ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖకి బాలారిష్టాలు తీరకపోగా రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ముందుచూపులేకపోవడం, సరైన మార్గదర్శకాలు రూపొందించకపోవడం, ఉద్యోగనిమకాల్లో నిబంధనలు పాటించకపోవడం తదితర కారణాలు ఇపుడు ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించాయి. గ్రామాల్లో రక్షణ, విద్యార్ధినిలు, మహిళలు, గృహిణిల సంరక్షణార్ధం నియమించిన సచివాలయ మహిళా పోలీసు ఉద్యోగుల పరిస్థితి గాల్లో దీపంలా ఉంది. అసలు వీరు పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులా..లేదంటే..మరే ఇతర శాఖకు చెందిన ఉద్యోగులో తెలియని పరిస్థితి కోర్టుకేసులతో దాపురించింది. వీరి నియామకాలు పోలీసు నియామ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఏ ముహూర్తాన ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రైవేటు కేసు హైకోర్టులో పడిందో నాటి నుంచి నేటివరకూ కోర్టు కేసులు ఈశాఖను వెంటాడుతూనే ఉన్నాయి. ఫలితంగా సచివాలయ మహిళా పోలీసులకు పోలీస్ స్టేషన్ విధులు, బందో బస్తు డ్యూటీలు అప్పగించమని నేరుగా ఆంధ్రప్రదేశ్ డిజిపి కోర్టుకి విన్నవించుకోవాల్సి వచ్చింది. అక్కడితో కధ ఆగిందా అనుకుంటే అక్కడి నుంచే కష్టాలు మరింత ఎక్కువై..వీరిని దారుణంగా వెంటాడుతున్నాయి. నేరుగా డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి 26 జిల్లాల ఎస్పీలకు, సిపిలను మహిళా పోలీసులను పోలీసుశాఖ విధులకు వినియోగించవద్దని హెచ్చిరించి చెప్పినా ఫలితం లేకపోయింది. డిజిపి మాటలు, కోర్టు ఉత్తర్వులు నీటి మీద రాలతే అనుకున్నారో ఏమో పోలీసు అధికారులు..ఆ ఆదేశాలను భేఖాతరు చేస్తూ..వారిని కోర్టు కేసు తరువాత కూడా స్టేషన్ డ్యూటీలు, తీర్ధాలు, ఉత్సవాల్లో బందో బస్తు డ్యూటీలకు వినియోస్తూ కోర్టు దిక్కారానికి, డిజిపి ఆదేశాల బేఖాతరుకు పాల్పడుతున్నారు.
సచివాలయ మహిళా పోలీసులను పోలీసుశాఖ ద్వారా నియమించినప్పటికీ వీరికి ఐసిడిఎస్, ఎన్నికల కమిషన్ బిఎల్వో, సచివాలయాల్లో ఇతర ప్రభుత్వ పథకాల విధులు అప్పగించారు. అంతేకాదు వీరికి ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేస్తూ ప్రత్యేక జీఓ ఇచ్చారు. ఇపుడు ఆ జీఓ పనిచేస్తుందో లేదో తెలియకుండా పోయింది. పోలీసుశాఖ ద్వారా నియమితులైన మహిళా పోలీసులకు ఏకంగా ఆ పోలీసుశాఖ విధులే అప్పగించమని డిజిపి ఏపీ హైకోర్టుకి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. అలాంటపుడు వీరు ఏ ప్రభుత్వశాఖకు చెందుతారు..? వీరికి డ్యూటీ చార్టు ఏవిధంగా అమలు చేస్తారనేది ప్రశ్నార్ధకమైంది..? ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో పోలీసులు డిజిపి ఆదేశాలున్నా వారికి స్టేషన్ డ్యూటీలు, బందో బస్తు డ్యూటీలు వేస్తుంటే..మరికొన్ని జిల్లాల్లో కోర్టులతో వ్యవహారం మనకెందుకులే అని వారిని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేంత వరకూ సచివాలయ విధులకే వినియోగించుకోవాలని వదిలేశారు. దీనితో ప్రభుత్వ పథకాలు, ఇతర పంచాయతీ వ్యవహారాలకు మహిళా పోలీసులనే వినియోగిస్తున్నారు. ఈపరిస్థితుల్లో తమ పరిస్థితి ఏమిటో తమకు అర్ధం కావడంలేదని.. తమకు మళ్లీ పోలీసుశాఖనే కేటాయించాలని, యూనిఫాం ఇవ్వాలని, డ్యూటీ చార్టు అమలు చేయాలని కోరుతూ మెజార్టీ మహిళా పోలీసులు ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి తమ గోడును వెల్లగక్కుతున్నారు. వినతి పత్రాలు ఇస్తూ వారిని ప్రశన్నం చేసుకుంటున్నారు. విషయం కోర్టులో ఉండటంతో ప్రజాప్రతినిధులు మహిళా పోలీసులు చేస్తున్న వినతులను భద్రంగా తమ కార్యాలయాలకే పరిమితం చేస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు ఉద్యోగాలను ప్రభుత్వం సుమారు 14వేలకు పైగా నియమించడంతో.. అసలైన కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీకి విఘాతం కలిగినట్టు అయ్యింది. దీనితో తాము ఉద్యోగాలు కోల్పాయమంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నవేళ..పోలీసుశాఖలోని కొందరు సిబ్బంది ప్రభుత్వం చేసిన తప్పును, నిబంధనలను బయటకు తీసి వాటిని ప్రైవేటు వ్యక్తులకు అందించడంతో కోర్టులో కేసులు పడ్డాయని కూడా చెబుతున్నారు. అలా మొదటి కోర్టు కేసు పోలీసు నియామక బోర్డు ద్వారా కాకుండా వీరిని డిఎస్సీ ద్వారా ఎలా నియమిస్తారంటూ దాఖలైంది. అక్కడి నుంచి వరుస కోర్టు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత పోలీస్ స్టేషన్ లలో కానిస్టేబుళ్లకు, హోం గార్డులకు గ్రామాల్లో కాస్త పరపతి తగ్గింది. ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా మహిళా పోలీసులనే ప్రజలు కవడం, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, సారా నియంత్రణలో కీలకంగా వ్యవహరించడం, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ లు ఇవ్వడం.. అన్ని కార్యక్రమాల్లో ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలతో మహిళా పోలీసులే ఉండటంతో క్రిందిస్థాయి కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది మింగుడు పడకుండా పోయింది.. ఒకరకంగా స్టేషన్ లోని కానిస్టేబుళ్లే నేరుగా ఎస్ఐలతోనూ, సిఐలతో ప్రతినిత్యం మాట్లాడలేని పరిస్థితి. అలాంటిది మహిళా పోలీసుకు నేరుగా ఎస్ఐలు, సిఐలు, ఇంటెలిజెన్సు సిబ్బందితో మాట్లాడే అవకాశాలు రావడం, స్టేషన్ సిబ్బంది పనులు కూడా సచివాలయ మహిళా పోలీసులతోనే చేయించుకోవాల్సి రావడంతో వారికి ఏం చేయాలతో పాలుపోకననే ప్రభుత్వ లోపాలను బయట పెట్టడం ప్రారంభించారనే విషయం ఇపుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఆకారణంతోనే ఎలాగైనా మహిళా పోలీసులను పోలీసుశాఖ నుంచి వెల్లగొట్టాలనే నెపంతోనే పోలీసుశాఖలోని సిబ్బందే ప్రభుత్వం అనాలోచితంగా నియమించిన మహిళా పోలీసు ఉద్యోగాలను కోర్టు కేసుల ద్వారా ప్రభుత్వానికి విసుగు వచ్చేలా చేస్తే.. ప్రభుత్వమే వారిని వేరొక శాఖలో విలీనం లేదా, ఇదే పోలీసు శాఖలో మినిస్టీరియల్ స్టాఫ్ గా మార్చడానికి అవకాశం వస్తుందని భావించినట్టుగా చెబుతున్నారు. అంతేకాకుండా పోలీసు నియామక బోర్డు ద్వారా వీరి నియామకాలు జరగలేదనే విషయం, వారు పోలీసు ఉద్యోగాలకు సరిపోరనే విషయాన్ని పోలీసుశాఖలోని అధికారులు, సిబ్బంది చెబితే తప్పా అసలు విషయం బయటకు రాదని, ఇది కావాలని పోలీసుశాఖ సిబ్బంది చేసిన పనిగానే ఇటు ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదట. గ్రామ, వార్డు సచివాలయశాఖపై మొదటి కోర్టు కేసు నమోదు అయిన దగ్గర నుంచి తరువాత కోర్టు కేసులు ఏవిధంగా నమోదు అవుతున్నాయో వాటిని కూడా ప్రభుత్వం నిసితంగా పరిశీలించడంతోపాటు, వీటి వెనుక ఎవరెవరి ఇంటి దొంగల హస్తం వుందనే విషయంలో కూడా నిఘా పెట్టినట్టు తెలిసింది. ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కొందరు పోలీసు సిబ్బంది ఇదే మహిళా పోలీసుల్లో యూనిఫారం, పోలీసు విధులు ఇష్టం లేని వారిని గుర్తించి వారి ద్వారా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా కొందరు మహిళా పోలీసులు తమకు యూనిఫారం, స్టేషన్ డ్యూటీలు వద్దంటూ ప్రభుత్వానికి అర్జీలు కూడా పెట్టారు. అయితే మెజార్టీ ఉద్యోగులు పోలీసుశాఖతో కలిసి పనిచేయాలని ఉందని చెప్పడంతో ఆ విషయం ఇపుడు ఈ శాఖలో నానుతూ వస్తోంది. పైగా ఈవిషయంలో క్లారిటీ వస్తే ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టు ఏడాదికి ఒకసారి ఐదువేల మంది కానిస్టేబుళ్లు ఇతర పోస్టులను భర్తీచేస్తుందని కూడా మహిళా పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న పోలీసుశాఖలోని పనిచేస్తున్నట్టుగా తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
మహిళా పోలీసుల్లో కొందరు తమకు ఈ పోలీసు విధులు వద్దని, అత్యధిక మంది కావాలని ఎవరకి వారు ప్రభుత్వానికి అర్జీలు సమర్పిస్తున్నారు. మరికొందరు కోర్టు కేసులు కూడా వేసుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు పోలీస్ స్టేషన్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు వేయమని కోర్టుకి అఫడవిట్ దాఖలు చేసిన దగ్గరనుంచి వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అసలు వీరు పోలీసుశాఖ ఉద్యోగులేనా అనే అనుమానం వీరికే వస్తున్నది. తమను మళ్లీ పోలీసుశాఖలో ఉంచి తమకు డ్యూటీచార్ట్, ప్రమోషన్ ఛానల్, సర్వీసు రూల్స్ ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విషయం కోర్టులో ఉండటంతో ప్రభుత్వం కూడా వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క గ్రామ, వార్డు సచివాలయశాఖకు ప్రభుత్వం కూడా చట్టబద్ధత కల్పించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన, ఉద్యోగం ఉంటుందా..? ఊడుతుందా అనే భయం మరింత ఎక్కువైంది. 2024 ఎన్నికలు తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే సరేసరి..ఒక వేళ రాకపోతే తమ పరిస్థితి ఏంటనే అనుమానానికి వచ్చి తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులు. మరోప్రక్క వీరికి ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోవడం కూడా వీరి ఉద్యోగంపై ఆందోళనలు మరింత ఎక్కువవుతున్నాయి. చూడాలి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? ఈ శాఖకు చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తుంది..?ఉద్యోగులకు ఇప్పటి వరకూ ఇవ్వకుండా ఉండిపోయిన ప్రయోజనాలు..పీఆర్సీ అరియర్స్ బకాయిలు, రెండు ఇంక్రిమెంట్లు, కోల్పోయిన 9నెలల పేస్కేసలు, ప్రమోషన్ ఛానల్, సర్వీసు రూల్స్, తదితర విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది..!