యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష హాజరయ్యే ఉత్తరాంధ్ర ప్రాంత అభ్యర్థుల సౌకర్యార్థం ఇచ్ఛాపురం నుండి విశాఖపట్నం వరకూ ఒక ప్రత్యేక రైలు నడపాలని పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కోస్తా రైల్వే లోని విశాఖ రైల్వే డివిజనల్ మేనేజర్ ను కోరారు. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 3, 4 తేదీల్లో జరగనుందని, రెగ్యులర్ రైళ్లు నడవని పరిస్థితిలో ఈ పరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రత్యేక రైలు నడపాలని డి.ఆర్.ఎం. చేతన్ కుమార్ శ్రీవాత్సవ ను కోరుతూ ఎం.పి. గురువారం ఒక లేఖ రాశారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి బస్సుల సౌకర్యం తక్కువగా సమయంతో రైల్వే ప్రత్యేక రైలు వేయడం ద్వారా అభ్యర్ధులకు మేలు జరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్రా నుంచి చాలా మంది అభ్యర్ధులు ఈ దఫా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాస్తున్నందున రైల్వే అధికారుల వారికోసం ఆలోచించాలని కోరారు.
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు పకడ్భంధీగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్కుమార్ అధికారులను ఆదేశించారు. గతంలో చోటుచే సుకున్న లోపాలకు ఈ సారి తావివ్వకుండా, పారదర్శకంగా, ఆదర్శనీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లూ చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై వ్యవసాయశాఖ, పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లు, కాంట్రక్టర్లతో తన ఛాంబర్లో గురువారం సన్నద్దతా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా జెసి మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్లో ధాన్యం ఉత్పత్తిపై మండలాల వారీగా ఖచ్చితమైన అంచనాలను రూపొందించాలని వ్యవసాయశాఖాధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా సేకరణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంతకుముందు లాగే ఈ సారి కూడా ధాన్యం కొనుగోలును వెలుగు కొనుగోలు కేంద్రాలు, పిఎసిఎస్ల ద్వారా సేరించడం జరుగుతుందన్నారు. అందువల్ల ప్రతీ కొనుగోలు కేంద్రంలో తూనిక యంత్రాలు, తేమ కొలిచే సాధనాలు తదితర అన్ని రకాల పరికరాలనూ సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. అయితే రైతుల నమోదు, ఇ-క్రాప్, తేమ తనిఖీ, ఇతర సాంకేతిక సహకారాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుందని చెప్పారు. మిల్లర్లు ఎప్పటికప్పుడు తమకు చేరిన ధాన్యాన్ని మరపట్టి, సకాలంలో సిఎంఆర్ ఇవ్వడం ద్వారా సహకరించాలని కోరారు.
నవంబరు నుంచి ధాన్యం సేకరణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. దీనికి అనుగుణంగా అక్టోబరు 20 నుంచి బ్యాంకు గ్యారెంటీలను సమర్పించాలని సూచించారు. బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడంలో జరుగుతున్న లోపాన్ని నివారించాలని డిసిసిబి అధికారులను జెసి ఆదేశించారు. అలాగే త్వరలో 105 కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్నను కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం, మొక్కజొన్నను నిల్వ చేసేందుకు వీలుగా గోదాములను సిద్దం చేసి, ప్రణాళికా బద్దంగా కేటాయించాలన్నారు. గోదాములకు కొరత రాకుండా చూడాలని భారత ఆహార సంస్థ, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు అనుగుణంగా వాహనాలను సిద్దం చేయాలని సంబంధిత కాంట్రాక్టరును ఆదేశించారు. ప్రతిఏటా ధాన్యం కొనుగోలు సమయంలో జిల్లాలో ఏదోఒక సమస్య ఉత్పన్నం అవుతోందని, ఈ సారి అటువంటి వాటికి అవకాశాలు ఇవ్వకుండా, ఇప్పటినుంచే అన్ని జాగ్రత్తలూ తీసుకొని, ఇతర జిల్లాలకు ఆదర్శంగా మన జిల్లాలో కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని జెసి కోరారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, డిఆర్డిఏ పిడి కె.సుబ్బారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పాపారావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ వరకుమార్, ఏజిఎం కల్యాణి, డిసిసిబి సిఇఓ జనార్ధన్, ఇతర శాఖల అధికారులు, మిల్లర్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో నిర్మిస్తున్న ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా పనులు డిసెంబర్ నెలాఖరకు పూర్తి చేయాలని జి.వి.ఎం.సి. కమిషనర్ డా.జి.సృజన అధికారు లను ఆదేశించారు. గురువారం స్విమ్మింగ్ పూల్ వద్ద జరుగుతున్న పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్లోరింగుకు వినియోగిస్తున్న సింథటిక్ మరియు ఉడెన్ మెటీరియల్ నాణ్యతను పరిశీలించారు. నిర్మాణానికి సంబందించి గోడలు, స్లాబుకు వేస్తున్న సీలింగ్ మెటీరియల్ ను ఎంపిక చేసారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉండాలని గుత్తేదారును ఆదేశించారు. తదుపరి ఆమె, 68వ వార్డులో 29 లక్షలతో నిర్మించబోతున్న రీటైనింగ్ వాల్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి గోడ నిర్మించుటకు అనుమతి మంజూరు చేసారు. 6వ జోన్ లో పట్టణ ప్రణాళికా విభాగపు అధికారుల ప్రతిపాదనలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, శివప్రసాద్ రాజు, కార్యనిర్వాహక ఇంజినీర్ సుధాకర్ మరియు 6వ జోన్ పట్టణ ప్రణాళికా విభాగపు అధికారులు, ఏ.సి.పి. భాస్కరబాబు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో ఈ నెల 27వ తేదీన జరుగనున్న "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్ )- 2020 " ను సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాలరెడ్డి తెలిపారు. గురువారం నాడు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో "పాలిసెట్" నిర్వహణపై సాంకేతిక విద్యా శాఖ, పోలీసు, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, జి.వి.ఎం.సి, పంచాయితీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 56 పరీక్షా కేంద్రాలలో 15,755 మంది అభ్యర్ధులు పరీక్ష వ్రాయనున్నారని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, విద్యా శాఖల అధికారుల బృందాలు ప్రత్యేక ప్లయింగ్ స్కాడ్ గా పర్యవేక్షిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని, ఎగ్జామ్ మెటిరియల్ ను పరీక్షా కేంద్రాలకు తీసుకు వెళ్లడానికి ఎస్కార్డ్ ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను కోరారు. వైద్యఆరోగ్య శాఖ పరీక్షా కేంద్రాల వద్ద వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని జి.వి.ఎం .సి, పంచాయితీ రాజ్ శాఖ అధికారులను కోరారు. పరీక్షా కేంద్రాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఈ పి డి సి ఎల్ అధికారులను కోరారు. సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా, తిరిగి వెళ్ళేందుకు గాను ఆదివారం నాడు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను కోరారు.
చెన్నైలో జరిగిన మొదటి అంతర్జాతీయ శిలంబం (కర్రసాము) టోర్నమెంట్ 2020 లో పతకాలను సాధించిన నగరానికి చెందిన బాలదేవ్ అకాడమీ ఆఫ్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ప్రశంసించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన వారికి ఈ ప్రశంసాపత్రాలను అందజేశారు. శిలంబం టోర్నమెంట్లో బాలదేవ్ అకాడమీ ఆఫ్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు ఎనిమిది స్వర్ణ, మూడు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఒంటి కర్ర రెండు కర్రల తో చేసే విన్యాసాలలో కె.సత్య శ్రీకాంత్ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు, డి. మహేశ్వరరావు 2 బంగారు పతకాలు సాధించగా డబల్ స్టిక్ లో 3 స్వర్ణ పతకాలు బి. కీర్తిక, పి ధరణి వర్ష, పి.యశ్వంత్ లు తలా ఒక బంగారు పతకం గెలుచుకున్నారు. సింగిల్ స్టిక్ విభాగంలో బి. సంధ్యారాణి బంగారు పతకం సాధించారు. డబల్ స్టిక్, సింగిల్ స్టిక్ రెండు పోటీలలో యశ్వంత్ రెడ్డి 2 కాంస్య పతకాలను సాధించారు. విశాఖ పోర్టు ఉద్యోగి బి. లక్ష్మణ్ దేవ్ శిక్షణలో వీరు ఈ టోర్నమెంట్లో విజయం సాధించారు. ఈ పోటీలు చెన్నైలో జూలై 10 తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు జరిగాయని, 12 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారని లక్ష్మణ్ దేవ్ తెలిపారు.
గ్రామ సచివాలయాలు ద్వారా ప్రజలకు అవసరమైన సేవలన్నీ అందించాలని జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం పెందుర్తి మండలం సరిపల్లి గ్రామం, సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామాల్లోని సచివాలయాలను ఆయన సందర్శించారు. సచివాలయం ద్వారా 550 రకాల సేవలు అందించేందుకు ఉద్యోగులు మరింత చురుకుగా పనిచేయాలని ఆయన సూచించారు. నూతనంగా నిర్మించనున్న సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్ స్థలాలను పరిశీలించి, పనులను సత్వరమే ప్రారంభించి పూర్తిగావించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వారి పరిధిలోని ప్రజలకు అవసరమైన సేవలన్నీ వారే అందించాలని తెలిపారు. ప్రజల నుండి వచ్చే స్పందన వినతులను సచివాలయం స్థాయిలోనే పరిష్కరించాలని, అక్కడ పరిష్కరించుటకు వీలుకాని సమస్యలను మాత్రమే పై స్థాయికి పంపించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమీషనర్లు, ఐ.టి.డి.ఎ. పరిధిలో ప్రాజెక్టు అధికారి మరియు సబ్ కలెక్టరు, రెవిన్యూ డివిజినల్ అధికారి పరిధిలో ఆర్డిఓ ప్రతివారం 2 మండలాలలో పర్యటించి సచివాలయాలల్లోని మౌళిక వసతులను పరిశీలిస్తారని తెలిపారు.
అనంతరం సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామంలోని సచివాలయాన్ని సందర్శించారు. అక్కడ సచివాలయ సిబ్బందితో సమావేశమై ప్రతీ రోజు ఉదయం గ్రామాన్ని శుభ్రం చేస్తున్న పారిశుద్య కార్మికులు ఏ విధంగా చేస్తున్నదీ పరిశీలించాలన్నారు. శుభ్రతలో ఏమైనా లోపాలు ఉంటే కార్మికులకు చెప్పాలని ఆదేశించారు. సచివాలయం ద్వారా 550 రకాల సర్వీసులు ప్రజలకు అందించాల్సి ఉందని, వాటిని దృష్టిలో పెట్టుకొని చురుకుగా పనిచేయాలన్నారు. అక్కడ అదనంగా నిర్మిస్తున్న సచివాలయం గదులను ఆయన సందర్శించి పరిశీలించారు. నిర్మాణాలను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ ప్రోజెక్టు డైరెక్టరు రఘరామాచారి, ఆర్.డబ్ల్యు.ఎస్. ఇ.ఇ. రామారావు, పెందుర్తి, సబ్బవరం మండలాల తహసిల్థార్లు, మండల అభివృద్థి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్పై అవగాహన కల్పించడంలో జాతీయ సేవ పథకం వలంటీర్లు భాగం కావాలని ఆంధ్రాయూనివర్శిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం తన కార్యాలయంలో యూనిసెఫ్(హైదరాబాద్) మంజూరు చేసిన నూతన ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ సంపూర్ణ అవగాహనతో కోవిడ్ను అరికట్టాలని సూచించారు. యూనిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని వివిధ వర్గాల ప్రజలకు కోవిడ్పై విస్తృత అవగాహన కల్పించనున్నారు. కళాశాలతో సమన్వయం చేస్తూ సమాజంలో అన్నివర్గాలను భాగం చేయాలని వీసీ సూచించారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వలంటీర్లకు వీసీ ప్రసాద రెడ్డి హైజీన్ కిట్లను పంపిణీ చేశారు. వర్సిటీ పరీక్షల కేంద్రాలవద్ద సైతం కోవిడ్ అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని వీసీ సూచించారు. జాతీయ సేవాపథకం సమన్వయకర్త ఆచార్య ఎస్.హరనాథ్ మాట్లాడుతూ నగరంలో 5 కళాశాలలకు చెందిన 120 వలంటీర్లు పాల్గొనడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇటిఐ సమన్వయకర్త డాక్టర్ పి.రామ చంద్రరావు, పోగ్రాం అధికారులు పి.రోజ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో గ్రామసచివాలయాల కోసం నిర్వహించిన ఎ.ఎన్.ఎం./వార్డు హెల్త్ సెక్రటరీ గ్రేడ్-3 ప్రవేశ పరీక్షకు 1184 మంది అభ్యర్ధులు హాజరయినట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ రిక్రూట్ మెంట్ 2020 పరీక్షలలో భాగంగా ఎ.ఎన్.ఎం./వార్డు హెల్త్ సెక్రటరీ గ్రేడ్-3 ప్రవేశ పరీక్ష గురువారం జరిగింది. గురువారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ పరీక్షకు 1184 మంది హాజరయినారని, 424 మంది అభ్యర్ధులు గైర్హా జరయినారని తెలిపారు. ఈ పరీక్ష నిమిత్తం మొత్తం 1608 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, 74 శాతం హాజరైనారని తెలిపారు. వీరిలో కరోనా పేషెంటు ఒకరు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. అభ్యర్ధులకు పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ మీడియాకి వివరించారు. 26వ తేది వరకూ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న పచ్చతోరణంకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. ఈ పధకం అమలులో రాష్ట్రం లో జిల్లా ప్రధమ స్థానం లో నిలిచిందని, అయతే కొన్ని శాఖలు కనీస లక్ష్యాలను కూడా చేరుకోలేదని వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. గురువరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో తక్కువ మొక్కలు వేసిన శాఖాధికారులతో సమావేశం నిర్వహించి వారికి లక్ష్యాలను చేరుకోనేందుకు వివరణ కోరారు. ఈ నెల 19 న అధికారుల వాట్సప్ గ్రూప్ లో అధికారులందరికీ తమ లక్ష్యాలను సాధించేలే మొక్కలు నాటాలని సందేశం పంపడం జరిగిందని , అయితే కొన్ని శాఖలు మాత్రమే స్పందించి బాద్యత గా పని చేసి మొక్కలు నాటడం వల్లనే రాష్ట్రం లో మొదటి స్థానం లో నిలిచామని అన్నారు. స్పందించిన వారిలో బి.సి సంక్షేమం, మార్కెటింగ్ ఎ.డి., సోషల్ ఫారేస్ట్రీ , పొల్యూషన్ కంట్రోల్ శాఖ, మున్సిపాలిటీ లు ఉన్నాయన్నారు. తక్కువ సాధించిన వారిలో వైద్య ఆరోగ్యం, వ్యవసాయ, గనులు, భూగర్భం, పరిశ్రమలు, హౌసింగ్ తదితర శాఖలు ఉన్నాయన్నారు. మొక్కలు నాటిన వారు కూడా పోర్టల్ నందు అప్ లోడ్ చేయకపోవడం వలన వెనుకబడి ఉన్నారని అన్నారు. వెంటనే అప్ లోడ్ చేయాలని, ఈ వర్షా కాలం లోనే మొక్కలు బతుకుతాయని, ప్రతి శాఖా తన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించడం జరుగుతుందని, వెనకబడిన వారి పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి అధికారి కృషి చేయాలని అన్నారు.
ఈ సమావేశం లో సామజిక అటవీ అధికారి జానకి రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రమణ కుమారి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆశా దేవి, హౌసింగ్ పి.డి. రమణ మూర్తి, గనుల శాఖ ఎ.డి. విజయ లక్ష్మి తదితరులు హాజరైనారు.
అనంతపురం జిల్లాలోఅక్రమంగా ఇసుకను రవాణా చేయకుండా పటిష్టచర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ( రైతు భరోసా కేంద్రాలు మరియు రెవిన్యూ ) నిశాంత్ కుమార్ అధికారులు ఆదేశించారు.గురువారం ఉదయం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖాధికారులతో జిల్లాలో కొత్తగా ఇసుక రీచ్ ల ఏర్పాటు విషయమై జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ , జిల్లాలో అక్రమంగా ఇసుకను రవాణా చేయకుండా పటిష్టచర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మూడవ శ్రేణి వాగులు మరియు వంకలలో సంబంధిత అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించాలన్నారు . అలాగే తహాశిల్దార్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసి నిల్వ ఉంచిన ఇసుక పరిమాణం యొక్క వివరాలను సేకరించాలన్నారు.
అనంతరం పలు ప్రాంతాలలో కొత్తగా ఇసుక రీచ్ ల ఏర్పాటుకు సంబంధించి అనుమతులను మంజూరు చేశారు. కనేకల్ మండలం రచ్చుమర్రి గ్రామంలో 49 వేల క్యూబిక్ మీటర్లు ,బెలుగుప్ప మండలం నరసాపురం లో 25, 333, బ్రహ్మసముద్రం మండలం ఎనగల్లు 14, 950 ,కుర్ల కొండ 14,231 , అజయదొడ్డి 10, 360 క్యూబిక్ మీటర్లులకు అనుమతి మంజూరు చేశారు. బ్రహ్మసముద్రం మండలం , అజయదొడ్డి నది పరివాహక ప్రాంతాల్లో కొందరు వ్యవసాయం చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చినందున ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయించేందుకు సంబంధిత తహాశిసిల్దారు తగుచర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు .
రామగిరి మండలం, పేరూరు గ్రామంలో వాల్టా చట్టం ప్రకారం ఇసుక త్రవ్వకాలకు అనుమతి ఇవ్వలేమని తెలిపారు. ముదిగుబ్బ మండలం, ఉప్పలపాడు గ్రామం చిత్రావతి నదిలో డీసిల్టేషన్ తవ్వకాలకు గాను నాలుగు ప్రాంతాలలో సుమారు 1, 55,247 క్యూబిక్ మీటర్ల ఇసుక పరిమాణంకు మంజూరు చేశారు. పట్టా భూములకు సంబంధించి పామిడి గ్రామంలో మహబూబ్ అనే పట్టాదారుని భూమిలో 11 ,935 క్యూబిక్ మీటర్లకు అనుమతి మంజూరు చేశారు .నీలూరు గ్రామం పామిడి మండలం లో జాబీర్ హుస్సేన్ కు సంబంధించిన భూమిలో మరియు తాడిపత్రి మండలం బొదాయపల్లి గ్రామంలోని జయచంద్రా రెడ్డి లకు సంబంధించిన భూములలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు . ఇదివరకే మంజూరు చేసిన 5 పట్టా భూములు అనగా ఎల్లనూరు మండలం, మల్లగుండ్ల గ్రామం కృష్ణ కేశవులు, రాజేంద్ర నాయుడు, పామిడి మండలం అమర్నాథ్ ,రాజ్ కుమార్ ,తాడిపత్రి మండలం లో ఆలూరు గ్రామంకు సంబంధించి మహేంద్ర భూముల్లో ఇసుక నాణ్యత సరిగా లేని కారణంగా అనుమతిని రద్దు చేసారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కె వి ఆర్ కే ప్రసాద్ ,గనులశాఖ ఉపసంచాలకులు రమణా రావు , ఆర్ డబ్ల్యు ఈఈ వెంకటరమణ, ఆర్టీవో మహబూబ్ బాషా, డివిజనల్ పంచాయతీ అధికారి రమణ ,అనంతపురము, తాడిపత్రి ఏడిలు బాలాజీ నాయక్ మరియు ఆదినారాయణ,రాయల్టీ ఇన్స్పెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంజిల్లాలో గ్రామ వార్డు సచివాలయ రాతపరీక్షల్లో భాగంగా ఐదోరోజు గురువారం ఉదయం జరిగిన రాతపరీక్షకు 62.53 శాతం అభ్యర్ధులు హాజరయ్యారు. వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుకు ఐదోరోజు ఉదయం రాతపరీక్ష ఎం.ఆర్.ఆటానమస్ కళాశాల కేంద్రంలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 403 మంది అభ్యర్ధులు హాజరు కావలసి వుండగా 252 మంది హాజరయ్యారు. 151 మంది గైర్హాజరయినట్టు జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు తెలిపారు. కోవిడ్ లక్షణాలు గల వారెవ్వరూ పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు. కాగా మధ్యాహ్నం జరిగిన ఎ.ఎన్.ఎం., వార్డు హెల్త్ సెక్రటరీ పోస్టులకు జరిగిన రాతపరీక్షకు 73.76 శాతం మంది అభ్యర్ధులు హాజరైనట్లు తెలిపారు. నగరంలోని ఐదు కేంద్రాల్లో ఈ పరీక్షకు 1982 మంది అభ్యర్ధులు హాజరు కావలసి వుండగా 1462 మంది హాజరయ్యారని, 520 మంది గైర్హాజరైనట్టు పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలు గల అభ్యర్ధులు ఎవరూ పరీక్షకు హాజరు కాలేదని వెల్లడించారు.
అనంతపురము జిల్లాలో రేపు (25.09.2020) కోవిడ్ నమూనాలు సేకరించే ప్రాంతాల వివరాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రకటించారు. ఆయా కేంద్రాల్లో కోవిడ్ లక్షణాలున్నవారు నేరుగా వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ పరీక్షలు చేసే కేంద్రాలు వరుసగా చూస్తే.. హిందూపురం మున్సిపాలిటీ, మడకశిర మున్సిపాలిటీ, పుట్టపర్తి మున్సిపాలిటీ, ధర్మవరం మున్సిపాలిటీ, తాడిపత్రి మున్సిపాలిటీ, గుంతకల్లు మున్సిపాలిటీ, గుత్తి మున్సిపాలిటీ, పామిడి మున్సిపాలిటీ, రాయదుర్గం మున్సిపాలిటీ, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ, కదిరి మునిసిపాలిటీ, ఓడీ చెరువు పి.హెచ్.సి, అమడగూరు పి.హెచ్.సి, గాండ్లపెంట పి.హెచ్.సి, ఎన్ పి కుంట పి.హెచ్.సి, తలపుల పి.హెచ్.సి, కురుగుంట పి.హెచ్.సి, బుక్కరాయసముద్రం పి.హెచ్.సి, రాప్తాడు పి.హెచ్.సి, కొర్రపాడు పి.హెచ్.సి, కూడేరు పి.హెచ్.సి, ఆత్మకూరు పి.హెచ్.సి, ధర్మవరం ఏరియా ఆసుపత్రి, సీకే పల్లి పి.హెచ్.సి, ఎన్ ఎస్ గేట్ పి.హెచ్.సి, బత్తలపల్లి పి.హెచ్.సి, కనగానపల్లి పి.హెచ్.సి, లేపాక్షి పి.హెచ్.సి, చిలమత్తూరు పి.హెచ్.సి, పరిగి పి.హెచ్.సి, సోమందేపల్లి పి.హెచ్.సి, కళ్యాణదుర్గం సి.హెచ్.సి, శెట్టూరు పి.హెచ్.సి, వజ్రకరూరు పి.హెచ్.సి, బ్రహ్మసముద్రం పి.హెచ్.సి, హిందూపురం మండలం (పిపి యూనిట్స్/పిహెచ్ సి), ఫిక్స్డ్ లొకేషన్స్ వివరాలు చూస్తే.. మునిసిపల్ గెస్ట్ హౌస్, అనంతపురము, జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్, అనంతపురము, సి.డి.హాస్పిటల్, ఓల్డ్ టౌన్ ప్రాంతాలో చేసే కోవిడ్ పరీక్షలను వినియోగించుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విజయనగరం జిల్లాలో ఈ నెల 27 వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ను కోవిడ్ నిబందనలతో నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి ఎం. గణపతి రావు అధికారులకు ఆదేశించారు. గురువారం పోలిసెట్ పరీక్ష ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలను చేసారు. పరీక్షను ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్ధులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి హాజరు కావలసి ఉంటుందని అన్నారు. ప్రతి కేంద్రం వద్ద ప్రతి అభ్యర్ధికి ధర్మల్ స్కానర్ ద్వరా శరీర ఉష్ణోగ్రత ను పరీక్షించాలని, జ్వరం ఉన్న వారి వివరాలను వైద్య సిబ్బందికి తెలిజేయాలని అన్నారు. జ్వరం, కోవిడ్ ఉన్న అభ్యర్ధులకు ప్రత్యెక గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద సానిటైజర్ తప్పక ఉంచాలని, ప్రతి ఒక్కరు మాస్క్ వినియోగించేలా చుడాలని అన్నారు.
జిల్లాలో 29 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు, మొత్తం 6887 మంది అభ్యర్ధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద త్రాగు నీరు, నిరంతర విద్యుత్ సరఫరా, మందులతో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయా అధికారులకు ఆదేశించారు. అన్ని కేంద్రాలకు బస్సు లను నడపాలని, పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉదయం 11 నుండి 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్న ప్రాంతాల్లో జెరాక్స్ కేంద్రాలను మూసి ఉంచేలా సంబంధిత తహసిల్దార్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించేలా సమన్వయం తో పని చేయాలన్నారు. ఈ సమావేశం లో ఆర్ టి సి జిల్లా మేనేజర్ ఎన్. బాపి రాజు, అదనపు వైద్యాధికారి డా. రవి కుమార్, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పోలీస్, రెవిన్యూ శాఖల అధికారులు హాజరైనారు.
అనంతపురం జిల్లాలో సచివాలయ ఉద్యోగాల భర్తీ కొరకు చేపట్టిన 5వ రోజు నిర్వహించిన రాత పరీక్షల్లో 71.96 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురు వారం అనంత నగరం ప్రధాన కేంద్రం లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కేటగిరి - 3 వార్డు ప్లానింగ్ మరియు రేగులేషన్ సెక్రెటరీ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు 1070 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 770 మంది హాజరయ్యారు, 300 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరుకాగా , 71.96 శాతం హాజరు అయ్యారు. అనంతపురం ప్రధాన కేంద్రం లోని 6 పరీక్ష కేంద్రాల్లో ఐదవ రోజు పరీక్ష జరిగింది. అభ్యర్ధులకు పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మీడియాకి వివరించారు. 26వ తేది వరకూ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు.