ప్రజలకు నిత్యం రక్షణ కల్పించడంలోనే పోలీసులు నిమగ్నమవ్వాలని, అమరవీరుల త్యాగాలను మననం చేసుకుంటూ సేవలు అందించాలని తిరుపతి అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి పిలపునిచ్చారు. శనివారం పోలీసు అమరవీరుల స్మృతి వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు అమరవీరుల స్మృతి ముగింపు దినం వేడుకలకు హాజరైనందుకు గర్వంగా భావిస్తున్నానన్నారు. పోలీస్ విధులలో ఎన్ని కష్ట నష్టములు ఎదురైననూ వాటిని ఎదుర్కొని మిక్కిలి సంతృప్తికరమైన సేవలు అందిస్తున్న పోలీసులను,అలాగే ఈ వారం రోజుల పాటు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ యంత్రాంగం పోలీస్ అమర వీరుల వారోత్సవాలను విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసినవారిని ఎస్పీ అభినందించారు. ఈ వారం రోజులలో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, రన్ ఫర్ యూనిటీ, డిబేట్, వ్యాస రచన పోటీలు, చిత్రలేక పోటీలు విజేతలకు, “రన్ ఫర్ యూనిటీ” 2K రన్ నందు ప్రతిభ కనుబరిచిన పోలీస్ సిబ్బందికి నగదు భహుమతులను అందజేశారు.
అలాగే ఇటీవల కాలంలో తిరుపతి అర్బన్ జిల్లా యందు విధి నిర్వహణలో అకాల మరణం పొందిన పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి రావలసిన మొత్తాన్ని చెక్కుల రూపంలో జిల్లా యస్.పి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమాలలో అడ్మిన్ అడిషనల్ యస్.పి సుప్రజ మేడం, డి.యస్.పి యస్.బి గంగయ్య, సైబర్ క్రైమ్ రవి కుమార్, క్రైమ్ మురళిదర్, వెస్ట్ నరసప్ప, ఈస్ట్ మురళీకృష్ణ, ట్రాఫిక్ మల్లికార్జున, నాగసుబ్బన్న, తిరుమల రమణ కుమార్, ఏ.ఆర్ నంద కిశోర్, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.
ధైర్యంగా వుండంతోపాటు అనుకొని సంఘటనలకు మహిళలు గట్టిగా ప్రతిఘటించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. లింగపాలెం మండలం తోచిలకరాయుడుపాలెంలో అక్టొబర్ 14న హత్యకుగరైయిన విస్సంపలి అంజలి (8) కుటుంబ సభ్యులను శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం హహిళా సాధికారిత దిశగా పరుగులు తీస్తున్న దశలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరం అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా వుంటుందని, నిందితుడ్ని ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదన్నారు. గ్రామంలో ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తి వ్యవహరశైలి అందరికి తెలిసినప్పుడు ముందే అటువంటి వ్యక్తిపట్ల అప్రమత్తతగా వుండాల్సిందన్నారు. అభంశుభం తెలియని చిన్నారుల పట్ల ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయని, మరొకరు ఇటువంటి సంఘటనలకు పాల్పడనటువంటి చర్యలు వుంటాయన్నారు. ప్రతి వ్యక్తి తన కుటుంబంలో వున్న మహిళలకు ఇచ్చే గౌరవాన్ని బయటి మహిళలకు ఇచ్చేలా వారి తల్లిదండ్రులు పాఠాలు నేర్పాలన్నారు. ప్రస్తుతం కేసు ఇన్వేస్టిగేషన్ జరుగుతుందని ఫొరెన్సిక్ నివేదిక అందాల్సివుందన్నారు. హత్యఅనేది నిర్ధారించుకున్నాక 24 గంటలలో అరెస్టుచేయడం, ప్రస్తుతం ఫోక్సొచట్టాన్ని కూడా నమోదు చేయడం జరిగిందన్నారు. మహిళలు ధైర్యంగా వుంటే ఎంతటి సంఘటనలైన ఎదుర్కొగలరన్నారు. తొలుత బాధిత కుటుంబాన్ని కలిసి ధైర్యంగా వుండాలని, ప్రభుత్వం అండగా వుంటుందని హామి ఇచ్చారు. మహిళల కేసుల జాప్యంలో మేము, ప్రభుత్వం సహించదన్నారు. జిల్లా యంత్రాంగం స్త్రీ,శిశు సంక్షేమశాఖ ద్వారా పంపిన రు.25 వేల చెక్కును అమె బాధిత కుటుంబానికి అందచేశారు. ఈ పర్యటనలో కమిషన్ సభ్యురాలు డా.రాజ్యలక్ష్మి, చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఆర్.ఎలీజా, స్త్రీ,శిశుసంక్షేమ శాఖ ఇన్ఛార్జి పిడి కె.విజయ కుమారి, డిఎస్పి సునీల్, మహిళా నాయకులు జానకిరెడ్డి, పిల్లంగోళ్ళ లక్ష్మి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గోన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 2వ తేదీ నుండి డా. వై.ఎస్.ఆర్.కంటి వెలుగు మూడవ విడత కార్యక్రమము పునఃప్రారంభిస్తున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డా. జి.వి.రమణకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని అవ్వ తాతలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించి, కంటి అద్దాలు, మందులను ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమము 2020 ఫిబ్రవరి 18 నుండి మార్చి 18 వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా ఇంతవరకు వాయిదా వేయడం జరిగిందని ఆయన వివరించారు. డా. వై.ఎస్.ఆర్.కంటి వెలుగు పథకంలో 60 సంవత్సరములు నిండిన 13,729 మంది అవ్వా తాతాలకు ఆప్తాల్మిక్ అధికారులు, ఏ.ఎన్.ఎంలు మరియు ఆశా వర్కర్ల సహాయంతో పరీక్షించామని చెప్పారు. ఇందులో 4,372 మందికి కంటి అద్దాలు రాయగా 1,324 మందిని రిఫర్ చేసినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ మరియు స్వచ్చంద సంస్థల సహాయంతో ఇప్పటికి 420 మందికి ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించి, కంటి అద్దాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గంలోని బెలగాం, పలాస నియోజకవర్గం లో-మందస, బుడంబో కోలని, టెక్కలి నియోజకవర్గంలో సంతబొమ్మాళి, నౌపాడ, శ్రీకాకుళం నియోజకవర్గంలో సింగుపురం, పాలకొండ నియోజకవర్గంలో దోనుబాయి, మర్రిపాడు, ఆమదలవలస నియోజకవర్గంలో తాడివలస, నరసన్నపేట నియోజకవర్గంలో పోలాకి, గుప్పెడు పేట, రాజాం నియోజకవర్గంలో బొద్దాం, పాతపట్నం నియోజకవర్గంలో బైదలాపురం, ఎచ్చెర్ల నియోజకవర్గం లో పాతర్లపల్లి, రావాడ పి.హెచ్.సి లలో శిబిరాలు నిర్వహిస్తారు. 10 నియోజక వర్గాల పరిధిలో నిర్దేశించిన పి.హెచ్.సి లలో ప్రతీ రోజు కంటి పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో రోజుకు 20-25 మందిని మాత్రమే పరీక్ష చేయాలని నిర్ణయించామని చెప్పారు. కంటి వైద్య శిభిరంలో పి.హెచ్.సి వైద్యుడు పర్యవేక్షణలో ఆప్తాల్మిక్ ఆఫీసరు ,ఆయా పి.హెచ్.సి ల పరిధిలో ఓ ఉద్యోగి, ఆశ కార్యకర్త అందుబాటులో ఉంటారు. ఈ విధంగా 15 టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాల్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది, గ్రామ వాలంటీర్లు కంటి పరీక్షలపై విస్తృత ప్రచారం నిర్వహించి శిబిరాలకు పంపించాలని కోరారు. కార్యక్రము విజయవంతం అయ్యేందుకు స్వచ్చంద సంస్థలను భాగస్వామ్యం చేసామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వై.ఎస్.ఆర్ కంటి వెలుగు మూడవ దశలో అవ్వా తాతలకు కంటి పరీక్షలు చేసేందుకు అంతా సిద్ధం చేసామని, కోవిడ్ నిబంధనలను ఖచ్చితం గా పాటించేలా వైద్యులు,సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
కోవిడ్ పై విద్యార్ధులకు విస్తృతంగా అవగాహన కలిగించాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో గురజాడ కళాశాలలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి. మాట్లాడుతూ, నవంబరు మాసంలో పాఠశాలలు తెరుచుకునే సందర్భంగా కరోనా నేపథ్యంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసారు. విద్యార్ధులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై అవగాహన కలిగించాలని, ఇందు నిమిత్తం విద్యార్ధులకు వ్యాసరచన మరియు వ్యక్తృత్వపు పోటీలు నిర్వహించాలననారు. ఉపాధ్యాయులు ప్రతీ రోజు, విద్యార్ధుల ఆరోగ్యపరిస్థితిని తెలుకుకోవాలని, అనారోగ్య లక్షణాలున్న విద్యార్ధుల వివరాలను స్థానిక అధికారులకు మరియు పర్యవేక్షక అధికారులకు తక్షణమే తెలియచేయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యం, తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. విద్యార్ధుల సమాచారాన్ని నవంబరు 2వ తేదీ లోగా అప్ డేట్ చేయాలన్నారు. కోమార్బిడ్ విద్యార్ధులకు హాజరులో మినహాయింపు వుంటుందన్నారు. జగనన్న విద్యాకానుక కిట్స్ విద్యార్ధులందరికీ సి.ఆర్.పి.ల సహాయంతో పంపిణీ చేయాలని చెప్పారు. బయోమెట్రిక్ తప్పని సరిగా తీసుకోవాలన్నారు. విద్యాకానుక కిట్లు ప్రతీ ఒక్క విద్యార్ధికి తప్పని సరిగా అందించాలన్నారు. నాడు-నేడు పనులు పూర్తి చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం పధకానికి సంబంధించి మానిటరింగ్ కొరకు IMMS APP కొత్తగా తయారు చేయడం జరిగిందని, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు MDM APP మరియు IMMS APP రెండింటిలోను వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, ఉప విద్యాశాఖాధికారి పగడాలమ్మ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు హాజరైనారు.
గిరిజనుల అభ్యున్నతికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు దోహదం చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు అన్నారు. పలాస నియోజకవర్గం మందస మండలం తహశీల్దారు కార్యాలయంలో జరిగిన గిరిజనులకు ఆర్.ఓ.ఎఫ్.ఆప్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మక అటవీ హక్కుల భూ పంపిణీ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సాధించిందని అన్నారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు అందని లబ్దిదారులు ఉంటే వారిని గుర్తించి వారికీ కూడా పట్టాలు అందజేస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు లేని వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టాలు పంపణీకి చర్యలు చేపట్టారని చెప్పారు. ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతుందని, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి నీటి ఎద్దడి లేకుండా చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. పలాస నియోజకవర్గంలో సుమారు అన్ని గిరిజన ప్రాంతాలకు తారు రహదారులు వేయించామని, మందస మండలంలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గిరిజన సామాజిక భవన నిర్మాణానికి మూప్పై లక్షలు ఖర్చు చేసి నిర్మాణం త్వరలో చేపడతామని మంత్రి తెలిపారు. సీపి పంచాయతీ దాలసిరి జలపాతం వద్దకు రహదారి నిర్మాణానికి రెండు కోట్లు రూపాయిలు విడుదల చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి, డి.సి.ఎం.ఎస్ అధ్యక్షులు పిరియా సాయిరాజ్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, మూడు మండలాల తహశీల్దార్లు, స్దానిక నాయకులు, తదితర అధికార అనధికారులు పాల్గొన్నారు.
నవంబర్ 1, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంను సిద్ధం చేసారు. ఏర్పాట్లను శనివారం ఇంచార్జ్ కలెక్టర్ డా. జి.సి కిషోర్ కుమార్ సంయుక్త కలెక్టర్ జే.వెంకట రావు, రెవిన్యూ డివిజినల్ అధికారి గణపతి రావు ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి ఉదయం 9.30 గంటలకు తెలుగు తల్లి విగ్రహానికి పూల మాలంకరణ గావించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం వారి సందేశాన్ని అందిస్తారని తెలిపారు. కోవిడ్ నిబందనలతో కార్యక్రమాలు జరుగుతాయని, సీటింగ్ భౌతిక దూరం ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. హాల్ మొత్తం శానిటైస్ చేయించాలని సూచించారు. ఆడిటోరియం ను మామిడి తోరణాలతో పూల మాలలతో అలంకరించాలని, ఉద్యాన శాఖాధికారి కి, ప్రవేశం వద్ద రంగవల్లులు వేయాలని, టాయిలెట్ లను శుభ్రంగా ఉంచాలని, తాగు నీటిని అందుబాటులో ఉంచాలని, పారిశుధ్యం బాగుండాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. వేదిక వద్ద వేసిన కుర్చీలను పరిశీలించి కుర్చీల మధ్య దూరం ఉండాలని తెలిపారు. మంత్రి వర్యులు వచ్చేటప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. కార్యక్రమం పూర్తి అయ్యేవరకు విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం జరగకుండా చూడాలని విద్యుత్ శాఖదికారులకు ఆదేశించారు. అత్యవసర్ వైద్యం నిమితం పారా మెడికల్ సిబ్బందిని, 108 వాహనాన్ని ఏర్పాటు చేయాలనీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి ఆదేశించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం ను తనిఖీ చేసుకొని, ప్రసంగాన్ని మంత్రివర్యులకు అందించాలని సమాచార శాఖాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్, మున్సిపల్ కమీషనర్ వర్మ, పర్యాటక అధికారి లక్ష్మినరయన, విపతుల ప్రాజెక్ట్ అధీకారి పద్మావతి తదితర అధికారులు హాజరైనారు.
ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, యువతకు ఉద్యోగ ఉపాది శిక్షణలు ఇవ్వడం అభినందనీయమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. శనివారం సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు వి.విజయసాయిరెడ్డిని శ్రీనుబాబు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చాలా ట్రస్టులు, సొసైటీలకు మించిన సేవా కార్యక్రమాలు, యువతను అభివ్రుద్ధిచేసే శిక్షణలు ఒక్క ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వ శాఖలకు ధీటుగా ఈ సంస్ధ ద్వారా నిరుద్యోగ యువతకు దారిచూపే ఉపాదిని చూపిస్తున్నారన్నారు. అలాంటి ఫౌండేషన్ మరెన్నో వార్షికోత్సవాలు నిర్వహించాలని శ్రీనుబాగు కోరారు. అనంతరం రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ను గంట్ల ఘనంగా సత్కరించారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆది వారం ఘనంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు శని వారం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆది వారం ఉదయం 8.30 గంటలకు వేడుకలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటలకు నగర పాలక సంస్ధ కార్యాలయం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలాలంకరణ కార్యక్రమంతో ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పతాకావిష్కరణతోపాటు అమరజీవి చిత్రపటానికి పుష్పాంజలి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 9 గంటల నుండి 10.30 గంటల వరకు అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్సు జరుగుతుందని అనంతరం బాపూజి కళామందిర్ లో సభాకార్యక్రమం , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొంటారని ఆయన వివరించారు.
కేంద్ర విజిలెన్స్ కమిషన్(సివిసి) పిలుపు మేరకు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జరుగుతున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా శనివారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో టిటిడి ఉద్యోగులు అవినీతికి వ్యతిరేకంగా, సంస్థ పట్ల నిబద్ధత కలిగి భక్తులకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా టిటిడి విజివో మనోహర్ మాట్లాడుతూ, అప్రమత్త భారత్, సంపన్న భారత్ అనే థీమ్తో ఈ ఏడాది విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవినీతి, అధికార దుర్వినియోగం దేశ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయని, వీటిని అధిగమించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణ ఉండాలని, తద్వారా కుటుంబానికి, సమాజానికి క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సంతృప్తికరంగా తిరుమల యాత్ర పూర్తి చేసుకుని వెళ్లేందుకు ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, ట్యాక్సీ డ్రైవర్లు, హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. టిటిడి విజిలెన్స్ వింగ్ విజివో ప్రభాకర్ మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో భాగంగా టిటిడిలోని అన్ని విభాగాల సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, అవకతవకలను గుర్తించినా టోల్ఫ్రీ నంబరకు తెలియజేయాలని, అక్కడి సిబ్బంది సంబంధిత విభాగాల అధికారులను అప్రమత్తం చేస్తారని చెప్పారు. ఈ మేరకు విజిలెన్స్ విభాగం ఫోన్ నంబర్లు, ఉన్నతాధికారుల ఈ-మెయిల్ వివరాలతో కూడిన ఫ్లెక్సీలను తిరుమల, తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని వివరించారు. అక్టోబరు 31న ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2, రిసెప్షన్-1, రిసెప్షన్-2, కల్యాణకట్ట సిబ్బంది, భద్రతా సిబ్బంది,టిటిడి ఏఈవోలు సిఎ.రమాకాంత రావు, కృష్ణమూర్తి, రాజేంద్ర, ఎవిఎస్వోలు గంగరాజు, వీరబాబు, పవన్కుమార్, వెంకటరమణ, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
వాల్మీకి మహర్షి జీవితం అందరకీ ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన చరిత్ర తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్టేషన్లు మరియు స్టాంపులు శాఖామాత్యులు ధర్మాన క్రిష్ణదాస్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం శనివారం ఉదయం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ ఒక బోయవాని ఇంట జన్మించిన వాల్మీకి మహర్షిగా మారి, పవిత్ర రామాయణ గ్రంథాన్ని మనకు అందించారని తెలిపారు. ఆటన రచించిన పవిత్ర రామాయణ గ్రంథం యావత్ సమాజానికి మార్గదర్శకమన్నారు. ప్రపంచంలోని ప్రతీ వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా మార్పు చెందవచ్చని వాల్మీకి మహర్షి నిరూపించారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి బి.సిలకు పెద్దపీట వేశారని అన్నారు. తనను ఉప ముఖ్యమంత్రిగా, తమ్మినేని సీతారాంకు శాసనసభ స్పీకర్ గా నియమించిన సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. 56 బి.సి కులాలకు కార్పొరేషన్ లను నియమించి, బిసిల అభ్యున్నతికి ముఖ్యమంత్రి సంకల్పించినట్లు ఆయన వివరించారు.
శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ వాల్మీకి గొప్ప మహర్షి అని కొనియాడారు. పవిత్ర గ్రంథమైన రామాయాణాన్ని రచించారని, రామాయణం గొప్ప నీతి, నియమాలను తెలియజేస్తుందని వివరించారు. వ్యక్తి, సామాజిక నీతి, నడవడికను నేర్పిన గొప్ప కావ్యం రామాయణం అని సభాపతి ఈ సందర్భంగా గుర్తుచేసారు. భారతీయ సామాజిక ధర్మానికి రామాయణం గొప్ప ప్రాతిపదిక అని కొనియాడారు. ఎస్.సి, ఎస్.టి, బి.సిలకు ఆది గ్రంధాలలో గొప్ప మూలాలు ఉన్నాయని, శ్లోకాలకు ఆది గురువు వాల్మీకి అని చెప్పారు. ఎస్.సి, ఎస్.టి, బి.సిలు ఆది కాలం నుండి పథ నిర్దేశకులని, గొప్ప గ్రంధాలను రచించారని తెలిపారు. రామాయణం వంటి పవిత్ర గంధాన్ని రచించిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ప్రతి పల్లె, ప్రతి వీధిలో జరగాలని, ఆయన చరిత్రను ప్రజలకు తెలియజేయాలని ఆశాభావం వ్యక్తం చేసారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జీవితం నుండి ప్రతీ ఒక్కరూ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. మంచి నిర్ణయం జీవితాన్ని మార్చుతుందని, వాల్మీకి నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చివేసిందని గుర్తుచేసారు. కష్టాలు అందరికీ వస్తాయని,. సరైన సమయంలో మంచి నిర్ణయాలే కష్టాలను గట్టెక్కిస్తాయని కలెక్టర్ వివరించారు. ముందుగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, బి.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, జిల్లా బిసి సంక్షేమ అధికారి. కె.కృత్తిక, ఎస్.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు, సెట్ శ్రీ సి.ఇ.ఓ. జి.శ్రీనివాసరావు, తూర్పు కాపు, పొందర, శ్రీ శయన, కాళింగ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన మామిడి శ్రీకాంత్, రాజాపు అప్పన్న, చీపురు కృష్ణ, పేరాడ తిలక్, బిసి సంఘాల నాయకులు పి.సి.చంద్రపతి రావు, సురంగి మోహన్ రావు, బి.సి.నాయకులు పిట్ట చంద్రపతిరావు, ఎం.నారాయణరావు, అమీదుల్లా బేగ్, కె.నరసింగరావు, జి.కృష్ణ, జె.రామారావు, గజపతి రావు, ఎల్.నాగరాజు, జె.చిన్నారావు, మైలపల్లి పోలీసు, పి.రమణమూర్తి, పి.సుగుణా రెడ్డి, పద్మ, నాగమణి, వాసవి, ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.
సోమవారం నుంచి పాఠశాలలు తెరుస్తున్న ద్రుష్ట్యా అన్ని కరోనా రక్షణ చర్యలు తీసుకోవాలి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అధికారులను ఆదేశించారు. శనివారం గోపాలపట్నం ప్రభుత్వ ఉన్నత పాటశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా రెండవ దశ ప్రారంభం అయినందున ప్రతీ విద్యార్ధికి మాస్కు, సామాజిక దూరం అలవాటు చేయాలన్నారు. బడికి వచ్చే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లల గురించి తీసుకున్న జాగ్రత్తలు మీద , నివారణ చర్యలు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పాటశాల ప్రాంగణంలో జరుగుతున్న కొన్ని నిర్మాణ, రిపేర్ పనులను పర్యవేక్షించారు. పనులను సత్వరమే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం , పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది, పాల్గొన్నారు.
పుష్కరఘాట్ పనులు సత్వరమే పూర్తిచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు.శనివారం కర్నూల్ నగరంలో తుంగభద్ర పుష్కర ఘాట్ల ఏర్పాట్ల పనులను మంత్రి బుగ్గన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అనుకున్న లక్ష్యాలను సాధించాలని, ఈ విషయంలో ఇంజనీరింగ్ అధికారులు పనులు పూర్తిచేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నంద్యాల చెక్పోస్ట్ నుండి నగరంలో వేసిన R&B రోడ్ ,సంకల్ బాగ్, రాఘవేంద్ర మట్ పుష్కర ఘాట్ లలో నిర్మాణ పనులను, డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) రవి పటన్ షెట్టి, నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చోడవరం శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. శుక్రవారం స్థానిక హోటల్ లో ఏర్పాటు చేసిన వివాహానికి హాజరై వధూవరులను ఆయన ఆశీర్వాదించారు. (వధూవరులు డాక్టర్ సుమ, డాక్టర్ చిన్నంనాయుడు) ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాసు, పుష్పశ్రీవాణి, రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్లమెంటు సభ్యులు జి. మాధవి, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, భాగ్యలక్ష్మి, వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ కు విశాఖ ఎయిర్ పోర్టులో ఘనంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఘనంగా వీడ్కోలు పలికారు.
కరోనా, లాక్ డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు సేవలు మరువలేనివని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రశంసించారు. శుక్రవారం అనకాపల్లిలో మోడల్ పోలీస్ స్టేషన్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. పోలీసులు తమ కుటుంబాన్ని వదిలి రోడ్లపై డ్యూటీ లు చేశారన్నారు. వారి ప్రాణాలకు తెగించి కరోనా విపత్కర సమయంలో పోలీసులు పనిచేశారు. చాలా మంది పోలీసులు కరోనా భారిన పడి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. పోలీసులు ఎంతో నిబద్ధతతో పనిచేయడం వలనే మరణాల సంఖ్య తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. దేశములోనే మన రాష్ట్ర పోలీవులకు అత్యధిక అవార్డ్ లు వస్తున్నాయని, జాతీయ స్థాయిలో 84 అవార్డ్ ల్లో 48 అవార్డ్ లు మన రాష్ట్ర పోలీసులకు రావడం నిజంగా గర్వకారణమని పేర్కొన్నారు. పోలీస్ శాఖ నిబద్ధతతో పనిచేసి అవార్డ్ లు సాధించారని మెచ్చుకున్నారు. అధికారంలో కి వచ్చిన వెంటనే సీఎం జగన్ గారు పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని,తప్పు చేసిన వారెవరైనప్పటికీ వారిని వదిలే ప్రసక్తి లేదనని తెలిపారు. పోలీసు శాఖ పూర్తి స్వేచ్ఛగా, న్యాయ బద్దంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని, ముఖ్యమంత్రి మహిళల భద్రత కు పెద్దపీట వేశారని చెప్పారు.అందులో భాగంగా రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్ లను ప్రారంభించాము. త్వరతిగతిన కేస్ లు పరిష్కరించడం కోసం కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, దిశ యాప్, ఏపి పోలీస్ సేవ యాప్, ఇలా అనేక కొత్త అవిష్కరణలను తీసుకొచ్చామని, ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలు దాదాపు 67 రకాల సేవలను పొందవచ్చని అన్నారు. మన రాష్ట్రంలో జీరో ఎఫ్ ఐ ఆర్ తీసుకురావడం జరిగిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ హాఫ్ ను సీఎం ప్రకటించారన్నారు. కార్పొరేట్ బిల్డింగ్ లను తలదన్నేలా మోడల్ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసామని, ప్రజలు ధైర్యంగా, స్వేచ్చా వాతావరణంలో వెళ్లేలా పోలీస్ స్టేషన్ లు రూ పొందాయన్నారు. రానున్న రోజుల్లో మరింత ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ను తీసుకొస్తామన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ ను నియమించడంతో పోలీస్ వ్యవస్థలో మహిళలకు సముచిత స్థానం కల్పించిన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ బి.సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
నవంబర్ 01న నిర్వహించబోయే రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సంయుక్త కలెక్టర్ జె.వెంకటరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్డీవో భవానీ శంకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, పర్యాటక అధికారి లక్ష్మీ నారాయణ శుక్రవారం పరిశీలించారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరుపై సంబంధిత అధికారులతో చర్చించారు. తగిన సూచనలు చేశారు. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు పటిష్ఠంగా చేస్తున్నట్లు జేసీ వెంకటరావు పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం నిర్వహించేలా ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులతో సమీక్ష చేస్తున్నామని చెప్పారు. కరోనా నేపద్యంలో తగిన జాగ్రత్తలు తీసుకొని రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కార్యక్రమం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్టు జెసి వివరించారు..