1 ENS Live Breaking News

ప్రతి ఒక్కరికీ అందుబాటులో వైద్యం

రాష్ట్రంలో అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్య్రగా ముఖ్యమం త్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ పేర్కోన్నారు.  మంగళవారం అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్.టి.ఆర్.స్టేడియంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ఆయన ప్రారంబించారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్స్లో పాటు 101 సర్వీసుల ద్వారా రోగులకు సకాలంలో వైద్యసేవలు అందజేయడం జరుగుతుందన్నారు.  ప్రతి గ్రామంలో వెల్ నెస్ సెంటర్లను ప్రారంభించారని, 2,500 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకు వచ్చారని తెలిపారు.  జిల్లా కలెక్టర్ రవి సుభాష్ మాట్లాడుతూ మెగా మెడికల్ క్యాంపులో 200 రకాల వ్యాధులకు సంబంధించిన రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులు లేని వారు తక్షణమే తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ క్యాంపులో వైద్య నిపుణులు, అన్ని రకముల స్పెషలిస్ట్ వైద్య నిపుణులు, అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.  అవసరమైతే తగిన చికిత్స కొరకు సంబంధిత వైద్యశాలలో చికిత్స అందిస్తారన్నారు.  పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి.వి.సత్యవంతి మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యమని  పెద్దలు చెప్పారని,  అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని పిలుపు నిచ్చారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా హెల్త్ మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో  జెడ్.పి. వైస్ ఛైర్ పర్సన్ బి.వి. సత్యవతి, ఎంపిపీ గొర్లిసూరిబాబు, డాక్టర్ విష్ణుమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, డా.మధుసూధన ప్రసాద్, స్పెషలిస్ట్ వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-19 13:18:42

ప్రభుత్వ భవన నిర్మాణాలు పూర్తిచేయాలి..

గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ భవనాలకు కావలసిన భూ సేకరణను వేగవంతం చేసి నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్... 22(A)లోని అంశాలు, స్పందన అర్జీల పరిష్కారం, వాటర్ టాక్స్, ఓటిఎస్, భూరికార్డుల స్వచ్ఛీ కరణ, ఎండీయు వాహనాల ఖాళీల భర్తీ, వాహనాల ద్వారా బియ్యం సరఫరా, ప్రభుత్వ శాశ్వత భవనాలకు అవసరమైన భూసేకరణ తదితర అంశాల పురోగతిపై డివిజన్, మండల స్థాయి రెవిన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల స్వచ్చీకరణ (పీఓఎల్ఆర్) ప్రక్రియను వివాదాలకు తావు లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి నిర్దేశించిన గడువులోపు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్, స్కానింగ్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ అందజేసే విధంగా చూడాలన్నారు. స్పందన ద్వారా గ్రామ/వార్డు సచివాలయాలకు వచ్చిన అర్జీలను తప్పనిసరిగా గడువులోపు పూర్తి చేయాలని ఆమె తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ శాశ్వత భవనాలు అయిన గ్రామ/వార్డు సచివాలయం, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ భవనాలకు సంబంధించి జిల్లాలో ఇంకా భూసేకరణ పూర్తికాని  చోట అనువైన స్థలాలు త్వరిత గతిన గుర్తించి, భవన నిర్మాణాలు ప్రారంభించాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-19 13:14:47

అమరావతికి పయనమైన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశాఖ ప‌ర్య‌ట‌న ముగించుకొని మంగ‌ళ‌వారం సాయంత్రం విశాఖ‌ప‌ట్ట‌ణం విమానాశ్ర‌యం నుంచి అమరావ‌తికి తిరుగు ప‌య‌న‌మ‌య్యారు. ఉద‌యం న‌గ‌రానికి చేరుకున్న ఆయ‌న ముందుగా స్థానిక నేత‌ల‌ను క‌లిశారు. అనంత‌రం రుషికొండలోని రిసార్ట్ వెల్‌నెస్ సెంట‌ర్ కు చేరుకొని హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో కాసేపు భేటీ అయ్యారు. భేటీ ముగిస‌న త‌దుపరి మంగ‌ళ‌వారం సాయంత్రం 3.15 గంట‌ల‌కు విమానంలో అమ‌రావ‌తికి తిరుగుప‌య‌న‌మ‌య్యారు.  జిల్లా క‌లెక్ట‌ర్ డా. ఎ. మ‌ల్లిఖార్జున‌, పోలీస్ క‌మిష‌న‌ర్ శ్రీ‌కాంత్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ విశ్వ‌నాథ‌న్ ఎయిర్ పోర్టుకు చేరుకొని ముఖ్య‌మంత్రికి వీడ్కోలు ప‌లికారు.

Visakhapatnam

2022-04-19 13:10:17

జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లాఅధికారులకు పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రగతిపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న అధికారులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు చేపట్టవలసిన అంశాలపై అధికారులు మరింత దృష్టి సారించాలన్నారు. ఇందుకు ప్రభుత్వపరంగా కావలసిన పరిపాలన అనుమతులు, నిధుల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనేదే తమ ధ్యేయమని, అంతేగాని శాఖల పనితీరును ప్రశ్నించడం తమ ఉద్దేశ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత శాఖల పనితీరు తెలుసుకోవాలని సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.తొలుత వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష పథకం సంబంధించి సమీక్షా ప్రారంభించిన మంత్రి బాధ్యతలు తీసుకొన్న ప్రతి అధికారి పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించినపుడే లక్ష్యాలను అధిగమించగల మని మంత్రి తెలిపారు. విధుల నిర్వహణలో ప్రణాళికలు రూపొందించుకొని లక్ష్యాలు అధిగమించే దిశగా అడుగులు వేయాలని కోరారు. శాశ్వత భూహక్కు- భూరక్ష క్రింద జిల్లాలో 1466 గ్రామాలు ఉండగా వీటిని 2023 డిసెంబర్ నాటికి భూసర్వే పూర్తికావాలని అన్నారు. గ్రామ స్థాయిలో సభలు నిర్వహించి సర్వే వేగవంతం చేయాలన్నారు. మ్యాపులు సర్వే అయిన తదుపరి రెవెన్యూ శాఖ వాటిని సరిచూసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 2023 డిసెంబర్ నెలాఖరు నాటికి శత శాతం భూ సర్వే పూర్తవుతుందని కలెక్టర్ మంత్రికి వివరించారు.జిల్లాలో నీటి పన్ను వసూలుకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు పథకంలో ఇళ్ళ స్థలాలను కేటాయించడం జరుగుతుందని, ఇంకా అర్హులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే 90రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లాకు 17 తహశీల్దార్ కార్యాలయ భవనాలు మంజూరు అయ్యాయని అందులో 13 భవనాలు పూర్తి అయ్యాయని, వాటికి సంబంధించి చెల్లింపులు చేయాల్సి ఉందని అన్నారు.  జిల్లాలో 355 రైస్ మిల్లులు ఉన్నాయని,ప్రతి నెల మొదటి తేదీన సంచార వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని జె.సి మంత్రికి వివరించారు. అలాగే ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వలన ప్రతీ రైతు భరోసా కేంద్రాన్ని ధాన్యం కొనుగోలు  కేంద్రంగా మార్పుచేయడం ద్వారా రైతులకు మేలు జరిగిందని అన్నారు. రైతు దగ్గరకి టెక్నికల్ సిబ్బంది వెళ్లి ధాన్యంలో తేమ శాతం నిర్ధారించి కొనుగోలు జరిగిందన్నారు. కొన్నిచోట్ల ధాన్యం కొనుగోలు జరగలేదనే విమర్శలు వస్తున్నాయని, అవికూడా లేకుండా చూడలని మంత్రి ఆదేశించారు. సోనా మసూరి వలన ఈ సమస్య తలెత్తుతుందని విత్తనాలు అందుబాటులో లేకుండా చర్యలు చేపటితే బాగుంటుందని జాయింట్ కలెక్టర్ కోరారు. ముఖ్య మంత్రి  అదేశాలను అనుసరించి  రైతు భరోసా కేంద్రాలలో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పరికరాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేయగా. వరి సాగు నిలుపుదల చేసి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి వివరించారు. 

ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల పనితీరుపై ఆరా తీసిన మంత్రి సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించి పూర్తిచేయాలన్నారు. అనంతరం మత్స్య శాఖను సమీక్షించిన మంత్రి  జిల్లాలో  11తీర ప్రాంత మండలాలు, 193 కి.మీ తీర ప్రాంతం,104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వంశధార పనులకు చెందిన నిధులు విడుదల అవుతున్నా యని సంబంధిత పనులు వేగవంతం చేయడం జరుగుతుందని మంత్రికి ఎస్.ఈకి వివరించగా, ప్రణాళికలు రూపొందించుకొని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ పూర్తికావాలని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్  కొనసాగుతుందని, పొందని వాటిపై నిత్యం పర్యవేక్షిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మంత్రికి వివరించారు. తెలిపారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై ఆరా తీసిన మంత్రి గృహ పనులు మరింత వేగవంతం కావాలని అన్నారు.తదుపరి జలజీవన్ మిషన్ , పంచాయతీ రాజ్, జిల్లా పరిషత్, ఆర్ అండ్ బి, తదితర శాఖలకు సంబంధించి శాఖల వారిగా చేపడుతున్న పనులపై సమీక్షించారు.జిల్లా పరిషత్ చేపడుతున్న పనులపై ఆరా తీయగా జిల్లాలో మండల పరిషత్ భవనాలు లేవని మంజూరు చేయమని సి.ఈ.ఓ మంత్రిని కోరారు. ఎచ్చెర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని వివిధ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు.నియోజక వర్గంలోని లావేరు మండలంలో ధాన్యం నిల్వలు ఉన్నాయని వాటిని కొనుగోలు చేయాలని కోరారు.

 ఈ సమావేశంలో కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ ఆంధవరపు సూరి బాబు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్,పలాస శ్రీకాకుళం ఆర్.డి.ఓలు జయరామ్, బి.శాంతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణాధికారి బి.లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజినీర్ కాంతిమతి, ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజినీర్ డోల తిరుమల రావు. వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-19 12:49:08

ప్రజాసేవకు ట్రస్టులు ముందుకి రావాలి..

వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ను కలసి లక్ష మంది అంగన్వాడీ పిల్లల కోసం ఆల్బెండజోల్, ఎ విటమిన్ టాబ్లెట్ లు అందించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ట్రస్ట్ నిర్వహాకులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాసేవకు స్వచ్చంద సంస్థలు, ఛారిటబుల్ ట్రస్టులు ముందుకి రావాలన్నారు. అనంతరం అక్కడే ఉన్న జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి జయ లక్ష్మి కి సూచిస్తూ జిల్లా లోని 34 మండలాల్లో గల 2358 అంగన్వాడీ కేంద్రాలలోని 6 నెలలు నుండి 3 సం. ల వయసు గల 101126 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం, ఎ విటమిన్ అందించడానికి ముందస్తుగా తప్పనిసరి వైద్య అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు శిక్షణ ఇచ్చి అల్బెండజోల్, ఎ విటమిన్ మోతాదు మేరకు అంగన్వాడీ పిల్లలకు పూర్తి స్థాయిలో త్వరలో అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.  ట్రస్ట్ ప్రతినిధి వసంత లక్ష్మి, మెంబర్ లు రవి కుమార్, ట్రస్ట్ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2022-04-19 12:46:26

మేడేని ఘనంగా చేయాలి..సిఐటియు

కార్మిక పోరాటాలకు దిక్సూచి గా నిలిచిన ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సిఐటియు పిలుపు ఇచ్చింది. సోమవారం సాయంత్రం స్థానిక సిఐటియు కార్యాలయమైన కా. పి‌. లక్ష్మీదాస్ భవన్ లో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ 1886 లో అమరికా చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తిగా  ప్రారంభమైన మేడే భారతదేశంలో 1923 లో సింగారవేలు చెట్టియార్ నాయకత్వం లో మద్రాసు లో తొలిసారిగా జరిగిందన్నారు. కాకినాడ నగరంలో బండ్ల కార్మికులు 1938 లో మేడే నిర్వహించారని పేర్కొన్నారు. కార్మికులు సంఘం పెట్టుకోవడానికి, సంఘటితం కావడానికి, హక్కులు సాధించుకోవడానికి మేడే దిక్సూచి గా నిలుస్తుందని, కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో కార్మికులంతా 2022 మేడే ను ఘనంగా నిర్వహించాలని సిఐటియు పిలుపు ఇస్తోందన్నారు. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబి రాణి, జిల్లా ఉపాధ్యక్షులు కె. సత్తిరాజు లు మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం భారత కార్మిక వర్గం స్వాతంత్ర్య పోరాట కాలం నుండి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. మార్చి 28, 29 తేదీల్లో జరిగిన సమ్మె లో సుమారు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొని కేంద్ర పాలకులను హెచ్చరించారని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కార్మిక పోరాటాలు ముందుకే సాగుతాయన్నారు. సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ మేడే రోజు సిఐటియు అనుబంధ సంఘాల వారు ఉదయం 9 గంటల లోపు అరుణ పతాకావిష్కరణ చేసుకుని 10 గం కు సిఐటియు జిల్లా కార్యాలయమైన కా. పి‌ . లక్ష్మీదాస్ భవన్ వద్ద అరుణ పతాకావిష్కరణ లో పాల్గొనాలని, తదుపరి ప్రదర్శన జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ లతో పాటు భారతి, వేణు, నాగలక్ష్మి, అమ్ములు, విజయ్ కుమార్, సత్తిబాబు, ప్రకాశరావు, సతీష్, గంగాధర్ , గురుమూర్తి, రవి తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-19 12:37:45

విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కు సత్కారం

విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు ను మంగళవారం అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భముగా  పలు అంశాలపై చైర్మన్ తో  చర్చించారు. అనంతరం చైర్మన్ ను ఘనంగా సన్మానించి, సింహాద్రి నాధుడు జ్ఞాపికను శ్రీనుబాబు బహుకరించారు. సింహాచలంలో అప్పన్న నిజరూప దర్శనం, ఇతర ఉత్సవాల విశిష్టతను శ్రీను బాబు రామ్ మోహన్ రావు కి విపులముగా తెలియజేశారు. అత్యంత మహిమ గల స్వామి సింహాద్రి నాధుడు ఆని, ప్రపంచం లోనే  వరాహ,నరసింహ అవతారాల కలయిక ఒక్క సింహాచలం కు మాత్రమే సొంతం అని శ్రీనుబాబు వివరించారు.

Visakhapatnam

2022-04-19 12:30:30

అన్న‌దానానికి దాతలు ముందుకురావాలి

శ్రీకాకుళం జిల్లా శ్రీ‌కూర్మంలో వెలసిన శ్రీకూర్మనాథ స్వామి వారి దేవస్థానంలో దాతలు, భక్తులు సమర్పించిన  విరాళాలతో నిత్య అన్నదాన కార్యక్రమం త్వ‌ర‌లో ప్రారంభం కానుందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.  మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో భక్తులు సమర్పించిన రూ.2 లక్షల విరాళాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.విజయకుమార్ కు అందజేశారు. శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అంధవరపు శ్రీనివాసరావు రూ.ఒక లక్ష, విశాఖపట్నం జిల్లా గాజువాకకి చెందిన వ్యాపారవేత్త నారాయణశెట్టి మురళి రూ.లక్ష   చెక్కులను సమర్పించినట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇదేవిధంగా దాతలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, ఆలయ కార్య నిర్వహణాధికారి ఎస్.విజయకుమార్, పాలక మండలి సభ్యులు డబ్బీరు వాసు, రాష్ట్ర నాటక అకాడమీ సంచాలకులు ముంజేటి కృష్ణ, బరాటం నాగేశ్వరరావు, ఎస్.వి.డి హోటల్ అధినేత మురళి,  తదితరులు పాల్గొన్నారు.

Srikurmam

2022-04-19 11:48:31

విశాఖలో సీఎం జగన్ కు ఘన స్వాగతం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 11:40 గంటలకు విమానాశ్రయానికి  చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, పీడిక రాజన్నదొర, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, రోడ్లు భవనాలు శాఖ మంత్రి దాడి శెట్టి రాజా, ఎంపీలు ఎం.వి.వి. సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, సత్యవతి, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాస్, శాసన మండలి సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరుదు కల్యాణి, శాసన సభ్యులు ధర్మ శ్రీ, నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి పుష్ప గుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. తదుపరి ముఖ్యమంత్రి వి.ఐ.పి. గ్యాలరీకి వెళ్లి అక్కడకు విచ్చేసిన పలువురు ప్రజా ప్రతినిధులను కలిసి మాట్లాడారు. అనంతరం రుషికొండ పరిధిలోని వెల్ నెస్ కేంద్రానికి చేరుకొని హర్యానా ముఖ్యమంత్రిని  కలవడానికి బయలు దేరి వెళ్లారు.

Visakhapatnam

2022-04-19 08:09:20

అమర్నాధ్ పైనే అనకాపల్లిజిల్లా ఆశలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఒకటైన అనకాపల్లిజిల్లా ప్రజలు ఆశలన్నీ ఇపుడు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి గుడివాడ్ అమర్నాద్ పైనే పెట్టుకున్నారు. ఇటీవ లే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకి వచ్చిన అమర్నాధ్ బిజీ బిజీగా గడుపుతు న్నప్పటికీ.. కొత్తజిల్లాలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది, పోలీసుల కూర్పుపైనే ద్రుష్టి సారించినట్టు తెలుస్తుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే కొత్తజిల్లాల్లో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలని.. దానికోసం రాష్ట్ర స్థాయిలో పనిచేసిన అధికారులు ఎవరు బాగా పనిచేస్తారో తెలుసుకునే పనిలో పడినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం వివిధ అద్దె భవనాలు, ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న జిల్లాశాఖల ప్రభుత్వ కార్యాలయాలకు ఒకే వేదికగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ బాద్యతలు కూడా మంత్రి అమర్నాధ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే చాలా జిల్లా శాఖలకు అధికారులు, సిబ్బంది నియామకాలు కాకపోవడం, పూర్తిస్థాయిలో పరిపాలన అందుబాటులోకి రాకపోవడంపై మంత్రి ప్రత్యేకంగా ద్రుష్టిసారించారని అనుచరగణం చెబుతోంది. ఆది నుంచి పరిపాలనపై మంచి పట్టువున్న యువ ఎమ్మెల్యేగా అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్నాధ్ తన అనుభవాన్ని మొత్తం జోడిండి జిల్లాను పూర్తిస్థాయి జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నారని.. అందుకే కొత్త జిల్లా అనకాపల్లి ప్రజలు ఆశలన్నీ మంత్రి అమర్నాద్ పైనే పెట్టుకున్నారని చెబుతున్నారు. అందులోనూ ఐటి శాఖ కూడా కట్టబెట్టడంతో కొత్త జిల్లాలో కూడా ఐటీ కంపెనీలు తీసుకువచ్చి..తాను ప్రాతినిథ్యం వహించే నూతన జిల్లాను రాష్ట్రంలో సరికొత్తగా ఆవిష్కరించేందుకు ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. తండ్రి దివంగత గుడివాడ గురునాధరావు బాటలోనే నడుస్తూ.. అభివ్రుద్ధేకి తొలి ప్రాధాన్యత ఇచ్చి విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌళిక సదుపాయాల విషయంలో పూర్తిస్థాయిలో ద్రుష్టి కేంద్రీకరించడం ద్వారా ప్రజలకు కావాల్సిన సదుపాయాలు సమకూర్చినట్టు కూడా అవుతుందని, తద్వారా తన నియోజకవర్గ ప్రజలకు అభివ్రుద్ధినే బహుమతిగా ఇవ్వాలని ధ్రుడ సంకల్పంతోనే ముందుకు సాగుతున్నారే సంకేతాలు వినిపిస్తున్నాయి. యువ మంత్రిగా అనకాపల్లిని అన్ని రకాలుగా అభివ్రుద్ధి చేస్తారనే నమ్మకాన్ని యువత నుంచి పెద్దవల వరకూ అందరూ అనేక రకాల ఊహాగానాలు వెలిబుచ్చుతున్నారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగం మళ్లీ ఊపందుకున్న తరుణంలో అనకాపల్లిజిల్లాకి ఐటీ కంపెనీలు తరలివస్తే ఈ ప్రాంతం రాష్ట్రంలోనే మంచి జిల్లాగా పేరుతెచ్చుకోవడంతోపాటు, మరిన్ని విద్యాసంస్థలు, కర్మాగారాలు, పరిశ్రమలు కూడా  రావడానికి అశకాశం వుంటుందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అలా జరగాలంటే ఒక్క జిల్లా మంత్రి ద్వారానే అది సాధ్యపడుతుంది. దానికి పరిపాలన, ప్రభుత్వశాఖలు, జిల్లా అధికారుల వ్యవహార శైలిపై అనుభవం ఉంటే తప్పా ఇవన్నీ జరిగే పరిస్థితి ఉండదు. వయస్సులో చిన్నవాడైనా, రాజకీయంలోనూ, అధికారుల విషయంలో చాలా చక్కగా పరిపాలన, సేవలు అందించడంలో ముందుండే మంత్రి గుడివాడ అమర్నాధ్ అనకాపల్లి జిల్లాను రాష్ట్రంలోనే ఒక మంచి జిల్లాగా తీర్చిదిద్దడంతో తనదైన ముద్రవేసుకుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అనకాపల్లి జిల్లా వాసుల అభివ్రుద్ధి కల యువ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఏ స్థాయిలో కార్యరూపంలోకి తీసుకు వచ్చి చూపిస్తారో వేచిచూడాల్సిందే ..!

Anakapalle

2022-04-19 02:08:54

పైడిభీమవరంలో డీశాలినేషన్ ప్లాంట్

శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో డీశాలినేషన్ ప్లాంటును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఇందుకు అవసరమైన అనుమతులు కావాలని జిల్లా కలెక్టరు శ్రీకేశ్ లాఠకర్ ను ఎల్ అండ్ టి అధికారులు కోరారు. డీశాలినేషన్ ప్లాంటు నిర్మాణంపై సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టరును ఎల్ అండ్ టి అధికారులు కలిసారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిపి) విధానంలో ప్లాంటును స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ ప్లాంటు నిర్మాణానికి సుమారు 40 ఎకరాల స్థలం అవసరముంటుందని, ఇందుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం మంజూరుచేయాలని కోరారు. అలాగే అటవీశాఖ, మత్స్య శాఖ, సంబంధిత తహశీల్దార్లు సహకారం కావాలని అధికారులు కలెక్టరును కోరగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేస్తామని హామీ ఇచ్చారు.  ఈ సమావేశంలో ఎల్ అండ్ టి బిజినెస్ హెడ్ శ్రీధర్, ఏపిఐఐసి చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర రావు, డాక్టర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-18 16:52:09

ప్రభుత్వ లక్ష్యాలను అదిగమించాలి..

గుంటూరు జిల్లాలో రెవెన్యూ, హౌసింగ్, అభివృద్ది సంక్షేమ పధకాల అమలుకు  అధికారు లు  సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని  జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి  పేర్కొన్నారు.  సోమవారం సాయంత్రం కలక్టరేట్ లోని  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని డిప్యూటీ కలెక్టర్లు, ఆయా శాఖల ప్రాజెక్టు డైరెక్టర్లు, ఆర్డిఓ లు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, యంపీడీఓ లు, హౌసింగ్ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి అభివృద్ది సంక్షేమ పధకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇక నుండి ప్రతి సోమవారం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాలకు ప్రత్యక్షంగా జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన అభివృద్ది సంక్షేమ పధకాల లక్ష్యాలకు దూరంగా వున్న అధికారులతో చర్చించారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న తరువాత అధికారులంతా సమన్వయంతో పనులను పూర్తి చేయించాలన్నారు.   వైయస్.ఆర్. జగనన్న పేదలందరికీ ఇళ్ళు, గృహ నిర్మాణాలకు సంబంధించిన డ్వాక్రా రుణాలు, జనగన్న తోడు, ఓటియస్ రిజిస్ట్రేషన్, గ్రామ సచివాలయాల పనితీరు మెరుగుపరచడం, రెవెన్యూ అంశాలకు సంబంధించి 22 ఎ లిస్ట్ లో వున్న సమస్యల పరిష్కారం, వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, అంగన్ వాడీ కార్యక్రమాలు, వైయస్.ఆర్. సంపూర్ణ పోషకాహార పధకం, వైయస్.ఆర్. సంపూర్ణ పోషకాహారం ప్లస్ పధకం,  టిడ్కో గృహాలు, రిజిస్ట్రేషన్లు అంశాలు, ఆన్ లైన్ లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, వైయస్.ఆర్. జలకళ, క్లాప్, మరుగుదొడ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం నిర్ధేశించిన పధకాలలో ఏ ఒక్కదానిని కూడా విస్మరించకుండా పూర్తి స్థాయిలో అమలు చేసేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే సోమవారం నాటికి పూర్తి స్థాయి నివేదికలతో సమావేశంలో పాల్గొనాలని ఆదేశించారు.  ఇక నుంచి జిల్లా అధికారులతో పాటు, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు వారికి నిర్దేశించిన  ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను అవగాహన చేసుకొని సంక్షేమ పధకాలను సమస్యలు లేకుండా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రతి ఒక్క పధకం అమలులో తహశీల్దార్, యంపీడీఓ లతో పాటు సంబంధిత శాఖల మండల అధికారులు భాగస్వామ్యులై లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  సమీక్షా సమావేశంలో సంయుక్త కలెక్టర్ జి. రాజ కుమారి, డిప్యూటీ కలెక్టర్ లలితా, హౌసింగ్ పీడీ సాయి నాథ్, జెడ్పీ సిఈఓ డా. శ్రీనివాస రెడ్డి, డి యం అండ్ హెచ్ ఓ డా. జే. యాస్మిన్,  మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ మనోరంజని, పంచాయితీ రాజ్ ఎస్ ఈ బ్రహ్మయ్య, మెప్మా పీడీ సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంబాబు, సీపీఓ శేషశ్రీ, ఈడియం రత్నం,  రాష్ట్రీయ బాల స్వస్థ జిల్లా  కో ఆర్డినేటర్ డా. జి. మాధవి, కలక్టరేట్ ఏఓ తాతా మోహన్ రావు, జి సెక్షన్ సూపరింటెండెంట్ లీలా సజీవ కుమారి తదితరులు పాల్గొన్నారు. 


Guntur

2022-04-18 16:50:16

జిల్లా న్యాయమూర్తిగా పి.వెంకటజ్యోతిర్మయి

కక్షిదారులకు సమన్యాయం చేసే విధంగా క్రుషి చేస్తానని, ప్రభుత్వ సేవలు అందించడా నికి పూర్తిస్థాయిలో క్రుషిచేస్తానని  రాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ లో జిల్లా ప్రధాన న్యాయ మూర్తి  పి.వెంకట జ్యోతిర్మ యి పేర్కొన్నారు.  సోమవారం జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.  ప్రకాశం జిల్లా ఒంగోలు లో జిల్లా ప్రధాన న్యా య మూర్తి గా విధులు నిర్వర్తిం చి, బదిలీ పైరాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ కి వచ్చినట్టు పేర్కొన్నారు. పాత తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న 3 జిల్లాల కోర్టులు తన పరిధిలో కి వస్తాయన్నారు. అనంతరం కోర్ట్ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది జడ్జిని మర్యాద పూర్వకంగా కలిసి విభాగాల వారీగా పరిచయాలు సచేకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు కార్యాలయ సిబ్బంది, పలువురు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-04-18 16:45:46

గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు కృషి..

అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని గిరిజనుల ఆరోగ్య పరి రక్షణకు కృషి చేస్తామని  కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అదేశాలు మేరకు ఆజాదికా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని బ్లాక్ స్థాయిలో మెగా హెల్త్ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సోమవారం స్థానిక తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన హెల్త్ మేళాను ఐటిడిఎ పి.ఓ. రోణంకి గోపాల క్రిష్ణ, పాడేరు శాసనసభ్యురాలు కె.భాగలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. స్త్రీల వైద్య విభాగం, చిన్న పిల్లలు, సాధారణ వైద్య సేవలు, రెడ్ క్రాస్ రక్త దానం శిబిరం, క్షయ విభాగం,ఉచిత మందులు పంపిణీ విభాగాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు డివిజన్లలో మెగా హెల్త్ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు.ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రతి15 రోజులకు ఒక మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని అన్నారు. రెడ్ క్రాస్ చేసిన ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఐదు వందల నుండి వెయ్యి మంది వైద్య శిబిరానికి వస్తారని అంచనా వేశామని అన్నారు. వైద్యశిబిరానికి వచ్చే రోగులకు హెల్త్ ఐ డి జనరేట్ చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియ జేశారు.  ఈ కార్యక్రమంలో   ఎస్ పి సతీష్ కుమార్ ,ఎ పి మెడికల్ కౌన్సిల్ సభ్యులు టి.నర్సింగరావు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎల్.రామ్మోహన్, అదనపు జిల్లా వైద్యాధికారి డా.లీలాప్రసాద్, పి.ఓ.డీడీ టి డా. టి. విశ్వేశ్వర నాయుడు, డిసిహెచ్ ఎస్ డా.హరి, డిఎల్పీఓ పీఎస్ కుమార్౩,ఎంపిడిఓ నరసింహారావు, తహసీల్దార్ వి.ప్రకాశరావు, రెడ్ కార్యదర్శి,పలువురు వైద్య నిపుణులు,ఎస్ టి కమిషన్ సభ్యులు జె.లిల్లీ సురేష్, కె.ఆర్.కె.రాజు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా

2022-04-18 15:54:27

అప్రమత్తంగా సేవలు అందించాలి..

తిరుమలతో పాటు స్థానిక ఆలయాలకు కూడా భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో  నిత్యం అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సేవలందించాలని  టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  టీటీడీ ఆలయాల్లో భక్తుల రద్దీ నిర్వహణ, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై సోమవారం రాత్రి ఈవో అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి ముగిసే వరకు ఆలయాలకు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.  తిరుమలలో టోకెన్ లేకుండా సర్వదర్శనం అమలు చేస్తున్నందువల్ల క్యూ లైన్లు, షెడ్లు, క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు తాగునీరు, ఆహారం, పాలు నిత్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళ్యాణకట్ట, సిఆర్వో, పిఏసీల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విభాగాది పతులు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని అన్నారు. స్థానిక ఆలయాల్లో సైతం భక్తులు ఎక్కువ సమయం దర్శనం కోసం వేచి చూసే పరిస్థితి రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని ఆలయాల్లో తాగునీరు, నీడ ఉండాలని ఈవో చెప్పారు. కోవిడ్ కు ముందు ఎక్కడ ఎంత మంది ఉద్యోగులు పని చేసేవారో తెలుసుకుని, అవసరమైన చోట వెంటనే ఉద్యోగుల ను రప్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రతా విభాగం కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో  వీర బ్రహ్మం, సివి ఎస్వో  నరసింహ కిషోర్, ఎఫ్ ఏసిఏ ఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, విజిఓ మనోహర్ తో పాటు ఆయా విభాగాల డిప్యూటీ ఈవోలు పాల్గొన్నారు.

Tirumala

2022-04-18 15:49:44