1 ENS Live Breaking News

రైతులు దగ్గరుండి భూములు సర్వే చేయించుకోవాలి

భూముల రీస‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ప్పుడు రైతులు ద‌గ్గ‌రుండి త‌మ భూముల కొల‌త‌లు తీయించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. రైతుల స‌మ‌క్షంలోనే వారి భూములను స‌ర్వే చేయ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.  రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న భూముల రీ-స‌ర్వే ప్ర‌క్రియ ఒక సువ‌ర్ణావ‌కాశం లాంటిద‌ని, దీనిని రైతులంతా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.  దాదాపు వందేళ్ల త‌రువాత జ‌రుగుతున్న ఈ భూ స‌ర్వే ప్ర‌క్రియ పూర్త‌యితే, భూ స‌మ‌స్య‌ల‌కు, వివాదాల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని చెప్పారు.  జిల్లాలో రీ స‌ర్వే ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా జ‌రుగుతోంద‌ని ఆమె ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మొద‌టి ద‌శ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 24 మండ‌లాల్లోని 179 గ్రామాల్లో స‌మ‌గ్ర భూ స‌ర్వే పూర్త‌య్యింద‌ని,  సుమారు 11వేల మందికి వెబ్‌ల్యాండ్‌లో న‌మోదు చేయ‌డం ద్వారా, వారి భూముల‌పై స‌ర్వ హ‌క్కులను క‌ల్పించడం జ‌రిగింద‌ని తెలిపారు. రైతులు అపోహ‌లను విడ‌నాడి, అధికారుల‌కు పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తే,  స‌మ‌గ్ర భూ స‌ర్వేను మ‌రింత విజ‌య‌వంతంగా వేగంగా పూర్తి చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. భూ స‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ప్పుడు, రైతులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ భూముల‌వ‌ద్ద ఉండి, ప్ర‌క్రియ‌ను పూర్తి చేయించుకోవాల‌ని, అక్క‌డే సందేహాల‌ను నివృత్తి చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. దీనికోసం ముందుగానే ఆయా రైతులకు స‌మాచారం ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

రీ సర్వేతో ఎన్నో ఉప‌యోగాలు
               స‌ర్వే వ‌ల్ల సాదా బై నామా ద్వారా జ‌రిపిన లావాదేవీల‌కు శాశ్వ‌త హక్కులు ల‌భిస్తాయని, ప్ర‌భుత్వ‌, దేవాదాయ భూముల‌కు ర‌క్ష‌ణ క‌లుగుతుందని పేర్కొన్నారు. ప్ర‌ధానంగా రైతులు ఎదుర్కొంటున్న జీవితకాల స‌మ‌స్య‌ల‌కు ఈ స‌ర్వేద్వారా ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఉద్ఘాటించారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు చుట్టూ రైతులు తిర‌గాల్సిన ప‌నిలేదని, పైసా ఖ‌ర్చు లేకుండా త‌న ఆస్తికి స‌ర్వ హ‌క్కులూ ల‌భిస్తాయని తెలిపారు. ఈ స‌ర్వే ప్ర‌క్రియ ద్వారా సాగుచేసుకుంటున్న పొలాల‌తో పాటు 4 లక్ష‌ల ఖాతాల‌కు సంబంధించిన‌ గ్రామ కంఠాల‌కు, సాదా బై నామా ద్వారా జరిగిన లావాదేవీల‌కు కూడా సంపూర్ణ హ‌క్కులు ల‌భిస్తాయని వివ‌రించారు. వారస‌త్వంగా వ‌చ్చిన భూముల‌కు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే చిటికెలో ప‌రిష్కారం ల‌భిస్తుందన్నారు. స‌రిహ‌ద్దు గొడ‌వులు.. పంప‌కాల చిక్కులు తొల‌గిపోతాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక ప‌రిజ్జానాన్ని ఉప‌యోగించి జ‌రుగుతున్న ఈ స‌ర్వే వ‌ల్ల భూముల‌కు సంబంధించి ప్ర‌త్యేక‌ ఎల్‌.పి.ఎం. నంబ‌ర్ ద్వారా అన్ని వివ‌రాలు క్యూ ఆర్ కోడ్‌లో నిక్షిప్త‌మై ఉంటాయని, దీంతో భ‌విష్య‌త్తులో  సంబంధిత‌ రైతుల అనుమతి లేకుండా పేర్లు గానీ, సరిహ‌ద్దులు గానీ మార్చ‌లేరని తెలిపారు. చివరికి రిజిస్ట్రేష‌న్ చేసేట‌ప్పుడు కూడా ఓటీపీ వ‌స్తే గానీ ప్ర‌క్రియ ముగియ‌దన్నారు. అత్యంత క‌చ్చిత‌త్వం, భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటిస్తూ 20వేల స‌ర్వే రాళ్ల‌ను రైతుల భూముల స‌రిహ‌ద్దుల్లో పాతడం జ‌రిగింద‌ని తెలిపారు.

త్వ‌ర‌లో భూహ‌క్కు ప‌త్రాల పంపిణీ
               జిల్లాలో స‌మ‌గ్ర భూ స‌ర్వే ప్ర‌క్రియ‌లో భాగంగా మొద‌టి ద‌శ విజ‌య‌వంతంగా ముగిసిందని, మూడు రెవెన్యూ డివిజ‌న్ల ప‌రిధిలోని 24 మండ‌లాల్లో రీ-స‌ర్వే పూర్త‌యిందని తెలిపారు. దాదాపు 179 గ్రామాల్లోని 11వేల మంది రైతుల‌కు త్వ‌ర‌లోనే సంబంధిత భూ హ‌క్కు ప‌త్రాలు పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింద‌ని తెలిపారు.  రెండో ద‌శ‌క్రింద‌ మ‌రో 150 గ్రామాల్లో స‌ర్వే చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌ని, ఫిబ్ర‌వ‌రి ముగిసే నాటికి మ‌రొక 75 గ్రామాల్లో  స‌ర్వే ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టిన‌ట్టు క‌లెక్ట‌ర్‌ తెలిపారు.

Vizianagaram

2022-12-08 04:37:43

భూహక్కు పత్రాలలో తప్పులుంటే మార్పులు చేసుకోవచ్చు

భూహక్కు పత్రాలలో తప్పులుంటే మార్పులు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు.  బుధవారం తహశీల్దార్ల, రెవన్యూ సిబ్బందితో భూ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
 ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ సూచనలిస్తూ భూహక్కు పత్రాలలో ఫోటో మిస్సింగు, వివరాలు నమోదులో తప్పులుంటే మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. భూ హక్కు పత్రాలలో తప్పులున్నా, భూమి వివరాలు నమోదు కాకున్నా రైతులు ఆందోళన చెందనవసరం లేదని, మ్యుటేషను ధరఖాస్తు ద్వారా మార్పులు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ విషయాన్ని రైతు లందరికీ విలేజ్ రెవిన్యూ అధికారులు తెలియజేయాలన్నారు. నోటీసులు రైతులందరికీ వ్యక్తిగతంగా అందజేసి, రశీదులు తీసుకొని రికార్డు చేయాలన్నారు..  భూ సర్వేకు సంబంధించిన మొత్తం రికార్డు భద్రపరచాలన్నారు.  రైతుల వివాదాలకు సంబంధించిన వారి వాదనలను, రికార్డులను,  మొబైల్ కోర్టు ఆర్డర్లను  భద్రపరచాలని తెలిపారు. రీ సర్వే ప్రక్రియ పక్కాగా అమలుచేయాలని అదికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టు ఒ. ఆనంద్, సబ్ కలెక్టరు నూరుల్ కమర్,  జిల్లా రెవిన్యూ అదికారి జె. వెంకటరావు, జిల్లా సర్వే సెటిల్మెంటు అధికారి కె. రాజకుమార్, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, వి.ఆర్.ఒ.లు పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-07 15:58:09

ప్రభుత్వ కార్యక్రమాల్లో అవినీతికి తావుండకూడదు

అవినీతికి తావులేకుండా పథకాలు, కార్యక్రమాలు ల‌బ్ధిదారుల‌కు అందేందుకు అధికారులు కృషిచేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ సీహెచ్ విజ‌య‌ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధ‌వారం ఫుడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ సీహెచ్ విజ‌య‌ప్రతాప్‌రెడ్డి.. క‌మిష‌న్ సభ్యులు జె.కృష్ణకిరణ్, పౌర స‌ర‌ఫ‌రాలు, ఐసీడీఎస్‌, విద్య త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. కాకినాడ అర్బన్ కచేరిపేటలో ఎండీయూ వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న తీరును ప‌రిశీలించారు. ప్రజలకు పంపిణీ చేస్తున్న బియ్యం, కందిపప్పు త‌దిత‌ర స‌రుకుల నాణ్యతను పరిశీలించారు. కాకినాడ జగన్నాథపురంలో ఎ.శ్రీనివాసరావుకు చెందిన చౌక ధరల దుకాణాన్ని, అన్నమ్మఘాటిలో ఎంవీవీ సత్యనారాయణ చౌక ధరల దుకాణాన్నిఛైర్మ‌న్ తనిఖీ చేశారు. 


కరప మండలం, పెనుగుదురు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, మండల ప్రజా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరపలోని శ్రీ నక్కా సూర్యనారాయణ మూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాలను, సరుకుల నాణ్యతను పరిశీలించి పాఠశాల విద్యార్థులకు ఫోర్టిఫైడ్ బియ్యం ప్రాధాన్యం, పోషక విలువలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వేలంగిలోని రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ ఎంఎల్ఎస్ పాయింటును సందర్శించి బియ్యం బస్తాలు, కందిపప్పు నిల్వను పరిశీలించి హమాలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురజానపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పౌష్టికాహారం అందించే ఈ కార్య‌క్ర‌మాన్ని విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, మ‌ధ్యాహ్న భోజ‌నం పాఠ‌శాల‌లో చేయాల‌ని సూచించారు. చివరిగా జగన్నాధపురం సెంటర్లో ఉన్న బ‌చ్చు రామం న‌గరపాలక సంస్థ బాలికోన్న‌త పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు పోష‌క విలువ‌లు క‌లిగిన ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన కల్పించారు.


ఈసంద‌ర్భంగా విజ‌య ప్ర‌తాప్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం-2013 ప‌రిధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ క‌మిష‌న్ ఏర్ప‌డింద‌ని.. ఈ క‌మిష‌న్‌కు తాను రెండో ఛైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్నాన‌ని తెలిపారు. 2022, మార్చిలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన ద‌గ్గ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 475 వ‌రకు కేంద్రాల‌ను సంద‌ర్శించిన‌ట్లు వెల్ల‌డించారు. పౌర స‌ర‌ఫ‌రాల వ్య‌వ‌స్థ ఆహార ధాన్యాల పంపిణీ, మ‌ధ్యాహ్న భోజ‌నం, అంగ‌న్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్ట‌ళ్ల‌తో పాటు ప్ర‌ధాన‌మంత్రి మాతృ వంద‌న యోజ‌న (పీఎంఎంవీవై)పై క‌మిష‌న్ దృష్టిసారిస్తున్న‌ట్లు తెలిపారు. ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు నిర్వ‌హిస్తూ లోటుపాట్ల‌ను గుర్తిస్తూ.. స‌రిదిద్దుతున్న‌ట్లు వెల్ల‌డించారు. పేద‌ల ఆక‌లి తీర్చేందుకు ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అవినీతి అనేది ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

 అధికారులు, సిబ్బంది నీతినిజాయితీల‌తో ప‌నిచేయాల‌ని విజ‌య ప్ర‌తాప్‌రెడ్డి సూచించారు. మంగ‌ళ‌వారం కాకినాడ జిల్లాలో ప‌ర్య‌ట‌న ప్రారంభ‌మైంద‌ని గురువారం ఉద‌యం వ‌ర‌కు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలిపారు. ఫుడ్ కమిషన్ ఛైర్మ‌న్ వెంట ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పి.సురేష్, సివిల్ స‌ప్ల‌య్స్ డీఎం డి.పుష్ప‌మ‌ణి, జిల్లా పౌరసరఫరాల అధికారి డి.చాముండేశ్వరి, ఏఎస్‌వో టి.ప్రసన్న లక్ష్మీదేవి, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ, ఇన్‌ఛార్జ్ డీఈవో ఆర్‌జే డానియ‌ల్ రాజు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎస్.డి.సలీమ్ త‌దిత‌రులు ఉన్నారు.

Kakinada

2022-12-07 15:52:23

ఆరోగ్యశ్రీ ఫిర్యాదుల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించాలి

డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిదారుల‌కు పూర్తిస్థాయిలో సేవ‌లందేలా కృషిచేయాల‌ని.. ఫిర్యా దుల‌ను నిర్దిష్ట గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధ్యక్ష‌త‌న జిల్లా క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ (డీడీసీ) స‌మావేశం జ‌రిగింది. డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం జిల్లాలో అమ‌లుతీరు, అందుబాటులో ఉన్న ఆరోగ్య మిత్ర‌లు, టీం లీడ‌ర్లు, అర్జీల స్వీక‌ర‌ణ‌, ప‌రిష్కార వ్య‌వ‌స్థ త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ద్వారా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ‌, నెట్‌వ‌ర్క్‌ ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ఉచిత వైద్య సేవ‌లు అందించే వ్య‌వ‌స్థ‌లో ఎవ‌రైనా అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలితే క‌ఠిన చర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

 కాకినాడ జిల్లాలో 84 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వ‌ర్క్ కింద ఆమోదం పొంది ఉన్నాయని, ఈ ఆసుపత్రుల్లో 79 మంది ఆరోగ్యమిత్రలు ప‌నిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆరోగ్య మిత్ర‌ల‌కు సంబంధించి ఖాళీలు ఏవైనా ఉంటే వెంట‌నే భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ చ‌ర్య‌ల ద్వారా ఆరోగ్య‌శ్రీ సేవ‌ల వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయొచ్చ‌న్నారు. ప్ర‌తి నెల మొదటి బుధవారం డిస్ట్రిక్ డిసిప్లినరీ కమిటీ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ స‌మావేశాలు ఫ‌ల‌ప్ర‌దంగా జ‌రిగేందుకు వీలుగా నెల‌వారీగా స‌వివర నివేదిక‌ల‌ను అందుబాటులో ఉంచాల‌న్నారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎంల‌కు ఆరోగ్య‌శ్రీ సేవ‌లు, ప్ర‌త్యేక యాప్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు.

 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనూ ప్ర‌త్యేకంగా నోడ‌ల్ సిబ్బందిని నియ‌మించాల‌ని సూచించారు. డా. వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య‌శ్రీ సేవ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని పోస్ట‌ర్ల రూపంలో ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. 104, స్పంద‌న‌, ఐవీఆర్ఎస్‌, వ్య‌క్తిగ‌త మార్గాల ద్వారా అందే ఫిర్యాదుల‌ను, అర్జీల‌ను నిర్దిష్ట గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు సూచించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా గ్రీవెన్సుల ప‌రిష్కారం ఉండాల‌ని క‌లెక్ట‌ర్ కృతికాశుక్లా స్ప‌ష్టం చేశారు. స‌మావేశానికి డీఎంహెచ్‌వో డా. ఎం.శాంతిప్ర‌భ‌, క‌మిటీ స‌భ్యులు డా. ఎస్.చక్రరావు, ఆరోగ్య‌శ్రీ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త డా. పి.రాధాకృష్ణ‌, ఆరోగ్య‌శ్రీ జిల్లా మేనేజ‌ర్ కె.న‌వీన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-12-07 15:48:02

రోగుల కోసం కనీస సౌకర్యాలు మెరుగు పర్చాలి

ఉత్తరాంధ్ర జిల్లాలో  ప్రముఖ వైద్య శాలయిన  కె.జి.హెచ్ కు ప్రతి రోజు అనేక మంది  రోగులు వైద్యం కోసం వస్తుంటారని వారికి కనీస సౌకర్యాలు అందేటట్లు వైద్య సిబ్బంది  చూడాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు.  బుధవారం ఉదయం స్థానిక కె.జి.హెచ్ ఆసుపత్రిలో ఒపి  స్లిప్, కేస్ షీట్లు మంజూరు చేయు గదిని, క్యూలైన్లను  పార్కింగ్ ప్రదేశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు.  ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేస్ షీట్లు మంజూరు చేయు గదిని మరమ్మత్తులు చేయాలని అదే విధంగా రోగులు ఒపి  స్లిప్  లు పొందేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. రోగులతో పాటు వచ్చే వారికి కూడా  మరుగుదొడ్లు ఇబ్బంది లేకుండా  నిర్మించాలన్నారు. పార్కింగ్ సదుపాయాన్ని మెరుగు పర్చాలన్నారు .  ఓపి గేటు ఎదురుగా ఉన్న  మినీ పార్కును సుందరీకరించాలని ఆదేశించారు. అనంతరం వైద్యం కోసం వచ్చిన  రోగులతో మాట్లాడి వారికి అందుతున్నవైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. 
ఈ కార్యక్రమంలో  కె.జి.హెచ్ సూపరింటెండెంట్ మైథిలీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-07 13:00:01

జగనన్న పాలవెల్లువ తక్షణమే పూర్తిచేయాలి


జగనన్న పాలవెల్లువ కార్యక్రమం రెండో విడత ప్రారంభానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో  జగనన్న పాలవెల్లువ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతలో నరసాపురం , పాలకొల్లు,  యలమంచిలి మండలాలలోని 25 గ్రామాలలో పాలు సేకరణ చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. పాల సేకరణ చేయడానికి రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని అన్నారు. ఏఎంసి సిబ్బందికి , ప్రమోటర్స్ కి సెక్రెటరీ అసిస్టెంట్ సెక్రటరీలకు శిక్షణ పూర్తి చేయాలన్నారు.బి ఎం సి యు లలో మిషన్లు ఏర్పాటు చేసి కాలిబ్రేషన్ చేయడంతో పాటు సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  బీ ఎం సీ యు లకు 2  భవనాలు గుర్తించాలని  ఆదేశించారు. ఈనెల 11వ తారీఖున నరసాపురం మండలంలో బీఎంసీ యు లో జగనన్న పాల వెల్లువ  కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

    జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కింద గతంలో ప్రారంభించిన 10 గ్రామాలలో  ప్రతిరోజు 1,769 లీటర్లు  పాలు సేకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పాలు సేకరణ ఇంకా పెంచాలని కలెక్టర్ అన్నారు.   ఈ సమావేశంలో డిఆర్ డి ఏ పిడి వేణుగోపాల్  , పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్  డాక్టర్ .మురళికృష్ణ , డి సి ఓ ఎం. రవికుమార్ , డిపిఓ ఎం. నాగలత,  మార్కెటింగ్ శాఖ అధికారులు  ,ల్యాండ్ సూపర్డెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-12-07 11:58:34

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

శ్రీకాకుళం జిల్లాలోని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ హెచ్చరించారు.  సమాజంలో ఉండే లింగ వివక్షకు శాశ్వతంగా ముగింపు పలికి, పురుషులతో సమానంగా సమాజంలో ముందుకువెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మహిళలంటే అబలలు కాదని, సబలలని నిరూపించుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరుగు లైంగిక వేధింపుల నివారణపై అవగాహన ర్యాలీ ( మారథాన్ ) కార్యక్రమం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల వద్ద జరిగింది.  ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మారథాన్ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సూర్యమహల్ జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం మానవహారం ఏర్పాటుచేసి మహిళల లైంగిక వేధింపుల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై జరుగు లైంగిక వేధింపుల నివారణపై గత నెల 26 నుండి ఈ నెల 10వ తేది వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం తరపున జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం కూడా ఏర్పాటుచేసుకున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రతి పాప సురక్షితంగా ఉండాలని, వారు సమాజంలో ఉన్నపుడు అబల అనే భావన కాకుండా సబల అనే భావం రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మహిళలు పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైతే తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిచో పై అధికారులను సంప్రదించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. లైంగిక వేధింపులకు ఎవరైనా పాల్పడితే జిల్లా కలెక్టర్, జిల్లా యస్.పి, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి లేదా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను సంప్రదించవచ్చని కలెక్టర్ వివరించారు. 

జిల్లాలో యస్.పి, డిఎంహెచ్ఓ, మహిళ, శిశు సంక్షేమాధికారులు మహిళలు కావడం మన అదృష్టమని, బాధితులు ఎవరైనా ఉంటే వారికి వివరంగా తెలియజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేసారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, చట్టాలకు లోబడి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. మహిళలు ప్రతి విషయంలో పురుషులతో సమానంగా ఉంటూ సమ సమాజంలో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మహిళల లైంగిక వేధింపుల నివారణపై రూపొందించిన గోడ పత్రికను ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు.  ఈ మారథాన్ కార్యక్రమంలో జిల్లా అదనపు యస్.పి టి.పి.విఠలేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డా. డి.వి.విద్యాసాగర్, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖాధికారి కె.అనంతలక్ష్మీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డా. బి.మీనాక్షి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆర్.వెంకట రామన్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-07 10:18:46

సాయుధ దళాల ప‌తాక దినోత్స‌వ నిధికి విరాళాలందించండి

మాజీ సైనికులు, దేశ ర‌క్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన వీర జ‌వానుల కుటుంబాల సంక్షేమం ల‌క్ష్యంగా చేప‌ట్టే కార్య‌క్ర‌మాలకు ఉద్దేశించిన సాయుధ ద‌ళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా సైనిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ డా. కృతికా శుక్లా ప్ర‌జ‌ల‌కు, వివిధ సంస్థలకు పిలుపునిచ్చారు. బుధవారం భార‌త సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం సంద‌ర్భంగా కాకినాడ‌ కలెక్టర్ కార్యాలయంలో క‌లెక్ట‌ర్‌.. సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వ నిధి-2022ని ప్రారంభించి, తొలి విరాళం అందించారు. ఆన్లైన్లో విరాళాలు అందించేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ దేశ ర‌క్ష‌ణ‌కు అహ‌ర్నిశ‌లు కృషిచేసిన సైనికుల త్యాగాల‌ను గుర్తుచేసుకుంటూ వారి కుటుంబాల‌కు ప్ర‌తి ఒక్క‌రూ అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. మాజీ సైనికులు, అమ‌ర‌వీరుల కుటుంబాల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త‌న్న విష‌యాన్ని గుర్తుంచుకొని, ప‌తాక దినోత్స‌వ నిధికి విరాళాలు అందించాల‌ని పిలుపునిచ్చారు. దాత‌లు నేరుగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో సంప్ర‌దించిగానీ లేదా Cheque /DD/Cash /Online Transfer చేయొచ్చ‌ని తెలిపారు.  సైనిక సంక్షేమ నిధి అకౌంట్   వివరాలు: ZILLA SAINIK WELFARE OFFICER,  STATE BANK OF INDIA, ZILLA PARISHAD BRANCH   A/C No-  6 2 0 6 4 0 6 0 6 2 3, IFSC CODE– SBIN0020974, MICR CODE – 533002028. ఈ విరాళాలకు ఆదాయపు పన్ను నుంచి సెక్షన్ 80 G అనుగుణంగా  మినహాయింపు ఉంటుంద‌ని వెల్ల‌డించారు.  కార్య‌క్ర‌మంలో భాగంగా  మాజీ సైనికులు సి.ఆర్.సి.ప్రసాద్, ఎం.పి. రామారావు, సీహెచ్ పవన్ కుమార్ (పవన్ కంప్యూటర్స్, కాకినాడ) విరాళాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ కృతికా శుక్లాకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ డాక్టర్ పి.సత్య ప్రసాద్, జిల్లాలోని పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.

Kakinada

2022-12-07 09:11:45

సాయుధ దళాల సేవలు నిరుపమానం.. కలెక్టర్

సాయుధ ద‌ళాలు దేశానికి అందిస్తున్న సేవ‌లు నిరుప‌మాన‌మ‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కొనియాడారు. వారి త్యాగాలు అమోఘ‌మ‌ని పేర్కొన్నారు. సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో బుధ‌వారం ఘ‌నంగా జ‌రిగింది.  క‌లెక్ట‌ర్‌కు  ప‌తాక నిధి ఫ్లాగ్‌ను జిల్లా సైనిక సంక్షేమాధికారి మ‌జ్జి కృష్ణారావు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, సైనిక ద‌ళాల సేవ‌ల‌ను కొనియాడారు.  మంచు కొండ‌ల్లో, ప‌ర్వ‌తాల్లో, ఎడారుల్లో, సముద్రంలో, ఎంతో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం మ‌ధ్య‌, సాయుధ ద‌ళాలు ప్రాణాలు సైతం లెక్క చేయ‌కుండా, అనుక్ష‌ణం ప‌హారా కాస్తూ, దేశాన్ని ర‌క్షిస్తున్నాయ‌ని అన్నారు. వారి త్యాగాల ఫ‌లితంగానే, మ‌న‌మంతా దేశంలో ప్ర‌శాంతంగా ఉండ‌గ‌లుగుతున్నామ‌ని చెప్పారు.

ఉక్రెయిన్ యుద్ద ప‌రిస్థితుల్లో, వైద్య విద్యార్థుల‌ను దేశానికి తిరిగి ర‌ప్పించేందుకు ప‌డ్డ ప్ర‌యాస‌ను గుర్తు చేస్తూ,  దేశంలోని పౌరులు అనుభ‌విస్తున్న స్వేచ్చ‌ గొప్ప‌ద‌నాన్ని వివ‌రించారు. సాహ‌సోపేత వీర‌జ‌వాన్ల‌కు వంద‌నం స‌మ‌ర్పించేందుకు, వారి కుటుంబాల‌కు చేయూత‌నిచ్చేందుకు సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా, పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి, వారి త్యాగాల‌ను గౌర‌వించాల‌ని  పిలుపునిచ్చారు. దేశ ర‌క్ష‌ణ‌లో అమ‌రులైన‌ వీరుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ, గోడ‌ప‌త్రిక‌ల‌ను క‌లెక్ట‌ర్‌ విడుద‌ల చేశారు.

            జిల్లా సైనిక సంక్షేమాధికారి మ‌జ్జి కృష్ణారావు మాట్లాడుతూ, పతాక దినోత్స‌వ నిధికి ఇచ్చే విరాళాల‌కు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు కూడా ఉద‌ని తెలిపారు. సైనికుల సంక్షేమానికి పెద్ద ఎత్తున విరాళాల‌ను అందించాల‌ని కోరారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి, విజ‌య‌న‌గ‌రం ఎస్‌బిఐ ఖాతా నెంబ‌రు 52065221666, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎస్‌బిఐఎన్‌0020931 కు గానీ, లేదా డైరెక్ట‌ర్‌, సైనిక్ వెల్ఫేర్‌, విజ‌య‌వాడ పేరుమీద చెక్కు లేదా డ్రాఫ్ట్ ద్వారా కూడా త‌మ‌కు విరాళాల‌ను అంద‌జేయ‌వ‌చ్చ‌ని సూచించారు.

           ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌.శ్రీ‌రాముల‌నాయుడు, స‌హాయ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు, కెప్టెన్ ఎం.స‌త్య‌వేణి,  కెప్టెన్ ఎ.క‌ల్యాణ్ ఆహోక్‌, లెఫ్టినెంట్ వి స‌న్యాసినాయుడు, హ‌వ‌ల్దార్ మ‌హ‌బూబ్ క‌ట్నాట్‌, మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయ‌కులు, ప‌లువురు విశ్రాంత సైనిక యోధులు, ఎన్‌సిసి కేడెట్లు, స‌చివాల‌య సిబ్బంది, బిఎల్ఓలు పాల్గొన్నారు.

Vizianagaram

2022-12-07 08:50:54

ఆదర్శంగా నిలిచిన మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్

పార్వతీమన్యం జిల్లాకి ఆయన జాయింట్ కలెక్టర్..చిటికేస్తే ప్రైవేటు ఆసుపత్రిలో కార్పోరేట్ వైద్యం కాళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది.. కానీ తన భార్యను ప్రభుత్వ ఆసుపత్రికే పురుడు పోయడానికి తీసుకెళ్లారు.. అదీ తల్లీబిడ్డా వాహనంలోనే.. ప్రభుత్వ ఆసుపత్రిలో చక్కటి కార్పోరేట్ స్థాయి వైద్యం అందుతుందని.. దానిని 
ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తానే స్వయంగా ఆసుపత్రి సేవలను వినియోగించుకున్నారు జెసి ఓ.ఆనంద్. ఆసుపత్రి సిబ్బంది కూడా పరిశుభ్ర వాతావరణంలో పురుడు పోసి చక్కగా మళ్లీ అధే వాహంలో ఇంటికి దగ్గర దించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగానే కార్పోరేట్ వైద్యం  ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తున్నదన్నారు. ముఖ్యంగా ప్రసవాల సేవలకు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగించేసుకోవాలని సూచించారు. తల్లీ బిడ్డను ప్రభుత్వ తల్లీబిడ్డ వాహనంలో తీసుకువచ్చిన సిబ్బందిని జెసి ఈ సందర్భంగా అభినందించారు.

Parvathipuram

2022-12-07 08:40:56

మన్యం జిల్లాలో విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ

అంటరానితనం,  షెడ్యూలు కులాలు, జాతుల వారిపై  దాడులను నివారించుటకు  జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ  సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టరు అధ్యక్షతన  జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ,  అంటరానితనం, అత్యాచారం, దాడులకు గురయిన బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించాలన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు సేవాభావంతో పనిచేయాలని తెలిపారు.  కేసులు నమోదులో జాప్యం ఉండకూడదని, కేసు నమోదుకు అవసరమైన ధృవపత్రాలు వెంటనే భాదితులకు అందించాలని అధికారులను ఆదేశించారు.  కేసు చార్జిషీటు ఉన్నతాధికారులకు వెంటనే పంపించాలన్నారు.  డివిజినల్ స్థాయి సమావేశాలు నిర్వహించి కేసులపై సమీక్ష నిర్వహించాలన్నారు. భాధితులకు అత్యదిక పరిహారం అందించాలని, రెండు లేక అంతకంటే ఎక్కువ సెక్షన్ల ప్రకారం పరిహారం అందేఅవకాశం ఉంటే అందించాలని తెలిపారు. సరైన సెక్షన్ల ప్రకారం  కేసునమోదు  చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిహారం తో పాటు, కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన డా. అంబేద్కర్ సహాయ నిధినుండి కూడా పరిహారం అందించుటకు ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు.  నెలలో ఆఖరి వారంలో ఒకరోజు తహశీల్దార్లు  ఒక గ్రామాన్ని సందర్శించి అంటరానితనంపై  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలతో మాట్లాడి వారికి  సమస్యలు ఉంటే తెలుసుకోవాలన్నారు.    పెండింగులో గల కేసుల వారీ వివరాలు, బాదితులకు  అందించిన పరిహారం పై సమీక్షించారు.  బాధితులు మైనర్లయితే బాలల సంక్షేమ కమిటీ వారిని పరామర్శించాలని, తరచు వారిని కలుసుకొని వారికి మనోధైర్యాన్ని కలిగించాలని తెలిపారు. 

అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డా. ఒ. దిలీప్ కిరణ్ మాట్లాడుతూ  జిల్లాలో నమోదైన కేసులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చార్జిషీటు కాపీలను కలెక్టరు కార్యాలయంనకు మరియు సంబందిత అదికారులకు వెంటనే పంపించాలని తెలిపారు. రిపోర్టును పంపిన పిదప రశీదులను తీసుకొని రికార్డులలో పొందుపరచాలన్నారు. కుల దృవీకరణ సర్టిఫికెట్ నిర్ణీత ప్రొఫార్మా 3 ద్వారా తీసుకోవాలని తెలిపారు. 
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మహమ్మద్ గయాజుద్దీన్ మాట్లాడుతూ జి.ఒ. నంబరు 99 ప్రకారం జిల్లాలో జిల్లా కలెక్టరు అద్యక్షత జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇరవై నాలుగు కేసులు నమోదైనాయని, పదహారు కేసులు విచారణ దశలోను, రెండు కేసులు కోర్టులో ట్రైల్ దశలోను ఉన్నాయని, ఆయ కేసులు సంబంధిత అదికారలకు విచారణ నిమిత్తం పంపించడం జరిగిందని తెలిపారు. బాధితులకు అందించిన  పరిహారం వివరాలను తెలియజేసారు. 

ఈ సమావేశంలో సబ్ కలెక్టరు నూరుల్ కమర్, ఆర్.డి.ఒ. కె.హేమలత, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, సబ్ డివిజినల్ పోలీసు అదికారులు ఎ. సుబాష్, జి.వి.కృష్ణారావు, మురళీధర్, సివిల్ సప్లయి జిల్లా మేనేజరు ఎం. దేవుల నాయక్, జిల్లా పశుసంవర్థక అధికారి ఎ. ఈశ్వరరావు, జిల్లా అగ్నిమాపకఅదికారి కె.శ్రీనుబాబు, కమిటీ సభ్యులు గునగంజి చంద్రయ్య, పిరపాక శ్రీనివాసరావు, మెయి లక్మీకుమారి, ఇతర అధికారులు  పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-07 07:34:55

మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి -జెసి

మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ అన్నారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సైనిక సంక్షేమ బోర్డు సమావేశం సంబంధిత శాఖల అధికారులు , బోర్డు సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాలకు, మరణించిన సైనిక కుటుంబ సంక్షేమానికి ప్రభుత్వం పలు రాయితీలు, ఆర్థిక సహకారం పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ సేవల్లో మాజీ సైనికులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు . ఇళ్ల స్థలాలు, జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించే భూ పంపిణీ త్వరితగతిన జరిగేలా కృషి చేస్తామన్నారు.  జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రూపొందించిన ఎజెండా అంశాలపై చర్చించారు. సైనిక వితంతులు/ కుటుంబ ఆధారితులకు / వికలాంగ సైనికులకు ఇంటి స్థలాల మంజూరు కి సంబంధించి త్వరలోనే కేటాయిస్తామని అన్నారు. మహారాణిపేట లో నున్న సైనిక భవన్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని రోడ్లు , భవనాలు డి.ఈ కి సూచించారు.మాజీ సైనికులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ వివరాలు గుర్తించాలని అన్నారు.

 నగదు బహుమతి పొందిన సైనికులకు సంబంధించి నిధులు మంజూరుకు ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. జీవీఎంసీ దుకాణాల మంజూరులో 2% రిజర్వేషన్ మాజీ సైనికులకు కల్పించేందుకు కృషి చేయాలని జీవీఎంసీ అధికారికి సూచించారు. అదేవిధంగా పోలీస్ కమీషనర్ కార్యాలయంలో విధిలో నున్న సైనికుల కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు పోలీస్ శాఖకు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో డిఆర్వో శ్రీనివాస్ మూర్తి, ప్రత్యేక ఆహ్వానితుడు కల్నల్ ఎ . వెంకట రామన్ , అదనపు అధికారి ,స్టేషన్ హెడ్, జి ఎం డి ఐ సి రామలింగేశ్వరరాజు ,  జిల్లా ఉపాధి అధికారి సుబ్బిరెడ్డి , జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి. సత్యానందం, ఆర్ & బి డిఈ ఫణేశ్వరరావు , అధికారిక , అనధికారిక సభ్యులు కల్నల్ ఎస్. భాషా తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-06 14:06:08

ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని జిల్లాకు రాక

శ్రీకాకుళం జిల్లాలోని పాత్రికేయులతో జర్నలిజం మౌలిక సూత్రాలు, విలువలు, ప్రమాణాలపై ఈ నెల 12న అవగాహన సదస్సు జరుగనుందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. డిసెంబర్ 12న ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు జిల్లాలో పర్యటించనున్నారన్నారు. పర్యటనలో భాగంగా డిసెంబర్ 12తేదీ సోమవారం స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉదయం 11:00 గంటలకు జర్నలిజం మౌలిక సూత్రాలు, విలువలు, ప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అవగాహనా సదస్సులో పాల్గొన్న వారికి పార్టిషిపేషన్ ధృవపత్రం అందజేయడం జరుగుతుంది జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో జరిగే ఈ అవగాహన సదస్సుకు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ శ్రీమతి పిరియా విజయ అతిథులుగా హాజరుకానున్నారన్నారు. వీరితో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2022-12-06 13:59:27

భూగర్భజల నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలి

అక్విఫెర్ మ్యాపింగ్ అనేది భూగర్భ, భూభౌతిక, జలసంబంధమైన అంశమని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం జిల్లాస్థాయి భూగర్భ జలాల సమన్వయ  కమిటీ సమావేశం నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జల శాస్త్రవేత్త రవికుమార్ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో భూగర్భ జలాల లభ్యత స్థితిగతులను ఆయన సమీక్షిం చారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్విపైర్ మ్యాపింగ్ అనేది భూగర్భ జల సంబంధమైన రసాయన క్షేత్ర ప్రయోగశాల విశ్లేషణల కలయికతో జలాశయాలలో భూగర్భ జలాల పరిమాణం, నాణ్యత మరియు స్థిరత్వాన్ని వర్గీకరించడానికి వర్తించే ప్రక్రియ అని తెలిపారు. వివిధ హైడ్రోజి యోలాజికల్ సెట్టింగ్‌లలో అక్విఫర్ మ్యాపింగ్ ద్వారా భూగర్భ జలాల యొక్క ఖచ్చితమైన మరియు సమగ్రమైన సూక్ష్మ-స్థాయి చిత్రం ఈ సాధారణ-పూల్ వనరుకోసం తగిన స్థాయిలో బలమైన భూగర్భజల నిర్వహణ ప్రణాళికలను రూపొందించడానికి వాటి అమలుకు అనుమతిస్తుందన్నారు. 

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి భద్రత, మెరుగైన నీటిపారుదల సౌకర్యం మరియు నీటి వనరుల అభివృద్ధిలో స్థిరత్వాన్ని సాధిం చడంలో ఎంత గానో సహాయ పడుతుందన్నారు సంఘం భాగస్వామ్యంనోడల్ అధికారులు అక్విఫెర్ మ్యాప్‌ల తయారీలో పూర్తిగా పాల్గొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం మరియు మద్దతుతో  జలాశయ నిర్వహణ ప్రణాళికలను అభివృద్ధి చేయా లన్నారు  ఆక్విఫర్ మ్యాపింగ్ వ్యాయామం యొక్క లక్ష్యాలు  ప్రయో జనాల గురించి శాస్త్రవేత్త రవికు మార్ విశదీకరించారు ఈ అంశాలపై సమాజానికి అవగాహన కల్పించాలన్నారు. స్థానిక ప్రజల ద్వారా వారి క్రియాశీల భాగస్వామ్యం ప్రాజెక్ట్ అమలులో ప్రాథమికంగా ఉండా లని ,స్థానిక విద్యావంతులలో కొందరిని గుర్తించి, భూగర్భ జలాలు, ఆక్విఫర్ మ్యాపింగ్ యొక్క ఔచిత్యం , భాగస్వామ్య నిర్వహ ణపై ప్రాథమిక శిక్షణను ఇవ్వాలన్నారు. 

జిల్లాలో ఎక్కడ ఉప్పునీరు ఎక్కడ మంచి నీరు లభ్యత ఉందో ఈ మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా సులభంగా గుర్తించవచ్చునన్నారు. కార్యక్రమం అమలుకై  భూగర్భ జలాలు, నీటిపారుదల, తాగునీరు, వ్యవసాయం, అడవులు మొదలైన సంబంధిత శాఖల ప్రతినిధులతో జిల్లా ప్రభుత్వ భూగర్భ జలాల అధికారులు సమన్వయ కమిటీ లుగా ఉంటారని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు,భూగర్భ జల శాఖ డిడి రాధాకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ సూప ర్టెండెంట్ ఇంజనీర్, ఎన్ వి కృష్ణా రెడ్డి, సిపిఓ వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పిడి శివశంకర్ ప్రసాద్, జెడి మత్స్య శాఖ షేక్ లాల్ మహమ్మద్, డిఎఫ్ఓ ఎంవి ప్రసాద్ రావు కమిటీ సభ్యులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2022-12-06 11:47:16

ఆక్వాకల్చర్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత అభివృధి చెందాలి, కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నై తో రిజిష్టర్ కానివి తొలగించవచ్చు అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ, శ్రీకాకుళం, టెక్కలి మరియు పలాస డివిజినల్ స్థాయి అక్వాకల్చర్ కమిటీలతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో మత్స్య శాఖ, అటవీశాఖ, రెవెన్యూ , ఇరిగేషన్, వ్యవసాయ మరియు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. జాతీయ హరిత  ట్రిబునల్  స్పెషల్ బెంచ్, చెన్నై వారి యొక్క ఆదేశములు మేరకు జిల్లా లోని  అనుమతి లేకుండా 1401 ఎకరాలు రొయ్యలు సాగు చేస్తున్న 464 మంది  రైతులను గుర్తించడమైనది. సదరు రైతులకు  కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నై రూల్స్ ప్రకారం క్రమబద్దీకరణ చేయుటకు గల అవకాశాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని డివిజినల్ స్థాయి అక్వాకల్చర్ కమిటీలకు జిల్లా కలెక్టర్ ఆదేశించడమైనది.

జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత అభివృధి పరిచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  జిల్లాలో  2953 ఎకరాలు  ఆక్వాకల్చర్ జరుగుతుందని. అందులో  1552 ఎకరాలు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాయని,  1401 ఎకారాలు రిజిస్ట్రేషన్ లేకుండా ఆక్వాకల్చర్ నిర్వహిస్తున్నారని, సంబంధిత మండల తహశీల్దార్లు 1401 ఎకరాలకు సంబంధించిన నివేదికలు అందజేయాలి అన్నారు. ఆక్వాకల్చర్ చేస్తున్నావారికి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ చేయాల్సింది, లేని వాటిని రద్దు చేయాలన్నారు. ఇది మంచి అవకాశం. జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత పెంచాల్సి ఉందని అందుకు కావలసిన చర్యలు చేపట్టాలని జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత పెంచే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆక్వాకల్చర్ కు సంబంధించిన వివరాలు తెలియజేసారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ ఉన్న వారికి మాత్రమే రాయితీలు వర్తిస్తాయని అందుకే రిజిస్ట్రేషన్ తప్పక కలిగి ఉండాలన్నారు. 5 హెక్టార్లు కన్నా తక్కువ విస్తీరణం గల రైతుల ధరఖాస్తులను డివిజినల్ స్థాయి కమిటీ ఛైర్మన్ గారైన రెవెన్యూ డివిజినల్ అధికారి వారి ఆమోదంతో కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నైవారికి నేరుగా పంపవచ్చును 5 హెక్టార్లు కన్నాపై బడి విస్తీరణం గల రైతుల ధరఖాస్తులను మాత్రం జిల్లా కలెక్టర్ , జిల్లా స్థాయి కమిటీద్వారా కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నైవారికి పంపడమగునని తెలిపినారు.

ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి జి. హారిక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ పి.వి.శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకట్ రామన్, డి.ఆర్.డి.ఎ ప్రోజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి సితారాముర్తి, మండల రెవెన్యూ అధికారులు,  మత్స్య శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

 

Srikakulam

2022-12-06 11:15:32