స్మార్ట్ సిటీ లో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ , జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 19వ బోర్డ్ మీటింగ్ స్మార్ట్ సిటీ ఎం.డి., నగరపాలకసంస్థ కమిషనర్ గిరీష అధ్యక్షతన నగరపాలకసంస్థ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది. చైర్మన్ భరత్ గుప్తా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమోద ముద్ర వేశారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీ నిధులతో డి.బి.ఆర్ హాస్పిటల్ రోడ్డులో స్కూల్ నిర్మాణానికి, శ్వాసతంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్లు నిర్మాణానికి, నగరంలోని పలు చెరువులు, కుంటల కట్టలు బలపరచాలని నిర్ణయించారు. గొల్లవాని గుంట, కొంకా చెన్నయ్య గుంట, కొరమేను గుంట మరియు పూల వాని గుంట చెరువుల సుందరీకరణకొరకు సుమారుగా ఆరు కోట్ల పనులు చేయుటకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెంతుకోస్తు చర్చి నుండి కొత్తపేట కొరమేను గుంట కాలువ నిర్మాణం కొరకు ఐదు కోట్ల రూపాయలతో పనులు చేయుటకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగినది మరియు విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు మున్సిపల్ సిబ్బందికి అవసరమైన వాహనములు మరియు పరికరములు కొనుటకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. వినాయక సాగర్ వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలన్నారు. , లీలామహల్ వద్ద నుండి శ్రీనివాసం వరకు మురుగునీరు సజావుగా వెళ్లేలా ఒక పెద్ద మురుగునీటి కాలువ నిర్మాణం, నగరంలో గస్తీ తిరిగే పోలీసులకు బ్యాటరీ స్కూటర్స్ బదులు పెట్రోల్ స్కూటర్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కమిషనర్ వారితోపాటు తుడా వి.సి. హరికృష్ణ, జి.ఎం. చంద్రమౌళి, ఎస్.ఈ. మోహన్, బోర్డ్ సభ్యులు రామచంద్రారెడ్డి,రమశ్రీ, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, డి ఎస్పీ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
కరోనా నుంచి కోలుకోవడంతో 40 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం అనంతపురం లో ఆయన మీడియతో మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు గురువారం 40 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేసానట్టు వివరించారు. వారందరినీ 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని, బలవర్ధక ఆహారం తీసుకోవాల్సిందిగా సూచించామని కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. దేవాలయాలు, ప్రయాణాలు చేస్తున్న సమయంలో నాణ్యమైన శానిటైజర్లు వినియోగించాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గంధం చంద్రుడు కోరారు.
గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవల గురించి ప్రజలందరికీ తెలియజేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశించారు. సచివాలయ పరిధిలోనున్న కుటుంబాల యింటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలపై అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం కలెక్టరు ఎలమంచిలి, కశింకోట మండలాల్లో పర్యటించారు. గ్రామ చివాలయాలు,రైతుభరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్యకేంద్రాల పని తీరును పంశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని తనిఖీ చేశారు. షేక్ ఆలీపాలెం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలు, వివిధ పధకాల క్రింద లబ్ది దారుల వివరాలపై ఉద్యోగులను ప్రశ్నించారు. సంతృప్తికరమైన సమాధానాలు చెప్పని ఉద్యోగులను వారి పని తీరును మెరుగు పరచుకొనకపోతే క్రమశిక్షణ చర్యలు చేపడతామని హెచ్చరించారు. సచివాలయంలో డిస్స్లెబోర్డులో ప్రదర్శించిన లబ్దిదారుల జాబితా పరిశీలించారు. షేక్ ఆలీపాలెం గ్రామం నుండి ఒక్కరు కూడా కలెక్టరేట్ కు పిటిషన్ తో రాకుండా ప్రజలకు సంతృప్తి కరమైన సేవలు అందించాలన్నారు. సచివాలయం ద్వారా ప్రభుత్వం ప్రజలకు 543రకాల సేవలను అందిస్తున్నదన్నారు ఈ సేవలు వివరాలన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ సేవలపై కరపత్రాలను వివరంగా ముద్రించి గ్రామం లోని ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని, జిల్లా వ్యాప్తంగా మిగిలిన డి.ఎల్.డి.ఓ.లు కూడా అమలు చేయాలన్నారు. డి.ఎల్.డి.ఓ సత్యన్నారాయణను ఆదేశించారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్కు మేన్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. ఆయన చేసిన సేవలను గుర్తించిన ఢిల్లీకి చెందిన ఇండియన్ ఎచీవర్స్ ఫోరమ్ ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. దేశంలో వివిధ రంగాల్లో సుదీర్ఘకాలంపాటు ఉత్తమ సేవలందించిన వారిని గుర్తించి, ఇండియన్ ఎచీవర్స్ ఫోరమ్ గత 20 ఏళ్లుగా ఈ అవార్డులను బహూకరిస్తోంది. ఇప్పటికే జిల్లాకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులను సాధించిపెట్టిన కలెక్టర్ హరి జవహర్ లాల్, మరో ప్రముఖ పురస్కారానికి ఎంపిక కావడంతో, ఆయనకు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ జిల్లా కలెక్టర్గా రావడం జిల్లాకు వరం అని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్కుమార్ కొనియాడారు. మేన్ ఆఫ్ ఎక్స్లెన్స్ పురస్కారానికి ఎంపికైన కలెక్టర్ను పలువురు ఉన్నతాధికారులు, పాత్రికేయులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది శుక్రవారం శాలువలతో సత్కరించి, పూలగుచ్ఛాలతో అభినందించారు. ఈ సందర్భంగా జెసి కిశోర్ మాట్లాడుతూ, మన కలెక్టర్ హరి జవహర్లాల్ జిల్లాను అన్నివిధాలా అభివృద్దివైపు నడిపిస్తూ, ఇప్పటికే పలు అవార్డులను సాధించిపెట్టారని అన్నారు. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఘనత ఆయనకే దక్కిందని ప్రశంసించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు మాట్లాడుతూ ప్రతి అంశంలోనూ జిల్లాను ఇతర జిల్లాలకంటే ముందు ఉంచాలన్న తపన కలెక్టర్లో చూసానని అన్నారు. ప్రజోపయోగ కార్యక్రమాలకు, ప్రజా సంక్షేమానికి ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పారు. కారుణ్య నియామకాల్లో గానీ, సచివాలయ ఉద్యోగాల భర్తీలో గానీ, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీలో గానీ కలెక్టర్ చూపించిన చొరవ ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి డి.రమేష్ మాట్లాడుతూ తన అపార అనుభవంతో జిల్లాను కలెక్టర్ అన్ని విధాలా ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. ప్రణాళికా బద్దమైన కృషి, సానుకూల దృక్పథం, అందరినీ కలుపుకొని జిల్లాను కలెక్టర్ ముందుకు నడుస్తుండటం వల్ల ఎన్నో పురస్కారాలు లభిస్తున్నాయని చెప్పారు. కలెక్టర్ హరి జవహర్లాల్ విలువలకు నిలువటద్దమని కెఆర్ఆర్సి ఉప కలెక్టర్ కెబిటి సుందరి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విజయాలకు ప్రతిరూపంగా మారారని, జిల్లా విపత్తుల నివారణాధికారి బి.పద్మావతి కొనియాడారు. జిల్లాకు కలెక్టర్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఆయన పాలనాదక్షత కారణంగానే అవార్డులు వరిస్తున్నాయని సిపిఓ జె.విజయలక్ష్మి ప్రశంసించారు.
సానుకూల దృక్ఫథం, సమిష్టి కృషే తన విజయానికి కారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ పేర్కొన్నారు. తనకు మేన్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డు రావడం పట్ల ఆయన స్పందిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. సృజనాత్మకంగా పనిచేసేందుకు అవాకాశం రావడం కూడా ఒక వరమని, దానిని విజయనగరం జిల్లా తనకు కల్పించిందని చెప్పారు. మనస్ఫూర్తిగా పనిచేసుకుపోవడం, తనకు జిల్లా యంత్రాంగం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందడం తన విజయాలకు కారణాలని పేర్కొన్నారు. తాను ఎన్నడూ అవార్డులను ఆశించలేదని, అంకితభావం, చిత్తశుద్దితో ప్రణాళికాబ్దంగా పనిచేయడం వల్లే, అవార్డులు వాతంటత అవే వస్తున్నాయని చెప్పారు. మేన్ఆఫ్ ఎక్స్లెన్స్ గా తనను గుర్తించడమే కాకుండా, విజయనగరం జిల్లా పేరును కూడా ఎన్ఐఐఆర్డి రికార్డుల్లో చిరస్థాయిగా నిలపడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రతీ కలెక్టర్ జిల్లా అభివృద్దిపై తనదైన ముద్ర వేయాలని, ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తరచూ చెప్పే మాటలు, ప్రోత్సాహం కారణంగా, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు నడుస్తున్నానని కలెక్టర్ హరి జవహర్లాల్ అన్నారు.
సచివాలయాల ద్వారా అన్ని శాఖలకు చెందిన సర్వీసులు ప్రజలకు అందించేలా తగుచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు .శుక్రవారం స్థానిక రామ్ నగర్ లోని 54,55 వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయం ద్వారా సర్వీసులను ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ అక్కడి సిబ్బందితో ఆరా తీశారు. జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 1200 సర్వీసులు అందాయని అక్కడి సిబ్బంది తెలిపారు. ఈ సర్వీసులను ప్రజలకు మరింత ఎక్కువగా అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వార్డు సచివాలయ రికార్డులను పరిశీలించి ప్రస్తుతం 28 శాఖలకు చెందిన సర్వీసులు మాత్రమే అందిస్తున్నారన్న విషయాన్ని ఆయన గమనించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన అన్ని రకాల సర్వీసులను సంబంధిత శాఖలకు చెందిన అధికారులతో మాట్లాడి సత్వరచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు సర్వీసులను పరిష్కరించాలని, గడువు ముగిసిన తర్వాత ఏ ఒక్క సర్వీసు కూడా పెండింగ్లో ఉండటానికి వీలులేదన్నారు. గడువు మీరిన సర్వీసులకు సంబంధించి సాంకేతిక సమస్యల వల్ల పరిష్కరించలేక పోయామని అక్కడి సిబ్బంది జిల్లా కలెక్టర్ తెలిపారు. సర్వీసుల పరిష్కారంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి,నగర పాలక సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశానికి ఎంపిక పరీక్షలు ఆన్ లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న బాల,బాలికలు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులన్నారు. వీరు తేదీ 01.05. 2008 నుండి 30.04.2012 మధ్యలో జన్మించిన వారై ఉండాలి .దరఖాస్తులను WWW.navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూరించి తిరిగి అదే వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయాలన్నారు. ఈ పరీక్షలు ఆంగ్లము, హిందీ, కన్నడ ఇతర భాషలతో పాటు తెలుగు భాషలో కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ దరఖాస్తులను ఈసేవ, మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లు, సొంత మొబైల్లు, తదితర మార్గాల ద్వారా దరఖాస్తుడౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు పూరించి అప్లోడ్ చేసుకోవచ్చన్నారు .తేదీ 15.12.2020 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు .
అలాగే జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదవతరగతిలో మిగిలి ఉన్న సీట్లకుగాను తొమ్మిదవతరగతిలో ప్రవేశం కోరే బాల,బాలికలు కూడా పైన పేర్కొన్న వెబ్సైట్ ద్వారా దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూరించి అదే వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాల్సిందిగా ఆయన తెలిపారు. 6,9 వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు తమ దరఖాస్తులను 2020 డిసెంబర్ 15 తేదీలోగా అప్లోడ్ చేయాలన్నారు.అప్లోడ్ చేసుకున్న దరఖాస్తులను ఒక ప్రింట్ అవుట్ తీసి తమవద్ద ఉంచుకోవాలన్నారు. ఆరవ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులకు 2021 ఏప్రిల్ 10వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అలాగే తొమ్మిదవ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులకు 2021 ఫిబ్రవరి 13వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ పై ప్రకటనలో తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో తమ పిల్లలను చేర్పించాలి అనుకునే ఆసక్తి గల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పై పేర్కొన్న తేదీలలో దరఖాస్తులను అప్లోడ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 19 మంది మహిళా ఖైదీలు విడుదలయ్యారు. తమ జీవితాలు జైలుకే అంకితం అయిపోతాయనుకున్న వారందరికీ రాష్ట్రప్రభుత్వం క్షమాబిక్ష పెట్టడంతో ఐదేళ్ల జైలు జీవితానికి ముందే వారంతా విడుదలయ్యారు. జైలు గోడల నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందులో వయస్సు మళ్లిన వారు, వయస్సు మీద పడుతున్నవారు, వయస్సులో వున్నవారు ఇలా చాలమందే ఉండటం విశేషం. శుక్రవారం జైలు నుంచి విడుదైలన వారి వివరాలు తెలుకుంటే...
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కరణం పార్వతి, విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేటకు చెందిన దాసరి అప్పలకొండ, పిల్లి సత్యం, విశాఖ జిల్లా కోటపాడు మండలం కె.గులేపల్లికి చెందిన వంటకు దేముడమ్మ, విశాఖ జిల్లా హుకుంపేట మండలం అడ్డుమంద గ్రామానికి చెందిన బకురి లక్ష్మి, కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నంకు చెందిన మత్తుల నాగమణి, విజయనగరం జిల్లా సాలూరు మండలం బాగువలస గ్రామానికి చెందిన కోట లక్ష్మి, ధారాబత్తుల లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం నత్త రామేశ్వరం గ్రామానికి చెందిన చిత్తూరి గోవర్ధన, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన కడలి సత్యవాణి, విశాఖ జిల్లా అచ్చుతాపురం మండలం నారాయణమ్మపేటకు చెందిన జగరాపు రాములమ్మ, జగరపు సత్యవతి, జగరపు వరహలమ్మ, జగరపు దేవుడమ్మ, రాజన వరహలమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన సీరా శైలజ, విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం మద్దిగరువు గ్రామానికి చెందిన లింగేరి రూపవతి, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన పెరుం హైమావతి, విశాఖ జిల్లా కొత్త గొర్లెవానిపాలెంకు చెందిన కుడ్రపు రమణమ్మ విడుదలయ్యారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ లను ప్రభుత్వం విధిగా ఆదుకుంటుందని క్రిష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాథ్ అన్నారు. శుక్రవారం చిలకల్లు పోలీస్ స్టేషన్ లో ఎస్సై2గా విధులు నిర్వహిస్తూ కరోనా వైరస్ తో మ్రుతి చెందిన అల్లు దుర్గారావు కుటుంబానికి ప్రభుత్వ కార్పస్ ఫండ్ రూ.పది లక్షల చెక్కును అందజేశారు. విధినిర్వహణసమయంలోనే కాకుండా మరణాంతరం కూడా పోలీసు శాఖ సిబ్బంది తోడుగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. అంతేకాకుండా శాఖా పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ను సాధ్యమైనంత తర్వగా వచ్చేలా చేయడంతోపాటు, కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం నియామకం కూడా సత్వరమే చేపడతామని అన్నారు. మా శాఖలో ఎస్ఐ ని కోల్పోవడం మీతోపాటు మాకూ బాధగా వుందని ఎస్పీ విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం నెల్లూరు చెన్నై హైవేపై వరద నీరు వస్తున్న కారణంగా రోడ్లపై ఉన్న వాహనదారులకు, డ్రైవర్స్, ప్రయాణికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. వరదల కారణంగా వీరంతా ఇక్కడే ఉండిపోవాల్సి రావడంతో వారి ఆకలి తీర్చాలని నెల్లూరు పోలీసులు బావించారు. ప్యాకెట్స్ అందిస్తున్న నెల్లూరు రూరల్ సిఐ, వేంకటాచలసత్రం ఎస్ఐ ఆధ్వర్యంలో భోజనాలను అందించారు. అంతేకాకుండా వారికి మంచినీటిని కూడా సరఫరా చేశారు. జిల్లా ఎస్పీ భాస్కర భూషన్ ఆదేశాలతో పోలీసులు తమ సేవలను విస్తరిస్తున్నారు. తుపాను సమయంలో జిల్లా పోలీసులు చేస్తున్న సేవలపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీర్ఘప్రయాణాలు చేస్తున్న లారీ డ్రైవర్లు, ట్రక్కులు, ట్యాంకర్ల సిబ్బందికి తమకు చేస్తున్న సేవలను మరిచిపోలేమని చెబుతున్నారు..
విశాఖలోని సింహాచలం ఆర్టీసీ డిపో డ్రైవర్ చింతా నాగేశ్వరరావు వేధింపుల మరణం కేసులో విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక కృషితో బాధిత కుటుంబానికి రెట్టింపు నష్టపరిహారం రూ.4లక్షలు విడుదల చేసిన జిల్లా కలెక్టరుకు జాతీయ ఎస్సీకమిషన్ కు విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక కన్వనర్ డా. బూసివెంకటరావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం దళిత సంఘాల ఐక్య వేదిక, ఆర్టీసీ ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులు నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ ఆదేశాలతో నష్టపరిహారం అభినందనీయమన్నారు. అదేసమయంలో నాగేశ్వరరావును వేధించి ఆత్మహత్యకు కారణమైన డిపో మేనేజర్ దివ్యను యాజమాన్యం కనిషం సస్పెండ్ చేయక పోవడం అన్యాయమన్నారు. ఇది వేధింపుల మరణం ఐనందున నిందితురాలు దివ్యను తక్షణమే విధుల నుంచి తొలగించాలని, నాగేశ్వరరావు కుమారునికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితురాలు నాగేశ్వర రావు భార్య అమ్మా జీ సంఘ నేతలకు కృతజ్ఞత తెలుపుతూ నాకొడుకుక్కి ఉద్యోగం ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జి రాంబాబు, సోడ దాసి సుధాకర్, ఈతల పాక సుజాత , చొక్కాకుల రాంబాబు, నిమ్మిటి ధర్మారావు, బిరారత్నం తదితరులు పాల్గొన్నారు .
పౌరహక్కులు, కొన్ని ప్రజాసంఘాల నాయకులపై ఉపా చట్టం ప్రయోగించడం అత్యంత దుర్మార్గమని సిపిఎం కార్యదర్శి గంగారావు ఆరోపించారు. విశాఖలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదకరమైన ఉపా కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరంకుశత్వ కేంద్ర బిజెపి చర్యలను సిపిఐ(ఎం) గ్రేటర్ విశాఖ నగర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మానవ హక్కుల వేదిక నాయకులు వీఎస్ కృష్ణ, అడ్డకేట్ కె.ఎస్.చలం, పద్మ ఇతర అనేక మందిపై మావోయిస్టులతో సంబంధాలను ఉన్నాయనే ఆరోపణలు చేస్తూ ఈ నెల 23,24 తేదీలలో విశాఖ జిల్లా ముంచింగుపుట్టు, గుంటూరు జిల్లా పిడుగురాల్లలో ఉప చట్టం క్రింద అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. కేంద్ర బిజెపి ఒక కుట్రతో నిరంకుశ చట్టాలు బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడే వారిపై బనాయిస్తున్నదన్నారు. రాష్టప్రభుత్వం కూడా కేంద్ర బిజెపికి తలొగ్గి ఈ చర్యలకు పాల్పడటాన్ని ప్రజలు ఖండించాలని సిపిఐ(ఎం) విజ్ఞప్తి చేశారు.
జైలు సంస్కరణలలో భాగంగా పలు అంశాల్లో శిక్షణ పొందిన ఖైదీలు బయట ప్రపంచంలోకి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని రాజమండ్రి ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చారిత్రక నిర్ణయం లో భాగంగా రాష్ట్రంలో మొదటి సారిగా విడుదలవుతున్న మహిళా జీవిత ఖైదీలకు బయట ప్రపంచంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎంపీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుతూ స్వాగతం పలికారు. గవర్నర్ ఆమోదంతో ముఖ్యమంత్రి ఇంటికి దీపం ఇల్లాలే అని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే మహిళలు సంస్థ ద్వారా కుటుంబానికి చేరువ కావాలని కోరుతూ తీసుకొన్న నిర్ణయం లో భాగంగా మొట్టమొదటిసారిగా మహిళా జీవిత ఖైదీల జీవిత శిక్ష నుంచి ఐదేళ్ల కు తగ్గించి క్షమాభిక్ష రాష్ట్రవ్యాప్తంగా సుమారు 53 మందిని విడుదల చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలియజేశారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉన్న సెంట్రల్ జైలు నుంచి19 మంది మహిళా జీవిత ఖైదీలు ముఖ్యమంత్రి జగన్ కృషితో విడుదల కాగా ఎంపీ భరత్ రామ్ తరఫున నిత్యవసర వస్తువులు, ప్రయాణ ఛార్జీలు,కొత్త దుస్తులను మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ తనయుడు, వైఎస్సార్ సీపీ యువ నాయకుడు చందన నాగేశ్వర్, పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, వై ఎస్ ఆర్ సి పి బీసీ సెల్ నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, మారిసెట్టి వెంకటేశ్వరరావు, కొంచ సత్య తదితరులు పంపిణీ చేశారు. ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు, చీరలు పం పిణీ చేసినందుకు మహిళా సెంట్రల్ జైలు సూపరంటెండెంట్ కృష్ణ వేణి, సెంట్రల్ జైలు సూపర్ రిండెంట్ రాజారావు ఎంపీ భరత్ రామ్ కు కృతజ్ఞతలు తెలియజేసారు.
విశాఖలోని బంగాళాఖాతంలో ఈనెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది. డిసెంబర్ నెలలో మరో 2 తుపాన్లు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు వివరించింది. డిసెంబర్2న 'బురేవి తుఫాన్' తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అది డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుఫాన్' కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో డిసెంబర్ 7న డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను ముందస్తుగా హెచ్చరించి ఎలాంటి సందర్భమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవిధంగా రాష్ట్ర అధికారులు మౌకిక ఆదేశాల జారీచేశారు..
రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లోని రైతులకు మద్దతు ధర కల్పించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. శుక్రవారం రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో రైతుభరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు దళారుల భారిన పడకుండా ప్రభుత్వమే గిరిరైతుల నుంచి పండించిన ధాన్యమం మొత్తం కొనుగోలు చేస్తుందన్నారు. దళారులను నమ్మడం ద్వారా మోసాలు జరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అలాంటివి జరగకుండా పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. రైతులు ఆ విషయాన్ని గుర్తించి ప్రకటించిన మద్దతు ధరతో ప్రభుత్వానికే ధాన్యం మొత్తం అందించాలన్నారు. కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, గ్రామసచివాలయ వ్యవసాయశాఖ సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు..