1 ENS Live Breaking News

జగన్ వస్తే విశాఖ కనుమరుగైపోతుంది.. ఎమ్మెల్యే గంటా

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ రక్షణ.. అధికారంలోకి వచ్చాక బక్షణ.. ఇది సీఎం వైఎస్.జగన్ రెడ్డి తీరని మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.  మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖలో వైఎస్సార్సీపీ నాయకులపై ఛార్జ్ షీట్ అనే కార్యక్రమం ద్వారా జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ,  జగన్ రెడ్డి విశాఖపట్నంలో దురాగతాలను ఎండగడుతూ.. ఇక్కడి ప్రజలను మోసం చేసిన తీరునుపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడే సేవ్ విశాఖ పేరుతో జగన్ భారీ మీటింగ్ పెట్టాడని.. ప్రజలందరూ నిజమని నమ్మి జగన్ ని గెలిపిస్తే..అదే ప్రజలను ఇపుడు నట్టేట ముంచారాని ఆరోపించారు. వైఎస్సార్సీపి అధికారంలోకి వచ్చినతరువాత విలువైన భూములను దోచేశారన్నారు. నాలుగు దిక్కులా ఉన్న వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేశారని ఆరోపించారు. జగన్ విశాఖకు రావడం 
శుభవార్త కాదు ప్రజలకు చేదువార్త అని అన్నారు. జగన్ విశాఖ రాకుండానే  ప్రభుత్వ ఆస్తులు తనకా వంటి దురాగతాలు జరుగుతుంటే అతనొస్తే ఇంకా అనర్ధాలు జరుగుతాయొ ప్రజలు గుర్తించాలన్నారు. సూర్యుడు ఉదయించడం ఎంత వాస్తవమో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణమూర్తి, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామక్రిష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-08-08 06:56:32

వైజాగ్ లో ప్రారంభమైన ఏపి స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ

కోవిడ్ తర్వాత వైద్యరంగంలో వివిధ దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని,   ముఖ్యంగా యువకులు గుండెపోటుకు అధికంగా గురి అవుతున్నారని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున అన్నారు. అవి చాలా ప్రాణాంతకం గా మారుతున్నాయని చెప్పారు. దీనికి గల ఖచ్చితమైన కారణాలు కనుగొనడం కష్టంగా మారిందని ఆయన అన్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిందని అన్నారు. సోమవారం ఉదయం కేజీహెచ్ లో జరిగిన ఏ పి  స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు నుండి 19 వరకూ 10 రోజుల పాటు సిహెచ్సీ, పిహెచ్సీ లలో వైద్యులు,  నర్సులు,  పారామెడికల్ సిబ్బందికి  ఏపి స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ కార్యక్రమం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను గుండె పోటు నుండి రక్షించి మరణాలను తగ్గించవచ్చని వివరించారు.
 గుండెపోటు కారణంగా మరణాలను నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టెమీ ప్రాజెక్ట్‌గా దీన్ని ప్రారంభించిందని అన్నారు.  

సుదూర ప్రాంతాలలో, గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాలలో ఈ.సీ.జీ చేయడం ద్వారా గుండెపోటును గుర్తించడానికి వైద్యులు శిక్షణ పొందుతారని మరియు కార్డియాలజీ విభాగంలోని కార్డియాలజిస్ట్‌కు సమాచారం పంపడం ద్వారా  వైద్యులు చికిత్సను సూచిస్తారన్నారు . ఆ తర్వాత సీహెచ్‌సీ పీహెచ్‌సీ వైద్యులు గుండె రక్తనాళాల్లో క్లాట్ కరిగించే మందులు ఇంట్రావీనస్‌ ద్వారా ఇస్తారని, అడ్డంకులు తొలగిపోయి ఛాతీ నొప్పి తగ్గుతుందన్నారు . అనంతరం వారు రోగులను కెజిహెచ్  కార్డియాలజీకి పంపడం జరుగుతుందన్నారు. ఇది హబ్ మరియు స్పోక్ మోడల్ అని ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే తమిళనాడు, కేరళ,  అస్సాం , జార్ఖండ్, మహారాష్ట్ర , గోవాలలో  ఉందని తెలిపారు. టెర్షియరి సంరక్షణ ఆసుపత్రులకు దూరంగా ఉన్న రోగులలో గుండెపోటు కారణంగా మరణాలను ఆపడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు . 

Visakhapatnam

2023-08-07 17:32:43

హెల్త్ కార్డు స్కీము ప్రీమియం ప్రభుత్వం చెల్లించాలి

జర్నలిస్టుల హెల్త్ కార్డు స్కీము ప్రీమియం ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్ఆర్ నిధుల నుంచి) ప్రభుత్వమే చెల్లించాలని  ఏపీయూడబ్ల్యూజే అనకాపల్లి జిల్లా యూనిట్ సభ్యులు జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టిని కలిసి విన్నవించారు. సోమవారం ఈ సందర్భంగా జర్నలిస్టుల అభ్యర్ధనపై కలెక్టర్ స్పందించారు. తప్పనిసరిగా హెల్త్ కార్డు విషయంలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం రాంబాబు, జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు స్వామి, ప్రధాన కార్యదర్శి జోగి నాయుడు, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కే.చంద్ర రావు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్ల భాస్కర్, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్, పాల్గొన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అదేసమయంలో రావడంతో కాసేపు జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు.

Anakapalle

2023-08-07 10:33:23

సామాన్యుల సేవ ఎంతో సంతృప్తి నిచ్చింది

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షునిగా తాను ప‌నిచేసిన నాలుగేళ్ల‌లో ఎక్కువ‌మంది సామాన్య భ‌క్తుల‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 టికెట్లు ర‌ద్దు చేయ‌డం, సామాన్యుల‌కు స్వామివారి తొలి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు విఐపి బ్రేక్ స‌మ‌యాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణ‌యాలు అత్యంత సంతృప్తినిచ్చాయ‌ని టీటీడీ ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌చ్చే సామాన్య భ‌క్తులకు వ‌స‌తి, ఇత‌ర స‌దుపాయాలు మెరుగుప‌ర‌చ‌డం కోసం అనేక నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని, అయితే, ఈ రెండు నిర్ణ‌యాలు మాత్రం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనివ‌ని తెలిపారు. నాలుగేళ్ల‌పాటు ఛైర్మ‌న్‌గా ప‌నిచేసే అదృష్టం ప్ర‌సాదించిన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, త‌నకు అవ‌కాశం ఇచ్చిన  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి, త‌న వెన్నంటి ఉన్న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు  స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, ఇత‌ర అధికారులు, సిబ్బందికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. నూత‌న ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన  భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అనుభ‌వం టీటీడీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చివ‌రి స‌మావేశం సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అధికారులు ఛైర్మ‌న్ నాలుగేళ్ల ప‌ద‌వీకాలంలో తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యాలకు సంబంధించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2023-08-07 10:05:58

చేనేత దినోత్సవం స్ఫూర్తితో నేతన్నలకు ప్రోత్సాహం

జాతీయ చేనేత దినోత్సవ స్ఫూర్తితో నేతన్నలకు మరింత ప్రోత్సాహం ఇద్దామని జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్ పేర్కొన్నారు.  జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విశాఖ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన స్టాల్ ను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. వస్త్ర ప్రదర్శన లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల డిజైను లని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి ఆస్తిత్వానికి అసలైన గుర్తింపునిచ్చే చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. గత సంవత్సరం చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇకపై ప్రతి వారం వస్త్ర ప్రదర్శన స్టాల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ వంటి ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని అన్నారు. చేనేత వృత్తిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు  చేస్తోందన్నారు. చేనేత ఉత్పత్తులకు ఆప్కో ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తోందన్నారు. వైఎ్‌సఆర్‌ నేతన్న నేస్తం కింద మగ్గాల ఆధునికీకరణకు ప్రతి చేనేత కార్మికుడికి రూ.24 వేలు ఇస్తోందన్నారు.  చేనేత వస్త్రధారణ ఆరోగ్యదాయకమని, ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో  చేనేత జౌళిశాఖ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ రమణమ్మ, డి ఎల్ డి ఓ పూర్ణిమా దేవి, డి ఈ ఓ చంద్రకళ, ఏ డి విభిన్న ప్రతిభా వంతుల శాఖ మాధవి, తదితర జిల్లా మహిళా అధికారిణి లు , సిబ్బంది, 
వివిధ చేనేత సొసైటీలు, నేత కార్మికులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-08-07 08:34:33

చేనేత కార్మికుల‌కు ప్ర‌భుత్వం అండగా వుంటుంది..

చేనేత కార్మికుల‌కు అన్ని విధాలా అండ‌గా నిలిచిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌ని, జిల్లాప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కొనియా డారు. జాతీయ చేనేత దినోత్స‌వాన్ని సోమ‌వారం జిల్లాలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్థానిక స‌ర్వ‌జ‌న‌ ఆసుప‌త్రి జంక్ష‌న్ నుంచి క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు హేండ‌లూ మ్ వాక్ నిర్వ‌హించారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియం వ‌ద్ద చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న శాల‌ను, జెడ్‌పి ఛైర్మ‌న్ ప్రారంభించారు. జిల్లా అధికారులు, సిబ్బంది చేనేత వ‌స్త్రాల‌ను ధ‌రించారు. చేనేత వ‌స్త్రాల ప్రాశ‌స్త్యాన్ని పాఠ‌శాల‌ల్లో విద్యార్ధుల‌కు వివ‌రించారు. ప‌లువురు నేత కార్మికుల‌ను ఘ‌నంగా స‌న్మానించారు.  ఈ సంద‌ర్భంగా జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి త‌న సుదీర్ఘ‌ పాద‌యాత్ర‌లో, చేనేత కార్మికుల క‌ష్టాల‌ను తెలుసుకొని, అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వాటి ప‌రిష్కారానికి కృషి చేశార‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోని, నేత కార్మికుల‌ను ఎన్నో ప‌థ‌కాల‌తో ఆదుకున్నార‌ని అన్నారు. 

దీనిలో భాగంగా వైఎస్ఆర్‌ నేత‌న్న నేస్తం ప‌థ‌కం క్రింద ప్ర‌తీఏటా  రూ.24,000 చొప్పున జిల్లాలోని 3,595 మందికి చెల్లించ‌డం జ‌రిగింద‌న్నారు. అలాగే ముద్ర ప‌థ‌కం క్రింద రూ.50వేలు నుంచి రూ.5ల‌క్ష‌లు వ‌ర‌కు రుణాల‌ను, సొసైటీల‌కు డిసిసిబి ద్వారా రుణాల‌ను ఇప్పించ‌డం జ‌రుగుతోంద‌ని అన్నారు. ముఖ్యంగా నేత వృత్తిదారుల‌కు 50 ఏళ్లు నిండితే  చాలు పింఛ‌ను మంజూరు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ విధంగా జిల్లాలో 3,165 మంది నేత‌న్న‌లు చేనేత పింఛ‌న్ పొందుతున్నార‌ని తెలిపారు.   సుదీర్ఘ‌కా లంగా వృత్తిని కొన‌సాగిస్తున్న సీనియ‌ర్ చేనేత కార్మికులు ఎం.పెంట‌య్య‌, బ‌ల్ల ఈశ్వ‌ర్రావు, నాయుడు స‌త్యారావుల‌ను జెడ్‌పి ఛైర్మ‌న్ స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ కె.మ‌యూర్ అశోక్‌, ఎస్‌.కోట ఎంఎల్ఏ క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, వెల‌మ‌కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ నెక్క‌ల నాయుడుబాబు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, చేనేత జౌళిశాఖ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ బి.వసంత‌సాయి, సిబ్బంది, వివిధ చేనేత సొసైటీలు, నేత కార్మికులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-08-07 07:33:23

మహిళా పోలీసులకు త్వరలోనే ట్రాన్సఫర్ ఆర్డర్లు..

విశాఖజిల్లా(ఉమ్మడి)లో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు త్వరలోనే అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించిన పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నట్టు అనకాపల్లి జాల్లా ఏఎస్పీ(అడ్మిన్) బి.విజయభాస్కర్ తెలియజేశారు. ఆయన సోమవారం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net సంయుక్త ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. బదిలీలు, వాటికి సంబంధించిన కౌన్సిలింగ్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం పూర్త యిందన్నారు. ఆ ఫైలుని విశాఖజిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జునకు నివేదించామని, అక్కడి నుంచి అనుమతి రాగానే అందరికీ ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు అందజేయనున్నామ న్నారు. దానికోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఏఎస్పీ వివరించారు. సాధ్యమైనంత త్వరగా ఆర్డర్లు మహిళా పోలీసులకు అందజేస్తామని చెప్పారు.

Visakhapatnam

2023-08-07 04:10:24

బాపట్ల ఎంపీ సురేష్ కు సచివాలయ మహిళా పోలీసుల విన్నపం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు తమ ప్రధాన సమస్యను బాపట్ల ఎంపి నందిగంసురేష్ కు తమ సమస్యను విన్నవించారు. ఈ మేరకు శనివారం గుంటూరు డిస్ట్రిక్ట్ కమిటీ జాయింట్ సెక్రటరీ ఇందుర్తి శైలజ, తుళ్లూరు మహిళా పోలీసులు ఎం. రంగవల్లి, ఇ. శ్రీలక్ష్మి, డి.సంపూర్ణ, ఎన్.శిరీష, కె.శ్రావణి,ఆర్.లక్ష్మి ప్రసన్న,పి. మాధవి, ఎం.నాగత్రివేణి, నీరజ, సరళ తదితరులు ఎంపీని కలిసి ఇటీవల కాలంలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమకు సరైన జాబ్ చార్ట్, లైన్ డిపార్ట్మెంట్ లేకపోవడం వలన తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నామని ఎంపికి వివరించారు. హోం డిపార్ట్మెంట్ నే తమకు మదర్ డిపార్ట్మెంట్ గా కొనసాగిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసు రూల్స్ తో కూడిన ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. సమస్యను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళతానని  సచివాలయ మహిళా పోలీసులకు ఎంపీ హామీ ఇచ్చారు. 

Bapatla

2023-08-05 17:10:25

అన్యాయంపై పోరాడితే కేసులు పెడతారా..ఏపి రెడ్డి సంఘం

ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సామాజిక వర్గంపై జరుగుతన్న అన్యాయంపై పోరాటం చేస్తుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారా అని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 3 రోజుల కిందట అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకి బలైన రెడ్డి కుటుంబాలతో కలిసి అనంతపురంజిల్లా  పుట్లూరు మండలంలో చేసిన ఆందోళనపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి పై కేసులు పెడతాము, అరెస్ట్ అయ్యే విధంగా ఒత్తిడి తెస్తాము అనడం బావ్యం కాదన్నారు. ఈ చట్టం ద్వారా రెడ్లను కాపాడుకునేందుకు నరేష్ కుమార్ రెడ్డి మీడియా ద్వారా నిరసన తెలియచేశారు. మీ వర్గం కోసం మీరు ఏ విధంగా పోరాడుతున్నారో రెడ్డి వర్గం కోసం రాజకీయాలకు, హోదాలకు అతీతంగా నరేష్ కుమార్ రెడ్డి పోరాడుతున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ  కేసులు పెడతామంటే, అరెస్టు చేయిస్తామంటే, బెదిరే వ్యక్తి గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి కాదన్నారు. అన్యాయం గురించి మాట్లాడే హక్కు భారతీయ పౌరుడిగా, ప్రతి ఒక్కరికి ఉంటుందనే  విషయాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య  గమనించాలని సూచించారు. ప్రశ్నించినంత మాత్రాన, పోరాటాలు చేసినంత మాత్రాన, అక్రమ కేసులు పెడతామంటే  న్యాయస్థానాలు పోలీసులు చూస్తూ ఉరుకోరని గుర్తుచేశారు. గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డికి తోడుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా అన్యాయానికి గురైన, అక్రమంగా అరెస్టు అయిన రెడ్లతో పాటు ఇతర ఓసీలు, బీసీలు, మైనార్టీలు తోడుగా ఉన్నారన్న విషయాన్ని మీరు మరిచిపోవద్దని తెలియజేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం బెదరదన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా అన్యాయానికి గురైన రెడ్లకు,  ఇతర కులాల వారికి ఎల్లప్పుడు మేము తోడుగా, అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు అన్నెం విజయ భాస్కర్ రెడ్డి, పెద్ధి రెడ్డి, తమ్మినేని గోపాల్ రెడ్డి, పట్నం సురేంద్ర రెడ్డి, భరత్ రెడ్డి, కె.రామకృష్ణా రెడ్డి, సాంబశివ రెడ్డి, అరుణ కుమారి, విశ్వనాథ రెడ్డి, శ్రీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Guntur

2023-08-04 11:23:45

ఎమ్మెల్యే సారూ.. మహిళా పోలీసులకు న్యాయం చేయండి

గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసుల పరిస్థితి గాల్లో దీపంలా మారిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వద్ద మహిళా పోలీసులు తమ గోడును వినిపించారు. తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు.  కోర్టుకేసులతో పోలీసుశాఖలో పనిచేస్తున్న తమ విధులు పూర్తిగా తొలగించడంతో లైన్ డిపార్ట్ మెంట్ లేకుండా చేశారని, డ్యూటీ చార్టు కూడా మారిపోయిందని ఎమ్మెల్యే ద్రుష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖలు ఉండగా సచివాలయాల్లో తమ పరిస్థితి దారుణంగా మారిపోయిందని ఆవేదన వ్యక్లం చేశారు.  గ్రామ సంరక్షణలో కీలకంగా వ్యవహరించే తమను ఆ విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి తమను పోలీసుశాఖలోనే కొనసాగే విధంగా న్యాయం చేయాలని ఎమ్మెల్యేని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని సీఎం వైఎస్.జగన్ మోహనరెడ్డి ద్రుష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహాలక్ష్మి, కార్యదర్శి మధులత, గుంటూరు డిస్ట్రిక్ట్ ఇంచార్జీ ప్రెసిడెంట్ అమ్ముల రాధిక, జనరల్ సెక్రెటరీ గౌసియా బేగం,అడిషనల్ జనరల్ సెక్రెటరీ గీతా పావని, ట్రెజరీ సుమతి అండ్ ఎంటిఎంసి మహిళా పోలీస్ దేవిప్రసన్న, దేవి పద్మ, స్వాతి,కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Mangalagiri

2023-08-03 16:49:35

విజెఎఫ్ ఆదాయాన్ని ముందుగా పక్కాప్లాన్ తో నిర్వీర్యం చేసేశారు..!

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)కు ప్రతీనెలా రావాల్సిన ఆదాయాన్ని ఒక పథకం ప్రకారం అనధికార కాలం చెల్లిన కమిటీ నిర్వీర్యం చేసేసింది. మనం తప్పా ఏ ఇతర కార్యవర్గం విజెఎఫ్ కి ఎంపిక అయినా వారికి ఒక్కపైసా కూడా విజెఎఫ్ నార్లభవన్ నుంచి ఆదాయం రాకుండా చేయాలని ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకొని ఆదాయాన్ని మొత్తం కొల్లగొట్టేసింది. అదీ సంఘం కోశాధికారి ప్రమేయం లేకుండా నేరుగా ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు, కార్యదర్శి ముగ్గూరు కలిసే ఈ వ్యవరాన్ని నడిపించారు. ఈ మాట అంటున్నది విజెఎఫ్ ప్రెస్ క్లబ్ సభ్యులు కాదు. నార్లవెంకటేశ్వర భవన్ లోని షాపులు, గదులు అద్దెకు తీసుకున్న నిర్వహాకులు చెప్పిన మాటలు, వారు విజెఎఫ్ తో కుదుర్చుకున్న ఒప్పందాలే రుజువు చేస్తున్నాయి. అసలు సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆమోదం లేకుండా అత్యంత తక్కువ ధరకు నార్లవెంకటేశ్వర భవన్ లోని షాపులను అద్దెకు ఇచ్చేసి.. మొత్తం అద్దెను నాలుగేళ్ల ముందుగానే తీసేసుకున్నారు. ఇలా చేస్తే రానున్న రోజుల్లో ఏ కమిటి విజెఎఫ్ కి వచ్చినా ఒక్కపైసా ఆదాయం కూడా రాదు. అదే జరిగితే పాత కాలం చెల్లిన కార్యవర్గమే చాలా బాగా పనిచేసిందనే ప్రచారం అడ్డదారిలో కొట్టేయవచ్చు. పైగా ఇప్పుడు అవకాశం లేకపోయినా తర్వాత అయినా మళ్లీ అవకాశం చేజిక్కించుకోవచ్చు అనేది మాస్టర్ ప్లాన్. అందుకే ఆదాయ, వ్యయాలు, కర్చులు, అగ్రిమెంట్లు విషయాలను కూడా చిట్టా పద్దుల్లో సక్రమంగా చూపించలేదు. సేవ్ విజెఎఫ్ సభ్యులు నిజనిర్ధాణ చేయడం కోసం రంగంలోకి దిగిన సమయంలో ఈ అక్రమాలు బయట పడ్డాయి. వాస్తవానికి ప్రెస్ క్లబ్ సొసైటీలో నిబంధనలకు విరుద్ధంగా, బైలాను తుంగలోకి తొక్కి, సొసైటీ యాక్టుని అస్సలు అమలు చేయకుండా ఈ అనధికార కార్యవర్గం చేసిన అవినీతి, అక్రమాలు, ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నా వీరిని ప్రశ్నించడానికి కొందరు తప్పా మరెవరూ ముందుకి రాకపోవడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ సొసైటీయాక్టు, విజెఎఫ్ బైలా ప్రకారం ప్రతీ ఆదాయానికి, ఖర్చులకు చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చే అకౌంట్స్ లో కోశాధికారి లెక్కలు పక్కాగా ఆధారాలతో సహా చూపించాలి. కానీ ఆదాయాలను, వ్యయాలను భారీ వ్యత్సాసాలతో చూపించిన అనధికార కార్యవర్గం అక్రమాలు నార్లవెంకటేశ్వర భవన్ సాక్షిగా బయటపడ్డాయి. 2012 నుంచి లైవ్ ఉన్న కార్యవర్గం 2015 నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనధికారికంగానే 2023 వరకూ కొనసాగుతూ వచ్చింది. కోర్టుకేసుల విషయంలో మోసం, విజెఎఫ్ ఆధాయాలు సమర్పించడంలో మోసం, కనిపించని ఖర్చులకు లెక్కలు చూపించడంలో మోసం, లక్షలు ఖర్చుచేసి స్టార్ హోటళ్లలో గదులు తీయడానికి చేసిన ఖర్చులు మోసం.. ఇలా అడుగడుగునా అనధికార కాలం చెల్లిన కమిటీ మోసం చేస్తూనే వచ్చింది. ఇంకా నార్లవెంకటేశ్వర భవన్ పైని హోర్డింగ్స్ నిర్వహాకులతో చేసుకున్న ఒప్పందాలు బయటకొస్తే వాటిలో ఎన్ని అక్రమాలు జరిగాయో బయటకు వస్తుంది. ఇంత జరుగుతున్నా..అనధికార కార్యవర్గంలోని సభ్యులు మేము ఏం తప్పు చేశాం..మాపై విశాఖలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మోసగాళ్లలా 420 కేసులు పెట్టారని నేటికీ ప్రచారం చేస్తుండటం విశేషం. కళ్లకి కట్టినట్టుగా అనధికార కార్యవర్గం నిబంధనలను పక్కపెట్టి మరీ ఇంతటి దురాగతాలకు పాల్పడిన తరువాత కూడా సభ్యులు ఈ రకంగా మాట్లాడటం, ఒక్కొక్కటి అక్రమాలు బయటకు వస్తున్న వేళ.. కార్యవర్గంలోని ఇతర సభ్యులకు కూడా కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. విచిత్రం ఏంటంటే ఎక్కడైనా చిన్న మొత్తంలో అక్రమాలు, అవినీతి, మోసాలు జరిగితే పతాక శీర్షిక వార్తలు రాసే విశాఖలోని జర్నలిస్టులు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో సభ్యులుగా ఉంటూ, రూ.లక్షల కోట్ల మేర అవినీతి జరిగినా కనీసం సోకాల్డ్ జర్నలిస్టులు స్పందించకపోవడం పైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అధికారికంగా విశాఖ జల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున జిల్లా ఆడిట్ అధికారితో విజెఎఫ్ ఆదాయ, వ్యయాలపై లెక్కలు వేయించిన సమయంలో బయటపడిన లక్షల రూపాయల తేడాపైనా ఏ ఒక్కరూ స్పందించలేదు. ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు తప్పా మరెవరూ జరిగిన మోసాలపై ఒక్కడబుల్ కాలమ్ వార్త రాసిన పాపన పోలేదు. ఒక రకంగా చూస్తే..ఈ విధానం కూడా అనధికార కాలం చెల్లిన కమిటీ బాగా కలిసొచ్చింది. విశేషం ఏంటంటే కోశాధికారి ప్రమేయం లేకుండా చాలా వ్యవహారాలు కేవలం ముగ్గురు మూకుమ్మడిగా.. అడ్డదారిన..అడ్డగోలుగా కధనడిపించేశారు. దానికి ఇపుడు ప్రభుత్వ నిబంధనలు, విజెఎఫ్ బైలా ప్రకారం కూడా కోశాధికారే బొక్కల్లోని లెక్కలు బయట పెట్టాలి..లేదంటే దానిని తానే బాధ్యత వహించాల్సి వుంటుంది. ప్రధాన పత్రికలు, ఛానళ్లు, అందులోని జర్నలిస్టులు విజెఎఫ్ లో జరిగిన వ్యవహారాలను బాహ్య ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేయకపోవడంతో అటు అధికారులు కూడా నమ్మే పరిస్థితికి తీసుకొచ్చారు. అయితే విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన అవినీతి, అక్రమాలు, మోసాలు వార్తల రూపంలో సోకాల్డ్ జర్నలిస్టులు, అనధికార కార్యవర్గానికి కొమ్ముకాసే వారు బయట పెట్టకపోయినా.. జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో జిల్లా కలెక్టర్ ఫైవ్ మెన్ కమిటీ తో అధికారికంగా బయట పెట్టారు. 

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మోసాన్ని పక్కన పెట్టి... ఇపుడు నేరుగా ఎన్నికలు పెట్టేస్తే అందులో గెలిచేసి గతంలో చేసిన తప్పులు, మోసాలు, అక్రమాలు మాఫీ చేయాలన్నది కాలం చెల్లిన కార్యవర్గం, వారికి అనుకూలంగా వున్న సభ్యుల వ్యూహంగా కనిపిస్తున్నది. దానికి అనుగుణంగానే జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి జరిగిన మోసాలు, అక్రమాలు, అవినీతిపై విచారణ చేయడం కంటే.. ఎన్నికలు పెట్టేయడానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. అదే వ్యవహారం కాలంచెల్లిన కమిటీకి కూడా బాగా కలిసివస్తున్నది. గోడమీద పిల్లివాటంగా వ్యవహరించే కొందరు జర్నలిస్టులు వారి స్వప్రయోజనాల కోసం ఎన్నికలు ఎంత త్వరగాపెట్టేస్తే అంతే త్వరగా జరిగిన మోసాలన్నీ కప్పిపుచ్చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మెజార్టీ ప్రెస్ క్లబ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరికొందరు ప్రధాన మీడియాలోని జర్నలిస్టులు ఎక్కడ విజెఎఫ్ విషయంలో తలదూరిస్తే ఎక్కడ ఫిర్యాదుల బెదిరింపుల భారిన పడాల్సి భయపడుతున్నారు. ఇప్పటికే ప్రశ్నించిన కొన్ని ప్రధాన పత్రికలు, ఇంగ్లీషు పత్రికలు, టివి ఛానళ్ల రిపోర్టర్లపై ఫిర్యాదులు వెళ్లడంతో వారంతా సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ కారణాలతో కూడా కొందరు జర్నలిస్టులు విజెఎఫ్ అక్రమాలు బయట పెట్టే అవకాశం లేకుండా పోతుంది. ఎవరు ఎన్ని రకాలుగా ఫిర్యాదులు చేసినా, ఇబ్బందులకు గురిచేసినా...ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అవినీతి, అక్రమాలు, మోసాలను ఎవరూ కప్పిపుచ్చే పరిస్థితి అయితే కనిపించడంలేదు. ఇప్పటికైనా సోకాల్డ్ జర్నలిస్టులు తెరపైకి వచ్చి ప్రశ్నించకపోతే వారి యొక్క శచ్చీలతకు అర్ధం లేకుండా పోతుంది. చూడాలి.. ఇంకెప్పుడు ఈ తేడా అనధికార కార్యవర్గం చేసిన వ్యవహారాలను ఎవరు దైర్యంగా ముందుకి వచ్చి ప్రశ్నిస్తారనేది..!

Visakhapatnam

2023-08-02 05:32:38

ప‌క‌డ్బంధీగా గవర్నమెంట్ డిపార్ట్‌మెంట‌ల్ ఎగ్జామ్స్..

విజయనగరం జిల్లాలో ఈ నెల 2 నుంచి ప్రారంభం కానున్న డిపార్ట్‌మెంట‌ల్ ప‌రీక్ష‌ల నిర్వ‌హణ‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని, వివిధ శాఖ‌ల అధికారుల‌ను జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు ఆదేశించారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై త‌న ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి, ప‌రీక్ష‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌ని, అభ్య‌ర్ధుల‌కు ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాల‌ని కోరారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా చూడాల‌ని, త‌గిన పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేయాల‌ని, త్రాగునీటిని అందుబాటులో ఉంచాల‌ని, ప్రాధ‌మిక చికిత్సా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఎపిపిఎస్‌సి సెక్ష‌న్ ఆఫీస‌ర్ పి.ఢిల్లీశ్వ‌ర‌రావు మాట్లాడుతూ, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ విధివిధానాల‌ను వివ‌రించారు. 

ఈ ప‌రీక్ష‌లు ఎపిపిఎస్‌సి ఆధ్వ‌ర్యంలో ఈనెల 2 వ తేదీ నుంచి 7వ తేదీ వ‌ర‌కు ఆరు రోజుల‌పాటు, స్థానిక సీతం క‌ళాశాల‌లో జ‌రుగుతాయ‌ని చెప్పారు. ఆబ్జెక్టివ్ ప‌రీక్ష ఉద‌యం 10 గంట‌లు నుంచి 12 వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 నుంచి 5 వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని, డిస్క్రిప్టివ్ ప‌రీక్ష ప‌రీక్ష ఉద‌యం 10 నుంచి 1 గంట వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 నుంచి 6 గంట‌లు వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని తెలిపారు. విభిన్న ప్ర‌తిభావంతులు ప‌రిక్ష రాసేందుకు ఆబ్జెక్టివ్ ప‌రీక్ష‌కు అద‌నంగా 40 నిమిషాలు, డిస్క్రిప్టివ్ ప‌రీక్ష‌కు 50 నిమిషాలు ఇవ్వాల‌ని, స్క్ర‌యిబ్‌ల‌ను అనుమ‌తించాల‌ని చెప్పారు. వీలైనంత వ‌ర‌కు గ‌ర్భిణుల‌ను క్రింద అంత‌స్తులోనే ప‌రీక్ష రాయించాల‌ని సూచించారు. ప‌రీక్ష నిర్వ‌హించిన త‌రువాత‌, జ‌వాబు ప‌త్రాల ప్యాకింగ్‌లో త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో క‌లెక్ట‌రేట్ సూప‌రింటిండెంట్ దేవ్ ప్ర‌సాద్‌, సిఐ గోపాల‌నాయుడు, ఎల‌క్ట్రిక‌ల్ డిఇ ధ‌ర్మ‌రాజు, ఎపిపిఎస్‌సి అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ జె.చంద్ర‌రావు, వివిధ శాఖ‌ల ప్ర‌తినిధులు, క‌లెక్ట‌రేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2023-08-01 10:58:01

సాకే భారతిని యువత రోల్ మోడల్ గా తీసుకోవాలి

కూలి పని చేస్తూ ఎస్కే యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ యం.గౌతమి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సింగనమల మండలం నాగలగుడ్డం గ్రామానికి చెందిన సాకే భారతి జిల్లా కలెక్టర్ ని కలిశారు. ఈ సందర్భంగా సింగనమల మండలం సోదనపల్లి గ్రామం వద్ద సర్వే నంబర్ 9-12లో రెండు ఎకరాల పొలానికి సంబంధించిన పట్టాని సాకే భారతికి జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూలి పని చేస్తూ ఎస్కే యూనివర్సిటీలో కెమిస్ట్రీలో సాకే భారతి పీహెచ్డీ పూర్తి చేయడం జిల్లాకి గర్వకారణమన్నారు. సంకల్పం గట్టిగా ఉంటే మన విజయాన్ని ఏది ఆపదు అనేదానికి సాకే భారతి నిదర్శనమని, ఎన్నో అవంతరాలు ఎదురైనా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఆమె అనుకున్నది సాధించి డాక్టర్ సాకే భారతిగా పేరు పొందారన్నారు. ఇది ఎంతో గొప్ప విషయమని, ఇతరులకు ఆదర్శవంతంగా నిలిచి ఆమె యువతకు రోల్ మోడల్ గా మారిందన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి సాకే భారతికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తమ వంతు సాయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు ఎకరాల భూమిని కేటాయించినట్టు స్పష్టం చేశారు.

 అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని కూడా పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. సాకే భారతి ఎస్కేయూలో కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశారని, ఆమెకు ఉద్యోగ అవకాశం కింద జూనియర్ లెక్చరర్ పోస్ట్ ని గుర్తించడం జరిగిందని, ఎస్కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ పోస్టు కెమిస్ట్రీలో ఖాళీగా ఉందని, ఆమె ఒప్పుకుంటే ఆ పోస్టుకు ఆమెను నామినేట్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి ఆమెకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆమెకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అనేదానికి సాకే భారతి ఒక నిదర్శనమని, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కుషాల్ జైన్, ఆర్డీఓ మధుసూదన్, సింగనమల తహసిల్దార్ ఈశ్వరమ్మ, సాకే భారతి భర్త శివప్రసాద్, కూతురు ప్రసూన, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2023-07-31 15:21:29

విజెఎఫ్ కాలంచెల్లిన కార్యవర్గం మోసాలు అన్నీ ఇన్నీకావు..!

విజెఎఫ్ కాలంచెల్లిన అనధికార కార్యవర్గం చేసిన మోసాలు ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా వెలుగు చూస్తున్నాయి. విశాఖలోని సీతమ్మధార నార్లవెంకటేశ్వర భవన్ లోని షాపులను అద్దెకి ఇచ్చేసమ యంలో సదరు అనధికార కార్యవర్గం షాపులు నిర్వహించే వారితో చేసుకున్న ఒప్పందాలన్నీ లోప భూఇష్టంగానే ఉన్నాయి. ఈ మాట అగ్రిమెంట్ లోని అంశాలే రుజువు చేస్తున్నాయి. అందునా దివంగత కార్యదర్శి సోడి శెట్టి దుర్గారావు సంతకాల్లో తేడాలు, ఒకేసారి నాలుగేళ్లకు సరిపడా అద్దె ఒకే సారి తీసేసుకున్నారనే వీడియోలు, స్టాంపు పేపరు 2022 ఏప్రిల్ 21న కొనుగోలు చేసి నా..జన వరి31 నుంచే అగ్రిమెంటు రాసినట్టుగా చూపించడాలు, ఎక్కడా లేనివిధంగా షాపు అద్దెకి తీసుకు న్నవారు కాకుండా విజెఎఫ్ నుంచే కరెంటు బిల్లులు చెల్లించే విధంగా రాతలు రాయించడం ఇలా ఇక్కడి అగ్రిమెంట్లు అన్నీ తేడాగానే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా వీరిని సేవ్ విజెఎఫ్ సభ్యులు తప్పా మిగిలిన సోకాల్డ్ జర్నలిస్టులు ప్రశ్నించకపోవడం, మరెవరూ జరిగిన మోసాలపై కనీసం వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేయకపోవడం విశేషం. ఇప్పటికే సదరు కార్యవర్గం ఇచ్చిన ఆడిట్ రిపోర్టుల్లో భారీ ఎత్తున లక్షల్లో వచ్చిన తేడాల ఆధారంగా విశాఖ టూటౌన్  పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ సమయంలో కూడా విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లోని ఒక వర్గం పూర్తిగా తప్పులు మీద తప్పులు చేసినా కూడా అనధికార కార్యవర్గాన్నే వెనుకేసుకు రావడం విశేషం.

ప్రతీనెలా వేలల్లో వచ్చే ఆదాయాన్ని నేరుగా ప్రెస్ క్లబ్ సభ్యుల అనుమతిలేకుండా విచక్షణా రహితంగా ఖర్చులు పెట్టేయడం, దానికి తలా తోకాలేకుండా ఆడిట్ రిపోర్టుల్లో కాకిలెక్కలు చూపిస్తున్న వైనం కూడా జిల్లా ఆడిట్ అధికారులు చేసిన విచారణలో తేటతెల్లం అయిపోయింది. వాస్తవానికి ప్రభుత్వానికే తప్పుడు నివేదికలు ఇచ్చిన విజెఎఫ్ అనధికార కార్యవర్గంపై జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా ఆడిట్ అధికారి పోలీసు కేసు నమోదు చేయాల్సి వుంది. అయితే వారంతా జర్నలిస్టులు కావడంతో అధికారు ఆ దైర్యం చేయలేకపోయారు. అనధికార కార్యవర్గం ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్, ఈఫైలింగ్ చేయించకుండా వేసిన ఉత్తుత్తి ఆడిట్ రిపోర్టులు మాత్రమే ఇచ్చి, సర్వసభ్య సమావేశం తీర్మానాలు లేకుండా సొసైటీని అడ్డదారిలో రెవిన్యువల్ చేయించినా ప్రభుత్వ అధికారులు సైతం పల్లెత్తు మాట వారిని అనకపోవడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో విజెఎఫ్ అనధికార కార్యవర్గాన్ని చేసిన తప్పుల నుంచి అధికారికంగా చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఒక వర్గం జర్నలిస్టులు.. మరో వర్గం కొందరు సదరు వ్యక్తి యొక్క సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా అడ్డుపడుతూ, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టును తుంగలోకి తొక్కి, చట్టవిరుధ్దంగా వ్యవహరించిన  అనధికార కార్యవర్గంపై జిల్లా రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వున్నా కేవలం ఆధారాలను జిల్లా కలెక్టర్ కి నివేదించి చేతులు దులుపుకున్నారు.


ఇప్పటికే అనధికార కార్యవర్గంలోని అధ్యక్షుడిగా ఉన్న గంట్లశ్రీనుబాబుని సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితునిగా తొలగించాలనే డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా ఇటు దేవస్థానం ఈఓకి, నమోదైన 420 కేసు ఎఫ్ఐఆర్ పత్రాలు దేవాదాయశాఖ కమిషనర్ కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్టు కూడా తెలిసింది. ఈ క్రమంలో దేవాదాయశాఖ 1987చట్టం ప్రకారం 15 నుంచి 20 అంశాల ఆధారంగా సెక్షన్ 19ని అమలు చేస్తూ 
ట్రస్టుబోర్టు సభ్యుడిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోతే సింహాచలం దేవస్థానం ఈఓపై కూడా శాఖాపరమైన చర్యలు ఉంటాయని చెబుతున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ తంతు ఆలస్యం అయ్యిందని తెలుస్తుంది. కాగా ఈలోగా నార్లవెంకటేశ్వర భవన్ లోని షాపులు లీజుకి ఇచ్చే సమయంలో అనధికార కార్యవర్గం చేసిన చిత్రాలు, ఆధారాలతో సహా బయటకు రావడం చర్చనీయాంశం అవుతోంది. ఇంకా ఇదే భవనంలోని బ్యాకరీ, ఆపైన మొదటి అంతస్తు, టెర్నస్ పైన 
 హోర్డింగ్ లకు సంబంధించిన అగ్రిమెంట్లు కూడా బయటకు రావాల్సి వున్నది. ఒక్క చిన్నషాపుకి సంబంధించిన అగ్రిమెంటునే తేడాగా రాసిన అనధికార కార్యవర్గం మిగిలిన షాపుల విషయంలో ఇంకెన్ని తేడాలకు పాల్పడి ఉంటుందోననే అనుమానాలను ప్రెస్ క్లబ్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు, ఏరకంగా అనధికార కార్యవర్గాన్ని వెనుకేసుకు వస్తూ..చేసిన తప్పులను ప్రశ్నించకపోయినా.. బయటపడుతున్న ఆధారాలు, తేడా వ్యవహారాలతో విజెఎఫ్ చిత్రాల వేడిని అమాంతం పెంచేస్తున్నది. చూడాలి ఈ అనధికార కార్యవర్గంపై విచారణ చేపడుతున్న జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అనేది..!

Visakhapatnam

2023-07-31 06:38:34

విజెఎఫ్ అనధికార కమిటీపై పెట్టిన ఆ సెక్షన్లు పని మొదలెట్టాయి

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) కాలం చెల్లిన అనధికార కమిటీపై టూటౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన సెక్షన్లు 420, 34, రెడ్ విత్ 406  సెక్షన్లు పనిచేయడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా ఈ సెక్షన్లుతో పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్న వారు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఉండకూడదు. మరీ ముఖ్యంగా దేవాదాయశాఖ 1987చట్టం ప్రకారం 15 నుంచి 20 అంశాల ఆధారంగా సెక్షన్ 19ని అమలు చేస్తూ..ఏదైతే దేవస్థానంలో ట్రస్టుబోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారో వారిపై సదరు దేవస్థాన ఈఓ ప్రభుత్వానికి లేఖ రాయాలి. ఇలాంటి కేసులు ఉన్నవారిని ట్రస్టుబోర్టులో కొనసాగించడానికి కూడా వీలుండదు. కానీ సింహాచలం దేవస్థానం ఈఓ వేండ్రత్రినాధరావు ట్రస్టుబోర్డు సభ్యుడు, జాతీయజర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అనధికార కార్యవర్గానికి అక్షుడిగా వున్న గంట్ల శ్రీనుబాబు కేసులపై ప్రభుత్వానికి నివేదిక నేటి వరకూ సమర్పించనే లేదు. కానీ ఆవిధంగా జరగకపోవడం పట్ల పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. పోలీస్ స్టేషన్ లలో మోసం, కావాలని చేసిన నమ్మద్రోహం, మూకుమ్మడిగా కావాలని చేసిన మోసాలకు సంబంధించి సెక్షన్లతో కేసులు నమోదైన వారిని ఏవిధంగా దేవాలయాల ట్రస్టుబోర్డుల్లో సభ్యుడిగా కొనసాగిస్తారనే వాదనను తెరపైకి తీసుకు వస్తున్నారు. 

అందునా ఈయన అనధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న విజెఎఫ్ లో సుమారు రూ.30 లక్షలకు పైగా ఖర్చులకు, మరికొన్ని కోట్ల రూపాయలకు రికార్డులు లేవు, ప్రభుత్వానికి సమర్పించిన ఆడిట్ రిపోర్టలన్నీ తప్పులు తడకలు, ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ అయిన మల్లిఖార్జునకు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లోని జర్నలిస్టులు ఇప్పటికే స్పందనలో ఫిర్యాదులు కూడా చేశారు. ఆ ఫిర్యాదులు ఆధారంగా ఏర్పాటు చేసిన ఫైమెన్ కమిటీ విచారణలో కార్యవర్గం కావాలనే తప్పులు, మోసాలకు పాల్పడినట్టు ప్రాధమికంగా ఆధారాలతో నిరూపణ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టుకి విరుద్దాంగా వ్యవహరించడం, విజెఎఫ్ బైలాను పూర్తిగా తుంగలోకి తొక్కడం, పెట్టని సర్వసభ్య సమావేశాలు పెట్టినట్టుగా చూపి, 12ఏళ్లలో కోట్లాది రూపాయల ఖర్చుల విషయంలో తేడాగా వ్యవహరించిన వ్యక్తిని ఏ విధంగా ట్రస్టుబోర్డులో ఎలా కొనసాగిస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. కాగా ఇప్పటికే ఇదే విషయమై సదరు ట్రస్టుబోర్డు సభ్యుడిపై నమోదైన 420 కేసు ఎఫ్ఐఆర్ పత్రాలు దేవాదాయశాఖ కమిషనర్ కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్టు కూడా తెలిసింది. ఈ క్రమంలో దేవాదాయశాఖ 1987చట్టం ప్రకారం 15 నుంచి 20 అంశాల ఆధారంగా సెక్షన్ 19ని అమలు చేస్తూ ట్రస్టుబోర్టు సభ్యుడిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోతే సింహాచలం దేవస్థానం ఈఓపై కూడా శాఖాపరమైన చర్యలు ఉంటాయని కూడా ప్రచారం జరుగుతుంది.

సింహాచలం ట్రస్టుబోర్డు సభ్యుడిగా ఉన్నవారు నిజాయితీగా వ్యవహరిస్తూ.. ఆలయ అభివ్రుద్ధి కార్యక్రమాలు, ఇతర దేవాదాయశాఖ వ్యవహారాల్లో పాల్గొంటుంటారు. పలు ఖర్చులు, అవసరాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ట్రస్టుబోర్డులో చైర్మన్, ఈఓలకు సూచనలు సలహాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా ఇదే సభ్యుడు విజెఎఫ్ లో భారీ ఎత్తున అక్రమాలకు, అవినీతికి, చేసిన ఖర్చులకు లెక్కలు సక్రమంగా చూపకుండా అదే ప్రెస్ క్లబ్ సభ్యుల పెట్టిన పోలీసు కేసులకు కారణం అయ్యారు. ఇపుడు కనిపించకుండా దాచేసిన విరాళాలకు సంబందించిన స్లిప్పులు, కార్యదర్శి నివేదికలు, కోశాధికారి నివేదికలు తదితర వ్యవహారాలు, ఆర్ధిక నేరాలతో సంబంధాలున్న వ్యక్తులను ట్రస్టుబోర్డు సభ్యుడిగా కొనసాగిస్తే..ఎన్నో లక్షల రూపాయల అభివ్రుద్ధి పనులు ఇతర కార్యక్రమాలను ఆమోదించే బోర్డులో అభ్యంతరాలు వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో సదరు వ్యక్తిని ఏ విధంగా ట్రస్టుబోర్డు సభ్యుడిగా కొనసాగిస్తారని..తక్షణమే బోర్డు సభ్యుడి హోదా నుంచి తొలగించాలనే పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. ఫలితంగా అనధికార కార్యవర్గంలో ఉన్నవ్యక్తిపై జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ పెట్టిన కేసుల సెక్షన్లు పనిచేస్తున్నాయనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. చూడాలి ప్రభుత్వం ఇంత జరిగిన తరువాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది..!

Visakhapatnam

2023-07-28 11:25:16