విశాఖపట్నం జిల్లాలో రెడ్డిపల్లి - పద్మనాభం రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. రెడ్డిపల్లి-పద్మనాభం రోడ్డు సుమారు 3.50 కి.మీ. విస్తరణకుగాను న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ఎన్.డి.బి.) సహకారంతో పనులు చేపట్టుటకుగాను ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నం.303, తే 22.11.2019 ది, టి.ఆర్ అండ్ బి శాఖ ద్వారా రూ.10.04 కోట్లు (అక్షరాల పది కోట్లు నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి రోడ్డు విస్తరణ పనులకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరగా తక్షణమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వు లను జారీ చేసినట్లు మంత్రి వివరించారు.
విజయనగరం జిల్లా రానున్న రోజుల్లో జిల్లా ఆర్ధికాభివృద్ధి సాధనలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డు విమానాశ్రయం చోదకశక్తి కానుందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వల్లవన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఇదని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో 2023 నాటికి పూర్తిచేయాలని కృతనిశ్చయంతో వుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి కావాలంటే నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించాల్సి వుందన్నారు. దీనిని దృష్టిలో వుంచుకొని భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సంకల్పించామన్నారు. జిల్లా పర్యటన నిమిత్తం బుధవారం నగరానికి వచ్చిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వల్లవన్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, రెవిన్యూ, భూసేకరణ అధికారులతో సమావేశమై భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణ, పునరావాసంపై సమీక్షించారు.
జిల్లా అభివృద్ధితోనే కాకుండా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిలో కూడా ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని, అందువల్ల దీని ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకొని భూసేకరణ, పునరావాస పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. భూసేకరణలో భాగంగా గుర్తించిన ప్రభుత్వ భూమిని ముందుగా నిర్మాణ పనులు చేపట్టనున్న జి.ఎం.ఆర్. సంస్థకు అప్పగించాలన్నారు. ఎయిర్ పోర్టుకు అవసరమైన 2,750.78 ఎకరాల భూమిలో ఇప్పటివరకు 2383.02 ఎకరాల భూసేకరణ పూర్తిచేసి అప్పగించారని, ఇంకా అప్పగించాల్సి వున్న 71 ఎకరాల ప్రభుత్వ భూమిని పదిరోజుల్లో ఎయిర్ పోర్టు నిర్మాణ సంస్థకు అప్పగించాలని సూచించారు. భూసేకరణ యూనిట్ వారీగా సేకరించిన, సేకరించాల్సి వున్న జిరాయితీ భూములు, ఎసైన్డు భూములు, ప్రభుత్వ భూములు, కోర్టులో వున్న రిట్ పిటిషన్ల వివరాలపై ఆయా భూసేకరణ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ భూమిని నిర్ణీత ప్రక్రియను పూర్తిచేసి అప్పగించే బాధ్యత రెవిన్యూ డివిజనల్ అధికారిదేనని స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు భూసేకరణపై సంపూర్ణ అవగాహన వుందని, వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారని, భూసేకరణ అధికారులు కూడా తమ పరిధిలో వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
వివిధ అంశాల్లో తన ప్రత్యేకతను చాటుకొని అగ్రస్థానంలో నిలుస్తున్న విజయనగరం జిల్లా, ఇ-సర్వీసుల్లో కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇ-రిక్వెస్టు ద్వారా వచ్చిన ధరఖాస్తులను సకాలంలో పరిష్కరించడం ద్వారా ఈ ఘనత జిల్లాకు దక్కింది. అన్ని శాఖలకు సంబంధించి, వచ్చిన ధరఖాస్తుల్లో, 94.93శాతాన్ని పరిష్కరించి, సకాలంలో ఆయా సేవలను ప్రజలకు అందించడం ద్వారా అగ్రస్థానాన్ని సాధించగా, రెవెన్యూ పరమైన అంశాల్లో కూడా 93.37శాతం పరిష్కరించడం ద్వారా తాజాగా జిల్లాకు ఫస్ట్ర్యాంకు దక్కింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం వివిధ రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. వాటిని నిర్ణీత కాలపరిమితిలో ప్రజలకు అందించాల్సి ఉంది. దాని ప్రకారం పౌర సరఫరాలు, రెవెన్యూ, ఇంధనం, రవాణా, మున్సిపల్, పంచాయితీరాజ్, యువజన సేవలు, వ్యవసాయం, మార్కెటింగ్, పశు సంవర్థకశాఖ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, ఓట్ల నమోదు, సమాచారశాఖ, బిసి సంక్షేమం, సాంఘిక సంక్షేమశాఖ, కార్మికశాఖ, వైద్యారోగ్యశాఖ తదితర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా సచివాలయాల్లో ఇప్పటివరకు 4,56,732 దరఖాస్తులు అందాయి. వీటిలో 4,33,592 ధరఖాస్తులను పరిష్కరించడంతో, 94.93 శాతం సగటుతో మన జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప, కృష్ణా జిల్లాలు మన తరువాత స్థానాల్లో నిలిచాయి.
రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా తాజాగా విజయనగరం జిల్లాకు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కింది. కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించి ఇప్పటివరకు 2,35,435 ధరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటికే 2,19,845 ధరఖాస్తులను పరిష్కరించి, 93.37శాతం సగటుతో మొదటి స్థానంలో జిల్లా నిలిచింది. విశాఖపట్నం, కృష్ణా, వైఎస్ఆర్ కడప జిల్లాలు మన తరువాత స్థానాలను సాధించాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ నిరంతరం ఇ-రిక్వెస్టులపై సమీక్షించడం, ఆయా శాఖలు స్పందించి వాటిని సకాలంలో పరిష్కరించడం ద్వారా విజయనగరం జిల్లాకు ఈ గౌరవం దక్కింది.
శ్రీకాకుళం జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. బుధవారం, ఉదయం, గ్రామ వ్యవసాయ సహాయ కులు (గ్రేడ్-2) (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ) పోస్టునకు పరీక్షలు జరిగాయి. జిల్లాలో 5 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్, గీతాంజలి స్కూల్, భాష్యం హై స్కూల్, చైతన్య హై స్కూల్, ఎం.వి.ఎస్. డిగ్రీ కాలేజీలలో ఈ పరీక్షలు జరిగాయని చెప్పారు. మొత్తం 702 మంది అభ్యర్ధులకు గాను 508 మంది అభ్యర్ధులు హాజరైనారని, 194 మంది అభ్యర్ధులు గైర్హాజరైనారని 72 శాతం అభ్యర్ధులు హాజరైనట్లు తెలిపారు. కరోనా పోజిటిన్ పేషెంట్లు ఎవ్వరూ హాజరు కాలేదని చెప్పారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ వివరించారు. పరీక్షా కేంద్రం వద్ద మందులు, మంచినీరు, ఆరోగ్యసిబ్బంది, వికాలంగులకు ప్రత్యేక వీల్ చైర్స్ ఇలా అన్ని సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. ప్రతీఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన తరువాత అభ్యర్ధులను లోనికి అనుమతిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ కి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ తరువాత అంతటి డైనమిక్ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మాత్రమేనని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం ఆశీల్ మెట్టలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 14 నెలలు మనసు చంపుకొని తెలుగు దేశంపార్టీ తరుపున కార్యక్రమాలు చేపట్టానని.. తలచుకుంటేనే ఆవేదన వుందని చెప్పారు. దక్షిణ నియోజకవర్గం లో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి వాటిని పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ని కలిసినపుడు కోరినట్టు వివరించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు. దమ్మున్న సీఎం ఏపీలో ఉన్నప్పుడు అలాంటి నాయకుడి టీమ్ లో పనిచేయాలనే ఆలోచనతోనే వైఎస్సార్సీపీ పార్టీలో చేరానని చెప్పిన గణేష్ కుమార్ 14 నెలల వ్యవధిలో ఇచ్చిన హామిలన్నీ 90శాతం పూర్తిచేసిన ఏకైన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి పని లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వమని కొనియాడారు. విశాఖ మేయర్ ఎలక్షన్స్ లో ఏ బాధ్యత ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 13 ఏళ్లుగా చిన్న స్థాయి నుంచి నేడు ఎమ్మెల్యే స్థాయి వరకు పెరిగానని అన్నారు. ప్రజలు, నాయకుల ఆశీస్సులతో పార్టీలో సేవచేసుకుంటానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు.
విజయనగరం జిల్లాలో గ్రామ సచివాలయాల గ్రామ వ్యవసాయ సహాయకుల ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి నాలుగో రోజైన బుధవారం నగరంలోని రెండు కేంద్రా ల్లో ఉదయం పరీక్ష జరిగింది. ఎం.ఆర్.ఆటానమస్ కళాశాల, రింగురోడ్డులోని శ్రీచైతన్య పాఠశాలల్లో ఈ పరీక్ష నిర్వహించారు. రెండు కేంద్రాల్లోనూ ఈ పరీక్షకు 896 మంది అభ్యర్ధులు హాజరు కావలసి వుండగా వీరిలో 714 మంది పరీక్షకు హాజరైనట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. మొత్తం 79.69 శాతం హాజరు నమోదైనట్టు పేర్కొన్నారు. 182 మంది పరీక్షకు గైర్హాజరైనట్టు తెలిపారు. ఎం.ఆర్.ఆటానమస్ పరీక్ష కేంద్రంలో పరీక్ష జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ పరిశీలించారు. డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కె.సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపాల్ డా.జి.వి.కళ్యాణి తదితరులు వున్నారు. కోవిడ్ లక్షణాలు గల అభ్యర్ధులు ఎవ్వరూ పరీక్షలకు హాజరు కాలేదన్నారు. ఎం.ఆర్.కళాశాలను సందర్శించిన కలెక్టర్ కళాశాల క్యాంపస్ ను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అంశంపై కళాశాల ప్రిన్సిపాల్ కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. వృక్షాలకు రంగులు వేయించాలన్నారు. విజయనగరం ఉత్సవాల సందర్భంగా కళాశాలను విద్యుద్దీపాలతో అలంకరించే ఏర్పాటు చేస్తామన్నారు.
అనంతపురం జిల్లాలో సచివాలయ ఉద్యోగాల భర్తీ కొరకు చేపట్టిన నాల్గవ రోజు నిర్వహించిన రాత పరీక్షల్లో 80.62 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బుధ వారం అనంత నగరం ప్రధాన కేంద్రం లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కేటగిరి - 3 గ్రేడ్ -2 గ్రామ వ్యవసాయ సహాయ కులు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు 1156 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 932 మంది హాజరయ్యారని , 224 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరుకాగా , 80.62 శాతం హాజరు నమోదయ్యిందన్నారు. అనంతపురం ప్రధాన కేంద్రం లోని 6 పరీక్ష కేంద్రాల్లో నాల్గవ రోజు పరీక్ష నిర్వహించారన్నారు. అలాగే జె ఎన్ టి యు వైపునున్న కెఎస్ఎన్ మహిళా డిగ్రీ కాలేజీ పరీక్షా కేంద్రంలో 1( ఒకరు)విభిన్న ప్రతిభావంతులు వ్రాతపరీక్షను వ్రాసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అటు జెసి సిరి కూడా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ వివరించారు.
విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడం పట్ల విశాఖ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని..కాని రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుశకుని లా తయా రయ్యారని వైఎస్ఆర్ సీపీ నగర శాఖ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మద్దెలపాలెం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో జరిగిన అభివృద్ధి అంతా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పరిపాలన రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహనరెడ్డి చేస్తున్నారన్నారని అన్నారు. అలాంటి ప్రభుత్వ పథకాలను కోర్టుల ద్వారా స్టే తెచ్చుకుని చంద్రబాబు అడ్డుకుంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్న వంశీ రాష్ట్ర అభివృద్ధి చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారన్నారుని ఆరోపించారు. పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందనివ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటున్నారు. ఆ పాపం చంద్రబాబుకే తగులుతుంద న్నారు. ఇలానే వ్యవహరిస్తే రానున్న వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టిన గతే తెలుగుదేశానికి పడుతుందన్నారు జోస్యం చెప్పారు.
అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సిఐటియు జగదాంబ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా ఉచిత వైద్య సలహాలు మరియు ఉచిత మందులు పంపిణీ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా మాజీ వైద్యాశాఖ అధికారి పెంటకోట రామారావు ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన క్యాదర్శి టి.కామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అల్లూరి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ కరోనా కాలంలో ఉచితంగా వివిధ మండలాలకు మందులు కిట్స్ పంపిణీ చేశామని, భవిష్యత్లో మరిన్ని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏరియా ప్రజలకు దగ్గు, ఒళ్లునొప్పులు, జలుబు, పడిశం జబ్బులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ వేదిక నాయకులు చంద్రమౌళి, శ్రవంత్, ఎం.సంజయ్కుమార్, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సభ్యులు ఎంఆర్డి రాజు, ఇంజనీర్ ఆర్.కిరణ్, ఐద్వా నగర నాయకులు ఆర్ఎన్ మాధవి, సిఐటియు నాయకులు బి.జగన్, ఎం.సుబ్బారావు, నర్సులు కావ్యశ్రీ, లిఖిత, శిరిష తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలోని పాండ్రంగి వంతెన నిర్మించడం వలన చుట్టు ప్రక్కల గ్రామాల అభివృద్థి చెందుతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. భీమిలి శాసన సభ నియోజక వర్గంలో పద్మనాభం మండలంలోని స్వర్గీయ అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి వద్ద గోస్తనీ నదిపై వంతెన నిర్మిస్తే చుట్టు ప్రక్కల గ్రామాలు అభివృద్థి చెందుతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మరియు భీమిలి శాసన సభ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరా వు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డికి లేఖ ద్వారా తెలియజేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించే పాండ్రంగి వద్ద గోస్తనీ నదిపై వంతెన నిర్మాణానికి 14 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ళ నుండి ఈ సమస్య నలుగుతున్నది కాని పాండ్రంగి వంతెన సమస్య పరిష్కారం కావడం లేదని, ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన వెంటనే తక్షణమే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నియోజక వర్గ ప్రజల తరఫున ఆయన కృజ్ఞతలు తెలిపారు. వంతెన నిర్మాణానికి 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేయడం పట్ల పద్మనాభం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
విశాఖజిల్లాలో అక్టోబరు 4న యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళవారం నాడు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఈ పరీక్షల నిర్వహణ పై తొమ్మిది మంది రూట్ అధికారులు ,27 మంది వెన్యూ సూపర్ వైజర్లు, 27 మంది స్థానిక తనిఖీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలను యు పి ఎస్ సి నిబంధనల ప్రకారం విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. గైడ్ లైన్స్ ను క్షు ణ్ణం గా అధ్యయనం చేసి అమలు చేయాలని కోరారు. ఇద్దరు సీనియర్ ఐ ఎ ఎస్ అధికారులు, యు పి ఎస్ సి తనిఖీ అధికారి పరీక్షలను పర్యవేక్షిస్తారని తెలిపారు. జిల్లాలో 10,796 మంది అభ్యర్దులు 27 కేంద్రాలలో పరీక్ష వ్రాస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల సూపర్ వైజర్లు , స్థానిక తనిఖీ అధికార్లు,ఇన్విజి లేటర్లు, ఎగ్జామ్ మెటీరియల్ ను తీసుకు వెళ్లడంలోను , పరీక్ష అనంతరం తిరిగి పంపించడంలోను జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని , ఎగ్జామ్ మెటీరియల్ ను పరీక్షా కేంద్రాలకు చేర్చడానికి తిరిగి పోస్టు ఆఫీసు నుండి డిల్లీకి పంపేటప్పుడు ఎస్కార్ట్ ను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ను కోరారు. త్రాగునీరు సౌకర్యం కల్పించాలని , పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయాలని జి.వి.ఎం .సి అధికారులను కోరారు. అంతరాయం లేకుండా విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ఈ పి డి సి ఎల్ ను కోరారు. ఆర్టీసి సంస్థ అక్టోబరు 3,4 తేదీలలో రైల్వే స్టేషన్, ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని తెలిపారు. తపాలా శాఖ పరీక్ష అనంతరం మెటీరియల్ ను పంపించేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాల వద్ద మాస్క్ లు , శానిటైజర్లు, థర్మల్ స్క్రీనర్లు, పల్స్ ఆక్సీ మీటర్లు, పి పి ఇ కిట్లు అందుబాటులో ఉంచాలని డి ఎం అండ్ హెచ్ ఓ ను కోరారు. జిల్లారెవెన్యూ అధికారి ఆద్వర్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకు ముందు జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాలరెడ్డి పరీక్షల నిర్వహణపై యు పి ఎస్ సి నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ ప్రసాద్, సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జివిఎంసీ పరిధిలో చేపడుతున్న తాగు నీటి సరఫరా ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం మాధవధార ప్రాంతంలో ఆసియా అభివృద్ది బ్యాంకు(ఏ.డి.బి) నిధులు రూ.385.66కోట్లతో చేపట్టిన 24x7 మంచి నీటి సరఫరా పధకము పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పాజెక్టు పురోగతి గురుంచి గుత్తేదారు సంస్థ ఎన్.సి.సి. వారి తరుపున జనరల్ మేనేజర్ జయశంక ర్,అసిస్టెం ట్ జనరల్ మేనేజర్ అవినాష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా జి.వి.ఎం.సి. కమిషనర్ నకు తెలియజేసారు. ప్రాజెక్టు కు సంబందించిన పైపు లైను, రిజర్వాయర్లు, ఇంటి కుళాయి కనక్షన్ల పనితీరుపై జి.వి.ఎం.సి. పర్యవేక్షక ఇంజినీరు కె.వి.ఎన్. రవిని అడిగి తెలుసుకున్నారు. 24x7 ప్రాజెక్టు రియల్ టైమును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పద్మనాభపురం పైపె లైన్ నకు సంబందించి కోర్టు వాజ్యముపై సింహాచలం దేవస్థానం ఇ.ఓ. తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. భవనాలపై అమర్చనున్న కాన్సెంట్రేటర్స్ కు సంబందించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఏ.డి.బి ప్రాజెక్టులకు రావలసిన నిధులపై చర్చించి విడుదలకు కృషి చేస్తామన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తీ అయిన ప్రాంతాలలో రహదారి పనులను వెంటనే మొదలుపెట్టాలని కాంట్రాక్టరులను ఆదేశించారు. ప్రాజెక్టులో భాగంగా అమర్చిన ఏ.ఎం.ఐ. మీటర్లు, డి.ఎం.ఏ. ఆర్.టి.వి. పేనల్ పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజినీరు కె.వి.ఎన్. రవి, ఏ. ఇ. రామనాయుడు, ఎన్.సి.సి. జనరల్ మేనేజర్ జయశంకర్ మరియు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నాబార్డ్ అందించే ప్రోత్సాహం, ఆర్ధిక సహాయంతో జిల్లాలోని స్వచ్చంధ సంస్థలు ఆయా రంగాల్లో ఎంతో ఉన్నతస్థితికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ యన్.జి.ఓలకు పిలుపునిచ్చారు. నూతన కేంద్రీకృత ప్రాయోజిత పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలుచేయడంపై జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత జిల్లాలోని స్వచ్చంధ సంస్థలు ద్వారా చేపడుతున్న పథకాల వివరాలు తెలుసుకున్న ఆయన జిల్లాలో మరిన్ని నూతన కార్యక్రమాలను చేపట్టి ఉపాధికల్పిస్తూ ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ ద్వారా అందించే నూతన కేంద్రీకృత ప్రాయోజిక పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పథకం క్రింద అధిక మొత్తంలో రుణాలను పొందవచ్చని, తద్వారా మీ సంస్థల ద్వారా వ్యాపారాభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. రుణాలను అన్ని జాతీయ బ్యాంకుల ద్వారా పొందే అవకాశం ఈ పథకం ద్వారా కల్పించబడిందని, రుణాల చెల్లింపునకు గరిష్ట పరిమితిని కూడా పెంచిన సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. ముఖ్యంగా రైతుల వ్యవసాయ మౌళిక సదుపాయాలకు మద్ధతుగా ఈ నిధిని రూపొందించినందున వాటిపై దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. తద్వారా వ్యవసాయోత్పత్తులను పెంచుకొని మార్కెటింగ్ చేయడం ద్వారా తీసుకున్న రుణాలు సద్వినియోగం కావడమే కాకుండా ఉపాధికల్పన జరుగుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ పథకం క్రింద పంటలు పండించమే కాకుండా అవసరమైన గొదాములను కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు.
నాబార్డ్ డి.డి.ఎం మిళింద్ చౌషాల్కర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ కార్యక్రమం క్రింద 1 లక్ష కోట్ల రూపాయలను వ్యవసాయ మౌళిక సదుపాయల నిధిని ప్రకటించిందని, రైతులకు వ్యవసాయ మౌళిక సదుపాయాలకు మద్ధతుగా ఈ నిధిని రూపొందించినట్లు వివరించారు. ఇందులో పంట కోత నిర్వహణ మౌళిక సదుపాయాల కోసం ఆచరణీయ ప్రోజెక్టుల కోసం మధ్యస్థ – దీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని సమీకరించడం, వ్యవసాయ ఆస్తులను సృష్టించడం జరుగుతుందని చెప్పారు. ఈ పథకం 2020-21 నుండి 2029-30వరకు అమల్లో ఉంటుందని అన్నారు. ఈ రుణాల చెల్లింపునకు గరిష్టంగా రెండేళ్లు వ్యవధి ఉంటుందని,సబ్సిడీ కూడా అధికంగా ఉంటుందన్నారు. స్వచ్చంధ సంస్థలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, యల్.డి.ఎం జి.వి.బి.డి.హరిప్రసాద్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి డి.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, ఏ.పి.ఎం.ఐ.పి పథక సంచాలకులు ఎ.వి.యస్.వి.జమదగ్ని, ఆత్మ పథక సంచాలకులు కె.కృష్ణారావు, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డా. డి.చిన్నంనాయుడు, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.శ్రీనివాసరావు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్, ఉద్యానవన అధికారి పి.స్వాతి, జిల్లా సహకార అధికారి ఎ.వి.రమణమూర్తి, పలు స్వచ్చంధ సంస్థల సంచాలకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులు యం.ప్రసాదరావు, యన్.సన్యాసిరావు, పడాల భూదేవి, కైలాస్ సాహు, ఆర్.శర్వాణి, బి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంజిల్లాలో ఖరీప్ నాటికి 200 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని, ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ - 2020 ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసే వెలుగు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర మార్కెటింగ్ సంస్థ, గిరిజన సహకార సంస్థలు ఈ ఖరీఫ్ నాటికి ఈ సంఖ్యను పెంచాలని సూచించారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి 200కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. అలాగే ఖరీఫ్ – 2020లోవరి సాదారణ రకం కనీస మద్ధతు ధర క్వింటాకు రూ. 1868/-లు, గ్రేడ్ + రకానికి క్వింటాకు రూ.1888/-లు రైతులకు అందించడం ప్రాధమిక ఉద్దేశ్యమని జె.సి స్పష్టం చేసారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడమే ప్రభుత్వ ఆలోచన అని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని కోరారు. జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఈ ఖరీఫ్ నాటికి పెరిగే అవకాశం ఉన్నందున వాటిని దృష్టిలో ఉంచుకొని ధాన్యం సేకరణ కేంద్రాలు ( పి.పి.సి )ను ఏర్పాటుచేయాలని అన్నారు. జిల్లాలో 200కు పైగా ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఇందుకోసం వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారిలతో ఒక కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు జె.సి తెలిపారు. ఈ కమిటీ జిల్లాలో 200కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకోసం తుదినిర్ణయం తీసుకొని, వాటిని రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని రైసు మిల్లుల స్థితిగతులను పరిశీలించి, నివేదికను తమకు అందజేయాలని పౌర సరఫరాల శాఖ ఉప తహశీల్ధారులను జె.సి ఆదేశించారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ను నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తున్నందున సార్టెక్స్ మెషీన్స్ ఏర్పాటుచేయాలని జె.సి కోరారు. జిల్లాలోని ఎఫ్.సి.ఐ గొదాములలోని బియ్యాన్ని త్వరగా ఖాళీ చేసి నవంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. జిల్లాలో ఇ-క్రాప్ బుకింగ్ శత శాతం పూర్తికావాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ ను జె.సి ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.శ్రీనివాసరావు, ఎఫ్.సి.ఐ జిల్లా మేనేజర్, యస్.డబ్య్లు.సి రీజనల్ మేనేజర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 26 వ తేదీన వర్చ్యువల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ అధ్యక్షులు జి.రామకృ ష్ణ తెలిపారు. మంగళవారం జిల్లా జడ్జి ఛాంబరులో వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించు నిమిత్తం కరోనా నేపథ్యంలో న్యాయ సేవాధికార సంస్ధ వర్చ్యువల్ (వీడియో కాన్ఫరెన్సు) ద్వారా లోక్ అదాలత్ నిర్వహించ వలసినదిగా హైకోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కావున హైకోర్టు ఆదేశాలను అనుసరించి, ఈ నెల 26 న జిల్లా లోని అన్ని కోర్టులలోను వీడియో కాన్ఫరెన్సు ద్వారా లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గం.ల నుండి లోక్ అదాలత్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్స్ యాక్టు కేసులు, మోటారు యాక్సిడెంటు క్లెయిమ్ కేసులు, ఫ్యామిలీ కోర్టు కేసులు, లేబర్ కేసులు, ప్రభుత్వ భూసేకరణ కేసులు, బ్యాంక్ కేసులు, సివిల్ కేసులు, రెవిన్యూ కేసులు, ఇతర రెవిన్యూ కేసులు, సర్వీస్ మేటర్సు, పాత పెండింగ్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు, రాజీ మార్గం ద్వారా పరిష్కరించు కోవచ్చునని తెలిపారు. జిల్లా కోర్టు మరియు జిల్లాలోని ఇతర కోర్టులలోని న్యాయ సేవాధికార సంస్ధ వారు వర్చువల్ ద్వారా కేసులను రాజీచేయడం ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కక్షిదారులు సంబంధిత కోర్టులకు తమ కేసులను మెయిల్ చేసుకోవలసి వుంటుందని, ఇరు పార్టీల కక్షిదారులు ఇంటి నుండే తమ కేసులను పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని కలిగించడం జరిగిందని తెలిపారు. జిల్లా కోర్టు మొయిల్ ఐ.డి. dlsasklm@gmail.com