చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం ఎంతో ఉపయోగ పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న తోడు పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు నుండి పట్టణాలు, నగరాలలో ఉన్న చిన్న చిన్న వ్యాపారులకు ఉపయోగపడుతుందని, కూరగాయలు, తోపుడు బళ్లు, చిన్న చిన్న టిఫిన్ షాపులు, పూలు, మోటారు సైకిళ్ళపై వెళ్ళి వ్యాపారం చేసుకొనే వారు, పళ్లు, కిరాణా, బడ్డీ కొట్టులు, ఫ్యాన్సీ, మగ్గం వర్క్, క్లాత్ అండ్ హేండ్లూమ్స్, లేస్ వర్క్, స్టీల్ షాపులు, కుమ్మరి, కిచెన్ అండ్ ప్లాస్టిక్ సామానులు, బ్యూటీ అండ్ ఫ్యాషన్, బ్రేస్ వేర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, కలంకారి, ఏటికొప్పాక బొమ్మలు, లెథర్ పప్పెట్స్, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణా, తదితర వ్యాపారులు జగనన్న తోడు పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ వ్యాపారులు అధిక వడ్డీలకు అప్పులు చేసి వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఈ పథకం స్వయం ఉపాధిగా ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు, వార్డుల్లో వార్డు వాలంటీర్లు అర్హులైన లబ్దిదారుల వద్దకు వచ్చి వారినుండి వివరాలు తీసుకొని సచివాలయాల్లో ఉన్న సంక్షేమ అధికారి బ్యాంకు ఖాతాను ఓపెన్ చేస్తారని తెలిపారు. వడ్డీ లేకుండా రూ.10 వేలును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు కడుతుందని స్పష్టం చేశారు. చిరు వ్యాపారులు మీకు దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్లి జగనన్న తోడు జాబిను పరిశీలించి అందులో మీ పేర్లు లేకపోతే మరో నెల రోజులు సమయంలో ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ పథకంనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 1902 కు కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు. చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా మంచి జరగాలని కోరుకుంటూ ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ జగనన్న తోడు పథకం ద్వారా జిల్లాలో 87 వేల 527 మంది లబ్ది పొందుతున్నారని, ఏటికొప్పాకలో 467 మంది శత శాతం లబ్ది పొందుతున్నట్లు చెప్పారు. జిల్లాలో కూరగాయ వ్యాపారులు, తదితరులు ఎక్కువ మంది లబ్దిపొందుతున్నారని ముఖ్యమంత్రికి వివరించారు.
ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డితో జగనన్న తోడు లబ్దిదారురాలు భీమిలి నియోజక వర్గం పద్మనాభం మండలానికి చెందిన చుక్కా స్వాతి మాట్లాడుతూ తాను కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నానని, ప్రస్తుతం తాను బయటే కూరగాయలు అమ్ముకొని, రాత్రి కూరగాయలను ఇంటికి తీసుకువెలుతున్నానని, ఒక బడ్డీ తయారు చేసుకొని రాత్రి ఆ బడ్డీలో కూరగాయలు దాచుకొని ఉదయం షాపు తీసుకొని అమ్ముకొనుటకు బ్యాంకుకు వెల్లి ఋణం అడిగితే వారు స్యూరిటీ అడిగారని, ప్రస్తుతం ఋణం ఇస్తాం బ్యాంకుకు రమ్మనమని వారే నాకు ఫోన్ చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. మీ పథకాలు ద్వారా నా తల్లికి సున్నా వడ్డీ కింద 18 వేల రూపాయలు, నా బిడ్డ ప్రభుత్వ స్కూల్ చదువుకొంటున్నందుకు 15 వేల రూపాయలు, నా భర్తకు ఆటో నడుపుకుంటున్నందుకు పది వేల రూపాయలు, వై.యస్.ఆర్. ఆసరా కింద 8 వేల 50 రూపాయలు, జగనన్నతోడు పథకం ద్వారా పది వేల రూపాయలు, నాన్నమ్మకు వృద్థాప్య ఫించను, తదితరమైన వాటి ద్వారా ఒక్క నా కుటుంబంలోనే ఒక లక్షా 68 వేల 800 రూపాయలు అందుతుంటే రాష్ట్రంలో ఉన్న ఎన్నో కుటుంబాలు లబ్ది పొందుతున్నాయన్నారు. అనంతరం 87 కోట్ల 53 వేల రూపాయల చెక్కును, గుర్తింపు కార్డులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ లబ్దిదారులకు అందజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జివియంసి కమీషనర్ జి. సృజన, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, జె.సి.-3 గోవిందరావు, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, యుసిడి పిడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న తోడు పథకం ద్వారా లక్షల మంది లబ్దిదారులకు ఉపయోగపడుతుందని చెప్పారు. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. కూరగాయలు, తోపుడు బళ్లు, చిన్న చిన్న టిఫిన్ షాపులు, పూలు, మోటారు సైకిళ్ళపై వెల్లి వ్యాపారం చేసుకొనే వారు, పళ్లు, కిరాణా, బడ్డీ కొట్టులు, ఫ్యాన్సీ, మగ్గం వర్క్, క్లాత్ అండ్ హేండ్లూమ్స్, లేస్ వర్క్, స్టీల్ షాపులు, కుమ్మరి, కిచెన్ అండ్ ప్లాస్టిక్ సామాలు, బ్యూటీ అండ్ ఫ్యాషన్, బ్రేస్ వేర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, కలంకారి, ఏటికొప్పాక బొమ్మలు, లెథర్ పప్పెట్స్, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణా, తదితర వ్యాపారులు జగనన్న తోడు పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. చిరు వ్యాపారులు మీకు దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్లి జగనన్న తోడు జాబిను పరిశీలించి అందులో మీ పేర్లు లేకపోతే మరో నెల రోజులు సమయంలో ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.
అక్షర సేద్యంలో అలుపెరగని కృషీవలుడు విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ముత్యాల ప్రసాద్ అని పలువురు వక్తలు కొనియాడారు. విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ముత్యాల ప్రసాద్ సంతాప సభ బుధవారం స్థానిక పౌర గ్రంధాలయంలో దినపత్రిక బ్యూరో చీఫ్ డా.ఎమ్.ఆర్.ఎన్.వర్మ అధ్యక్షతన జరిగింది. సెంచురియన్ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య జి ఎస్ ఎన్ రాజు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి, జాతీయ సర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు చలసాని రాఘవేంద్రరావు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు చంద్రమోహన్, యుజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కె రాము,ఉపాధ్యక్షులు సత్యనారాయణ,స్మార్ట్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ ,విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ రాజు, రచయిత మేడా మస్తాన్ తదితరులు పాల్గోని ప్రసంగించారు. ముత్యాల ప్రసాద్ విశాలాంధ్ర సంపాదకులుగా మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల పక్షాన నేటి యువతరం లో ఉండవలసిన నైతిక విలువలు సమాజంలో వస్తున్న కొత్త అవకాశాలు అవసరాలకు తగినట్లు సమకాలీన వ్యాసాలను అందించడంలో ఎంతో కృషి చేశారని వక్తలు ఉద్ఘాటించారు. అందులో కమ్యూనిస్టుల పత్రికలో సంపాదకులు గా మరియు రచయితగా మంచి సాహితీవేత్తగా జర్నలిస్టుల నేతగా పాత్రికేయుల ఆశాదీపంగా ఎదిగిన మహోన్నత వ్యక్తి ముత్యాల ప్రసాద్ అన్నారు. ఆయన నేడు మనమధ్య లేకపోయినా అతను రాసిన పుస్తకాలు, వ్యాసాలు నేటి తరానికి రాబోయే తరానికి ఆదర్శనీయమన్నారు.ఎంతోమందిని విలువలతో కూడిన జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన ఘనత ముత్యాల ప్రసాద్ కు దక్కుతుందని, ఆయన మరణం పాత్రికేయ రంగానికే కాకుండా సాహితీ లోకానికి తీరని లోటని వక్తలు అభిప్రాయపడ్డారు. లక్ష్యం పట్ల లక్ష్య శుద్ధి కలిగిన వ్యక్తి లక్ష్యం సిద్ధించేందుకు చేసిన అవిశ్రాంత కృషి వృధా పోదని నమ్మిన క్రియాశీలుడు ముత్యాల ప్రసాద్ అన్నారు.జర్నలిజాన్ని సంపాదకీయాన్ని సమాజహితం గా ముందుకు నడపడంలో చోదకశక్తిగా ముత్యాల ప్రసాద్ విశాలాంధ్రలో చేసిన అక్షర సేద్యం నిరంతరం వెలుగును ప్రసవిస్తునే ఉంటాయన్నారు. విలువలు పడిపోతున్న నేటి తరంలో దశ దిశ పట్ల ప్రజాతంత్ర వామపక్ష పదజాలంతో ఆయన అందించిన వ్యాసాలు అందరి మదిలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాలాంధ్ర సబ్ ఎడిటర్ ఆర్ రమేష్ వందన సమర్పణతో సభ ముగించారు.
చిత్తూరు జిల్లాలో పెనుగాలులతో కూడిన తుఫాన్ ’నివర్ ‘ మరో 36 గంటలు ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. భారత్ గుప్తా తెలిపారు. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. జిల్లా లో నివర్ తుఫాన్ ప్రభావం 26న రాత్రి వరకు వుంటుందని, నేడు 25,రేపు 26 పాఠశాలలకు సెలవు ప్రకటించామని తెలిపారు. తూర్పు మండలాలలు 12 వరకు అధిక ప్రభావం వుండే అవకాశం వుందని, ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వారిని 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయం అందిస్తున్నామని తెలిపారు. పూరి గుడిసెల్లో వున్నవాళ్లు సహాయ కేంద్రాలకు వెళ్లాలని జిల్లా కంట్రోల్ రూమ్ నెం. 9100804313 ఏర్పాటు అయిందని, అలాగే ప్రభావిత ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమించామని, సహాయం పొందాలని తెలిపారు. చెరువుల విషయంలో 669 వాటికి ప్రమాదముందని గుర్తించి గస్తీ ఏర్పాటు, ఇసుక బస్తాల ఏర్పాటు చేశామని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాలువలు, వాగులు , వంకలు దాటరాదని తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొని భాదితులకు సహాయం చేసేందుకు యువ వాలంటీర్లకు శిక్షణ అందించాలని జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థ (ఎన్ డి ఎం ఎ)జాయింట్ సెక్రటరీ జి. రమేష్ కుమార్ జిల్లాయంత్రాంగానికి సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం సమావేశమందిరంలో ఎ పి ఎస్ డి ఎం ఎ మరియు ఎన్ డి ఎం ఎ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుల నిర్వహణకు సంబందించి “ఆపద మిత్ర స్కీమ్” ఏర్పాటు చేసిందని, దీని పైలట్ ప్రాజెక్టు కింద మూడు దశలలో దేశ వ్యాప్తంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనికి సంబందించి యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తీర ప్రాంతాల రాష్ట్రాలకు తుఫానుల తాకిడి అధికంగా ఉంటున్న నేపద్యంలో తుఫాన్ లు మరియు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవించినప్పుడు ఆయా ప్రాంతాలలో ఆస్తి మరియు ప్రాణ నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం తదితరాలకు సంబందించి అన్నియూనివర్శిటీలు , కళాశాలలు, పాఠశాలల, ఎన్ ఎస్ ఎస్, ఎన్ సి సి, విద్యార్ధిని, విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. డిసెంబరు నెలలో సంబందిత శాఖల అధికారులు, సిబ్బందికి వర్కుషాప్ ను కోవిడ్ నిబందనలు పాటిస్తూ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ తుఫాన్ ల తాకిడి జిల్లాకు ఎక్కువగా ఉంటుందని గతంలో హూదూద్ తుఫాన్ వలన చాలా నష్టం సంభవించిందన్నారు. ఆ సమయంలో రెవెన్యూ యంత్రాంగం తో పాటు ఎన్ ఎస్ ఎస్, ఎన్ వై కె , కోస్ట్ గార్డు, ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ తదితర శాఖల సిబ్బంది తమ సేవలను అందించారన్నారు. ఈ సమావేశంలో ఎన్ డి ఎం ఎ జాయింట్ ఎడ్వవైజర్ నావల్ ప్రకాష్, ప్రాజెక్టు అసిస్టెంటు బ్రజేష్ జైశ్వాల్ , జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాలరెడ్డి, జిల్లారెవెన్యూ అధికారి ప్రసాద్, కోస్ట్ గార్డు డి ఐ జి బి.రంజన్, ఎన్ డి ఆర్ ఎఫ్ కమాండెంటు ఈశ్వరరావు , జిల్లా సహాయక అగ్నిమాపక శాఖ అధికారి సింహాచలం, ఇరిగేషన్ ఎస్ ఇ కె ఎస్ కుమార్, ఎన్ ఎస్ ఎస్, ఎన్ వై కె కో ఆర్డినేటర్లు హరినాద్, రామ్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
'విశాలాంధ్ర' సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్ ముత్యాల ప్రసాద్ మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమైన విషయమని చెప్పారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, నమ్మిన సిద్ధాంతం కోసం, పాత్రికేయుల సంక్షేమానికి అహర్నిశలు పనిచేసేవారని అన్నారు. పూర్తి నిబద్దతతో తన వృత్తిలో రాణించారని, సమకాలీన పాత్రికేయులకు ఆదర్శంగా, భావి తరాలకు మార్గదర్శంగా నిలిచారన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముత్యాల ప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానన్నారు. ఇటీవలే విశాలాంధ్ర విజ్ఞాన సమితి సభ్యులతో తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తావించానని, విజయవాడ జీజీహెచ్లో ఆయన చికిత్స పొందుతున్నారని, మెరుగైన వైద్యం అందుతోందని సమితి సభ్యులు చెప్పిన విషయం ఇప్పటికీ తన కళ్ళముందు కనబడుతోందని, ఇంతలోనే ఇలాంటి బాధాకరమైన వార్త వినడం తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. తెలుగు నేలపై తొలి దినపత్రికగా తన ప్రస్థానం ప్రారంభించి ప్రజా పత్రికగా అందరి మనసులో స్థానం సంపాదించుకున్న 'విశాలాంధ్ర' ఇటీవలే మాజీ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారిని, ఇప్పుడు ముత్యాల ప్రసాద్ ని కోల్పోవడం తీరనిలోటని కృష్ణదాస్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంలో భాగంగా వివిధ అంశాలలో జీవిఎంసీ వృద్ధి సాధించిన నేపథ్యంలో “07 స్టార్ రేటింగ్ గార్బేజ్ ఫ్రీ సిటీ” గా స్వీయ నిర్ధారణ చేస్తూ తీర్మానించారని జివిఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 07స్టార్ రేటింగ్ నేపథ్యంలో తేది. 24-11-2020 నుంచి ప్రజల నుంచి అభ్యంతరాలు 15 రోజల వ్యవధిలో కమిషనర్, జివిఎంసి, విశాఖపట్నం వారికి వ్రాతపూర్వకంగా గాని లేదా అంతర్జాలం ద్వారా gvmc.cmoh2016@gmail.com, gvmcpublichealth@gmail.com మెయిల్ అడ్రస్సులకు తెలియజేయాలన్నారు. గార్బేజ్ ఫ్రీ సిటీకి సంబందించిన పూర్తి వివరాలు www.gvmc.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. చెత్తరహిత నగర స్థాయిని రోజులో ఏ సమయములోనైనా వాణిజ్య లేదా నివాస ప్రాంతాలు చెత్త రహితంగా చేస్తున్నామన్నారు. నూరు శాశం ఘన వ్యర్ధముల శాస్త్రీయ నిర్వహణ, డంప్ యార్డులయందు పేరుకుపోయిన వ్యర్ధాల పరిష్కారం చూపిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు, భవన నిర్మాణ వ్యర్ధముల నిర్వహణ మొదలగు అంశములలో ప్రభుత్వము వారి మార్గదర్శకాలు పాటిస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు షరతులకు లోబడి జివిఎంసి పురోగతి సాధించిందని చీఫ్ మెడికల్ అధికారి తెలియజేశారు.
మత్స్య కారులను అభివృద్ధి పథంలో నడిపేందుకు మత్స్య శాఖలో అనేక రకాల అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత జిల్లా మత్స్య శాఖ అధికారులు మంత్రి పేర్ని నానిను కలుసుకున్నారు. కృష్ణాజిల్లాలో 8 లక్షల టన్నుల చేపలు రొయ్యలు ఉత్పత్తి సాధించి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించినట్లు మత్స్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం - 2020 పురస్కరించుకొని గత శనివారం ఢిల్లీలో జరిగిన ఒ కార్యక్రమంలో ఆ పురస్కారానికి 3 లక్షల నగదు , ఒక జ్ఞాపీక లభించిందని ఉప సంచాలకులు లాల్ మొహ్మద్ మంత్రికి తెలిపారు. ఈ విజయానికి సమిష్టి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియచేస్తున్నానన్నారు, ఇలాగే మున్ముందు సైతం కృష్ణాజిల్లా మత్స్య శాఖ రాష్ట్రంలోనే ప్రధమ స్థానాన్ని మరల మరలా కైవసం చేసుకోవాలని మంత్రి పేర్ని నాని కోరారు. కృష్ణాజిల్లాలో 111 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని , 1 లక్షా 12 వేల 977 మంది మత్స్యకారులు జిల్లాలో నివసిస్తున్నారని పేర్కొంటూ, 4 తీర ప్రాంత మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. మచిలీపట్నం పరిసర తీర గ్రామాలలో సముద్రంలో చేపల వేట ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో బోటు నడిపే మత్స్యకారునికి తీరంలో చుక్కాని దీపాలు కనబడక ఎంతో ఇబ్బంది పడుతున్నాడని త్వరలో సముద్ర మొగలో లైట్లు కనబడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఎత్తైన స్తంభాలను నిర్మించి రెండు శక్తివంతమైన విద్యుత్ దీపాలను ఏర్పాటుచేసే విషయమై చురుగ్గా ఏర్పాట్లు చేయాలనీ మంత్రి పేర్ని నాని అధికారులకు సూచించారు. అలాగే ఫిషింగ్ హార్బర్ వద్ద దట్టంగా ఎత్తైన చెట్లు పెరిగిపోవడంతో అక్కడ పెద్ద టవర్ నిర్మించి శక్తివంతమైన ఎర్రని కాంతి ప్రసరించే నియాన్ లైట్లు ఏర్పాట్లు చేయాలని వీటి మంజూరు కోసం ఎవరిని సంప్రదించాలని మత్స్యశాఖ అధికారులను అడిగారు. మారీ టైమ్ సి ఇ ఓ రామకృష్ణారెడ్డికి మంత్రి పేర్ని నాని ఫోన్ చేసి మత్స్యకారుల ఎదుర్కొంటున్న అవస్థలు తెలిపారు. దీంతో ఆ అధికారి టవర్ నిర్మాణ అంచనాలు , నియాన్ లైట్ల వివరాలు సాంకేతిక అధికారులు పంపితే తక్షణమే ఆయా నిధులు మంజూరు చేస్తానని మంత్రి పేర్ని నానికి స్పష్టమైన హామీ ఇచ్చారు.
విభిన్న ప్రతిభావంతులకోసం కేంద్ర ప్రభుత్వ నీతిఆయోగ్ పర్యవేక్షణలో అమలు జరుగుతున్న సురక్షిత్ దాదా దీదీ, నానా నానీ అభియాన్ను మరింత ప్రయోజనకరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ స్వచ్ఛందసంస్థలకు సూచించారు. వారి వ్యక్తిగత సమస్యలను సైతం పరిష్కరించేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్ది ప్రతిఒక్కరి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమం అమలులో భాగస్వాములుగా వున్న జిల్లాలోని ఐదు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కార్యక్రమ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న వికలాంగుల పునర్నిర్మిత కేంద్రం ప్రాజెక్టు అధికారి వి.విజయ్ కుమార్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్తో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. నీతిఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యకలాపాలపై నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. ఈ సందర్భంగా ఐదు స్వచ్ఛందసంస్థలు ఏయే అంశాల్లో పనిచేస్తున్నదీ కలెక్టర్ తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగస్వాములైన వరల్డ్ విజన్, నీడ్, స్వార్డ్, నేచర్, లెప్రసీ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తమ సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా వారు వి.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి జల అవార్డు సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ను సత్కరించారు.
విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహం వున్న ప్రాంతాన్ని అత్యంత సుందరమైన కూడలిగా రూపొందించనున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. జ్యోతిరావుపూలే విగ్రహం ఉన్న ప్రదేశాన్ని మునిసిపల్ ఇంజనీర్ కె.దిలీప్, బి.సి.కార్పొరేషన్ ఇ.డి. నాగరాణితో కలసి మంగళవారం సందర్శించారు. జ్యోతిరావుపూలే విగ్రహం పక్కనే సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా త్వరగా ఏర్పాటు చేయాలని బి.సి.కార్పొరేషన్ ఇ.డి. నాగరాణిని ఆదేశించారు. ఈ ప్రాంతంలో ఒక వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేసి అత్యంత సుందరంగా రూపొందించాలని మునిసిపల్ ఇంజనీర్ దిలీప్కు సూచించారు. దండుమారమ్మ ఆలయానికి ఇదే దారిగా ఉన్నందున ఆలయానికి వెళ్లే దారిని సూచిస్తూ ఒక సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలన్నారు. జ్యోతిరావుపూలే విగ్రహం స్పష్టంగా కనిపించేలా పైన వున్న చెట్ల కొమ్మలు తొలగించాలని చెప్పారు. ఏ.సి.బి. కార్యాలయానికి వెళ్లే ప్రాంతంలోనూ ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు.ఈనెల 28న జ్యోతిరావుపూలే వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లను కూడా తెలుసుకున్నారు.
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) మంగళవారం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్రత్యేక కార్యమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా తొమ్మిది రోజుల పాటు చండీయాగం జరుగనుంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం పూజ, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. 1949 నవంబరు 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలో ఆమోదించిన రోజును పురష్కరించుకుని దీనిని నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 26వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని, అన్ని కార్యాలయాల్లోనూ దీనిని ఆచరించాలని ఆయన ఆ ప్రకటనలో ఆదేశించారు. రాజ్యాంగ దినోత్సవం పట్ల ప్రతీ ఉద్యోగి, ప్రతీశాఖ సిబ్బంది పూర్తి అవగాహన కల్పించుకోవాలన్నారు. రాజ్యాంగం ద్వారా సిద్ధించిన హక్కులను కూడా తెలుసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
నివర్ తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని వి సి హాల్ నుండి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసు బాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, నివర్ తుఫాన్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇదివరకే వీసీ నిర్వహించి సూచనలు జారీ చేశారన్నారు. జిల్లాలో జిల్లా కేంద్రం తో సహా డివిజన్, మండల స్థాయి లో కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం ఇరిగేషన్ కింద ఉన్న చెరువులు దెబ్బతినే అవకాశమున్నందున అందుకు సంబంధించి మైనర్ ఇరిగేషన్ అధికారులతో టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెండు రోజులపాటు తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అధిక వయసు గల ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తుఫాన్ కారణంగా తీవ్ర గాలులు వీయనున్న నేపథ్యంలో రేకుల షెడ్లు గాలికి ఎగిరి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామాల్లోని వాలంటీర్లతో టాంటాం వేయడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు. బలమైన గాలుల వలన విరిగిపడే చెట్లను తొలగించేందుకు విద్యుత్ రంపాలను ఉపయోగించి తొలగించడం జరుగుతుందని ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వివరించారు. నివర్ తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఆరోగ్య శిబిరాలు కూడా ఎక్కువగా ఏర్పాటు చేసేవిధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు.
విజయనగరం జిల్లాలోని కనపాక లో నిలయమైన శ్రీ దండుమారమ్మ అమ్మవారి గుడి ని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ గురువారం సందర్శించారు. గుడి కార్యవర్గ సభ్యులు, దేవస్థానం కార్యదర్శి రాకోటి అప్పల నాయుడు తదితరులు, పురోహితులు కలెక్టర్ ను సాదరంగా ఆహ్వానించి పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు అందజేసారు. గుడి విశిష్టతను వివరిస్తూ గుడిని పునర్న్ర్మించి 10 సంవత్సరాలు నిండాయని, నవంబర్ 24 న దశమ వార్షికోత్సవం జరుపుతున్నామని, ఈ సందర్భంగా హోమం, ప్రత్యెక పూజలు నిర్వహిస్తున్నామని నిర్వాహకు లు కలెక్టర్ కు వివరించారు. దర్శన అనంతరం గుడి పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ ఔషధ మొక్కలు, పర్యావరణానికి ఉపకరించే మొక్కలను ఖాళీప్రదేశాల్లో వేయాలని కోరారు. గుడి ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా తయారు చేయడానికి పలు సలహాలు, సూచనలు అందజేసారు. గుడి కి వెళ్ళే మార్గం లో ప్రవేశద్వారం తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయిస్తానని కలెక్టర్ గుడి నిర్వాహకులకు తెలిపారు. గుడికి వెళ్ళే మార్గాల్లో, కల్లెక్టరేట్ వద్ద భక్తులకు తెలిసేలా అమ్మవారి ఫోటోలు పెట్టి సైన్ బోర్డు లను పెట్టాలని సూచించారు.
మీ ఇంటినైతా ఇంత పిచ్చితుప్పల మధ్య ఇలానే ఉంచుకుంటారా.. మనం పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు దేవాలయాలు లాంటివని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని పోలిపల్లి సచివాలయం సిబ్బందిని హెచ్చరించారు. సచివాలయం వద్ద ఉన్న విశాలమైన స్థలంలో పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండడం పట్ల సెక్రటరీ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సచివాలయ సిబ్బంది, అంగన్వాడి, ఆశా, వాలంటీర్లను పిలిచి అప్పటికప్పుడే శ్రమదానం చేసి పిచ్చి మొక్కల్ని తొలగించారు. కలెక్టర్ స్వయంగా మొక్కలు తీయడం తో సిబ్బంది అందరు సైన్యం లా పాల్గొని 10 నిమిషాల్లో ప్రాంగణమంతా పరిశుభ్రం చేసారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి ఉపయోగ పడే మొక్కల్ని పెంచాలని, ఇంకోసారి వచ్చేటప్పటికి మొత్తం పచ్చదనం ఉండాలని కార్యదర్శి కి సూచించారు. సచివాలయాల వద్ద పరిశుభ్రంగా ఉంచక పోతే చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎం.పి.డి.ఓ బంగారయ్య, తహసిల్దార్ రాజేశ్వర రావు, ఉప తహసిల్దార్ గాంధీ, కార్యదర్శి త్రినాధ రావు, మండల వ్యవసాయా ధికారి, మండల ఇంజినీర్, వాలంటీర్ లు పాల్గొన్నారు.
గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది అందరూ పని చేసే చోటనే నివాసం ఉన్ననాడే ప్రజలకు సత్వర సేవలను అందించగలరని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల అన్నారు. బయట నుండి విధులకు వస్తున్న సిబ్బంది పై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. భోగాపురం మండలం పోలిపల్లి, సవరవిల్లి గ్రామాల సచివాలయాలను గురువారం కలెక్టర్ తనిఖీ చేసారు. సచివాలయ సిబ్బంది పంచాయతి కార్యదర్శి, వి. ఆర్. ఓ, ఎ.ఎన్.ఎం., మహిళా రక్షణ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ల తో మాట్లాడి వారు చేస్తున్న పనుల పై ఆరా తీసారు. వై.ఎస్.ఆర్ జల కళ, ఈ- రిక్వెస్ట్ లు, నవశకం, , పించన్ల పంపిణీ, జగనన్న తోడు, తదితర పధకాల అమలు తీరు పై సమీక్షించారు. గడువు లోగా పరిష్కారం కాని ఈ- సర్వీసెస్ ఫై వివరణలను అడిగారు. గడువు లోగా పరిష్కరించకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ సర్వీసెస్ పర్యవేక్షణ పై పంచాయతి, వార్డ్ సెక్రటరీ పూర్తి బాధ్యతలు తీసుకోవాలని, దరఖాస్తులను గడువులోగా పరిష్కరించేలా చూడాలని సూచించారు. హెల్త్ అసిస్టెంట్ కోవిడ్ పై గ్రామం లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, మాస్క్ వాడడం, భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు చేతులు కడుక్కోవడం పై అవగాహన పెంచాలన్నారు. అదే విధంగా గర్భిణీ లకు ఎప్పటికప్పుడు హీమోగ్లోబిన్ తనిఖీ చేసి రక్త హీనత కలగకుండా పౌష్టికాహారం ఎలా తీసుకోవాలనే అంశాలను వివరించాలన్నారు. జిల్లా పరిషత్ సి.ఈ.ఓ తో టెలి ఫోన్ లో మాట్లాడుతూ పనిచేసే చోట నివాసం ఉండాలని, ఉదయం పూట ఎలాంటి సమావేశాలు ఉండకుండా సచివాలయాలకు హాజరయ్యేలా ఒక సర్కులర్ ఇవ్వాలని, ఉదయం సచివాలయ సిబ్బంది కేవలం ప్రజలకు అందుబాటు లో ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరమైతేనే సచివాలయం విడిచి బయటకు అనుమతి తో వెళ్ళాలని అన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ ల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పధకాల పై అవగాహన కల్పిస్తూ వాటి ఫలాలు ప్రజలకు చేరువయ్యేలా పనిచేయ్యలన్నారు.