ్యవసాయ ఆదాయం పెంచే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ను రైతుల్లో ప్రోత్సహించాలన్నారు.  ఈ-క్రాపింగ్ నమోదు ద్వారా పంటనష్టాలకు పరిహారం, భీమా పరిహారం, రైతు భరోసా సహాయం, సున్నా వడ్డీ రుణాలు వంటి అంశాల ద్వారా రైతులకు ఒనగూడే ప్రయోజనాలను వివరించి రైతులు పంట వివరాలను తప్పని సరిగా నమోదు చేసుకునేట్లు అవగాహన కల్పించాలన్నారు.  అధిక ఆదాయప్రదమైన పంటలతో రైతులు, నాణ్యమైన ఆహార ఉత్పత్తులతో వినియోగదారులు  ప్రయోజనం పొందేలా ఉభయతారకమైన విధానాలను రైతులకు, ప్రభుత్వానికి సూచించాలని జాయింట్ కలెక్టర్ వ్యవసాయ సలహా మండళ్లను కోరారు.
వ్యవసాయ శాఖ జాయిట్ డైరెక్టర్ ఎన్.విజయకుమార్ మార్కెట్ ఇంటిలిజెన్స్ కనుగుణంగా ఏఏ పంటలు ఏఏ ప్రాంతాలలో సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందనే అంశాలను వివరించారు. ఉపసంచాలకులు ఎస్.మాధవరావు రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో వ్యవసాయ ఉపకరణాలు, సేవలు గురించి వివరించారు.   జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ మోటూరి సాయి మాట్లాడుతూ రైతులు పొలం గట్లపై కంది పంట సాగును చేపట్టేలా రైతులను సమాయత్తం చేయాలన్నారు. 
ఈ సదస్సులో మండల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్ లు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ అనుబంధ రంగ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-24 14:47:56

దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి..

శ్రీకాకుళంజిల్లాలోని మహిళలంతా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు కారోరు. కోవిడ్ పరిస్థితులు, దిశ యాప్ డౌన్లోడ్ తదితర అంశాలపై అధికారులతో గురువారం  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఆపద సమయంలో దిశ యాప్ మహిళలకు రక్షణ కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ యాప్ తీసుకు వచ్చిందని ఆయన చెప్పారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి డౌన్ లోడ్ చేయించాలని ఆయన ఆదేశించారు. యాప్ ఉపయోగాలు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని మండల అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వాటిని విస్తృతస్థాయిలో నిర్వహించాలని ఆయన చెప్పారు. కోవిడ్ వ్యాప్తి కాకుండా చేపట్టాల్సిన చర్యలు, మాస్క్ ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శానిటైజ్ చేసుకోవడం వంటి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన మరింతగా పెంపొందించాలని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని రెండవ డోసు పెండింగ్ ఉన్నవారు, ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లల తల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. పాజటివ్ కేసులు గుర్తించుటకు  నమూనాలను సేకరించాలని ఆయన ఆదేశిస్తూ నరసన్నపేట, వీరఘట్టం, భామిని తదితర మండలాల్లో పది కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఎక్కువ కేసులు నమోదు అవుతున్న మండలాలు, ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో నమూనాలు సేకరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కోవిడ్ లక్షణాలు లేని కేసులు ఎక్కువగా ఉంటున్నాయని తదనుగుణంగా నమూనాలు సేకరించాలని ఆయన అన్నారు.  ట్రయేజింగ్, హోమ్ ఐసోలేషన్, మెడికల్ కిట్లు అందజేతపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.  ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మండల ప్రత్యేక అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-24 14:42:00

ఎస్బీఐ రూ.23 లక్షల పిపిఇ కిట్లు వితరణ..

విశాఖపట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం సిఎస్ ఆర్ క్రింద రూ.23 లక్షల విలువైన పి.పి.ఇ కిట్లు,  సర్జికల్ మాస్కులను డిఎంహెచ్ఓ కు అందజేసినట్టు బ్యాంకు మాడ్యుల్ డిజిఎం కె.రంగరాజన్  తెలిపారు.  గురువారం ఈ మేరకు యస్.బి.ఐ ఫౌండేషన్ కార్పొరేట్ సెంటర్, ముంబయి సహకారంతో 1500 పి.పి.ఇ కిట్లు, సర్జికల్ మాస్క్‌లను  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు పంపిణీచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  ఈ పి.పి.ఇ కిట్లు  సర్జికల్ మాస్క్‌లను ప్రజలకు సేవ చేస్తున్న  వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఆరోగ్య సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతలో యస్.బి.ఐ ఎపుడూ ముందుంటుందని, ప్రతీ ఏడాది వివిధ సామాజిక కార్యక్రమాలను చేపడుతుందని ఆయన గుర్తుచేశారు. గతేడాది కరోనా సంక్షోభ సమయంలో సామాజిక బాధ్యత క్రింద వెంటిలేటర్లను పంపిణీచేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో యస్.బి.ఐ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-24 14:39:25

ఉపరాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలి..

 విశాఖ జిల్లాలో ఈ నెల 26న భారత ఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు పర్యటించ నున్నారని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలియజేశారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని  జిల్లా కలెక్టరు అధికారులను  ఆదేశించారు.  గురువారం  ఉదయం కలెక్టరు  జిల్లాలో  ఉప రాష్ట్రపతి  పర్యటన  సందర్భముగా  ఏర్పాట్లుపై  జిల్లా అధికారులతో  సమావేశం  నిర్వహించారు.  ఈ సందర్భముగా కలెక్టర్  మాట్లాడుతూ  ఉప రాష్ట్రపతి  26వ తేదీన ఉ.11.45 గంటలకు  జిల్లాకు  రానున్నారని,  పోర్టు గెస్ట్ హౌస్ లో  బస చేస్తారన్నారు.  ఎయిర్ పోర్టులో  రిసెప్షన్ కు అవసరమైన  ఏర్పాట్లు గావించాలన్నారు.  పోర్టు గెస్ట్ హౌస్ లో  వారి  బస చేయినున్నందున  ప్రోటోకాల్ నిబంధనల  ప్రకారము  అధికారులు అన్ని  ఏర్పాట్లు చేయాలన్నారు.   ఏర్పాట్లలో  ఎటువంటి  అలసత్వం  కూడదని ప్రతి ఒక్క అధికారి వారికి కేటాయించిన  విధులపై  పూర్తి అవగాహనతో ముందుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని,  ఎటువంటి ఇబ్బంది, సమస్య రాకుండా  జాగ్రత్త వహించాలన్నారు . పోర్టు గెస్ట్ హౌస్ లో నిరంతర   విద్యుత్తు సరఫరా, నీటి సదుపాయము, ఎసి, బోజన ఏర్పాట్లు  గావించాలన్నారు.  ఎయిర్ పోర్టు నుండి  పోర్టు గెస్ట్ హౌస్ వరకు రోడ్లు సరిగా ఉండేలా తగు చర్యలు చేపట్టాలని  జి.వి.ఎం.సి ఇంజనీర్ల ను  ఆదేశించారు.  వారి పర్యటనకు అవసరమైన  వాహనాలను ఏర్పాటు గావించాలని  డిప్యూటి ట్రాన్స్ పోర్టు కమిషనర్ ను   ఆదేశించారు.  అంబులెన్స్, డాక్టర్లు, ఇతర  వైద్య సదుపాయాలను  నిబంధనల ననుసరించి ఏర్పాటు గావించాలని   కె.జి.హెచ్. సూపరింటెండెంట్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.  27వ తేదీన  ఉప రాష్ట్రపతి వర్చువల్ మోడ్ లో   పాల్గొను కార్యక్రమానికి  అవసరమైన  ఏర్పాట్లు  గావించాలని  ఎన్.ఐ.సి అధికారులను ఆదేశించారు. పర్యటన , కార్యక్రమాలలో  విధులలో ఉన్న అధికారులు,  సిబ్బంది అందరూ కోవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని  ఆదేశించారు.    ఈ  సమావేశంలో  జాయింట్ కలెక్టర్  ఎం .వేణుగోపాల్ రెడ్డి,  డి.ఆర్.ఓ. ఆర్.గోవిందరావు,  జి.వి.ఎం.సి., పోలీసు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-06-24 14:33:22

నెలిమర్ల జ్యూట్ మిల్ తెరిపించండి..

నెల్లిమ‌ర్ల జ్యూట్‌మిల్లును తెరిచేందుకు ఇరు వ‌ర్గాలూ ఒక మెట్టు దిగి ప్ర‌య‌త్నించాల‌ని,  యాజ‌మాన్యాన్ని, కార్మిక నాయ‌క‌త్వాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు కోరారు. కార్మికులు న‌ష్ట‌పోకుండా మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ఆలోచించాల‌ని సూచించారు. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం మ‌రో విడ‌త చ‌ర్చ‌లు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే మూత‌బ‌డ్డ నెల్లిమ‌ర్ల జ్యూట్‌మిల్లును తిరిగి తెరిపించేందుకు, జాయింట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రావు స‌మ‌క్షంలో  క‌లెక్ట‌రేట్‌లో యాజ‌మాన్య ప్ర‌తినిధులు, కార్మిక నాయ‌కులతో బుధ‌వారం చ‌ర్చ‌లు జ‌రిగాయి. ముందుగా డిప్యుటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ లేబ‌ర్ సిహెచ్ పురుషోత్తం మాట్లాడుతూ, ఎటువంటి నోటీసు ఇవ్వ‌కుండానే జ్యూట్‌మిల్లు యాజ‌మాన్యం ఆక‌స్మాత్తుగా వ‌ర్క్‌ స‌స్పెన్ష‌న్‌కు పాల్ప‌డింద‌ని చెప్పారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం 90 రోజుల ముందుగా నోటీసు ఇచ్చి, స‌హేతుక కార‌ణాలు చూపిన త‌రువాత, అనుమ‌తి తీసుకొని మాత్ర‌మే మిల్లు మూయ‌డానికి అనుమ‌తి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

             నెల్లిమ‌ర్ల జ్యూట్‌మిల్స్‌ కంపెనీ లిమిటెడ్ సిఇఓ ఎంవి రావు మాట్లాడుతూ, తీవ్ర ఆర్థిక న‌ష్టం కార‌ణంగా మిల్లును మూసివేయాల్సి వ‌చ్చింద‌ని, ఇలాంటి ప‌రిస్థితిలో ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ప్ర‌దానంగా కార్మికులు త‌ర‌చూ విధుల‌కు గైర్హాజ‌రు కావ‌డం, ఉత్ప‌త్తి ప‌డిపోయి, ఖ‌ర్చు పెరిగిపోవ‌డంతో, మిల్లులో ఉత్ప‌త్తిని ఆపివేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. ఉత్ప‌త్తి 50శాతం ప‌డిపోయిన‌ప్ప‌టికీ, నిర్వ‌హ‌ణా వ్య‌యం మాత్రం యదాత‌థ స్థితిలోనే ఉంద‌ని చెప్పారు. కార్మికులు ఒక పూట విధుల‌కు హాజ‌రై, మ‌రోపూట రాక‌పోవ‌డం, నెల‌లో ఎక్కువ‌సార్లు గైర్హాజ‌రు కావ‌డం వ‌ల్ల స‌గ‌టు హాజ‌రు శాతం త‌క్కువ‌గా ఉండి, ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా ప‌డిపోయింద‌ని తెలిపారు. ఇక్క‌డ ముడిస‌రుకు దొర‌క‌క‌పోవ‌డం వ‌ల్ల, ట‌న్నుకు అద‌నంగా రూ.3వేలు చెల్లించి మ‌రీ బెంగాల్ నుంచి తీసుకువ‌స్తున్నామ‌ని, తాము కూడా మిల్లును న‌డప‌డానికి సిద్దంగా ఉన్నామ‌ని చెప్పారు. త‌మ‌ది సిక్ ఇండ‌స్ట్రీగా బిఎఫ్ఆర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, మిల్లును న‌డుపుతున్నామ‌ని అన్నారు. త‌మ ష‌ర‌తుల ప‌త్రాన్ని జెసికి, కార్మికుల‌కు అంద‌జేశారు.

            శ్రామిక సంఘం అధ్య‌క్షులు ప‌తివాడ అప్పారావు మాట్లాడుతూ, యాజ‌మాన్యం వాద‌న‌ను వ్య‌తిరేకించారు. ఎలాగైనా మిల్లును న‌డిపించాల‌న్న ల‌క్ష్యంతో, ప‌లు అంశాల్లో రాజీప‌డి మ‌రీ, యాజ‌మాన్యానికి స‌హ‌క‌రిస్తున్నామ‌ని చెప్పారు. కార్మికులు స‌క్రంగా విధులకు రావ‌డం లేద‌న్న వాద‌న‌ను ఖండించారు. పాత‌కాలం నాటి మిష‌న్లు, నాశిర‌కం ముడిస‌రుకుల కార‌ణంగానే ఉత్ప‌త్తి త‌గ్గిపోయింద‌ని, ఆ నెపాన్నికార్మికుల‌పై నెట్ట‌డం స‌రికాద‌ని అన్నారు. క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో కూడా  ఎన్నో వ్య‌య ప్ర‌యాశ‌ల‌కోర్చి, కార్మికులు విధుల‌కు హాజ‌ర‌య్యార‌ని చెప్పారు. కార్మికులనుంచి వ‌సూలు చేసిన పిఎఫ్ సొమ్మును, తాను చెల్లించ‌వ‌ల‌సిన షేర్‌ను కూడా యాజ‌మాన్యం దీర్ఘ‌కాలంగా క‌ట్ట‌లేద‌ని చెప్పారు. అలాగే గ్రాడ్యుటీ చెల్లించ‌లేద‌ని, ఇఎస్ఐ సౌక‌ర్యం కూడా అంద‌డం లేద‌ని, చివ‌ర‌కు కార్మికులు యాజ‌మాన్యానికి  జీతాల‌నుంచి అప్పుగా ఇచ్చిన‌ సొమ్ము కూడా, తిరిగి చెల్లించ‌డం లేద‌ని చెప్పారు. స‌గ‌టున కార్మికులకు 16 రోజుల ప‌నిమాత్ర‌మే దొరుకుతోంద‌ని, దీంతో ఆ కుటుంబాలు ఎలా బ్ర‌తుకుతాయ‌ని ప్ర‌శ్నించారు.

             చివ‌రిగా జాయింట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రావు మాట్లాడుతూ, ఇరువ‌ర్గాలూ ఒక మెట్టు దిగిన‌ప్పుడు మాత్ర‌మే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. యాజ‌మాన్యం, కార్మికులు త‌మ డిమాండ్ల‌పై చ‌ర్చించి, మ‌ధ్యేమార్గంగా ఒక‌ అంగీకారానికి రావాల‌ని సూచించారు. మిల్లును బ్ర‌తికించే బాధ్య‌త ఇరువ‌ర్గాల‌పైనా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.  జ్యూట్‌మిల్లుల ప‌రిశ్ర‌మ ఇప్ప‌టికే కుదేలై ఉంద‌ని, చాలా మిల్లులు మూత‌బ‌డి ఉన్నాయ‌ని అన్నారు. అందువ‌ల్ల వాస్త‌వ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని, స‌మ‌స్య‌ను సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని చెప్పారు. ముఖ్యంగా కార్మికుల ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకొని, యాజ‌మాన్యం విశాల హృద‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. మిల్లును న‌డ‌ప‌డ‌మే ఇరువ‌ర్గాల‌కు శ్రేయోదాయ‌క‌మ‌ని పేర్కొన్నారు. వారం రోజుల్లోపే మ‌రో సారి, ఇరువ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు ఏర్పాటు చేస్తామ‌ని జెసి వెంక‌ట‌రావు తెలిపారు.

             ఈ చ‌ర్చ‌ల్లో ఏసిఎల్ ర‌మాదేవి, ఏఎల్ఓ అరుణ‌కుమారి, మిల్లు యాజ‌మాన్యం త‌ర‌పున జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పికె ఘోష్‌, క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ పంక‌జ్ రెడ్డి, శ్రామిక సంఘం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ వెంక‌ట గోవింద‌రావు,  కార్య‌ద‌ర్శి మ‌ద్దిలి వెంక‌ట‌ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-23 15:30:20