గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. బూర్జ మండలం వైకుంటపురం గ్రామంలో మూడు లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను సభాపతి మంగళవారం పంపిణీ చేసారు. అల్లిపల్లి గూడ గ్రామంలో గిరిజనులకు అటవీ హక్కుల చట్టం క్రింద పట్టాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు భూమిపై ఆధారపడతారని, వేరే వృత్తులపై ఆధారపడరని అన్నారు. అందుకే గిరిజనులకు రెండు ఎకరాల భూమి చొప్పున పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నాగరికతకు దూరంగా బ్రతుకుతున్న గిరిజనులను ఆదుకునే మంచి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో గిరిజనులకు పట్టాలు అందించి వ్యవసాయం చేసుకోవడానికి హక్కు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో గిరిజన గ్రామలకు సరైన రహదారి సౌకర్యం కల్పించుటకు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. గిరిజన గ్రామాల్లో సోలార్ సిస్టం ద్వారా త్రాగునీరు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ సి.హెచ్.శ్రీధర్, ఆర్.డి.ఓ ఐ.కిశోర్, సరుబుజ్జిలి బూర్జ తహశీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాకు మూడు కొత్త అంబులెన్సులు, డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఒక బస్సును శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అందజేసారు. మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అంబులెన్సులను, బస్సును పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ జె నివాస్ కు అందజేసారు. మూడు అంబులెన్సులలో ఒక అంబులెన్సును ఐటిడిఏకు, ఒక అంబులెన్సును డి.ఎం.హెచ్.ఓ కార్యాలయానికి, మరో అంబులెన్సును శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు అందేజేయగా, అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి బస్సును అందజేసారు. బస్సు విలువ రూ.26.74 లక్షలు కాగా, ఒక్కో అంబులెన్సు విలువ రూ.21.94 లక్షలు వెరశి రూ.92.56 లక్షలు వెచ్చించారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, గత 6 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్న తాను ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నానని చెప్పారు. దూర ప్రాంతాలకు చెందిన వారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు చెందిన వారు సకాలంలో వైద్యం పొందుటకు సమస్యలు ఎదుర్కోవడం జరుగుతోందని చెప్పారు. వెంటనే వైద్య సదుపాయం కలుగుటకు అంబులెన్సు అవసరమని గుర్తించి అంబులెన్సులను అందిస్తున్నామని పేర్కొన్నారు. అంబులెన్సులో వైద్యం త్వరిగతగతిన అందుతుందని చెప్పారు. గతంలో రెండు అంబులెన్సులు సరఫరా చేసామని చెప్పారు. విశ్వవిద్యాలయ విద్యార్ధులు క్షేత్ర స్ధాయి పర్యనటలకు వెళ్ళుటకు ఇబ్బందులకు గురి అవుతున్నారని దానిని అధిగమించుటకు బస్సును పంపిణీ చేసామని చెప్పారు. మౌళికసదుపాయాల ఇబ్బందులను తొలగించుటకు ఎంపిల్యాడ్ నిధులు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొంటూ ఆ నిధుల విడుదలను పునరుద్దరించాలని కోరారు. జిల్లా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కావాలని ఆయన ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ఎం.పిల్యాడ్ నిధులను ఆరోగ్య అవసరాలకు ఉపయోగించడం ముదావహమన్నారు. సకాలంలో అవసరమైన చికిత్స పొందుటకు దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.కూన రాంజీ, రిజిస్ట్రార్ ప్రొ.కె.రఘుబాబు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్, సర్వజన ఆసుపత్రి సూపరింటిండెంట్ డా.ఏ.కృష్ణమూర్తి, ఆర్.ఎం.ఓ డా.ఆర్.అరవింద్, వైద్యులు డా.ప్రభాకర్, డి.ఎం.హెచ్.ఓ డా.కె.సి.నాయక్, ముఖ్య ప్రణాళికఅధికారి ఎం.మోహన రావు తదితరులు పాల్గొన్నారు.
కోడి రామ్మూర్తి స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తిచేసి క్రీడాకారులకు అంకితం చేయడమే ఆయనకు అందించిన ఘన నివాళి అని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అభిప్రాయపడ్డారు. కోడి రామ్మూర్తి జయంతి కార్యక్రమం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని కోడి రామ్మూర్తి విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోడి రామ్మూర్తి జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మారుమూల ప్రాంతంలో జన్మించిన కోడి రామ్మూర్తి మల్లయోధునిగా కీర్తిని ఆర్జించి జిల్లాకు మంచి పేరును తీసుకువచ్చిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన మల్ల విద్యను ఒక ఆటలా కాకుండా సాధనతో ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన మహానుభావుడని అన్నారు. ఏదైతే ఆయన పేరుతో స్టేడియంను పునర్మిర్మాణం చేపడుతున్నామో దానిని సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు విడుదల కావలసి ఉందని, దీనిపై ప్రభుత్వానికి, సాప్ మేనేజింగ్ డైరక్టర్ కు ప్రత్యేకంగా లేఖను రాయడం జరిగిందన్నారు. ఆ నిధులు విడుదలైతే త్వరితగతిన స్టేడియం నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. కోడి రామ్మూర్తి జిల్లాకు అందించిన సేవలకు గుర్తుగా ఈ స్టేడియంను అద్భుతంగా తీర్చిదిద్ది, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, జిల్లా ఉపాధికల్పన అధికారి జి.శ్రీనివాసరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు యం.వి.రమణ, సీనియర్ పాత్రికేయులు కొంక్యాన వేణుగోపాల్, ఎ.యుగంధర్, యస్.జోగినాయుడు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల కోసం కేటాయించిన నిధులు శత శాతం వారికోసమే ఖర్చు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ అధికారులకు ఆదేశించారు. అనేక పథకాల అమలులో మనం ముందున్నామని , అదే స్పూర్తిని గిరిజనుల సంక్షేమం లో కూడా చూపించాలని అన్నారు. సమర్ధవంతమైన గ్రామ సచివాలయ వ్యవస్థ పని చేస్తోందని, ప్రతి ఇంటికి వెళ్లి లబ్ది పొందని గిరజునులకు లబ్ది పొందేలా చూడాలి అన్నారు. మంగళవారం కలక్టరేట్ ఆడిటోరియంలో గిరిజన ఉప ప్రణాళిక పై జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో 2019-20, 202౦-21 సంవత్సరాలలో నిర్దేశించిన లక్ష్యాలను, ప్రగతిని ప్రాజెక్ట్ అధికారి ఆర్. ఉర్మనాథ్ తో కలసి కలెక్టర్ సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న సచివాలయయాల పోస్టులను త్వరగా నింపాలని జిల్లా పరిషత్ సి .ఈ.ఓ కు సూచించగా ఈ నెల 5 నుండి దరఖాస్తుల పరిశీలన ఉందని, 11నాటికీ పోస్టులన్నీ నియమించడం జరుగుతుందని సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాలపై గిరిజనులకు అన్ని రకాల సహకారం అందేలా చూడాలన్నారు. ఏ ఒక్క రైతుకు రైతు భరోసా లబ్ది పెండింగ్ ఉండకూడదని అన్నారు. రెండు రోజులు పార్వతీపురం లో ఉండి ఇంటితటికి వెళ్లి సర్వే చేసి ప్రతి రైతు కవర్ అయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆశ దేవిని ఆదేశించారు. అలాగే గిరిజన రైతులు పండించే తృణ ధాన్యాలను ఎగుమతి చేసుకునేల వారికి మార్కెటింగ్ స్కిల్ల్స్ ను నేర్పించాలన్నారు. అందుకోసం వచ్చే మూడేళ్ళకు ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. వారు పండించే పంటలకు జాతీయ మార్కెటింగ్ లో నిలిచే ప్రమాణాలు ఉండాలని, ఆ విధంగా వారికీ అవగాహన, శిక్షణలు కల్పించాలని అన్నారు. ప్రతి గ్రామానికి తాగు నీటి ప్రాజెక్టులు , రహదారులు ఉండాలని, విద్యుత్ లేని గ్రామం, వార్డ్ ఉండకూడదని అన్నారు. ఏ గ్రామం అయనా విద్యుత్ లేకుండా ఉన్న, లో వోల్టేజ్ సమస్య ఉన్న మండల ప్రత్యేకాధికారులు గుర్తించి విద్యుత్ శాఖాధికారికి వివరాలను అందజేయలన్నారు. గిరిజన రైతులందరికీ అవసరమైన మోటర్లు ఇవ్వాలని, అవసరమైతే అదనపు ట్రాన్స్ ఫార్మర్ లను కూడా ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ విద్యుత్ శాఖ ఎస్.ఈ. విష్ణు కు ఆదేశించారు.
గర్భిణీల వివరాలు ముందే తెలుస్తాయి కనుక వారి ప్రసవానికి ముందస్తు ఏర్పాట్లను గావించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రమణ కుమారికి సూచించారు. డోలి లలో గర్భిణీలను తీసుకు వెళ్ళడం, దారిలోనే ప్రసవాలు జరగడం చూస్తున్నామని, అలంటి పరిస్థితి నుండి బయట పడాలని అన్నారు. గర్భిణీల కోసం మహిళా హోస్తేల్స్ ను నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలని అన్నారు. గర్భిణీలను నిరంతరం పర్యవేక్షిస్తూ వారిని హాస్పిటల్ లో కానీ, వసతి గృహం లో కానీ ఉంచి సుఖ ప్రసవం జరిగే వరకు వారిని పర్యవేక్షిన్చాలన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వార గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం అమలు జరుగుతోందని, ఈ పథకం ద్వార శిశువుల, తల్లుల ఆరోగ్యాన్ని పరీక్షించాలని తద్వారా వారిలో అనారోగ్య సమస్యలుంటే ముందుగానే గుర్తించ వచ్చని అన్నారు. అలా గుర్తించిన వివరాలతో ప్రతి మూడు నెలలకోసారి మధ్యంతర నివేదికనందించాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి కి ఆదేశించారు. అటవీ శాఖ ద్వారా పచ్చదనాన్ని పెంచడమే కాకా గ్రిజనులకు వాణిజ్య పరంగా ఉపయోగ పడే మొక్కలను పెంచేలా చూడాలని అటవీ శాఖాధికారులకు సూచించారు. గుమ్మిడి గెడ్డ ప్రాజెక్ట్ కోసం నిధులు రాబట్టడానికి లేఖ రాయాలని జలవనరుల శాఖాధికారులకు సూ చించారు.
తొలుత పార్వతీపురం ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్. కుర్మనాథ్ మాట్లాడుతూ ప్రతి శాఖ తన నిధుల్లో 6.6 శాతం గిరిజన అభివృద్ధికి ఖర్చు చేయాలనీ, అయితే కొన్ని శాఖలు ఇంకను వారి లక్ష్యాన్ని చేరుకోలేదని అన్నారు. జిల్లా కలెక్టర్ గారి దిశా నిర్దేశం లో రాష్ట్రం లోనే అత్యధికంగా 50 వేల అటవీ హక్కుల పట్టాలను అందించాగలిగామని, అదే స్పూర్తి తో మిగిలిన పథకాలను కూడా గిరిజనులకు అందేలా కృషి చేయాలనీ అధికారులను కోరారు. లబ్ది దారుల వద్దకే వెళ్లి అటవీ హక్కుల పట్టాల అర్హులను గుర్తించామని, , వాలంటీర్ ల సహాయం తో ప్రభుత్వ పథకాలు గిరిజనులకు చేర్చడం లో లక్ష్యాలను సాధించాలని అన్నారు.
ఈ సమావేశం లో జిల్లా అటవీ అధికారి సచిన్ ,సహాయ కలెక్టర్ సింహాచలం, జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్ లు తదితరులు హాజరైనారు.
విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల ప్రగతిపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. మంగళవారం దాడి వీరు నాయుడు కళాశాల వార్షిక సంచిక, వెబ్సైట్లను ఆయన తన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ, విద్యాసంస్థలు నాణ్యతా ప్రమాణాలతో విద్యనందించాలన్నారు. కళాశాలలు, విద్యాసంస్థలు వెబ్ సైట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యార్ధులకు ఎలాంటి సమాచారమైనా తక్షణమే అందించడానికి వీలుపడుతుందన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యాసంస్థలు ముందుకు సాగాలన్నారు. ఆ విషయంలో దాడివీరునాయుడు కళాశాల మంచి ప్రగతి సాధిస్తుందని కితాబునిచ్చారు. విద్యాసంస్థ యొక్క సమస్త సమాచారం వెబ్ సైట్ లో పొందుపరచడం ద్వారా విద్యార్ధులకు ఉపయుక్తంగా వుంటుందని విసి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.రవీంద్రనాథ్ బాబు, విద్యాసంస్థల చైర్మన్ దాడి రత్నాకర్, కళాశాల ప్రిన్సిపాల్ కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించిన నేపథ్యంలో అన్ని పాఠశాలలోనూ కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం రాప్తాడు మండలం లోని హంపాపురం ఎంపీయూపీ పాఠశాలను జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా రక్షించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు ఎలా భోదిస్తున్నారు అనే విషయం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జెసి మాట్లాడారు. అంతకుముందు హంపాపురం గ్రామ సచివాలయాన్ని జెసి సిరి పరిశీలించారు. రిజిస్టర్ లను, ఉద్యోగుల హాజరు పట్టికను తనిఖీ చేశారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చేసి సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, ఎంపీయూపీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండల పరిధిలోని హంపాపురం గ్రామ సచివాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల ఈవో ఆర్డీ మాధవీలత, ఎంఈఓ మల్లికార్జున పంచాయతీ సెక్రెటరీ చరణ్ గ్రామ వాలంటరీలు మాత్రమే హాజరయ్యారు. మిగతా ఉద్యోగులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ రికార్డులను పరిశీలించారు ఉద్యోగులు విధులకు సరిగ్గా హాజరు కావడం లేదని మందలించారు గ్రామ వాలంటరీలు మాస్కులు తప్పని సరిగా ధరించాలన్నారు లేనిపక్షంలో విధులకు హాజరు కావద్దన్నారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్ అస్తవ్యస్తంగా ఉండడంతో మందలించారు ఆర్డీవో కి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే రాప్తాడు మండల వ్యాప్తంగా సచివాలయాల్లో విఆర్వోలు సరిగా విధులకు హాజరు కావడం లేదు అంటూ మండిపడ్డారు వన్ బి అడంగల్ మినహా మిగతా ఆన్ లైన్ సేవలు ప్రజలకు అందించకపోవడాన్ని తప్పు పట్టారు ప్రతి సచివాలయంలోను ఇదే సమాధానం చెబుతున్నారు మిగతా సేవలు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది ప్రజలకు అన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది కానీ సచివాలయ ఉద్యోగస్తులు ప్రజలకు సరైన సమాచారాన్ని తెలియ చేయకపోవడం,ఆన్ లైన్ సేవలు అందించకపోవడం సరైన పద్ధతి కాదన్నారు ఇలాగే కొనసాగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జాతీయ రహదారుల్లో ప్రమాదాలను నియంత్రించేందు తిరుపతి అర్భన్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. నేషనల్ హైవే, బైపాస్ రోడ్లలో ముఖ్యమైన ప్రదేశాల్లో స్టాపర్లను ఏర్పాటు చేశారు. తద్వారా వాహనాల వేగాన్ని తగ్గించడంతోపాటు, ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చునని తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి చెబుతున్నారు. లాక్ డౌన్ సడలింపు తరువాత అధికంగా వాహనాలు రోడ్లపై వస్తున్న సందర్భంలో హైవే మార్గం ద్వారా పట్టణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు డైవర్ట్ అయ్యే సందర్బంలో తరచు ప్రమాదాలను గమనించి ఈ ఏర్పాట్లు చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా అంతట బైపాస్ ల నుండి డైవర్ట్ అయ్యే ప్రాంతాలు, అదిక మలుపు గల ప్రదేశాలను గుర్తించి అక్కడ బ్యారికేట్స్, స్టాపర్స్, మార్కింగ్లు చేసినట్టు ఎస్పీ వివరించారు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. అనునిత్యం వీటిని పర్యవేక్షిస్తున్నట్టు ఎస్పీ వివరించారు.
వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు జాప్యం లేకుండా సేవలు అందాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జివిఎంసి పరిధిలోని చట్టివాని పాలెం 60వ వార్డు సచివాలయాన్ని ఆమె ఆకస్మిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సచివాలయాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పధకాల జాబితాను పరిశీలించారు. సచివాలయ కార్యదర్శులు జాబు చార్టు పరంగా వారు నిర్వహించే విధులను గురుంచి అడిగి తెలుసుకున్నారు. వారు పనిచేసే పనిని పరిశీలించే నిమిత్తం వారి హాజరు, మూమెంట్ రిజిస్టర్, డైరీ మొదలైనవి పరిశీలించి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని వారి సేవలు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయ పరిధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం, శ్రీహరిపురం లోని గుల్లలపాలెం పార్కు నందు స్విమ్మింగ్ పూల్ ప్రతిపాదనలను పరిశీలించారు మరియు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని పెవిలియన్ మరమ్మత్తు పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీరు రాజా రావు, అయిదవ జోనల్ కమిషనర్ శ్రీధర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు వేణుగోపాల్, మెహెర్ బాబా, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు ప్రసాద బాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభాగస్వామ్యంతో పల్లెల సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అన్నారు. సోమవారం ఉదయం ఆయన సోమవారం ఆయన బందరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో 79 లక్షల 30 వేల రూపాయల వ్యయంతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్ర భవనాలకు శంఖుస్థాపన చేశారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. నన్ను నిలదీయాల్సిన సమస్యలు మీ ఊర్లో ఏమైనా ఉన్నాయా ? అని గ్రామస్తులను ప్రశ్నించి స్థానిక సమస్యలను తనదైన శైలిలో అడిగి తెలుసుకొన్నారు. గ్రామంలో అంగన్వాడీ భవనం కావాలని గ్రామస్తులు కోరారు. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని ఆ భవన నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియచేయాలని ఏ ఇ ను అడిగారు. 8 లక్షల రూపాయల వ్యయం అవుతుందని ఆ అధికారి తెలిపారు. ఎన్ ఆర్ జె ఎస్ నిధుల కింద ఆ నిర్మాణంకు నిధులు మంజూరు చేస్తానని ఎస్టిమేషన్ ఇవ్వాలని కోరారు. అలాగే విద్యార్థిని విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాఠశాల భవనం ఇరుకుగా ఉంటుందని రెండు గదులు నిర్మించితే పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుందని గ్రామస్తులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆ రెండుగడుల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియచేయాలని ఏ ఇ తోట లక్ష్మే నారాయణను అడిగారు.. ఒక్కో గది నిర్మాణానికి 2 లక్షల రూపాయల వరకు వ్యయం కానున్నట్లు ఆయన తెలిపారు. సార్వాకు సాగునీలు వస్తుందా అని రైతులను ఉద్దేశించి మంత్రి వాకబు చేశారు. వెంటనే కొందరు రైతులు పంట కాలువ ప్రవాహాన్ని అడ్డుకొంటూ ఎగువ ప్రాంతాలలో రైతులు , చేపల పెంపకందార్లు నీటిని మళ్లిస్తూ ఎవరికివారు అక్రమ తూములు నిర్మించుకొంటున్నారని దాంతో దిగువకు నీరు పారని పరిస్థితి ఏర్పడిందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే ఆ ప్రాంతాలను తనిఖీ చేయాలనీ తూములు ఎక్కడెక్కడ ఊన్నాయి ? ఏ ఏ సైజులలో అక్కడ ఎవరెవరు ఏర్పాటుచేసుకొన్నారోనన్న వివరాలతో సిద్ధంగా ఉండాలని వచ్చే వేసవికాలం నాటికి ఆ అక్రమ తూములు ఏమీ లేకుండా చేయాలనీ నీటిపారుదల అధికారి మురళికు మంత్రి ఆదేశించారు. తన తల్లి పక్షవాతంతో ఎంతో ఇబ్బందిపడుతుందని ఆమెకు పింఛన్ వచ్చే అవకాశం ఉందా అని మంత్రిని అభ్యర్ధించింది. వికలత్వం పరిశీలించి సెర్టిఫికెట్ ఇచ్చే సదరం స్లాట్ మొదలైందని అక్కడ ఇచ్చే పత్రం ద్వారా పింఛన్ మంజూరైతే నెలకు 5 వేలు వస్తుందని అన్నారు. ఆమెను అక్కడకు ఎలా తీసుకురావాలని ఒక వ్యక్తి అడగ్గా అంబులెన్సు లో రప్పించకూడదా ? అని మంత్రి జవాబు ఇచ్చారు. గ్రామంలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదని గుడ్డి దీపాలు మాదిరిగా చీకట్లో కనిపిస్తున్నాయని ఒక గ్రామస్తుడు తెలిపాడు. లోవోల్టేజ్ సమస్య అరికట్టాలని విద్యుత్ అధికారులను సూచించి , విద్యుత్ స్తంభాలకు నంబర్లు రాయకపోవడం చేత ఏ స్థంభం వద్ద వీధి దీపం వెళదాం లేదోనన్న సంగతి ఎలా చెబుతారని మంత్రి ప్రశ్నించారు. పొట్లపాలెం గ్రామం ముఖద్వారం వద్ద నివసించే చొప్పరపు నాగేశ్వరరావు తమ ఇంటి సమీపంలో ఉన్న వీధిదీపం వెలిగి నెలలు కాలం అయిందని మంత్రికి ఆరోపించారు. ఈ గ్రామసభలో మచిలీపట్నం మాజీ జెడ్ పీ టీ సి సభ్యులు లంకె వెంకటేశ్వరరావు ( ఎల్వీయార్ ) , మచిలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబు, పోతిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ మేకా లవ కుమార్( నాని ) , రురల్ ఎస్ ఐ ఎన్ ఎల్ ఎన్ మూర్తి, వి ఆర్వో ప్రసాద్, నాగబాబు , మరియన్న, ఆర్ ఐ యాకూబ్ , హోసింగ్ , విద్యుత్ , ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
నిరంతరం ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఆలోచన అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఏర్పాటుచేసిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో కోవిడ్, ప్రైమరీ సెక్టార్, ఇరిగేషన్ యాక్టివిటీస్, రూరల్ వాటర్ సప్లై, ఉపాధి హామీ కన్వర్జెన్స్ పనులు, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయాలు, నాడు నేడు, సివిల్ సప్లైస్ కి సంబంధించి సమీక్ష నిర్వహించారు.
సమీక్ష సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ మంత్రివర్యులు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి సమావేశంలో ఉదయం నుండి సాయంత్రం వరకు 9 అజెండా అంశాలపై విపులంగా చర్చించామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకమారు డి ఆర్ సి మీటింగ్ నిర్వహించాల్సి ఉందన్నారు. గత తొమ్మిది నెలల కాలంగా కరోనా మహమ్మారి ప్రబలి ఉన్న కారణంగా సమావేశం నిర్వహించడంలో ఆలస్యమైందన్నారు. జిల్లాలో సమర్థవంతంగా కోవిడ్ సమస్యను అధిగమించామని 46 లక్షల జనాభాకు ఆరు లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 590 మంది కోవిడ్ మరియు ఇతర అనారోగ్య సమస్యలతో మరణించారన్నారు. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలోని ఇతర ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామన్నారు. అయితే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులను వ్యాధిగ్రస్తుల నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తెచ్చారన్నారు. అలా డబ్బులు ఇవ్వని వారికి ఆరోగ్యశ్రీ లో చికిత్సలుచేయడం లేదని తెలిపారన్నారు. పది రోజుల్లో జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ వారితో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్యం చేయాలని, అదనంగా డబ్బులు వసూలు చేస్తే వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ పరిధి నుండి తొలగిస్తామని మంత్రి హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట ఆశించిన దిగుబడి రాలేదని, జిల్లాలో 4,74,000 ఎకరాల్లో వేరుశనగ, పత్తి, జొన్న పంట సాగు చేయగా, 80 శాతం వేరుశనగ సాగుచేశారన్నారు. దిగుబడి వచ్చే సమయంలో అధిక వర్షాలు కురిసి ఆయా పంటలకు నష్టం జరిగిందన్నారు. జిల్లాలో 80 శాతం వేరుశనగ పంట వేసినప్పటికీ చెట్టు పెరిగిందే కానీ కాయలు రాలేదని వచ్చిన పంట కూడా అధిక వర్షాల వల్ల దెబ్బతిందని ప్రజా ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చారన్నారు. వైయస్సార్ బీమా సౌకర్యం కింద బీమా చెల్లింపు కేంద్ర ప్రభుత్వం పథకం నుండి తప్పుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అయితే బీమా కింద కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు కారణంగా రైతులకు బీమా సౌకర్యం కల్పించడం లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్ని గుర్తించి ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు ఆదుకునేందుకు నష్టపరిహారంగా రైతులకు పరిహారం అందించాలని తీర్మానం చేశామన్నారు. ఇప్పటికే ఈ అంశం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను జిల్లాకు పంపించి జిల్లాలో ఏర్పడిన నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకొని నష్టపోయిన రైతులను ఆదుకుంటారన్నారు. జిల్లాలో వికలాంగుల కోసం సదరన్ సర్టిఫికెట్ల జారీ గత పది నెలలుగా చేపట్టలేదని, నవంబర్ 3 నుంచి 12 సెంటర్లలో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారన్నారు. అంతేకాకుండా వికలాంగుల కోసం ప్రత్యేకంగా మొబైల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరారన్నారు. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.
నీటి పారుదల అంశంపై సమీక్షించాలని గత సంవత్సర కాలంగా నీరు వదులుతున్న కొన్ని చెరువులకు నీరు రాలేదని ప్రజా ప్రతినిధులు తెలిపారన్నారు. అధికారంతో, దౌర్జన్యంతో కొందరు నీటిని తీసుకుంటున్నారని తమ దృష్టికి రాగా, ఒక కార్యాచరణ ప్రకారం నీటి విడుదల జరగాలని సూచించామన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులతో విజయవాడలో నీటిపారుదల శాఖ మాత్యులు అధికారుల సమక్షంలో ఏ ప్రాంతానికి ఎంత నీరు ఇవ్వాలో అన్ని చెరువులకు నీరు నింపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఎలాంటి మార్గాంతరణ లేకుండా జిల్లా ఎస్పీ, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపామన్నారు. కాలువలు బాగా చేయాలని, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం సకాలంలో నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రభుత్వ పథకాలకు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, అంగన్వాడీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు సిసి రోడ్లు కాలువల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. నెల రోజుల క్రితం బకాయిలు సంగతి చెప్పగా ప్రతి పైసా కూడా బకాయి లేకుండా ప్రభుత్వం చెల్లించిందన్నారు. అలాగే నాడు నేడు కింద కూడా బకాయిలను 100% చెల్లించామన్నారు. నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయల మేరకు పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఇందులో ఇదివరకే పది కోట్లు పనులకు ఆమోదం తెలిపామని, మిగిలిన ఐదు కోట్లకు ప్రతిపాదనలు పంపాలని, వీటిని మార్చిలోపు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. నాడు నేడు పనులు 85 శాతం పూర్తి కాగా, మిగిలిన 15 శాతం పనులు ఈ నెల 15లోపు పూర్తి చేయాలని ఆదేశించారన్నారు.
నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారని, అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమాచార లోపం ఉందని, ఈ సమావేశానికి హాజరయ్యే ముందు అన్ని అంశాలను సమీక్షించుకుని ఈ సమావేశానికి హాజరుకావాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇకపై ఇలాంటివి ఉపేక్షించబోమని హెచ్చరించారు. లేఅవుట్ డిక్లరేషన్ పై అలసత్వం ఉందని సమావేశంలో గ్రహించామని, ఇందుకోసం డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ తో మూడు రోజుల లోపు సమావేశం నిర్వహించాల్సి ఉందని డైరెక్టర్ను ఆదేశించామన్నారు. ఆ సమావేశంలో అధికారుల దృష్టి కి ప్రజాప్రతినిధులు సమస్యలను తీసుకురావాలని, విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకునేలా తాను డైరెక్టర్కు సూచించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అభిమతానికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలని, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. రెండు మూడు రోజుల్లో ఇసుకపై ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని, ఆ మేరకు జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూస్తామన్నారు. కరోనా సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేదలకు ఉచిత బియ్యం, కందిపప్పు లను అందించామని మంత్రి తెలిపారు. ఇంటింటికి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల నుంచి అమలు చేయనున్నామన్నారు. మంచి వాతావరణం, సుహ్రద్భావంతో సమస్యలపై చర్చించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. కోవిడ్ నేపథ్యంలో పాత్రికేయుల సమావేశంలో కి అనుమతించలేదని, అన్యధా భావించ రాదని మంత్రి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన విత్తన సబ్సిడీ, బీమా బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తి తో రైతే రాజు అని భావించే ప్రభుత్వం తమదని, రాష్ట్ర స్థాయి కార్యదర్శి డైరెక్టర్లను జిల్లాకు పంపి పంట నష్టాలను అంచనా వేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. 2017 -18 సంవత్సరానికి సబ్సిడీ అందజేయడంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నవాటిని మాత్రం ఇవ్వడం లేదని, మిగిలినవి సక్రమంగా ఉంటే 100 శాతం చెల్లించడం జరుగుతుందన్నారు. ఎవరి పైనా దాడి జరిగితే సహించేది లేదని, ప్రత్యేకించి ఎస్సీల పై దాడి జరిగితే ఉపేక్షించేది లేదని తెలిపారు. సూక్ష్మసేద్యం, బిందు సేద్యం పై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎక్కువమందికి మేలు కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మురుగునీరు శుద్ధి చేసే కార్యక్రమానికి అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, సంబంధిత ప్రాజెక్టు పై సాధ్యాసాధ్యాలపై మూడు రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని, అనంతరం డీపీఆర్ ను కూడా సిద్ధం చేసి ఇవ్వాలని ఏజెన్సీని ఆదేశించామన్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే హండ్రెడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ముడిపడి ఉందన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆర్థికవనరులు ఎంత అవసరమో చూసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక జాతి ప్రయోజనాల దృష్ట్యా పోలవరం పూర్తికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగిందని తెలిపారు. పోలవరం పూర్తి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పం అని, దివంగత నేత వైయస్ రాజశేఖర్రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని ఆయన తనయుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పొలవరాన్ని పూర్తి చేస్తారని మంత్రి తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోలవరం తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పి.ఎం.స్వా నిధి పథకం కింద 11,500 మంది వీధి విక్రయ దారులకు రూ.11.50 కోట్ల విలువైన మెగా చెక్ ను మంత్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, శమంతకమణి, వెన్నెపూస గోపాల్ రెడ్డి,మహమ్మద్ ఇక్బాల్,ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి, శ్రీధర్ రెడ్డి,తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి,ఉషాశ్రీ చరణ్, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్ రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి,జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్,సిరి జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో నవంబర్ 20 నుండి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్న పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలకు వారం రోజుల ముందుగానే ఘాట్ ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని రాష్ట్ర జలవననుల శాఖ మంత్రి డా.పి.అనిల్ కుమార్ ఆదేశించారు సోమవారం నగరంలోని పెద్ద మార్కెట్ రాఘవేంద్ర మఠం దేవాలయం పుష్కర ఘాట్, కర్నూలు-హైదరాబాద్ జాతీయ రహదారి పై గల మునగల పాడు పుష్కర ఘాట్ ల లో జరుగుతున్న నిర్మాణ పనులు, సౌకర్యాలను, ఏర్పాట్లును ఆయన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ తో కలిసి పరిశీలించారు. పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తుంగభద్ర నది పుష్కరాలు విజయవంతం కావాలంటే అన్ని సౌకర్యాలు పూర్తికావాల్సిన అవసరం వుందన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ పనుల్లో నాణ్యత తగ్గినా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు.. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే జె.సుధాకర్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె. బాలాజీ, ఇంచార్జి ఎస్ పి గౌతమి సాలి, జె డి సీఈఓ వెంకటసుబ్బయ్య, వివిధ శాఖల ఇంజనీరింగ్ ఎస్ ఈ లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు..
అనంతపురం జిల్లా అభివృద్ధిలో అన్ని రంగాలలో ముందువరసలో ఉందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జి పాలనలో ఉందని, రెగ్యులర్ సూపరింటెండెంట్ ను నియమించాలన్నారు. కరోనా వైరస్ మరోసారి వ్యాపించే అవకాశం ఉండడంతో, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. కోవిడ్ మరణాలు, పాజిటివ్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో టెస్టింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచడం జరుగుతుందని తెలిపారు. హెల్త్ వర్కర్ల లాగా కోవిడ్ పై పోరాటంలో పాల్గొనే రెవెన్యూ మరియు ఇతర అధికారులకు బీమా సౌకర్యం అందిస్తే బాగుంటుందని విన్నవించారు. నాడు నేడు కింద ఒక పాఠశాలలో ఒక కేటగిరి గా పెట్టడం జరిగిందని, జిల్లాలో 1280 పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఆయా పనులకు బడ్జెట్ మేరకు కేటాయించిన పనులు చేపట్టాలని, ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు పంపకుండా చూడాలని, ఎవరైనా కేటాయించిన బడ్జెట్ కన్నా ఎక్కువ నిధులకు ప్రతిపాదనలు పంపించినట్లు పరిశీలనలో తేలితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉల్లికల్లు గ్రామాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కిందకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు. రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణాలకు సంబంధించి స్థలం లేక నిర్మాణాలు జరగని ఏవీ లేవని, అన్ని భవనాలకు స్థలం అందుబాటులో ఉందన్నారు. అంగన్వాడి భవనాలకు సంబంధించి సగానికిపైగా స్థల సేకరణ పూర్తయిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణం, అంగన్వాడీ భవనాలకు సంబంధించి గ్రౌండింగ్ విషయంలో రిపోర్టు సరిగా ఇవ్వకపోవడంతో, వాటికి సంబంధించిన రిపోర్టర్ వెంటనే తనకు అందజేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద లేదా ప్రత్యేక కేటగిరీగా పరిగణించి దిగుబడిని కూడా బీమా కింద చేర్చేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద డబ్బులు వసూలు చేస్తే అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.
గడిచిన సంవత్సరకాలంలో మార్చి నుంచి ఇప్పటి వరకూ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించగా, కరోనా నేపథ్యంలో జిల్లాలో మౌలిక వసతులు తక్కువ ఉన్నా తక్కువ సమయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, కోవిడ్ ఆసుపత్రిలో సిబ్బంది నియామకం చేసుకోవడం నుంచి ఆస్పత్రిలో బెడ్ల సంఖ్య పెంచుకోవడం, ఆక్సిజన్ సరఫరా, పరికరాలు సమకూర్చుకోవడం, పరీక్షల సామర్థ్యాన్ని 0 నుంచి 10 వేల వరకూ చేసేలా పెంచుకోవడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో జిల్లాలో కరోనాను సమర్ధవంతంగా కట్టడి చేశామన్నారు. పాజిటివ్ 2 శాతంకన్నా తక్కువకు వచ్చిందని, కరోనా కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని, కరోనా కట్టడిలో మిగతా జిల్లాల కంటే మన జిల్లా మెరుగ్గా ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించి 15 లక్షల సర్వీసులకు పరిష్కారం చూపించామన్నారు. 92 శాతం సర్వీసులకు నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లాలో సచివాలయాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సమర్థవంతంగా సేవలను అందించామన్నారు. పెనుగొండలో మెడికల్ కళాశాలకు స్థలాన్ని సేకరించామన్నారు. ఐసిడిఎస్ పరిధిలోని పోషణ అభియాన్ లో అనంతపురం జిల్లా ముందువరుసలో ఉందని, గర్భిణీలకు అవసరమైన పోషకాహారాన్ని ఇస్తున్నామన్నారు. పెన్షన్ లను ఇంటి వద్దకు వెళ్లి ఇస్తున్నామని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకానికి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామని, ఉద్యోగుల నియామకానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఉద్యాన ఉత్పత్తులను దేశంలోనే రెండవ కిసాన్ రైలు ద్వారా అనంతపురం నుంచి ఢిల్లీ కి పంపించడం జరిగిందని, ఇందుకేజ్ ఎంపీ, ఎమ్మెల్యేల సహకారం అందించారన్నారు.
అలాగే ఉపాధి హామీ పథకం కింద జూన్, జూలై మాసంలో జిల్లాలో చాలా ఎక్కువగా ఉపాధి పనులు చేయించడం వల్ల ద్వారా రాష్ట్రంలోనే రెండవ అత్యధికంగా 500 కోట్లకు పైగా మెటీరియల్ కాంపౌండ్ జనరేట్ చేయడం జరిగిందని, దీని ద్వారా రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ, సచివాలయాల భవనాలు లాంటి ఎన్ని భవనాలైన కట్టుకోడానికి వెసులుబాటు ఉందన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద ఓకే రోజు 6 లక్షల 40 వేల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ చంద్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ ఆరోగ్య కేంద్రాలు సచివాలయాలు అంగన్వాడీలో నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదే క్రమంలో రోడ్ల నిర్మాణం, సామగ్రి కొనుగోళ్ళు ఉండాలని సూచించారు వీలైనంత వేగంగా పనులను పూర్తి చేయాలని, మంజూరు చేసిన నిధులను ఖర్చు పెడుతూ పనులను పురోగమింప చేయాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారము నిర్మాణాలు ఖర్చు ఉండాలని, అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, మందకొడిగా సాగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తం అభివృద్ధి పథకాలకు ఇచ్చిన నిధులను సకాలంలో ఖర్చు చేస్తేనే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్ వెంకటేశ్వర్, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుధాకర్ రెడ్డి, డ్వామా పథక సంచాలకులు సందీప్, గృహ నిర్మాణ శాఖ పీడీ జయరామ ఆచారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రవికుమార్ ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా సైనిక స్కూల్ లో ప్రవేశాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ డైరక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్-2021 వారు 6 వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశాలకు జనవరి 10వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు డైరక్టర్ తెలిపారు. దేశంలోని 33 సైనిక పాఠశాలలో ప్రవేశాలకు అవకాశం వుంటుందన్నారు. ఈ ఎగ్జామినేషన్ వ్రాత పరీక్ష ద్వారా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వుంటాయని తెలిపారు. 6 వ తరగతిలో ప్రవేశాలు బాలికలకు మాత్రమే అవకాశం వుంటుందని, వారు 31.03.2021 నాటికి 10 నుండి 12 సం.లలోపు వయస్సు కలిగి వుండాలని తెలిపారు. 9 వ తరగతిలో ప్రవేశానికి 13 నుండి 15 సం.లలోపు వయస్సు కలిగి వుండి, 8 వ తరగతి ఉత్తీర్ణత కలిగి వుండాలని సదరు ప్రకటనలో తెలియచేసారు. ఎస్.సి. ఎసి.టి.లు పరీక్ష ఫీజు రూ.400/- లు మరియు యితరులకు రూ.550/-లు చెల్లించవలసి వుంటుంది. యితర వివరాలను www.nta.ac.in ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు. అభ్యర్ధులు https://aissee.nta.nic.in ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవలసి వుంటుందని, అక్టోబరు 20 నుండి నవంబరు 19 వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పరీక్ష ఫీజు ఆన్ లైన్ ద్వారా అనగా డెబిట్/క్రెడిట్ కార్డులు కాని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కాని, పేటిఎం ద్వారా కాని చెల్లించవలసి వుంటుందని తెలిపారు. ఎంట్రన్స్ పరీక్షలోని మార్కులు, మెడికల్ ఫిట్ నెస్ ల ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. చిరునామా వివరాలు: బ్లాక్ సి -20, 1 ఎ/బి, ఐఐటికె ఔట్ రీచ్ సెంటర్, సెక్టార్ 62, నొయిడా, గౌతం బుధ్ధ్ నగర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్-201 309.