పాఠశాలలు కళాశాలలో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టరు వి వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒక్కసారిగా పాఠశాలలో ప్రవేశిస్తున్నందున వారిని క్రమశిక్షణలో ఉంచాలని సామాజిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థిని పరీక్ష చేయాలన్నారు. మాస్కులు ధరించడం చేతులు శుభ్రపరచుకోవడం పై వారికి కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. పాఠశాల గదులను బస్సులను క్షుణ్ణంగా శానిటేషన్ చేయించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం విషయంలో కూడా కచ్చితమైన నిబంధనలు పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ విషయంలో రాజీ పడకూడదు అన్నారు. ప్రతిరోజూ వెయ్యి మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని, పీహెచ్సీ పరిధిలో కనీసం వంద పరీక్షలు జరగాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యంగా ఇంటర్ మీడియట్ విద్యార్థినీ విద్యార్థుల విషయంలో క్రమశిక్షణ లో కఠినంగా ఉండాలని, ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో వివిధ పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థుల హాజరు ని గూర్చిన నివేదికలు ప్రతిరోజూ సమర్పించాలన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోవిడ్ వ్యాపించే ప్రమాదం ఉందని గ్రహించాలని ఇదే విషయాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు కళాశాలల్లో ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్ వెంకటేశ్వర్ జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వల రెడ్డి, ఉప రవాణా కమిషనర్ జి.సి. రాజరత్నం, డియంఅండ్ హెచ్ వో డాక్టర్ పి.ఎస్. సూర్యనారాయణ, ఆర్. ఐ.ఓ. బి సుజాత, సాంఘిక సంక్షేమ శాఖ డి డి డి.వి. రమణ మూర్తి గిరిజన సంక్షేమశాఖ డిడి విజయలక్ష్మి, డిప్యూటీ డిఇఓ నాగమణి, డైట్ ప్రిన్సిపాల్ జ్యోతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దీంతో పాటుగా వారి కష్టానికి తగిన ఫలితం దక్కేలా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కూడా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా జిల్లాలో తొలిసారిగా భారీ సంఖ్యలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున పంటను సేకరించే ప్రక్రియ ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతోంది. రైతుకు ఏ రూపంలోనైనా కష్టం కలగకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం. స్వేదం చిందించి పండించిన పంట దళారుల పాలుకాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జిల్లాలో ఏకంగా 286 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 110 ప్రధాన కొనుగోలు కేంద్రాలు కాగా, మిగిలినవి అనుబంధ కేంద్రాలు. మొక్కజొన్న ఎక్కువగా పండించే 28 మండలాల్లో ప్రస్తుతం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఈ పంట కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది సుమారుగా 45,726 ఎకరాల్లో మొక్కజొన్నసాగైనట్లుగా ఈ-కర్షక్లో నమోదయ్యింది. సిఎం యాప్లో దాదాపు 15,276 ఎకరాలు నమోదు అయ్యింది. దీంతో సుమారుగా 36వేల మొట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పిఏసిఎస్, ఎఎంసి, గ్రామైక్య సంఘాల ద్వారా ప్రస్తుతం మొక్కజొన్న కొనుగోలు జరుగుతోంది.
ఇంతకుముందు కూడా అడపాదడపా మొక్కజొన్న కొనుగోలు జరిపినప్పటికీ, అరకొరగా నాలుగైదు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏకంగా 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా, పంట పండించిన రైతు, తన గ్రామంలోనే పంటను విక్రయించుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలకు అనుగుణంగా, కేవలం పదిరోజుల్లోనే కొనుగోలును పూర్తి చేసేందుకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్కుమార్ చర్యలను చేపట్టారు. దీంతో మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్వి వేణుగోపాల్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ, కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేస్తున్నారు. రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా జిల్లా స్థాయిలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, అక్కడక్కడా పంట కొద్దిగా రంగు మారినప్పటికీ, రైతులు ఆందోళన చెందవద్దని, వాటిని కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. సేకరించిన మొక్కజొన్నకు వారం పదిరోజుల్లో, రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు చర్యలను తీసుకున్నారు. దీంతో రైతులు ధీమాగా తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.
వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. విజయనగరం పట్టణంలోని పలు వార్డు సచివాలయాలను జెసి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలీఘాట్ కాలనీ, ఉడా కాలనీల్లో ఉన్న సచివాలయాలను ఆయన సందర్శించి, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరుపట్టికను తనిఖీ చేశారు. ఆయా సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఇ-రిక్వెస్టులు, స్పందన వినతుల స్థితిగతులపై సిబ్బందిని ప్రశ్నించారు. ప్రజలు వినతులు అందించిన వెంటనే, వాటిని పరిశీలించి, పరిష్కారానికి ఆయా శాఖలకు పంపించాలని సూచించారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులకు వచ్చే వినతులపై తక్షణమే స్పందించి, అర్హులకు వెంటనే జారీ చేయాలని సూచించారు. సక్రమంగా, సకాలంలో సేవలను అందించి, ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా జెసి కోరారు.
స్వచ్ఛ సర్వేక్షన్ 2021 తిరుపతి నగరపాలక సంస్థను నిలిపేందుకు అధికారులు మరింత శ్రమించాలని ఏస్బీఐ డీజీఎం గిరిధర్ స్వామినాధన్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ లలిత కళా ప్రాంగణం లో కమిషనర్ గిరీష అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఎస్బిఐ డీజీఎం, ఏజీఎంలు స్వచ్చ సర్వేక్షన్ 2021 భాగంగా ప్లాస్టిక్ నిషేధం కొనసాగింపు భాగంలో, ప్రతి ఇంటికి గుడ్డ సంచులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 25 వేల సంచులు నగరపాలక సంస్థ తిరుపతి నగరపాలక సంస్థలోని శానిటరీ ఇన్స్పెక్టర్ లకు, హెల్త్ సెక్రటరీలకు 25000 గుడ్డ సంచులను అందజేశారు. అనంతరం డీజీఎం, కమిషనర్ గిరీష మాట్లాడుతూ, తిరుపతిలో ప్లాస్టిక్ నిషేధం లో భాగంగా ప్రతి ఇంటికి గతంలో గుడ్డ సంచులు అందజేయాలని ప్రణాళిక చేసామని, అందులో కొంతమందికి ఇవ్వడం జరిగిందని, మధ్యలో కోవిడ్ 19 కారణంగా లేకపోయినా మని నేడు ఎస్ బి ఐ సహకారంతో యూజర్ చార్జీలు సక్రమంగా చెల్లించిన ఇళ్లకు ఎస్ బి ఐ వారు స్వచ్ఛ సర్వేక్షన్ 2021 కి సంబంధించి ముద్రించిన సంచి బ్యాగులు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఎస్బిఐ డి జి యం మాట్లాడుతూ మన తిరుపతి స్వచ్ఛ సర్వేక్షన్ 2021 ముందు వరుసలో నిలుపుటకు ఎస్ బి ఐ ఉద్యోగాలు ముందుంటారని, ప్రతి ఒక్కరికి అవగాహన నిర్వహిస్తామని, శ్రీ శక్తి సంస్థ ద్వారా సంచులు కుట్టించి కొనుగోలు చేసి నగర పాలకు భాగస్వాములు చేయడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో కమిషనర్ వారితోపాటు ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలు డీజీఎం గిరిధర్, స్వామినాథన్, కృష్ణ బాలాజీ, ఏజీఎం లక్ష్మి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి,శానిటరి ఇన్స్పెక్టర్లు, హెల్త్ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.
వార్డు సచివాలయాలు ప్రజలకు సేవలందించడంలో ముందుండాలని, సచివాలయంలో పౌర సేవలు విస్తృతంగా చేయాలని కమీషనర్ గిరీష ఆకస్మిక తనిఖీ నిర్వహించి సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. సోమవారం ఎంఆర్ పల్లి లోని క్రిష్ణ నగర్ లో ఉన్న వార్డ్ లో గల1,2 సచివాలయాలను నగర పాలక . సచివాలయం నోటిస్ బోర్డులో ప్రదర్శించిన అమ్మ ఒడి, వై ఎస్సార్ ఆరోగ్య శ్రీ , పెన్షన్ కానుక, వైయస్సార్ బీమా, జగనన్న తోడు అర్హుల జాబితాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమ పథకాలు సకాలంలో అందించడానికి, కావలసిన ధృవ పత్రాలు సకాలంలో మంజూరు వంటివి, అన్ని సర్వీసు సకాలంలో అందించాలని అలాగే పన్నుల సేకరణ ఆలస్యం లేకుండా చూడాల్సిన బాధ్యత మీపై వుందన్నారు. ప్రజలకు సేవలు తెలిసే విధంగా నోటీస్ బోర్డులపై అన్ని పథకాలు ఉండాలని సూచించారు. సచివాలయం సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించాలని, మొన్నటి వరకు కాలేజ్ స్టూడెంట్ అని నేడు ప్రభుత్వ ఉద్యోగులు అని, డ్రెస్ కోడ్ లేకపోతే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని సున్నితంగా హెచ్చరించారు. సచివాలయ సిబ్బందిని విధుల పురోగతిపై ప్రశ్నించారు. మీ సేవా కేంద్రాల్లో అందిస్తున్న అన్ని సేవలు కచ్చితంగా వార్డు సచివాలయం అందించాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీదినాని, వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు వంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు, నగరంలో ప్రతి ఇంటికి యూజర్ చార్జీలు స్వైపింగ్ మిషన్ తోనే వసూలు చేయాలని, వార్డు సచివాలయ సిబ్బంది చేయాలని, వార్డు సచివాలయ వచ్చే ప్రజలకు సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శకంగా అందించాలని, నవంబర్ 6వ తేదీ జగనన్న తోడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు ,ఈ లోపల అన్నీ పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితోపాటు అదనపు కమిషన్ హరిత, సూపర్డెంట్ రవి, వెటర్నరీ డాక్టర్ రవికాంత్, ఈ ఆర్ పి వెంకటేష్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తిరుపతి నగరపాలకసంస్థ పాఠశాలల్లో కరోనా నిబంధనలు తప్పక పాటించాలని కమిషనర్ గిరీషా ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలతో సోమవారం నుండి పాఠశాలలు పునఃప్రారంభం అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం బాలాజి కాలనీలోని మాలవ్యాజి స్కూల్ ను కమిషనర్ తనిఖీ చేశారు. స్కూలుకు హాజరైన విద్యార్థులతో ముచ్చటించారు. జగనన్న విద్యాకానుక అందరికి అందిందా అని అడిగారు. అందరూ యూనిఫామ్ వేసుకుని చక్కగా స్కూల్ కు రావాలన్నారు. స్టిచింగ్ చేయించుకుంటున్నామని, కొంత మందికి షూస్ అందలేదని చెప్పారు. షూస్ సైజ్ లు ఇస్తే అందరికి తెప్పిస్తామని ఇప్పటికే చెప్పానని, వెంటనే షూస్ సైజ్లు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడ్ని ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు అందరూ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, ప్రతిరోజు థర్మల్ స్కానర్ తో పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలు అధిరోహించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యతతో అందించాలన్నారు. అలాగే నాడు-నేడు పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. గోడలకు బాగా రఫ్ చేసి, చక్కగా పెయింటింగ్స్ చేయించాలని ఆదేశించారు. మరుగుదొడ్లు, పరిసరాల్లో నిర్మాణాలు పరిశీలించి, నిర్మాణం పూర్తయిన వెంటనే శుభ్రం చేయించాలన్నారు. నాడు-నేడు పనులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ హరిత, ఉప విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు యుగంధర్, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సాధారణ వనిత వ్యక్తి కాదు..డా.తానేటి వనిత..అవును ఈమె సేవలను గుర్తిస్తూ, డేస్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ఈరోజు ప్రధానం చేసింది. మంత్రితోపాటు ఎమ్మెల్సీ రామసూర్యారావుకి సామాజిక సేవలను గుర్తిస్తూ కూడా ఆయనకు కూడా గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు లో జరిగిన కార్యక్రమంలో న్యూ జెరుసలం ఇంటర్నేషనల్ బైబిల్ ధియోలజికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శిరంపురం యూనివర్సిటీ నుండి వచ్చిన సెక్రెటరీ రెవరన్ డా. తాతపూడి మ్యాత్యుస్ ఇమ్మన్యుల్ ఈ గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మ్యాత్యూస్ మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా ప్రజలకు విశేషంగా సేవలు అందించిన వారిని గౌరవ డాక్టరేట్లతో గౌరవిస్తామని, ఈ ఏడాది వీరిని డాక్టరేట్లకు ఎంపిక చేసినట్టు చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాతూ, డేస్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ తనను గుర్తించడం ఆనందంగా వుందన్నారు. ఈ డాక్టరేట్ తనపై మరింత బాధ్యతను పెట్టిందన్నారు మంత్రి.. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు..
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి అన్యాయం జరుగుతుందని తమకి న్యాయం జరగాలి అంటూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి, ఆంధ్రరాష్ట్ర అవతరణకు కారణజన్ములు పొట్టి శ్రీరాములు అని పార్వతీపురం ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. నవంబర్ 01 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐ.టి.డి.ఎ గిరిమిత్ర సమావేశమందిరంలో ప్రాజెక్ట్ అధికారి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ సమయంలో 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు ప్రత్యేకాంధ్ర సాధన కోసం మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్ష ఆంధ్రా ప్రాంతంలో అలజడి రేపింది. 1952 డిసెంబర్ 15న 58 రోజుల అకుంఠిత దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది. ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్సభలో 1952 డిసెంబర్ 19న ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై వత్తిడి పెరిగింది. అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం 1956 జులై 19న పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో 1956 నవంబర్ 1న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే, పాలకుల నిర్లక్ష్యంతో మరోసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో మొదలైంది. ఇది క్రమంగా ఉద్ధృతమై 1969 నాటికి తీవ్రరూపం దాల్చింది. అనంతరం జరిగిన పరిణామాలతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా, 2000 తర్వాత మాత్రం ప్రజల ఆకాంక్షలను ఎవరూ నిలువరించ లేకపోయారు. రాజకీయ, ఉద్యోగ, విద్యార్థి,కార్మిక, కర్షక సంఘాలు ఉద్యమాన్ని ముందుకు నడిపించడంతో 2014లో ప్రత్యేక తెలంగాణ సాకారమైంది. దాదాపు 60 ఏళ్లపాటు కలిసున్న తెలుగువారు మరోసారి విడిపోయారు. కార్యక్రమంలో జగదీష్ మాస్టర్ దేశభక్తి గీతాలు ఆలపించారు. మన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి కుల,మతం,రాజకీయాలకు అతీతంగా పలు అభివృధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు వాటి అమలులో పాల్పంచుకోడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎ పి ఓ సురేష్ కుమార్, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్ కుమార్, డిప్యూటీ డి.ఇ.ఓ మోహన రాయుడు, ఎ.ఎం.ఓ, పి. ఎం.ఆర్. సి ఎస్.వి. జి. కృష్ణా రావు, మేనేజర్ హేమలత, ఐ.టి.డి.ఎ ఆధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
సన్న చిన్నకారు రైతులకు వచ్చే నాలుగేళ్లలో 2లక్షల బోర్లు తవ్వించటమే ఈ వైఎస్ఆర్ జలకళ ముఖ్య ఉద్దేశ్యమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వై.యస్.ఆర్. జలకళ వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైఎస్సార్ జలకళ కోసం 2,340 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఉచిత బోరు బావులను తవ్వడం ద్వారా దాదాపు 3 లక్షల మంది రైతులకు మేలు చేకూరుస్తామన్నారు. భూగర్భ జలాలు అడుగంటిన సమయంలో లేదా బోర్లు వైఫల్యం చెందిన సమయంలో తిరిగి బోరు వేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు వై.యస్.ఆర్. జలకళ ఒక వరంగా పనిచేస్తుందన్నారు. వైయస్సార్ జలకళ ద్వారా అర్హత కలిగిన రైతులందరికీ బోర్లు వేయడంతో పాటు, చిన్న, సన్నకారు రైతులకు మోటార్లు కూడా అందిస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో రైతుల ఆశలన్నీ ఫలిస్తున్నాయన్న మంత్రి.. రైతు భాందవుడు స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి కృషి ఫలితమే మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు ప్రాంతానికి సమృద్ధిగా సాగునీరు అందించగలుగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన ప్రజారంజక పాలన ద్వారా రాష్ట్రంలో నవశకానికి నాంది పలికారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. తీవ్రమైన ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ, ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో, కోవిడ్ఆ-19 నిబంధనలను పాటిస్తూ ఆదివారం ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలకు ఉపముఖ్యమంత్రి శ్రీవాణి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఉపముఖ్యమంత్రి తమ సందేశాన్ని వినిపించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు, ఇతర నాయకులకు ముందుగా నివాళులర్పించారు. రాష్ట్రం రెండుగా విడిపోయి, హైదరాబాద్ లాంటి గొప్ప రాజధానిని కోల్పోయినప్పటికీ మనం నిలదొక్కుకున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేకపోయామని విమర్శించారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కారణంగా, సగర్వంగా మళ్లీ ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ, ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ వల్ల పాలన ప్రజలకు మరింత చేరువ అయ్యిందని, ప్రభుత్వ సేవలన్నీ గ్రామస్థాయిలోనే అందుతున్నాయని చెప్పారు. ఎటువంటి సిఫార్సు లేకుండా, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతుండటం గొప్ప పరిణామమని పేర్కొన్నారు.
విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల దీనికి నిదర్శమన్నారు. నాడూ-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. రైతే దేశానికి వెన్నుముఖ అని భావించి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఉద్యోగాల నియామకం నుంచి, నామినేటెడ్ పదవుల వరకూ అన్నిట్లోనూ 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో, జిల్లాను అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు తనవంతు కృషి చేస్తానని శ్రీవాణి అన్నారు.
విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ మహనీయుడు పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం వల్ల తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన రోజున, మళ్లీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా ముఖ్యమంత్రి ఎక్కడా వెనుకాడకుండా, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారని కొనియాడారు. జిల్లా అభివృద్దిలో తనవంతు పాత్రను పోషిస్తానని చెప్పారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ సంస్కృతి, కళలు, విద్య, పరాక్రమం, శాస్త్రీయ దృక్ఫథంలో, ఇతరులకు తెలుగుజాతి ఒక దిక్సూచిలా నిలిచిందని కొనియాడారు. కరోనా లాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా అన్ని వర్గాలకూ మేలు కలిగేలా రాష్ట్రప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ నేతృత్వంలో, జిల్లా యంత్రాంగమంతా కలిసికట్టుగా కృషి, కోవిడ్ నియంత్రణలో ఆదర్శంగా నిలిచామని కిశోర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్సి పెనుమత్స సూర్యనారాయణరాజు, జిల్లా ఎస్పి బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్డిఓ బిహెచ్ భవానీశంకర్, డిపిఎం బి.పద్మావతి, డిటిఓ ఎంఎల్ఎన్ లక్ష్మీనారాయణ, ఇంకా పశు సంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, జెడ్పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్వర్మ, డిఇఓ జి.నాగమణి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, ఎస్సి కార్పొరేషన్ ఇడి ఎస్.జగన్నాధం, బిసి కార్పొరేషన్ ఇడి నాగరాణి, డిపిఆర్ఓ డి.రమేష్, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ అనురాధా పరశురామ్, కోపరేటివ్ ఆఫీసర్ ఎస్.అప్పలనాయుడు, తాశీల్దార్ ప్రభాకరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు ః
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతమూ ఆహుతులను అలరించాయి. ముందుగా మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులచే, నృత్య అధ్యాపకులురాలు హిమబిందు ఆధ్వర్యంలో గణేషుని స్థుతిస్తూ నృత్య గీత ప్రదర్శన జరిగింది. అనంతరం కళాశాల మృదంగ అధ్యాపకులు డాక్టర్ మండపాక నాగలక్ష్మి ఆధ్వర్యంలో మృదంగ తాళ వాయిద్య కచేరీ నిర్వహించారు. కార్యక్రమానికి ముందు మహారాజా సంగీత కళాశాల విద్యార్థులు మా తెలుగుతల్లికీ మల్లెపూదండ గేయాలాపన చేశారు. కళాశాల గాత్ర అధ్యాపకులు చాగంటి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో భక్తిగీతాలాపన జరిగింది. అవతరణ దినోత్సవ వేడుకలకు రామవరం జిల్లాపరిషత్ పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ః
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజధానిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్కుమార్, ఎస్పి బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్. మహేష్కుమార్, డిఆర్ఓ ఎం.గణపతిరావు పాల్గొన్నారు.
పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్థి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మహనీయుల త్యాగాల ఫలితంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. ఆదివారం నాడు స్థానిక కలెక్టరు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన నగరంలో రూ. 14000 కోట్లతో లైట్ మెట్రో ప్రాజెక్ట్ , రూ. 7000 కోట్లతో మోడ్రన్ ట్రామ్ ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పథకంలో వై.ఎస్.ఆర్.రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ, వై.ఎస్.ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని అన్నారు. అమ్మఒడి పథకంలో జిల్లాలో 5.75 లక్షల విద్యార్థుల యొక్క 3,91,822 మంది తల్లుల బ్యాంకు ఖాతాలలో రూ. 587.73 కోట్లు జమ చేశారన్నారు. వై.ఎస్.ఆర్ ఆసరా మొదటి విడతగా సెప్టెంబరు 11వ తేదీన 6,61,317 మందికి రూ. 459.43 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. పేదలందరికీ ఇల్లు అనే ప్రతిప్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో 2,53,173 మంది అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయుటకు అన్ని చర్యలు తీసుకోవడమైనదని అన్నారు. ఈ కార్యక్రమం కోసం 1439.08 ఎకరముల అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమితో పాటు 299.87 ఎకరాల అసైన్డ్ భూమిని మరియు 84.43 ఎకరాలు పట్టా భూ సేకరణ ద్వారానూ, అర్బన్ లో 4457.05 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడమైనదన్నారు. అతి త్వరలో అర్హులైన అక్కా చెల్లెమ్మలందరికీ ఇళ్ల పట్టాలు అందజేయబడతాయన్నారు. వై.ఎస్.ఆర్ ఫించన్ల పథకం క్రింద జిల్లాలోని 4,87,208 మంది పించనదార్లకు సుమారుగా రూ. 117.75 కోట్ల నిధులు ప్రతీ నెలా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వై.ఎస్.ఆర్ చేయూత మొదటి విడతగా ఆగష్టు నెలలో జిల్లాలో గల 1,86,312 మంది లబ్దిదారులకు రూ. 348.65 కోట్లు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు.
వై.ఎస్.ఆర్ నవశకం లో భాగంగా వై.ఎస్.ఆర్ మత్స్యకార భరోసా లో 20,273 మత్స్యకార కుటుంబాలకు రూ. 20.27 కోట్లు బదలాయించుట జరిగిందన్నారు. వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పథకం , వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం పథకం, వై.ఎస్.ఆర్.రైస్ కార్డు, వై.ఎస్.ఆర్ వాహన మిత్ర పధకం, వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న వసతి దీవెన, వై.ఎస్.ఆర్ కాపు నేస్తం, జగనన్న చేదోడు, జగనన్న విద్యా కానుక, జగనన్న తోడు, ఎమ్ .ఎస్.ఎమ్.ఇ-రీస్టార్ట్ ప్యాకేజి, వై.ఎస్.ఆర్ జలకళ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అటవీ హక్కు పత్రాల పంపిణి లో భాగంగా 48,053 మంది గిరిజన రైతులకు 74,479.88 ఎకరాల అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేసామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ చరిత్రను మరచిపోకుండా మహనీయుల స్పూర్తితో అందరం నడుద్దామని అన్నారు. విశాఖ నగరం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిందని అన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ , ప్రయివేటు పాఠశాలలలో తెలుగును తప్పనిసరిగా భోదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు.
జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలకు పరిపాలన చేరువ చేయడానికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసారన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంకా పార్లమెంటు సభ్యులు బి.వి.సత్యవతి, నగర పోలీస్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, రూరల్ ఎస్.పి.బి.కృష్ణారావు ప్రసంగించారు.
తొలుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి కురసాల కన్నబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసారు. తెలుగు తల్లి చిత్ర పటానికి , అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం ఆలపించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు యం.వి.వి.సత్యనారాయణ, శాసన సభ్యులు గొల్ల బాబురావు, కన్నబాబు రాజు, జి.అమర్ నాథ్, ఎ.అదీప్ రాజు, జాయింట్ కలెక్టర్లు వేణు గోపాలరెడ్డి, అరుణ్ బాబు, గోవిందరావు, జి. వి.యం.సి. కమీషనర్ జి.సృజన, వి.యం.ఆర్.డి.ఎ. కమీషనర్ కోటేశ్వరరావు, డి.ఆర్.ఒ.ఎ.ప్రసాద్, ఆర్.డి.ఒ.పి.కిషోర్ , ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జర్నలిస్టుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ప్రెస్ అకాడెమీ నిర్వహించే శిక్షణా తరగతులను ఉపయోగించుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడెమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కోరారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం, దాడితోట గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. చిత్రావతి రిజర్వాయర్, గండికోట రిజర్వాయర్ లను పరిశీలించేందుకు కడప జిల్లాలో పర్యటించిన దేవిరెడ్డి.. కడప-అనంతపురం సరిహద్దులో ఉన్న దాడితోట గ్రామంలోని తన అత్తవారింటికి విచ్చేసారు. మాజీ మంత్రి జి. నాగిరెడ్డి ఇంట పాత్రికేయులతో మాట్లాడారు..గ్రామాల నుంచి జర్నలిజం వృత్తిని ఎంచుకోవాలనుకునే యువకులకు ప్రెస్ అకాడెమీ నుంచి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. త్వరలో అనంతపురం జిల్లా జర్నలిస్టులకు ఆన్లైన్ లో శిక్షణా తరగతులను నిర్వహిస్తామన్నారు. కోవిడ్ బారిన పడ్డ జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అందువల్లే కోవిడ్ కారణంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ప్రభుత్వం అందించాలని నిర్ణయం తీసుకుందన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలంతోనే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా విజయవాడ నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి శంకర్ నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తదనంతరం ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి మంత్రి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వెన్నెపూస గోపాల్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు తెలుగు భాష మాట్లాడే వారందరూ కూడా వివిధ ప్రాంతాలలో నివాసం ఉండేవారని, తెలుగు మాట్లాడేవారు ఒక రాష్ట్రంలో ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం అవసరాన్ని గుర్తించి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు. తెలుగు మాట్లాడే వారు ఒకటిగా ఉండాలని ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు. నవంబర్ 1 వ తేదీ 1956 లో రాష్ట్రం అవతరించాక ఆంధ్ర రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడం జరిగిందన్నారు. మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, రాష్ట్ర పురోభివృద్ధి జరగకపోయినా, కొంతమంది స్వార్థ ఆలోచనల వల్ల తెలుగు భాష మాట్లాడేవారు విడిపోవాల్సి వచ్చినా నవంబర్ 1 వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అమరజీవిని స్మరించుకోవడం కోసం, ఆయన స్ఫూర్తిని మననం చేసుకోవడం కోసం, ఆయన సేవలను ఆదర్శంగా తీసుకోవడం కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఒకటిన్నర సంవత్సర కాలంగా అపూర్వ ప్రజాదరణతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజారంజకంగా పాలిస్తున్నారన్నారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను చేసుకుంటూ రాష్ట్రంలో ఏ వర్గం కూడా బాధపడకుండా, కష్టపడకుండా వారి సంతోషం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం అమలు చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని మనోధైర్యంతో తట్టుకుంటూ ప్రజల సంక్షేమమే ముఖ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు నడుస్తోందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాధించిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టి అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయరంగంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయం, ఆకాంక్ష అన్నారు. ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని గుర్తుతెచ్చుకోవాలన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా, సుభిక్షంగా, సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు భాష రెండో స్థానంలో ఉందన్నారు. దాదాపు పది కోట్ల మందికి పైగా రాష్ట్రం, దేశం, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషను మాట్లాడే వారు ఉన్నారన్నారు. ఒక రాష్ట్రమంటూ లేని కాలంలో రాష్ట్రం కోసం పరితపించి ఖచ్చితంగా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆంధ్రులంతా ఉద్యమించడం జరిగిందని, ఆ ఉద్యమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణంతో పోరాటం జరిపి మనకు రాష్ట్రాన్ని సాధించి పెట్టారన్నారు. అటువంటి మహనీయులను ఈరోజు స్మరించుకుందామన్నారు. ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రతి గ్రామంలోనూ రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున క్లినిక్స్ ఏర్పాటు, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల వద్దకు రాష్ట్రప్రభుత్వం సుపరిపాలన తీసుకువస్తోందని, భవిష్యత్తులో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అన్ని రంగాలలో అభివృద్ధిలో, సంక్షేమంలో ముందు ఉండాలన్నారు. తెలుగు ప్రజలు ఆర్థిక, సామాజిక అభివృద్ధిని రెండూ సమ్మిళితం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, సభికులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాఠశాలల విద్యా నియంత్రణ కమిటీ సిఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ పామిడి వీరాంజనేయులు, అనంతపురం మార్కెట్ యార్డు చైర్మన్ ఫయాజ్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమ0) గంగాధర్ గౌడ్, డి ఆర్ ఓ గాయత్రి దేవి, సిపిఓ ప్రేమచంద్ర, డిఎస్ ఓ రఘురామిరెడ్డి, ఆర్డీఓ గుణభూషన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు సంబంధించి ఎలాంటి బదిలీలు జరగడం లేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సచివాలయాల కార్యదర్శిలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కలెక్టర్ తెలియజేశారు. కార్యదర్శుల బదిలీలు జరుగుతున్నాయన్నది పూర్తిగా తప్పుడు సమాచారమన్న కలెక్టర్ దీన్ని ఎవరు నమ్మవద్దని అన్నారు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు రెండేళ్ల ప్రొహిబిషన్ పిరియడ్ పూర్తయ్యేవరకూ ఎలాంటి బదిలీలు జరగవన్నారు. అదే సమయంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రాష్ట్రప్రభుత్వం నుంచి రావాల్సివుంటుందన్నారు. ఇవేమీ లేకుండా కొందరు కావాలనే సోషల్ మీడియాలో సచివాలయ ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని ఈ విషయంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ ఒక్క సమాచారంతో చాలా మంది దళారులు సొమ్ముచేసుకునే అవకాశం వుందన్నారు. అలా ఎవరైనా దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని కలెక్టర్ హెచ్చరించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు యూజీ పరీక్షల డీన్ ఆచార్య డి.వి.ఆర్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏయూలో మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 24328 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 16651 మంది ఉత్తీర్ణతతో 68.44 శాతం ఉత్తీర్ణత నమోదయిందన్నారు. బి.ఏ (సిబిసిఎస్) లో 85.86, బిబిఏ(సిబిసిఎస్)లో 94.75,బిసిఏ(సిబిసిఎస్)లో 85.71, బిహెచ్ఎంసిటి(సిబిసిఎస్)లో 95.12, బిఎస్సీ(సిబిసిఎస్)లో 62.28, బికాం సిఏఎస్లో70.58, బికాం జనరల్లో 80.41 శాతం ఉత్తీర్ణతను సాధించారు. పరీక్షల ఫలితాలను ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్ధులు వారి హాల్ టిక్కెట్లు ఆధారంగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చునన్నారు. త్వరలోనే ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రొవిజినల్, ఓడి, మైగ్రేషన్ సర్టిఫికేట్లు రెడీ చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఆ తేదీలను కూడా ఏయూ వెబ్ సైట్లోనూ, మీడియా ద్వారా ప్రకటిస్తామని ఆయన వివరించారు.