జర్నలిస్టుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ప్రెస్ అకాడెమీ నిర్వహించే శిక్షణా తరగతులను ఉపయోగించుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడెమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కోరారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం, దాడితోట గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. చిత్రావతి రిజర్వాయర్, గండికోట రిజర్వాయర్ లను పరిశీలించేందుకు కడప జిల్లాలో పర్యటించిన దేవిరెడ్డి.. కడప-అనంతపురం సరిహద్దులో ఉన్న దాడితోట గ్రామంలోని తన అత్తవారింటికి విచ్చేసారు. మాజీ మంత్రి జి. నాగిరెడ్డి ఇంట పాత్రికేయులతో మాట్లాడారు..గ్రామాల నుంచి జర్నలిజం వృత్తిని ఎంచుకోవాలనుకునే యువకులకు ప్రెస్ అకాడెమీ నుంచి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. త్వరలో అనంతపురం జిల్లా జర్నలిస్టులకు ఆన్లైన్ లో శిక్షణా తరగతులను నిర్వహిస్తామన్నారు. కోవిడ్ బారిన పడ్డ జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అందువల్లే కోవిడ్ కారణంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ప్రభుత్వం అందించాలని నిర్ణయం తీసుకుందన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలంతోనే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా విజయవాడ నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి శంకర్ నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తదనంతరం ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి మంత్రి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వెన్నెపూస గోపాల్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు తెలుగు భాష మాట్లాడే వారందరూ కూడా వివిధ ప్రాంతాలలో నివాసం ఉండేవారని, తెలుగు మాట్లాడేవారు ఒక రాష్ట్రంలో ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం అవసరాన్ని గుర్తించి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు. తెలుగు మాట్లాడే వారు ఒకటిగా ఉండాలని ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు. నవంబర్ 1 వ తేదీ 1956 లో రాష్ట్రం అవతరించాక ఆంధ్ర రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడం జరిగిందన్నారు. మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, రాష్ట్ర పురోభివృద్ధి జరగకపోయినా, కొంతమంది స్వార్థ ఆలోచనల వల్ల తెలుగు భాష మాట్లాడేవారు విడిపోవాల్సి వచ్చినా నవంబర్ 1 వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అమరజీవిని స్మరించుకోవడం కోసం, ఆయన స్ఫూర్తిని మననం చేసుకోవడం కోసం, ఆయన సేవలను ఆదర్శంగా తీసుకోవడం కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఒకటిన్నర సంవత్సర కాలంగా అపూర్వ ప్రజాదరణతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజారంజకంగా పాలిస్తున్నారన్నారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను చేసుకుంటూ రాష్ట్రంలో ఏ వర్గం కూడా బాధపడకుండా, కష్టపడకుండా వారి సంతోషం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం అమలు చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని మనోధైర్యంతో తట్టుకుంటూ ప్రజల సంక్షేమమే ముఖ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు నడుస్తోందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాధించిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టి అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయరంగంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయం, ఆకాంక్ష అన్నారు. ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని గుర్తుతెచ్చుకోవాలన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా, సుభిక్షంగా, సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు భాష రెండో స్థానంలో ఉందన్నారు. దాదాపు పది కోట్ల మందికి పైగా రాష్ట్రం, దేశం, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషను మాట్లాడే వారు ఉన్నారన్నారు. ఒక రాష్ట్రమంటూ లేని కాలంలో రాష్ట్రం కోసం పరితపించి ఖచ్చితంగా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆంధ్రులంతా ఉద్యమించడం జరిగిందని, ఆ ఉద్యమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణంతో పోరాటం జరిపి మనకు రాష్ట్రాన్ని సాధించి పెట్టారన్నారు. అటువంటి మహనీయులను ఈరోజు స్మరించుకుందామన్నారు. ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రతి గ్రామంలోనూ రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున క్లినిక్స్ ఏర్పాటు, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల వద్దకు రాష్ట్రప్రభుత్వం సుపరిపాలన తీసుకువస్తోందని, భవిష్యత్తులో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అన్ని రంగాలలో అభివృద్ధిలో, సంక్షేమంలో ముందు ఉండాలన్నారు. తెలుగు ప్రజలు ఆర్థిక, సామాజిక అభివృద్ధిని రెండూ సమ్మిళితం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, సభికులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాఠశాలల విద్యా నియంత్రణ కమిటీ సిఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ పామిడి వీరాంజనేయులు, అనంతపురం మార్కెట్ యార్డు చైర్మన్ ఫయాజ్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమ0) గంగాధర్ గౌడ్, డి ఆర్ ఓ గాయత్రి దేవి, సిపిఓ ప్రేమచంద్ర, డిఎస్ ఓ రఘురామిరెడ్డి, ఆర్డీఓ గుణభూషన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు సంబంధించి ఎలాంటి బదిలీలు జరగడం లేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సచివాలయాల కార్యదర్శిలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కలెక్టర్ తెలియజేశారు. కార్యదర్శుల బదిలీలు జరుగుతున్నాయన్నది పూర్తిగా తప్పుడు సమాచారమన్న కలెక్టర్ దీన్ని ఎవరు నమ్మవద్దని అన్నారు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు రెండేళ్ల ప్రొహిబిషన్ పిరియడ్ పూర్తయ్యేవరకూ ఎలాంటి బదిలీలు జరగవన్నారు. అదే సమయంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రాష్ట్రప్రభుత్వం నుంచి రావాల్సివుంటుందన్నారు. ఇవేమీ లేకుండా కొందరు కావాలనే సోషల్ మీడియాలో సచివాలయ ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని ఈ విషయంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ ఒక్క సమాచారంతో చాలా మంది దళారులు సొమ్ముచేసుకునే అవకాశం వుందన్నారు. అలా ఎవరైనా దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని కలెక్టర్ హెచ్చరించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు యూజీ పరీక్షల డీన్ ఆచార్య డి.వి.ఆర్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏయూలో మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 24328 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 16651 మంది ఉత్తీర్ణతతో 68.44 శాతం ఉత్తీర్ణత నమోదయిందన్నారు. బి.ఏ (సిబిసిఎస్) లో 85.86, బిబిఏ(సిబిసిఎస్)లో 94.75,బిసిఏ(సిబిసిఎస్)లో 85.71, బిహెచ్ఎంసిటి(సిబిసిఎస్)లో 95.12, బిఎస్సీ(సిబిసిఎస్)లో 62.28, బికాం సిఏఎస్లో70.58, బికాం జనరల్లో 80.41 శాతం ఉత్తీర్ణతను సాధించారు. పరీక్షల ఫలితాలను ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్ధులు వారి హాల్ టిక్కెట్లు ఆధారంగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చునన్నారు. త్వరలోనే ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రొవిజినల్, ఓడి, మైగ్రేషన్ సర్టిఫికేట్లు రెడీ చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఆ తేదీలను కూడా ఏయూ వెబ్ సైట్లోనూ, మీడియా ద్వారా ప్రకటిస్తామని ఆయన వివరించారు.
ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఘనంగా ఆదివారం నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి పాల్గొని, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని నేటితరం గుర్తుచేసుకోవాలన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని, తెలుగు వారి కోసం రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలను సైతం త్రుణప్రాయంగా వదిలిన పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయనను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అవినీతిని అంతమొందిస్తూ.. దాపరికంలేని సమజాన్ని నిర్మించడానికి సమాచార హక్కు దరఖాస్తు దారుల సంఖ్య పెరుగుదలకు యునేటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ క్యాంపెయిన్ కార్యకర్తలు కృషి చేస్తుందని యూ.ఎఫ్.ఆర్.టి.ఐ రాష్ట్ర కో కన్వీనర్ బుద్ధ చక్రధర్ స్పష్టం చేశారు. ఆదివారం సి.పి.ఎం కార్యాలయంలో యూ.ఎఫ్.ఆర్.టి.ఐ అద్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు వజ్రాయుధం గా ఉండాల్సిన ఆర్.టి.ఐ ను అధికారులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. దీనిపై సమాచార హక్కు చట్టం కార్యకర్తలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. అలాగే స.హ కార్యకర్తలు సేకరించిన సమాచారాన్ని ఉద్యమ కారులతో కలిసి సమస్య పరిస్కారం దిశగా ప్రయత్నం చేయాలన్నారు. అడిగిన సమాచారం ప్రజా ప్రయోజనార్థం అయి ఉంటే దానికోసం అప్పీలు,ఆ పై కమిషన్ కు వెళ్ళేవరకు ఆ దరఖాస్తు ను ముందుకు తీసుకు వెళ్లాలని సూచించారు. దీనితో పాటు కాపులు తూర్పు, కొండ అని బి.సి డి గా కుల ధ్రువీకరణ పత్రాలు పుట్టించి సర్టిఫికెట్ లు తీసుకొంటున్నారని దానిపై స.హా కార్యకర్తలు దృష్టి సారించాలని కోరారు. అనంతరం మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన యూ.ఎఫ్.ఆర్.టి.ఐ విశాఖ జిల్లా ప్రధాన సలహాదారు దండు గణపతి రాజు మాట్లాడుతూ యూ ఎఫ్.ఆర్.టి.ఐ రాష్ట్ర కమిటీ తరపున సమాచార హక్కు చట్టం బలోపేతానికి నా వంతు కృషి చేస్తానన్నారు. సమాచార హక్కు కమీషన్ ను ఏర్పాటుచేయడంలో ఎన్. సి.పి.ఆర్.ఐ కీలక పాత్ర పోషించిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్.టి.ఐ ని నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుందన్నారు. ఆర్.టి.ఐ ని బతికించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.ఈ చట్టం ప్రజల కోసం పనిచేసే చట్టం అని గుర్తు చేశారు.అనంతరం జిల్లా కమిటీ సభ్యులకు అధికారుల నుండి సమాచారం సేకరించడంలో తీసుకోవలసిన పలు జాగ్రత్తలు, సలహాలు ,సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూ.ఎఫ్.ఆర్.టి.ఐ జిల్లా కన్వీనర్ రాజాన బుజ్జిబాబు,కో కన్వీనర్ లు బి.వి.వి సత్య నారాయణ,కాండ్రేగుల రాము స.హా చట్టం కార్యకర్తలు నరసింహ,రమేష్,కొల్లి చిన అప్పారావు,పిట్ట అప్పారావు,సోమిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.
మంచికి మారుపేరుగా నిలిచి ది అడవివరం కోఆపరేటివ్ సొసైటీ ప్రహ్లాదపురం బ్రాంచ్ మేనేజర్ గా ఉద్యోగ విరమణ పొందిన నక్కాన శంకర్రావు శేష జీవితం ఆనందంగా గడపాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. ఆదివారం అడవివరంలో సొసైటీ చైర్మన్ కర్రి అప్పల స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శంకర్రావు ఉద్యోగవిరమణ కార్యక్రమంలో గంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొసైటీలో అంచలంచెలుగా ఎదిగి బ్యాంక్ మేనేజరుగా రిటైర్అయ్యారన్నారు. సొసైటీ ద్వారా ఎన్నోసేవలు అందించిన ఘనగ శంకర్రావుకి దక్కుతుందని అన్నారు. ఈయనలేని లోటు సొసైటీలో పూరించలేదని అన్నారు. అనంతరం శంకర్రావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అజయ్,టిడిపి వార్డు అధ్యక్షడు బి.నరసింహం, వైఎస్సార్సీపీ 98వార్డు నాయకులు కె.ఈశ్వరరావు, సొసైటీ డైరెక్టర్లు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జెఎన్టియుకె ప్రాంగణంలో ఆదివారం డిజిటల్ మోనిటరింగ్ సెల్ (డిఎంసి) లో ఘనంగా నిర్వహఇంచారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎం.రామలింగరాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని, తెలుగు వారి కోసం రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలను సైతం అర్పించిన పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రిజిస్ట్రార్ ఆచార్య సిహెచ్.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓఎస్డి ఆచార్య వి.రవీంద్రనాధ్, డిఏపి ప్రొ.ఆర్.శ్రీనివాసరావు, డిఏఏ ప్రొ.వి.రవీంద్ర, డైరెక్టర్ అడ్మిషన్స్ ప్రొ.కెవి.రమణ, ఎఫ్డిసి డైరెక్టర్ ప్రొ.వి.శ్రీనివాసులు, ఐఐఐపిటి డైరెక్టర్ ప్రొ.ఎన్.మోహన్రావు, ఐక్యూఏసి సెల్ డైరెక్టర్ ప్రొ.ఎన్.బాలాజీ, డా.బి.ఆర్.అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ లైబ్రేరియన్ డా.బి.ఆర్.దొరస్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన త్యాగధనుల ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక బాపూజీ కళామందిర్ లో అవతరణ దినోత్సవ వేడుకలు రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితాలను మనందరం అనుభవిస్తున్నామని చెప్పారు. పొట్టి శ్రీరాములు ఫ్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం పోరాటం చేసి అసువులు బాసారని, ఆ మహానీయుని త్యాగానికి ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. వారి త్యాగం అందరికీ ఆదర్శమని, ప్రతీ ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పాలన అందించాలని , ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ జనరంజక పాలనను అందిస్తున్న సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. వై.యస్.రాజశేఖర రెడ్డి నాడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు. నేడు ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి వై.యస్.ఆర్. ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తున్నారని కితాబు ఇచ్చారు. వై.యస్.ఆర్ జలయజ్ఞం చేపట్టి వ్యవసాయ రంగానికి గొప్ప ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. మన ముఖ్యమంత్రి మంచి ఆశయం గల వ్యక్తి అని, అందులో భాగంగానే అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అందిస్తున్న పథకాలు ఇతరులను ఆలోచింపజేసే దిశగా పాలన అందిస్తున్నారని చెప్పారు. అందులో ఒకటైన దిశ చట్టం చారిత్రాత్మకమని ఉద్భోదించారు. స్థానికులకు పరిశ్రమలలో 75 శాతం రిజర్వేషన్లు, చట్టసభలలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు, నవరత్నాలు వంటి అనేక వినూత్న పథకాలు ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలని ఉపముఖ్యమంత్రి కితాబు ఇచ్చారు.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరం అని అన్నారు. ఆయన గొప్ప త్యాగ పురుషుడని, ఆ త్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైందని, తద్వారా ప్రాంతీయ ఉద్యమాలు నెలకొన్నాయని స్పష్టం చేసారు. అందువలనే ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోవలసి వచ్చిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విశాఖపట్నం పాలనా రాజధానిగా, శాసన రాజధానిగా అమరావతి, కర్నూలు న్యాయ రాజధానిగా కొనసాగడం తధ్యమని చెప్పారు. మరో ఉద్యమం రాకూడదనే ఉద్దేశ్యంతో మూడు రాజధానులు కోసం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు సభాపతి వివరించారు. అభివృద్ధి మూల మూలలకు అందాలని, అందుకే వార్డు, గ్రామ సచివాలయాలు వెలిసాయని చెప్పారు. కరోనా సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. అందరికీ పాలన అందుబాటులో ఉండాలని, తద్వారా ప్రతి ఒక్కరిలో సంతృప్తి వస్తుందని పేర్కొన్నారు. పాలన అందుబాటులో ఉంటే వేర్పాటువాదన రాదని తేల్చిచెప్పారు. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం మంచి విషయం అని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరమని ముఖ్యమంత్రి విశ్వసించి, మూడు రాజధానులు ఏర్పాటుకు ఆలోచించారని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త అని, అందులో భాగంగానే నాడు నేడు కార్యక్రమం క్రింద 45 వేల పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వైద్యాలయాల్లో చికిత్సను ప్రజలు గొప్పగా భావిస్తున్నారని, అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సూచిస్తున్నట్లు రాజ్యాంగ బద్ధ కమిటీ తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సాహసోపేత నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకుంటున్నారని కితాబు ఇచ్చారు.
తొలుత రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదని, త్వరలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. జిల్లాకు గొప్ప ఘన చరిత్ర ఉందని, దానిని ఇంకా అధ్యయనం చేసి గ్రంథ రూపంలో తీసుకు రావాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లాతో మహాత్మా గాంధీ కి అత్యంత సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసారు.
తిరుమల శ్రీవారికి ఆదివారం ఐదు బ్యాటరీ ఆటోలు విరాళంగా అందాయి. ఆదివారం వేలూరుకు చెందిన ప్రముఖ బ్యాటరీ ఆటోల తయారీ సంస్థ వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్, ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ లు కలిసి ఈ మేరకు దాదాపు రూ.15 లక్షల విలువైన ఐదు బ్యాటరీ ఆటోలను టిటిడి అధికారులకు అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాతలు వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్ ఎం.డి. జి.ఏ. హరికృష్ణ, ఆకెళ్ళ రాఘవేంద్ర ఈ మేరకు ఆటో తాళాలను శ్రీవారి ఆలయ ఇంచార్జ్ డెప్యూటీ ఈవో వెంకటయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల రవాణా విభాగం డి.ఐ. మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో మూడు ఆటోలను కోవిడ్ -19 శానిటేషన్ కోసము, రెండు ఆటోలు తిరుమలలో వ్యర్ధాలను తరలించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. తిరుతమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఎలాంటి కరోనా వైరస్ దరచేరకుండా ఈ ఆటోల ద్వారా పిచికారి చేయనున్నారు.
నేషనల్ హైవే రోడ్ సేఫ్టీ దృష్ట్యా బైపాస్ మార్గాలలో ప్రయాణించే ద్విచక్ర వాహన దారులు తప్పని సరిగా ఇకపై హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా, పోలీస్ సిబ్బందికి అన్నమయ్య సర్కిల్ వద్ద హెల్మెట్లను ప్రదానం చేసారు. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల సరిహద్దులతో సంబందం లేకుండా ప్రమాదాలు, ఇతరాత్ర నేరాలు జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు. హైవే రోడ్డులో ప్రమాదాలు జరుగు ప్రాంతాలను గుర్తించి అక్కడ డిజిటల్ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాణం విలువైనది, ప్రజలు యొక్క ప్రాణం కాపాడటం మన యొక్క విధిగా భావించి ప్రజలతో మనం, మనతో ప్రజలు అనే స్నేహభావం పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా పోలీస్ అధికారుల సమావేశంలో అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమాలలో అడ్మిన్ అడిషనల్ యస్.పి తి సుప్రజ , డి.యస్.పి లు యస్.బి గంగయ్య, వెస్ట్ నరసప్ప, ఈస్ట్ మురళీకృష్ణ, ట్రాఫిక్ మల్లికార్జున, దిశా పి.యస్ రామరాజు, ఏ.ఆర్ నంద కిశోర్, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖజిల్లా గాజువాకలో హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి.. పోలీసులు తెలిపిన వివరాలు.. వరలక్ష్మి హత్య పథకం ప్రకారమే జరిగిందని.. యువతి హత్యకు ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండటమే కారణమని స్పష్టమైంది..వరలక్ష్మిపైన అనుమానం రావడంతోనే అఖిల్ ఆమెను సాయిబాబా గుడి వద్దకు పిలిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో రూఢీ అయింది.. వివరాలు తెలుసుకుంటే సుందరయ్య కాలనీలో ఉంటున్న వరలక్ష్మితో, చిట్టిబాబు కాలనీకి చెందిన అఖిల్ ప్రేమ పేరిట వెంట పడ్డాడు. అదే సమయంలో రాము అనే యువకుడు వరలక్ష్మితో సన్నిహితంగా ఉండటంతో భరించలేక పథకం ప్రకారం వరలక్ష్మి ఎవరికీ దక్కకూడదనే ఉద్దేశ్యంతోనే హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు ఊహించని ఈ పరిణామాలతో వరలక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అమానుషంగా తమ కుమార్తె ప్రాణం తీసిన అఖిల్ను కఠినంగా శిక్షించాలని వరలక్ష్మి తల్లి కోరుకుంటోంది. తాజా ఘటనపై స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఏ కుటుంబానికి ఎదురు కారాదని స్థానికులు బాధిత యువతి కుటుంబానికి అండగానిలుస్తున్నారు. వరలక్ష్మిని కిరాతకంగా హతమార్చిన సంఘటనతో విద్యార్ధినిలు అప్రమత్తంగా ఉండాలని అటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచియాలు మంచిది కాదని సూచిస్తున్నారు. ఏదైనా తేడా ఉన్నట్టు అనిపిస్తే తక్షణా దిశ యాప్ ద్వారా పోలీసులకు సందేశం పంపాలని కూడా కోరుతున్నారు. కాగా విశాఖజిల్లాలో ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్రంగా మండిపడ్డారు. దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు డీజీపీ, ఇతర ఉన్నాతాధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న హోంమంత్రి.. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని ఈ రోజు ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆయనకిచ్చే ఘనమైన నివాలళి అన్నారు. అంతకు ముందు చిల్డ్రెన్స్ పార్క్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర బుగ్గన రాజేంద్రనాథ్ పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, కంగాటి శ్రీదేవి, డా. జె. సుధాకర్, నగర పాలక సంస్థ కమీషనర్ డి.కె. బాలాజీ, జేసీలు రామ సుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజామోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సునయన ఆడిటోరియంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయతను తెలిపే కార్యక్రమాలు అందరినీ ఆకట్టు కున్నాయి...
ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ లాంజ్ లో పెండింగ్ పనులను సత్వరమే పూర్తిచేయాలని పై ఎయిర్పోర్ట్ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. ఆదివారం ఎయిర్ పోర్టులోని ప్యాసింజర్ లాంజ్ జరుగుతున్న పనులను ఆయన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియాన్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎయిరపోర్టులు పూర్తయిన ప్రాంతాల నుంచి ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఎయిర్ పోర్టులను అభివ్రుద్ధి చేయడంతోపాటు, కొత్త ఎయిర్ పోర్టులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ క్రమంలోనే మూడు రాజధాన్లుల్లో జ్యూడిషియల్ కేపిట్ కాబోతున్న ఈ జిల్లాలో ఎయిర్ పోర్టును సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎయిర్ పోర్టు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్ డి ఓ వెంకటేష్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, పంచాయతీ రాజ్ శాఖ ఎస్ ఈ సుబ్రమణ్యం, వివిధ శాఖల ఇంజనీరింగ్ ఎస్ ఈ లు, జిల్లా అధికారులు, ఎయిర్ పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి నడిబొడ్డులో ఉన్న సుబ్బలక్మి కూడలిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని నగరపాలకసంస్థ కమిషనర్ గిరీషా అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరపాలకసంస్థ అధికారులు, ఆయా ప్రోజెక్టుల ప్రతినిధులతో కలసి గరుడ వారధి, రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్, బాలాజీ కాలనిలో గల శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరుగుతున్న గరుడవారధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సుబ్బలక్ష్మి కూడలికి నాలుగు పక్కల నుండి వాహనాలు వస్తాయని, వాహనాలు సులభంగా తిరిగేందుకు వీలుగా ప్లాన్ ప్రకారం విశాలంగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నాలుగు పక్కల పచ్చటి గడ్డితో లాన్ తీర్చిదిద్దాలని సూచించారు. బస్టాండ్ లోపలకు వెళ్లే డౌన్ ర్యాంపు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం రామాపురం వద్ద ఉన్న బయో మైనింగ్ ప్లాంట్ ను పరిశీలించారు. నగరపాలక సంస్థ నగరంలో సేకరించిన చెత్త వేరు చెసే పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. చెత్త వలన వచ్చే సేంద్రియ ఎరువును రైతులకు, ఉద్యాన వనాలకు ఇవ్వాలన్నారు. ఒక్కో రోజు ఎంత చెత్త వేరు చేస్తున్నారు, ఒక్కో వాహనంలో ఎంత చెత్త, ఎరువు తరలిస్తున్నారని, సి.సి. కెమెరా ల పనితీరు, లాగ్ బుక్ స్వయంగా పరిశీలించారు. రెండు వాహనాలకు చెత్త నింపి ఒక్కో వాహనాల్లో ఎంత చెత్త తరలిస్తున్నారని పరిశీలించారు. ప్లాంట్ లో ఎక్కువ సి.సి.కెమెరాలు ఏర్పాటు చెయాలని, చెత్త, ఎరువు తరలించే వాహనాల రాక పోకలు ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. వీలైనంత త్వరగా చెత్త నిర్వహణ పూర్తి చేయాలన్నారు. ప్లాంట్ చుట్టూ పచ్చని చెట్లు నాటాలన్నారు. అనంతరం బాలాజీ కాలనీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్లాన్ ప్రకారం కాకుండా తక్కువ స్థలంలో కోర్ట్ ఏర్పాటు చేస్తుండడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణం, ఉత్తరం వైపు కోర్ట్ వెడల్పు పెంచి విశాలంగా కోర్ట్ ఏర్పాటు చేయాలన్నారు. బేస్ బాల్, వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడలు ఒకే కోర్టులో ఆడుకునేలా ఏర్పాటు చేయాలన్నారు. కోర్టులో క్రీడాకారులు కింద పడ్డా గాయాలు కాకుండా సింథటిక్ ఫ్లోర్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ జి.ఎం (అడ్మిన్) చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, డిప్యూటీ సిటీ ప్లానెర్ దేవికుమారి, డి.ఈ.లు విజయకుమార్ రెడ్డి, దేవిక, కరుణాకర్, సర్వేయర్లు ప్రసాద్, దేవానంద్, ఏఈకామ్ రాజేందర్, అప్కాన్స్, జిగ్మా, సంస్థల ప్రతినిధులు ఉన్నారు.