ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని గురువారం విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. పెద్దసంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులతో వచ్చి వంశీ పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, మంచి విద్యావేత్తను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విసిగా నియమించడం అభినందనీయమన్నారు. వర్శిటీ అభివ్రుద్ధికి తమవంతు సహకారం అందిస్తామని విసికి తెలియజేశారు. ఉదయం నుంచి వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. వర్సిటీకి ఉపకులపతిగా ఆచార్య ప్రసాద రెడ్డిని నియమించడంతో పెద్దసంఖ్యలో వివిధ వార్గాల ప్రజలు, పార్టీ నాయకులు వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకున్నారు. ఆచార్య ప్రసాద రెడ్డి గురువారం ఉదయం ఏయూలోని మహానేత స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వం కల్పించిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు సూచించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులై సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గురువారం తన ఛాంబర్లో నియామక పత్రాలు అందజేశారు. పంచాయతీ కార్యదర్శులు 26 మంది, వెల్ఫేర్ అసిస్టెంట్లు 40 మంది నియామక పత్రాలు స్వీకరించారు. ప్రతీ ఒక్కరూ మంచి పని తీరు కనబరిచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, వ్యక్తిగతంగా వృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అభ్యర్థులను ఈ సందర్భంగా అభినందించారు. సాంఘిక సంక్షేమ శాఖ, ఉప సంచాలకులు సునీల్ రాజ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాకు మంచి సేవలను అందించారని మార్పు, నాడు-నేడు సమన్వయ అధికారి పి.రజనీకాంతారావు పేర్కొన్నారు. గురువారం జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ సమావేశ మందిరంలో ఇటీవల పదవీవిరమణ పొందిన ఎస్.సి.కార్పోరేషన్ ఇ.డి. సి.హెచ్.మహాలక్ష్మి, బదిలీపై వెళ్తున్న జిల్లా ఖజానాధికారి జి.నిర్మలమ్మ ,సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కె.ఆదిత్యలక్ష్మిలకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మార్పు, నాడు-నేడు సమన్వయ అధికారి పి.రజనీకాంతారావు, విశిష్ట అతిధిగా జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్.సి.కార్పోరేషన్ ఇ.డి. సి.హెచ్.మహాలక్ష్మి మంచి సేవలను అందించి, ఆవిడ పదవికి వన్నె తెచ్చారని తెలిపారు. పెను సవాళ్ళను సైతం చాకచక్యంతో ఎదుర్కొనే వారని, అందరితో ఆత్మీయతా భావంతోను, మంచి స్నేహశీలతతోను మెలిగే వారని కొనయాడారు. అదే విధంగా బదిలీపై వెళ్తున్న ఆదిత్యలక్ష్మి, నిర్మలమ్మ, అందించిన సేవలను గుర్తుచేసారు. అనంతరం డి.ఆర్.ఓ దయానిధి మాట్లాడుతూ, మహిళా ఉద్యోగులు మంచి నిబధ్ధతతో పనిచేస్తారని తెలిపారు. వారికి సమాజంలో మంచి గౌరవం వుంటుందన్నారు మహ లక్ష్మితో పాటు ఆదిత్యలక్ష్మి విమర్శలకు తావు లేని విధంగా విధులను నిర్వర్తించారన్నారు. విశాఖపట్నం వుడా ఛీఫ్ అక్కొంట్స్ అధికారిగా వెళ్తున్న నిర్మలమ్మ, అక్కౌంట్సుపై మంచి నాలెడ్జ్ వున్న వ్యక్తిగానే కాకుండా మంచి సోషల్ సర్వీసు చేస్తారని తెలిపారు. మన జిల్లా నుంచి ఇతర జిల్లాలలో మంచి సేవలను అందించి జిల్లా పేరు నిలపాలన్నారు. కార్యక్రమాన్ని హాండ్లూమ్స్ ఎ.డి. వి.పద్మ, గురుకుల పాఠశాలల సమన్వయ అధికారి యశోద లక్ష్మి నిర్వహించారు. అనంతరం సన్మాన కార్యక్రమం జరిగింది. సన్మాన గ్రహీతలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఓ. ఎం.మోహన్ రావు , ఎ.పి.ఎం.ఐ.పి. పి.డి. జమదగ్ని , సెరికల్చర్ ఎ.డి.సార్మన్ రాజు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎ.డి. జీవన్ బాబు, సెట్ శ్రీ సిఇఓ శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుజాత, శైలజ, తులాల సవరమ్మ, నరసన్నపేట కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి ఫ్రెడరిక్, , ఛీఫ్ కోచ్ శ్రీనవాస్ కుమార్,.టూరిజం అధికారి నారాయణ రావు, మెప్మా పి.డి. కిరణ్ కుమార్, ఎ.టి.ఓ.లు సావిత్రి, తవిటన్న, లాయర్ సుధారాణి, డివిజనల్ పౌర సంబంధాల అధికారి లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు.
మహావిశాఖనగర పరిధిలో 10రోజుల్లో పందులను నియంత్రించాలని జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు ఆదేశించారు. జివిఎంసీ పరిధిలో పందుల సంచారంపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు, పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆదేశాల ప్రకారం జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు పందుల పెంపకం దారులతో గురువారం సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరం పరిధిలో అన్ని ప్రాంతాలలో గల ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నందున 10రోజులలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పందులను నిర్మూలించాలన్నారు. వాటికి ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోవాలని పెంపకం దారులను కోరారు. లేదంటే చట్టబద్దమైన చర్యలు పెంపకదారులపై చేపడతామని హెచ్చరించారు. జివిఎంసి. చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఏ.ఎం.ఓ.హెచ్./వెటర్నరీ అధికారి డా. జయరాం పందుల పెంపకం దారులకు పందుల నిర్మూలన విషయమై ఎలాంటి చర్యలు చేపట్టాలో తగు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఏ.ఎం.ఓ.హెచ్. / వెటర్నరీ అధికారి డా. జయరాం, వెటరినరీ విభాగ సిబ్బంది మరియు పందుల పెంపకం దారులు తదితరులు పాల్గోన్నారు.
వ్యవసాయ యాంత్రీకరణ పై రైతులు దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ యం.వి.యస్.నాగిరెడ్డి అన్నారు. గురువారం శ్రీవరి సాగు పై క్షేత్ర సందర్శన మరియు క్షేత్ర దినోత్సవం సందర్భం గా వాకలవలస పైడి వరహా నరసింహ క్షేత్రం లో ఆత్మ పధకం, వ్యవసాయ శాఖ సమన్వయం తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ విస్తరణ అధికారులు ఉన్నారని వారి సేవలను రైతులు వినియోగించుకోవాలని అన్నారు. స్థానిక రైతులు మాట్లాడుతూ, నాణ్యమైన ఎరువులు వాడటం వల్ల వరి దిగుబడి అధికం గా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ మెంబర్లు గొండు రఘురాం, డా:కె.చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు,జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు కె. శ్రీధర్, ఆత్మ పథక సంచాలకులు కె.కృష్ణారావు,కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా: డి. చిన్నం నాయుడు, ఏరువాక కేంద్ర సమన్వయకర్త డా: పి. వెంకటరావు, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డా:పి.అమరజ్యోతి, డా:కె.భాగ్యలక్ష్మి, డా:యస్.నీలవేణి, డా:చిట్టిబాబు రైతులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామసచివాలయ ఉద్యోగులు వారి వారిశాఖలకు అనుగుణంగా గ్రామాల్లోని సమస్యలను వెలికితీసి పరిష్కరించాలని జెసి నిషాంత్ కుమార్ ఆదేశించారు. గురువారం అనంతపురం అర్భన్ పరిధిలోని నవోదయ కాలనీ సచివాలయాన్ని ఆయన ఆకస్మింగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రజల సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కారం అవుతాయనే భరోసాను సచివాలయ సిబ్బంది కల్పించాలన్నారు. వాలంటీర్లు రోజూ సచివాలయానికి రావాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాలను ఖచ్చితంగా నోటీసు బోర్డులో పెట్టాలన్నారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంజనీరింగ్ అధికారులు శానిటేషన్, మంచినీటి సరఫరా, నిర్మాణాల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. మూమెంట్ రిజిస్టర్ తప్పనిగా మెయింటేన్ చేయాలని ఆదేశించారు.
రాజ్యాంగ పరిరక్షకులుగా మారాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య విద్యార్థినులకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక ఒకటవ రోడ్డు లోని శారదా మున్సిపల్ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా "భారత దేశ ప్రజల మైన మేము" పేరుతో జిల్లాలో రెండు నెలల పాటు వినూత్నంగా నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని తొలుత జ్యోతి ప్రజ్వలనతో ఎంపీ, కలెక్టర్ ,జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) ఏ.సిరి ఇతర అధికారులు ప్రారంభించారు. అనంతరం భారత రత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ పరిరక్షకులుగా మారాలి.సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పెంపొందిద్దామని పాఠశాల విద్యార్థినులతో కలిసి రాజ్యాంగ పీఠిక ను ఎంపీ, కలెక్టర్,జేసీ,అధికారులతో కలిసి చదివారు. ఈ సందర్భంగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని వాటిని అమలు చేసే దిశగా ముందడుగు వేయాలన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న మౌలిక అంశాలను చదవడంతో పాటు అర్థం చేసుకోవడం అతి ముఖ్యమన్నారు.సమాజంలోని తోటి పౌరులను ఎలా గౌరవించాలి .సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను ఎలా పారదోలాలి, పర్యావరణాన్ని ఏవిధంగా పరిరక్షించాలి అనే అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం తోపాటు నిత్యజీవితంలో ఆచరించాలని ఆయన సూచించారు.తద్వారా రాజ్యాంగ పరిరక్షకులుగా మారాలని ఆయన పేర్కొన్నారు .రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా సజీవ సాక్ష్యాలుగా నిలిచిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలన్నారు. అందుకు సంబంధించి పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం గురించి ,అలాగే చాయ్వాలా నుండి ప్రధాన మంత్రి గా ఎదిగిన నరేంద్ర మోది ల గురించి ఉదాహరించారు .అలాగే తాను, కలెక్టర్ కూడా క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరామని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోని ప్రముఖ ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, విస్తృతంగా చర్చలు జరిపిన మీదట భారత రాజ్యాంగాన్ని ఖరారు చేశారన్నారు. రాజ్యాంగ రచనా సంఘం 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల్లో 141సార్లు సమావేశాలు జరిపి రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. భారత రాజ్యాంగ లక్ష్యం ప్రజలకు సామాజిక ,రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని అందించడమే అన్నారు. నేడు మన రాజ్యాంగం ఆరు ప్రాథమిక హక్కులకు భరోసా ఇస్తోందన్నారు సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడి నుంచి రక్షణ పొందే హక్కు ,మతస్వేచ్ఛ హక్కు ,విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిష్కారాలు కోరే హక్కులన్నారు. ఈ హక్కుల రక్షణ మన రాజ్యాంగానికి ప్రధాన స్ఫూర్తి గా నిలుస్తోందన్నారు. రాజ్యాంగం గురించి పూర్తిగా విద్యార్థినీ,విద్యార్థులు తెలుసుకోవాలని ,దీని గురించి తెలుసుకోవడమే కాకుండా నలుగురికి తెలియజెప్పాలన్నారు. జిల్లాలో నేటి నుంచి 26 జనవరి 2021 వరకు ఎనిమిది వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ఏ రోజు ఏ అంశంపై చర్చించారో, ఆ చర్చలు జరిగిన రోజులను తేదీల వారీగా సూచిస్తూ రాజ్యాంగ క్యాలెండర్ ని బొమ్మలతో సహా రూపొందించాలన్నారు.అలా రూపొందించిన వారిలో ముగ్గురికి జనవరి 26 వ తేదీన జిల్లా స్థాయిలో మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. అలాగే ఏ పాఠశాలల్లోని విద్యార్థినీ,విద్యార్థులు, అధ్యాపకులు కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఎక్కువమందిని గుర్తించి సన్మానిస్తారో అలాంటి వారిని కూడా ఎంపిక చేసి జనవరి 26 వ తేదీన సత్కరించడం జరుగుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగంగా అభివర్ణించారు. రాజ్యాంగంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా పేర్కొన్నారని దీనివలన మనమంతా స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు .హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. అందరూ కలిసి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు .భవిష్యత్తులో రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. డి ఓ శామ్యూల్ మాట్లాడుతూ, జిల్లాలో రెండు నెలలపాటు రాజ్యాంగ ఉత్సవాలను నిర్వహించబోతున్నామన్నారు.ప్రతి విద్యార్థి రాజ్యాంగం లో నిష్ణాతులు కావాలన్నారు. డిగ్రీ ఆపై చదువు లో నేర్చుకునే ఈ అంశాన్ని తొమ్మిది, పది తరగతుల విద్యార్థిని, విద్యార్థులు చదివే అవకాశం లభించిందన్నారు. జిల్లాలోని 34 వేల మంది విద్యార్థిని ,విద్యార్థులకు రాజ్యాంగ ప్రతులను అందిస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలోనూ భారత రాజ్యాంగ పీఠిక యొక్క ప్రాముఖ్యత ,ప్రాథమిక హక్కులు మరియు బాధ్యతలు వివరించాలని ఆయన తెలిపారు .విద్యార్థులను బాధ్యతాయుతమైన మరియు ఉత్పాదక మైన పౌరునిగా తయారుచేయాలని హెడ్ మాస్టర్లకు, టీచర్లకు ఆయన సూచించారు. అనంతరం రాజ్యాంగ పుస్తకాల ప్రతులను విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ,ఎం పీ,అధికారులు అందించారు .చదవటం మాకు ఇష్టం అనే లోగోను ముఖ్య అతిధులు ఆవిష్కరించారు .ఇందులో భాగంగా గ్రంధాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి ,సర్వ శిక్ష ఏపిడి తిలక్ విద్యాసాగర్, మున్సిపల్ ఆర్ డి నాగరాజు, హెడ్మాస్టర్ రమాదేవి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో జాతీయ న్యాయ దినోత్సవాన్ని జిల్లా కోర్టు ఆవరణలోగల బార్ అసోసియేషన్ హాల్ లో గురువారం ఘనంగా జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతోందన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం రచించి అన్ని వర్గాలకు సమన్యాయం చేకూరే విధంగా పొందుపర్చారని పేర్కొన్నారు. దేశంలో సామాజిక, ఆర్ధిక సమానత్వం వరకు జీవిత చరమాంకం వరకు ఆలోచించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. శ్రీకాకుళం బార్ అసోసియేషన్ అధ్యక్షులు శిస్టు రమేష్ అధ్యక్షతన జరిగిన న్యాయ దినోత్సవంలో ఫామిలీ కోర్టు న్యాయమూర్తి పి.అన్నపూర్ణ, ప్రిన్సిపాల్ సీనియర్ జడ్జి కె.నాగమణి, పెర్మనెంట్ లోక్ అదాలత్ అధ్యక్షులు బి.సత్యనారాయణ, న్యాయ అధికారులు శ్రీలక్ష్మి, కె.రాణి, జి.లెనిన్ బాబు, జె కిషోర్, కె.జయలక్ష్మి, న్యాయవాదులు వానకృష్ణ చంద్, జల్లు తిరుపతిరావు, ఎన్ని సూర్యారావు, బి మురళీకృష్ణ, ఏ కృష్ణరాజు, పిట్టా దామోదరరావు, కూన అన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో వాటిని తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ గురువారం దేశవ్యాప్తంగా పలు కార్మిక వర్గాలు సమ్మె బాట పట్టాయి. అత్యంత కీలకమైన రెండు వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను కూడా వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ జాతీయ జర్నలిస్టుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య, ఏపీ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా కలెక్టరు కార్యాలయం ఎదుటశాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తక్షణమే కేంద్రం వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 1955- 1958 లు 2చట్టాలు కూడా జర్నలిస్ట్ లకు అత్యంత కీలకమన్నారు. జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టులుగానే కొనసాగించాలని, శ్రీనుబాబు కోరారు. అంతేకాకుండా 1958 చట్టం ప్రకారం వేతనాలు నిర్ధారణ కమిటీ కి సంబంధించి కూడా కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆ రెండు చట్టాలు రద్దు చేసిన నేపథ్యంలో జర్నలిస్టులకు అత్యంత నష్టం వాటిల్లుతుందని శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రం రద్దు చేసిన 44 కార్మిక చట్టాల్లో ఉన్న రెండు చట్టాలు జర్నలిస్టుల కోసం త్వరగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షులు పి నారాయణ మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా జర్నలిస్ట్ ల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘాలు పని చేస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టులకు నష్టం చేసే రెండు చట్టాలను తక్షణమే కేంద్రం పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అనంతరం డిఅర్వో ఎ ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం లో ఫెడరేషన్ ఉపాద్యక్షులు బందరు శివ ప్రసాద్, కోర్ కమిటీ సభ్యులు బండి శివరాం, పి.నగేష్ బాబు, కడలి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం ఆంధ్రయూనివర్సిటీ ని అందరి సహకారంతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయగలిగామని ఆచార్య పీవీజిడి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏయూ వీసీగా ప్రసాదరెడ్డిని ప్రభుత్వం నియమించిన తరుణంలో గురువారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా విజెఎఫ్ అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు ఎస్ దుర్గారావులు విసి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సత్కరించి, సింహాద్రి అప్పన్న చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్శిటీ అభివృద్ధి లో ప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అదే సమయంలో అనేక నూతన పరిశోధనలకు అవకాశం కల్పించారని విద్యార్థులకు అవసరమైన అధ్యాపకులను నియమించడం లో ప్రసాద్ రెడ్డి కృషి ప్రశంసనీయమన్నారు. ఉపాధ్యక్షులు అర్.నాగరాజు పట్నాయక్, జీవీఎంసీ గుర్తింపు యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం.ఆనందరావు ప్రసాద్ లు విసిని కలిసిన వారిలో వున్నారు.
భీమిలి జోన్ లోని అన్ని వార్డు సచివాలయాల్లోనూ ఆస్థిపన్ను లక్ష్యాలను కార్యదర్శిలు అదిగమించాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన ఆదేశించారు. గురువారం అప్పికొండ వీధి సచివాలయంను సందర్శించి వార్డు కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి, ఆయా కార్యదర్శుల పని తీరును అడిగి తెలుసికున్నారు. వార్డు పరిధిలో ఎన్ని ఆస్తి పన్నులు వున్నాయి? నీటి కొళాయిలు ఎన్ని వున్నాయి? కొళాయిలు లేని ఇళ్ళకు కొళాయి కనక్షనులు ఇవ్వడానికి చర్యలు తీసుకొన్నారా? లేదా? అని అడిగారు. సచివాలయ పరిధిలోని జనాభా, విద్యార్ధుల వివరాలు పూర్తిగా సేకరించవలసినదిగా సూచించారు. డైరీ, హాజరు, మూమెంట్ రిజిస్టర్ మొదలైన రికార్డులను పరిశీలించి సంక్షేమ పధకాల కొరకు ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని కార్యదర్శులను ఆదేశించారు. జివిఎంసి పండిట్ నెహ్రూ మున్సిపల్ హై స్కూలు లో నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా జరుగుచున్న పనులను పరిశీలించి, పనులు సక్రమంగా జరుగుటకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను, స్కూళ్ళ కమిటీ చైర్మన్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గోవింద రావు, పర్యవేక్షక ఇంజినీరు శివప్రసాద రాజు, కార్యనిర్వాహక ఇంజినీరు, టి.పి.ఆర్.ఓ, శానిటరీ ఇన్ స్పెక్టర్, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గోన్నారు.
భీమునిపట్నం చేపల మార్కెట్ కు నూతన భవన సముదాయాలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె భీమునిపట్నం జోన్ లో పర్యటించారు. పెద్ద బజారు వద్ద ఉన్న లాల్ బహుదూర్ శాస్త్రి చేపల మార్కెట్ ను, షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించారు. షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా శిధిలావస్థకు చేరినందున వాటి స్థానంలో నూతన నిర్మాణాలు చేపట్టడానికి అంచనాలు తయారు చేయాలన్నారు. తద్వారా ఇక్కడి మత్స్యకారులకు సౌకర్యంగా వుంటుందన్నారు. అదే సమయంలో ఈ ప్రాంతంలోని చెత్త అధికంగా ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, వ్యాధులు ప్రభలకుండా చూడాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. అంతేకాకుండా ఇక్కడ మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గోవింద రావు, పర్యవేక్షక ఇంజినీరు శివప్రసాద రాజు, కార్యనిర్వాహక ఇంజినీరు, టి.పి.ఆర్.ఓ, శానిటరీ ఇన్ స్పెక్టర్, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గోన్నారు.
పాడి పశువులు, గొర్రెలు, మేకలు పంపిణీ ద్వారా పేదలకు ఆర్థికంగా భరోసా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు అన్నారు. దీనిలో భాగంగా వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకం లబ్దిదారులు 70,960 మందిని జిల్లాలో ఈ పథకానికి ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. స్థానిక డిఆర్డిఏ సమావేశ మందిరంలో ఈ పథకంపై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకం క్రింద జిల్లాలో ఇప్పటికే సుమారు లక్షా,53వేల మందికి కిరాణా, ఇతర చిన్నచిన్న వ్యాపారాల ద్వారా ఉపాధి కల్పించడం జరిగిందని చెప్పారు. రెండో దశలో ఈ పథకం క్రింద 41,339 మంది మహిళలకు ఆవులను, 9,567 మంది మహిళలకు గేదెలను, 8,412 మంది మహిళలకు గొర్రెలను, 11,582 మంది మహిళలకు మేకలకు పంపిణీ చేసేందుకు ఎంపిక చేయడం జరిగిందని డిఆర్డిఏ పిడి కె.సుబ్బారావు తెలిపారు. ఒక్కో యూనిట్ ఖరీదు రూ.75వేలు కాగా, దీనిలో రూ.56,500 ను బ్యాంకు రుణంగా ఇస్తుందని, రూ.18,500ను లబ్దిదారులు భరించాల్సి ఉందని చెప్పారు.
పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ ఎంవిఏ నర్సింహులు మాట్లాడుతూ, లబ్దిదారులు తమకు కావాల్సిన పశువులకు సంబంధించి తప్పనిసరిగా అంగీకార పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. వివిధ శాఖల అధికారుల సమక్షంలో, రైతు భరోసా కేంద్రం వద్దే పశువుల కొనుగోలు, అమ్మకాలకు ఒప్పందం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇతర మండలాల తోపాటు, ఇతర జిల్లాలనుంచి కూడా పశువులను కొనుగోలు చేసుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. పశువులకు తమ వైద్యులచేత పూర్తిగా వివిధ పరీక్షలను నిర్వహించిన తరువాతే కొనుగోలుకు అనుతించడం జరుగుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ వెంకటరావు మాట్లాడుతూ పేదల జీవితాలకు ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా, వారి జీవితాల్లో వెలుగును నింపేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. అర్హులైన వారందరికీ, మంచి మేలు జాతి పాడి పశువులు, మేకలు, గొర్రెలను కొనుగోలు చేసేలా అధికారులు సహకరించాలని కోరారు. వీలైనంత త్వరగా పథకాన్ని అమలు చేయాలని, దీనిలో భాగంగా శుక్రవారం నుంచే క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలను అక్కడి ఎంఎల్ఏలకు అందజేయాలని సూచించారు. నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించుకొని, ప్రణాళికాబద్దంగా డిసెంబరు 5లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. పశువుల కొనుగోలులో ఏమైనా అవకతవకలు జరిగినా, నిబంధనలు అతిక్రమించినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జెసి హెచ్చరించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని గురువారం పలువురు అభినందించారు. పెద్దసంఖ్యలో ఆచార్యులు, ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏయూ ఇయూ నాయకులు వీసీని సత్కరించారు. ఆటా సభ్యులు ఆచార్య ప్రసాద రెడ్డికి శుభాకాంక్షలు అందజేశారు. ఉదయం నుంచి వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. వర్సిటీకి ఉపకులపతిగా ఆచార్య ప్రసాద రెడ్డిని నియమించడంతో పెద్దసంఖ్యలో ఉద్యోగులు, ఆచార్యులు వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకున్నారు. ఆచార్య ప్రసాద రెడ్డి గురువారం ఉదయం ఏయూలోని మహానేత స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వీసీ ప్రసాద రెడ్డిని రెక్టార్ ఆచార్య కె.సమత, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, జేమ్స్ స్టీఫెన్, క్రిష్ణమంజరి పవార్, డీన్లు ఆచార్య కె.వెంకట రావు, టి.షారోన్ రాజు, ప్రిన్సిపాల్స్, డీన్లు, అధికారులు తదితరులు అభినందించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా ఆచార్య వి.క్రిష్ణమోహన్ గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఈ సందర్భం ఆయనకు ఉత్తర్వులను అందజేశారు. అనంతరం రిజిస్ట్రార్గా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ దినోత్సవరం రోజున ప్రఖ్యాత ఆంధ్రాయూనివర్శిటీలో రిజిస్ట్రార్ గా బాధ్యతలు స్వీకరించడం మరపురాని అంశమన్నారు. విద్యార్ధులకు, అద్యాపకులకు తనవంతు సేవలందిస్తానని ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మీడియాకి తెలియజేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, ఆచార్య జి.వి రవీంద్రనాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విభాగంలోని సిబ్బందిని రిజిస్ట్రార్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.