1 ENS Live Breaking News

ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా..ఎలక్ట్రోలర్ రోల్ అబ్జర్వర్

ఈ నెల 22న ఓట‌ర్ల తుదిజాబితా ప్ర‌క‌ట‌న‌కు సిద్దం కావాల‌ని  అధికారుల‌ను, జిల్లా ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ ప‌రిశీల‌కులు, ఉన్న‌త విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జె.శ్యామ‌ల‌రావు ఆదేశించారు. ఆయ‌న గురువారం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో సంబంధిత అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జిల్లాలో జ‌రుగుతున్న‌ స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌ను క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ముందుగా వివ‌రించారు. వివిధ అంశాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ చేశారు.  ఈ సంద‌ర్భంగా ప‌రిశీల‌కులు శ్యామ‌ల‌రావు మాట్ల‌డుతూ, స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఆరా తీశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితి, రాజ‌కీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చ‌ర్య‌ల‌ను తెలుసుకున్నారు. వ‌చ్చిన అన్ని ఫిర్యాదుల‌ను ప‌రిశీలించి, త‌గిన చ‌ర్య‌లు చేపట్టాల‌ని ఆదేశించారు. ఓట‌ర్ల జాబితాల తుది ప్ర‌చుర‌ణ‌కు చేసిన ఏర్పాట్ల‌ను తెలుసుకున్నారు. నాలుగు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్ర‌దేశాలు, అక్క‌డి మౌలిక స‌దుపాయాల‌పై ప్ర‌త్యేకంగా ఆరా తీశారు. 22న తుది జాబితాను ప్ర‌చురించి, అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాబితాల‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని ఆదేశించారు. జాబితాల‌ను గుర్తింపు ఉన్న రాజ‌కీయ పార్టీల‌కు ఇవ్వ‌డంతోపాటుగా, డిజిట‌ల్ కాపీల‌ను కూడా ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. ప్ర‌తీ బిఎల్ఓ వ‌ద్దా ఓట‌ర్ల జాబితా  ఉండాల‌ని, ప‌బ్లికేష‌న్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల‌ని శ్యామ‌ల‌రావు స్ప‌ష్టం చేశారు.  ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట త్రివినాగ్‌, డిఆర్ఓ ఎస్‌డి అనిత‌, నియోజ‌క‌వ‌ర్గాల‌ ఇఆర్ఓలు, ఎఇఆర్ఓలు, డిటిలు, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2024-01-18 15:24:08

ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి సేవలు ఇకపై ఆన్లైన్లో

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిల ద్వారా అందుతున్న సేవలన్నింటిని  భారత ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీస్ ( ఎన్సీఎస్) పోర్టల్ తో ఆన్లైన్ లో అనుసంధానించారని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, అదనపు అర్హతలు నమోదు సులభ రీతిన http://employment.ap.gov.in  ద్వారా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.  అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన యెడల వారికి లాగిన్ వివరాలు, తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ వెంటనే ఎస్సెమ్మెస్ ద్వారా పండం  జరుగుతుందని, సంబంధిత జిల్లా అధికారి వారి అభ్యర్థనను ఆమోదించిన తర్వాత వారికి ఎస్సెమ్మెస్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియజేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ కార్డ్ ను లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.  సందేహాలకు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఫోన్ 96407 60352 నెంబర్ కు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి  అరుణ తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2024-01-18 15:17:43

అనకాపల్లిలో సర్వశిక్ష కాంట్రాక్టు ఉద్యోగి ఉసురు తీసిన ఉద్యమం

అనకాపల్లిలో సర్వశిక్ష కాంట్రాక్టు ఉద్యోగి ఉసురు తీసింది ఉద్యమం. 21రోజుల పాటు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తూ అకస్మాత్తుగా మూగబోయింది జడ్డు వాసుదేవరావు గొంతు. జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయం వద్ద వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తూ.. తమను ఎంటీఎస్ పరిధిలోకి తీసుకు రావాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన చేస్తున్నారు ఉద్యోగులు ఇందులో భాగంగా తీవ్ర అస్వస్థకు గురున వాసుదేవరావు మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీనితో కుటుం సభ్యులు ఇతర ఉద్యోగులు మృతదేహంతోనే డిఈఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. డిమాండ్ల సాధనకోసం ఉద్యమిస్తే.. మాకు దక్కేది మా సహచర ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడమా అంటూ ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఉద్యోగుల ఆందోళన ఒకవైపు, మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మరోవైపు అక్కడి దశ్యాలు గుండెలను పిండేసే విధంగా కనిపించాయి. వాసుదేవరావు ఉద్యోగల ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించేవాడు. ఉద్యోగల డిమాండ్లసాధనకోసం ఏం చేయడానికైనా సిద్దమేనని ప్రకటించి ఉద్యమానికి ఊపిరి పోశాడు. అలాంటి ఉద్యమనేత ఉద్యమం చేస్తూనే ప్రాణాలు వదిలి తమను విడిచి వెళ్లిపోయాడంటూ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు బరువైన గుండెలతో రోధించిన తీరు అందరినీ ఆలోచింప చేస్తున్నది. ఉద్యోగులు ఉద్యమిస్తే డిమాండ్లు పరిష్కారం అవుతాయని..కానీ సర్వశిక్ష ఉద్యోగుల విషయంలో సహచర ఉద్యోగిని కోల్పోవాల్సి వచ్చిందని ఉద్యోగులంతా గుండెలు బాదుకుంటున్నారు. ఇన్ని రోజులుగా రక రకాల విధానాల్లో తమ నిరసనచేపడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల తరపున పోరాడి ప్రాణాలు త్యధించిన వాసుదేవరావు మృతిసాక్షిగా తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామనిహెచ్చరించారు.తక్షణమే మృతుని కుటుంబానికి ఆసుపత్రికి అయినఖర్చు, ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగం, నష్టపరిహారం కూడా చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై అనకాపల్లి డిఈఓకి కూడా వినతి పత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సర్వశిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు.  

Anakapalle

2024-01-09 09:22:43

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి 70 స్థానాలకు పైగా పోటీ?!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మళ్లీ జీవం పోసుకుంటుందా..? పార్టీకి పూర్వ వైభవం వస్తుందా..? ఈ పార్టీలోకి చేరికలు భారీగా వస్తున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితిలు..అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు రాకుండా భంగపడిన వారంతా ఇపుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని చూస్తున్నారు. జాతీయ పార్టీ కావడం, 2024 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆశావాహులంతా క్యూ కడుతున్నారు. అన్నీ అనుకూలిస్తే సంక్రాంతి దాటిన తరువాత ముహూర్తాలు చూసుకొని మరీ జంపింగ్ లు చేయడానికి కార్యాచరణ కూడా సిద్దమైందని చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 70 స్థానాలకు పై చిలుకే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్ధులు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ వైఎస్ షర్మిల పార్టీలోకి రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేసి అవకాశాలు రానివారంతా కాంగ్రెస్ లోకి చేరి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అందుతుంది. సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్టింగ్ లోకి వచ్చేయడం ఇపుడు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అటు జనసేన-బీజేపీ మధ్య పొత్తు, జనసేతో టిడిపి పొత్తు ఉండటంతో చాలా సీట్లు ఇటు టిడిపిలో కూడా సీనియర్లుకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి వారు కూడా ఇపుడు కాంగ్రెస్ లోకే వెళ్లే అవకాశాలు కినిపిస్తున్నాయి. 

175 నియోజకవర్గాల్లో 70కి పైగా పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్ధుల్లో సుమారు 45 మంది బడా బడా  నేతలే రంగంలోకి దిగుతున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమా చారం. గత కొద్ది రోజులుగా రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తున్న ఈరోజు దినపత్రిక, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వే, గ్రౌండ్ రిపోర్టు ఆధారంగా అత్యంత కీలక వ్యక్తులే ఈసారి మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారని తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి సుమారు ఏడు నుంచి 10 మంది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మరో 12 మంది, రాయలసీమం నుంచి 15, ఇప్పటి వరకూ తమ తమ సీట్లను ఖరారు చేసుకు న్నట్టు నివేదికలు అందుతున్నాయి. ఒకేసారి కాంగ్రెస్ నుంచి ఇంత మంది పోటీచేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఓట్లు పెద్ద ఎత్తున చీలిపోయే అవకాశాలు కనిపిస్తు న్నాయి. వైఎస్సార్సీపి, టిడిపి, జనసేన వారి వారి పార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకు ఉన్నా, అభ్యర్ధులు ఎక్కువ కావడంతో ఓట్లు చీలిపోయే పరిస్థితి నెలకొం ది. ఇప్పటికే అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సుమారు 40మందికి సీట్లులేవు..మరోజాబితా వస్తే ఆ సంఖ్య పెరిగే అవకాశాలూ ఉన్నాయి. 

దీనితో సీట్లు రానివారంతా ఇపుడు ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ గూటికే చేరుతారన్నది స్పష్టం అవుతోంది. మరోవైపు అధికార పార్టీ కాకుండా మరే మారేపార్టీ నుంచి అభ్యర్ధులు నిలబడినా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, యువత ఓట్లు పడే అవకాశాలూ ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విషయం ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ విషయంలో స్పష్టమైంది. ఎక్కువమంది ఎంపీస్థానాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం అంగన్వాడీలు, సర్వశిక్షా ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ ప్రభుత్వం వారి డిమాండ్లను తీర్చకుండా బింకపట్టు పట్టుకొని కూర్చుంది. అదేసమయంలో షర్మిల కాంగ్రెస్ లోకి చేరడటం, ఆమె అనుచరులు, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు కూడా క్యూలు కడుతున్నారు. ఈరోజు పేపర్ లెక్క నిజమైతే ఫిబ్రరి మొదటి వారంలోనే కాంగ్రెస్ తొలిజాబితా వెలువడే అవకాశాలున్నాయి. ఈ 2024 సాధారణ ఎన్నికల్లో త్రిముఖ పోటీ, మూడు సామాజిక వర్గాల బలాబలాలు, ఎత్తులు, పైఎత్తులు, రాజకీయ సమీకరణలు, జంపింగ్ జపాంగ్ లు వారి వారి బలాన్ని ఎంతలా ప్రదర్శించనున్నారనేది..!




Visakhapatnam

2024-01-05 08:58:37

ఉద్యోగులకు జీతాలు పడలేదు.. రిటైర్ అయినవారికి పెన్షన్లు రాలేదు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు..రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లూ పడలేదు. ప్రభుత్వం సంక్షేమ పథకాల నగదు బదిలీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యోగులకు ఒకటోతేదీన జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం ఎందకనో కాస్త ఆశ్రద్ధ చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. సమయానికి జీతాలు రాకపోవడం వలన ఉద్యోగులు ప్రతీనెలా 2వ తేదికి కట్టాల్సిన హౌసింగ్ లోన్, పర్శనల్ లోన్, ఇతరత్రా ఈఎంఐలకు పెనాల్టీలు కట్టాల్సి వస్తున్నది. అలాగని తేదీలు కాస్త వెనక్కి మార్చుకున్నా అదే సమయానికి జీతాలుగానీ పెన్షన్లు గానీ పడతాయనే గ్యారంటీ లేదంటున్నారు ఉద్యోగులు. ఇక రిటైర్ అయిన ఉద్యోగులైతే ఈ వయసులో కూడా తమ పెన్షన్ ఎప్పుడు అకౌంట్లలోకి పడుతుందాని ఎదురుచూసి..ఆ నెల నిత్యవసరాలకు అప్పులు చేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రతీనెలా ట్రజరీలో ఏదో ఒక సాంకేతిక కారణం చూపి ఉద్యోగుల జీతాల బిల్లలు ఆలస్యం చేస్తున్నారు. అవి ప్రభుత్వ ఆదేశాలో లేదంటే, నిజంగానే సాంకేతిక సమస్య తలెత్తుందో అర్ధం కావడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ సాంకేతిక కారణమే అయితే నగదు బదిలీ పథకాలకు, వాలంటీర్ల గౌరవ వేతనాలకు మాత్రం టంచనుగా ఒకటో తేదీనే ఎలా వారి అకౌంట్లలోకి డబ్బులు పడుతున్నాయని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకటోతేదిన జీతం, పెన్షను అందుకోడం పట్టుపమని రెండు మూడు నెలలు కూడా చూడలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

జీతాలమీదే ఆధారపడే ఉద్యోగులు, పెన్షన్ల సమస్యలు వారి బ్యాంకుల ఈఎంఐల ఇబ్బందులూ దృష్టిలో ఉంచుకొనైనా సమయానికి అకౌంట్లోకి జీతాలు సమచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఆది నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న తీరు వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో ఏ ప్రభుత్వంలోనూ ఇంత ఆలస్యం చూడలేదని చెబుతున్నారు. కావాలని చేస్తున్నారో..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చేస్తున్నారో అర్ధం కావడంలేదని, కానీ ప్రతీనెలా జీతాలు, పెన్షన్లు మాత్రం ఆలస్యంగానే వస్తున్నాయని చెబుతున్నారు. ప్రజల్లో భాగమే ఉద్యోగులని, అలాంటి వారిని పెడచెవిన పెట్టడం వలన రానున్న రోజుల్లో మరిన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని, కొద్దో గొప్పో వచ్చే సహకారం కూడా రాకుండాపోయే ప్రమాదం కూడా లేకపోలేదని వాదన బలంగా వినిపిస్తున్నది. రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగరోజుల్లో కూడా ప్రత్యేక జూమ్ మీటింగులు, శిక్షణా కార్యక్రమాలు, అవేమీ లేకపోతే టెలీ కాన్ఫరెన్సులు, అవీ కుదరకపోతే యాప్స్ లో డేటా అప్లోడ్ పనులు అప్పగించే ప్రభుత్వం సమయానికి ఎందుకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదో చెప్పగలదా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. చూడాలి ఎన్నికల వేల ఉద్యోగులు, పెన్షనర్లు ఈ మూడు నెలలైనా సమయానికి జీతాలు అకౌంట్లోకి సమయానికి ప్రభుత్వం వేస్తుందా అనేది..?!

Visakhapatnam

2024-01-04 04:48:40

విశాఖ వైఎస్సార్సీపీలో రెండో వికెట్ అవుట్..సీతంరాజు రాజీనామా

విశాఖ వైఎస్సార్సీపీలో ఒక్కో నాయకుడూ పార్టీకి రాజీనామాలు చేస్తూ వస్తున్నారు. మొన్న ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయగా..ఈరోజు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ కూడా పార్టీ రాజీనామా చేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, కార్పోరేషన్ చైర్మన్ రెండిటికీ రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డికి పంపినట్టు తెలిసింది. ఈయన రాజీనామాను విరమించే విషయంలో బుజ్జగింపులు చేపట్టినా ఫలితం లేకపోయింది. సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడుగా వున్న సీతంరాజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. అయితే ఆ సమయంలో ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు తన గెలుపుకోసం కనీసం పనిచేయలేకపోవడం వలనే తాను ఓడిపోయానని ఆయన పలు మార్లు తమ కార్యకర్తల ముందు ఆవేదన వెల్లగక్కారు. రాజకీయాల్లోలకి వచ్చిన తరువాత పార్టీకోసం చాలా పెద్దమొత్తంలో ఖర్చుచేసినా ఫలితం లేకుండాపోయిందని..దానిని ఎక్కడ పెట్టుబడిగా పెట్టినా ఫలితాలు వేరేలా ఉండేవని ఆయన సన్నిహితులు కూడా అప్పట్లో ఆయన ముందే కుండబద్దలుగొట్టినట్టుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంతోనే విశాఖ దక్షిణం ఎమ్మెల్యే సీటు ఆశించినా ఈయనకు అధిష్టానం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో మనస్థాపానికి గురైన ఆయన పార్టీకి, ఆయన పదవికి రాజీనామా చేశారు. దీనితో రెండు రోజుల తేడాలో ఇద్దరు నియోజవర్గస్థాయి నాయకులు అధికార వైఎస్సార్సీపి పార్టీకి రాజీనామా చేయడం విశాఖలో చర్చనీయాంశం అవుతుంది. వైఎస్సార్సీపికి రాజీనామా చేసిన వంశీక్రిష్ణ శ్రీనివాస్, జనసేనలోకి చేరన రోజే ప్రకటించారు. ఇంకా నాతోపాటు చాలామందే పార్టీని వీడుతున్నారని, వారిని జనసేనలో చేర్చుతానని చెప్పారు. అన్నట్టుగా రెండో రాజీనామా ప్రకటన సీతంరాజు సుధాకర్ చేశారు. ఈయన జనసేనపార్టీలో చేరుతారా..? మరేదైనా పార్టీలో చేరుతారా అనేవిషయంలో మాత్రం క్లారిటీ రావాల్సివుంది. ఈయనకు బీజేపి నుంచి ఎమ్మెల్యే సీటు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. సెంటిమెంటుగా, బ్రాహ్మణులు, యాదవుల మనస్థాపాలు, ఆందోళనలు చాలా విషయాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. విశాఖ వైఎస్సార్సీపీలో కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులే రాజీనామాలు చేయడంతో ఈవిషయం రాష్ట్రవ్యాప్తం హాట్ టాపిక్ అయ్యింది.

Visakhapatnam

2023-12-29 11:46:00

జనసేనలోకి చేరేందకు చాలా మందే వస్తారు..ఎమ్మెల్సీ వంశీ

వైఎస్సార్సీపి నుంచి జనసేనపార్టీలో చేరేందుకు చాలా మందే సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన తీర్ధం పుచ్చుకున్న ఆయన బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీలో తనకు ఎలాంటి లోటూ రాలేదని, తానుకోరుకున్న స్థానం నుంచి ఎమ్మెల్యే పోటీచేసే అవకాశం లేకపోవడం వలన తాను పార్టీ మారాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తనతోపాటు, నాయకులు, క్యాడర్, కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వారందరినీ పార్టీలోకి తానే చేర్చుతానని కూడా చెప్పారు. వైఎస్సార్సీపి ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా సమర్పించినట్టు ఆయన తెలియజేశారు. తన అనుచరులు, అభిమానులు, కుటుంబ సభ్యుల కోరిక ఎమ్మేల్యే కావడమని..దానికి అనుగుణంగానే నడుచుకుంటున్నానని చెప్పారు. పార్టీలో తనను కాదని దద్దమ్మలాంటి వ్యక్తులకు ప్రత్యేక స్థానం కల్పించారనే మాటకు తాను కట్టుబడే ఉన్నానని, వాళ్లెవరో 2024 ఎన్నికల తరువాత తెలుస్తుందని అన్నారు. విశాఖ నగరంలో ఎక్కడి నుంచైనా తాను పోటీ చేస్తానని చెప్పారు. అంతకు ముందు పార్టీలో చేరిన తరువాత ఆయన మాట్లాడుతూ, తాను తన సొంతింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని..తనకు పవన్ కళ్యాణ్ కు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి తాను ఆయన అభిమానని, ఏ సినిమా వచ్చినా తొలిరోజే సినిమా చూస్తానని కూడా చెప్పారు. వంశీక్రిష్ణ శ్రీనివాస్ చేసిన ప్రకటన ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. దీనితో ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపి పార్టీలో అసంతృప్తులు ఎవరున్నారనే విషయమై పార్టీ అధినాయకత్వం ఆరా తీస్తుందనే వాదన కూడా తెరమీదకు వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ నుంచి వంశీక్రిష్ణ శ్రీనివాస్ చాలా మంది నేతలతో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకరంగా విశాఖతోపాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా యాదవుల్లో మంచి పట్టున్న నాయకుడిగా వంశీక్రిష్ణ శ్రీనివాస్ గుర్తింపు పొందారు.

Amaravati

2023-12-27 16:40:12

సీఎం జగన్ దృష్టికి ఎమ్మెల్సీ వంశీ రాజీనామా వ్యవహారం..

విశాఖలోని ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ వైఎస్సార్సీపికి రాజీనామా చేసిన విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి  ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి దగ్గర ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది. విశాఖ నుంచే అసంతృప్తులు ఎక్కువవతున్నారని, దానికి గల కారణాలను కూడా సీఎం జగన్ ప్రశ్నించినట్టు సమాచారం అందుతోంది. విశాఖ తూర్పునియోజకవర్గం ఎమ్మెల్యే సీటు విషయంలోనే నిరసన వ్యక్తం చేస్తూ వంశీ పార్టీ రాజీనామాచేశారని, దాని ప్రభావం పార్టీపై పెద్దగా పడే అవకాశం కూడా ఉండదని సజ్జల ముఖ్యమంత్రికి తెలియజేసినట్టుగా చెబుతున్నారు. అయితే వంశీ విషయం ముందుగా తెలుసుకొని మాట్లాడి ఉండాల్సిందని..విశాఖ తూర్పుతోపాటు, అక్కడ నగరంలో యాదవుల ఓటు బ్యాంకు అధికంగా ఉన్నందున దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడే అవకాశం ఉండే అవకాశాలున్నాయనే కోణంలోనూ సమాలోచనలు చేసినట్టు చెబుతున్నారు. అయితే అక్కడ ప్రస్తుస్తం వీఎంఆర్డీఏ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిలు ఆ లోటుని భర్తీచేస్తారని దానికోసం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని, ప్రస్తుతం తూర్పు నియోజకవర్గంలో మనపార్టీ తరపున సమన్వయకర్తగా ఉన్న ఎంవివి సత్యన్నారాయణ పూర్తిస్థాయిలో పట్టు పెంచుకుంటున్న విషయాన్ని ఇంటెలి జెన్స్ నివేదికలపైనా చర్చజరిగినట్టు సమాచారం అందుతుంది. కాగా పార్టీలో అసంతృప్తులు లేకపోతే ఆ పార్టీకి గుర్తింపు ఉండదనే విషయాన్ని మీడియా ముందు కూడా సజ్జల ప్రకటించడం కూడా సీఎం జరిగిన చర్చల నేపథ్యంలోనే చేసినట్టుగా చెబున్నారు. అయితే ఎమ్మెల్సీ వంశీ రాజీనామ తరువాత చాలా మంది నాయకులు క్యూ కట్టే అంశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా సీఎం కాస్త సీరియస్ గానే చర్చించినట్టు తెలుస్తోంది.

Amaravati

2023-12-27 16:38:05

అత్యవసర సేవలకు, అదనపు విధులకు కేరాఫ్ గ్రామ సచివాలయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి దూరదృష్టి, ప్రత్యేక ప్రభుత్వశాఖ కల్పన అందరూ కేవలం ఉద్యోగాలు వస్తాయనే చూశారు. కానీ దానిఫలితం రాష్ట్రవ్యాప్తం గా పెను సంచలనాలు సృష్టిస్తోంది. రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లో ఏశాఖ సిబ్బంది చేయని సేవలు ఒక్క గ్రామ,వార్డు సచివాలయశాఖకు చెందిన లక్షా 35వేల మంది ఉద్యోగులు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ప్రభుత్వశాఖలోనైనా సదరుశాఖ సిబ్బంది వారి పనులు మాత్రమే చేస్తారు. కానీ అత్యంత తక్కువజీతం, అన్నిశాఖల పనులూ ఒక్క సచివాలయశాఖ సిబ్బందితో చేయించేవిధంగా ఈ ప్రత్యేక ప్రభుత్వ శాఖ ఏర్పాటు అయిందనే విషయం ఇపుడు ఇతర ప్రభుత్వశాఖల సిబ్బందికి ప్రత్యేకంగా అర్థమవుతోంది. ఒక్కో సచివాలయశాఖ ఉద్యోగి గ్రామస్థాయిలో 12నుంచి 20శాఖల విధులు, నగరపరిధిలో 19శాఖల సిబ్బంది 30శాఖల విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ప్రభుత్వంలోని ఏ శాఖ ఉద్యోగులు, సిబ్బంది సమ్మెచేసినా దాని ప్రభావం నేరుగా సచివాలయశాఖపైనే పడుతుండటం విశేషం. అంతేకాదు, ఆశాఖ సిబ్బంది పనులు కూడా గ్రామ, వార్డుసచివాలయశాఖ సిబ్బంది మాత్రమే చేయాల్సి వస్తుంది. అదనంగా చేసే పనులకు, విధులకు ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి గానీ ప్రత్యేక గుర్తింపు ఏమీ రాకపోయినా, సమ్మెచేస్తున్న ఉద్యోగుల నుంచి మాత్రం తిట్లు, శాపనార్ధాలు, వేధింపులు అదనపు ప్రయోజనాలుగా వీరు స్వీకరించరించాల్సి వస్తోంది. గత 12రోజులుగా ఐసిడిఎస్ అంగన్ వాడీలు సమ్మె చేస్తుండటంతో, సదరు అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బందితో తెరిపించి ప్రభుత్వం పనిచేయిస్తుంది. చంటి పిల్లల ఆకలి తీర్చడానికి వీరిని ప్రభుత్వం అదనపు సేవల కోసం వినియోగిస్తుంటే..సమ్మెచేస్తున్నవారు మాత్రం, ప్రభుత్వంపై తాము చూపించాలనుకున్న ఒత్తిడికి సచివాలయ ఉద్యోగులు అడ్డుగా ఉన్నారంటూ, తమ ఉసురుపోసుకొని నాశనం అయిపోతారంటూ వారి నుంచి వేధింపులు, తిట్లు, శాపనార్ధాలు పెడుతున్నారు.

అంతేకాదు ప్రభుత్వం అప్పగించిన బిఎల్వో విధులకు సైతం సచివాలయ ఉద్యోగులనే వినియోగిస్తూ, వారికి కల్పించాల్సిన సదుపాయాలు, స్టేషనరీ కూడా ఇవ్వకుండా పనులు చేయిస్తుండటంతో సచివాలయ ఉద్యోగులే వాటి ఖర్చు భరించాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా చేస్తున్న బిఎల్వో విధులకు సచివాలయ ఉద్యోగులకు బిల్లులు కూడా పెట్టడం లేదు రెవిన్యూశాఖ. అదనపు బత్యం మాట దేవుడెరుగు, రానూ పోనూ  ఛార్జీలు, మాట్లాడితే మండల కార్యాలయంలో ప్రత్యేక సమావేశాలు, సొంత ఖర్చులతో స్టేషనరీ కొనుగోళ్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల వినియోగం, స్టేషనరీ ప్రింటింగ్ ఖర్చులు ఇలా అన్ని రకాలుగా సచివాలయ సిబ్బందికి ఒకరకంగా వాచిపోతున్నది. గతంలో సచివాలయశాఖ లేనపుడు బిఎల్వో విధులు ఐసిడిఎస్ సిబ్బంది చేపట్టేవారు. ఆ పనులు కాస్తా వీరికి అప్పగించారు. వాటితోపాటు, సచివాలయంలో ఏశాఖ సిబ్బంది లేకపోయినా ఉన్న సిబ్బందితోనే పనులన్నీ చేయిస్తోంది ప్రభుత్వం. అన్నీ భరించి అదనపు పనులు చేస్తున్నా.. కొందరు పంచాయతీ కార్యదర్శిల నుంచి చీత్కారాలు, చీదరింపులు, వేధింపులు తప్పడంలేదు ఉద్యోగులకు. అసలే గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటుతో చాలా ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బందికి గొంతులో పచ్చివెలక్కాయ్ పడటంతో వారి కసిని ఉద్యోగుల విధులపై మరో రకంగా తీర్చుకుంటున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఉద్యోగులు శ్రమించి పనిచేస్తున్నా..పలు గ్రామ, గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేసే పంచాయతీకార్యదర్శిలు పెట్టేవేధింపులకు మహిళా ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. వారు ప్రభుత్వం అప్పగించిన పనిచేయకపోగా, చేస్తున్నవారిని వారి నోటికొచ్చినట్టు తిడుతుండటం, అధికారులు, ప్రజాప్రతినిధుల ముందు చులకన చేసి మాట్లాడుతుండటం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. కొన్నిచోట్ల ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జోక్యం చేసుకొని పంచాయతీ కార్యదర్శిలకు వార్నింగ్ లు కూడా ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీచేయలేదు. దీనితో చాలా చోట్ల 
కార్యదర్శి పోస్టులు, డిజిటల్ అసిస్టెంట్లు ఇలా సుమారు 19శాఖల్లో వివిధ శాఖల సిబ్బంది ఖాళీలు ఉండిపోయాయి. అయినప్పటికీ ఉద్యోగుల సామర్ధ్యాన్ని బట్టి 
ప్రభుత్వం వీరితో అదనంగా పనుల చేయిస్తోంది. ఇప్పటికీ చాలా గ్రామ పంచాయతీలకు కార్యదర్శిలు లేకపోవడంతో ఒకే కార్యదర్శి రెండు మూడు పంచాయ తీలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తూ అదనపు పనులు చేస్తున్నారు. ఆ సమయంలో సదరు పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి, ముఖ్యంగా మహిళా సిబ్బందికి అత్యవసర 
సమయంలో కూడా సెలవులు ఇవ్వడానికి వీరు ససేమిరా అంటున్నారు. ఉద్యోగుల సెలవులు సర్వీసు నిబంధనల ప్రకారం మంజూరుచేసినా, వీరి సెలవులేదో ఖర్చు అయిపోతున్నట్టు, వీరి జీతంలో డబ్బులు సిబ్బందికి జీతబత్యాలుగా ఇస్తున్నట్టుగా కొందరు పంచాయతీ కార్యదర్శిలు తెగఫీలైపోతూ సిబ్బందిపై తమ ప్రతాపాన్ని, పైత్యాన్ని చూపిస్తున్నారు. వాస్తవానికి ఈ సమస్య చాలా చోట్ల ఉన్నప్పటికీ ఉద్యోగులు బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. కొన్నిచోట్ల ఉద్యోగులు తెగించి ఏ ఎంపీడీఓకో, పర్యటనలకు వచ్చి ఏ డిఎల్డీఓనో, జిల్లా పంచాయతీ అధికారికో ఫిర్యాదు చేస్తే మరింతగా రెచ్చిపోతున్న పంచాయతీ కార్యదర్శిలు మరింతగా వేధించడం మొదలు పెడుతున్నారు. ఎంత పనిచేసినా, సమావేశాలు పెట్టి ప్రత్యేకంగా తిట్టి మానసికంగా కృంగదీస్తున్నారు. ఇలాంటి విధానాలతో చాలాచోట్ల ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్న సందర్భాలు కూడా లేకపోలేదు. విశేషం ఏంటంటే ఇలాంటి వేధింపులు కేసు కాకినాడజిల్లాలోని ఎదురైతే అక్కడి పంచాయతీ సర్పంచ్ విషయాన్ని సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనితో అప్పటికే సమావేశంలో ఉన్న ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఎంపీడీఓకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఆ అంశం జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది కూడా. ఇలా సిబ్బందిని వేదిస్తే దానిప్రభావం ప్రభుత్వంపై పడుతుందని కూడా ఘాటుగానే సదరు ఎమ్మెల్యే అధికారులకు వార్నిగ్ ఇవ్వడం విశేషం.

ఇంతలా పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నేటికీ ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రయోజనాలను మాత్రం పొందలేకపోతున్నారు. ఇప్పటికీ ఉద్యోగులందరికీ రెండేళ్ల సర్వీసు ప్రొబేషన్ తరువాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్ల సంగతిపై ప్రభుత్వం నేటికీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకా కొన్ని శాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం ఒకటిరెండు శాఖల ఉద్యోగులకే పదోన్నతులు కల్పించి మిగిలిన శాఖల ఉద్యోగులను గాలికొదిలేశారు. ఇప్పటికీ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తామన్న ఈశాఖకు కల్పించాల్సిన చట్టబద్దత కూడా నేటికీ చేయకపోవడం,  రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగమని ఎన్నివేధింపులు, అదనపు బాధ్యతలు అప్పగించినా, బిఎల్వోలాంటి విధులు, సమ్మెచేస్తున్న సమయంలో అదనపుశాఖల విధులు చేస్తున్న సమయంలో చేతి చమురు వదిలిపోతున్నా అన్నీ భరించి  ఉద్యోగాలు చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. రాష్ట్రప్రభుత్వంలో ఏ అత్యవసర పనులు చేయాలన్నా అందరికీ కనిపిస్తున్నది ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ మాత్రమే. దానికి కారణం కూడాలేకపోలేదు.. ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల్లో ఏశాఖలోనూ ఇంతమంది ఉద్యోగులు ఒకేచోట లేకపోవడమే. చాలా వరకూ ప్రభుత్వశాఖల్లో ఖాళీలు ఉండటం, కేడర్ ఉద్యోగులు లేకపోవడం, గ్రామ,వార్డు సచివాలయశాఖకు ఒక నిర్ధిష్ట ఉద్యోగ కేడర్(గ్రూపు-6, గ్రూపు-5, గ్రూపు-4 తదితర)లేకపోవడంతో ఏ పనికైనా మల్టీ టాస్కింగ్ డ్యూటీలకు వీరినే చక్కగా వినియోగించడానికి వీలుపడుతున్నది. పోనీ ఈశాఖలోని ఉద్యోగ సంఘాల నేతలైనా వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారా అంటే అదేలేదు. దీనితో సచివాలయ ఉద్యోగుల అదనపు విధుల బాధలు, తిట్లు, శాపనార్ధాలు, చీత్కారాలు, వేధింపుల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మండల స్థాయిలో ఎంపీడీఓలు, డివిజన్ స్థాయిలో డిఎల్డీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయశాఖలోని వాస్తవ పరిస్థితిలను సమీక్షించకపోతే దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పడే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. చూడాలి ఇప్పటికైనా ప్రభుత్వం సచివాయల ఉద్యోగుల అదనపు విధుల సేవలను గుర్తిస్తుందా? వీరికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇస్తుందా..? బకాయి పడ్డ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ అరియర్సు, డీఏలు ఇస్తుందా..?.ఉద్యోగులు ఎవరికీ చెప్పుకోలేక భరిస్తున్నవేధింపులు, చీత్కారాలు, చిరాకులు ప్రభుత్వం ప్రత్యేక చర్యల ద్వారా తెరదించుతుందా అనేది..!

Visakhapatnam

2023-12-23 16:16:39

గ్రామ, వార్డు సచివాలయాలు మిన్న..వచ్చే ఆదాయం సున్నా..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేవశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అంతంత మాత్రంగానే సేవలు అందుతున్నాయి. ఫలితంగా రోజూ అత్యంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నది.  గ్రామాల్లో 12 శాఖలు, పట్టణాల్లో 16 శాఖల సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 14వేల 5 సచివాలయాల్లో సుమారు లక్షా 35వేల మంది ఉద్యోగులున్నా.. ప్రభుత్వ ఖజానికి ఆదాయం మాత్రం తక్కువగానే వస్తున్నది. సచివాలయాల ఆదాయాన్ని ఆది నుంచి మీ-సేవా కేంద్రాలు గండి కొట్టేస్తున్నాయి. ముఖ్యంగా రెవిన్యూ ఆధారిత సర్వీసులకు ప్రజలు ఎక్కువగా ఈ కేంద్రాలనే సంప్రదిస్తున్నారు. దీనితో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం, పేరూ పోతున్నాయి. సచివాలయాల్లో ప్రభుత్వం 545 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చెందిన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలు బాగానే అందుతున్నా మిగతా సేవలు అందించడంలో వెనుకబాటుగానే ఉన్నాయని చెప్పాలి. వాస్తవానికి ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ లేనంతగా గ్రామ, వార్డు సచివాయాల్లో ఇంటిముంగిటే ప్రభుత్వశాఖల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ అందే సేవలపై ప్రజలకు అవగాహన లేకుండా పోతున్నది. ఈ విషయమై మండల స్థాయిలో ఎంపీడీఓలు, డివిజన్ స్థాయిలో డిఎల్డీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు కూడా పూర్తిస్థాయిలో దృష్టిసారించిన పాపన పోలేదు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పనులు, ఆదాయం రాని పనులను అత్యధికంగా సచివాలయ సిబ్బందికి అప్పగిస్తున్న ప్రభుత్వం ఆదాయం వచ్చే పనులను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల్లో అందుబాటులో ఉన్న సేవలన్నింటిపైనా గ్రామాల్లోనూ, పట్టణాల్లో వార్డుల్లోనూ ప్రత్యేక అవగాహన కల్పిస్తే రోజుగకి సగటున ఒక్కో సచివాలయానికి రూ.5 వేల నుంచి 10వేల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదు.

సాంకేతిక ఇబ్బందులు మోకాలడ్డు..
గ్రామ, వార్డు సచివాయాల్లో 19శాఖల సిబ్బంది అందుబాటులో ఉన్నా ఒక్కో సచివాలయానికి కేవలం రెండు మాత్రమే కంప్యూటర్లు ఉండటం, అందులో ఒకటి రెగ్యులర్ గా డిజిటల్ అసిస్టెంటే వినియోగించడం, మరొకటి సెక్రటరీ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్లు వినియోగిస్తుండటంతో ఇతర ప్రభుత్వ సేవలు అందించడానికి కంప్యూటర్లు లేకుండా పోతున్నాయి. ఇపుడు ఏ దృవీకరణ కావాలన్నా ఆన్ లైన్ లోనే వివరాలు నమోదు చేయాల్సి ఉండటం, దానికి కంప్యూటర్లు లేకపోవడం వలన క్రమ సంఖ్యలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్లే ఒక రోజుకి ఎన్ని చేయగలరో అన్నే చేస్తున్నారు. దానికితోడూ ఆధార్ కేంద్రాలు కూడా సచివాలయాలకే ఇవ్వడంతో అధిక ఆదాయం వచ్చే ప్రధాన సేవలు అందించే వీలు లేకుండా పోతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సచివాలయాల్లో ఒక్కో కంప్యూటర్ ఉన్నచోట మరీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత్యంతరం లేనివారంతా చచ్చినట్టు మీ-సేవా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ సచివాయాల్లో తీసుకునే ధరకంటే మీ సేవా కేంద్రాల్లో రెండింతలు అధికంగా ఉండటంతో ప్రజలకు ఆర్ఢిక ఇబ్బందులు కూడా తప్పడం లేదు. ఒక్కోసారి రెవిన్యూ ఆధారిత దృవీకరణ పత్రాలకు ఆమ్యామ్యాలు కూడా చెల్లించుకోవాల్సి వస్తున్నది.

రికార్డులకే పరిమితం అవుతున్న మిగులు సిబ్బంది..
సచివాలయాల్లో సరిపడినన్ని కంప్యూటర్లు లేకపోవడం, ఉన్నచోట స్టేషనరీలు సక్రమంగా లేకపోవడం, అన్నీ ఉన్నచోట సిబ్బంది లేకపోవడం తదితర కారణాల వలన ప్రధాన సేవలు గ్రామ స్థాయిలో అందకుండా పోతున్నాయి. గతంలో కంటే మిన్నగా సచివాలయాల్లో సేవలు అందుతున్నా..ఆదాయం మాత్రం రావడం లేదు. ప్రభుత్వానికి ఆదాయం కూడా సచివాలయాల ద్వారా వస్తే మరిన్ని సేవలు ప్రజల ముందుకి తీసుకురావడానికి వీలుపడుతుంది. సాంకేతి పరమైన ఇబ్బందులున్న చోట మిగిలిన సిబ్బంది రికార్డుల పనికే పరిమితం కావాల్సి వస్తున్నది. వాస్తవాని ఈ విషయాలన్నీ జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండలస్థాయి అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వం దృష్టికి అసలు విషయాన్ని తీసుకెళ్డం లేదు. దీనితో ప్రభుత్వం అందించాలనుకున్న సేవలు ప్రజలకు చేరడం లేదు. అటు ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరడం లేదు.

సచివాలయాలను వేధిస్తున్న సిబ్బంది కొరత
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తున్నది. ప్రభుత్వలు అందించడానికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు చాలా చోట్ల ఖాళీగా ఉండిపోయాయి. ప్రభుత్వం కొన్ని చోట్ల కారుణ్య నియామకాల ద్వారా ఖాళీలు భర్తీచేసినప్పటికీ అత్యంత అవసరం ఉన్న డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ లాంటి పోస్టులు భర్తీ కావడంలేదు. దీనితో ఉన్న సిబ్బందే పక్క సచివాయాలకు వెళ్లి అత్యవసర సేవలు ఏ విధంగా ఆన్ లైన్ ద్వారా చేయాలో తెలుసుకొని వాటిని చేస్తున్నారు. చాలా మంది పంచాయతీ కార్యదర్శిలకు ఒక్కొక్కరికి రెండు మూడు పంచాయతీలు ఇన్చార్జిలు అప్పగించడంతో ప్రధాన అవసరాలు గ్రామపరిధిలో తీరడం లేదు. అలాగని కొన్నిచోట్ల సిబ్బంది ఉన్నా పనులు జరగడం లేదు. దీనింతటికీ పర్యవేక్షణ లోపమే ప్రధానంగా కనిపిస్తున్నది. జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డివిజన్ స్థాయిలో డిఎల్డీఓలు, మండల స్థాయిలో ఎంపీడిఓలు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే ఉన్న కొద్దిపాటి సిబ్బందితోనైనా పూర్తిస్థాయిలో సవలు అందించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా పెంచే ఏర్పాటు చేయవచ్చు. కానీ ఆదిశగా ఎక్కడా చర్యలు తీసుకుంటన్న దాఖలాలు కనిపించడం లేదు. దానికితోడు సిబ్బందికి ఎన్నికల విధులు అదనంగా వచ్చి చేరడం కూడా సేవల విధులకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర అధికారులు దృష్టి సారిస్తే తప్పా పరిపాలన, తద్వారా సేవలు.. ఆపై ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం లేదు..!

Visakhapatnam

2023-11-28 17:40:04

ఆ శాఖలకే పదోన్నతుల యోగ(శాప)ం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని గ్రామ, వార్డు సచివాలయశాఖలో కొందరు ఉద్యోగులకు పదోన్నతుల యోగం వరిస్తే..మరికొందరిని పదోన్నతి వ్యవస్థలేని శాపం వెంటాడుతోంది. ఏంటి ఈ వింత అనుకుంటున్నారా..అవును మీరు చదువున్నది అక్షర సత్యం. భారతదేశంలోనే ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని కొన్ని లోపాలను సరిచేయకపోవడం వలన ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మరికొందరు ఉద్యోగులు అమితానందం చెందిన పరిస్థితీ నెలకొంది. సచివాలయ శాఖలో మొత్తం 19 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పనిచేస్తుంటే..అత్యధికంగా వైద్యఆరోగ్యశాఖలో పనిచేసే ఏఎన్ఎం లకు ఇన్ సర్వీసు క్రింద స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇక హార్టికల్చర్, పశుసంవర్ధకశాఖ సహాయకులకు పదోన్నతులు ఇచ్చారు. అయితే సచివాలయశాఖలో రెండేళ్లు సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకున్న రెగ్యులర్ ఉద్యోగులందరికీ ఈశాఖలో సర్వీసు నిబంధనలు, పదోన్నతుల వ్యవస్థలను ఏర్పాటు చేయలేదు. ఆ కోవలోకే ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వస్తున్నారు. ఇక మహిళాపోలీసులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఉన్నప్పటికీ వీరి వ్యవహారం కోర్టులో ఉన్నందున వీరికి కూడా పదోన్నతులు వరించలేదు.  అంతేకాదు వీరి ఉద్యోగాలు ఇపుడు ఉంటాయా..వేరే ప్రభుత్వ శాఖలో విలీనం అవుతాయోకూడా తెలియని పరిస్థితి నెలకొంది. అటు వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ ఉద్యోగులకు ఇన్ సర్వీసు వ్యవస్థ ఏర్పాటు చేస్తారో లేదో తెలియకపోయినా..వీరికి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావడంతో వీరంతా ఆనందంగా ఉన్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వో ఖాళీలు చాలా ఉండటంతో ఆ ఖాళీలను విఆర్ఏలుగా పనిచేస్తున్నవారికి పదోన్నతి కల్పించి విఆర్ఏలుగా మార్చింది. ఇక పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నవారిలో గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శిలు అనగా ప్రస్తుతం డిజిటల్ అసిస్టెంట్లు, తరువాత ప్రస్తుత గ్రేడ్ గ్రేడ్-5 పంచాయతీకార్యదర్శిలు, సర్వేయర్లు, వీఆర్వోలు, నగర పరిధిలో వార్డు సెక్రటరీలు, శానిటేషన్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, సెరీ కల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరంతా తమ పదోన్నతుల మాట ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రెండు మూడుశాఖల ఉద్యోగులకే పదోన్నతులు కల్పించడం ద్వారా తమకు ఎప్పుడు పదోన్నతులు ఇస్తారని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, పట్టుపరిశ్రమశాఖ, పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు కనీసం ఇన్ సర్వీస్ ఛానల్ ఏర్పాటు చేస్తే దానితోనైనా పొందడానికి ఆస్కారం వుంటుందని వాపోతున్నారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఒక్క ఏఎన్ఎంలకు మాత్రమే ఇన్ సర్వీసులో స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్లీ వారి విధులను సచివాలయాల పరిధిలోనే పనిచేసే విధంగా వెనక్కి పంపారు. రానున్న రోజుల్లో వీరికి పదోన్నతులు వస్తే వీరు పీహెచ్సీల్లోని స్టాఫ్ నర్సులుగా వెళ్లే అవకాశాలుంటాయని, వీరి స్థానంలో కొత్త ఏఎన్ఎంల భర్తీ జరగవచ్చునని చెబుతున్నారు. 

ప్రస్తుతం 22460 పేస్కేలు తీసుకునే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి లభించిన తరువాత ఏకంగా రూ.34 వేలు దాటి పేస్కేలు తీసుంటున్నారు. దీనితో పదోన్నతులు రాని ఉద్యోగులంతా తామంతా సచివాలయ శాఖలో శాపగ్రస్తులం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు పదోన్నతుల వ్యవస్థకే నోచుకోని డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల బాధలైతే వర్ణణాతీతంగా ఉన్నాయి. కనీసం కొన్ని శాఖలకు ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేశారు..మేము దానికి కూడా నోచుకోకుండా అన్ని రకాల ఇంజనీరింగ్ పనులనూ చేయాల్సి వస్తుందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో వేల రూపాయల జీతాలు వచ్చే ప్రైవేటు ఉద్యోగాలను వదులుకొని ఈ శాఖలోకి రెగ్యులర్ ఉద్యోగమనే ఆశతో వచ్చిన మాకు తీవ్ర నిరాస మిగిలిందని వాపోతున్నారు. ఇప్పటికే రెండేళ్లలో రెగ్యులర్ కావాల్సిన తమ సర్వీసులు అదనంగా 9 నెలలు పనిచేసినపుడు అపుడు పేస్కేలు, సుమారు రెండు డిఏలు కోల్పోయామని, పీఆర్సీ వర్తించినట్టు పేస్కేలు పెంచినా..అందరు రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగా తమకు పేస్కేలు అరియర్స్ కూడా అందుకోలేకపోయామని చెబుతున్నారు. అసలు పీఆర్సీ అరియర్స్ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని వాపోతున్నారు.

 గ్రామ, వార్డు సచివాలయశాఖలో చేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఒక్కో ఉద్యోగి సుమారు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ప్రయోజనాలు కోల్పోయామని, ఇపుడు పదోన్నతుల విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతోందని అంటున్నారు. మొత్తం 19శాఖల ఉద్యోగుల్లో రెండు శాఖల ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఒక శాఖ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ వ్యవస్థ ప్రారంభమై వారి శిక్షణ కూడా పూర్తిచేసుకున్నారు. మిగిలిన శాఖల్లో కూడా అవకాశం ఉన్నమేర ఇన్ సర్వీస్, ప్రమోషన్ ఛానల్ వర్తిపంజేస్తే ఇతర శాఖల ఉద్యోగులకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం వుంది. లేదంటే అంతర్ జిల్లాల బదిలీల్లో జిల్లాలు మారిన వారికి, అసలు పదోన్నతుల ప్రక్రియే ప్రారంభం కాని శాఖల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం వుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి..!

Visakhapatnam

2023-11-25 07:23:20

చంద్రబాబు ఆరోగ్యం కోసం తిరుమల శ్రీవారికి ఆడారి కిషోర్ పూజలు

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని..జైలు నుంచి తిరిగి వస్తే తిరుమల వస్తానన్న మొక్కును టిడిపి యువనేత ఆడారి కిషోర్ కుమార్ శ్రీవారికి పూజలు చేసి తీర్చుకున్నారు. ఈ మేరకు ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఒక విజన్ ఉన్న జాతీయ నాయకుడని..ఆయన బయట ఉంటే 2024ఎన్నికల్లో ఎక్కడ వైఎస్సార్సీపి ఓడిపోతుందోనని భయపడి అక్రమ కేసులు పెట్టి జైల్లోకి నెట్టిందని ఆడారి ఆరోపించారు. వైఎస్సార్సీపి కక్షరాజకీయాన్ని ప్రజల అంతా నిసితంగా గమనిస్తున్నారని, త్వరలనే సీఎంజగన్ ఊహించని రిటన్ గిఫ్ట్ తీసుకుంటారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగాలని ఆ శ్రీనివాసుడుని బలంగా కోరుకున్నానని అన్నారు. చంద్రబాబుకోసం శ్రీవారిని కోరుకున్న మొక్కులో నా కుటుంబ సభ్యులు కూడా భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆయన ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారన్న ఆయన రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకి తీసుకెళ్లడానికి, అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపి చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను అన్ని వర్గాలకు తెలియజేసే చైత్యవేధిక సేవ్ డెమోక్రసికి శ్రీవారి ఆశీస్సులు కావాలని ఆవదేవదేవుడిని కోరుకున్నానని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబుని వైఎస్సార్సీపి పెట్టిన అక్రమ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు తీసుకురావాలని శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు.   ఆడారి కిషోర్ వెంట సేవ్ డెెమోక్రసి ప్రతినిధులు పాల్గొన్నారు.

Tirumala

2023-11-19 07:09:14

డెమోక్రసీ ఇన్ డేంజర్ తో ప్రజలను చైతన్యవంతం చేయాలి

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్నప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలు, కక్షసాధింపు వ్యవహారాలన్నింటినీ ప్రజలందరూ తెలుసుకునేలా డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమం ద్వారా చైతన్యపరచాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చన్నాయుడు పేర్కొన్నారు. గురువారం విజయవాడలో తెలుగు యువత నాయకులు ఆడారి కిషోర్ కుమార్ ఆధ్యర్యంలో ఉద్యమంలా సాగుతున్న డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆయన టిడిపి నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుందని..దానిని ఎప్పుడో ప్రభుత్వ విధానాలతో బంగాళాఖాతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కలిపేసిందన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ప్రభుత్వం అలుపెరగకుండా శ్రమిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలను ఉత్తేజపరచడానికి, ఆలోచించే విధంగా చేయడానికి డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఎంతగానో ఆలోచిపంచేస్తున్నాయని, మంచి కార్యక్రమం తలపెట్టిన కిషోర్ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం ఉంటుందన్నారు. యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, అధికారం చేతిలో ఉందనే ఒకే ఒక్క గర్వంతో అరాచకపరిపాలన చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ముఖ్యంగా యువతను ఆలోచింపచేయడానికి, ఉద్యోగులు, మేధావుల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి, వారిలో చైతన్యం నింపడానికి డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాలను అన్ని నియోజవర్గ కేంద్రాల్లోనూ నిర్వహిస్తున్నామన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇపుడు వైఎస్సార్సీపీ పాలనలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో మార్పురావాలన్నారు. దానికోసం విశాఖ జిల్లా మొదలుకొని అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో, అమరావతి, విజయవాడకు చెందిన టిడిపి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Vijayawada

2023-11-16 09:05:32

ప్రభుత్వ ఉద్యోగుల్లో సిపిఎస్ రద్దు ప్రకంపన

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల చిరకాల కోరిక సిపిఎస్ రద్దు.. పాత పెన్షన్ విధానం ముద్దు. ఇపుడు అదే విషయాన్ని తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడిగా ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని చూస్తున్నాయి. ఏపీలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్ల ద్వారా సుమారు 25 నుంచి 35 సీట్లు గెలిచేటన్ని ఓట్లు రాబట్టొచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా. అయితే గత ఎన్నికల్లో వైఎస్.జగన్ సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఇస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత జిపిఎస్ ను అమలు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. నిరసనతో రగిలిపోయిన ఉద్యోగులు తమ ఓటు యొక్క బలమేంటో రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజం చేసి చూపించారు కూడా. అయితే ఇపుడు మళ్లీ సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్లన్నీ నేరుగా టిడిపి-జనసేన ఓటు బ్యాంకుగా మలుచుకోవచ్చుననే పవన్ కళ్యాణ్ ఆలోచనకు టిడిపి అధినేత ఆమోదం తెలిపినట్టు వార్తలొస్తున్నాయి. ప్రధాన మీడియాలో వచ్చిన ఈ వార్త ఆదివారం ఒక్క రోజే అతి పెద్ద చర్చకు సామాజిక మాద్యలో తెరలేపింది. 

అంతేకాదు సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేస్తారనే విషయానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులు, పేపర్ కటింగ్ లు, మొబైల్ యాప్ న్యూస్ కార్డ్ లు ఉద్యోగుల సోషల్ మీడియా మాద్యమాల్లో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. అదే సందర్భంలో ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు కూడా వారి వారి జిల్లాల్లో అంతర్గతంగా సమావేశాలు కూడా పెట్టుకొని సిపిఎస్ రద్దు చేసే పార్టీలకే తమ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు కూడా నిఘా వర్గాలకు సమాచారం అందిందని చెబుతున్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ పీఆర్సీ ఇవ్వడాన్ని ఉద్యోగులు ప్రధాన నష్టంగా భావిస్తున్నారు. కనీసం గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల మద్దతు అయినా లభిస్తుందా అంటే వారి సర్వీసులు కూడా రెండేళ్లకు రెగ్యులర్ చేయాల్సింది తొమ్మిది నెలలు అదనంగా పనిచేయించుకున్న తరువాత రెగ్యులర్ చేశారు. దీనితో వారికి రెండు డిఏలు, తొమ్మిది నెలల పుల్ పేస్కేలు కోల్పోయారు. పైగా ఉద్యోగాలు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్ల విషయంలో కూడా ప్రభుత్వం నేటికీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అంతేకాకుండా వీరికి పీఆర్సీ అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం అరియర్స్ మాట ఎత్తకుండా స్థబ్దుగా ఉండిపోయింది. 

ఈ విషయాన్ని కూడా ఉద్యోగ సంఘాల సమావేశాల్లో తీవ్రంగా చర్చించి జనసేన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ప్రభుత్వ శాఖను కూడా అభివద్ధి చేయడంతోపాటు, మరికొన్నిశాఖల ఉద్యోగాలను ఈ శాఖకు అనుసంధానం చేసి ఉద్యోగాల సంఖ్య పెంచాలని కూడా వారి సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. మొన్నటి వరకూ టిడిపి అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉంటుందా..? ఊడుతుందా..? అని ప్రచారం చేశారంటూ అపవాదు మూటగట్టుకున్న టిడిపీయే ఇపుడు ప్రస్తుతం ఉన్న 19విభాగాలను, 23 విభాగాల సిబ్బందికి పెంచాలని నిర్ణయించే దిశగా చర్యలు తీసుకుంటారనే ప్రచారం ఆదివారం పెద్ద ఎత్తున ఉద్యోగులకు చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో ఒక విధి విధానం లేకుండా ఇస్తున్న అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద ప్రత్యేకంగా చర్చించగా, ప్రభుత్వ పరిపాలనా విధానాలపై మంచి పట్టు సాధించారని  చాలా ముఖ్యమైన సూచనలు, సలహాలు ఇచ్చారని చంద్రబాబు పవన్ ను మెచ్చుకున్నారట. గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వారి సమస్యలు మాకు చెప్పినా చెప్పకపోయినా మా ప్రభుత్వం ఏర్పాటైతే ఖచ్చితంగా వాటిని నెరవేస్తామని ప్రకటించారు. 


ఆ క్రమంలో ఇపుడు చంద్రబాబుతో మేనిఫెస్టో విషయమై చర్చించినపుడు ముఖ్యంగా ఉద్యోగుల సిపిఎస్ రద్దు, ప్రతీ ఏటా జాబ్ కేలండర్ లో ఉపాధ్యాయ డిఎస్సీ, ఏపిపిఎస్సీకి విశేష అధికారాలు ఇస్తూ నోటిఫికేషన్లు, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగులకు పదోన్నతులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల విధానం రద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సీ తదితర అంశాలు చర్చించారనే విషయాన్ని తెలుసుకున్న ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ ఆలోచనకు, చర్చకు తెరలేపారని తెలిసింది. వీరిద్దరి కలయికలో వచ్చిన చర్చ ఇంత పెద్దగా రాష్ట్రవ్యాప్తంగా దావానంలా వ్యాపించడం విశేషం. అయితే వీరి ఉమ్మడి మేనిఫస్టో వచ్చేంత వరకూ ప్రస్తుతానికి ఈ ట్రోలింగ్స్ ఆగేటట్టుగా  కనిపించడం లేదు. పైగా నవంబరు నెల కావడం పిక్నిక్ లు జరిగే సమయం కావడంతో ఉద్యోగులంతా ఒకే చోటకు చేరి ఈ విషయంలో పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి ఏం జరుగుతుందనేది..!

Visakhapatnam

2023-11-05 17:58:33

గ్రామ, వార్డు సచివాలయశాఖలో పదోన్నతుల రగడ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఇపుడు పదోన్నతుల రగడ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.30లక్షల మంది ఉద్యోగులు 19శాఖల్లో పనిచేస్తున్నారు. 2 రెగ్యులర్ నోటిఫికేషన్ల ద్వారా నేరుగా ఉద్యోగాలు భర్తీచేసిన ప్రభుత్వం, ఆ తరువాత కారుణ్య నియామకాల ద్వారానే మిగిలిన ఉద్యోగాలు భర్తీచేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో మూడేళ్లు దాటిన సచివాలయ ఉద్యోగుల్లో కొన్ని శాఖలకు పదోన్నతులు కల్పిస్తోంది. ప్రభుత్వం ఇటీవల, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హజ్బండరీ శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి వారికి పేస్కేలు కూడా పెంచింది. ఏ ప్రభుత్వశాఖలోని ఉద్యోగులకు రాని విధంగా ఈ శాఖలోని ఉద్యోగులకు కేవలం ఐదేళ్ల లోపులోనే పదోన్నతులు రావడం ఒకరకంగా చెప్పుకోదగ్గ శుభపరిణామం. అయితే ప్రస్తుతం ఉన్న 19శాఖల్లోని ఉద్యోగుల్లో ఇంకా కొన్ని శాఖల ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. అదే సమయంలో కొన్ని శాఖల ఉద్యోగులకు మాత్రం పదోన్నతులు కల్పించడం ఇపుడు ఇతరశాఖల ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణం అవుతోంది. ఒకేసారి విధుల్లోకి చేరిన ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలి. అలాకాకుండా కొన్నిశాఖల్లో ఉద్యోగులకు మాత్రమే పదోన్నతులు కల్పించడంపై ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆరోగ్యశాఖలోని ఏఎన్ఎంలకు కూడా ఇన్ సర్వీస్ ఇచ్చి జిఎన్ఎం(స్టాఫ్ నర్స్) శిక్షణలు ప్రభుత్వం పూర్తిచేస్తోంది. 

ఇప్పటికే ఉద్యోగాల్లోకి చేరిన తరువాత రెండేళ్లకి సర్వీసు రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వం అదనంగా 9నెలలు పనిచేయించుకున్న తరువాత ప్రత్యేకంగా టెస్టులు పెట్టి అవి పాసైన వారికి మాత్రమే సర్వీసు రెగ్యులర్ చేసింది. అక్కడ 9నెలలో పేస్కేలు, 2 డిఏలు కోల్పోయిన ఉద్యోగులు సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత రావాల్సిన 2 ఇంక్రి మెంట్లు కూడా కోల్పోయారు. పీఆర్సీ అమలు చేస్తున్నామంటూ చెప్పిన ప్రభుత్వం వీరికి పేస్కేలు రివైజ్ చేసి అమలు చేసినా..రావాల్సిన అరియర్స్ విషయంలో ఏలాంటి ప్రకటన చేయలేదు. దానితో అవి వస్తాయో రావో కూడా తెలియనని పరిస్థితి. అదీ కూడా సచివాలయ ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేసే సమయంలోనే హెచ్ఆర్ఏ, డిఏలను కుదించిన తరువాతన పిఆర్సీ అమలు చేసింది. ఇలా ఒక్కో సచివాలయ ఉద్యోగి సుమారు రూ.2 లక్షల వరకూ ప్రయోజనాలు కోల్పోవాల్సి వచ్చింది. అయినా కూడా సచివాలయ ఉద్యోగులందరికీ ఒకే విధానం అమలు చేయకుండా కొన్నిశాఖల ఉద్యోగులకే పదోన్నతులు కల్పించి మిగిలిన శాఖల ఉద్యోగుల విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడం పట్ల ఉద్యోగులల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే పలు ప్రయోజనాలు కోల్పోయిన ఉద్యోగులు ఇపుడు పదోన్నతులు కూడా  దూరం అవుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెరతీస్తున్నారు. పదోన్నతులు వచ్చిన వారి ఆర్డర్లు చూస్తూ, వారికి పెరిగిన జీత భత్యాలు చూసి ఒకింత ఆనంద పడుతూ, తాము ఇంకా దానికి నోచుకోలేదంటూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సర్వీసు రెగ్యులర్ అయ్యే సమయంలో మెటర్నటీ లీవ్ లు పెట్టిన వారికి ఆ సెలవుల సమయం పూర్తయిన తరువాత మాత్రమే ప్రభుత్వం నిబంధనల ప్రకారం రెగ్యులర్ చేసింది. కానీ నిబంధనల ప్రకారం ఉద్యోగుల సర్వీసు మాత్రం రెండేళ్లకే రెగ్యులర్ చేయలేదు. ప్రభుత్వానికి ఆర్ధిక పరమైన అంశాల విషయంలో నింబంధనలు పాటిస్తున్న ప్రభుత్వం ఉద్యగులకు ప్రయోజనాలు చేకూర్చే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన, నిబంధనలు పాటించకపోవడం విశేషం.

కొత్త పోస్టుల భర్తీలేకుండా చేసేందుకే పదోన్నతులు తెరపైకి..
ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు కాకముందు వ్యవసాయశాఖలో ఏఈఓ, ఉద్యానవనశాఖ శాఖలో హెచ్ఈఓ, పశు సంవర్ధక శాఖలో సహాయకులు, ఫిషరీష్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్యశాఖ లో స్టాఫ్ నర్సులు, విద్యుత్ శాఖలో లైన్ మేన్ లు, మండల సర్వేయర్లు, తదితర పోస్టులు ఉండేవి. సచివాలయశాఖ ఏర్పాటు చేసిన తరువాత రెండు మూడు శాఖలకు కలిపి ఒక పోస్టును ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఇపుడు సదరు పోస్టులు నేరుగా భర్తీచేయాలంటే వారికి పేస్కేలు అదనంగా వుంటుంది. సచివాలయ శాఖలోని ఉద్యోగులకే పదోన్నతులు కల్పిస్తే సదరు పోస్టులను మళ్లీ భర్తీచేసే అవకాశం వుండదు. దీనితో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సచివాలయశాఖలో ఉన్న పలు శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తోంది. దీనితో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు కొత్త పోస్టులు తీసే అవకాశం లేకుండా ఉద్యోగులకు మేలు చేస్తున్నట్టుగా పదోన్నతులు కల్పిస్తున్నది ప్రభుత్వం. అయితే ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ఒక్క సచివాలయశాఖలోనే ఐదేళ్ల లోపునే ఉద్యోగులకు పదోన్నతులు రావడం అనేది ఒక చరిత్రగానే చెప్పాలి. అదే సమయంలో చాలా ఉద్యోగాల భర్తీకి ఈ విధానం అడ్డుగా మారుతోంది. అలాగని అన్నిశాఖల ఉద్యోగులకు సమానంగా పదోన్నతులు కల్పిస్తుందా అదీ లేకుండాపోయింది. ప్రస్తుతం సచివాలయశాఖలోని ఇంజనీరంగ్ అసిస్టెంట్లు హౌసింగ్, ఆర్అండ్ బి, పంచాయతీరాజ్ తదితర ఇంజనీరింగ్ శాఖల పనులు చేస్తున్నారు. వెల్పేర్ అసిస్టెంట్లు, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ శాఖలు చూస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్లు కార్యాలయ పనులతోపాటు, ఆధార్, ఇతర సర్వీసులు పనులు చేస్తున్నారు. మహిళా పోలీసులు హోంశాఖ, ఐసిడిఎస్, ఎస్ఈబి, రెవెన్యూశాఖ(బిఎల్వో) విధులు చేస్తున్నారు.  ప్రభుత్వంలోని పలు శాఖల విధులు చాలా వరకూ సచివాలయ ఉద్యోగులతోనే జరిగిపోతున్నాయి. అలాంటి సమయంలో అన్నిశాఖల ఉద్యోగులకు సమానంగా పదోన్నతులు కల్పించాల్సిన ప్రభుత్వం కొన్నిశాఖల వారికే 
పదోన్నతులు కల్పిండం పట్ల ఉద్యోగులు లోలోన మదన పడిపోతూ, తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు.

పదోన్నతులు వ్యవహారం ఎన్నికలపై ప్రభావం..
గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని కొన్నిశాఖల ఉద్యోగులకే పదోన్నతులు కల్పించి మిగిలినశాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించని వైనం 2024 ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం గట్గిగా వుంటుందంటున్నారు. అదే సమయంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, షిషరీష్, పశుసంవర్ధకశాఖల్లోని రెగ్యులర్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకుండా కేవలం సచివాలయ ఉద్యోగులను తమతో సమానంగా పదోన్నతులు ఇవ్వడాన్ని మిగిలిన శాఖల ఉద్యోగులు తప్పు పడుతున్నారు. ప్రస్తుతం ఖాళీలు ఉన్నచోట కొత్త ఉద్యోగాలు భర్తీచేయకుండా ప్రభుత్వం ఏఈఓ, హెచ్ఈఓ, షిషరీష్ పీల్డు అసిస్టెంట్లను గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం చేసేస్తూ ఖాళీలు ఉన్న ప్రదేశాలకు ఉద్యోగులను బదిలీలు చేస్తున్నది. గతంలో రెవిన్యూ శాఖలో విఆర్ఏలుగా ఉన్నవారికి వీఆర్వోగా పదోన్నతి ఇచ్చి సచివాలయాలకు పంపేసింది. దానితో ఇప్పటి వరకూ కార్యాలయాలకే పరిమితం అయిన ఉద్యోగులు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు బదిలీ కావాల్సి వస్తున్నది. అలాగని వారికి రావాల్సిన పదోన్నతులు మాత్రం రావడం లేదు. మరోవైపు గ్రామసచివాలయ మహిళా పోలీసుల పరిస్థితి గాల్లో దీపంలా ఉంది. హైకోర్టుకి సమర్పించిన అఫడవిట్ తో వీరు పోలీసుశాఖ సిబ్బందిగానే ఉన్నా, వీరి విధులు మాత్రం బిఎల్వో, ఐసిడిఎస్, ఇతర సచివాలయ ఉద్యోగుల పనులే ఉన్నాయి. పలు కోర్టు కేసులు కూడా ఉన్నందున మహిళా పోలీసులకు సీనియర్ మహిళా పోలీసుల పదోన్నతులు వచ్చే అవకాశాలు కనింపించడం లేదు. మరికొన్ని శాఖల ఉద్యోగులకు ప్రమోషన్ ఛానలే ఏర్పాటు కానుందున వారికి పదోన్నతులు వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగుల తోపాటు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు కూడా ప్రభుత్వం చేసే చర్యలకు తగ్గట్టుగా పనిచేయాల్సి వస్తున్నది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలో రాజుకున్న పదోన్నతుల రడగ ఏ స్థాయికి చేరుతుంది..ప్రభుత్వం మిగిలిన శాఖల సిబ్బందికి ఎలాంటి న్యాయం చేస్తుందనేది వేచి చూడాలి..!

Tadepalli

2023-10-31 03:03:20