కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పటిష్టమైన చర్యలు చేపట్టి కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణలో ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశంతో పోలిస్తే ఏ విధంగా మెరుగ్గా ఉన్నాము అంకెల ద్వారా జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు వివరించారు. జిల్లాలో 56,148 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 53403 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని, డిశ్చార్జి రేటు 95.11 శాతంగా ఉందన్నారు. 2237 యాక్టివ్ కేసులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఆక్టివ్ కేసుల్లో భారతదేశ సగటు 15.85 శాతం కాగా, రాష్ట్ర సగటు 9.60 శాతం ఉందని, అనంతపురం జిల్లాలో 3.79 శాతం కలిగి ఉందన్నారు . తద్వారా ఎక్కువమంది కోవిడ్ నుండి కోలుకొని క్షేమంగా ఇళ్లకు వెళ్లారన్నారు. దేశం మొత్తం మీద మరణాల రేటు 1.57 శాతం ఉండగా , రాష్ట్రం మరియు జిల్లా మరణాల శాతం సగటు 0.84 గా ఉందన్నారు. జిల్లాలో మరణాల శాతాన్ని తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందని, అందులో కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి దాదాపు 10, 000 మందిని వెంటనే ఆస్పత్రులకు మరియు కోవిద్ కేర్ సెంటర్లకు తరలించడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించగలిగా మన్నారు. ఇంటింటి సర్వే చేసి, ప్రధానంగా 94 శాతం కన్నా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్న వారిని, శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారిని, 100 ఫారన్హీట్ డిగ్రీల కన్నా ఎక్కువ జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి ముందుగానే ఆస్పత్రులకు చేర్చడం వల్ల తక్కువ మరణాలు సంభవించాయన్నారు.
జిల్లాలో సెప్టెంబర్ 27 నాటికి 4, 19, 738 పరీక్షలు నిర్వహించామని, తక్కువ పరీక్షల నుండి నెలకు 1, 40, 000 పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎదిగామన్నారు. దేశవ్యాప్తంగా సగటు న 10 లక్షల జనాభాకు 52, 000 పరీక్షలు నిర్వహించారని, రాష్ట్రంలో సగటున 10 లక్షల జనాభాకు ఒక లక్ష వరకు పరీక్షలు నిర్వహించారని, మన జిల్లాలో 10 లక్షల జనాభాలో 95000 మంది జనాభాకు పరీక్షలు నిర్వహించామన్నారు. మార్చిలో 280 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా సోకిందని, ఆ మాసంలో పాజిటివిటీ రేటు 0.70 శాతం కాగా, ఏప్రిల్ మాసంలో 5599 మందికి పరీక్షలు నిర్వహించగా 65 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 1.16 శాతం, మే మాసంలో 23,336 మందికి పరీక్షలు నిర్వహించగా 327 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 1.40 శాతం, జూన్ మాసంలో 35, 769 మందికి పరీక్షలు నిర్వహించగా 1687 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 4.72 శాతం, జూలైమాసంలో 84, 554 మందికి పరీక్షలు నిర్వహించగా 13, 685 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 16.18 శాతం, ఆగస్టు మాసంలో 1,40, 262 మందికి పరీక్షలు నిర్వహించగా 25, 757 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 18.36 శాతం, సెప్టెంబర్ మాసంలో ఈనాటి వరకు 1, 28, 939 మందికి పరీక్షలు నిర్వహించగా 14, 625 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 11.25 శాతం గా నమోదైందన్నారు. ఇకనుంచి మరింత ఎక్కువగా టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. మార్చి మాసంలో ఇద్దరి తో ప్రారంభమైన కరోనా కేసులు ఆగస్టు నెలలో అత్యధికంగా 18.36 శాతం పాజిటివిటీ రేటు కాగా, ఈ నెలలో గణనీయంగా తగ్గి, 11.25 శాతానికి తగ్గించగలిగా మన్నారు.
జిల్లాలోని 12 కోవిడ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 2, 237 యాక్టివ్ కేసుల్లో, 1114 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 700 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో, 423 మంది హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స పొందుతున్నారు. ఈ హాస్పిటల్ లో 5000 బెడ్ల సామర్థ్యం కలిగివున్నప్పటికీ 20 శాతం బెడ్ లను మాత్రమే వాడుతున్నా మన్నారు. కోడి కేర్ సెంటర్లలో 5, 400 పైచిలుకు బెడ్ల సామర్థ్యం కలిగి ఉండగా , అందులో 700 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండు వారాలుగా 19 కేటగిరీలలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వాటిని ఆధారంగా పాయింట్లు కేటాయించి ర్యాంకింగ్ లను ప్రకటిస్తోంది అన్నారు. వీటిలో జిల్లాకు రెండు వారాల్లోనూ మొదటి ర్యాంకు వచ్చిందన్నారు.
మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాలను వారంలో రెండు రోజులు జోనల్ కమిషనర్లు సందర్శించాలని జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన జెడ్సీలను ఆదేశించారు. సోమవారం జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయం నుండి జోనల్ కమిషనర్లు మరియు వార్డు ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోనల్ కమిషనర్లతో పాటు, వార్డు ప్రత్యేక అధికారులు వారంలో రెండు రోజులు సచివాలయమును సందర్శించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తీ స్థాయిలో సేవలను అందించాలని ఆదేశించారు. అదే విధంగా సిబ్బంది హాజరు తో పాటూ ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను తనిఖీ చేసి వారికి పలు సూచనలు, సలహాలు జారీ చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకురావడానికి కమిషనర్ దృష్టికి తీసుకు రావాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జి.వి.ఎం.సి. అధికారులు మరియు అన్ని జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల పొలాల్లో ఉచిత బోరుబావుల తవ్వకం కోసమే వైయస్సార్ జలకళను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,340 కోట్ల రూపాయల వ్యయంతో రెండు లక్షల బోరు బావులు తవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఈ పథకం ద్వారా దాదాపు మూడు లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని, 5 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. ఈ ఏడాది జిల్లాలో గత నాలుగు నెలల నుంచి 512 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయిందని, ఏడాదిపాటు కురవాల్సిన వర్షం ఈ నాలుగు నెలల్లోనే నమోదైందన్నారు. వర్షం ద్వారా 362 టీఎంసీల నీరు కురవగా, అందులో 12 శాతం అనగా 46 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకిందన్నారు. దీని ద్వారా భూగర్భజలం పెరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కి కలెక్టర్ వివరించారు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, జిల్లాలో ఎక్కడైతే నీళ్లు తోడడానికి అవకాశం ఉంటుందో అక్కడ వైయస్సార్ జలకళ కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, డ్వామా అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఆయన రైతు పక్షపాతి అని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైయస్సార్ జలకళ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి పాల్గొని బోరుబావులను తవ్వే రిగ్గు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించిన రిగ్గు ను మంత్రి ప్రారంభించగా, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు కూడా వేరువేరుగా వారి నియోజకవర్గాల వారీగా రిగ్గు బోర్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ పంట పొలాల్లో బోరు వేయడానికి పెట్టే ఖర్చులతో రైతులు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకుండా, వారి పొలాల్లో బోర్లు వేసి సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం వైయస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రైతన్నల సాగునీటి కలలు నెరవేరుతాయన్నారు. వ్యవసాయానికి అవసరమైన నీటి కోసం బోరుబావులు వేసుకోవడం తలకు మించిన భారం అవుతుండడంతో రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, అవసరం ఉన్న వారందరికీ ఉచిత బోరుబావులను తవ్వించి ఇస్తానని తన పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు వాగ్దానం చేసి, ఆ మేరకు నవరత్నాలలో ఉచిత బోరుబావులను చేర్చి ప్రతి ఎకరాకు నీటి సదుపాయం ఏర్పాటు చేయడం కోసమే సీఎం వైయస్ఆర్ జలకళను ప్రారంభించినట్లు తెలిపారు. పాదయాత్ర లో రైతుల పొలాల్లో ఉచిత బోరుబావులను వేయిస్తామని హామీ ఇచ్చినా, ప్రస్తుతం ఉచితంగా మోటార్ల కూడా బిగిస్తామని చెప్పడం జరిగిందని, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తోందని, సీఎం రైతు పక్షపాతి అన్నారు. పాదయాత్రలో రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సంవత్సరాల కాలంలో సుమారు 2, 340 కోట్ల వ్యయంతో దాదాపు రెండు లక్షల బోరుబావులను ప్రభుత్వం అర్హులైన రైతుల భూముల్లో తవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పాటుపడుతోందని, ప్రతి ఎకరానికి సాగు నీరు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు మొహమ్మద్ ఇక్బాల్, వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పివి సిద్దారెడ్డి, ఉషా శ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, వై. వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం )గంగాధర్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ భాష, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పామిడి వీరాంజనేయులు, ఉరవకొండ నియోజకవర్గం ఇన్చార్జి విశ్వేశ్వరరెడ్డి, ఆర్డీవో గుణ భూషణ రెడ్డి, డ్వామా అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పేదల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం సంకల్పించిన ఫోర్టిఫైడ్ రైస్ను డిసెంబరు నుంచి జిల్లా అంతటా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయా లని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్కుమార్ ఆదేశించారు. పౌర సరఫరా అధికారులు, మిల్లర్లతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి కిశోర్ మాట్లాడుతూ ప్రస్తుతం బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గాల్లో ఫోర్ట్ఫైడ్ రైస్ సరఫరా జరుగుతోందన్నారు. డిసెంబరు నుంచి మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేయాలన్నారు. దీనికోసం జిల్లాలోని మిల్లర్ల సన్నద్దతపైనా, ఇతర సమస్యలపైనా సమీక్షించారు. జిల్లా అంతటా ఫోర్ట్ఫైడ్ రైస్ సరఫరా చేయాలంటే ఏడాదికి సుమారు లక్షా, 40వేల టన్నులు అవసరమని చెప్పారు. అయితే ఈ బియ్యాన్ని తయారు చేయాలంటే, సార్టెక్స్ మిల్లులు అవసరమని అన్నారు. ప్రస్తుతం 40 సార్టెక్స్ మిల్లులు జిల్లాలో ఉన్నాయని, మరో పది కొత్తగా సార్టెక్స్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ 50 మిల్లులను పూర్తిస్థాయిలో వినియోగించుకొని, జిల్లా అవసరాలు తీర్చేవిధంగా ఫోర్ట్ఫైడ్ రైస్ ను ఉత్పత్తి చేయాలని జెసి ఆదేశించారు. అలాగే నవంబరు నుంచి ధాన్యం సేకరణకు సిద్దం కావాలని, అందుకు ఏర్పాట్లు మొదలు పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే, ఆర్డిఓ బిహెచ్ భవానీశంకర్, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ వరకుమార్, ఎజిఎం కళ్యాణి, ఇతర అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.
జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేసి ఆ సంస్దకు అప్పగించాలని సంయుక్త కలక్టరు డా. జి.సి. కిషోర్ కుమార్ భూసేకరణ అధికా రులకు ఆదేశించారు. సోమవారం ఆయన చాంబరులో రహదారుల భూసేకరణపై సమీక్షించారు. భారత్ మాల పరియోజనలో భాగంగా రాయపూర్ నుండి విశాఖపట్నం వరకు చేపట్టనున్నరహదారికి సంబంధించి భూసేకరణ పురోగతిపై భూసేకరణ అధికారి జయరావును అడిగారు. విజయనగరం గుండా వెళ్లె 95 కిలోమీటర్ల రహదారికి 595 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని, జిల్లాలోని 9 మండలాలకు సంబంధించిన 52 గ్రామాలలో భూసేకరణ జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 84 కిలోమీటర్లకు పెగ్ మార్కింగ్ పూర్తయిందని, మెంటాడ, పాచిపెంట దగ్గర అటవీ భూమికి క్లియరెన్స్ కావలసివుందని వివరించారు. 13 గ్రామాలకు ఇప్పటికే డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందని, డిసెంబరు నెలాఖరు నాటికి భూసేకరణ పూర్తవుతుందని తెలిపారు. అయితే సర్వేయర్ల కొరత ఉందని తెల్పగా ముగ్గురు సర్వేయర్లను నియమిస్తానని తెలిపారు. అదేవిధంగా చెల్లూరు నుండి గొట్లాం వరకు నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డుకు సంబంధించి అదనంగా 36 ఎకరాలు అవసరం ఉందని ఈ భూమికి సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలని భూసేకరణ అధికారి ఆర్ డిఓ బిహెచ్. భవానిశంకర్ ను ఆదేశించారు. విశాఖపట్నం నుండి రాయపూర్ కు వేస్తున్న రోడ్డుకు సంబంధించి సాలూరు బైపాస్ రోడ్డుకు 35.47 హెక్టార్లు భూమికి సంబంధించి అవార్డు పాస్ చేయడం జరిగిందని, దానికి సంబంధించిన చెల్లింపులు పెండింగ్ ఉన్నాయని వెంటనే చెల్లించేలా చూడాలన్నారు. అదేవిధంగా కోమటిపల్లి-గజపతినగరం మధ్య చేపడుతున్న రహదారి, బౌడారా నుండి విజయనగరం రహదారికికి సంబంధించిన భూసేకరణ పనులపై కూడా సమీక్షించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల సంస్ద, ఆర్ అండ్ బి ఇంజినీర్లు, కలక్టరేట్ లేండ్ ఎక్విజిషన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ దేశభక్తిని ధైర్యసాహసాలను ఈ నాటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం రామకృష్ణ బీచ్ లో గల భగత్సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించాడని తెలిపారు.. పదమూడేళ్ల ప్రాయంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా భగత్ పై విపరీత ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్య్ర పోరాటంలో మొదటిసారి పాల్గొన్నాడని చెప్పారు. భగత్ సింగ్, అసమాన దేశభక్తుడని, జ్వలించే నిప్పుకణిక, రెపరెపలాడే విప్లవ పతాకగా ఆయన అభివర్ణించారు. భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయని, 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ధైర్యంగా ఉరి కంబానికి వెళ్లాడన్నారు. ఆయనను తన స్నేహితులయిన విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులతో బ్రిటీషువారు ఉరితీశారన్నారు. ఆయన ఏ మాత్రం భయపడలేదు. ఆ ధైర్యమే ప్రవాహంలా మారి తరువాతి తరాలకు చేరి దేశ స్వాతంత్రోద్యమం ఉప్పెనలా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అర్హత గల ప్రతి రైతుకు బోర్ వేస్తామని మాజీ మంత్రివర్యులు , స్థానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం మునసబుపేటలో వై.యస్.ఆర్.జలకళ వాహన ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా నీటియాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని జలకళ వాహనానికి పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు బోర్ వేయడం ఖరీదైన వ్యవహారమని, బోర్ వేసిన తర్వాత నీళ్లు పడకపోయినా ఖర్చులు మాత్రం చెల్లించాల్సి వచ్చేదన్నారు. అలాగే బోర్ పాడైపోయినా కూడా ఖర్చు వృధా అవుతుండేదని, ఇలాంటి భయంతో బోర్ వేయడానికి రైతన్నలు చాలా భయపడేవాళ్లని ఆయన గుర్తుచేసారు. మన రాష్ట్రంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని, కానీ బోర్ వేస్తే నీళ్లు పడతాయో లేదో, నీళ్లు వచ్చినా కరెంటు ఉంటాదో లేదో అన్న భయంతో రైతులు బోర్ వేయడానికి ఆసక్తి చూపేవాళ్లు కాదని అన్నారు. రాష్ట్రంలో ఉచితంగా రెండు లక్షల బోర్లు కొత్తగా వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, తద్వారా 3 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. దీంతో 5 లక్షల ఎకరాలకు అందుబాటులోకి సాగునీరు రానున్నట్లు ఆయన వివరించారు వైయస్ఆర్ జలకళ పథకం క్రింద రూ. 2500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు శాసనసభ్యులు గుర్తుచేసారు. వ్యవసాయ బోర్లు వేయడం ద్వారా వ్యవసాయం మరింత మెరుగవుతుందని,వేసవి పంటకు వైయస్ఆర్ జలకళ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో రైతులందరికీ ఈ పథకం గురించి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్.పి.చైర్మన్ ఎచ్చెర్ల సూరిబాబు, మాజీ జెడ్.పి.టి.సి. చిట్టి జనార్దన్, ఎ.ఎమ్.సి ఛైర్మన్ ముకళ్ల తాత బాబు, బరాటం రామశేషు, గుండ మోహన్, చిట్టి రవి, రంధి రాజారావు, బాన్నా నర్సింగరావు, బగ్గు అప్పారావు, గుండ హరీష్, కూర్మారావు, డ్వామా ఎ.పి.డి వెంకటరామన్, సిబ్బంది, వ్యవసాయ అధికారులు శ్రీకాకుళం, గార మండల పరిషత్ అధికారులు తదితరులు ఉన్నారు
జివిఎంసికి వచ్చే స్పందన , ఇ.ఆర్.పి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం జీవి.ఎం.సి. సమావేశ మందిరం నుంచి జి.వి.ఎం.సి. హెచ్.ఓ.డిలతో కలిసి అన్ని జోనల్ కమిషనర్లు వార్డు ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా స్పందనలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఈ రోజు సాయంత్రం లోగా పూర్తీ చెయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన అంశంపై ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు ఎక్కువుగా పెండింగులో ఉన్నాయని రెవెన్యూ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జి.వి.ఎం.సి. అధికారులు మరియు అన్ని జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, ఆర్. సోమన్నారాయణ, ప్రధాన ఇంజినీరు వెంకటేశ్వర రావు, సి.సి.పి. విద్యుల్లత, జాయింట్ డైరెక్టర్ (అమృత్) విజయ భారతి, అసిస్టెంట్ డైరెక్టర్(ఉద్యాన శాఖ) ఎం. దామోదర రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా పేరిట రూ 3 కోట్లతో నిర్మించే కళా ప్రాంగణాన్ని ఆయన జన్మదినం నాటికి పూర్తి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం వి.ఎం.ఆర్.డి.ఎ.చిల్డ్రన్ ఎరీనాలో ఏర్పాటు చేసిన 125వ జయంతి రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోరాట స్ఫూర్తికి ప్రతీక జాషువా అని, అతని చిన్నతనంలో ఎన్ని అవమానాలు ఎదురైనా కుంగిపోకుండా ఎదురు తిరిగి పోరాడి కీర్తి శిఖరాలను అధిరోహించారన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల వారికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు. రిజర్వేషన్ లేకుండా దళితులందరూ అభివృద్ధి సాధించిన దినోత్సవం అని పేర్కొన్నారు. ఆరిన వర్గాలవా ఆ తీస్తే అది కూడా చేస్తానురు ముఖ్యంగా సాంఘిక హోదా కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
జాషువా దళితుడిగా సాంఘిక బహిష్కరణ ఎదురుకొంటూనే పట్టుదలతో పోరాటం చేస్తూ తన కవితా ప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో తనకంటూ ఓ స్థానం సంపాదించు కుంటూ నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి, సామ్రాట్, పద్మభూషణ్ బిరుదులు పొందే స్థాయికి ఎదిగారని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కొనియాడారు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు. అగ్రవర్ణ దురహంకారాన్ని చవిచూసిన జాషువా సౌమ్య పదజాలంతో నే వాటిని ఎదిరించారు అని చెప్పారు. “నాకు గురువులు ఇద్దరు పేదరికం, కుల మత భేదం. మొదటి ఓర్పును నేర్పితే రెండవది ఎదిరించే ధైర్యాన్నిచ్చిందని” జాషువా చెప్పేవారన్నారు, హిందువుల బహిష్కరణలు క్రైస్తవుల నిరసన లనూ ఎదుర్కొన్నారు. తిరుపతి వెంకట కవులు అయిన చల్లపిల్ల వెంకట శాస్త్రి జాషువా గారి పాదాలకు గండపెండేరం తొడిగారిని, ఆయన రచనలు శబ్దాలంకారం భాష పండిత పామరుల ప్రశంసలను పొందాయన్నారు. ఆయన రచించిన గబ్బిలం నవలను గూర్చి వివరించారు.
జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జీవితంలో సాంఘిక వేదనలు, కష్టాలు చవి చూసిన జాషువా సమాజంతో బడుగు బలహీన వర్గాల హక్కులను గూర్చి అణగారిన వర్గాల హక్కులను సాధించడానికి మార్గదర్శకత్వం అయ్యారని పేర్కొన్నారు. ఆయన చిన్నతనంలోనే అసమానతలు సమాజ రుగ్మతలపై పోరాడారన్నారు. సామాన్య తెలుగులో సరళంగా స్పష్టంగా సూటిగా చెప్పే రచనలు కవిత్వాలను మనకు అందించారన్నారు. రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి అధ్యక్షురాలు వంగపండు ఉష మట్లాడుతూ జాషువా కవిత్వం గుండెలను తాకుతుంది అని, “వడగాల్పు నా రచన - వెన్నెల నా కవిత్వం” అన్న మహనీయుడని తెలిపారు. కవిత్వమే ఆయుధంగా ఆయన మూఢాచారాలపై యుద్ధం చేశారన్నారు. జివిఎంసి కమిషనర్ జి సృజన, కమిషనర్ పి.కోటేశ్వరరావు ప్రసంగించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ ఎన్.ప్రసాదరావు,ఎస్సీ, ఎస్టీల పై దాడుల మానిటరింగ్ కమిటీ సభ్యులు పి మల్లేశ్వరరావు, జోసెఫ్ చెన్న సత్యం వెంకటేశ్వరరావు అప్పన్న, వంగపండు ఉష తదితరులను సత్కరించారు. అనంతరం మంత్రి గుంటూరులో నిర్మించబోయే జాషువా కళాప్రాంగణం ఆకృతి (Tomb)చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ జి. సృజన, ఎం.ఆర్.డి.ఏ. కమిషనర్ పి. కోటేశ్వరరావు, పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు సాంస్కృతిక సమితి డైరెక్టర్ మల్లిఖార్జునరావు సాంఘిక సంక్షేమ శాఖ జెడి రమణమూర్తి ఏ విజయనిర్మల వంశీకృష్ణ యాదవ్ మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ జలకళ తో రైతులు మరింతగా పంటలు పండించుకోవడానికి అవకాశం వుంటుందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం విశాఖజిల్లా కలెక్టరు కార్యాలయ ఆవరణలో "వై.ఎస్.ఆర్. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం" పోస్టరును, కరపత్రిక ను పర్యాటక శాఖ మంత్రి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎం. పి. వెంకట సత్యవతి, జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్, ఇ .పి.డి .సి .ఎల్. సి. ఎం. డి. నాగలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ , ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోకుండా ఉండాలన్నా, సబ్ స్టేషన్ పై లోడ్ ఎక్కువవడం వలన లో ఓల్టేజ్ సమస్య రాకుండా ఉండాలన్నా, రైతులకు మంచి జరగాలన్నా తప్పనిసరిగా మీటర్లు పెట్టాలని తెలిపారు. ఎన్ని గంటలు కరెంట్ వస్తుంది, ఎంత నాణ్యమైన కరెంటు వస్తుంది, రావలసిన ఓల్టేజ్ లో వస్తుందా లేదా అని తెలుసుకొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చునని మంత్రి తెలియజేసారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ సూర్యప్రతాప్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సింహాచలం నాయుడు మరియు ఇతర అధికారులు హాజరయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పథకం (పి.ఎం.ఇ.జి)క్రింద అర్హులైన నిరుద్యోగుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలో 18 ఏళ్లు వయస్సు నిండి, కనీసం 8వ తరగతి పాసైన నిరుద్యోగులు పి.ఎం.ఇ.జికు అర్హులని తెలిపారు. జిల్లాలో పరిశ్రమ మరియు సేవా పథకాలు స్థాపించుటకు దరఖాస్తులను డిఐసి/ కెవిఐసి / కెవిఐబి ద్వారా www.kviconline.gov.in వెబ్ సైట్ నందు సమర్పించాలని కోరారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు ప్రతి నెల వచ్చిన దరఖాస్తులను ఎంపిక చేసి సంబంధిత బ్యాంకులకు సిఫారసు చేయబడుతుందని ఆయన తెలిపారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం తెలియని అభ్యర్ధులు జిల్లా పరిశ్రమల కేంద్రమును సంప్రదించవచ్చని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో పీజీ చివరి సెమిష్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతికదూరం పాటిస్టూ పరీక్షల నిర్వహణ జరుపుతున్నారు. ఉదయం జరిగిన పరీక్షలను ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.వి రవీంద్రనాథ్ బాబులు పరిశీలించారు. పరీక్ష కేంద్రాలలో ఆకస్మికంగా తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రెక్టార్ మాట్లాడుతూ,అభ్యర్ధులు పరీక్షలకు వచ్చేటపుడు ఖచ్చితంగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ రావాలని సూచించామన్నారు. అదేవిధంగా ఖచ్చితంగా శానిటైజర్లు కూడా వినియోగించి జాగ్రత్తగా పరీక్షలకు హాజరు కావాలని ముందుగానే హెచ్చరికలు చేసినట్టు చెప్పారు. ఎవరూ పరీక్షలను వదులుకోవద్దని, అందరూ కోవిడ్ నుద్రుష్టిలో పెట్టుకొని పరీక్షలు రాయాలని ఆయన కోరారు.
సామాజిక మార్పుకు గుర్రం జాషువా రచనలు ఎంతో ఉపయుక్తంగా నిలచాయని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. వర్సిటీ పరిపాలనా భవనంలో సోమవారం ఉదయం నిర్వహించిన జాషువా జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం మహనీయులు చేసిన త్యాగాలు, కృషిని స్మరించుకోవాలన్నారు. విద్యను అందుకోవడం ద్వారా అభివృద్దిలో భాగస్వాములు కావడం సాధ్యపడుతుందన్నారు. దీనిని బలంగా విశ్వసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫీజురీయింబర్స్మెంట్, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రయాణం సంక్లిష్టమైనదైనా, లక్ష్యం దిశగా పనిచేసిన విధానం గుర్రం జాషువా నుంచి నేర్చుకోవాలన్నారు. సానుకూల దృక్పధాన్ని అలవరచుకోవడం ఎంతో అవసరమన్నారు. మన నడవడిక, వ్యక్తిత్వం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. శతాబ్ధ వేడుకలకు చేరువవుతున్న ఏయూ ప్రగతికి ప్రతీ వ్యక్తి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఏయూ ఎస్సీ,ఎస్టీ బోధన ఉద్యోగుల సంక్షేమ సంఘం అద్యక్షులు ఆచార్య పి.అర్జున్ మాట్లాడుతూ అసమానతలు రూపుమాపడానికి, సామాజిక మార్పుకు జాషువా రచనలు ఉపయుక్తంగా నిలచాయన్నారు. ఆచార్య టి.వెంకట క్రిష్ణ మాట్లాడుతూ నిమ్న వర్గాల జీవితాలను, జీవనాన్ని ప్రతిబింబిస్తూ జాషువా చేసిన రచనలు నిరుపమానమన్నారు. ఆయనకు ఏయూ కళాప్రపూర్ణను అందించిందని గుర్తుచేసారు.కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.వి రవీంద్రనాథ్ బాబు, డాక్టర్ ప్రసాద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మశీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపిపీజీఇసెట్ ప్రవేశ పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన జియో ఇంజనీరింగ్-జియో ఇన్ఫర్మేటిక్స్(జిజి) పరీక్ష ప్రశ్నాపత్రం కోడ్ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఎంపిక చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. ఉదయం నిర్వహంచిన జియో ఇంజనీరింగ్-జియో ఇన్ఫర్మేటిక్స్ పరీక్షకు 52 శాతం మంది హాజరయ్యారు. మద్యాహ్నం నిర్వహించిన కంప్యూటర్ సైన్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(సిఎస్) పరీక్ష ప్రశ్నాపత్రం కోడ్ను ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఏపిపీజీఇసెట్ కన్వీనర్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఆచార్య భాస్కర రెడ్డి, ఆచార్య డి.లలిత భాస్కరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 40 పరీక్ష కేంద్రాలతో పాటు హైదరాబాదులో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసారు. తొలిరోజు నిర్వహించిన జియో ఇంజనీరింగ్ పరీక్షకు 72 మంది, కంప్యూటర్ సైన్స్ పరీక్షకు 4084 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులను తనిఖీచేసి పరీక్షకు అనుమతించారు. విద్యార్థులు మాస్క్లు ధరించి, శానిటైజర్ వినియోగిస్తూ పరీక్షలకు హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించారు.