ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పారదర్శకంగా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నారని జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఏ. పి. ఐ. ఐ. సి. కోసల నగరం ఎం. ఎస్. ఎం. ఈ. పార్కులో పారిశ్రామిక వేత్తలకు కేటాయింపు పై స్థానిక తాజ్ హోటల్ నందు ఏ పి ఐ ఐ సి ఛైర్మన్ రోజా, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా, ఏ పి ఐ ఐ సి అధికారులతో, పారిశ్రామిక వేత్తలతో కేటాయింపు, సౌకర్యాల కల్పన వంటి అంశాలపై సమీక్ష వర్చువల్ విధానం లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, విజయ పురం మండలం లోని కోసల నగరం ఎం. ఎస్. ఎం. ఈ. పార్కు 2000 ఎకరాలలో విస్తరించి వున్నదని, దీనిని న్యూ గ్రీన్ ఫీల్డ్ ఎం. ఎస్. ఎం. ఈ. గా రూపు దిద్దుకున్నదని అన్నారు. ముఖ్యమంత్రి పారిశ్రామిక పెట్టుబడులకు ప్రాధాన్యత నిస్తున్నారని ఈ పార్కులో వసతుల కల్పన త్వరగా పూర్తి చేయాలని కోరారు. “ఐమా " అంబత్తూరు ఇండస్ట్రియల్ అశోషియేషన్ ప్రతినిధులు 750 ఎకరాలు కోరారని త్వరగా వసతులు కల్పించాలని ఎ. పి. ఐ. సి. సి. అధికారులు సూచించారు. నేడు కోసల నగరం పార్కు వద్దే జరగాల్సిన సమావేశం వర్షాల కారణంగా ఇక్కడ జరుపుతున్నామని మరో నెల లోపు కేటాయింపుతో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఎం. ఓ. యు. లు కుదుర్చుకోవాలని "ఐమా " ప్రతినిధులకు సూచించారు. ఎ పి ఐ సి సి ఛైర్మన్ రోజా మాట్లాడుతూ ముఖ్య మంత్రి సులభతర పారిశ్రామిక పెట్టుబడులు ప్రోత్సహించి ఇస్తున్నారని, నగరి ప్రాంతం ప్రస్తుతం పవర్ లూమ్ పరిశ్రమకే పరిమితమైందని అన్నారు. నగరి నియోజక వర్గం లో మంచి ఇండస్ట్రియల్ పార్కు రానున్నదని, తమిళనాడు సరిహద్దుల దృష్ట్యా పారిశ్రామిక వేత్తలు సమ్మతి తో వున్నారని త్వరలో నగరిలో ఇతర పరిశ్రమలకు కూడా నాంది పలకనున్నామని తెలిపారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో వర్చువల్ ద్వారా ఇండస్ట్రియల్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శ్రీ కరికాల వేలవన్ పాల్గొనగా సమీక్ష లో ఇండస్ట్రియల్ డైరెక్టర్ సుబ్రమణ్యం, ఐ. ఎ. ఎస్ , ఎం. డి. రవీన్ కుమార్ రెడ్డి, చిత్తూరు ఆర్. డి. ఓ. రేణుక, ఎ పి ఐ ఐ సి ఇ. డి. ప్రతాప రెడ్డి, జోనల్ మేనేజర్ ఎల్ రామ్, డిఐసి జనరల్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి అంబత్తూర్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ , తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంజిల్లాలో ఈ నెల 26వ తేదీనుండి వచ్చే ఏడాది జనవరి 26 వరకు "భారత దేశ ప్రజలమైన మేము" పేరుతో జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాజ్యాంగ దినోత్సవ వేడుకల నిర్వహణ పై జిల్లా అధికారులు, ఆర్డీవోలు తదితరులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీన "భారత దేశ ప్రజలమైన మేము" పేరుతో నిర్వహిస్తున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తూ, జిల్లాలోని గ్రామ, వార్డు, మండల, డివిజన్, జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో ఉదయం 11 గంటలకు రాజ్యాంగ పీఠికను చదివి వినిపించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో రాజ్యాంగ పీఠిక ఉంచాలన్నారు. గౌరవ సూచకంగా రాజ్యాంగ పీఠిక తో సెల్ఫీ తీసుకుని అందరికి తెలిసేలా వాట్సాప్ గ్రూప్స్ లో పోస్ట్ చేయాలన్నారు. జిల్లా అధికారులు తమ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగేలా చూడటం తో పాటు ఏదో ఒక పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులు చేయాలన్నారు. అలాగే ప్రతి పాఠశాలలోనూ 27 వ తేదీ నుంచి ప్రార్థన సమయంలో విద్యార్థులచే హెడ్మాస్టర్లు ప్రతిరోజు రాజ్యాంగ పీఠికను చదివి వినిపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 35 వేల మంది పదవ తరగతి విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రతులు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇవి సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలన్నారు. విరాళాలు ప్రోగు చేసి ఇంకా ఎక్కువ కాపీలు పంపిణీ చేసేలా కూడా చర్యలు తీసుకోవచ్చని అధికారులకు కలెక్టర్ సూచించారు. జనవరి 26 వరకు ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశంపై రాజ్యాంగం గురించి తెలుసుకోండి, సమానత్వం, సౌభ్రాతృత్వం,ఆర్థిక న్యాయం తదితర అంశాలపై నిర్దేశించిన విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పోలీసు అధికారులు,గ్రామ స్థాయిలో హెడ్మాస్టర్లు వారి పరిధిలో ఈ కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రవేశం, కులాంతర వివాహాలు చేసుకున్నవారికి సన్మాన కార్యక్రమాలు, జోగినీ వ్యవస్థ నిర్మూలన తదితర కార్యక్రమాలను కూడా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. భారత దేశ ప్రజలమైన మేము కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గురువారం నాడు శారదా మునిసిపల్ హైస్కూల్ లో రాజ్యాంగ పీఠిక ను చదవనున్నారు..
వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటు అధ్యక్షులు, డిప్యూటీసీఎం పాముల పుష్పశ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు బుధవారం ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి పేర్నినాని కుటుంబాన్ని పరామర్శించారు. బుధవారం ఈ మేరకు క్రిష్ణాజిల్లాలోని పేర్ని ఇంటికి వెళ్లి ఇటీవల మ్రుతిచెందిన పేర్ని తల్లిగారైన పేర్ని నాగేశ్వరమ్మ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తమ కుటుంబం తరుపున కోరారు. ఈ సందర్భంగా మంత్రి నానితో మాట్లాడుతూ, తల్లిని కోల్పోవడమంటే చాలా వారకూ ఇంటి పెద్దను కోల్పోవడమేనని, ఆ బాధ వర్ణణాతీమని అన్నారు. ఇలాంటి సమయంలోనే గుండె దిటవు చేసుకోవాలని, మీసేవలు రాష్ట్రాలనికి చాలా అవసమరి అన్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించి, కొద్దిసేపు అక్కడే వుండి అనంతరం విజయవాడ బయలు దేరారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరామచంద్రారెడ్డి అన్నారు. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ ఎం.గిరిజా శంకర్ తో కలసి జిల్లా కలెక్టర్లతో బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పనుల అనుసంధానంతో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని, మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రంలో సుమారు రూ.4 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని మంత్రి అన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ భవనాలు, పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణాలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీతో అనుసంధానం చేచి చేపడుతున్న పనుల లక్ష్యాలను సాధించుటకు చర్యలు చేపడుతున్నామన్నారు. నిధులను సద్వనియోగం చేసుకొనుటకు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, పంచాయతీ రాజ్ ఇన్ ఛార్జ్ పర్యవేక్షక ఇంజనీరు కె.ఎం.వి.ప్రసాద రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన విజయవాడ నుండి ఈ విషయమై రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. హామీ నిధులను వేగంగా ఖర్చు చేసినట్లయితే మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడి సెంటర్ల భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని, రోడ్ల నిర్మాణాలను కూడా వేగవంతం చేయాలి అన్నారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఉపాధి హామీ పథకం భవన నిర్మాణాల ప్రగతిని జిల్లాల వారీగా తెలియజేశారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నిర్మాణ పనులకు సరఫరా చేస్తున్న సిమెంట్ బస్తా పై అదనంగా రూ.15 లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఇప్పటికే మంజూరు చేసిన రూ. 10లతో కలిపి మొత్తం రూ.25 లు అవుతుందని తెలిపారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో సిమెంటు సరఫరా ఆలస్యం అవుతుందని, నిర్మాణాలను వేగవంతం చేయడానికి ఎటువంటి ఆటంకం లేకుండా అవసరమైన సిమెంటును సకాలంలో సరఫరా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. నర్సీపట్నం పాయకరావుపేట నియోజకవర్గాలలో ఇసుక కొరత ఉన్నందున తూర్పుగోదావరి నుండి ఇసుక సరఫరా చేసేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో రోడ్లు నిర్మించేందుకు 100 శాతం ఉపాధి హామీ పనులను మంజూరు చేయవలసిందిగా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి రామచంద్ర రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లి తగిన ఆదేశాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం రెవిన్యూ డివిజన్ పరిధిలోని ధాన్యం కొనుగోళ్లను సక్రమంగా చేపట్టాలని రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిశోర్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో సంబంధిత అధికారులు అలక్ష్యం వహిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని పి.పి.సి ఇన్ ఛార్జ్ లు, టెక్నికల్ అసిస్టెంట్లను హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై బుధవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వి.ఆర్.ఓలు, పి.పి.సి ఇన్ ఛార్జ్ లు, టెక్నికల్ అసిస్టెంట్లతో ఆర్.డి.ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, కాబట్టి అధికారులు ధాన్యం సేకరణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపధ్యంలో పి.పి.సి ఇన్ ఛార్జ్ లు , టెక్నికల్ అసిస్టెంట్లు రైతు కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. రైతుల నుండి ధాన్యం సేకరించే సమయంలో వారితో మర్యాదగా నడుచుకోవాలని, రైతుకు గిట్టుబాటు ధరను అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రంకు అవసరమైన సామాగ్రిలను ఇప్పటికే అందజేయడం జరిగిందని, ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తిచేసి రైతు ఖాతాలో నగదు జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు నుండి ధాన్యం సేకరించే సమయంలో తేమ శాతం పరిశీలించే సామాగ్రి సక్రమంగా పనిచేస్తున్నది, లేనిదీ ముందుగానే పరిశీలించుకోవాలని, తేమ శాతాన్ని పరిశీలించకుండా ధరను అంచనా వేయరాదని అన్నారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్న సంగతిని గుర్తుచేసిన ఆయన ఆర్.బి.కెలో రిజిష్టర్ అయిన పిదప రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే తేదీలను, సమయాన్ని కేటాయించడం జరుగుతుందని, షెడ్యూలు ప్రకారం ధాన్యాన్ని రైతుల నుండి తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, ఇందుకు పి.పి.సిలో సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రతీ రోజూ ధాన్యం కొనుగోళ్లు చేసిన వివరాలను సంబంధిత రిజిష్టరు నందు నమోదుచేయాలని, అలాగే మిగిలిన రైతుల వివరాలు తెలుసుకొని వారికి ధాన్యం కొనుగోలుపై తెలియజేయాలని సూచించారు. ప్రతీ పి.పి.సి సెలవు దినముతో సంబంధం లేకుండా రైతుల సేవకే అంకితం కావాలని, సరియైన పనివేళలను పాటించాలని పేర్కొన్నారు. రైతుల ధాన్యం తడిచే పరిస్థితి లేకుండా చూసుకోవాలని, తేమ విషయంలో గాని, తూకం విషయంలో గాని రైతులు మోసపోకుండా చూడాలని వివరించారు. రెవిన్యూ, వ్యవసాయ, పౌర సరఫరాలు, డి.ఆర్.డి.ఎ, పంచాయతీరాజ్ శాఖల సహకారంతో , సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గ్రేడే ఎ రకానికి రూ.1880/-లు, కామన్ రకానికి రూ.1868/-లు చెల్లించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని పి.పి.సిల నుండి మాత్రమే మిల్లులకు చేరాలని, అంతేగాని కల్లం నుండి నేరుగా మిల్లుకు పంపరాదని తెలిపారు. ఇతర రాష్ట్రాల ధాన్యం మన మిల్లులకు రాకుండా చూడాలని, అటువంటి ధాన్యం లారీలు వస్తే వాటిని సీజ్ చేసి సెక్షన్ 6ఎ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదుచేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో సహాయ పౌర సరఫరాల అధికారి ఎ.ఉదయ భాస్కర్, సి.ఎస్.డి.టిలు పైడిరాజు, శ్రీనివాసరావు, మధు, కవిత, పౌర సరఫరాల సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ విశాలాక్షి, సి.ఎస్.డి.టిలు, వి.ఆర్.ఓలు, పి.పి.సి ఇన్ ఛార్జ్ లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద చిరు వ్యాపారాలను ఆదుకోవడానికే జగనన్న తోడు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్పరెన్సు ద్వారా జగనన్నతోడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సి.ఎం. మాట్లాడుతూ, నిరుపేద చిరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తుల వారి ఆర్ధిక సాయం అందించడానికి జగనన్న తోడు కార్యక్రమమని అన్నారు . పాదయాత్రలో చిరువ్యాపారుల ఆర్ధిక కష్టాలను కళ్ళారా చూడడం జరిగిందని, నిరుపేద చిరు వ్యాపారులు ఆర్ధిక స్థోమత లేకపోవడం వలన అధిక వడ్డీలు చెల్లిస్తూ రుణాలను వడ్డీ వ్యాపారుల నుండి తీసుకోవడం జరుగుతున్నదన్నారు. వారి కష్టాలను చూసి చలించి పోయానని, వారికి మంచి చేయాలనే వుద్దేశ్యంతో జిల్లా కలెక్టర్లు, జె.సి.లు, బ్యాంకర్లతో మాట్లాడి, వారికి సున్నా వడ్డీకే రుణ సదుపాయాన్ని కలిగించే మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. చిరువ్యాపారులు, సాంప్రదాయ వృత్తిదారులు, కులవృత్తి దారులు, ఫుట్ పాత్ మీద సామాన్లు అమ్ముకునే వారు, తోపుడు బండ్ల మీద కూరగాయలు, టిఫిన్లు అమ్ముకునే వారికి పదివేల రూపాయలను వారి ఖాతాలకు వారం పది రోజులలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. వారికి ఐడెంటిటీ కార్డులను ఇవ్వడం జరిగిందన్నారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించి వచ్చే ఏడాది మరల వడ్డీ లేని రుణాన్ని బ్యాంకు ద్వారా పొందాలని ముఖ్యమంత్రి చెప్పారు. జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వాగ్దానాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలనుండి చిరు వ్యాపారులకు విముక్తి కలిగించడం జరుగుతున్నదన్నారు. శ్రమ అధికం, తక్కువ ఆదాయం వస్తున్నా, మరి కొందరికి ఉపాధి కల్పిస్తూ, సమాజానికి సేవ చేస్తున్న చిరు వ్యాపారులకు పెట్టు బడి ఇబ్బందులు తొలగించి, వ్యాపార విస్తరణకు చేయూత నివ్వడం చాలా ఆనందంగా వుందన్నారు. గ్రామాలలో, పట్టణాలలో వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు చిరువ్యాపారులను గుర్తించడం జరిగిందన్నారు. వారికి ఐ.డి.కార్డులను అందించామన్నారు. ఇంకా ఎవరైనా లబ్దిదారులు మిగిలిపోయి వుంటే వారు తక్షణమే సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలన్నారు. నెల రోజుల గడువును ఇవ్వడం జరిగిందని తెలిపారు. లబ్దిదారులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. అనంతరం లబ్దిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. బ్యాంకు అధికారులకు సన్మానం చేసారు. జిల్లాలో 42,238 మంది దారులకు 42 కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలను జగన్నతోడు క్రింద మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్. పి. అమిత్ బర్దర్, డి సి సి బి చైర్మన్ పాలవలస విక్రాంత్,ఎం ఎల్ ఏ కంబాల జోగులు, ,తమ్మినేని చిరంజీవి నాగ్, జె. సి. కె. శ్రీనివాసులు, ఆర్. శ్రీరాములు నాయుడు, డి ఆర్ డి ఏ పి. డి. బి. శాంతి, మెప్మా పి డి కిరణ్ కుమార్, యూనియన్ బ్యాంకు ఎఫ్ బి ఎం. శ్రీనివాస్ శెట్టి, డి జి ఎం. కృష్ణయ్య, ఎల్ డి ఎం హరి ప్రసాద్, ఎస్ బి ఐ ఆర్. ఎం ప్రసాద్, ఏ పి జి వీ బి. ఆర్. ఎం. రియాజ్, డి సి సి బి. సి ఈ ఓ సత్యన్నారాయణ, అసిస్టెంట్ ఎల్ డి ఎం. వెంకట రమణ, కెనరా బ్యాంకు మేనేజర్ పులి రూపేష్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకుల నుంచి రుణ సహాయం పొందడంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో చిరు వ్యాపారులు, హస్తకళాకారులు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకొని ఆర్ధికాభ్యున్నతి చెందేందుకు జగనన్న తోడు పథకం గొప్ప వరమని విజయనగరం ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. చిరు వ్యాపారులకు సున్నవడ్డీ రుణాలు బ్యాంకుల ద్వారా అందించే జగనన్నతోడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి నివాసం నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న అనంతరం ఎం.పి. బెల్లాన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఈ పథకం అమలులో మొదటి మూడు స్థానాల్లో నిలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లోంచి బయటపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొంటూ, చిరు వ్యాపారులకు సున్నవడ్డీ రుణాలు అందించే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్రెడ్డికి చిరు వ్యాపారస్థుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో విజయనగరం జిల్లా రాష్ట్రంలో ముందంజలో నిలుస్తుండటం పట్ల సంతోషం వ్యక్తంచేస్తూ జిల్లాను మొదటిస్థానంలో నిలుపుతున్న జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్లాల్ను అభినందించారు.
జిల్లాలో 36,191 మంది చిరు వ్యాపారులు, హస్తకళాకారులకు రూ.35.51 కోట్ల సున్నవడ్డీ రుణాలను జగనన్న తోడు పథకం ద్వారా బ్యాంకుల నుండి అందించామని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. ఈ పథకం చిరు వ్యాపారులు, సంప్రదాయ హస్తకళాకారుల కుటుంబాల ఆర్ధిక వృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారస్తుల కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయి వున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి సున్నవడ్డీ రుణాలు అందించడం వారికి ఎంతో ఊరటనిస్తుందన్నారు. ఈ కార్యక్రమం అమలులో సహకరించిన జిల్లాలోని బ్యాంకర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చిరు వ్యాపారులను గుర్తించి వారికి రుణాలు అందజేయడంలో సెర్ప్, మెప్మా సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు మంచి కృషి చేశారని పేర్కొంటూ వారందరినీ అభినందించారు. పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మానవత్వంతో కూడిన పరిపాలన అందిస్తున్నారని, అందువల్లే ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమంలో మానవతా దృష్టి కనిపిస్తుందన్నారు. ప్రతిఒక్కరూ సుఖంగా జీవించే పరిస్థితి వుండాలని, ప్రతిఒక్కరి జీవన ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానమే రాష్ట్రానికి అభివృద్ధి విధానమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు చిరు వ్యాపారులకు ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యక్తిగత రుణ మంజూరు పత్రాలు, గుర్తింపు కార్డులు అందజేశారు. జిల్లాలోని చిరు వ్యాపారులకు రూ.35.51 కోట్ల సున్నవడ్డీ రుణానికి సంబంధించిన చెక్కును లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా రుణాలు అందజేయడంలో సహకరించిన ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, ఎస్.బి.ఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏ.పి.గ్రామీణ వికాస్ బ్యాంకు ప్రతినిధులను జిల్లా కలెక్టర్, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు తదితరులు సత్కరించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్లను లబ్దిదారులు సత్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కె.సుబ్బారావు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ కె.సుగుణాకర్ రావు, డివిజనల్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు రామచంద్రరావు, రాజ్కుమార్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డి.పి.ఎం. పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద వచ్చే మార్చి నెలాఖరుకు రూ.400 కోట్ల విలువైన కన్వర్జెన్సీ పనులను పూర్తి చేసేవిధంగా ప్రణాళికను రూపొందించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ చెప్పారు. ఉపాధిహామీ పనులపై రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి పెద్దిరామచంద్రారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ ఎం.గిరిజా శంకర్ బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉపాధి కన్వర్జెన్సీ పనులను వేగవంతం చేయాలని, మార్చి నెలాఖరుకి రాష్ట్రంలో సుమారు రూ.4వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని, దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి నాటికి రూ.400 కోట్ల విలువైన కన్వర్జెన్సీ పనులను నిర్వహించేందుకు తగిన ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు. ఉపాధి వేతనదారులకు పనికల్పనలో ఎప్పటిలాగే జిల్లాలో లక్ష్యాన్ని శతశాతం కంటే ఎక్కువగా సాధించామన్నారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను ఇప్పటికే ఆయా శాఖలకు అప్పగించడం జరిగిందన్నారు. సిమ్మెంటు కొరత, బిల్లుల మంజూరులో జాప్యం, కాంట్రాక్టర్ల కొరత, సాంకేతిక సమస్యల కారణంగా కన్వర్జెన్సీ పనులు కొంత నెమ్మదిగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమస్యలను అధిగమించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, డ్వామా పిడి ఏ.నాగేశ్వర్రావు, పిఆర్ ఎస్ఇ జిఎస్ఆర్ గుప్త, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ పప్పు రవి, ఇఇ కె.వి.శివానందకుమార్, జెడ్పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతిష్టాత్మక ఆలోచనతో రూపుదిద్దుకున్న గ్రామ సచివాలయాలు, రైతు బారోసా కేంద్రాలు , వై.ఎస్.ఆర్. ఆరోగ్యకేంద్రాలు , పాలసేకరణ కేంద్రాలు, వంటివి గ్రామీణ వాతావరణం, గ్రామవ్యవస్థను రూపు రేఖలు మార్చే నిర్మాణాలని అని నిర్దేశించిన సమయం మేరకు మార్చి 2021 నాటికి పూర్తి కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం విజయవాడ పంచాయితీ రాజ్ కమిషనరేట్ కార్యలయం నుండి అన్నిజిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించంగా స్థానిక నగరపాల సంస్థ కార్యలయం నుండి ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి , జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త, సత్యవేడు శాసన సభ్యులు ఆదిమూలం , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా వివరిస్తూ గ్రామ సచివాలయాలు 1012, రైతు భరోసా కేంద్రాలు 932, వై.ఎస్.ఆర్.హెల్త్ క్లినిక్స్ 721, నాడు – నేడు పాటశాలల కాంపౌండ్ పనులు 1318 , వై.ఎస్.ఆర్.ప్రీస్కూల్స్ (అంగన్ వాడీలు) 580 వివిధ స్థాయిలో పురోగతిలో వున్నాయని వివరించారు. గత 3 వారాల్లో నిర్దేశించిన వారానికి రూ.10 కోట్లు ఖర్చు మేరకు ఎక్కువగానే రూ.10.5 కోట్లు నిధులు ఖర్చు చేశామని తెలిపారు. నరేగాలో రూ. 385 కోట్లు లేబర్ కాంపొనెంట్ , మెటీరీయల్ కాంపొనెంట్ రూ 150 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గ్రామాల్లో నరేగా అనుసంధాన నిర్మాణాలకే ప్రాధాన్యత నిస్తున్నామని తెలిపారు. సచివాలయాల స్థలాలు 74 చోట్ల వివిధ కారణాల వల్ల పెండింగ్ వుంటే గతవారం పరిష్కరించామని డిసెంబర్ 10 నాటికి అవి కూడా పురోగతిలో వుంటాయని అనుకున్న మేరకు మార్చి 2021 కి పూర్తి చేస్తామని ఇబ్బందులు లేవని వివరించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో పిడి డ్వామా చంద్రశేఖర్ , ఎస్.ఇ లు పి. ఆర్. అమరనాథ్రెడ్డి, ఇరిగేషన్ సురేంద్ర నాధ్, ఆర్. డబ్ల్యూ. ఎస్ విజయ కుమార్ , ఇంజనీరింగ్ శాఖల ఇ ఇ లు, డి ఇ లు, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జర్నలిజం రంగంతో పాటు భాషా, రచన, అభ్యుదయ రంగాల్లో ముత్యాల ప్రసాద్ తనదైన ముద్ర వేసి ఆదర్శనీయంగా నిలిచారని వక్తలు అభిప్రాయపడ్డారు. విశాలాంధ్ర ఎడిటర్ ముత్యాల ప్రసాద్ సంతాప సభ బుధవారం శ్రీకాకుళం జిల్లా సిపిఐ శాఖ, విశాలాంధ్ర దినపత్రిక సంయుక్తంగా స్థానిక క్రాంతిభవన్లో నిర్వహించాయి. విశాలాంధ్ర దినపత్రిక జిల్లా బ్యూరో ఇన్ఛార్జి ఎస్.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యమ్రంలో పార్టీ నేతలు, మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల సభ్యులు పాల్గొని ప్రసంగించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నర్సింహులు మాట్లాడుతూ సంపాదకుడిగా ప్రతి ఒక్కరితో ఎంతో సాన్నిహిత్యాన్ని, రచనా అనుబంధాన్ని కలిగిన ముత్యాల అకాల మృతి, విశాలాంధ్ర సభ్యులకు తీరని లోటన్నారు. సామాజిక దృక్ఫథం గల యువ జర్నలిస్టులను తయారు చేయుడంలోనే, విలువల గల జర్నలిజం కొనసాగించడంలోనూ ముత్యాలు చూపిన చొరవ విశాలాంధ్ర ఖ్యాతిని మరింతగా పెంచిందన్నారు. ఆయనతో గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సీనియర్ జర్నలిస్ట్, రచయిత బెందాళం కృష్ణారావు మాట్లాడుతూ, మంచి రచయితను, సంపాదకుడిని తెలుగు ప్రజలు కోల్పోయారన్నారు. కోల్పోయారన్నారు. విషయాన్ని లోతుగా ఆలోచించి, దానిపై పరిష్కారయుత విశ్లేషణ చేయడంలో ముత్యాల ముందుండేవారన్నారు. డా.బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం పీజీ శాఖ అధ్యాపకులు డా.జి.లీలావరప్రసాదరావు మాట్లాడుతూ, జనం నుంచి వచ్చిన నిజమైన సంపాదకుడు ముత్యాల ప్రసాద్ అని కొనియాడారు. మూడు దశాబ్ధాల పాటు విశాలాంధ్రలో వివిధ హోదాల్లో సేవలందించి ప్రజలను చైతన్యవంతులు చేయడంలో ఎంతో ముఖ్యభూమిక పోషించారన్నారు. సమాజానికి కళ్లు, కాళ్లుగా ఉండేటటువంటి సాహితీవేత్తలు, కళాకారులు, పాత్రికేయులు కరోనా బారిన పడి వరుసుగా ఎంతో విచారకరం, దురదృష్టకరమన్నారు. ఏపియూడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలోనూ, వారిని సంఘటిత పరచడంలోనూ ముత్యాల ప్రసాద్ చేసిన కృషి మరువలేనదన్నారు. సమాజానికి దిశానిర్థేశం చేయడంలో నిరంతరం ముందుండే వారన్నారు. ఏపిడబ్ల్యుజె జిల్లా కార్యదర్శి ఎస్. ప్రసాద్, పాత్రికేయులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఎల్.రవికుమార్ , పాపారావు, మల్లేశ్వరరావు, కృష్ణారావు, డిపి దేవ్. కె.భాస్కరరావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా, ముత్యాల చిత్రపటానికి ఘననివాళిలు అర్పించి జోహార్లు పలికారు.
ఆంధ్రప్రదేశ్ లోని సెకెండ్ వేర్ కరోనా వైరస్ విస్తరణ వేగంగా జరుగుతున్నందున ప్రతీఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన జాగ్రత్తలు, సూచనలు పాటించాలని విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు కోరారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చలికాలం ప్రారంభమైన వేళ కరోనా వైరస్ కేసులు అధికం అవుతున్నాయని ఈ సమయంలో విద్యుత్ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఖచ్చితంగా మాస్కులు ధరించడంతోపాటు, సామాజిక దూరం పాటించాలన్నారు. బయటకొచ్చే సమయంలో హేండ్ గ్లౌజులు వేసుకోవాలని సూచించారు. చలికాంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా వుంటుందని ప్రభుత్వం సూచిస్తున్నవేళ ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్ నియంత్రణ ఉద్యమంలో బాగస్వాములు కావాలన్నారు. అత్యవసర సమయంలో తప్పా మిగిలిన సందర్భాల్లో ఎవరూ బయటకు రాకూడదని పోలాకి సూచిస్తున్నారు. నాణ్యమైన శానిటైజర్లు మాత్రమే వినియోగించాలన్నారు. ముఖ్యంగా వ్యాధులు ఉన్నవారిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఆశన్నమైందన్నారు. మార్చి వరకూ ప్రభుత్వ సూచనలు పాటిస్తే అప్పటికి కరోనా నియంత్రణతోపాటు, వాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఎవరికైనా కరోనాల లక్షణాలుంటే దగ్గర్లోని పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. 14 రోజులు ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ పాటించాలని పోలాకి శ్రీనివాసరావు మీడియా ముఖంగా కోరారు.
విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్ అకాల మరణం పత్రికా లోకనికి తీరని లోటని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు. బుధవారం పౌర గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ముత్యాల ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ సామాజిక స్పృహ ,విలువలు,వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అనేక కధనాలతో కూడిన సంపాదకీయం చేసిన ముత్యాల ప్రసాద్ పలువురికి మార్గదర్శగా నిలిచారని కొనియాడారు. నిజాన్ని నిర్భయంగా తన కధనాలు, వ్యాసాలు, రచనలు ద్వారా ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారని తెలిపారు.ముత్యాల ప్రసాద్ కుటంబానికి స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరుపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అసోసియేషన్ తరుపున నివాళులర్పించిన వారిలో ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ,కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తం గా చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు 9 లక్షల మందికి పైగా రూ. 10 వేలు వంతున రూ. 905 కోట్లు జమ చేయడం జరుగుతున్నదని, రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ముఖ్య మంత్రి క్యాంప్ కార్యాలయం తాడేపల్లి నుండి జగనన్న తోడు ప్రారంభించగా తిరుపతి నగర పాలక సంస్థ నుండి డిప్యూటీ సి. ఎమ్. నారాయణ స్వామి, జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, ఆదిమూలం, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,జిల్లా కలెక్టర్ డా. ఎన్. భరత్ గుప్తా , నగర పాలక సంస్థ కమీషనర్ పి ఎస్ గిరీషా, అధికారులు పాల్గొన్నారు.
ముఖ్య మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ తన పాద యాత్ర లో చిన్న వ్యాపారస్తుల ఎండనక, వాననక ఉదయాన్నే 4 గంటలకు తమ జీవనం ప్రారంభించే వారి అవస్థలు చూస్తే వారిని మనం మహనీయులుగా గుర్తించాలని అన్నారు. వీరు అసంఘటిత కార్మికులు అయినందున వీరికి బ్యాంకులు లోన్లు ఇవ్వరని 3/5/10 రూపాయలు ఇలా వడ్డీ కి తెచ్చి వ్యాపారం సాగిస్తున్నారని అందుకోసం నేడు కనీసం 10 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించి నేడు 9 లక్షల మందికి పైగా రూ. 905 కోట్లు వారి ఖాతాలలోకి జమ చేసి , మరో నెల పాటు ఇంకా ఎవరికైనా అందకుంటే సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని అవకాశం ఇస్తున్నామని తెలిపి కంప్యూటర్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలకు జమ చేశారు.
ఉపముఖమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ జగనన్న ఆలోచన పేదవాడిని కోటీశ్వరుడిని చేయడమేనని తెలిపారు. పేదవాడికి దేవుడిలా వచ్చి బ్యాంకులకు తాను గ్యారంటీ ఇచ్చి , వడ్డీ లేకుండా రుణాలు నేడు జిల్లాలో 74,950 మందికి రూ. 10 వేలు వంతున ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న విధానం లో పేదవారు రూ. 10 వేలు తీసుకుంటే అప్పుడే రూ. 1500 పట్టుకొని రోజు రూ. 100 కట్టమంటుంటారని తెలిపారు. మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని తెలిపారు.
జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మాట్లాడుతూ వ్యూ ఆఫ్ టైమ్స్ పత్రికలో ఒకప్పుడు చదవానని చిన్న అతి చిన్న వ్యాపారస్తులను ఆదుకుంటే ఆర్థిక స్వావలంబన, దేశ, రాష్ట్ర అభివృద్ధి వస్తుందని, కానీ ముఖ్యమంత్రి తమ పాద యాత్ర లో వారి స్వయంగా చూసి కష్టాలను గుర్తించి నేడు వారికి ఆర్థికంగా ఆదుకోవడానికి జగనన్న తోడు ప్రవేశ పెట్టారని ఇది ఒక శుభ దినం అని అన్నారు. ఎంతో మంది చిన్న వ్యాపారస్తులకు బ్యాంకులు షూరిటీ వుంటేనే రుణం ఇవ్వరని నేడు ముఖ్యమంత్రి హామీ తో బ్యాంకులు ముందుకు వచ్చాయని 10 లక్షల మంది పేదలకు రుణం అందించడం బ్యాంకులకు ధన్యవాదాలను అన్నారు. తీసుకున్న రుణాన్ని సకాలం లో చెల్లిస్తే , వడ్డీ ప్రతి 3 నెలలు ఒకసారి ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ముఖ్య మంత్రికి వివరిస్తూ జిల్లా లో జగనన్న తోడు లబ్దిదారుల శాతంలో రాష్ట్రంలో మొదటి స్థానం లో వుందని నేటికీ 74,950 మంది అర్హత పొందరని వారికి రూ. 74 కోట్ల 95 లక్షలు వారి ఖాతాలకు జమ కానున్నదని తెలిపారు. జగనన్న తోడు లబ్ది దారులు శ్యామల ముఖ్య మంత్రి తో తన అభిప్రాయం వీడియో కాన్ఫెరెన్స్ లో పంచుకుంటు, సార్, మాది శ్రీకాళ హస్తి కలంకారీ పనులు చేసుకుంటాము. ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తే నెలకు జీతం రూ. 6 వేలు వస్తుందని తెలిపారు. దీని కోసం వ్యాపారస్తులు వడ్డీ రూ. 10 వేలు తీసుకుంటే రూ. 10 వడ్డీ కడుతున్నామని నేడు జగనన్న తోడు రుణం అందడం సంతోషంగా వుందని తెలిపారు. ఇప్పటికే లేపాక్షి ద్వారా ఆన్ లైన్ అమ్మకాలకు కాలంకారీ కి అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు. బ్యాంకులకు వెళ్తే షూరిటీ కావాలంటారు. మా అన్నగా నేడు రూ. 10 వేలు షూరీటీ లేకుండా, వడ్డీ లేకుండా ఇస్తున్నారని మీ మేలు మరవ బొమని, మళ్ళీ మళ్ళీ మీరే ముఖ్య మంత్రి గా కావాలని మహిళలు కోరుకుంటున్నారని అన్నారు. సమావేశం అనంతరం రూ. 74,95,000 లక్షల చెక్కును లబ్దిదారులకు అందజేశారు. ఈ సమావేశం లో జె. సి (డి) వీరబ్రహ్మం , లీడ్ బ్యాంక్ మేనేజర్ గణపతి, నగర పాలక అడిషనల్ కమీషనర్ హరిత, డిప్యూటీ కమీషనర్ చంద్ర మౌళీశ్వర్ రెడ్డి, మెప్మా పి డి జ్యోతి , డి ఆర్ డి ఏ పి డి తులసి, జీవనోపాదుల ఏ పి డి కృష్ణవేణి, బ్యాంక్ లింకేజ్ అధికారి బాబా , అధికారులు వున్నారు.
అనంతపురం జిల్లాలో కారుణ్య నియామకం కింద తొమ్మిది మంది అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఉత్తర్వులు అందచేశారు. వివిధ శాఖల్లో పని చేస్తూ,సర్వీసులో ఉండగానే మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెందిన 9 మంది అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్ లుగా నియమించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగాల్లోకి చేరిన వారంతా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందించడంలో చొరచూపాలని సూచించారు. కారుణ్యనియామకాల ద్వారా ఉద్యోగాలు సత్వరమే వచ్చాయంటే దానికి ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వేగంగా పనిచేయడం వలనే అదిసాధ్యపడిందన్నారు. అదే వేగాన్ని, సేవలను ప్రజలకు అందించాలని సూచించారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు..ఈ కార్యక్రమంలో డీఆర్వో గాయత్రీ దేవి పాల్గొన్నారు..