ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భోగాపురం ఎయిర్ ఫోర్టు భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి పనులు వేగవంతమయ్యేలా చూడాలని జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. గురువారం సంయుక్త కలక్టరు డా. జి.సి. కిషోర్ కుమార్ తో కలిసి భోగాపురం ఎయిర్ ఫోర్టు, తోటపల్లి, తారక రామ తీర్ధసాగర్, వెంగళరాయ సాగర్ తదితర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణపై సమీక్షించారు. భోగాపురం ఎయిర్ ఫోర్టుకు సంబంధించి గత వారం రోజుల్లో చేసిన పనులపై ఉప కలక్టరు వారీగా, గ్రామం వారీగా సమీక్షించారు. పనుల్లో ఆశించిన ప్రగతి జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అవాంత రాలను అధిగమించి ఎయిర్ ఫోర్టు భూసేకరణ అత్యంత వేగంగా జరపాలని ఆదేశించారు. ఇకపై ప్రతి రెండు రోజులకు సమీక్షిస్తానని, పురోగతి చూపని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పూర్తయిన వాటికి అవార్డులు పాస్ చెయ్యాలని, తదుపరి బిల్లులను కూడా అప్ లోడ్ చెయ్యాలని ఆదేశించారు. కోర్టులలో ఉన్న కేసులు పరిష్కార మయ్యేలా వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలన్నారు. సమస్య ఉన్నచోట రైతులతో చర్చించి ప్రత్యామ్నాయాలను, పరిష్కార మార్గాలను చూపాలన్నారు. ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి సిహెచ్. భవానిశంకర్, భూసేకరణ ఉప కలక్టర్లు జయరాం, వెంకటేశ్వర్లు, బాలా త్రిపుర సుందరి, సాల్మన్ రాజ్, సంబంధిత తహశీల్ధార్లు పాల్గొన్నారు.
అసలుసిసలు గ్రామ స్వరాజ్య వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయ్యింది. జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినోత్సవం రోజు అక్టోబరు 02 న గతేడాది రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభమయ్యింది. అంతకు కొద్దిరోజులముందు ఆగస్టు 15న వాలంటీర్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిటి కే వచ్చి చేరాయి. వినూత్నంగా, ప్రయాగాత్మకంగా అమల్లోకి వచ్చిన ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. జిల్లాలో గత అక్టోబరు 2వ తేదీన 664 గ్రామ సచివాలయాలు, 114 వార్డు సచివాలయాలు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా సుమారు 500కు పైగా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల చెంతకు చేరాయి. మరిన్ని సేవలు త్వరలో అందనున్నాయి. గతంలో ఏ ప్రభుత్వ సేవ కోసమైనా మండల కేంద్రాల్లోని తాశీల్దార్ కార్యాలయాలకు, మీ- సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పడు గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేయడంతో, ప్రజలు ఊరు దాటాల్సిన పని లేకుండా పోయింది. ప్రతీ సచివాలయంలో గ్రామ కార్యదర్శి, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టీ కల్చర్ అసిస్టెంట్, ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, ఎఎన్ఎం తదితర దాదాపు 12 మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, అడంగల్ కాపీ, పుట్టిన రోజు ధృవీకరణ పత్రం తదితర ఎన్నో రకాల పత్రాలు పొలిమేర దాటకుండానే పొందే అవకాశం కలిగింది. ఇప్పుడు అన్ని సచివాలయాలకూ సొంత భవనాలు శరవేగంగా, ఆధునిక హంగులతో నిర్మితమవుతుండటం, ఈ వ్యవస్థ అమలుపట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్దికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. జిల్లాలో సచివాలయ వ్యవస్థ ఎంతో గొప్పగా పనిచేస్తోంది. సేవలను అందించడంలో రాష్ట్రంలోనే నెంబరు 1గా నిలిచింది. ఇప్పటివరకు 4,74,025 దరఖాస్తులు సచివాలయాలకు అందగా, వీటిలో 3,91,301 పరిష్కరించడం ద్వారా, 86.52శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. జిల్లాకు మొదటి ఫేజ్లో 5,432 మంది సచివాలయ సిబ్బందిని నియమించారు. తాజాగా 1,134 ఖాళీలకు ఇటీవల భర్తీ ప్రక్రియ చేపట్టగా, 45,475 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే తొలిదశలో 10,973 మంది గ్రామ వాలంటీర్లు, 2,127 మంది వార్డు వాలంటీర్లను నియమించారు. వాలంటీర్ల ఖాళీలను కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు.
వాలంటీర్లయితే గ్రామానికి తలలో నాలుకలా మారారు. గ్రామాల్లో ప్రతీ 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతీ వంద ఇళ్లకూ ఒక వాలంటర్ను నియమించారు. వీరంతా ప్రజల ఇళ్లవద్దకే వెళ్లి సేవలందిస్తున్నారు. ప్రతీనెలా ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ సేవలన్నీ నిర్ణీత కాలవ్యవధిలో ఇంటివద్దనే అందజేస్తున్నారు. గతంలో రేషన్ కార్డు కోసం ఏళ్లతరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు కేవలం ధరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అర్హులైన వారందరికీ బియ్యం కార్డులు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డును ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపించింది. వైఎస్ఆర్ బీమా కార్డు కూడా ఇంటికే వచ్చింది. తరచూ వాలంటీర్లు ఇళ్లవద్దకు వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితిని సైతం వాకబు చేస్తున్నారు. దీంతో గ్రామ సచివాలయ వ్యవస్థ సామాన్యులకు గొప్ప సంతృప్తిని ఇస్తుండగా, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని తమకిచ్చినందుకు సచివాలయ సిబ్బంది నుంచీ, వాలంటీర్ల నుంచి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పట్లా కృతజ్ఞతా భావం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బిఈడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్ 2020 ప్రవేశ పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం సెట్ కోడ్ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 నగరాలలో ఏర్పాటు చేసిన 50 పరీక్ష కేంద్రాలలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షను నిర్వహించారు. పరీక్షకు 15,658 మంది దరఖాస్తు చేయగా 10,363మంది హాజరవగా 5296 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షకు హాజరైనవారి శాతం 66.18 గా నమోదయింది. పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు కన్వీనర్ ఆచార్య ఆర్.శివ ప్రసాద్ తెలిపారు. ఉదయం నిర్వహించిన సెట్ కోడ్ ఎంపికలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి, కన్వీనర్ ఆచార్య ఆర్.శివ ప్రసాద్, ఆచార్య టి.షారోన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా మన ముందు లేనప్పటికీ ఆయన ప్రతిరూపం కళాకారుల మదిలో చిరస్మరణీయంగా ఉంటుందని.. మహో న్నత వ్యక్తి యొక్క విగ్రహాన్ని తొలిసారిగా తాను మలిచానని అంతర్జాతీయ తొలి తెలుగు మహిళా శిల్పి దేవికారాణి ఉడయార్ అన్నారు. గురువారం ఆమె ఈఎన్ఎస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.. ఇప్పటికే పలు జిల్లాల నుండి బాల సుబ్రహ్మణ్యం విగ్రహాలు తయారు చేయమని అడిగారని వారందరికీ త్వరలోనే బాలువిగ్రహాలు అత్యద్భుతంగా మలిచి అందజేస్తానని దేవికారాణి అన్నారు. బాలసుబ్రమణ్యం తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ తన తండ్రి ఉడయార్ తాను తయారు చేసిన ఘంటసాల విగ్రహాలను తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఎస్పీ బాలసుబ్రమణ్యం చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు శిష్యులకు కోరుకున్న వారికి బాల సుబ్రహ్మణ్యం యొక్క ఆరంగుళాల ప్రతిమలను తయారుచేసి అందించగలరని దేవికారాణి అన్నారు. ఇటువంటి కళాకారుడు మరల మనకు దొరకక పోవచ్చు అని ఘంటసాల తర్వాత అంతటి వైభవం సంతరించుకున్న బాలసుబ్రమణ్యం మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని దేవికారాణి ఉడయార్ తెలియజేశారు.
విశాఖ జిల్లాలో తల్లి మరణాలు జరగకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు వైద్యులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో తల్లి మరణాలపై ఆయన సమీక్షించారు. ప్రసవాలకు ముందు కాని, తరువాత కాని తల్లి మరణాలు జరగకూడదన్నారు. ఈ యేడాది ఏప్రిల్ నెల నుండి ఆగష్టు నెల వరకు ఎంత మంది మరణించారని, మరణాలకు గల కారణాలను వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక మీదట తల్లి మరణాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపారు. ముందుగానే గర్భిణీలకు కౌన్సిలింగ్ చేసి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు తెలియ జేయాలని సూచించారు. గర్భణీలకు ఏ ఇబ్బంది వచ్చినా వైద్యులను సంప్రదించే విధంగా తెలియజేయాలని చెప్పారు. ఈ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి. సూర్యనారాయణ, ఐసిడిఎస్ పి.డి. సీతామహాలక్ష్మి, కెజిహెచ్ నుండి డా. టి. నాగమణి, డా. బి. శ్రీనివాసరావు, అరుణ శుభశ్రీ, విక్టోరియా ఆసుపత్రి నుండి హేమలత దేవి, తదితరులు పాల్గొన్నారు.
విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి లో 22 లక్షలు రూపాయలతో ఏర్పాటు చేసిన ప్లాస్మా ఫెరిసిస్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ గురువా రం ఉదయం ప్రారం భించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ యంత్రం ద్వారా రక్తం నుండి ప్లాస్మా, ప్లేట్లెట్స్ సేకరించి అవసరమైన పేషెంట్స్ కు వినియోగిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. కోవిద్-19 పేషెంట్స్ చికిత్సకు అవసమైన ప్లాస్మా ఈ కేంద్రం నుండి సేకరించడం జరుగుతుందని తెలిపారు. కరోనా నుండి కోలుకున్నవారు వారి ప్లాస్మా దానం చేస్తే దానిని అత్యవసర పేషెంట్స్ కు చికిత్స చేయవచ్చు నని తెలిపారు. ప్లాస్మా దానానికి కరోనా నుండి కోలుకున్న ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానం చేసిన వారిని అబినందించారు. యంత్రo కొనుగోలుకు 22 లక్షలు, యితర పరికరాలకు 10 లక్షలు, కన్స్యూమర్ గూడ్స్ కొనుగోలుకు 10 లక్షలు కోవిద్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. జి. హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్, బ్లడ్ బ్యాంకు ఇంచార్జి డాక్టర్ శ్యామల యితర అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ తమకు తాముగా రక్తదానం చేయడంతోపాటు ఇతరులను రక్తదానం చేసేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. రక్తదానం చేయడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో రక్తం అవసరమైన వారికి కావలసిన బ్లడ్ గ్రూపు రక్తం అందుబాటులో ఉండటంవల్ల ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చన్నారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవని, పైగా కొత్తరక్తంతో మరింత ఉత్సాహంగా వ్యక్తులు రూపొందుతారని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా నగరంలోని యూత్ హాస్టల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను కలెక్టర్ అభినందించారు. జిల్లాలో మూడు అంశాలపై విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నామని రక్తదానాన్ని ప్రోత్సహించడం, నీటిని సంరక్షించడం, చెట్లను సంరక్షించడం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నట్టు పేర్కొన్నారు. రక్తదానంలో పాల్గొన్న వారికి కలెక్టర్ ప్రశంసాపత్రాలను బహూకరించారు. జిల్లాకు చెందిన నా ఊరు విజయనగరం, చేయూత ఫౌండేషన్ సొసైటీ, డబ్ల్యు.ఏ.టి.సర్వీస్ సొసైటీ తదితర నాలుగు సంస్థల ప్రతినిధులు ఈ శిబిరంలో రక్తదానం చేశారు.
అనంతరం యూత్ హాస్టల్ ఆవరణలో గతంలో నాటిన మొక్కల పరిస్థితిని పరిశీలించి వాటి సంరక్షణలో భాగంగా పాదులు కట్టే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని స్వయంగా మొక్కలకు పాదులు కట్టారు. ఈ కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ కె.ఆర్.డి.ప్రసాదరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు బి.రామకృష్ణారావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పృథ్వీ, నవీన్, మోహన్, రాము, సాయిప్రసాద్, నాగేశ్వరరావు, ఫణికుమార్, రెడ్ క్రాస్ సిబ్బంది గౌరీశంకర్, చంద్రరావు, ఎన్.ఎస్.ఎస్. డిపిఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఎలాంటి రుసుము తీసుకోకుండా వచ్చేఏడాది వరకూ రెవిన్యువల్ చేయడం పట్ల జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో ఈ సందర్భంగా శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, కరోనా సమయంలో జర్నలిస్టులపై భారం వేయకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జర్నలిస్టుల హెల్త్ కార్డులను రెవిన్యువల్ చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్.జగన్మో హనరెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్లనానిలకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా వచ్చే ఏడాది మార్చి వరకూ అన్ని నెట్వర్క్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం చేయించుకోవచ్చునన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8456 మంది జర్నలిస్టులకు ఈ హెల్త్ కార్డుల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని గంట్ల శ్రీనుబాబు ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం అక్రిడిటేషన్ల ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి కొత్త అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అనంతపురం జిల్లావ్యాప్తంగా రైతుల పంట ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేందుకు, గ్రేడింగ్ చేసేందుకు కోసం ఏర్పాటు చేస్తున్న మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ ల కోసం, అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు వెంటనే నిర్ధేశిత సమయం లోపు స్థలం గుర్తింపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ క్రాప్ బుకింగ్, క్రాఫ్ డైవర్సిఫికేషన్, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణం తదితర అంశాలపై వ్యవసాయ అధికారులు, తహసీల్దార్ లు, ఆర్డీఓ లు, సీడీపీఓలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 436 మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లను అర ఎకరా నుంచి ఒక ఎకరా స్థలంలో ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తింపు వెంటనే పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల పక్కన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లను ఏర్పాటు చేసేందుకు 15 రోజుల్లోపు స్థలం గుర్తింపు పూర్తి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అందుకనుగుణంగా 436 మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, ప్రతి రైతు భరోసా కేంద్రం స్థాయిలో రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వచేసేందుకు, గ్రౌండింగ్ చేసేందుకు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో 7 మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లను ఏర్పాటు చేసేలా రైతు భరోసా కేంద్రాల పక్కన స్థలం గుర్తించాలని, సంబంధిత ఆర్డీవోలు, తహశీల్దార్లు ఆర్ బి కేల పక్కన స్థలం ఎంత ఉంది అనేది గుర్తించాలన్నారు. వ్యవసాయ అధికారులు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ కోసం అవసరమైన స్థలం కోసం ప్రత్యేక దృష్టి సారించి తహసీల్దార్ లతో సమన్వయం చేసుకొని స్థలం గుర్తించేలా చూడాలన్నారు.
శెనగ పంట స్థానంలో ఇతర పంటల సాగు పై రైతులకు అవగాహన కల్పించాలి : జిల్లాలోని 24 మండలాలలో నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్న పప్పు శెనగ పంట సాగు స్థానంలో ఇతర పంటలైన జొన్న, పొద్దుతిరుగుడు తదితర పంటల సాగు చేసేందుకు (క్రాఫ్ డైవర్సిఫికేషన్) పంట మార్పిడి కింద రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పంట మార్పిడి కి సంబంధించి రైతులకు అర్థమయ్యే విధంగా కరపత్రాలు సిద్ధం చేసి రైతులకు పంపిణీ చేసి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని 24 మండలాల్లో పప్పు శెనగ పంటను 91,877 హెక్టార్లలో సాగు చేస్తున్నారని, పప్పు శెనగ పంటకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని, ఈ విషయాన్ని రైతులకు తెలియజేసి పప్పు శెనగ స్థానంలో ఇతర పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇతర పంటల సాగుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, మార్కెట్ ధరలు తదితర అన్ని రకాల వివరాలు రైతులకు అర్థమయ్యేలా తెలియజేసి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ అసిస్టెంట్లకు సూచించారు. అలాగే వర్షాకాలంలో పంటనష్టంకు సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని పరిశీలించిన తర్వాత నష్టం వివరాలను ప్రతిపాదించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటేనే పూర్తి స్థాయిలో పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి అందజేయాలన్నారు. అలాగే జిల్లాలో ఈ క్రాఫ్ బుకింగ్ కు సంబంధించి వెంటనే పూర్తిస్థాయిలో పంట నమోదును పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
రైతు భరోసా కేంద్రాల పరిధిలో మొక్కజొన్న, రాగి, సజ్జ పంటలను మద్దతు ధరతో సేకరించేందుకు రైతులచే రిజిస్ట్రేషన్ లు చేయించాలి : అలాగే రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న, రాగి, సజ్జ పంటలను మద్దతు ధరతో సేకరించేందుకు అక్టోబర్ 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు రైతులచే రిజిస్ట్రేషన్ లు చేయించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని, రైతు భరోసా కేంద్రాల పరిధిలో 30 శాతం పంట ఉత్పత్తులను మద్దతు ధరతో సేకరించాలన్నారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో సీఎం యాప్ ద్వారా రైతుల రిజిస్ట్రేషన్లను చేయాలని, ప్రభుత్వ నిబంధనలను ప్రతి రైతు భరోసా కేంద్రం స్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు మానవత్వంతో ప్రత్యేక దృష్టి సారించి చిన్న, సన్నకారు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. గ్రామ అగ్రికల్చర్, హార్టికల్చర్, సిరికల్చర్ అసిస్టెంట్లు రిజిస్ట్రేషన్లను సక్రమంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయమై ఎడి ఎలు, వ్యవసాయ అధికారులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు.
రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను వేగవంతం చేయాలి : జిల్లా వ్యాప్తంగా 800 రైతు భరోసా కేంద్రాలను మంజూరు చేశామని, పునాదుల స్థాయిలోనే ఉన్న ఆర్ బి కె భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 516 రైతు భరోసా కేంద్రాలు ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదని, వెంటనే వారం రోజుల్లోపు నిర్మాణాలు ప్రారంభించేలా ఏడీ ఎలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భవనాల నిర్మాణంలో సమస్యలు పరిష్కరించి ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే భవనాల నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి రోజూ పురోగతిని రిపోర్టు రూపంలో అందించాలన్నారు. 7వ తేదీ లోపు అన్ని అంగన్వాడీ భవనాలకు స్థలం గుర్తింపు పూర్తి కావాలి: జిల్లా వ్యాప్తంగా 1146 అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు సంబంధించి అక్టోబర్ 7వ తేదీ లోపు స్థలం గుర్తింపు పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే నెల 7వ తేదీ లోపు 100 శాతం స్థలం గుర్తింపు పూర్తి కావాలని సీడీపీఓ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతి రోజూ ఎన్ని అంగన్వాడీ భవనాలకు స్థలాల గుర్తింపు పూర్తయిందో వివరాలు తనకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని ఎన్ ఐసి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ( గ్రామ/ వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, ఐసిడిఎస్ పిలిచిన చిన్మయా దేవి, మార్కెటింగ్ శాఖ ఏడి నారాయణ మూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వి.ఆర్.చంద్ర మౌళి జిల్లా కు అందించిన సేవలు మరువ లేనివని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త కొని యాడారు. బుధవారం సాయంత్రం చి త్తూరు నాగయ్య కళా క్షేత్ర ము లో జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమము)గా విధులు నిర్వర్తిస్తూ నేడు పదవీ విరమణ పొందు తున్న వి.ఆర్.చంద్ర మౌళి గారి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలె క్టర్ విచ్చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ ఒక అధికారి గా ఉద్యోగంలో చేరి నప్పటి నుంచి రిటైర్ అయ్యే అంత వరకు ఒకే ప్రవర్తనతో పని చేసిన వ్యక్తి చంద్ర మౌళి అని,ఒక జాయింట్ కలెక్టర్ గా ఎప్పుడు హోదా ప్రదర్శిం చ లేదని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను ఎంతో ఓపికతో స్వీకరించడం జరిగే దని,జిల్లా లో 14 సంవత్స రాలు సేవలు అందించడం, తాను మదనపల్లె సబ్ కలె క్ట ర్ గా ఉన్న కాలంలో మరి యు కలెక్టర్ గా సంవత్సరం నకు పైగా చంద్రమౌళి తో కలసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.. పద వీ విరమణ బాధా కరమని ప్రతి ఉద్యోగికి తప్పనిసరని చెబుతా..పదవీ విరమణ అనంతరం చంద్ర మౌళి వారి కుటుంబము తో పూర్తి సమయాన్ని కేటాయించి సంతోషంగా గడ పాలని కోరుకుంటున్నామని,మీ సేవలు మరు వలేనివని తెలిపారు..
తిరుపతి మునిసిపల్ కమీ షనర్ గిరీషా మాట్లాడుతూ ఎంతటి పెద్ద కార్యక్రమాన్ని అయినా ప్రణాళికాబద్ధంగా ఎటువంటి పొరపాట్లు జరగ కుండా చేయగలిగిన వ్యక్తి చంద్రమౌళి అని.. క్రింది స్థాయి సిబ్బంది సమస్యల ను కూడా తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలిపి పరిష్కరించేవారని తెలి పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) వి. మార్కండే యులు మాట్లాడుతూ జిల్లా లో చంద్రమౌళి సమర్థ అధి కారిగా మంచి పేరు తెచ్చు కున్నారని.. ఈయన జిల్లా కు అందించిన సేవలు మరు వలేనివని తెలిపారు. విఆర్ చంద్రమౌళి మాట్లాడు తూ నా విధి నిర్వహణలో గ్రామ, మండల,జిల్లా స్థాయి లో అధికారులు సహకరము మరియు ప్రజాప్రతి నిధులు, జిల్లా లో గల స్వచ్ఛంద సం స్థల సహకారం మరువ లేని దని... జిల్లా లో 14 సంవత్స రాలు పనిచేశానని,జిల్లా లో పనిచేసే అధికారులు మంచి వారని.. ప్రింట్ అండ్ ఎల క్ట్రానిక్ మీడియా వారు కూడా బాగా సహకరించా రని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొలుత చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు వి.ఆర్. చంద్రమౌళి ని సన్మానించి సత్కరించారు.
కార్యక్రమంలో భాగంగా వి.ఆర్.చంద్రమౌళి దంపతు లను శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పురోహితుల ఆశీర్వాదాల నడుమ జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు... అనంతరం వివిధ శాఖలకు చెందిన అధి కారులు, సిబ్బంది చంద్ర మౌ ళి గారిని సత్కరించా రు. ఈ సన్మాన కార్యక్రమం లో జిల్లా జాయింట్ కలెక్టర్(అభి వృద్ధి)వి. వీరబ్రహ్మం, ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్,డి ఆర్ ఓ మురళి ,జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) బాధ్యత లు స్వీకరించనున్న రాజ శేఖర్,చిత్తూరు ఆర్డీవో రేణు కా,డ్వామా,డిఆర్డీఏ పిడి లు చంద్రశేఖర్ ,తులసి, కలెక్టరేట్ ఏవో గోపాలయ్య కలెక్టరేట్ లోని సెక్షన్ల సూప రింటెండెంట్లు, జిల్లా స్థాయి అధికారులు,ఎంపి డిఓలు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది, అల్ ఇం డియా ఎస్ సి,ఎస్.టి ఐక్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ముని స్వామి, కళా కారులు పాల్గొన్నారు..
విజయనగరం జిల్లాలో నవంబరు 2న పాఠశాలలు ప్రారంభం కానున్న దృష్ట్యా అక్టోబరు 15 కల్లా నాడు నేడు పనులు పూర్తి కావాలని జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్ ఆదేశించారు. బుధవారం మండల స్దాయి అధికారులతో ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలపై కలక్టరు కేంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాడు నేడు కింద మొదట స్లాబ్ లు లేని టాయిలెట్లకు స్లాబ్ లు వేయించాలని, రన్నింగ్ వాటర్, త్రాగునీరు, విద్యుద్దీకరణ, ప్రహారీగోడలు త్వరగా పూర్తయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి ఇ-క్రాఫింగ్, రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యాలన్నారు. గోడౌన్ లు త్వరలో ప్రారంభం కావాలన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రం దగ్గరలో ఒక ఎకరా వరకు స్ధలాన్ని గుర్తించి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు అప్పగించాలన్నారు. మండలస్ధాయి వ్యవసాయ సలహా బోర్డులను ఏర్పాటు చెయ్యాలన్నారు. ఉపాధి హామి ద్వారా చేపడుతున్న కన్వర్జన్స్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను సంయుక్త కలక్టర్లు తనిఖీచేసి నివేదికలను పంపాలన్నారు. సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ ను తప్పనిసరి చెయ్యాలన్నారు. చిరు వ్యాపారులకు అందజేసే వడ్డీ లేని రుణాలు కోసం ఉద్దేశించిన జగనన్న తోడు పధకం కోసం ఏర్పాట్లును చెయ్యాలన్నారు. వైఎస్ఆర్ బీమా పధకం లబ్ధిదారులు అందరికీ జన్ధన్ ఖాతాలను తెరవాలన్నారు. కోవిడ్ నియంత్రణపై మాస్కే కవచం అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 104 కాల్ సెంటర్ నెంబర్లను, కోవిడ్ ఆసుపత్రుల, నోడల్ అధికారుల వివరాలను ప్రదర్శించాలన్నారు. అక్టోబరు 5న విద్యా కానుక ప్రారంభం కానున్నదని, ఈ పధకం కింద విద్యార్దులకు యానిఫారాలు, బూట్లు, సాక్సులు, స్కూల్ బేగ్, టెక్ట్ పుస్తకాలు తదితర సామగ్రి పంపిణీ చేయుటకు ఎంఇఓలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సంప్రదించి మండల కేంద్రాలలో పధకాన్ని ప్రారంభించాలని సూచించారు. అక్టోబరు 2న గాంధి జయంతి సందర్భంగా మనం-మన పరిశుభ్రత కార్యక్రమాలు ప్రజా ప్రతినిధులతో ఘనంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా అక్టోబరు 2 గాంధి జయంతి సందర్భంగా గిరిజనులకు పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉండాలన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం 1వ తేదీన మొదటి గంటలోపే పూర్తిచేసి ఎప్పటిలాగే రాష్ట్రంలో మొదటి స్ధానంలో ఉండాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలక్టర్లు ఆర్. మహేశ్ కుమార్, జె. వెంకటరావు, జిల్లా పంచాయతీ అధికారి కె. సునీల్ రాజ్ కుమార్, డిఆర్డిఎ పిడి కె. సుబ్బారావు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఇ పప్పు రవి, జిల్లా విద్యా శాఖాధికారి జి. నాగమణి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని గిరిజన రైతులకు భూములు మంజూరు చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి కార్యక్రమం చేపట్టారని గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ కాంతిలాల్ దండే, డైరెక్టర్ రజిత్ భాషా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలననుసరించి. గిరిజన రైతులకు ఆర్.ఓ.ఎఫ్ ఆర్ పట్టాలు అందించేందుకు సిద్ధం కావాలన్నారు, అసలు భూమి లేని గిరిజన రైతులను గుర్తించి వారికి ముందు ఆర్. ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు అందించేందుకు సిద్ధం కావాలి అన్నారు. విజయనగరం జిల్లాలో ఏజెన్సీ గ్రామాల్లో భూములు పంచేందుకు మొత్తం సిద్దం చేసినట్టు పీఓ కాంతిలాల్ దండే కి వివరించారు. ఈమేరకు స్వయంగా పరిశీలన కూడా చేసినట్టు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఐ.టి.డి.ఏ, ప్రాజెక్టు అధికారి అర్ కూర్మనాథ్, పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) లో జాతీయ స్ధాయిలో 17వ ర్యాంకు సాధించిన గుమ్మడి వెంకట కె హిమజా శ్రావణికి జిల్లా కలక్టరుడా. ఎం. హరి జవహర్ లాల్ అభినందనలు తెలిపారు. వేపాడ మండలం వేపాడ గ్రామానికి చెందిన శ్రావణి తండ్రి గుమ్మడి శ్రీను, తల్లి కృష్ణవేణితో కలిసి బుధవారం కలక్టరు ఛాంబరులో కలక్టరును కలిసారు. కలక్టరు హరి జవహర్ లాల్ స్పందిస్తూ ప్రతిభకు పేదరికం అడ్డం కాదని, గ్రామీణ ప్రాంతంలో జన్మించి మంచి ర్యాంకు సాధించడం గొప్ప విషయమన్నారు. చిరుద్యోగులైన వారి తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేసి తన గురువులకు, మంచిపేరు తీసుకువచ్చిందని శ్రావణి భవిష్యత్తులో మరింత ఉత్తమ స్ధాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతిభ ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వారిలో ఉత్సాహం పెరిగి వారి సమర్ధతను చాటగలరని చూపిన శ్రావణి అభినందనీయరాలన్నారు. ఎంతోమంది బాలికలకు స్పూర్తిగా నిలిచిందని అభినందిస్తూ శ్రావణి, తన తల్లిదండ్రులకు పుష్ప గుచ్చాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఫీవర్ సర్వే సక్రమంగా నిర్వహించని ముగ్గురు వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు బుధ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ భామిని మండలం బురజోల గ్రామంలో ఫీవర్ సర్వే సక్రమంగా నిర్వహించకుండా ముగ్గురు వాలంటీర్లు విధుల పట్ల నిర్లక్ష్యధోరణి ప్రదర్శించారన్నారు. ముగ్గురు వాలంటీర్లు – కలిశెట్టి సుస్మిత, కలిశెట్టి జయరాజు, కొవ్వాడ శ్రావణిలను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రామ సర్వేలియన్సు అధికారిగా విధులపట్ల అలక్ష్యం వహించిన వెలుగు సిసి వెంకట రావు, కంటైన్మెంటు జోన్ సక్రమంగా నిర్వహించనందుకు గ్రామ రెవిన్యూ అధికారి పి.సంజీవరావుకు మెమోలు జారీ చేసామని ఆయన తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఇంటింటి ఫీవర్ సర్వే అత్యంత ప్రధానమైనదని ఆయన పేర్కొంటూ అటువంటి విధులను నిర్లక్ష్యం చేసే వారిని ఉపేక్షిచేది లేదని స్పష్టం చేసారు. ప్రజారోగ్యం రీత్యా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాల్సిందేనని ఆయన అన్నారు.
విశాఖలోని పరపాలనా రాజధానికి రాష్ట్ర కార్యాలయాల తరలింపు ముహూర్తం సమాచార పౌరసంబంధాల శాఖతోనే జరిగేట్టు కనిపిస్తుంది. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయాన్ని విశాఖ తరలించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు సమాచారం. అందులో భాగంగానే విశాఖలోని డిప్యూటీ డైరెక్టర్ కి బదిలీచేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈయనకు బదిలీ జరగడం, రాష్ట్ర కార్యాలయం విశాఖ రావడం ఒకేసారి జరిగితే, విశాఖ సమాచారశాఖ కమిషనరేట్ ఏర్పాటవుతుందిని తెలుస్తుంది. అపుడు మరిన్ని పోస్టులు ఇక్కడ పెరిగే అవకాశం కూడా వుంటుంది. అసలే విశాఖజిల్లా సమాచారశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది.. రాష్ట్రప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా దాన్ని రాష్ట్ర సమాచారశాఖ ద్వారానే ప్రజలు మీడియా ద్వారా తెలియజేస్తుంది. అలా జరగాలంటే ముందు సమాచారశాఖ కార్యాలయాలన్ని విశాఖ తరలిస్తే...అక్కడ పూర్తిస్థాయిలో కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభించడానికి అవకాశం వుంటుందని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారట. దానికోసం విశాఖజిల్లాలోని సమాచారశాఖలో బదిలీల ప్రక్రియను పక్కనపెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ లోగానే అక్రిడిటేషన్ ప్రక్రియ పూర్తిచేయడానికి కూడా సమాచారశాఖ ఆగమేఘాలపై నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 2017 తరువాత సమాచారశాఖ పూర్తిస్థాయి అక్రిడిటేషన్లు జర్నలిస్టులకు ఇవ్వలేదు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అక్రిడిటేషన్ లు ఎక్స్ టెన్షన్ల చేస్తూ సంవత్సరాలు సంవత్సరాలు పొడిగిస్తూ వస్తారు. అదే సమయంలో దేశరాజధాని ఢిల్లీలోని పీఐబీలో కూడా లేని నిబంధనలన్నీ ఏపీలో అక్రిడిటేషన్లకు పెట్టడం కూడా గమనార్హం. ఈ క్రమంలోనే రాష్ట్ర కార్యాలయం తరలింపు ప్రక్రియ చర్చనీయాంశం అవుతోంది..