1 ENS Live Breaking News

స్పెషల్ సమ్మర్ రివిజన్ 2023 పై సమావేశం ఏర్పాటు

ప్రత్యేక సారాంశ సవరణపై నేడు సమావేశం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  స్పెషల్ సమ్మర్ రివిజన్ 2023 కొరకు రోల్ అబ్జర్వర్ గా రాష్ట్ర డెయిరీ అభివృద్ధి కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ఎపి అమూల్ ప్రత్యేక అధికారి శ్రీ అహ్మద్ బాబుని  నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు.  ఈ సమావేశంలో అబ్జర్వర్ పాల్గొంటారనిఈ నెల 6వ తేదీన ఉదయం 9.30 గం.ల నుండి ఉ.11.00 గం.ల  కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పార్లమెంటు సభ్యులుశాసన సభ్యులు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇఆర్ఓలతో ఇంటరాక్షన్ ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంనకు ప్రజా ప్రతినిదులుఅధికారులు హాజరు కావలసినదిగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Srikakulam

2022-12-05 11:47:41

స్టాఫ్ నర్సులకు వెంటనే సర్వీస్ సర్టిఫికేట్లు ఇవ్వాలి

విజయనగరం జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులుగా చేస్తున్న వారికి తక్షణమే సర్వీస్ సర్టిఫికేట్ లు జారీ చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.పద్మలీల ను ఆదేశించారు. వారు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువు సమీపిస్తున్న కారణంగా సోమవారం లోగా అందరికీ సర్టిఫికెట్ లు మంజూరు చేయాలని చెప్పారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ ను కలిసి తమ సమస్యను విన్నవించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం ఉద్యోగి ఒకరు సర్టిఫికేట్ లు నిరాకరించడంతో పాటు తమ పట్ల దురుసుగా మాట్లాడుతున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే మంత్రి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. పద్మలీల తో ఫోన్ లో మాట్లాడి సర్టిఫికేట్ ల జారీతో పాటు మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన శాఖ ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Vizianagaram

2022-12-03 14:08:49

ప్రణాళికా బద్దంగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలి

 తప్పులులేని ఓటర్ల జాబితా తయారు చేసేందుకు  ప్రణాళిక రూపొందించుకోవాలని ఓటర్ నమోదు పరిశీలన అధికారి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వి శేషగిరి బాబు అన్నారు.  శనివారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయం స్పందన  సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి  తోకలిసి ఎం వి శేషగిరిబాబు ఎలక్ట్రోరల్  రోల్స్ స్పెషల్ సమ్మరీ రివిజన్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్వచ్ఛమైన ఓటర్లు జాబితా రూపొందించేందుకు స్వీప్ యాక్టివిటీ ఎక్కువగా చేయాలని ఆయన సూచించారు.  క్లైములు ఎంక్వయిరీ చేసేటప్పుడు ఖచ్చితమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రికార్డు మైంటైన్ చేయాలని ఆయన  అన్నారు . గరుడ యాప్ గురించి బిఎల్ఓ లకు శిక్షణ ఇవ్వాలని ,  డేటా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆయన అన్నారు.  తప్పుల  లేని ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్వోలు   పనిచేయాలని ఎం వి శేష గిరి బాబు సూచించారు .

    జిల్లా కలెక్టరు   ప్రశాంతి మాట్లాడుతూ  ఓటర్ల జాబితాలో చేర్పులు ,మార్పులు ఉన్నట్లయితే వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టరు అన్నారు ఒకే ఓటర్ రెండు సార్లు నమోదు కాకుండా జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.  ప్రతి పోలింగ్ స్టేషన్లో  డిసెంబర్ 4  తేదీన ఓటర్ల నమోదు, తప్పొప్పుల సవరణ కు ప్రత్యేక క్యాంపు నిర్వహించలన్నారు. క్యాంపు నిర్వహణ తేదీల్లో బిఎల్ఓలు  పొలిటికల్ పార్టీలు నియమించిన ఏజెంట్లతో పాటు ఓటర్ లిస్టులతో సిద్ధంగా ఉండాలన్నారు.  ఓటు నమోదుకు దరఖాస్తు స్వీకరణతో పాటు, ఓటరుకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి సూచించారు.

ఈ సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గాల వారీగా  భీమవరం ఆర్డీవో  దాసి రాజు,  తణుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి Z. వెంకటేశ్వరరావు , తాడేపల్లిగూడెం హార్టికల్చర్ ఏ డి ఎ.దుర్గేష్, ఆచంట  జిల్లా పరిశ్రమల శాఖ  జి ఎం  వి.ఆదిశేషు,  ఉండి జిల్లా కోపరేటివ్ అధికారి ఎం. రవి కుమార్ , పాలకొల్లు చేనేత జౌలి శాఖ ఏ డి అప్పారావు,బిజెపి పార్టీ కోమటి. రవి కుమార్,కాంగ్రెసు పార్టీ యం. శేఖర్, వైయస్సార్ పార్టీ కామన. నాగేశ్వర రావు, టిడి పి పార్టీ యం. శ్యాంబాబు, సి పి ఐ పార్టీ కే. భీమారావు, సి పి యం పా ర్టీ జె యన్ వి గోపాలం, పురపాలక సంఘం కమిషనర్లు, తది తరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-12-03 13:35:33

జిల్లాలో ప్ర‌ణాళికాయుతంగా స‌మ‌గ్ర భూ స‌ర్వే

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా నియ‌మించిన రీస‌ర్వే డిప్యూటీ త‌హ‌సీల్దార్లు ప్ర‌తిష్టాత్మ‌క స‌మ‌గ్ర భూస‌ర్వే కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేసేందుకు, మ‌రింత ప్ర‌ణాళికాయుతంగా నిర్వ‌హించేందుకు కృషిచేయాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా ఆదేశించారు. శ‌నివారం కాకినాడ క‌లెక్ట‌రేట్ విధాన‌గౌత‌మి స‌మావేశ మందిరంలో కాకినాడ డివిజ‌న్ ప‌రిధిలోని త‌హ‌సీల్దార్లు, డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, రీ స‌ర్వే డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, వీఆర్‌వోల‌కు జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హ‌క్కు, భూస‌ర్వే శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, డీఆర్‌వో కె.శ్రీధ‌ర్‌రెడ్డి, కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ, స‌ర్వే ఏడీ బి.ల‌క్ష్మీనారాయ‌ణ‌ల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ మొద‌టి ద‌శ‌లో కాకినాడ డివిజ‌న్ ప‌రిధిలో తొలి ద‌శ‌లో 121 గ్రామాల‌కు సంబంధించి స‌మ‌గ్ర భూస‌ర్వే రికార్డుల రూప‌క‌ల్ప‌న‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసిన రెవెన్యూ, స‌ర్వే అధికారుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. బృంద స్ఫూర్తితో, నిబ‌ద్ధ‌త‌తో క‌ష్ట‌ప‌డి అధికారులు ప‌నిచేశార‌న్నారు. ఇదే స్ఫూర్తితో ఇక‌పైనా ప‌నిచేసి రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకెళ్లాల‌న్నారు. రీ స‌ర్వే కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా నియ‌మించిన డిప్యూటీ త‌హ‌సీల్దార్లు నెల‌లో 15 రోజులు క్షేత్ర‌స్థాయిలో గ్రామాల్లో ప‌ర్య‌టించాల‌న్నారు.

 అప్పీళ్ల‌ను స్వీక‌రించి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించేందుకు కృషిచేయాల‌న్నారు. ఇక‌పై ప్ర‌తి నెల‌లో మొద‌టి వారం శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నామ‌ని.. వివిధ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, కొత్త అంశాల‌పై అవ‌గాహ‌న పెంపొందించేందుకు ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు దోహ‌దం చేస్తాయ‌న్నారు. భూ హ‌క్కు ప‌త్రాల పంపిణీ ప్ర‌క్రియకు సంబంధించి డిసెంబ‌ర్ 6న మొద‌టి కార్య‌క్ర‌మం పిఠాపురంలో జ‌ర‌గ‌నుంద‌ని.. త‌ర్వాత గ్రామాల వారీగా పంపిణీ జ‌రుగుతుంద‌న్నారు. ప‌త్రాల పంపిణీ పూర్త‌యిన చోట స్టోన్ ప్లాంటేష‌న్‌కు స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని సూచించారు. స‌ర్వేకు ముందు, స‌ర్వే స‌మ‌యంలో, ఆ త‌ర్వాత ప్ర‌తి ద‌శ‌లోనూ అధికారులు అప్ర‌మ‌త్తంగా, స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. రైతుల నుంచి ఏ ఫిర్యాదు అందినా క్షుణ్నంగా ప‌రిశీలించి, ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా సూచించారు. స‌మావేశంలో కాకినాడ డివిజ‌న్‌లోని త‌హ‌సీల్దార్లు, డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, రీస‌ర్వే డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

Kakinada

2022-12-03 13:20:51

సచివాలయాల సేవలు వినియోగించుకోవాలి

సచివాలయ  సేవలను  ప్రజలు  సద్వినియోగం చేసుకోవాలని  నోడల్ అధికారి కె.రామచంద్ర రావు అన్నారు.  గ్రామ వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి. చిట్టిబాబు ఆధ్వర్యంలో కురుపాం, పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్స్, వార్డ్ విద్యా, డేటా ప్రోసెసింగ్ కార్యదర్సులకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శిక్షణా కార్యక్రమాన్ని శని వారం నిర్వహించారు. ఈ  సందర్బంగా రామ చంద్ర రావు మాట్లాడుతూ సచివాలయాలు అందిస్తున్న సేవలపై ప్రజలకు  అవగాహన  పెంపొందించుటకు  కృషి చేయాలని తెలిపారు. సచివాలయంలో సేవలు పొందేవారి సంఖ్య పెరగాలని, సిబ్బంది అందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావలని అన్నారు. రికార్డులు కచ్చితంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో  నిర్వహిస్తున్న విస్తృత  సేవలపై ప్రజలకు వాలంటీర్  ద్వారా అవగాహన పెంపొందించాలని తెలిపారు. జిల్లా కలెక్టరు  నిశాంత్ కుమార్ కు సచివాలయ వ్యవస్థపై నమ్మకం ఉందని, నమ్మకాన్ని నిలుపుకొనే విధంగా  సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సేవలు  అందించాలన్నారు.

సచివాలయంలో ఉన్న ఉద్యోగులు సమన్వయంతో  పనిచేయాలన్నారు. ఇ - సర్వీస్ లో బిల్స్ పెండింగ్ లో ఉండరాదని, పెండింగ్ లో ఉన్నయడల వెంటనే  చెల్లించాలన్నారు. త్వరలోనే  నోడల్ అధికారులను  నియమిస్తామని తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఏ డి సి ప్రహలాద్,  యస్ బి సి సి డి సి  శ్రీను, ఏపీ ఆన్లైన్ డి సి రాజేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-03 12:51:00

కాకినాడ కలెక్టర్ వినూత్న ప్రయోగం..స్పందన ఎక్కడంటే

ఒక జిల్లా కలెక్టర్ మనసు పెడితే ప్రభుత్వ కార్యక్రమాలు అమలు, సంక్షేమ కార్యక్రమాలు తీరు ప్రజల్లో చాలా చక్కగా వుంటుంది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం గ్రామస్థాయిలో సచివాలయాల్లో సక్రమంగా జరగడం లేదనే విషయాన్ని ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లింది. దీనితో స్పందించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్పందన కార్యక్రమాన్ని మండల 
కేంద్రాల్లో నిర్వహించడం ద్వారా దానిని పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువ చేయాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఈ సోమవారం స్పందన కార్యక్రమాన్ని కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కో వారం ఒక్కో మండలంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా జిల్లావ్యాప్తంగా పర్యటనలు చేసినట్టు ఉండటంతోపాటు, స్పందనపై ప్రజల్లో పూర్తిస్థాయి 
చైతన్యం తీసుకురావాలని కూడా నిర్ణయించారు.

మండలాల్లో స్పందన పెట్టేది ఇందుకే..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు 14వేల 5 ఉన్నాయి. నిజంగా ప్రతీరోజూ ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి కాకపోయినా వారానికి ఒకరోజు స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసినా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్పందన అర్జీలు తగ్గాలి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా ఇంకా నేటికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రతీసోమవారం స్పందన అర్జీలు వందల సంఖ్యలో 
వస్తున్నాయి..ఇదేదో ఈఎన్ఎస్ చెబుతున్నమాట కాదు స్పందన దరఖాస్తుల సంఖ్యను ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్లు మీడియా ముఖంగా ప్రకటిస్తున్న సంఖ్యలు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు తొలుత నియోజకవర్గ కేంద్రాల్లో స్పందనను ఏర్పాటు చేశారు. అయినా సచివాలయాల్లో మార్పురాలేదు. గ్రామస్థాయిలోనే స్పందన పూర్తిస్థాయిలో జరగాలంటే మండల స్థాయిలో స్పందన పెడితే తప్పా ఫలితం రాదని భావించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్పందనను మండల కార్యాలయాలకు మళ్లించారు.

ఇక సచివాలయ సిబ్బంది కాకమ్మ కబుర్లు చెల్లవు..
కాకినాడ జిల్లాలో జిల్లా కలెక్టర్ మండల కేంద్రాల్లో స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖచ్చితంగా స్పందన కార్యక్రమం పెట్టి తీరాలి. లేదంటే జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు కానట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇప్పటికే పలు మార్లు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు  జారీచేసినప్పటికీ మార్పురాకపోవడంతో అధికారికంగా జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమాన్ని మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించాలని తలచారు. దీనితో సచివాలయ సిబ్బంది కాకమ్మ కబుర్లు, కల్లబొల్లి మాటలు చెప్పడానికి ఆస్కారం లేకుండా పోతుంది. అంతేకాదు..ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన యూనిఫారంను కూడా ధరించుకు రావాల్సి వుంటుంది. ప్రభుత్వం మంచిగా చెప్పినంతకాలం వినని ప్రభుత్వ సిబ్బంది..జిల్లాల్లో కలెక్టర్లు ఈ తరహా నిర్ణయిం తీసుకుంటే..,అసలు మండల స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న మండల అధికారుల్లో కూడా చలనం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.. చూడాలి కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా మండల స్థాయిలో నిర్వహించే స్పందన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏ తరహా మార్పు తీసుకువచ్చి..ప్రతీసోమవారం నిర్వహించే స్పందనకు అర్జీల సంఖ్యను ఎంతమేరకు తగ్గిస్తుందో..!

Kakinada

2022-12-03 12:22:48

దివ్యంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి

సమాజంలో జీవిస్తున్న అందరూ సమానమేనని,మీరు దివ్యంగులు కాదు సకలాంగులని శ్రీకాకుళం జిల్లా విభిన్నప్రతిబావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు ఎం.కిరణ్ కుమార్ అన్నారు. శనివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు, లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్, లయన్స్ ప్రతినిధులు సౌజన్యంతో సేకరించిన నగదు, వస్తువులు ఆరుగురు నిరుపేద వికలాంగులకు అందజేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపిక చేసిన విభిన్న ప్రతిభావంతులను ఘనంగా సన్మానించారు. అనంతరం సహాయ సంచాలకులు కిరణ్ కుమార్  మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కోటి రూపాయల విలువ కలిగిన ఉపకరణాలు, రుణాలు  ఈ రోజు  అందజేస్తున్నామని అన్నారు. త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలకు సంబంధించి  స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేసి  ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల  భర్తీ ఇటీవల చేపట్టామని అన్నారు. అర్హులైన వికలాంగులకు లాప్ టాప్స్, టచ్ ఫోన్లు, చంక కర్రలు, శ్రవణ యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్ళు, వీల్ చైర్స్, అంధుల చేతికర్రలు సరఫరా చేస్తున్నామని అన్నారు. 

విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే పనులు చేపట్టిన వాకర్స్ సంస్థలు, లయన్స్ క్లబ్ సేవలు మరువరానివని కిరణ్ కొనియాడారు. స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షుడు హరికా ప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి.జి.గుప్తా, లయన్స్ క్లబ్ మాజీ చైర్మన్ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, ఇంటాక్ కో కన్వీనర్ వావిలపల్లి జగన్నాధ నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు బి.వి.రవిశంకర్, బి.దేవీప్రసాద్, గజల్స్ వాసుదేవ్, గోలీ సంతోష్, నల్లబాటి కృష్ణమూర్తి, బొడ్డేపల్లి ప్రసాదరావు, మోనంగి రవి, వూన్న నాగభూషన్ రావు, డాక్టర్ మాదిన ప్రసాదరావు, వంశధార రిటైర్డ్ ఎస్.ఈ.పి. రంగారావు, కిల్లారి రవి,ఎం.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-03 11:17:37

సారికలో ఈనెల 7 న ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ

పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద  విజయనగరం నియోజకవర్గం లో  2 వ విడత ఇళ్ళ స్థలాల  పట్టాల పంపిణీ జరుగుతుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి  తెలిపారు.   ఈ నెల 7న విజయనగరం నియోజకవర్గం పరిదిలోనున్న సారిక లో పట్టాల పంపిణీ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్ల పై డిప్యూటీ స్పీకర్  మేయర్ విజయలక్ష్మి తో కలసి శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్.డి.ఓ సూర్య కళ,  మున్సిపల్ కమీషనర్ శ్రీరాములు నాయుడు తో సమీక్షించారు. సారిక లే అవుట్ నందు 3569  ఇళ్ళ స్థలాలను గుర్తించడం జరిగిందని, వాటిలో 47 వార్డులకు సంబంధించిన  3455 మంది  అర్హులైన లబ్దిదారులకు కేటాయించడం జరిగిందని తెలిపారు.  ఈ నెల 7 న వారందరికీ పట్టాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్, రెవిన్యూ శాఖల వారు సమన్వయంగా పని చేసి  విజయవంతం చేయాలనీ  సూచించారు. వార్డ్ వారీగా లబ్దిదారుల జాబితాలను కార్పొరేటర్లకు అందజేయాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు.

 సచివాలయం ద్వారా లబ్ది దారుల వెరిఫికేషన్ జరగాలని, ఇచ్చిన అడ్రస్ నందు లబ్ది దారు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయాలనీ తెలిపారు.  లబ్దిదారులందరినీ  వార్డ్ కౌన్సిలర్లు సచివాలయాల సిబ్బంది ద్వారా ఆహ్వానించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి  3 వేల మంది పైబడి  హాజరవుతారని, వారందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. మున్సిఅల్ కమీషనర్ శ్రీరాములు నాయుడు ఏర్పాట్ల పై వివరించారు. 4 బ్లాక్ లుగా ఏర్పాటు చేసి లబ్ది దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పట్టాలు ఇచ్చేందుకు  సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే పట్టాలను తయారు చేయడం జరిగిందని తెలిపారు.   అదే విధంగా  90 రోజుల ఇళ్ళ పట్టాలన్నీ మజూరు చేయడం జరిగిందని, ఎలాంటి పెండింగ్  లేదని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఈ. రేవతీ దేవి, కార్పొరేటర్లు, విజయనగరం ఎం.పి.పి  మామిడి అప్పల నాయుడు,  తహసిల్దార్ బంగార్రాజు,  హౌసింగ్ డి.ఈ , ఎ.ఈ లు పాల్గొన్నారు. 

Vizianagaram

2022-12-02 11:38:36

VJF ఎన్నికల్లో విజయంకోసం ప్రత్యర్ధుల మాస్టర్ ప్లాన్

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెస్ క్లబ్. ఈప్రెస్ క్లబ్ లో అధ్యక్ష, కార్యదర్శిల దగ్గర నుంచి సభ్యుల వరకూ అందరికీ ప్రత్యేక గౌరవం, గుర్తింపు వుంటుంది. ఇందులో చాలా మంది వర్కింగ్ జర్నలిస్టులు కాకపోయినా కమిటీలో ఉన్నారు గనుక అలా చెల్లిపోతూ కాలంగడిపేస్తున్నారు. అలాంటి ప్రెస్ క్లబ్ కు 2023 ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహించాలని ఆపధర్మ కార్యవర్గం నిర్ణయించింది. ఈమేరకు విశాఖజిల్లా కలెక్టర్ కు ఈ విషయాన్ని కూడా తెలియజేసింది. ఎప్పుడైతే విజెఎఫ్ కి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారో అప్పటినుంచి ఆశావాహులు, ఇప్పటికే రింగ్ అయిపోయిన సభ్యులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అంతేకాదు విజయం కోసం పక్కాగా మాస్టర్ ప్లాన్ వేసుకొని మరీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్టు ఏంటంటే.. ప్రత్యర్ధులు విజెఎఫ్ సభ్యులకు అర్ధమయ్యే విధంగా అసలు విషయం చెప్పే ప్రయత్నంలో సఫలీకృతులు అవుతున్నట్టుగా కడపటి వార్తలు అందుతున్నాయి. ఇప్పటికే కోర్టు కేసుల్లో చిక్కుకొని అప్పనంగా పదేళ్లు ఎలాంటి ఎన్నికలూ లేకుండా పరిపాలించేసిన కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన తరువాత అసలు రాజకీయం మొత్తం రసవత్తరంగా సాగడం ప్రారంభించింది..

అసలు సభ్యుల సంఖ్యపై రగడ జరిగే అవకాశం..?
విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఓటుహక్కు ఉన్న సభ్యులు సుమారు 800 మంది వరకూ ఉన్నారు. ప్రో మెంబర్లుగా వున్నారో మరో 800 వరకూ ఉన్నారు. ఆతరువాత సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు మరో 500 మంది వరకూ ఉన్నారు. అయితే కోర్టు నిబంధనల ప్రకారం ఎవరికీ కొత్త సభ్యత్వాలు ప్రెస్ క్లబ్ జారీ చేయలేదు. కానీ ప్రెస్ క్లబ్ బయిలా ప్రకారం మరణించిన, జర్నలిస్టులుగా పనిచేయడం మానేసిన వారి ఓట్లను ఎన్నికలకు వెళ్లే నాటికి కార్యవర్గం సిద్దం చేయాల్సి వుంది. గత కార్యవర్గాలు నడిచిన క్రమంలో ఇబ్బడి ముబ్బడిగా రెండు మూడు పత్రికల విలేఖరులకు విజెఎఫ్ మెంబర్ షిప్ లు ఇచ్చేశారు. అందులో చాలా మంది బదిలీలు అయిపోగా.. మరికొందరు మ్రుతిచెందగా,, ఇంకొందరు వృత్తిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. వాస్తవానికి ఇలాంటి ఓటర్లను ప్రెస్ క్లబ్ ఎన్నికలకు వెళ్లేనాటికి తొలగించి, ఆ జాబితా కోర్టుకి తెలియజేసిన తరువాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని లేదంటే ఆ విషయాన్ని బహిర్గతం చేస్తామని ప్రత్యర్ధి వర్గాలు మాస్టర్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుత కార్యవర్గం(ఆపధర్మ) ఈ పనిచేయకుండా ఎన్నకలకు వెళితే వాళ్లు దాచిపెట్టిన అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రాజ్యాంగబద్దంగా పోరాడతామని కూడా హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఆ విషయాన్ని ప్రస్తుత సభ్యులకు, ఓట హక్కు కలిగి వున్నవారికీ చెప్పి చైతన్యం తీసుకు వస్తున్నారు.

విజయనగరం ప్రెస్ క్లబ్ పరిస్థితే వస్తుందా.. తేవడానికే ప్రయత్నమా ?
విజయనగరం జిల్లాలోని ప్రెస్ క్లబ్ కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంలో అక్కడి జిల్లా కలెక్టర్ ఆ ప్రెస్ క్లబ్ ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రెస్ క్లబ్ కలెక్టర్ అద్యక్షతన నిర్వహిస్తున్నారు. ఇపుడు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లోని అంశాలను, ప్రస్తుత కార్యవర్గం నిర్భయంగా  ఓటర్లకు, ఇతర సభ్యులకు తెలియజేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే సరేసరి అని లేదంటే జిల్లా కలెక్టర్ కు, ప్రెస్ అకాడమీకి, విజెఎఫ్  దాచిపెట్టిన అంశాలను వివరించి ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వ పరం చేయిస్తామనే సంకేతాలు కూడా పంపిస్తున్నారు. వాస్తవానికి కోర్టు నిబంధనల ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుని హోదాలోనే ప్రెస్ క్లబ్ కార్యక్రమాలు నిర్వహణ జరగాలి(కోర్టులో కేసులు ఉన్నందున) . కానీ ప్రెస్ క్లబ్ మొత్తం కార్యక్రమాలు  చేపడుతుందని ఇప్పటికే కొందరు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలిసింది. నిజంగా అదే జరిగితే ప్రెస్ క్లబ్ బయిలా..కోర్టు ఆదేశాలు..ప్రెస్ క్లబ్ లోని ఓటర్లు, మృతి చెందిన వారు,  విధి నిర్వహణ నుంచి తప్పుకున్నవారి జాబితాలు ఇస్తే.. పరిశీలించి నిబంధనలు అతిక్రమించారని తెలిస్తే చర్యలు చేపడతామని కలెక్టర్ కూడా సదరు ఫిర్యాదు దారులకు హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.

విజెఎఫ్ ఎన్నికల్లో కేస్ట్  కోటరీ పనిలో వారంతా బిజీ బిజీ..!
విశాఖలోని విజెఎఫ్ కి ఎన్నికలు నిర్వహిస్తే తమ తమ కార్యవర్గాలను గెలిపించుకోవాలని ఎవరి కోటరీల్లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాదు ఈ సారి సామాజిక రంగు పులిమి మరీ కార్యక్రమాలు చేపట్టి తమ  బలా బలాలను ప్రదర్శించే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో వైపు ఈసారి కొత్తవారితో కార్యవర్గం ఏర్పాటు చేయాలనే కొందరు సీనియర్లు భావిస్తున్నారని తెలిసింది. దానికి అనుగుణంగా రెండు కార్యవర్గాలను కూడా  సిద్దం చేసినట్టు సమాచారం. ఎవరు ఏ విధంగా కోటరీలు చేసుకున్నా..పాత కార్యవర్గంలోని వారే మళ్లీ పోటీచేయాలని ఇప్పటికే బలంగా నిర్ణయించుకున్న తరుణంలో విజెఎఫ్ ఎన్నికల వేడిని మరింతగా పెంచుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు కూడా లేని హడావిడి రాజకీయం మొత్తం ఈ  విజెఎఫ్ ఎన్నికల్లోనే ఉందా అన్నట్టుగా జరుగుతున్న కార్యక్రమాలు, చేస్తున్న ప్రచారాలు, గూడు పుఠానీలు, మాస్టర్ ప్లాన్ ను ప్రెస్ సభ్యులను, కొత్తగా ఆరాటపడేవారిని అందరినీ ఆలోచింప చేస్తున్నాయి.

వాస్తవాలను తెలియజేసేందుకే ఈఎన్ఎస్ ప్రయత్నం..అదరం..బెదరం..
ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ens live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net వాస్తవాలను తెలియజేసే క్రమంలో తమ దృష్టికి వచ్చిన వాషయాన్ని మాత్రమే జర్నలిస్టులు, పాఠకుల ముందు ఉంచుతున్నది. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. ఏ ఒక్కరికీ కొమ్ముకాయమని కూడా ఖచ్చితంగా ప్రకటిస్తున్నాం. అసలు విజెఎఫ్ ఎన్నికలు ప్రకటించిన తరువాత తెరవెనుక ఏం  జరుగుతున్నది..ఏం జరగబోతున్నది..వాస్తవాలేంటి..అవాస్థవాలేంటి.. ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు..మళ్లీ విజెఎఫ్ లో తమ సీట్లను భర్తీచేసుకునేందుకు జర్నలిస్టులు కానీ వారు ఎంత ఆరాట పడుతున్నారు..ఇప్పటి వరకూ ఏ నెపంతో పదవులు అప్పనంగా అలంకరించారు తదితర విషయాలను మాత్రమే నిర్భయంగా తెలియజేశాం. ఇకపై కూడా తెలియజేస్తాం..ఈ విషయంలో ఈఎన్ఎస్ ని ఎవరో ప్రభావితం చేస్తున్నారని అనుకున్నవారికి ఈ వార్త ఒక ఉదాహరణగా నిలుస్తుందని మాత్రమం చెప్పగలం. విజెఎఫ్ ఎన్నికల్లో కోర్టు ఏం చెప్పింది..కార్యవర్గం ఏం చేస్తున్నది..ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నది.. ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేసింది అనే అన్నివిషయాలు తెలియజేసినట్టుగానే..రానున్నరోజుల్లో కూడా వాస్తవాలు ఎవరికీ భయపడకుండా నిర్భయంగా బయటపెడతామని చెబుతున్నాం. అంతేకాకు ఎవరు ఏమనుకున్నా..పట్టించుకునేది లేదని కూడా చెబుతున్నాం. భారత దేశపు తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఈఎన్ఎస్.. ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు.. ఎవరికీ అదరదు..మరెవరికీ బెదరదు..!

Visakhapatnam

2022-12-02 11:10:40

వారంలో 22వేల హక్కు పత్రాలు పంపిణీ కావాలి

రాష్ట్రంలో జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పత్రాల జారీలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ను భూపరిపాలన ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్ అభినందించారు. హక్కు పత్రాల జారీ, జగనన్న శాశ్వత భూ హక్కుకు సంబంధించిన రీ సర్వే, వివాద స్థలాలపై చర్యలు, మ్యుటేషన్లపై జిల్లా కలెక్టర్లుతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ 
సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వారంలోగా మరో 22 వేల భూహక్కు- భూరక్ష పత్రాలను జారీచేయాలని ఆదేశించారు. జిల్లాలో మిగిలిన రీసర్వే పనులను వచ్చే ఫిబ్రవరి నాటికి ఫ్లైయింగ్ పూర్తి చేయాలన్నారు. రీ సర్వే అనంతరం కొలత రాళ్లు పని పూర్తిచేయాలని వివరించారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించడం గొప్ప శుభ పరిణామని, ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టరును అభినందిస్తున్నట్లు తెలిపారు.

సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కుదారులకు జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలని, మరో వారంలో 22వేల పత్రాలు జారీచేసేందుకు చర్యలు తీసుకోవాలని 
అన్నారు. గడువులోగా మ్యుటేషన్లు,  తీసుకోవాలని, ఇప్పటివరకు పెండింగులో ఉన్నవాటిపై ఎప్పటికపుడు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, భూసర్వే మరియు రికార్డుల శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-02 10:05:36

పోలీసు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

పోలీసుశాఖలోని అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా  ఎస్పీ ఎం.దీపిక పేర్కొన్నారు. శుక్రవారం "పోలీసు వెల్ఫేర్ డే" కార్యక్రమాన్ని జిల్లా కార్యాలయంలో నిర్వహించి. పోలీసు ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకూ, హోం గార్డుల నుంచి స్టేషన్ సిబ్బంది వరకూ వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ముఖ్యమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్టు జిల్లా ఎస్పీ తెలియజేశారు. పోలీసు సిబ్బందికి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం పనిచేస్తుందనే భరోసాని  సిబ్బందికి కల్పించారు.  అదే సమయంలో పోలీసు స్టేషన్ కి వచ్చిన ప్రజల సమస్యలు కూడా ఇదే తరహాలో పరిష్కరించి ప్రభుత్వం నుంచి సత్వర 
న్యాయం జరిగేవిధంగా చూస్తామని ప్రకటించారు.

Vizianagaram

2022-12-02 09:56:08

ఔరా..విశాఖ తీరంలో నేవీడే రిహార్సల్స్ ..

నేవీ డే వేడుకలకు విశాఖ తీరం ముస్తా బవుతోంది. ఆర్కే బీచ్‌లో యుద్ధనౌకలు, నేవీ హెలికాప్టర్లతో విన్యాసాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. డిసెంబర్ 4న జరిగే నేవీ డే వేడుకలకు ఆర్కే బీచ్‌లో కొద్ది రోజులుగా ముమ్మ రంగా రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. సముద్రంలో యుద్ధనౌకలు, హెలికాప్టర్ల విన్యాసాలను చూసేందుకు విశాఖ నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బీచ్‌కు చేరుకుంటున్నారు.దీంతో ఆర్కే బీచ్ సందడిగా మారింది.యుద్ధ సమ యంలో నావికాదళం ఎలా స్పంది స్తుం ది.. శత్రువులపై ఎలా ఎదురు దాడికి దిగుతుందో.. కళ్లకు కట్టినట్లు చూపించారు. తీరానికి వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.

Visakhapatnam

2022-12-01 05:34:27

యానాంలో ఉ.11దాటితే ప్రాణం పోతున్నా వైద్యం చేయరు

కేంద్రపాలిత ప్రాంతం  యానంలోని ప్రజలకు ఆయుష్ శాఖ ప్రభుత్వ  హోమియోపతి ఆసుపత్రి సిబ్బంది నుంచి వింత ప్రవర్తన ఎదురౌతోంది. ఉదయం 11దాటితే కళ్లముందు ఏం జరిగినా మందులు ఇచ్చేది లేదని సిబ్బంది తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ నిభందనల ప్రకారం ఎలాంటి రోగి గ్రస్తులైనా ఉ.11గంటలలోపే రావాలని  ఆ తరువాత వచ్చినా వైద్యం చేయమని స్పష్టం చేస్తున్నారు. ఖాళీగానైనా ఉండొచ్చుకానీ సమయం దాటిన తరువాత వస్తే వైద్యం చేయకూడదనే నిబంధనలున్నాయని సిబ్బంది చెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.  యానాం కేంద్రపాలిత ప్రాంతం కావడం ప్రభుత్వశాఖల సిబ్బంది వ్యవహారం ఇక్కడి అడ్మినిస్ట్రేటర్(యూటి ఏరియా ముఖ్య అధికారి) పెద్దగా పట్టించుకోక పోవడం వలన ఆయుష్ శాఖలో హోమియోపతి, ఆయుర్వేద వైద్యసేవలు ఇక్కడి ప్రజలకు దూరమైపోతున్నాయని ఈ ప్రాంత ప్రజలు మండి పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులున్నది ప్రజలకు వైద్యం చేయడానికా..లేదంటే ప్రత్యేక సమయం పేరుతో వైద్యసేవలు అందించకుండా ఉండేందుకా అంటూ మండి పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్రమోడి ఆయుశాఖను ప్రజలకు పూర్తిస్థాయిలో చేరువ చేయాలని చూస్తుంటే యానాంలోని ప్రభుత్వ హోమియోపతి డిస్పెన్సరీ(ఆయుష్ వెల్ నెస్ కేెంద్రం) సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

Yanam

2022-11-25 08:30:28

PMMSYద్వారా మత్స్యకారులు అభివృద్ది చెందాలి

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారులు మరింతగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు మంగళవారం విజయనగరం జిల్లా పరిషత్ హాల్లో మత్స్యకారులకు పిఎంఎంఎస్వై 11 ద్వారా 31 మోటార్ వాహనాలు, ఐస్ బాక్సులను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. మత్సకారులు ఆర్ధికంగా ముందుకి సాగడం ద్వారా ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుందన్నారు.ఈ కార్యక్రమంలో  జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ లు  సూర్యకుమారి, నిశాంత్ కుమార్, ఎమ్మెల్యేలు పాముల పుష్ప శ్రీవాణి, మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాస రావు, బొత్స అప్పల నరసయ్య, అలజంగి జోగారావు, జెడ్పీటీసీ సభ్యులు, సచివాలయ మత్స్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-11-22 08:37:10

మత్స్యకారులు ఆర్ధిక ఉపాది పెంపొందించుకోవాలి..

మత్స్యకారులు తోటపల్లి రిజర్వాయర్ లో పెంచుతున్న చేపల ద్వారా ఆర్ధిక  ఉపాది పెంపొందించుకోవాలని పార్వతీపురం ఐటీడిఏ పీఓ సి.విష్ణు పేర్కొన్నారు. విజయనగరం ఫిష్ సీడ్ ఫారంలో అభివృద్ది చేసిన  2లక్షల చేప పిల్లలను ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా తోటపల్లి రిజర్వాయర్ లోకి వేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల కోసం చేపడుతున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు..సిబ్బంది పాల్గొన్నారు.

Thotapalli

2022-11-22 02:47:23