అనంతపురం జిల్లాలో వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతుభరోసా) నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పలు నిర్ణయాలను ఆమోదించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధి పథకం (2015 -2020) 31 -3 -2020 నాటికి ముగిసినందున కొత్త ఐ.డి.పి ద్వారా పరిశ్రమల స్థాపనకు సంబంధించి 2020-23 సంవత్సరంలో ఇవ్వబోయే రాయితీల గురించి జాయింట్ కలెక్టర్ అధికారులతో చర్చించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా నూతనంగా పరిశ్రమలకు అనుమతులకు సంబంధించి పలు అంశాలపై సమీక్షించారు. ముఖ్యంగా డా. వైఎస్ఆర్ నవోదయం పథకం( ఓ టి ఆర్ )మరియు పిఎంఈజి పి తదితర పథకాలపై చర్చించారు. అనంతరం ఐ డి పి 2015-20 పాలసీలో 81 యూనిట్లు, 114 క్లైమ్ లకు గాను రూ.6 కోట్ల 95 లక్షలు మంజూరు కొరకు నిర్ణయించి కమిటీ ఆమోదించింది. అలాగే నియమ నిబంధనల ప్రకారం సరైన డాక్యుమెంటేషన్ లేని కారణంగా 36 క్లెయిమ్ లకు సంబంధించి 1 కోటి రూపాయలు విలువ కలిగిన 36 యూనిట్లను తిరస్కరించారు. కోవిడ్- 19 నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత పరిశ్రమలను తిరిగి ప్రారంభించడం కొరకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన 844 యూనిట్లకు రూ .13 కోట్ల 36 లక్షల రూపాయలను మంజూరు చేయడానికి తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి సిఫారస్ చేసేలా కమిటీ నిర్ణయించి ఆమోదించింది. సమగ్ర పరిశ్రమ సర్వేలో కమిటీలోని సభ్యులు అందరూ సమన్వయ సహకారాలతో 2020,అక్టోబర్ 15 వ తేదీలోగా సర్వేను పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ పేరును జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ గా మార్పు చేసినట్లు జెసి తెలిపారు. భవిష్యత్ లో ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జెసి (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర గౌడ్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు, ఉపసంచాలకులు నాగరాజారావు, ట్రాన్స్ కో ఎస్ ఈ వరకుమార్, ఏడి అన్వర్ ఉల్లా, ఐపీఓ ప్రవీణ్ కుమార్, ఎల్ డిఎం మోహన మురళి, అగ్నిమాపక శాఖ అధికారి శరత్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో తోటపల్లి, తారకరామ, వెంగళరాయ సాగర్ తదితర ఇరిగేషన్ ప్రాజక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చెయ్యాలని సంయుక్త కలక్టరు డా. జి.సి . కిషోర్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్ ఆడిటోరియంలో ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో భూసేకరణ పనులపై సమీక్షించారు. భూసేకరణ పూర్తయిన వెంటనే వాటికి అవార్డును పాస్ చేసి భూమిని అప్పగించాలని ఆదేశించారు. అవార్డు కోసం సిద్ధంగా ఉన్న భూముల వివరాలను రేపటికల్లా అందజేయాలన్నారు. పరిహారానికి సంబంధించిన బిల్లులను వెంటనే అప్ లోడ్ చేయాలని, చెల్లింపులు త్వరగా జరగాలన్నారు. చెల్లించవలసిన గత బకాయిలు రూ.18 కోట్ల వరకు ఉన్నాయని, వాటి వివరాలు వెంటనే అందజేయాలని, చెల్లింపుల కోసం ప్రభుత్వంతో మాట్లాడటం జరుగుతుందన్నారు. రెవిన్యూ అధికారులు భూసేకరణపై కేసులు, దేవాదాయ భూములు, పిటిషన్లు , ప్రభుత్వ భూములు తదితర అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సమావేశంలో విజయనగరం ఆర్డిఓ బిహెచ్. భవానిశంకర్, ఇరిగేషన్ ఇఇ రామచంద్ర, ప్రత్యేక ఉప కలక్టర్లు బాల త్రిపుర సుందరి, వెంకటేశ్వర్లు, సాల్మన్ రాజ్, తహశీల్దార్లు, ఇరిగేషన్ డిఇలు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో 6,85,000 మందికి బియ్యం కార్డులు మంజూరు కాగా, ఇప్పటికే వీరిలో సుమారు 5,85,000 మందికి కార్డుల పంపిణీ పూర్తి చేయడం జరిగిందన్నారు. రైస్ కార్డు ఉన్నవారందరికీ వైఎస్ఆర్ బీమా పథకాన్ని వర్తిస్తుందన్నారు. బ్యాంకు ఖాతాలు తెరవడంలో, బ్యాంకర్లనుంచి ఎదురవుతున్న సమస్యలను వివరించారు. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని చెప్పారు. ఖాతాలను తెరిచేందుకు వెలుగు సిబ్బంది పూర్తిగా సహకరిస్తారని, ధరఖాస్తులను పూర్తిగా నింపి, బ్యాంకులకు తీసుకువస్తారని చెప్పారు. అలాగే బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లు, బీమా మిత్రల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. మెప్మా పిడి కోట్ల సుగుణాకరరావు మాట్లాడుతూ బ్యాంకుల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. చిరువ్యాపారులను ప్రోత్సహించేందుకు పిఎం స్వనిధి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనిక్రింద రూ.10వేలు రుణాన్ని ఇస్తోందని తెలిపారు. ఈ పథకం విజయవంతం చేసేందుకు బ్యాంకులు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో అర్హులందరికీ జన్ధన్ ఖాతాలను తెరవాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ కోరారు. ఖాతాలను తెరిచే ప్రక్రియను ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. తన ఛాంబర్లో శుక్రవారం సాయంత్రం బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో వైఎస్ఆర్ బీమా పథకం నమోదుకు బ్యాంకు ఖాతా తప్పనిసరి అని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో సుమారు 29,000 మందికి వ్యక్తిగతంగా బ్యాంకు ఖాతాలు లేవని, వీరందరికీ తక్షణమే జన్ధన్ ఖాతాలను తెరవాల్సి ఉందన్నారు. రోజువారీ లక్ష్యాలను నిర్ణయించుకొని, నెలాఖరులోగా ఖాతాలను తెరవాలని కోరారు. అవసరమైతే వెలుగు సిబ్బంది సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ బీమా పథకం పేద ప్రజలకు ఎంతో మేలు చేసే పథకమని, సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎట్టి పరిస్థితిలోనూ ఈ నాలుగు రోజుల్లోనే ఖాతాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైస్ కార్డుల పంపిణీలో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఖాతాలను పూర్తి చేయడం ద్వారా, ఈ అంశంలో కూడా ముందంజలో ఉండాలని కోరారు.
అంతకుముందు డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో 6,85,000 మందికి బియ్యం కార్డులు మంజూరు కాగా, ఇప్పటికే వీరిలో సుమారు 5,85,000 మందికి కార్డుల పంపిణీ పూర్తి చేయడం జరిగిందన్నారు. రైస్ కార్డు ఉన్నవారందరికీ వైఎస్ఆర్ బీమా పథకాన్ని వర్తిస్తుందన్నారు. బ్యాంకు ఖాతాలు తెరవడంలో, బ్యాంకర్లనుంచి ఎదురవుతున్న సమస్యలను వివరించారు. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని చెప్పారు. ఖాతాలను తెరిచేందుకు వెలుగు సిబ్బంది పూర్తిగా సహకరిస్తారని, ధరఖాస్తులను పూర్తిగా నింపి, బ్యాంకులకు తీసుకువస్తారని చెప్పారు. అలాగే బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లు, బీమా మిత్రల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. మెప్మా పిడి కోట్ల సుగుణాకరరావు మాట్లాడుతూ బ్యాంకుల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. చిరువ్యాపారులను ప్రోత్సహించేందుకు పిఎం స్వనిధి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనిక్రింద రూ.10వేలు రుణాన్ని ఇస్తోందని తెలిపారు. ఈ పథకం విజయవంతం చేసేందుకు బ్యాంకులు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
నూతన జాతీయ విద్యావిదానంపై ఆంధ్రప్రదేశ్ అఖిలభారతవిద్యాపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్ లో విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నూతన విద్యావిధాన డ్రాఫ్ట్ కమిటీ మెంబెర్ ప్రొఫెసర్ టివి కట్టిమని కీలక ప్రసంగం చేశారు. నేటి యువతరానికి మన జాతీయ ఔ న్నత్యాన్ని తెలుయజేసే విధంగా నూతనవిద్యావిధానాన్ని రూపొందించడం జరిగిందని, విద్యార్థుల్లో క్రియాశీలకసక్తిని పెంపొందించి నైపుణ్యాలను కలిగించి జీవనోపాధికి దోహదపడే విధంగా రూపొందించబడిందని అన్నారు. మన జాతీయవనరులు నదులు, సముద్రాలు, వృక్ష సంపద, జంతుసంపద మొదలగు వాటి సంప్రదాయ ఆర్థికవిలువలు తెలియజేసి వాటిని పరిరక్షిస్తూ సంపద వృధ్ధి దిశగా విద్యావిధానం రూపొందించబడిందని అన్నారు. నూతన విధానం విజయవంతం కావాలంటే ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీటీయూ ప్రతీక అధికారి ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి, డాక్టర్ ఎన్ వి ఎస్ సూర్యనారాయణ,సీటీయూ విద్యార్థులు చరణ్ గుప్తా, మోహన్, రాష్ట్ర ఎబివిపి నాయకులు, అనేకమంది టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేసే అవకాశం లభించడం ద్వారా గ్రామీణ ప్రజలకు సేవచేసేందుకు యువతకు మంచి అవకాశం లభించిందని దీనిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను అందించడంలో నిజాయితీగా పనిచేసి ఈ వ్యవస్థకు మంచిపేరు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు సచివాలయ సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ప్రారంభించిందని, దీనిని విజయవంతం చేయడమనేది ఇందులో పనిచేసే సిబ్బందిపైనే ఆధారపడి వుంటుందన్నారు. దేశవ్యాప్తంగా అంతా మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థవైపు చూస్తున్నారని, దేశానికి ఇది ఒక ఆదర్శ నమూనాగా రూపొందించేందుకు సిబ్బంది కృషిచేయాలన్నారు. జె.సి.వెంకటరావు శుక్రవారం గంట్యాడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటనలో భాగంగా మండలంలోని పెదమజ్జిపాలెంలో గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడి సిబ్బందితో సమావేశమయ్యారు. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ముఖ్యమైన పథకాల సమాచారం, ముఖ్యమైన ఫోన్ నెంబర్లు సచివాలయంలో ప్రదర్శించినదీ లేనిదీ పరిశీలించారు. సచివాలయంలో ఉన్న రిజిస్టర్లను తనిఖీ చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న సచివాలయ నూతన భవనాన్ని పరిశీలించారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో వున్న గ్రామ సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలను పరిశీలించారు. సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి వాటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రామవరం, తామరాపల్లి, కర్లాంలో గ్రామ సచివాలయ భవనాలు, గంట్యాడ మండల కేంద్రంలో సచివాలయ భవనం, రైతుభరోసా కేంద్ర భవనాలను, సిరిపురం, నరవల్లో సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్ర భవనాలను పరిశీలించారు. ఈ పర్యటనలో తహశీల్దార్ స్వర్ణకుమార్, ఎంపిడిఓ నిర్మలాదేవి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో నాడు-నేడు పనులను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పనులపై కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంఇఓలు, ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా పనుల స్థితిగతులపై మండలాల వారీగా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెసి మహేష్కుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులు నాడూ-నేడు పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎం-బుక్ నిర్వహణలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పూర్తయిన పనులను ఫొటోలతో సహా అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే సిమ్మెంటు తీసుకున్నవారు, వాటి ఇన్వాయిలను అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే బిల్లు చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెండింగ్ ఉన్నవారంతా, వినియోగించిన సిమ్మెంటు వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. సాంకేతిక సమస్యలతో పనులను పెండింగ్లో ఉంచడం సరికాదని, శుక్రవారం సాయంత్రం లోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలన్నిటినీ తక్షణమే పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉందని, భవిష్యత్తులో ఇవి కొనసాగకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో డిఇఓ జి.నాగమణి, వివిధ ఇంజనీరింగ్ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎంఇఓలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.నగేష్ శుక్రవారం తెలిపారు. సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ( సిదాప్ ), డిఆర్డీఏ వారి ద్వారా హైదరాబాద్ లోని హనర్ ల్యాబ్, నెల్లూరులోని శ్రీసిటీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీ నందు పనిచేయుటకు ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న ఉద్యోగ నియామక ఎంపిక కార్యక్రమం ఉదయం 9.30గం.ల నుండి మధ్యాహ్నం 1.00గం.వరకు ఉంటుందని తెలియజేసారు.
సెప్టెంబర్ 30న సోంపేట, అక్టోబర్ 13న పలాస , 20న టెక్కలి, 27న నరసన్నపేట మండల మహిళా సమైక్య కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. అలాగే నవంబర్ 6న శ్రీకాకుళం, జిల్లా మహిళా సమైక్య కార్యాలయంలోనూ, 16న ఆమదాలవలస మండల మహిళా సమైక్య కార్యాలయంలోనూ, 21న ఎచ్చెర్ల, 23న రాజాం, 27న పాలకొండ మరియు 29న పాతపట్నం మండల మహిళా సమైక్య కార్యాలయంల్లో ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహించ నున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ హనర్ ల్యాబ్ లో పని చేయుటకు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రూ.20వేలు, బియస్సి అభ్యర్థులకు రూ.17,500 వేతనంతో పాటు కంపెనీ నిబంధనల మేరకు భోజన వసతి కల్పించబడుతుందని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో గల గ్రీన్ టెక్ ఇండస్ట్రీలో పని చేయుటకు 2017-2019 సం.లో పాసైన బీటెక్ మెకానికల్ పురుష అభ్యర్ధులతో పాటు పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమాలలో పాసైన పురుష అభ్యర్థులకు రూ. 10 వేల నుండి రూ.12 వేల జీతంతో పాటు భోజన వసతి సదుపాయం ఉంటుందని అన్నారు. శ్రీసిటీ నందు గల మొబైల్ తయారీ కంపెనీ లో పని చేయుటకు పదో తరగతి పాసై 18 సం.లు నిండిన మహిళా అభ్యర్థులకు రూ. 10 వేల జీతంతో పాటు భోజన వసతి సౌకర్యం కల్పించబడునని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్ధులు పై తేదీలలో పైన పేర్కొన్న వేదిక వద్దకు హాజరుకావాలని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. ఇంటర్వ్యూకి హాజరగు అభ్యర్థులు తమయొక్క విద్యార్హతల ధృవపత్రాలతో పాటు బయోడేటా, ఆధార్ కార్డ్ తో హాజరుకావాలని స్పష్టం చేసారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అమృత వాటర్ పైప్ లైన్, యు డి ఎస్( భూగర్భ డ్రైనేజీ) పైప్ లైన్ అక్టోబర్ మొదటివారం లోపల పూర్తి చేయాలని కమిషర్ గిరీష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికి కనెక్షన్లు ఇవ్వాలని వాటి ద్వారా నగరపాలక ఆదాయం సమకూర్చాలన్నారు. నేటి నుండి ప్రతి ఇంటింటికి వెళ్లి యు డి ఎస్( భూగర్భ డ్రైనేజీల) మరియు త్రాగునీరు కనెక్షన్ లేని వారందరికీ కొత్త కనెక్షన్లు ఇవ్వాలని, గతంలో తీసుకున్న కనెక్షన్లు పరిశీలించాలని, అక్రమ కనెక్షన్లు ఉంటే వాటిని తొలగించి వారికి అపరాధ విధించాలని మరియు నగర పాలక అందిస్తున్న సదుపాయాన్ని నిలిపేయాలని ఆదేశించారు. నగరంలో ఉన్న వాటర్ ట్యాంకులు నిర్మాణ పనులు వారంలో పూర్తవ్వాలని, అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డులలో భూగర్భ డ్రైనేజీ, తెలుగు గంగ త్రాగునీరు కనెక్షన్ ఇవ్వాలని వాటి ద్వారా నగరపాలక కోట్లలో ఆదాయం వస్తుందని ఆలస్యం చేయకుండా పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ మొదటివారం లోపల అమృత్ స్కీమ్ ద్వారా జరుగుతున్న పైప్లైన్ పనులన్నీ పూర్తవ్వాలని ఆలస్యం చేస్తే బిల్లులు మంజూరు చేయనని కాంట్రాక్టర్లు ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎస్ఈ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రాంరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రఘు కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, దేవిక, అసిస్టెంట్ ఇంజినీర్ శంకర్ రెడ్డి, ఏక్నాథ్, అమృత స్కీం కాంట్రాక్టర్లు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో స్మార్ట్ సిటీ నిధులతో దేవేంద్ర థియేటర్ రోడ్డు నందు హరిశ్చంద్ర స్మశాన వాటిక లో దహన క్రియలు కోసం జరుగుతున్న విద్యుత్ యంత్రాల ప్రక్రియ వేగం పెంచాలని కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులతో ఆ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ గిరీష మాట్లాడుతూ, నగరపాలక సంస్థ తరఫున దహన క్రియలు కోసం నిర్మిస్తున్న విద్యుత్ యంత్రాల ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలని, నగరంలో సాధారణ మరణాలు, కోవిడ్ మరణాలు అధికమవుతున్న తరుణంలో రోజుకి 50 నుంచి 60 మందికి దహన సంస్కారాలు నిర్వహించే విద్యుత్ యంత్రాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం వినాయక సాగర్ లో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు ఫేస్ వన్ 11 కోట్ల36 లక్షల రూపాయలతో జరుగుతున్న పనులను ఇంజనీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టర్ తో కమీషనర్ గిరీష పరిశీలించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చంద్రశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ శంకర్ రెడ్డి, స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
డా.శంకరరావు మరణం తనను ఎంతగానో కలిచివేసిందని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆవేదన వ్యక్తం చేస్తూ డా .శంకరరావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియచేశారు. జిల్లా కేంద్రప్రభుత్వ ఆసుపత్రిలో డిసిహెచ్ఎస్ గా సుదీర్గకాలం ఎంతో సమర్దవంతంగా సేవలు అందించి గత నెల 31వ తేదీన పదవీవిరమణచేసిన ఆయన అనారోగ్య కారణంగా హైదరాబాదు యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈనెల 24వ తేదీ గురువారం మరణించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఏలూరు కలెక్టరేట్ లో శుక్రవారం డా.శంకరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కాలంలో అహర్నిశలు శ్రమించి వైద్య సిబ్బందికి అండ గా నివడమే కాకుండా కోవిడ్ బారినపడిన రోగులకు మంచిసేవలు అందించారని వైద్య వృత్తిలో ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు . మంచి అధికారిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. కోవిడ్ ప్రారంభమైన రోజు నుండి పదవీ విరమణ పొందిన రోజు వరకు ప్రతిరోజు తనను కలిసి సమర్దవంతంగా విధులు నిర్వర్తించే వారిని డా .శంకరరావుతో వున్న అనుబంధాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కోవిడ్ పట్ల ప్రతిఒక్కరూ చాలా అప్రమత్తతా ఉండాలని ముందుజాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమైన మార్గమన్నారు. ఎవరికివారు నాకు కోవిడ్ రాదులే అని భావించవద్దని నిర్లక్ష్యం అశలుపనిరాదని అన్నారు. ఎవరికి వారు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను,రక్షణను దృష్టిలో వుంచుకోవాలన్నారు. కోవిడ్ లక్షణాలు వచ్చిన వెంటనే ఏమాత్రం అశ్రద్దచేయకుండా పరీక్షలు చేయించుకుని తగిన వైద్యం చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం , శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించాలని అప్పుడే కోవిడ్ భారిన పడేప్రమాదం చాలావరకు తప్పుతుందన్నారు. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యంకు అందుబాటులోలేని చికిత్స అంటూ ఏదీలేదని, అయినప్పటికీ వారు మనకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి గాయకుడు భవిష్యత్ లో వస్తారనే నమ్మకంలేదని ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. కోవిడ్ ఎవరికి ఎలా వస్తుందో తెలియదని వాక్సిన్ వచ్చేంతవరకు ప్రతిఒక్కరూ అప్రమత్తగా ఉండడమే మేలైన మార్గమని కలెక్టర్ రేవు ముత్యాలరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ ) కె వెంకటరమణారెడ్ది, జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్ ) హిమాన్సుశుక్లా, డిఆర్ఒ ఎస్ శ్రీనివాసమూర్తి, ఏలూరు కేంద్రప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియ ఇన్చార్జి డిసిహెచ్ఎస్ డా. ఎవిఆర్ మోహనరావు, డియంఅండ్ హెచ్ఒ డా. సునంద, ఆశ్రమ కోవిడ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా .రవికుమార్ , మార్క్ఫెడ్ జిల్లా అదికారి కుమారి మల్లిక , డిస్ట్రిక్ట్ కోవిడ్ సర్వేలైన్స్ ఆఫీసర్ డా .జోషి,కలెక్టరేట్ వివిద విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం మృతి బాధాకరమని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఆయన గానంతో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలచి ఉంటారన్నారు. విభిన్న భాషల్లో వేలాది గేయాలను ఆలపించి దేశ వ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. బాలసుబ్రహ్మణ్యం మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని వీసీ ప్రసాద రెడ్డి వ్యక్తం చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం బాలసుబ్రహ్మణ్యంకు కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ను గతంలో అందించిన విషయాన్ని ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి గుర్తుచేసుకున్నారు. 2009లో జరిగిన స్నాతకోత్సవంలో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం కళాప్రపూర్ణను స్వీకరించారని మననం చేసుకున్నారు. ఇటువంటి మధుర గాయకుని మరణం తీరని లోటన్నారు.
గ్రామసచివాలయాల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించడంలో పారదర్శకంగా పనిచేయాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు సచివాలయ సిబ్బందినిఆదేశించారు.నగరంలోని కంపోస్టు కాలనీలోని సచివాలయాన్ని సంయుక్త కలెక్టర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా సచివాలయం నుండి అందుతున్న సేవలను పరిశీలించిన ఆయన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, ఇతర సమాచారం, లబ్ధిదారుల జాబితాలు ప్రజల పరిశీలనార్ధం ప్రదర్శించినదీ? లేనిదీ? గమనించారు. కోవిడ్ నేపధ్యంలో వాలంటీర్లు, ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది చేపట్టిన ఫీవర్ సర్వేపై ఆరా తీసారు. సర్వేలో ఏ ఒక్కరిని విడిచి పెట్టరాదని తద్వారా కోవిడ్ ను నిర్మూలించవచ్చని సంయుక్త కలెక్టర్ స్పష్టం చేసారు. కోవిడ్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని సూచిస్తూ, అనారోగ్యం బారిన ఉన్నవారు ఏ ఒక్కరూ ఇంటివద్ద లేకుండా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందని పేర్కొన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజలకు మంచి సేవలు అందించడమే పరమావధి అని, తద్వారా సంతృప్తి కలుగుతుందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డు, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డు అందించడంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ నాలుగు అవసరాలకు ఎక్కువ మంది సచివాలయానికి వస్తారని వారికి మెరుగైన సేవలు అందించి పంపించాలని, ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో సేవలు అండాల్సిందేనని జె.సి తేల్చిచెప్పారు. ప్రతి పథకానికి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారిని గుర్తించాలని అటువంటి జాబితాను సచివాలయం వద్ద ప్రదర్శించాలని,పథకాల అమలులో పారదర్శకత స్పష్టంగా ఉండాలని అదే ప్రభుత్వ విధానమని ఆయన వివరించారు. ప్రజలకు అవసరమైన సేవలు వారి వద్దకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని, సచివాలయాల ఏర్పాటు అందులో భాగమేనని అన్నారు. యువతగా అద్భుతమైన పనితీరు కనిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గర్బిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యం పెంపొందించుకోవచ్చునని సూపర్ వైజర్ మంగ సూచించారు. రాజవొమ్మంగి మండలం దూసరపాము సెక్టార్ శరభవరం గ్రామ అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహార మాసోత్సవం జరిగింది. ఈ సందర్భంగా బి.పి.ఏ. సత్తిబాబు మాట్లాడుతూ, మహిళ గర్భం దాల్చి ప్రసవించిన రెండు సంవత్సరాల వరకూ సక్రమంగా కోవిడ్ నియమాలు పాటిస్తూ,పోషకాహారాలు తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు తక్కువ ఖర్చు తో కూడిన ఎక్కువ పోషక విలువలు గల తృణధాన్యాలు తీసుకోవాలని సూపర్వైజర్ మంగ సూచించారు. అంగన్వాడీ వద్ద అందించే అనుబంధ పోషకాహారాన్ని లబ్దిదారులందరూ వినియోగించుకోవాలని, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి నియమాలు పాటించాలో అంగన్వాడీ వర్కిర్ ఏ. రత్నకుమారి తల్లులకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ వర్కర్ జె. సత్యవతి, గ్రామ పోలీస్ టి.భూలక్ష్మి,స్థానిక ఎమ్.ఎల్.హెచ్.పి ఏ.దివ్యజ్యోతి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజలను చైతన్యపరచే సందేశాత్మక లఘు చిత్రాలను రూపొందించాలని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తన చాంబర్ లో ర్యాగింగ్ పై సనరా ఫీనిక్స్ మూవీస్ ఆధ్వర్యంలో రూపొందించిన " రెస్పెక్ట్ " షార్ట్ ఫిల్మ్ సిడి ని ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక మార్పుకోసం,ప్రజలను చైతన్య వంతం చేసే కథలతో మేకర్స్ మంచి లఘు చిత్రాలను చేయాలని చెప్పారు. దర్శకుడు సత్యాడ నరసింగరావు, నిర్మాత శరత్ చంద్ర ఇదే కోవలో మంచి కాన్సెప్ట్ తో 'రెస్పెక్ట్ ' అనే లఘు చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం అన్నారు. ర్యాగింగ్ వలన ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలు,వారి కుటుంబ సభ్యుల ఆవేదనను ఈ లఘు చిత్రం ద్వారా చూపించారని పేర్కొన్నారు. ఈ టీమ్ భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలను చేయాలని అభిలాషించారు. జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సనరా ఫీనిక్స్ మూవీస్ బ్యానర్ పై ఇప్పటి వరకు ఎన్నో మంచి ఫిల్మ్ లను తీసిన దర్శక,నిర్మాతలు మరో ప్రయత్నం లో ర్యాగింగ్ కాన్సెప్ట్ పై 'రెస్పెక్ట్' అనే ఫిల్మ్ చేయడం అభినందనీయం అన్నారు. ఈ టీమ్ తీసిన ఫిల్మ్ లకు రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా వచ్చాయని చెప్పారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని లఘు చిత్రాలను రూపొందిస్తున్న దర్శకుడు సత్యాడ నరసింగరావు, నిర్మాత శరత్ చంద్ర భవిష్యత్ లో మరో మంచి కథతో సినిమా చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సత్యాడ నరసింగరావు, నిర్మాత శరత్ చంద్ర, అసోసియేట్ డైరెక్టర్ శశి, అసిస్టెంట్ డైరెక్టర్ పి.యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పరిశ్రమల డైరెక్టర్ జె. వి.ఎన్. సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి తో కలిసి ఆయన వివిధ విషయాలపై సమీక్షించారు. ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించి భూ సేకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు. కారిడార్ కు సంబంధించిన భూమిని గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, అభివృద్ధి పనులకు కేటాయించిన భూమిని సంబంధిత శాఖలకు అందజేయాలన్నారు. ముందుగా నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో నెలకొల్ప బోయే సబ్ స్టేషన్ కు భూమిని, అనకాపల్లి నుండి అచ్యుతాపురం వరకు నిర్మించబోయే రోడ్డు, నక్కపల్లి నుండి ఇండస్ట్రియల్ క్లస్టర్ వరకు చేసే రోడ్లకు సంబంధించిన భూమిని వేగంగా పనులు ప్రారంభించేందుకు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. కాపులుప్పాడ లోని విద్యుత్ సబ్ స్టేషన్ భూగర్భ కేబుళ్ళ ఏర్పాటు కు అనుమతి పై జీవీఎంసీ, నేషనల్ హైవే అధికారులతో సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ వాహనాల కొనుగోలుకు డిపిఆర్ ను సమర్పించడం పై కూడా ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగేశ్వరరావు, అనకాపల్లి ఆర్టీవో సీతారామరావు, ఎస్ డి సి అనిత, ఏపీ ట్రాన్స్ కో, జీవీఎంసీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.