1 ENS Live Breaking News

మహా విశాఖను స్వచ్ఛతగా ఉంచాలి..

విశాఖ మహా నగరాన్ని స్వచ్ఛతగా ఉంచాలని జివిఎంసి అదనపు కమిషనర్  డా. వి. సన్యాసి రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం  జివిఎంసి ప్రధాన ఆరోగ్య శాఖ అధికారులు, జోనల్ కమిషనర్లతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన సేవ సౌలభ్యం కొరకు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని, దీనిని బలోపేతం చేయాలని, మొదటిగా ప్రతి సచివాలయ పరిధిలో 1,000 నుండి 1,200 వందల ఇళ్ళు మించకుండా వుండాలని ఆ విధంగా ఈ-మ్యాపింగు చేయాలని ఆదేశించారు. సచివాలయ పరిధిలో చెత్త తరలించే వాహనం యొక్క రోడ్డు మ్యాప్ ఉండాలని, పిన్ పాయింట్ వారిగా కార్మికులను సర్దుబాటు చేయాలన్నారు. ఏ పనికి నిర్దేశించిన వారిని ఆ పనికి మాత్రమే కార్మీకులను వినియోగించాలని, త్వరలోనే జివిఎంసికి 690 వాహనాలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతాయని అన్నారు. ప్రతీ రోజు కాలువలు, రోడ్లను శుభ్రం చేసి ఆ చెత్తను పోగులు పెట్టిన వెంటనే సంచులలో నింపాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయనీయరాదని, బహిరంగ మల మూత్ర విసర్జన జరగకుండా చూడాలని, ప్రజా మరుగుదొడ్లు ప్రతి రోజూ శుభ్రంగా ఉంచాలని, వాటిని శుభ్రంగా ఉంచాలని, ప్రతి ఇంటికి మూడు రంగుల చెత్త బుట్టలను అందించాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మీకులకు హాజరు పక్కాగా అమలు చేయాలని పారిశుధ్య కార్మీకులు డెప్యుటేషన్ పై ఉంటే వారిని వెనక్కి పిలిపించి పారిశుధ్య పనులకు వినియోగించాలని ఆదేశించారు. ఎవ్వరు ఎక్కడ పనిచేస్తున్నారు, వారి వివరాలు సాయంత్రానికల్లా అందించాలని అధికారులను ఆదేశించారు.    

ఆన్లైన్ వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టం(OWMS) జరగలేదని ప్రతి రోజు ప్రతి ఇంటికి వెళ్లి ట్యాగ్ చేయాలని ఆదేశించారు. రోడ్డు స్వీపింగు పక్కాగా జరగాలని స్వీపింగు చేసేటప్పుడు మిషన్ నుండి ధూళి  బయటకు వస్తుందని, దానిని నివారించాలని అధికారులను ఆదేశించారు. ఎస్.హెచ్.జి. గ్రూప్ ద్వారా సేంద్రీయ ఎరువు తయారీ చేయు విధానం ప్రోత్సహించాలని, సచివాలయాల పరిధిలో బ్లీచింగు, శానిటేషన్ చేయాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మీకులకు దుస్తులు, రైన్ కోట్లు, శానిటరి సామగరి ఇచ్చామని ఇంకా ఎవరైనా తీసుకొనియడల వాటిని వెంటనే అందించాలని, చీపుర్లు, పారలు కూడా కార్మీకులకు అందించాలని, గమ్ బూట్లు, కాలువలో పనిచేసే శానిటరి సూపర్వైజర్లకు పారిశుధ్య కార్మీకులు అందించాలన్నారు. నైట్ శానిటేషన్ పక్కాగా జరగాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల సర్వే కొరకు సచివాలయాల వారికి డ్యూటీలను వేయాలని అందరి హెచ్.ఒ.డి.లకు కమిషనర్ ఆదేశించారని అది ఎంత వరకు అమలు చేశారని ఆరా తీసారు. వెంటనే అందరికి డ్యూటీలు వేయాలని ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, అందరు జోనల్ కమిషనర్లు, ఎఎంఓహెచ్లు, కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు, శానిటరి సూపర్వైజర్లు, శానిటరి ఇన్స్పెక్టర్లు, ఎం.ఎస్.ఎఫ్.  ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.  

GVMC office

2021-06-08 13:32:37

దేవాదాయ ఆస్తులను పరిరక్షించాలి..

దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు, పునరుద్దరణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆధికారులను ఆదేశించారు.   మంగళవారం మద్యాహ్నం మంత్రి కురసాల కన్నబాబు తమ క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖ డిప్యూటి కమిషనర్/ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ కలెక్టర్ ,తహసీల్దార్, సర్వేయర్లు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్, కాకినాడ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్యాక్రంతమైన  నూకాలమ్మ, సర్పవరం భావనారాయన స్వామి దేవాలయాల అస్తులను ఆక్రమణదారుల చెరనుండి రక్షించి, పదిల పరచేందుకు, ఆదాయ వనరులు అభివృద్ది చేసేందుకు చేపట్ట వలసిన చర్యలను ఆయన అధికారులకు సూచించారు.  అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న నిధులు, కామన్ గుడ్ ఫండ్ నిధులతో జిల్లాలో  దేవాలయాల నిర్మాణం, జీర్ణస్థితికి చేరిన దేవాలయాల పునరుద్దరణానికి సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.  ఈ సమావేశంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ యం.విజయరాజు, అసిస్టెంట్ కమీషనర్ కెఎన్డివి ప్రసాద్, డిఈఈ గోపాలకృష్ణంరాజు, తహశిల్దారు శిరీష, సర్వేయర్లు సీతారామాచారి, రూప తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-08 13:29:26

ప్ర‌జా సంక్షేమ‌మే ప్రభుత్వం లక్ష్యం..

ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాల‌న సాగుతోంద‌ని.. సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు అర్థం లేనివని ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క శాఖా మంత్రి బొత్స స‌త్యనారాయణ వ్యాఖ్యానించారు. కుటుంబ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌ట‌మే ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాల ఉద్దేశం అని పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం జ‌గ‌న‌న్న తోడు కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు క‌లెక్ట‌రేట్ కార్యాల‌యానికి వ‌చ్చిన ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ఎంతో మందికి ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని, కుటుంబ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఆద‌ర్శంగా తీసుకొని కేంద్రం కూడా కొన్ని ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌ని గుర్తు చేశారు. వీధి వ్యాపారులు, తోపుడు బ‌ళ్ల వ్యాపారుల సంక్షేమార్థం జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కంలో భాగంగా అంద‌జేసిన ఆర్థిక సాయం జిల్లాలో 46వేల మందికి అందింద‌ని, ఈ సాయం ఎన్నో కుటుంబాల‌కు అండ‌గా ఉంటుంద‌ని అన్నారు. ఆర్థిక వేత్త‌ల అభిప్రాయం ప్ర‌కారం సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే లోపభూయిష్ట‌మైన‌ ఆస్తి ప‌న్ను విధానాన్నిస‌వ‌రించి నూత‌న పన్నుల‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని విలేకరుల‌డిగిన ప్ర‌శ్న‌కు బ‌దులుగా చెప్పారు. నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ఎలాంటి అవినీతికి తావులేకుండా, సిఫార్సుల అవ‌స‌రం లేకుండా ప‌న్నుల విధానం అమల‌వుతోంద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌లు అర్థంలేనివ‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న వెంట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాసు, క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్సీ సురేష్ బాబుచ, ఎమ్మెల్యేలు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, శంబంగి చిన‌వెంట‌క అప్ప‌ల‌నాయుడు, అల‌జంగి జోగారావు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, త‌దిత‌రులు ఉన్నారు.

Vizianagaram

2021-06-08 13:24:00

చిరువ్యాపారుల అభివ్రుద్ధికే జగనన్నతోడు..

నిరుపేదలు, రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వడ్డీ వ్యాపారస్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటూ అవస్థలు, అష్టకష్టాలు పడుతున్న వారికి మంచి చేసేందుకే జగనన్న తోడు పధకం రెండో దశకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ విధానంలో జగనన్న తోడు పథకం నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా  జగనన్న తోడు పథకం రెండో విడత 3.7 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 10 వేలు వడ్డి లేని రుణం మొత్తం రూ.370 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి  అక్కచెల్లెమ్ములు, అన్నదమ్ముల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో చిరువ్యాపారాలు చేసే వారు  పెట్టుబడి కోసం గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తుల వద్ద వందకు పది రుపాయిలు వడ్డీ తీసుకొని ఇబ్బంది పడుతున్నారని గమనించి అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టామన్నారు. జగనన్న తోడు పథకం తొలి విడతలో 5.35 లక్షల మందికి రూ. 10 వేలు చోప్పున రుణాలు ఇచ్చామన్నారు. జగనన్న తోడు కింద మొత్తం 9.05 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే తొలి విడతలో 5.35 లక్షల మందికే బ్యాంకుల నుంచి రుణాలు వచ్చాయని, మిగిలిన 3.70 లక్షల మందికి బ్యాంకుల నుంచే కాకుండా ఆప్కాబ్, స్త్రీనిధి వంటి బ్యాంకులను రంగంలోకి దింపి ఈ రోజు రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకుల నుంచి లభించిన రుణాలను వడ్డీతో సహా సకాలంలో చిరువ్యాపారులు బ్యాంకులకు చెల్లిస్తే వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని  నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. దీని వలన రుణం తీసుకున్న వారికి తిరిగి సకాలంలో చెల్లించాలనే క్రమశిక్షణ వస్తుందన్నారు. రుణం మొత్తం చెల్లించిన లబ్దిదారులకు తిరిగి మళ్ళీ వడ్డీ లేని రుణం పొందే అవకాశం ఉందన్నారు. అర్హత ఉన్న వారు సచివాలయాలు ద్వారా దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వెరిఫికేషన్  చేసి ప్రతి  మూడు నెలలకు ఒకసారి అర్హత పొందిన దరఖాస్తులకు ఆరునెలలకు ఒకసారి తిరిగి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందన్నారు. జగనన్న తోడు పథకం ద్వారా రాష్ట్రంలోని 9.05 లక్షల మంది చిరువ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
  గుంటూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, నగరపాలక సంస్థ మేయరు కావటి శివ నాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్ధాళి గిరిధర్, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావు, రాష్ట్ర మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా 28,463 మంది లబ్ధిదారులకు రూ.28.46 కోట్లు అందిస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులకు అందిస్తున్న రూ.10 వేలు వడ్డీ లేని రుణం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. జగనన్న తోడు చిరు వ్యాపారులకు జగమంత తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సందేశంతో కూడిన  కరపత్రాన్ని ఆవిష్కరించారు. 

  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాడికొండ గ్రామానికి చెందిన లబ్దిదారు సరళాదేవి మాట్లాడుతూ  కరోనా కష్టకాలంలో జగనన్న తోడు పథకం ద్వారా రూ. 10 వేలు వడ్డీ లేని రుణం అందించి చిరు వ్యాపారులను ఆదుకుంటున్నారని తెలిపారు. తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులకు సాయం చేస్తున్న మొదటి వ్యక్తి మీరే అన్నారు. వాలంటీర్ ఇంటికి వచ్చి  చిరు వ్యాపారం చేస్తున్న నాకు  జగనన్న పథకం ద్వారా ఆర్ధిక సాయం చేస్తున్నట్లు చెబితే సంతోషపడ్డాను అన్నారు. గతంలో గత్యంతరం లేక వడ్డీలకు అప్పులు తీసుకొని వాటిని తీర్చలేక వడ్డీ వ్యాపారులకు భయపడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్ధితుల్లో ఇంటిలో దాక్కున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  మా పెద్ద కుమార్తెకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా ఆస్పత్రిలో ఉచితంగా కాన్పు చేయటంతో పాటు, ఇంటి వద్దకు వదిలి పెట్టి ఆపరేషన్ చేయించుకున్నందుకు రూ.3000 నగదు ఇచ్చారన్నారు. పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా  ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు పక్కా ఇళ్ళు కట్టి ఇస్తున్నారన్నారు. పేదలకు అవసరమైన అన్ని సంక్షేమ పధకాలు అమలు చేస్తూ కరోనా కష్ట సమయంలోను ఆదుకుంటున్న మీకు     ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. మీరు చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలన్నారు.

      జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా గ్రామీణ పరిధిలోని 22180 మంది లబ్ధిదారులకు  రూ.22.18 కోట్లు, పట్టణ పరిధిలోని 6283 లబ్ధిదారులకు రూ.6.28 కోట్లు చెక్కులను రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, నగరపాలక సంస్థ మేయరు కావటి శివ నాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్ధాళి గిరిధర్, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావు, రాష్ట్ర మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

      వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా చిరువ్యాపారాలు, సాంప్రదాయ వృత్తులు చేసుకునే పేదలు 28,463 మందికి రూ.10 వేలు వడ్డీలేని రుణాలు ఇవ్వటం జరిగిందన్నారు, రాష్ట్రవ్యాప్తంగా జగనన్నతోడు పధకం రెండు దశలలో 9.05 లక్షలు మందికి వడ్డీలేని రుణాలు అందించామన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలోను పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు అన్ని సంక్షేమ పథకాలు చెప్పిన తేదీకి ఖచ్చితంగా అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి పేద ప్రజల సంక్షేమం, ఆర్ధిక అభివృద్ధే ధ్యేయంగా అన్ని పథకాలు ద్వారా   ఆర్దిక సాయం అందిస్తున్నారన్నారు. చిరువ్యాపారులు ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.10,000  అప్పు చేస్తే వడ్డీ కింద రూ.3000 మినహాయించుకొని రూ.7000 మాత్రమే ఇస్తున్నారని ముఖ్యమంత్రి సుదీర్ఘ పాదయాత్రలో చిరువ్యాపారుల  కష్టాలను తెలుసుకొని  రూ.10వేలు వడ్డీలేని రుణం ఇచ్చేందుకు జగనన్న తోడు పథకంను మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. చిరు వ్యాపారులకు  హామీ లేకుండా బ్యాంకులు రూ.10వేలు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నందుకు లబ్ధిదారుల తరుపున ముఖ్యమంత్రికి ప్రత్యేక దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు ధరకు అన్ని రకాల పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. 

      ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి ) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (అసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, డిఆర్ఓ పి. కొండయ్య,  డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Guntur

2021-06-08 12:41:11

సేంద్రియ వ్యవసాయంతో ఎంతో లాభం..

సేంద్రీయ వ్యవసాయంతో రైతుకు అధిక లాభం చేకూరుతుందని ఉద్యానవన శాఖ కమీషనర్ యస్.యస్.శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల మండలం కొంగరాంలో 2వేల చదరపు అడుగుల్లో జి.కృష్ణప్రసాద్ నెలకొల్పిన ఫామ్ హౌస్ ను ఆయన సందర్శించారు.  ఫామ్ హౌస్ లో పండించిన కాయగూరలు, పూలమొక్కలను పరిశీలించి వివరాలు అడిగితెలుసుకున్న ఆయన సేంద్రీయ పద్ధతిలో పంటలను పండిస్తున్న కృష్ణప్రసాద్ ను అభినందించారు. జిల్లాలో చామంతి, బంతి వంటి పూలసాగు విస్తారంగా ఉందని, రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకు  చామంతి, బంతి వంటి పూలసాగును మరింత విస్తరింపచేసి ఉద్యానవన శాఖ తరపున రైతులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతు సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తే పంటకు అయ్యే ఖర్చులు తగ్గి రాబడి పెరుగుతుందని అన్నారు. అంతేకాకుండా దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పారు. సాంప్రదాయ పద్ధతులే కాకుండా ఆధునిక పద్ధతిలో కూడా ఉద్యానవన పంటలను సాగుచేసి డ్రిప్, పోలీహౌస్  షెడ్ మెట్ లను ప్రభుత్వం అందించే సహకారంతో రైతులు ఏర్పాటుచేసుకొని మరింత అధిక లాభాలను ఆర్జించాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ పర్యటనలో  ఏ.పి.ఎం.ఐ.పి పథక సంచాలకులు ఏ.వి.యస్.వి. జమదగ్ని, ఏ.పి.డి వరప్రసాద్, హెచ్.ఓ స్వాతి, వి.ఏ.ఏ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-08 12:36:10

ఆర్అండ్ఆర్ పనులు పూర్తిచేయాలి..

విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ పరిధిలోని గూడెపువలస, పోలిపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఆర్ & ఆర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవేన్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన భోగాపురం విమానాశ్రయ ప్రాంతాన్ని వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ పి. కోటేశ్వరరావుతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను, ఆర్&ఆర్ పనులను పరిశీలించారు. నిర్ణీత గడువులోగా ఈ పనులను పూర్తి చేయాలని జేసీ కిషోర్ కుమార్, ఆర్డీవో భవానీ శంకర్ లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అన్ని పనులను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జేసీ కిషోర్ కుమార్ ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై వివరించారు. ముందుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవేన్, వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ కోటేశ్వరరావు లను జేసీ, ఆర్డీవో పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో వి.ఎం.ఆర్.డి. ఎ. కమిషనర్ పి.కోటేశ్వరరావు, జేసీ కిషోర్ కుమార్, ఆర్డీవో బి.హెచ్. భవానీ శంకర్, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Bhogapuram

2021-06-08 12:24:11

సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించాలి..

మహావిశాఖ నగర ప్రజలకు సేంద్రీయ ఎరువుల తయారీపై  అవగాహన పెంపొందించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలో ఆమె 6వ జోన్ 72వ వార్డు నడుపూర్  ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సేంద్రీయ ఎరువుల తయారీలో మహిళలకు పొదుపు సంఘాల ద్వారా అవగాహన కల్పించాలని, ఇంటిలో వాడే కూరగాయల తొక్కలు లాంటివి ఉపయోగించి ఎరువులు తయారు చేసే విధానం తెలియపరచి, వాటి నుండి సేంద్రీయ ఎరువు తయారు చేసి పెరటలోని మొక్కలకు ఉపయోగించుకోవచ్చన్నారు. డోర్ టు డోర్ తడి-పొడి చెత్త సేకరణను చేసే విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కోలనీలో త్రాగునీరు సమయం ప్రకారం ఇస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతీ శుక్రవారం “డ్రై” డే పాటించాలని ఇళ్ళలో ఉండే మనీ ప్లాంట్స్, ఫ్రిజ్ వెనుక భాగంలో నిల్వ ఉన్న నీరు, పరిసరాలలో ఉండే కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ వస్తువులలోని  నీరు, నీటి కుండీలలోని నీరు నిల్వ ఉండకుండా చూడాలని, అప్పుడే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని సూచించారు. కోలనీ వాసులు పలు సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకు రాగా వాటిని పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.                                
అనంతరం నిర్మాణంలో ఉన్న ప్రతీ భవనం యొక్క ప్లాన్ వార్డు సచివాలయ ప్లానింగు కార్యదర్శుల వద్ద ఉండాలని, అనధికార నిర్మాణాలు ఉండరాదని, ప్రతీ ప్లానింగు కార్యదర్శులు వార్డులో ప్రతీ రోజు తిరగాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీధర్, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు ప్రసాద్ బాబు, సహాకయక ఇంజినీరు సుబ్బారావు, టౌన్ ప్లానింగు అధికారులు, శానిటరి సూపర్వైజర్లు, శానిటరి ఇన్స్పెక్టర్, వర్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-06-08 12:22:12

మరింత మెరుగైన సేవలు అందించండి..

కోవిడ్ సమయంలో బాగా పనిచేశారని కృష్ణా జిల్లాకు బదిలీ పై వెళుతున్న కలెక్టర్ జె. నివాస్ పేర్కొన్నారు.  మంగళవారం రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో  వైద్యులు, వైద్య సిబ్బంది వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చాలా బాగా పనిచేసారన్నారు.  అందరి సమిష్టి కృషితో కరోనా రెండవ దశను అరికట్టగలిగామని అన్నారు. మరింత మెరుగైన వైద్య సేవలు అందించి  ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎవరినైనా నొప్పించి మాట్లాడితే వాటిని మనసులో ఉంచుకోవద్దని చెప్పారు.  డైరెక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి భయపడుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ గా మీరు తీసుకునే సాహసోపేతమైన  నిర్ణయాలు ఎంతో అధ్భుతమైనవన్నారు.  ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్ లు, సిటి స్కాన్ ,ఎంఆర్ఐ స్కాన్ వంటివి తెప్పించి శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ లో చాలా మంది ప్రాణాలు కాపాడారని కొనియాడారు.  ప్రజల్లో సుస్థిరమైన స్థానం సంపాదించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్  కృష్ణ మూర్తి, డాక్టర్ చలమయ్య, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-08 12:17:09

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న లెవెలింగ్ ప‌నులు..

న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కానికి సంబంధించిన లేఅవుట్ల‌లో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థ‌లాల లెవెలింగ్ ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌ని క్షేత్ర‌స్థాయి అధికారుల‌ను జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. మంగ‌ళ‌వారం కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి జాయింట్ క‌లెక్ట‌ర్‌.. డివిజ‌న‌ల్‌, మండ‌ల స్థాయి అధికారుల‌తో లేఅవుట్ల ప‌నుల‌పై వ‌ర్చువ‌ల్ విధానంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ వైఎస్సార్ జ‌గ‌న‌న్న కాల‌నీల్లో ఇళ్ల నిర్మాణాల‌కు పెద్ద ఎత్తున శంకుస్థాప‌నలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇంకా ఏవైనా లేఅవుట్ల‌లో లెవెలింగ్ ప‌నులు పూర్తికావాల్సి ఉంటే, వారం ప‌ది రోజుల్లో పూర్తిచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్రధానంగా రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లు పెండింగ్ పనులపై దృష్టి సారించి, పనులను పూర్తి చేయాలన్నారు. స‌బ్ క‌లెక్ట‌ర్లు, త‌హ‌సీల్దార్లు ఎంపీడీవోల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ‌తో ప‌నులు పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. లెవెలింగ్ చేయ‌డానికి ఉప‌యోగించే మ‌ట్టి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌క్క‌దారి ప‌ట్టేందుకు వీల్లేద‌ని స్ప‌ష్టం చేశారు. లేఅవుట్ల‌లో లెవెలింగ్ ప‌నులకు ఎవ‌రైనా ఆటంకం క‌లిగిస్తే వారిపై క్రిమినల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ హెచ్చ‌రించారు.

Kakinada

2021-06-08 12:14:24

భైరవస్వామికి ఏకాంతంగానే పూజలు..

విశాఖలోని సింహాచలం  శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి అనుబంధ ఆలయం బైరవకోన బైరవస్వామికి అమావాస్య రోజు ఏకాంతంగా పూజలు నిర్వహిస్తున్నట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. మంగళవారం ఈ మేరకు దేవస్థానంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను అనుసరించి 10వ తేదిన అమావాస్య రోజు స్వామి ఆలయంలో భక్తులకు ప్రవేశం లేదన్నారు. స్వామికి పూజలన్నీ ఏకాంతంగానే జరుగుతాయన్నారు. అమావాస్య రోజు భక్తుల తాడికి అధికంగావుంటుందని ముందుగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని వివరించారు.  భక్తులు గుర్తుంచుకొని దేవస్థాన అధికారులకు సహకరించాలన్నారు. స్వామి ఆలయానికి ఎప్పుడు భక్తులను అనుమతించేది త్వరలోనే తెలియజేస్తామని వివరించారు. 

Simhachalam

2021-06-08 11:49:33

శ్రీకాకుళం జిల్లాకు రూ.16.69కోట్ల లబ్ధి..

చిరువ్యాపారులకు ఆర్థిక సహాయం జగనన్నతోడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.  మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగనన్నతోడు కింద జిల్లాలో 16 వేల 690 మందికి లబ్ది చేకూరుతుందని, వీరికి 16 కోట్ల 69 లక్షల రుపాయలు లబ్దిదారుల ఖాతాలలో ముఖ్యమంత్రి జమ చేసినట్లు చెప్పారు.  చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల వద్ద వడ్డీలకు తీసుకొని వ్యాపారం చేసుకొనే వారని చెప్పారు.  ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి పాతయాత్రలో వారి కష్టాలను కనులార చూసి వారికి  జగనన్నతోడు పథకం కింద ఒక్కొక్కరికి వడ్డీ లేకుండా 10 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా  అందించారని పేర్కొన్నారు.  పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.  ముందు చూపుతో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 14 మెడికల్ కళాశాలలకు శంకు స్థాపన చేసారని, పేద వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేందకు ఆరోగ్య శ్రీ పథకం వంటి వాటిని అమలు చేస్తున్నట్లు చెప్పారు.  కేరళ రాష్ట్ర వలే అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు. రైతులకు రైతు భరోసా, మహిళలకు దిశ చట్టం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఉత్తరాంధ్ర అభివృద్థికి అందరూ కలసికట్టు రావలసినదిగా ఆయన పిలుపు నిచ్చారు.  ఆయనతో పాటు శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు, కళింగకోమటి కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-08 11:31:01

ఆక్వారైతుల సహాయం రూ.2.97లక్షలు..

కోవిడ్ రెండోద‌శ ఉద్ధృతి నేప‌థ్యంలో బాధితుల‌కు అండ‌గా ఉండాల‌నే ఉద్దేశంతో శ్రీ ఉమా రామ‌లింగేశ్వ‌ర స్వామి ఆక్వా రైతుల సంక్షేమ సొసైటీ (చెయ్యేరు) రూ.2,79,116 గోడితిప్ప ఆక్వా రైతులు రూ.61 వేలును జిల్లా కోవిడ్ స‌హాయ నిధికి విరాళంగా అందించారు. ఈ మేర‌కు రైతుల ప్ర‌తినిధులు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి చెక్కులు అంద‌జేశారు. సామాజిక బాధ్య‌త‌తో కోవిడ్ స‌హాయ నిధికి త‌మ వంతు స‌హాయాన్ని అందించిన ఆక్వా రైతుల‌కు క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, మ‌త్స్య శాఖ జేడీ పీవీ స‌త్య‌నారాయ‌ణ, సంక్షేమ సొసైటీ ప్రెసిడెంట్ టి.నాగ‌భూష‌ణం, వైస్ ప్రెసిడెంట్ బి.శ్రీనివాస‌రావు; గోడితిప్ప ఆక్వా రైతుల ప్ర‌తినిధులు ఎం.బాబులు, శంక‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-08 11:29:30

నిరుపేదలకు భరోసా జగనన్నతోడు..

జగనన్న తోడు పథకం కింద రెండవ విడతలో  రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరువ్యాపారుల ఖాతాలలో  రూ. 10వేల చొప్పున రూ. 370 కోట్లను  విడుదల చేసినట్లు   ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  మంగళవారం నాడు  ఆయన  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించి  కంప్యూటర్ బటన్ నొక్కి  నేరుగా  లబ్దిదారుల ఖాతాలలో  నగదు జమ చేసారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ  తోపుడు బండ్లపై, బుట్టల్లో  సరుకులు  అమ్మేవారు,  పుట్ పాత్ లపై  వ్యాపారుల చేసేవారు , సైకిల్ , వాహనాలపై  వస్తువులు  అమ్మేవారు , కొండపల్లి, ఏటికొప్పాక కొయ్యబొమ్మల లాంటి  సాంప్రదాయ హస్తకళలపై  ఆధార పడే వారికి  రూ. 10వేల వరకు  వడ్డీ లేని రుణం ఇస్తున్నామని  పేర్కొన్నారు.   గత ఏడాది  జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది  రుణ సౌకర్యం పొందారని  అన్నారు.  అర్హత ఉన్నవారందరికి సహాయం చేస్తున్నామని  సకాలంలో వడ్డీ చెల్లించే వారికి  తిరిగి వారి ఖాతాలలోకి  వడ్డీ జమ చేస్తామని తెలిపారు. విశాఖపట్నం నుంచి  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, నగర మేయర్ గొలగాని  హరి వెంకట కుమారి,  పార్లమెంట్ సభ్యులు  జి.మాధవి, శాసన సభ్యులు  జి. అమర్ నాథ్, జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, జి.వి.ఎం .సి కమిషనర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు,  అసిస్టెంట్ కలెక్టర్  అదితి సింగ్, డి ఆర్ డి ఎ పిడి విశ్వేశ్వరరావు, యుసిడిపిడి  వై. శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు  మాట్లాడుతూ, చిరువ్యాపారులు మరియు సాంప్రదాయ వృత్తిదారుల  జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని,  వారి వ్యాపార, జీవనోపాధి కార్యక్రమాలకు  ఈ డబ్బును వినియోగించుకొని  ఆర్ధికంగా అభివృద్ది చెందాలని ఈ పథకాన్ని   అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో  మొదటి దశలో గత ఏడాది 54,277 మంది లబ్దిదారులకు రూ. 54.28 కోట్లు  సహాయం చేసామని  తెలిపారు.  ప్రస్తుతం  రెండవ దశలో   35,186 మంది లబ్దిదారులకు రూ. 35.19 కోట్లు సహాయం చేస్తున్నామని  తెలిపారు. ఇందులో  గ్రామీణ ప్రాంతంలో  22,370 మంది  లబ్దిదారు లున్నారని,  జి.వి.ఎం సి పరిధిలో  9,320 మంది లబ్దిదారులున్నారని , నర్సీపట్నం మున్సిపాలిటి పరిధిలో  2,487 మంది  లబ్దిదారులున్నారని , ఎలమంచిలి  మున్సిపాలిటి పరిధిలో 1,009 మంది లబ్దిదారులున్నారని  తెలిపారు. 

Visakhapatnam

2021-06-08 11:10:50

ఆటో డ్రైవర్లకు అండగా వాహన మిత్ర..

కోవిడ్ విపత్తులో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అండగా నిలుస్తోందని .నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని 20 వ డివిజన్ లో జరుగుతున్న వాహన మిత్ర సర్వేలో మంగళవారం నగర మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ సాకే చంద్రలేఖ తో కలసి డివిజన్ పరిధిలో ఆర్వ్హత ఉన్న ఆటో డ్రైవర్లనుండి వాహన మిత్ర దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ గతంలో ఆటోలు రిపేరిలు వస్తే రిపేరీ ల కోసం  వడ్డీ వ్యాపారులతో అధిక వడ్డీకి తీసుకునే పరిస్థితి ఉండేదన్నారు..వచ్చిన ఆదాయం వడ్డీ వ్యాపారులకు సరిపోయేదని కుటుంబ పోషణ కు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆటోల మైంటెనెన్స్ కోసం వాహన మిత్ర ప్రవేశ పెట్టి ప్రతియేటా 10వేల రూపాయలు అందిస్తుండటం ఆటో డ్రైవర్లకు వరంగా మారిందన్నారు ఈ అవకాశాన్ని  ఆటో డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.కోవిడ్ సమయంలో అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమేనని ఈ సందర్భంగా మేయర్ కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కుళ్లయిస్వామి, కొర్రపాడు హుస్సేన్ పిరా తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-08 11:06:16

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి..

శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్ ప్రోజెక్టులు చాలావరకు ఉన్నాయని వాటికి ప్రాధాన్యతను ఇస్తామని, అలాగే అధికారుల సహకారంతో ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలుచేస్తూ జిల్లా  సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తానని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లాఠకర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబరులో నూతన జిల్లా కలెక్టర్ గా విధుల్లోకి చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రతో తనకు చాలా అనుభవం , అనుబంధం ఉందని, తాను విజయనగరం జిల్లాలో దాదాపు మూడేళ్ల  పాటు పనిచేసినట్లు  చెప్పారు.జిల్లాలో గత మూడు మాసాలుగా కోవిడ్ సెకెండ్ వేవ్ నియంత్రణకై జిల్లా యంత్రాంగం,  జిల్లా అధికారులు చాలా కష్టపడి పనిచేసారని,  ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. మరో నెలరోజుల పాటు కరోనా సెకెండ్ వేవ్ ఉండే అవకాశం ఉన్నందున కరోనా  నియంత్రణకు ప్రాధాన్యతను ఇస్తూ అందరి అధికారుల సహకారంతో కోవిడ్ ను  పూర్తిగా నియంత్రించేందుకు కృషిచేస్తామని తెలిపారు. కరోనాపై రాష్ట్ర ముఖ్యమంత్రి వారంలో రెండు, మూడు సార్లు వీడియోకాన్ఫరెన్సులను నిర్వహిస్తున్నారని, అలాగే జిల్లా కలెక్టర్లు అధికారులతో ప్రతీ రోజూ సమావేశాలను ఏర్పాటుచేస్తున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలు, ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు ముందుకు సాగుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.  వ్యవసాయపరంగా జూన్ మొదటివారంలో ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం అయినందున , జిల్లాలో అన్ని చోట్ల సాగు ప్రారంభం అవుతున్నందన వ్యవసాయానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 30 లక్షల గృహనిర్మాణాల కొరకు ప్రత్యేకంగా సంయుక్త కలెక్టర్(హౌసింగ్) ను ప్రభుత్వం ఇటీవల నియమించడం జరిగిందని, జిల్లాలో గృహపట్టాలు పొందిన లబ్ధిదారులకు గృహాలను నిర్మించి అప్పగించడం పెద్ద టాస్క్ అని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషిచేస్తామని కలెక్టర్ వివరించారు.

శ్రీకాకుళం జిల్లాకు రావడం తనకు ఆనందంగా ఉందని, ఇక్కడ చాలా మంచి అధికారులు పనిచేసారని, మంచి అధికారులు కూడా ఉన్నారని వారందరి సహకారంతో దేశ, రాష్ట్ర, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తొలుత సంయుక్త కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి నూతన కలెక్టర్ కు పుష్పగుచ్ఛాలను ఇచ్చి ఘన స్వాగతం పలికారు.  అనంతరం   శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వేదపండితులు మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం పలుకగా, ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్ పుష్పగుచ్ఛం, దుశ్శాలువతో నూతన కలెక్టర్ కు సత్కరించి స్వామి వారి ప్రసాదాలను అందించారు. 

Srikakulam

2021-06-08 10:56:18